13, మే 2012, ఆదివారం

‘అరవై ఏళ్ళ’ బాలిక




అరవై ఏళ్ళ’ బాలిక  
నిజంగా ఆశ్చర్యం వేసింది అప్పటి’ కన్ను ఒకటి ఇంకా చూస్తున్నదని ఈ రోజు పత్రికల్లో చదివినప్పుడు. ఆనాటి మహత్తర చరిత్రను కళ్ళారా వీక్షించిన ఆ నేత్రం’ ఈ నాటి పరిస్తితులను చూస్తూ యెంత కన్నీరు పెట్టుకుంటున్నదో అన్న బాధ మనసును కలచి వేస్తోంది.
ఆయన వయస్సు ఇప్పుడు 92  ఏళ్ళు. పేరు కందాల సుబ్రహ్మణ్యం అలియాస్ తిలక్. భారత పార్లమెంటు ఏర్పడి రేపటికి అంటే మే 13  తేదీకి అరవై ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో తొలి సభలో సభ్యులుగా వున్నవారిలో ఇంకా ఎవరయినా బతికున్నారా అని కాగడా వేసి వెతుకుతుంటే అలాటి వారు మొత్తం దేశంలో నలుగురే నలుగురు  కనిపించారు. వారిలో ఒకరు  ఈ కందాల సుబ్రహ్మణ్యం గారు. విజయనగరం మాజీ ఎంపీ.
ఈ చారిత్రిక ఘట్టాన్ని పురస్కరించుకుని లోక సభ స్పీకర్ మీరా కుమార్ మే 13  వ తేదీ  కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని తలపెట్టారు. ఈ నేపధ్యం లోనే సుబ్రహ్మణ్యం గారికి ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. తెలుగు ప్రజలకు లభిస్తున్న అపూర్వ గౌరవం ఇది.
శ్రీ సుబ్రహ్మణ్యం తొట్టతొలి లోక్ సభకు ఎన్నికయిన 499  సభ్యులలో ఒకరు.  ఆనాటి సభ్యులలో వీరికి మరో విశిష్టత కూడా వుంది. అప్పుడు జరిగిన తొలి పార్లమెంటు ఎన్నికల్లో దేశం మొత్తం మీద అత్యధిక మెజారిటీ తో గెలిచిన మొదటి ముగ్గురిలో శ్రీ సుబ్రహ్మణ్యం కూడా ఒకరు. జవహర్లాల్ నెహ్రూ మొదటి స్థానం దక్కించుకోగా మన రాష్ట్రానికే చెందిన రావి నారాయణ రెడ్డి గారు రెండో స్థానాన్నిసోషలిస్టు పార్టీ తరపున నిలబడ్డ శ్రీ సుబ్రహ్మణ్యం అలియాస్ తిలక్ మూడో స్థానం సంపాదించు కున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యం ప్రత్యర్దులెవ్వరికీ డిపాజిట్లు కూడా దక్కలేదు. ఆ ఎన్నికల్లో నిలబడేటప్పుడే ప్రజలకు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఆయన మరోసారి ఎప్పుడూ ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా విశాఖ పట్నం దగ్గర సామాన్య జీవితం గడుపుతూ వస్తున్నారు.
అలాటి మహోన్నత వ్యక్తికి శిరసువంచి పాదాభివందనం చేయాలి.
అలాగే ఈ గౌరవ పురస్కారాన్ని అందుకుంటున్న మరో తెలుగు తేజం కానేటి మోహన రావు గారు.
పోతేఈ అరవై  ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో పార్లమెంటు సాధించిన విజయాలను సమీక్షించుకోవడంలోటుపాట్లను సరిదిద్దుకోవడం అవసరం. ఒక్కసారి ఆగి వెనక్కు తిరిగి చూసుకుంటే కనిపించే దృశ్యం ఏమిటి?

స్వాతంత్ర్య దినోత్సవాలుగణతంత్ర దినోత్సవాల సందర్భంలో  సైనిక కవాతులుశస్త్రాస్త్ర ప్రదర్శనలుభారీ టాంకులువైమానిక దళ విన్యాసాలతో ఎలాంటి పరిణామాలనయినా ఎదుర్కోగల యుద్ధ సన్నద్ధతనుజాతి సంసిద్ధతను ఒక పక్క ప్రదర్శిస్తూనే మరో పక్క బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి నాయకులు చేసే ప్రసంగాలు వినవలసి రావడం యెంతటి  విషాదం?
శాంతి భారతంగా పేరొందిన భారతదేశంలో ఈనాడు ఎక్కడ ఏమిజరుగుతుందోఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్తితి పొటమరించడం యెంతటి  దారుణం?
మతమన్నది మనకంటికి మసకయితే
కులమన్నది మనకంటికి కురుపయితే
మతం వద్దు కులం  వద్దు మారణ హోమం వద్దు అన్న సూక్తులను వొంటబట్టించుకుని ఎదిగిన ఓ తరం ఈనాటి పరిస్తితులను చూసి – మనం కోరుకున్న స్వేఛ్చా భారతం ఇదేనా  అని మధనపడాల్సిరావడం మరెంతటి దుస్తరం?
మతాల దురభిమానాలతోకులాల కుంపట్లతోప్రాంతీయ ద్వేషాలతో దేశం  యావత్తు అడ్డంగా నిలువుగా చీలిపోతుంటే-
స్వార్ధమే పరమావధిగాసంపాదనే ఉపాధిగాఅడ్డదారుల్లో అందినంత స్వాహా చేయడమే అంతిమ లక్ష్యంగా నీతికి దూరంగాఅవినీతికి ఆలంబనగా తయారయిన రాజకీయ దళారులంతా కలసి కుమ్మక్కై  జాతి సంపదను నిస్సిగ్గుగా కొల్లగొడుతుంటే-
జనరంజకంగా పాలించాల్సిన అధికార  యంత్రాంగం లంచాల మత్తులోపడి ప్రజల రక్తం పీలుస్తుంటే -
రాజ్యాంగం ఏర్పరచిన అన్ని వ్యవస్తలు మారుతున్న కాలానికి అనుగుణంగా విలువలను నిలువు పాతర వేసి కుప్పకూలి  కునారిల్లుతున్న సమయంలో, ‘నేనున్నానంటూ’ జనాలకు వెన్నుదన్నుగా నిలబడాల్సిన మీడియా సయితంతానూ ఆ తానులో ఓ ముక్కగా మారిపోతుంటే 
నిస్సహాయంగా జనం చూడాల్సి రావడం యెంత విషాదంయెంత దారుణంయెంత దుస్తరం, యెంత బాధాకరం?  

