20, జులై 2019, శనివారం

దినపత్రిక బతుకు అర్ధగంట- గోరాశాస్త్రి చమత్కారం

దినపత్రిక బతుకు అర్ధగంట- గోరాశాస్త్రి చమత్కారం – భండారు శ్రీనివాసరావు
(గోరాశాస్త్రి గారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నేడు ఆంధ్రభూమి పత్రికలో ప్రచురితం సమాచార సేకరణలో ఉపకరించిన ఎన్. ఇన్నయ్యగారికి కృతజ్ఞతలు)

ఖాసా సుబ్బారావు గారు. పేరొందిన పాత్రికేయుడు. జగమెరిగిన జర్న్నలిస్ట్.

గోరాశాస్త్రిగారి గురించి మొదలు పెట్టి ముందుగా ఖాసా గారి ప్రసక్తి
ఎత్తుకోవడం ఎందుకంటే, తెలుగువారం అందరం గర్వించే ప్రసిద్ధ పాత్రికేయుడు
గోరాశాస్త్రి గారు జర్నలిజం రంగంలోకి రావడానికి ఖాసా సుబ్బారావుగారే
ప్రధాన కారణం. అంతవరకూ గోవిందు రామశాస్త్రిగా రైల్వేలో బుద్ధిగా ఉద్యోగం
చేసుకుంటున్న ఆ పెద్దమనిషిని పిలిచి మరీ స్వతంత్ర (ఇంగ్లీష్) పత్రికలో
ఉద్యోగం ఇచ్చారు. జర్నలిజం అంటే ఏమిటి, పత్రికలంటే ఏమిటి ఇవేవీ
రామశాస్త్రి గారికి అంతవరకు ఏమీ తెలియదు. అయినా ధైర్యంగా చేస్తున్న
ఉద్యోగాన్ని వదిలిపెట్టి మద్రాసు చేరారు. చేరి ఖాసా సుబ్బారావు గారు
ఎంతో నమ్మకం పెట్టుకుని తనకు అప్పగించిన పాత్రికేయ కొలువులో చేరిపోయారు.
అంతే వెనుతిరిగి చూసుకోలేదు. వృత్తికి ప్రవృత్తి తోడయింది. కలంలోని బలం
అర్ధమయ్యాక గోవిందు రామ శాస్త్రి గారు గోరాశాస్త్రిగా మారిపోయారు. అదే
పేరుతొ జర్నలిజంలో కొత్త శిఖరాలకు ఎగబ్రాకారు. స్వతంత్ర మేగజైన్ ఎడిటర్
గా ఎంతో మంది వర్ధమాన రచయితలను ప్రోత్సహించారు. అలా ఆయన వెన్నుతట్టి
పెన్ను పట్టించిన వారిలో అనేకమంది తదనంతరకాలంలో సుప్రసిద్ధ రచయితలుగా,
పత్రికారచయితలుగా రూపొందారు. ఆంధ్రభూమి ఎడిటర్ గా చేరినప్పటి నుంచి
ఆయనలోని ప్రజ్ఞాపాటవాలు మరింతగా వెలుగు చూశాయి. కేవలం సంపాదకీయం చదవడం
కోసమే పత్రిక కొనే సంప్రదాయం గోరాశాస్త్రి గారితో మొదలయ్యిందంటే
అతిశయోక్తి కాబోదు.

పత్రికా రచయిత, సంపాదకుడు అనేవి ఆయనలో ఒక కోణం మాత్రమే. శ్రవ్య మాధ్యమం
రేడియోకి నాటకం ఎలా రాయాలి అనే విషయాన్ని ఆయన కాచి వడబోశారు. ఆ చేత్తోనే
మరెన్నో అపురూప రచనలు చేస్తూ నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సారస్వత
మాగాణాన్ని పండించారు.

