21, జులై 2016, గురువారం

భ్రమణ కాంక్ష - డాక్టర్ ఎం. ఆదినారాయణ - 2


ఆదినారాయణ గారు సంచారి మాత్రమే కాదు చక్కటి రచయిత కూడా అనిపిస్తుంది ‘భ్రమణ కాంక్ష’ పుస్తకం చదివిన తరువాత.
ఆయన రాసిన వాక్యాలు, చేసిన వర్ణనలు కూడా చిత్తగించండి. స్థానిక పరిస్తితులు కళ్ళకు కట్టినట్టు చూపారు.
(విశాఖ- డార్జిలింగ్ దోవలో)
“తొట్లకొండ’ బౌద్ద స్థూపాల నుంచి మా యాత్ర మొదలయింది. క్రీస్తు పూర్వం వంద సంవత్సరాలనాటి ఈ కట్టడాలు విశాఖపట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరం అంచునేవున్నాయి. ...
“చుట్టుపక్కల అన్నీ పొలాలే. తాటిచెట్ల మీద ఉడతలు మమ్మల్ని చూసి గోలపెట్టడం ఆపేశాయి.
“ఆనందపురం దాటాక దారి పక్కన మర్రి చెట్టుకి కబోది పక్షులు వేలాడుతున్నాయి, యేవో కాయలలాగా.  మఠం అరుగుల మీద బైరాగులు బీడీ దమ్ము కొడుతున్నారు...
“దారిపొడవునా గ్రామ దేవతల గుళ్ళు. సాయంకాలానికి తగరపు వలస పక్కన గోస్తనీ ఒడ్డుకి చేరాం...తాటి కల్లు అమ్మే స్త్రీలు మమ్మల్ని చూసి ‘పానీ, పానీ అచ్చా హై’ అంటూ నురగలు కట్టిన కల్లు కుండల్ని చూపిస్తున్నారు. పొలాల్లోని బావుల్లో నీరు నేలమట్టానికి వున్నాయి. ...
“చంపావతీ నది దగ్గర పడగానే కాస్త చల్లపడింది.
“ఒక ఊళ్ళో ఓ ముసలావిడ మాకో సలహా ఇచ్చింది. ”నాయనా! గ్రామాల్లో ఎలాగూ హోటళ్ళు వుండవు. పెళ్ళిళ్ళు జరిగే చోట మొహమాట పడకుండా పెళ్లి భోజనాలు చేయడమే మంచిది’.  ఆవిడ ఇచ్చిన ఉచిత భోజన సలహా కొన్ని చోట్ల పాటించక తప్పలేదు....
“సూర్యుడి చివరి కిరణాలు మా మీద పడేసరికి చిలకల పాలెం చేరాం” (పొద్దుగూకిందని కవి హృదయం)
“నాగావళి వంతెన వద్దకి చేరేసరికి తెల్లవారింది. ముసుగు పెట్టి నిద్రిస్తున్నట్టుగా ఇసుక దిబ్బలు. కొడెలకి అరక దున్నడం నేర్పిస్తూ రైతులు నాగలి లాగిన గుర్తులు గుండ్రంగా, పొడవుగా ముగ్గుల మాదిరిగా వున్నాయి...
“శ్రీకాకుళానికి కూరగాయలు తీసుకువెళ్ళే స్త్రీలు మాతో కలిశారు. చక్కగా తలదువ్వుకుని, పూలు పెట్టుకుని కనిపించారు. యెంత వేకువ ఝామున లేచి ఉంటారో అనిపించింది. వీరిలో ఎక్కువమంది చుట్టలు కాల్చకుండా  ఉండలేరు.”
(నాకే కాదు నారాయణ గారి ఈ రచన చదివిన అనేకమందికి  కనిపించిన వైశిష్ట్యం ఇదే. సమకాలీన సామాజిక గ్రామీణ వాతావరణాన్ని వీలున్నప్పుడల్లా అందులో  అందంగా పొదిగారు. జీవిత చరిత్రలు, అనుభవాలు రాసేవాళ్ళు గుర్తుంచుకోవాల్సిన పాఠం ఇది)  

(ఇంకా వుంది)

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

srinivasa rao garu ee book ekkada dorukutundo cheppandi...publisher details pls...

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@pratap reddy: Reddy garu. this book first published in 1999 and re-printed in 2004.for copies visalandhra book house, all branches. or m.anjaneyulu, south b.c.colony, tanguturu post, ongole taluk, prakasam dist a.p., phone land line: 08592-242839. Email of writer shri m.adinarayana: scholargypsy@rediffmail.com. phone res. 0891-2844349 (visakha) price: rupees:100.