15, జూన్ 2019, శనివారం

సెక్యూరిటీ పంజరాల్లో వీవీఐపీలు – భండారు శ్రీనివాసరావు


అమెరికా  మాజీ అధ్యక్షుడు అబ్రహంలింకన్ ఒక చక్కని మాట చెప్పారు.
ఒక మంచి వాడిని, సద్గుణ సంపన్నుడిని ఎంపిక చేసుకోండి. అతడికి అధికారం ఇచ్చి చూడండి, ఇక అతడెలా మారిపోతాడన్నది మీరే చూస్తారు.
చాలామందికి అర్ధం కానిది ఇదే. అధికారంలో లేని సమయంలో ఎలాంటి బందోబస్తూ లేకుండా ప్రజల నడుమ అరమరికలు లేకుండా స్వేచ్చగా తిరిగిన రాజకీయ నాయకులు, పదవిలోకి రాగానే చుట్టూ భద్రతా వలయాలు నిర్మించుకుని ప్రజలకు ఎందుకు దూరం అవుతారన్నదే జవాబు లేని ప్రశ్న.
ప్రముఖుల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా,  ఏదైనా  జరగరానిది జరిగితే అది సంచలన వార్త అవుతుందని, అంచేత సెక్యూరిటీ విషయంలో తాము చెప్పినట్టు విని తీరాల్సిందే అని భద్రతా విభాగం వారు నాయకులకు నొక్కి చెబుతుంటారు. వారు చెప్పేది నిజమే కావచ్చు. మరి వందల కోట్లు ప్రజాధనం ఖర్చు అవుతున్న ఈ భద్రతా ఏర్పాట్ల విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవచ్చు కదా, తద్వారా  ప్రముఖుల రాకపోకల సందర్భంలో బందోబస్తు పేరుతొ సామాన్యుల రాకపోకలకు కలుగుతున్న ఇబ్బందులను ఓ మేరకు తగ్గించవచ్చు కదా! అనేది  మామూలు మనుషులకు కలిగే సందేహం. ప్రస్తుతం అలా కూడా చేస్తున్నారు. అంగరక్షకుల చేతుల్లో చిన్న సైజు బ్రీఫ్ కేసులు కనిపిస్తుంటాయి. వాటిల్లో ఇటువంటి పరికరాలే వుంటాయి. అయినా ప్రముఖుల రాకకు ముందు, అది వివాహ వేడుక కావచ్చు,  సాధారణ సమావేశం కావచ్చు  పోలీసు జాగిలాలతో, బాంబులను నిర్వీర్యం చేసే దళాలతో క్షుణ్ణంగా తనిఖీ చేయడం తప్పనిసరి. అలాగే ప్రముఖులు  ప్రయాణం చేసే మార్గాల్లోనే కాకుండా  భద్రతాధికారులు ఎంపిక చేసిన ప్రత్యామ్నాయ  మార్గాల్లో సయితం వాహనాల కదలికలపై ఆంక్షలు విధించడం కద్దు.  ఇంత శ్రమ పడ్డా, ఇంతటి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలేదు. దరిమిలా సెక్యూరిటీ ఏర్పాట్లను సమీక్షించి వాటిని మరింత పటిష్టం చేయడం ఒక్కటే జరుగుతోంది. తద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతూనే వస్తోంది.
పొతే, ప్రముఖులకు కల్పిస్తున్న భద్రత, పటాటోపం, అధికార దర్పం ప్రదర్శించడానికే తప్ప వారి ప్రాణరక్షణకు సరిగా ఉపయోగపడడం లేదన్న అభియోగాలు వున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రముఖుల పేరుతొ కొందరికి కల్పిస్తున్న భద్రత అపహాస్యానికి గురవుతున్న మాటా నిజమే.
ఈ విషయాలను మననం చేసుకోవడానికి ఓ కారణం వుంది. ఆంద్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో సాధారణ ప్రయాణీకుడి మాదిరిగా సెక్యూరిటీ చెక్ ద్వారం నుంచి వెళ్ళారనీ, విమానం ఎక్కడానికి ఇతర ప్రయాణీకుల వలెనే షటిల్ బస్సులో ప్రయాణించారనీ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆయనకు చాలా సంవత్సరాలుగా జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటూ వచ్చింది. దేశ విదేశాల్లో ప్రయాణాలు అన్నీ చాలావరకు ప్రత్యేక విమానాల్లోనే చేసేవారు. ఆ సెక్యూరిటీని ఉపసంహరించుకున్న సమాచారం ఇంతవరకు అధికారికంగా లేదు. ఎయిర్ పోర్ట్ నిబంధనలు ఉన్నప్పటికీ బాబుకు ఉన్న  ఆ సెక్యూరిటీ వాళ్ళు ఎలా అనుమతించారో అర్ధం కాని విషయం. బహుశా, వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఆయనే ఈ నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు.
