3, సెప్టెంబర్ 2014, బుధవారం

తెల్లదొరల గడ్డపై సంస్కృత పాఠాలు


'రామః రామౌ, హే రామ హే రామౌ........' సంస్కృతం మాస్టారి నోట మధురంగా, మంద్రంగా వినవచ్చేవి శబ్ద మంజరి పాఠాలు.
బెజవాడ గవర్నర్ పేట లోని సీవీఆర్ జీఎంహెచ్ చుండూరు వెంకటరెడ్డి గవర్నర్ పేట మునిపల్  హైస్కూలు భవనం. విశాలమైన ప్రాంగణం. నడిమధ్యలో రాజసం వొలకబోసే రాతికట్టడం. దానికి ఇరువైపులా తరగతి గదులు. ప్రధాన భవనంలో మెట్లకింద,  తెల్లని పంచె, లాల్చీ కండువా  ధరించిన సంస్కృతం మాస్టారు అలా శబ్దమంజరి చదువుతుంటే,  మేము ఒక పదిమందిమి కాబోలు సంస్కృతం రెండో భాషగా తీసుకున్నవాళ్ళం,  శ్రద్ధగా వింటూ మాస్టారు చెప్పింది వల్లె వేస్తూ వుండేవాళ్ళం. ఇంగ్లీష్, తెలుగు, లెక్కలు, ఇతర సబ్జక్టులు బోధించడానికి తరగతి గదులు విడిగా ఉండేవి కాని సంస్కృతం క్లాసు మాత్రం, శబ్ధమంజరి, అమరకోశం చెప్పుకుంటూ   మెట్ల కిందే నడిచేది. ఆ భాషకు ఇచ్చిన ప్రాముఖ్యం అది.  అది ఒకప్పటి జ్ఞాపకం.
పొతే, ఈమధ్య నెట్లో ఒక ఆసక్తికర సమాచారాన్ని మిత్రులు శ్రీ పీ.వీ.వీ.జీ. స్వామిగారు అమెరికా నుంచి  పంపారు. ఆ ఇంగ్లీష్ వార్తకు నా తెలుగు అనువాదం నా సొంత బాణీలో :    
ఒకానొకకాలంలో సూర్యుడు అస్తమించని సువిశాల సామ్రాజ్యానికి అది రాజధాని. అన్ని భాషలకు మాతృభాషగా పేరొందిన సంస్కృతం పరిఢవిల్లిన  అఖండ భారతాన్ని వందల సంవత్సరాలపాటు బానిస దేశంగా పాలించిన బ్రిటిష్ ప్రభువుల రాజధాని నగరం.  అలాటి ఇంగ్లీష్ గడ్డ అయిన లండన్ నగరంలో సంస్కృతాన్ని బోధించే పాఠశాల. వినడానికే విచిత్రం అనిపించినా ఇది నిజం. లండన్ లోని సెంట్ జేమ్స్ ఇండిపెండెంట్ స్కూల్లో సంస్కృత భాషా విభాగం అధిపతి వార్విక్ జేస్సప్ మాటల్లో మిగిలింది తెలుసుకుందాం.
"ప్రపంచం మొత్తంలో సంస్కృతంతో పోల్చచదగిన ఉత్కృష్టమైన భాష మరొకటి లేదు. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. జర్మన్ ప్రజలు జర్మన్ మాట్లాడతారు. మాట్లాడే ప్రజల పేరుతోనే ఆ భాషలకు నామకరణం చేసారు. సంస్కృతం ఒక్కటే మినహాయింపు. ఆ ఒక్క భాష చక్కగా నేర్చుకుంటే చాలు, సైన్సు, గణితం వంటి ఇతర అంశాలపై పట్టు చిక్కించుకోవడం సులభం అవుతుంది'   
ఇక ఆ స్కూలు హెడ్ మాష్టర్ పాల్ మాస్ గారు సంస్కృతం గురించి మరింత గొప్ప కితాబు ఇచ్చారు.
'దేవనాగరి లిపిలో రాయడం నేర్చుకుంటే విద్యార్ధులకు తమ చేతివేళ్ళపై గట్టి పట్టుచిక్కుతుంది. సంస్కృతంలో మాట్లాడడం  వస్తే ఇక ఆ నాలుకకు అడ్డే వుండదు. స్పష్టమైన ఉచ్చారణ అలవడుతుంది'  
పాల్ మహాశయులు అంతటితో ఆగలేది.ఇంకా ఇలా వివరించారు.
'యూరోపియన్ భాషలు మాట్లాడేవాళ్ళు నాలుకలో వుండే అన్నిభాగాలను  ఉపయోగించరు. నాలుక కొసతో మాట్లాడేస్తుంటారు. రాసేటప్పుడు కూడా వేళ్ళల్లోని అన్నికదలికలను వాడరు. అదే సంస్కృతం మాట్లాడడం అలవాటు చేసుకుంటే మెదడు చురుగ్గా పనిచేయడానికి అది దోహదం చేస్తుంది'
తోక టపా: ఈ ఇంగ్లీష్ స్కూల్లో సంస్కృతం సెకండ్ లాంగ్ వేజ్ గా తీసుకునేవాళ్ళు విధిగా ఆరేళ్ళపాటు ఆ భాషను అధ్యయనం చేయాల్సివుంటుంది. (మెట్ల కింద కాదు. చక్కటి తరగతి గదులు వున్నాయి) సంస్కృత విద్యార్ధులకు స్కూల్లో శాకాహార భోజనమే లభిస్తుంది.    


(సంస్కృతం నోటు పుస్తకం)


మరి ఇప్పుడు చెప్పండి. ఇంగ్లీష్ వాడు చెప్పాడు కనుక మనమూ సంస్కృతం గొప్పదని అనుకుందామా!

3 కామెంట్‌లు:

sarma చెప్పారు...

Earth is round

కమనీయం చెప్పారు...



ఇందులో చిత్రమేముంది?ఇంతకు పూర్వమే ఇంగ్లీషు,జెర్మన్ పరిశోధకులు ఈమాట చెప్పారు.వాళ్ళు చెప్పకపోయినా సంస్కృతం గొప్ప భాషే.

Sridevi చెప్పారు...

Idi kuda chudandi. Idi Indian originated kaadu http://www.vedicsociety.org/