28, జులై 2016, గురువారం

రేడియో భేరి -6

గ్రామఫోను రికార్డులా తిరుగుతాడు

1954 దాకా మద్రాసు కేంద్రంలో లలిత సంగీత విభాగం ప్రత్యేకంగా ఏర్పడకపోయినా ప్రధానమైన నాలుగు దక్షిణ భారతీయ భాషల్లో లలిత గీతాల ప్రసారం 1939 నుంచీ తరచుగానే సాగుతుండేది. ‘బిల్హణీయం’ విశేషమైన ఆదరణ పొందడంతో ప్రముఖులైన కవులతో రాయించిన సంగీత నాటకాలు ఎన్నింటినో మద్రాసు కేంద్రం ప్రసారం చేసింది. వాటిలో కొన్ని: కృష్ణ శాస్త్రి రాసిన ‘శర్మిష్ట’, ‘వూర్వశి’, ‘శబరి’, ‘గుహుడు’, ‘అతిధిశాల’, ‘దక్ష యజ్ఞం’, ‘కృష్ణాష్టమి’, విశ్వనాధ సత్యనారాయణ రాసిన ‘కిన్నెరసాని’, ‘కోకిలమ్మపెళ్లి’, ‘సుమిత్ర’, ‘ఊర్మిళ’, ‘’మారీచుడు’, ‘గోదావరి’. అలాగే రజని (బాలాంత్రపు రజనీకాంతారావు రాసిన ‘మధురానగర గాధ’, ‘చండీ దాసు’, ‘మేఘ సందేశం’, శివశంకర శాస్త్రి (స్వామి) రాసిన ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’, శ్రీ శ్రీ రాసిన ‘వ్రేపల్లె’.
ఉమర్ ఖయ్యాం జీవితాన్ని, అతని తత్వాన్ని ఆవిష్కరించినది ‘అతిధి శాల’. ఉర్దూ, అరబ్బీ, పారశీక పదాలతో కృష్ణశాస్త్రి సృష్టించిన మధ్య ప్రాచ్య వాతావరణాన్ని, అందుకు తగిన సంగీతాన్ని సమకూర్చి శ్రావ్యకావ్యంగా తీర్చిదిద్దినవారు ‘రజని’. అలాగే కృష్ణ శాస్త్రి విరచిత ‘దక్ష యజ్ఞం’ - సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో రూపుదిద్దుకున్న మరో అద్భుతం.
టేప్ రికార్డింగ్ సదుపాయాలు లేని ఆ రోజుల్లో రేడియో కార్యక్రమాలన్నీ అప్పటికప్పుడు ప్రసారం అయ్యేవి. (LIVE BROADCASTS). అందువల్ల ఎన్నో గొప్ప కార్యక్రమాలు – రేడియో పరిభాషలో చెప్పాలంటే- ఇప్పుడు లభ్యం కాకుండా గాలిలో కలిసిపోయాయి.
శ్రీ శ్రీ రాసిన ‘బలి’, ‘గ్రామఫోను రికార్డులా తిరుగుతాడు’ అనే రేడియో నాటికలు 1939-40 లలో ప్రసారమయ్యాయి. రేడియో నాటక రచనలు యెలా చేయాలో తెలిసిన రచయితలు కొందరే. అటువంటివారిలో శ్రీ శ్రీ ఒకరు. మనకు లభిస్తున్న ఆధారాలనుబట్టి, 1939 నుంచి 1984 దాకా శ్రీ శ్రీ రేడియో కోసం 14 నాటికలు రాశారు. వీటిల్లో ‘మరో ప్రపంచం’ ఒకటి. అందులో ప్రధాన పాత్ర పేరు ‘కనుపాప’. ఇరవై ఒకటో శతాబ్దానికి చెందినవాడు. ఇరవై ఐదో శతాబ్దంలోకి వెళ్ళబోయి యాంత్రికలోపంతో ఇరవయ్యవ శతాబ్దిలోకి వస్తాడు. ఆ పాత్ర చేత శ్రీ శ్రీ ఒకచోట ఇలా పలికిస్తాడు. ‘భాష చాలా అసమగ్రమైన పనిముట్టు. ఏ వూహనీ అది విస్పష్టంగా, అసందిగ్ధంగా తెలియచెయ్యలేదు’. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు: