19, అక్టోబర్ 2015, సోమవారం

చదివించే పుస్తకం- చదవాల్సిన పుస్తకం


మిత్రుడు సత్యారావు ఓ పుస్తకం రాసాడు. నిజానికి అది ముందూ వెనుకా అట్టల్ని, ఫోటో పేజీలని మినహాయిస్తే అక్షరాలా ముప్పయి రెండు పేజీల చిన్ని పొత్తం. ఏకబిగిన చదివించే శైలి కలిగిన పుస్తకం కాబట్టి చదివేయడం అన్నది కొన్ని నిమిషాల పనే. ఇదొక సౌలభ్యం.
రచయిత సత్యారావు నాకు గత ముప్పయి అయిదేళ్ళు గా తెలుసు. తెలుసు అనుకుంటున్నాను కానీ అతడి గురించి నాకు అసలు ఏమీ తెలియని విషయాలు ఎన్నో వున్నాయని ఈ పుస్తకం చదివిన తరువాతే నాకు  తెలిసింది. అతడు హైదరాబాదులో పరిచయం అయింది ఆంద్ర జ్యోతి విలేకరిగా. నేను అప్పటికే 1975 నుంచి రేడియో విలేకరిగా పనిచేస్తున్నాను. గతంలో జ్యోతిలో పనిచేసి వచ్చాను కనుక అందులో పనిచేసే సత్యారావు అంటే అవ్యాజానురాగం. నన్ను భం.శ్రీ. అని పిలిచేవాడు.  రేడియోలో ప్రసారం చేసే అసెంబ్లీ సమీక్షలు రాస్తుండేవాడు. మా దగ్గర తాత్కాలికంగా రిపోర్టింగ్ చేసే వెసులుబాటు వుండేది. ఆ రోజుల్లో రోజుకు డెబ్బయి అయిదు రూపాయలు ఇచ్చేవాళ్ళు అనుకుంటాను.  ఇప్పుడది బాగా  పెరిగినట్టు వుంది. ఇదలా ఉంచుదాం. అలాటి సత్యారావు ఆనతి కాలంలోనే ప్రభుత్వ సమాచార శాఖలో చేరి దాని డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ముఖ్యమంత్రులకు ప్రెస్ సెక్రెటరీగా పనిచేసాడు. చివరికి  క్యాబినెట్ హోదా కలిగిన ప్రెస్  అకాడమీ చైర్మన్ అయ్యాడు. ఇవన్నీ నాకు తెలుసు. కానీ ఈ పుస్తకంలో  అతను రాసుకున్న కొన్ని విషయాలు విభ్రాంతి కలిగించే విధంగా వున్నాయి. ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు సత్యారావు బెజవాడ ప్రెస్ క్లబ్ లో ఆఫీసు బాయిగా పనిచేసాడు. విలేకరుల సమావేశాలు జరిగినప్పుడు కాఫీ టీలు  అందించేవాడు. క్లబ్ లోనే మెట్లకింద కాళ్ళు ముడుచుకుని రాత్రి పూట నిద్రపోయేవాడు. బెజవాడ హోటల్లో సర్వరుగా పనిచేసాడు. అవన్నీ హాయిగా శ్రమజీవన సౌందర్యం తెలిసిన మనిషిగా ఎలాటి భేషజాలకు పోకుండా అక్షరబద్ధం చేసాడు. అదీ అతగాడి సత్య నిష్ఠ. జర్నలిష్టుకు కావాల్సిన మొట్టమొదటి అర్హత.  అలాటివాడి ఎదుగుదల క్రమాన్ని తెలిపేదే ఈ పుస్తకం. కంటి నీరు అదుముకుంటూ చదువుకోవాలి. చదువరులని మరీ ఏడిపించడం ఇష్టం లేకనే సత్యారావు ఈ పుస్తకాన్ని అంత చిన్నగా రాసివుంటాడు. ఇక చివరగా ఒక మాట. ‘మా వూరి దారి నుంచి...’ అనే తన జీవనయాన గాధను సత్యారావు  మొదలు పెట్టిన క్రమం ఇలా వుంది. అదొక్కటి చాలు స్థాలీపులాక న్యాయం మాదిరిగా ఈ పుస్తకం గొప్పదనం తెలపడానికి.
“అది 1977. నెల సరిగ్గా గుర్తు లేదు. బెజవాడ ప్రెస్ క్లబ్. ఆజానుబాహుడైన ఒక పెద్దాయన నా సత్యారావు భుజము మీద చేయి వేసి మెట్లు దిగుతున్నాడు.
‘ఏ వూరప్పా’ అడిగారాయన.
‘శ్రీకాకుళం జిల్లా పొందూరు దగ్గర సిరిపురం సార్!’
‘ఏం చేస్తున్నావప్పా’  
చెప్పాను, ఆఫీసు బాయ్ నని.
‘బాగా చదువుకో అప్పా’  సలహా ఇచ్చి వెళ్లిపోయారాయన.  
‘ఆయన ఎవ్వరో కాదు ఆంద్ర ప్రదేశ్ ప్రధమ ముఖ్యమంత్రి, తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి అయిన శ్రీ నీలం సంజీవరెడ్డి గారు. జనతా పార్టీ తరపున రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెజవాడ వచ్చి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రెస్ క్లబ్ కి వచ్చారు.”
భవిష్యత్తులో ఎక్కాల్సిన మెట్లకు చిహ్నంగా కాబోలు సత్యారావుకు ఆ రోజు అలా రాజకీయాల్లో మేరునగ ధీరుడుగా భాసిల్లిన సంజీవరెడ్డి గారు ప్రెస్ క్లబ్ మెట్ల మీద తారసపడ్డట్టున్నారు.