జర్నలిజానికి సంబంధించిన ఓనమాలు తెలియకుండానే ఆ రంగంలో ప్రవేశించి, తనంటే
ఏమిటో నిరూపించుకుని తెలుగు పత్రికలను గురించి తయారుచేసిన పరిశోధనా పత్రం
సమర్పించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. తెలుగులో
పత్రికా రచయితలు కావాలనే అభిలాష కలిగిన వారికోసం సుబోధకమైన శైలిలో అనేక
పుస్తకాలు రాశారు.

అనువదించడం ఎలా? మీరూ జర్నలిస్ట్ కావచ్చు అనే శీర్షికలతో రాసిన వారి
రచనలు విశేష ప్రాచుర్యం పొందాయి.

గోరా శాస్త్రి గారు పుట్టింది ఇప్పుడు ఒడిషా అని పిలుచుకుంటున్న ఒకప్పటి
ఒరిస్సాలో. కోరాపుట్ జిల్లాలోని తోరామాల్ గ్రామంలో 1919 అక్టోబర్ మూడో
తేదీన జన్మించారు. చదివింది బియ్యే వరకే. మంచి ఉద్యోగం అని ఎదురు
చూడకుండా ఎదురొచ్చిన ప్రతి చిన్నా చితాకా ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళారు. ఆ
అనుభవాలు అన్నీ ఒక పత్రికా రచయితగా, ఒక సాహిత్యకారుడిగా ఆయనకు
ఉపయోగపడ్డాయి కూడా. ఖుర్దా రోడ్ స్టేషన్ లో రైల్వే గుమాస్తాగా చేస్తున్న
రోజుల్లో ఉబుసుపోకకు ఆంద్ర, ఆంగ్ల భాషల్లో రచనలు చేయడం మొదలు పెట్టారు.
వాటిల్లో అనేకం ఆనందవాణి, ‘కథానిక’ ఆంధ్రపత్రిక, దీపిక, నవశక్తి,
శ్రమజీవి మొదలయిన పత్రికలలో ప్రచురణకు నోచుకునేవి.

ఆనందవాణి సంపాదకులు ఉప్పులూరి కాళిదాసు గారు వాటిని చదివి కుర్ర శాస్త్రి
గారిలోని రచనా శైలికి ముగ్ధులై ఆయన గురించి ఖాసా సుబ్బారావు గారికి
ఎరుకపరిచారు. శాస్త్రి గారి ఆంగ్ల రచనలు సుబ్బారావు గారికి బాగా నచ్చాయి.
ఆయన తెలిగ్రము ఇచ్చి శాస్త్రి గారిని పిలిపించుకుని స్వతంత్ర పత్రికలో
ఉద్యోగం ఇచ్చారు.

ఆంగ్ల స్వతంత్ర కు తోడుగా ప్రారంభించిన తెలుగు స్వతంత్ర పత్రికలో
శాస్త్రి గారు మొదలు పెట్టిన ‘వినాయకుడి వీణ’ శీర్షిక తెలుగు
పత్రికాలోకంలో ఒక సంచలనంగా మారింది. శాస్త్రి గారికి విశేషమైన పేరు
ప్రఖ్యాతులు కట్టబెట్టింది.స్వతంత్ర పత్రిక మూతపడిన తర్వాత శాస్త్రి గారి
మకాము హైదరబడుకుకు మారింది. ఆంధ్రప్రభలో ప్రత్యేక ప్రతినిధిగా కొంతకాలం
పనిచేసిన పిమ్మట ఆంద్ర భూమి సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించారు.
అప్పటినుంచి మరణించేవరకు అదే బాధ్యత త్రికరణ శుద్ధిగా నిర్వర్తించారు.

ప్రముఖ హేతువాది ఎన్.ఇన్నయ్య ఒక వ్యాసంలో శాస్త్రిగారిని గురించి రాస్తూ
సంపాదకుడు అనేవాడికి సమయ జ్ఞానం అవసరం అని శాస్త్రిగారు చెబుతుండేవారని
పేర్కొన్నారు. ‘దినపత్రిక బ్రతుకు అర్థగంట. ఆ తర్వాత పకోడీ పొట్లాలకే
పనికొస్తుంది’ అనేవారట శాస్త్రి గారు.

కామెంట్‌లు లేవు: