21, మే 2012, సోమవారం

ఎవరికి నష్టం? ఆలోచించండి!



ఎవరికి నష్టం?  ఆలోచించండి!
ఎస్సెస్సీ లో ప్రధమ శ్రేణి. పీయూసీ లో కూడా మళ్ళీ మొదటి ర్యాంకే. ఐఐటీ ఎంట్రెన్స్ లో సేమ్ టు సేం ఫస్ట్ ర్యాంకే. ఆల్ ఇండియా ఐఐటీ కంప్యూటర్ సైన్స్ లో అదే వరస. అదే మొదటి ర్యాంకు. ఐఏఎస్ ఎంట్రెన్స్ పరీక్ష రాస్తే తిరిగి ఫస్ట్ ర్యాంకు. ఐఏఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కూడా మళ్ళీ మొదటి ర్యాంకే.


శ్రీ నారాయణస్వామి, ఐ.ఏ.ఎస్.

చదువుల్లో  ఎక్కడా ఎప్పుడూ ‘ఫస్ట్ ర్యాంక్’ మిస్సు కాని ఈ చెన్నై ఐఐటీ కుర్రాడి పేరు నారాయణస్వామి. అక్కడ పట్టా పుచ్చుకున్న వెంటనే స్వామికి అమెరికా లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ – మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఆహ్వానం అందింది. స్కాలర్ షిప్ తో కూడిన సీటు వచ్చింది.
కానీ నారాయణ స్వామి రూటే వేరు. అతడు ఆలోచించే తరహానే వేరు. అందుకే అతడు నారాయణ స్వామి అయ్యాడు. ఈనాడు ఇంతగా చెప్పుకోదగ్గ మనిషి అయ్యాడు.
స్వామిది మధ్య తరగతి కుటుంబం. తన ఐఐటీ చదువుపై  ప్రభుత్వం  లక్షలు ఖర్చు పెట్టిందని తెలుసు. ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో కూడా తెలుసు. తనలాటి వాళ్లు, తన కంటే పేద వాళ్లు ప్రత్యక్షంగా పరోక్షంగా సర్కారుకు చెల్లించిన పన్నులు తన చదువుకు ఉపయోగపడ్డాయని తెలుసు. అందుకే రెక్కలొచ్చిన పక్షి మాదిరిగా స్వదేశాన్ని వొదిలి విదేశాలకు  పోకుండా ఇక్కడే వుండిపోయి  ‘తల్లి పాల రుణం’ కొంతయినా తీర్చుకోవాలని సంకల్పించుకున్నాడు. అందుకే ఐఏఎస్ ఆఫీసర్ అయి ప్రజలకు తన చేతనయిన  సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఐఏఎస్ అనే మూడు అక్షరాలను  తన పేరుకు జోడించుకోవడం ద్వారా ప్రజాసేవకు ద్వారాలు తెరుచుకుంటాయని అనుకున్నాడే కాని, ఆ పదవిని వాడుకుని తన ద్వారా  నల్ల ధనం సంపాదించాలనే  నల్ల తాచులు తన చుట్టూ  పొంచి వుంటాయని మాత్రం వూహించలేక పోయాడు.
సబ్  కలక్టర్ గా మొదటి పోస్టింగ్ లోనే అతడికి ఐఏఎస్ గురించిన కన్న కలలన్నీ  కల్లలేనని తేలిపోయింది.తను అనుకున్నది అనుకున్నట్టు  చేయడం కాకుండా ఎవరో అనుకున్నది వాళ్లు అనుకున్నట్టు చేయడమే  అధికారిగా తన విధి అని అర్ధం అయింది. అయినా స్వామి తన తీరు మార్చుకోలేదు. తన దారి మార్చుకోలేదు. తనను తమ అదుపాజ్ఞల్లో వుంచుకోవాలని చూసిన అనధికార శక్తులకు పంటి కింద రాయిలా మారాడు. వారికి కంటి మీద కునుకు లేకుండా చేసాడు.
ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారితో మొదలయిన ఈ కయ్యం స్వామిని పేద ప్రజల దృష్టిలో దేవుడిని చేస్తే, రాజకీయనాయకుల దృష్టిలో ఎందుకూ పనికిరాని అధికారిగా ముద్ర వేసింది.
అల్లుడు జిల్లా కలెక్టర్ కాబట్టి తనని ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో స్వామి మామగారు తన ఇంటి స్థలం చుట్టూ అనుమతి లేకుండా  ప్రహరీ గోడ కట్టాడు. ఆ గోడ కారణంగా తమ కాలనీ నుంచి రాకపోకలకు వీలులేకుండా పోతోందని కొందరు బీదా  బిక్కీ కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్నారు. తనిఖీ చేసిన స్వామి, మామగారు కట్టించిన గోడను పడగొట్టించాడు. ఫలితం. ఇంట్లో గొడవలు, భార్యతో కలతలు. చివరికి విచ్చిన్నమయిన కాపురం.        
