27, మే 2020, బుధవారం

దిండు కింద మూట – భండారు శ్రీనివాసరావు


చాలా చిన్నతనం. బామ్మ దిండు కింద ఓ రోజు చిన్న మూట కనబడింది. అందులో ఏముంది?
తెలుసుకోవాలని ఆత్రుత.
ఒకరోజు ఆమెనే  అడిగేశాను ‘ఈ ముల్లెలో ఏముంది బామ్మా’ అని.
‘దానిమీదపడ్డాయి ఏమిట్రానీ కళ్ళు. అందులో ఏముందిరా అప్పుడప్పుడూ పోగేసుకున్న నాలుగు రాళ్ళుతప్ప’
‘రాళ్ళా! రాళ్ళను దిండు కింద ఎందుకు  పెట్టుకున్నట్టు’
నా మనసులో మాట కనుక్కున్నట్టు౦ది.
‘రాళ్లంటే గులక రాళ్ళు కాదురా సన్యాసీ. డబ్బులు’
‘డబ్బులా నీకెందుకు? సినిమాకు పోతావా షికార్లు పోతావా. చాక్లెట్లు బిస్కెట్లు నీకక్కరలేదు కదా!’
‘ఇవి  వాటికి కాదు లేరా! కాటికి పోవడానికి’
‘కాటికా! అంటే ఏదైనా గుడా”
‘గుడిలాంటిదే. చివరికి ఎవరైనా ఆ గుడికి వెళ్ళాల్సిందే’
‘గుడికి ఇన్ని డబ్బులెందుకే’
‘నీకెలాచెబితే అర్ధం అవుతుందిరా ఈ వయసులో. కాటికి పోవడం అంటే చనిపోయిన తర్వాత తీసుకువెళ్ళే చోటు. బతికుండగా మనం ఎవరినైనా అడిగితే డబ్బులు ఇస్తారు, వాళ్ళ దగ్గర వుంటే. అదే ఇంట్లో ఎవరైనా  చనిపోయిన తర్వాత అడిగితే, వాళ్ళ దగ్గర  వున్నా ఇవ్వరు.  దహన సంస్కారాలకు ఎవ్వరూ డబ్బు సర్దరు. అలా చేస్తే కీడు అని నమ్మకం. అందుకని ముందుగానే  ఈ ముల్లెలో ఆ డబ్బులు దాచుకున్నాను’
బామ్మ మాటలు అప్పుడు అర్ధం కాలేదు.
ఇప్పుడు అర్ధం అయింది. కానీ బామ్మ ఆరోజుల్లో  ముల్లెలో దాచుకున్న డబ్బులు ఈరోజుల్లో ఆ కార్యక్రమాలకు ఏ మూలకూ సరిపోవు అని కూడా అర్ధం అయింది.
ఇప్పుడు పుట్టినా, గిట్టినా అన్నీ లక్షల్లోనే.

4 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీ బామ్మగారు తీసుకున్న జాగ్రత్త అందరూ తీసుకోవడం మంచి పనే ... వెసులుబాటు ఉన్నంత వరకు. అఫ్-కోర్స్ మీరన్నట్లు ఇప్పుడు పుట్టినా, గిట్టినా ఖర్చు లక్షల్లోనే. (మొన్నామధ్య మా స్నేహితుడి తల్లిగారి అంత్యక్రియలకు 50 వేలు అయ్యింది ..... అది మొదటిరోజు కార్యక్రమానికి మాత్రమే). అలనాటి “ఆకలిరాజ్యం” సినిమాలో ఒక పాటలో “స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్” అంటాడు కమల్ హాసన్.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఇవాళ (మే 27) జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి. అంతటి స్వాతంత్ర్యోద్యమ ప్రముఖుడు, స్వతంత్ర భారతదేశ మొదటి ప్రధాని అయిన నెహ్రూ గారిని ఈ సందర్భంగా తలుచుకుంటూ సీనియర్ పాత్రికేయులైన మీరు మీ బ్లాగులో ఒక టపా పెడతారని ఆశించానే.

sarma చెప్పారు...

Every elder should earmark at least 4 lacks for their last rites of the man and his wife. That also should be kept handy

శ్యామలీయం చెప్పారు...

రోజులు మారాయి. ఇంకా మారుతున్నాయి. అనివార్యం ఐన మరణం అశుభంగా ప్రజభావించటం నాకు ఎప్పుడూ చిత్రంగా అనిపిస్తుంది. ఆగమనం శుభం అనుకుంటారు కాబట్టి నిర్గమనం అశుభం అనుకుంటున్నారు కాబోలు విపర్యంంగా. నిజానికి ఈ రెండున్నూ కేవలం భావనలే తప్ప సృష్టిలో సహజమైన సంగతులు. ఐతే రాను రాను రెండూ చాలా ఖరీదైన వ్యవహారాలు ఐపోతున్నాయి. ముఖ్యంగా నిర్గమనం తరువాత జరిగేది అంతా ఒక పెద్ద తంతులాగా అనిపిస్తున్నది. తంతో కాదో కాని దుఃఖం పొందుతున్న వారి నెత్తిన ఆ ఘటన ఒక పిడుగులాగా అవుతున్నది - ఇల్లు గుల్లయ్యేంత ఖర్చు కారణంగా. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది నేను జనజీవనస్రవంతి అంటారే ఈ లౌకిక జీవనం, దానినుండి దూరగా బహుదూరంగా వెళ్ళిపోయి అలా ప్రకృతిలో మెల్లగా సహజంగా కలిసిపోతే బాగుంటుంది కాదా ఈ అనవసరపు ఆర్భాటాలూ తంతులూ ఖర్చులూ దుఃఖాలూ అన్ని ప్రప్రంచానికి తప్పించవచ్చును అని.