5, మే 2020, మంగళవారం

తెలుగు మద్యం కధ


అనగనగా, ఒకప్పుడు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రాంతంగాను, ఇప్పటి తెలంగాణా హైదరాబాదు స్టేట్ గాను వున్నప్పుడు ఆంధ్రలో టోటల్ ప్రొహిబిషన్. అంటే సంపూర్ణ మద్యనిషేధం. హైదరాబాదు స్టేట్ లో ఎప్పుడూ ఈ మాట వినబడలేదు. 1956 లో ఈ రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డ చాలా కాలం వరకు ఈ ఒక్క నిబంధన మాత్రం చెక్కు చెదరకుండా ఆయా ప్రాంతాల్లో అమల్లో వుండేది. అంటే ఒకే రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో రెండు రకాల ఎక్సైజ్ విధానాలు. ఆంధ్రాలో మద్యం షాపులు ఉండేవి కావు. కాపు సారా కాసే వారిని పట్టుకోవడానికి ఎక్సైజ్ సిబ్బంది వుండేవారు. మా ఊరు రెండు ప్రాంతాల సరిహద్దు రేఖపై వుండేది. ఆంధ్రాలో ఆ రోజుల్లో ఓ జోకు చెప్పుకునేవారు. మందుబాబులు ఊరి పొలిమేర దగ్గర నిలబడి మందు కొడుతూ, ఎక్సైజ్ కనిస్టీబు కనిపించగానే ఒక గెంతు గెంతి గెట్టు దాటి తెలంగాణా ప్రాంతంలోకి దూకి ఇప్పుడు పట్టుకో చూద్దాం అని అతడ్ని ఆటలు పట్టించేవారట.
మేము స్కూల్లో చదువుకునే రోజుల్లో ఖమ్మం మొత్తానికి ఒకే ఒక వైన్ షాపు వుండేది. (వైన్ అంటే ఏమిటో అక్కడే ఎందుకు అమ్ముతారో మాకు తెలవదు) మందు కొనేవాళ్ళు భుజాన కండువా నెత్తి మీద కప్పుకుని, మొహం గుర్తుపట్టకుండా ఆ దుకాణానికి వెళ్ళేవాళ్ళు. మందుబాబులు అంటే సమాజంలో చాలా చిన్న చూపు వుండేది.
తర్వాత రోజుల్లో ఆంధ్రప్రాంతంలో కూడా ప్రొహిబిషన్ ఎత్తేశారు. ఆ విధంగా సమసమాజ నిర్మాణం జరిగింది.
ఇప్పుడు చిత్రంగా కరోనా లాక్ డౌన్ పీరియడ్ లో ఆంధ్రాలో కొన్ని చోట్ల వైన్ షాపులు తెరిచారు. తెలంగాణాలో మాత్రం మందు విక్రయాలు జరగడం లేదు.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మందు బాబులకు మద్యం కావాలి. ప్రభుత్వాలకు ఆదాయం కావాలి. ఇద్దరికీ లాక్ డౌన్ లో ఊపిరి సలపలేదు. సంపూర్ణ మద్య నిషేధం సాధ్యం కాదు.