ఈ ఉదంతం చాలా మందికి విడ్డూరంగా అనిపిస్తే తెలుగు దేశం వర్గాలకు మనస్తాపం కలిగించింది. దానితో ఇదొక రాజకీయ వివాదంగా మారి చర్చలు సాగుతున్నాయి.
మొన్న జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి కారణాలను అన్వేషించే ప్రయత్నం చేసారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు దేశం పార్టీ అధినాయకుల్లో మానవీయ స్పర్శ మటుమాయం అయిందన్న అభిప్రాయం ఆ  సమావేశంలో వ్యక్తమైంది. నిజమే. పార్టీ అధినేత పార్టీ శ్రేణులకు దగ్గర కాకుండా అడ్డుపడిన అనేకానేక కారణాల్లో భద్రతా ఏర్పాట్లు కూడా వున్నాయి. ఇది నిజం.
జనం నడుమ వుండే నాయకులకే జనం దగ్గరవుతారు. 2019 లో జగన్ అద్భుత విజయం, 2014లో చంద్రబాబు చేసిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర ఈ వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు రుజువు చేస్తున్నాయి.
తగ్గించిన భద్రతకు ఎవరు కారణం అనే రంద్రాన్వేషణ ఇప్పుడు  అనవసరం. సమస్యలనుంచి అవకాశాలను వెతుక్కుంటానని చంద్రబాబు తరచూ చెబుతుంటారు.
వెతకబోయిన తీగ ఎదురయింది. అదే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది. అంశాన్ని వివాదాంశం చేసి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నాలు మాని పారేసుకున్న చోటునే వెతుక్కోవడం అనేది విజ్ఞత అనిపించుకుంటుంది.
అధికారం చేజారిన పిదప, అధికారంతో సమకూరే కొన్ని అదనపు సౌకర్యాలు కూడా దానితో పాటే తప్పుకుంటాయి. గతంలో విశేషాధికారాలు అనుభవించిన గొప్ప గొప్ప  నాయకులు సైతం ఈ దశలను దాటుకుంటూ వచ్చారు. రాజకీయాల్లో అది అత్యంత సహజంగా తీసుకోవాలి.          
ఓసారి ఇందిరాగాంధి మాజీ ప్రధాన మంత్రిగా ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మారిన సమీకరణాల  కారణంగా ఆవిడను ఘనంగా కాకపోతే పోనీండి,   మోస్తరుగా ఆహ్వానించే నాయకులు కూడా లేకపోయారు. గెస్ట్ హౌస్ లో బస చేసినప్పుడు అప్పట్లో చోటా కాంగ్రెస్ నాయకుడు ఈశ్వర్ లింగం మాజీ ప్రధాని బ్రేక్ ఫాస్ట్  కోసం  దగ్గర్లోని   హోటల్ నుంచి  ఇడ్లీ వడ తెప్పించి పెట్టారు. వాటితో పాటు ఇచ్చిన సత్తు చెంచాతో తినలేక ఇబ్బందిపడిన  ఇందిరాగాంధిచివరకు  చేత్తోనే  తిన్నారని దానికి ప్రత్యక్ష సాక్షి  అయిన స్థానిక కాంగ్రెస్ నాయకుడు కౌటూరు దుర్గాప్రసాద్ చెప్పారు. ఆవిడ టిఫిన్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వారిలో పాలేరు సమితి మాజీ అధ్యక్షులు రావులపాటి సత్యనారాయణ రావు (మాజీ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్  రావులపాటి సీతారామారావు తండ్రి) వున్నారు.  
ఆరోజుల్లో శ్రీమతి గాంధి రాజకీయంగా వొంటరి. కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగెస్ (ఐ) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఆమెకు వీర విధేయుడిగా వున్న ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆమెతో విభేదించి పాత కాంగ్రెసు (కాంగ్రెస్ ఓ) లో కొనసాగుతున్నారు. ఇక ఆవిడను ఖమ్మం పర్యటనలో కనుక్కునే నాధుడు యెవ్వడు?
ఆవిడ వెంట వచ్చిన మర్రి చెన్నారెడ్డి, జీ వెంకటస్వామి   ప్రభ్రుతులు శ్రీమతి గాంధీని హిల్ బంగ్లా లో దింపి వసతి సరిపోకనో యేమో మన్నెగూడెం వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. అంచేత ఆవిడ బ్రేక్ ఫాస్ట్ బాధ్యత చోటా మోటా స్థానిక నాయకుల మీద పడింది
పీవీ నరసింహారావు ప్రధానిగా వున్నంతకాలం అందరూ ఆహా! ఓహో!!అన్నారు.
పీకలలోతు  సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్ధిక వ్యవస్థను నూతన
సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. సంఖ్యాబలం  బొటాబొటిగా
వున్న పాలకపక్షాన్ని అయిదేళ్ళ పాటు పూర్తి కాలంఅధికార పీఠంపై వుంచిన
అపర చాణక్యుడని  వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయిన తరువాతపదవి
నుంచి దిగిపోయిన తరువాత  పొగిడిన  ఆ నోళ్లతోనే  ఆయన్ని  తెగడడం
ప్రారంభించారు. పదవికి ప్రాణం ఇచ్చే పార్టీ నాయకులు ఆయన పదవికి దూరం
కాగానే వాళ్ళూ దూరం జరిగారు.
పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని
హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ
దిగినప్పుడు కనబడే హడావిడి ఎలా వుండేదో  ఒక విలేకరిగా నాకు తెలుసు.  ఆయన
చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా  అధికారులు, అనధికారులు, మందీ
మార్బలాలు, వందిమాగధులుఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు.
ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.
ప్రధానమంత్రి హోదాలో పీవీ నరసింహా రావు  రాష్ట్ర పర్యటనకు
వస్తున్నారు అంటే చాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన  యావత్ యంత్రాంగాలు
అప్రమత్తం అయిపోయేవి. ఉన్నతస్థాయి సమావేశాలు జరిపి ప్రధాని పర్యటన
ఏర్పాట్లు సమీక్షించేవారు. ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి ప్రత్యేకంగా
చెప్పనక్కరలేదు. ప్రధాని పాల్గొనే ప్రతి కార్యక్రమాన్ని రెండు టేపుల్లో
రికార్డు చేయడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో  ప్రత్యేక బృందాలను
ఏర్పాటు చేసేవారు. కార్యక్రమం ముగియగానే ఆ వివరాలు రాసివున్న ఒక టేపును
అక్కడికక్కడే ప్రధాని బృందంలోని అధికారులకు అందచేసేవారు. అవన్నీ ప్రధాని
పాటు ఢిల్లీ చేరిపోయి ఆ తరువాత ప్రధాని కార్యాలయంలోని 'ఆర్చివ్స్'
విభాగానికి దఖలు పరిచేవారు.
పీవీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు ప్రతి ఏటా  బేగంపేటలోని
ఒక సందులో వున్న స్వామి రామానంద తీర్ధ ట్రస్టు కార్యాలయానికి వచ్చేవారు.
ఇక అక్కడ చూడాలి అధికారులు, అనధికారుల హడావిడి. భద్రతా ఏర్పాట్ల గురించి చెప్పే పనే లేదు. ప్రధాని వెళ్ళే దారి దారంతా జల్లెడ పట్టేవాళ్ళు. పదవి నుంచి
దిగిపోయిన తరువాత అక్కడ జరిగిన ట్రస్టు సమావేశాలకు కూడా ఆయన
హాజరయ్యేవారు. వాటిని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు 'అధికారాంతమునందు...'
అనే పద్యపాదం  జ్ఞాపకం చేసుకోవాలో, 'ఈ కర్మభూమిలో పదవి, అధికారం ముందు
అన్నీ దిగదుడుపే' అనే నిజాన్ని హరాయించుకోవాలో నాకు అర్ధం అయ్యేది కాదు.
ఇవన్నీ రాజకీయ నాయకులకు తెలియని విషయాలు కావు. అధికారం శాశ్వతం కాదని అందరికంటే వారికే బాగా తెలుసు. అయితే అది శాశ్వతం అనే భ్రమలో వుంటారు. పదవి నుంచి దిగిపోయిన తరవాత కానీ తత్వం బోధ పడదు.

4 కామెంట్‌లు:

raghu చెప్పారు...

excellent article

Jai Gottimukkala చెప్పారు...

Z+ సెక్యూరిటీ చాలామందికి ఉంది. వారెవరికీ తణిఖీ మినహాయింపు లేదు, SPG protectee లకు మాత్రమే సౌకర్యం.

అసలే దేశంలో లాల్ బత్తీ కల్చర్ తగ్గిద్దామని ప్రయత్నిస్తున్న ఈ సమయంలో అప్పుడెప్పుడో నక్సల్ దాడి సాకు చూపించి ఇంకా Z+ ఇవ్వడం అవసరమా? ఒకవైపు తనకు ప్రభుత్వ సెక్యూరిటీ అవసరం లేదని యువనాయకురాలు శ్రీమతి ప్రియాంక వాద్రా గారు అంటున్నప్పుడు సీనియర్లమంటూ డబ్బాలు కొట్టుకొనేవాళ్లకు ఆవిడకు ఉన్న ఇంగితం లేకపోవడం విడ్డూరం.

అత్యంత నక్సల్ కల్లోలిత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారికి కూడా తణిఖీ మినహాయింపు లేదు. కేంద్రపౌరవిమానయాన మంత్రి హోదాలో ఉన్నప్పుడు పూసపాటి అశోక గజపతిరాజు గారు అందరికీ మల్లె లైనులో నిలబడి, సెక్యూరిటీ తణిఖీలు చేయించుకొని & సాటి ప్రయాణీకులతో కలిసి బస్సులో వెళ్లి విమానం ఎక్కేవారు.



భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ raghu and jai gottimukkala : ధన్యవాదాలు. మీరు ఉదహరించిన చత్తీస్ గడ్ మాజీ ముఖ్యమంత్రి రమణ సింగ్, పూసపాటి అశోక్ గజపతి రాజు గారి దృష్టాంతాలను నేను ఈ వ్యాసంలో పొందుపరచి వుంటే బాగుండేది. అలాగే అమెరికాలో సెక్యూరిటీ చెక్ కు అభ్యంతరం చెప్పకపోగా, కాలి బూట్లు, మేజోళ్ళు విప్పి అక్కడి అధికారులకు సహకరించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సంగతి కూడా రాసివుండాల్సింది.

నీహారిక చెప్పారు...

చంద్రబాబుగారు 9 సం లు ప్రతిపక్షనాయకుడిగా వ్యవహరించారు. పదవులు శాశ్వతం కాదు అని ఆయనకు ఒకరు చెప్పాలా ? వెనుకబడిన తెలంగాణా అని రోజూ ఏడ్చిన నాయకులు హెలీకాఫ్టర్ లు వేసుకుని తిరిగేస్తున్నారు. 18 నెలలు జైలులో ఉండి వచ్చినవాళ్ళకు పోలీసులు సలాం లు కొడుతున్నారు. భండారు గారు మీలో కూడా మార్పు కనబడుతోంది.

ఒక మనిషిని "మంచివాడు" అని అనాలంటే మనలో కూడా కొద్దిగా మంచితనం అనేది ఉండాలి.