ఆల్ ది బెస్ట్ సత్యారావ్!  

('మా ఊరు దారి నుంచి...' పుస్తకావిష్కరణ)  
         

5 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...


స్థాలీపులాక న్యాయం అంటే ఏమిటి ?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@nనీహారిక - అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవడం కోసం ఒక ఒక బియ్యం మెతుకును చేత్తో తీసుకుని ఒత్తి చూస్తారు. దాన్నే స్థాలీపులాకన్యాయం అంటారు.

శ్యామలీయం చెప్పారు...

తెలుగులో సామెతలు ఉన్నట్లే, సంస్కృతంలో సందర్భాలని సూచించే 'న్యాయాలు' అనబడే పదబంధాలు ఉన్నాయి. వాటిలో ఈ స్థాలీపులాకన్యాయం ఒకటి. స్థాలి అంటే వంటపాత్ర. పులాకం అంటే అన్నం మెతుకు. స్థాలీపులాకం అంటే వంటవండుతున్న గిన్నెలోని మెతుకు అన్నమాట. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవటానికి వంటగిన్నెలోని అన్ని మెతుకులనూ పరీక్షించ నవసరం లేదు. ఒక్క మెతుకును వేళ్ళమధ్యన పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది కదా అన్నది ఈ న్యాయం లోని భావం.

అలాగే దేహళీదీపన్యాయం అని మరొకటి ఉంది. దీపం అంటే తెలిసినదే. దేహళీ అంటే గడప. ఇంట్లో గడపమీద దీపం ఉంచామనుకోండి. అప్పుడేమవుతుంది? గడపకు ఇవతల ఉన్న గదిలోనికీ వెలుతురు వస్తుంది, ఆవల ఉన్న గదిలోనికీ వెలుతురు సమానంగానే వస్తుంది. ఉభయపక్షాలకూ సమంగా అన్వయం అవుతున్నది ప్రయోజనం అని చెప్పటానికి ఈ న్యాయం వాడుతారు.

మరొక జగత్ప్రసిధ్ధమైన న్యాయం భ్రమరకీటకన్యాయం. భ్రమరం అంటే తుమ్మెద. అది ఒక కీటకాన్ని తెచ్చి తనగూటిలో ఉంచి నిత్యం దాని దగ్గర తనదైన రీతిలో రొదచేస్తూ ఉంటుందట. అలా కొన్నాళ్ళు గడిచాక ఆ కీటకం కూడా తనదైన కూతవిడచి అచ్చం భ్రమరంలాగే ఝుంకారం చేస్తుందట. అంటే నిత్యం ఒకరితో సాన్నిహిత్యం వలన వారు వీరుగా మారతారన్న మాట చెప్పటానికి ఈ న్యాయం ఉదహరిస్తారు.

ఇలాగు సంస్కృతభాషలో వివిధసందర్భాలకు అన్వయించేలా చాలానే న్యాయాలున్నాయి.

అజ్ఞాత చెప్పారు...

శ్యామలీయం గారు, దేహళి అంటే గడప అని చెప్పారు.
కొంతమంది (కన్నడలో కూడ) దేశరాజధాని ఢిల్లీ / దిల్లీని దెహళీ అని కూడ వ్రాస్తారు. అంటే దిల్లీ దేశానికి గడప అని అనుకోవచ్చా?

శ్యామలీయం చెప్పారు...

బోనగిరిగారూ, నాకు కన్నడభాషాపరిచయం లేదు కాబట్టి జవాబు చెప్పలేను. హిందీవాళ్ళు దిల్లీ అంటే ఆ ఊరిని తెలుగువాళ్ళం ఢిల్లీ అనటం పరిపాటి. తెలుగునాట ఢిల్లీనీ దేహళి అనో దెహళి అనో పిలవటం నేను ఎన్నడూ వినలేదు. ఏ ప్రాంతంలో నైనా అలా పిలుస్తారేమో నాకైతే తెలియదు. మన్నించాలి.