పేద ప్రజలు నివాసం వుండే ఒక ప్రాంతంలో వరదల వల్ల భయం లేకుండా ఒక కరకట్ట నిర్మించారు. కట్ట నిర్మించిన కంట్రాక్టర్ ఎనిమిది కోట్లకు బిల్లు పెట్టాడు. నిర్మాణంలో లొసుగులు వున్నాయని అనుమానించిన నారాయణ స్వామి బిల్లును చెల్లించకుండా వర్షాకాలం వచ్చేవరకు నిలుపు చేయించాడు. నాలుగు వానలు పడ్డాయో లేదో కరకట్ట ఆనమాలు లేకుండా పోయింది. కంట్రాక్టర్ పత్తా లేకుండా పోయాడు. ఆవిధంగా   ప్రజాధనం ఎనిమిది కోట్లు కాపాడి ప్రజల అభిమాన ధనం సంపాదించుకోగలిగాడు కానీ  అదేసమయంలో అనేక మంది శత్రువులను కూడా సంపాదించుకున్నట్టయింది.       
     ఇంతలో మరో పరిణామం. వూళ్ళో ఒక  మద్యం వ్యాపారి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పదకొండు కోట్ల రూపాయలు ఎగగొట్టాడు. స్వామి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి అతడి గోళ్ళూడగొట్టి బాకీ వసూలు చేసాడు. అవతల వాడు సామాన్యుడు కాదు. నిమిషాల మీద ఓ మంత్రి ఫోను. కుదరదని స్వామి సమాధానం. పర్యవసానం క్షణాల మీద బదిలీ,  పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాల సంరక్షకాధికారిగా.
విసుగు చెందిన స్వామి కేంద్ర సర్వీసులకు వెళ్ళాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఆ అభ్యర్ధనను కూడా తిరస్కరించింది.
ఎంతో చేద్దామనుకుని వచ్చి  ఏమీ చేయలేని నిస్సహాయ స్తితిలో స్వామి ఉద్యోగం వొదిలి పెట్టాలని నిర్ణయానికి వచ్చాడు. పారిస్ లో ఐక్యరాజ్యసమితి ఉద్యోగం ఆఫర్ కూడా వచ్చింది. స్వామిలాంటి  వారికి ఉద్యోగాల కొరత వుండదు. బయట ఎక్కడయినా వారిని నెత్తిమీద పెట్టుకుంటారు.
స్వామి లాటి అధికారి వెళ్లిపోతున్నాడంటే  రాజకీయులకు చీమకుట్టినట్టుకూడా వుండదు. పైపెచ్చు తమ ఆటలకు అడ్డూ అదుపూ వుండదని సంతోషిస్తారు కూడా.
అయితే జనాలకు ఏదో చేద్దామని ఆశ పడ్డ స్వామి లాటి అధికారులను కాపాడుకునేందుకు మనం ఏమీ చెయ్యలేమా? అన్నదే ప్రశ్న. వారి బదిలీ ఆపే అధికారం జనాలకు లేకపోవచ్చు. అలా బదిలీ చేసే రాజకీయులు  తిరిగి  ఎన్నిక కాకుండా చేయగల -  ‘వోటు’ అనే ‘పాశుపతాస్త్రం’ - జనం చేతిలోనే వుందన్న విషయం మాత్రం మరచిపోకూడదు.
ఏమంటారు? కాస్త ఆలోచించండి. (21-05-2012)     

10 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

the system itself is so corrupt that nobody can repair it. even the public are no less corrupt. nobody can save this country.

అజ్ఞాత చెప్పారు...

Hello mister,

Don't so pessimistic, atleast One day these things will change, For that we need to be perfect.

India Lover

అజ్ఞాత చెప్పారు...

I agree with puranapandaphani, Our system is completely corrupted. No way you can repair it. No body raise their voice against corruption, no body cares about others...
India is the best example why democracy is failed..
:venkat

అజ్ఞాత చెప్పారు...

dear india lover...

i am not pessimistic. it is the realty. unfortunately, realty is always close to pessimism.

అజ్ఞాత చెప్పారు...

