25, జులై 2016, సోమవారం

రేడియో భేరి - 3


తొలి తెలుగు రేడియో నాటకం ‘అనార్కలి’

1938 జూన్ 18 నాడు రామమూర్తి పంతులు ‘సజీవమైన తెలుగు’ అనే విషయం గురించీ, 1938 జూన్ 21 నాడు ‘మన ఇళ్లు – వాని అందము చందము’ గురించి కోలవెన్ను కోటేశ్వర రావు, 1938 జూన్ 23 నాడు ‘రవీంద్రుడు’ శీర్షికన బెజవాడ గోపాలరెడ్డి ప్రసంగించారు. (ప్రసార వ్యవధి 15 నిమిషాలు. ప్రసార సమయం రాత్రి 8 గంటల 15 నిమిషాలు.)
తెలుగులో ప్రసారం అయిన తొలి రేడియో నాటకం ‘అనార్కలి’. ముద్దుకృష్ణ రాసిన ఈ నాటకాన్ని ఆచంట జానకీరాం రూపొందించారు. నాయిక పాత్రను రేడియో భానుమతిగా ప్రసిద్దురాలయిన పున్నావజ్జల భానుమతి పోషించారు. నాయకుడు సలీం (జహంగీర్)పాత్రను దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి, అక్బర్ పాత్రను డాక్టర్ అయ్యగారి వీరభద్ర రావు పోషించారు. ఈ నాటకం 1938 జూన్ 24 తేదీ రాత్రి ఎనిమిదిన్నరనుంచి ప్రసారం అయింది.
జానపద సంగీతం కూడా వినిపించాలనే ఉద్దేశ్యంతో అడపా దడపా ‘పల్లె పాటలు’ (మొదట ప్రసారం 1938 జూన్ 25 రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ) ప్రసారం చేసేవారు. అయితే ఈ పల్లెపాటలు పాడిన వారు నాగరీకులే కావడం విశేషం. వారు జానపద కళాకారులు కాదు. శాస్త్రీయ సంగీతంలో కాస్త లలితమైనవిగా భావించే పదాలను. జావళీలను ప్రత్యేకంగా వినిపించేవారు. అట్లా వినిపించినప్పుడు తెలుగు రచనలతో పాటు తమిళ రచనలను కూడా ప్రసారం చేసేవారు.
మద్రాసు రేడియో కేంద్రం నుంచి తమిళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ ప్రసారాలు జరుగుతున్నాయనే ప్రచారం ఒకటి ఆ రోజుల్లో కొనసాగుతూ వుండేది. 1939లో తిరుచినాపల్లిలో రేడియో కేంద్రం ఏర్పడి దక్షిణ తమిళ జిల్లాలపై దృష్టి నిలిపింది.
రేడియో కార్యక్రమాల గురించి శ్రోతలకు తెలపడానికి మద్రాసు కేంద్రం 1938 జూన్ నుంచి తెలుగులో ‘వాణి’, తమిళంలో ‘వానొలి’ పక్ష పత్రికలను ప్రారంభించింది. కొన్ని సంచికల తరువాత వాణి ప్రచురణ నిలిచిపోయింది. 1948లో విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభం అయిన తరువాత తిరిగి వాణి ప్రచురణ మొదలయింది. క్రమంగా ఆదరణ కరువై 1980 ప్రాంతాలలో ఆగిపోయింది. ‘వాణి’లో వివిధ రేడియో కేంద్రాల నుంచి ప్రసారం అయిన ప్రసంగాలు, కవితలు, గోష్టులు, సంగీత పాఠాలవంటివి ఎన్నో వెలువడుతూ వుండేవి. తొలి సంచికలో విజయవాడ రేడియో కేంద్రం లక్ష్యాలను వివరిస్తూ, ‘ఈ కేంద్రం రాష్ట్రం లోని జనులందరికీ ఉపయోగకరంగా వుండగలదు. ఈ స్టేషనులో గ్రామస్తుల వినోదార్ధం ఒక గంట ప్రత్యేకించబడ్డది. ఇంతే కాకుండా తక్కిన విషయాలను కూడా ప్రజలలోకి వివిధ తరగతులవారికి అనుకూలముగానుండేటట్లుగా ఏర్పరుపబడ్డది’ అని పేర్కొన్నారు. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు: