7, సెప్టెంబర్ 2019, శనివారం

శాస్త్రీయ ప్రయోగాలకు జయాలే కాని అపజయాలు వుండవు – భండారు శ్రీనివాసరావు


ప్రధాన మంత్రి మోడీ అన్నట్టు ‘ఇది అధైర్య పడే సమయం కాదు’.
చంద్రయాన్ – 2 ప్రయోగం తుట్టతుది ఘడియలో తలెత్తిన లోపం అపజయం ఎంతమాత్రం కాదు, అంతరాయం మాత్రమే.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆయా ప్రభుత్వాలు అందిస్తున్న సహాయ సహకారాలు, అడ్డంకులు ఎదురయినప్పుడు భుజం తట్టి నేనున్నాను అని ఇస్తున్న భరోసాలు అణు పరీక్షల విషయంలో, అంతరిక్ష పరిశోధనల విషయంలో భారత శాత్రవేత్తలు సాగిస్తున్న మొక్కవోని కృషికి ఎంతగానో తోడ్పడుతున్నాయన్నది నిర్వివాదాంశం. ఈ తెల్లవారుఝామున ప్రయోగాన్ని వీక్షించడానికి స్వయంగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలకు మరోమారు ఇచ్చిన భరోసా ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.
ఈ నేపధ్యంలో ఇలాంటిదే ఓ పాత జ్ఞాపకం.    
1987, మార్చి నెల  
ASLV-1 ప్రయోగానికి శ్రీహరికోటలో సర్వం సిద్ధం అయింది. 31 గంటల కౌంట్ డౌన్ కూడా పూర్తయింది. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధి, గవర్నర్ కుముద్ బెన్ జోషి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఇస్రో చైర్మన్ డాక్టర్ యు.ఆర్.రావు  రెండతస్తుల మిషన్ కంట్రోల్ రూమ్ టెర్రేస్ మీద నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించడానికి ఆసీనులయివున్నారు. భారత దేశానికి గర్వకారణం కాగల ఈ ప్రయోగాన్ని కళ్ళారా చూడడానికి సుమారు పదివేలమంది ప్రేక్షకుల గేలరీలో వేచి వున్నారు.  
అనుకున్న సమయానికి రాకెట్ ప్రయోగించారు. నిప్పులు చిమ్ముతూ రాకెట్ గగనంలోకి దూసుకుపోయింది. రాకెట్ పైకి లేస్తుండగానే వారందరూ ఒకరికొకరు అభివాదాలు తెలుపుకుంటూ, కరచాలనాలు చేసుకుంటూ ఉద్విగ్నంగా వున్నసమయంలో జరగరానిది జరిగిపోయింది. ప్రయోగించి నిమిషం కూడా గడవకముందే రాకెట్ బంగాళాఖాతంలో కూలిపోయింది. ఒక్క లిప్తపాటు భయంకర నిశ్శబ్దం. అందరి మొహాల్లో ఆనందం తప్పుకుంది. విషాదం అలముకుంది.
రాజీవ్ గాంధి అందరికంటే ముందు తేరుకున్నారు. ఇస్రో అధికారులను, సిబ్బందిని అనునయించారు. ఇటువంటి శాస్త్రీయ ప్రయోగాలలో విజయాలే తప్ప, అపజయాలు ఉండవన్నారు. ముందుకు దూసుకుపోవడానికి ఇదొక అవకాశంగా భావించాలని ధైర్యం చెప్పారు.
అలా పోగుపడిన ధైర్యమే ఈనాడు ఇస్రో బృందాన్ని అనేక ప్రపంచ రికార్డులు  సొంతం చేసుకునేలా చేసింది.
అక్షరాలా నూట నాలుగు ఉపగ్రహాలను ఏక కాలంలో అంతరిక్షంలోకి పంపేలా చేయగలిగింది.
నిజమే. అంతకు ముందు తెలియని విషయాలను కనుగొనేముందు ఎన్ని అపజయాలు ఎదురయినా శాస్త్రవేత్తలు  వెనక్కి తగ్గక పోవడం వల్లనే ఈనాడు ప్రపంచానికి ఇన్ని శాస్త్రీయ పరిశోధనల ఫలితాలు అందుతున్నాయి. మొదటి వైఫల్యానికే చతికిల పడివుంటే ఇప్పుడూ అక్కడే వుండేవాళ్ళం.  (07-09-2019)



2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీడియా అతి చేయకుండా ఉంటే బాగుండేది. అసలు ఈ ఉపగ్రహాలకు పెట్టిన ఖర్చు , రాబడి , ఉపయోగం, అన్ని వివరాలు స్వేతపత్రం ఇవ్వాలి. మనం ప్రయోగించిన ఉపగ్రహాలు నిజంగా ఉపయోగపడుతున్నాయా అనేది నాకు అనుమానమే.

అజ్ఞాత చెప్పారు...

అనుమానప్పక్షులు అన్ని చోట్లా ఉంటారు. ఉపయోగపడటం అన్న విషయం గురించి సరైన అవగాహన కూడా లేని జనం కూడా ఉంటారు. ఏంఈ తెలియకపోయినా అన్నీ తెలిసినట్లు మాట్లాడే మూర్ఖశిఖామణులూ కొల్లలు. ఐనా నోరుందని ఏదో ఏదో మాట్లాడటమే అందరూను.

శాస్త్ర ప్రయోగాలను లాభనష్టాల దృష్టిలో చూసే దరిద్రులను తిట్టటం కూడా దండగే. వాళ్ళంతే. అన్ని ప్రయోగాలకూ లక్ష్యం శాస్త్రీయావగాహనలలు పెంపొందించటం మాత్రమే. తదనంతర పరిణామాల వలన వచ్చే ప్రయోజనం ప్రజలకు కొత్తకొత్త ఆవిష్కరణల రూపంలో చేరుతుంది. కొన్ని ప్రయోగాల ఫలితంగా ఆలోచనల, ప్రయోగాల దిశమారవచ్చును. అంతే కాని ప్రతి ప్రయోగమూ జనానికి తక్షణ ప్రయోజనకారి కాకపోతే శాస్త్రజ్ఞులను బలివ్వాలన్నట్లు మాట్లాడే మూర్ఖులకు ఎవరూ జవాబు చెప్పనవసరం లేదు.

ఇకపోతే మీడియా అతి చేయకూడదన్నది నిజమే. రాజకీయనాయకులు చేసే అతి కూడా అద్భుతం.

శాస్త్రీయప్రయోగాలకు అపజయాలు కొల్లలుగా ఉంటాయి. కాని వాటినుండి శాస్త్రజ్ఞులు పాఠాలు నేర్చుకుంటారు కాబట్టి అవి నిరుపయోగం కాలేదని అందరూ భావిస్తారు - మూర్ఖులు తప్ప. ఎలక్త్రిక్ బల్బ్ కనిపెట్టటానికి అనేకవేల ప్రయోగాలు జరిగాయి కాని తొలిప్రయత్నంలోనే విజయం అందలేదు మరి. మన విమర్శకుల్లాంటి వాళ్ళను పట్టించుకుంటే ఏదన్నా అంతేసంగతులు!