మారదు అనుకొని చేతులు ముడుచుకొని కూర్చుందామా, నేను సైతం అంటూ కనీసం వోటు ద్వారా చెయ్యగలిగినంత చేద్దామా?. ఆరంభింపరు... పద్యం గుర్తుకు వస్తోంది. పోనీ వేరే మార్గం ఏమన్నా వుందా?. లేనప్పుడు ఈ నిరాశావాదం తో ఏమీ జరగదని జోస్యాలు ఎందుకు

అజ్ఞాత చెప్పారు...

రాజకీయ పార్టీలు టికెట్స్ ఎలా ఇస్తాయో అందరికి తెలిసిందే. పైసా ఖర్చు పెట్టకుండా ఎవడికొస్తుంది.
నైతిక విలువలు కొంచెం కూడా లేకుండా అందరు అడ్డంగా తినడానికి ఎగబడుతుంటే ఎవరికీ చెప్తాం. ఒకడు తప్పు చేస్తే పది మంది చెప్తారు. పది మంది తప్పు చేస్తే ఒకడెలా చెప్తాడు. అర్హులకి అందవలసిన ప్రయోజనాలు అనర్హులకి అన్డుతుంటే , ఎదిరించిన వాడు ఒంటరి అయిపోతుంటే ఎవడు మాత్రం ఎం చేస్తాడు. మెల్లిగా అక్కడ నుండి తప్పుకుంటాడు.
:venkat.

అజ్ఞాత చెప్పారు...

ఇది చాలా బాధాకరమైన విషయమైనప్పటికీ, మన దేశంలో మాములే అన్నంతగా అలవాటైపోయింది. మాకు విజయవాడలో "ఊరు బాగుపడాలంటే మంచి కమీషనరు వచ్చినప్పుడే".... అన్న అభిప్రాయం ఉన్నది. ఇంకా ఓట్లు వేసి ఏ పనికి మాలిన వాళ్ళని గెలిపించాలి...? చాలా సార్లు మంచి పనులు చేసే కమీషనర్లకి అడ్డం వచ్చిన ప్రజా ప్రతినిధులే ఉన్నారు. ప్రజల పనులన్ని ఆయనే చెసేస్తే మేమెందుకని ఒక మహిలా ఎం.ఎల్.ఏ వీరాంగం కూడా వేసి అతనిని ట్రాన్స్‌ఫర్ చేయించేదాకా పట్టువీడలేదు. కేవలం "డబ్బులు సంపాయించటానికే రాజకీయం"....... "బ్రతుకుతెరువుకోసమే గవర్నమెంటు ఉద్యోగం" అన్న భావన పోనంత వరకూ ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు.

అజ్ఞాత చెప్పారు...

అటువంటివాడుంటే మాకెంత నష్టం? తిను తినిపించు, బతుకు, బతికించు ఇది కదండీ కావల్సింది. ప్రజలెలా పోతే మనకెందుకు? మన ఇల్లు అంటుకోలేదుగా? ఆయ్ ఉంటానండీ!! తెలీక వాగేనండీ!!!

అజ్ఞాత చెప్పారు...

IIT graduate అయివుండి, IAS చేయడం ఎందుకు?... చేసితివిపో... బురదలో పడిందే కాక ఆ బురదను ప్రక్షాళన చేసే పిచ్చి ఆలోచనలెందుకు? ఆలోచించితివిపో ఏదో ప్రజాకర్షక మైన పనులు చేసి, జర్నలిస్టులకు తాగించి, పేపర్లో పేరొచ్చేలా చూసుకోక మామ ఇంటి గోడ కూల గొట్టించడమెందుకు? ఇంతా చేసి ఏమీ తెలియనట్టు UN వెళ్ళడమెందుకు? ... ఏమిటో!

నారాయణ స్వామి UNలో వెళ్ళి మంచిపని చేశాడండి. అక్కడైనా బుద్ధిగా వుంటాడని ఆశిద్దాం. :P ఈ ఎదవ IAS పనులు చేయడానికి ర్యాంకర్ల అవసరంలేదనీ, ఏ పదోతరగతి ఫెయిలైన గుమాస్తా చాలుననీ జైల్లో వున్న ఛీలచ్చి, దొంగాచార్యలనడిగితే చెప్పేవారుగా! :P

kastephale చెప్పారు...

మిత్రులు శ్రీనివాసరావు గారు,
మీ స్ఫూర్తితో ఒక టపా రాస్తున్నాను. ఆశీర్వదించి,అనుమతించగలరు