అయితే ఏమిటట?

నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టేప్రపంచం గర్వించదగిన   గొప్ప లక్షణాలను కూడా స్వతంత్ర భారతం తన కొంగున ముడివేసుకుంది. 1947 లో మన దేశంతో పాటే స్వేఛ్చా వాయువులు పీల్చుకున్న అనేక ఆసియా దేశాలుఇరుగు పొరుగు దేశాలు ఈ అరవై ఏళ్ళలో కొంతకాలం పాటయినా ప్రజాస్వామ్య పధాన్ని వీడి నియంతృత్వపు బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినామరెన్ని వొత్తిడులకు గురయినాఅప్రతిహతంగా ఎంచుకున్న మార్గంలోనే పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్తానాన్ని పదిలం చేసుకుంది.


జనాభాలో అత్యధిక భాగం నిరక్షర కుక్షులయినా 'వోటుఅనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగల సత్తా వారి సొంతం. అక్షర జ్ఞానం లేకపోయినాకానులూఏగానులనుంచిబేడలూ అర్ధణాల నుంచి నయా పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనంవారి ఆస్తి. గిద్దెలుసోలలు, శేర్లుసవాశేర్లు, మానికెల కొలతలనుంచి లీటర్లకు అతి తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర వారిది. అలాగే, వీసెలుమణుగులనుంచి కిలోగ్రాములకుబస్తాలనుంచి క్వింటాళ్లకు,  'మైలు రాళ్ళనిఅధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా కిలోమీటర్ల లెక్కల్లోకి మారిపోకుండా పాతకాలంలోలా   ఇంకా మైలురాళ్ళదగ్గరే ఆగిపోయిన సంగతి ఇక్కడ గమనార్హం.
చదువూసంధ్యా లేని వాళ్లనీఎందుకు  పనికిరాని వాళ్ళనీ  ఇతర దేశాల వారికి మనపై చిన్నచూపు. కానీ అలాటి మనవాళ్ళు - దేశానికి స్వాతంత్రం రాగానే నిర్వహించిన తొలి ఎన్నికల్లో పార్టీల గుర్తులున్న పెట్టెలలో వోటు వేసే దశను అలవోకగా దాటేసారు. ఆ తరువాత  ఒకే బాలట్ పేపరుపై  ముద్రించిన అనేక పార్టీల  గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని అతడి గుర్తుతోనే   గుర్తుపట్టి  వోటు వేయగల పరిణతిని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా అధునాతన  ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని అలవరచుకోగలిగారు.

'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణంఅనే నిర్లిప్త స్తితిని అధిగమించి ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో భారతీయుల ముద్ర స్పుటంగాప్రస్పుటంగా ప్రపంచ వ్యాప్తంగా కానరాగల అత్యున్నత శిఖరాలకు మన దేశం చేరుకోగలగడం స్వతంత్ర భారతం సాధించిన మరో ఘనత.


'చందమామ రావేఅంటూ పాటలు పాడే స్తితి నుంచి 'చంద్రయాన్వరకు ఎదగగలిగాము. అంతరిక్ష పరిశోధనల్లో అభివృద్ధి చెందిన  దేశాల సరసకు చేరగలిగాము. సుదూర లక్ష్యాలను చేధించగలిగిన అధునాతన రక్షణ  క్షిపణులను అంబుల పొదిలో చేర్చుకోగలిగాము. సస్య విప్లవం విజయవంతం చేసుకుని ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్తితి తప్పించుకుని స్వయం సమృద్ధిని సాధించుకోగ లిగాము.       

ఏ ఇంగ్లీష్ వారితో తలపడిఅహింసా మార్గంలో వారితో  పోరాడి స్వతంత్రం సంపాదించుకున్నామోఆ ఇంగ్లీషు వారి భాషనే ఆయుధంగా చేసుకుని - దేశ దేశాలలో కంప్యూటర్ రంగాన్ని మన కనుసన్నలతో శాసించగలుగుతున్నాము.  

అయితే ,అంగట్లో  అన్నీవున్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత మాదిరిగా ఎక్కడో ఏదో లోటు జనం మనస్సులని కుదిపేస్తోంది. ఆరు దశాబ్దాల పై చిలుకు కాలంలో సాధించిన అభివృద్ధి అంతా అడవిగాచిన వెన్నెల అవుతున్నదేమో అన్న శంక కలవరపెడుతోంది.

వెడుతున్న దోవ మంచిదే. కానీనడుస్తున్న కాళ్లే తడబడుతున్నాయి. ఒకదానికి మరొకటి అడ్డంపడి గమ్యాన్ని మరింత దూరం చేస్తున్నాయి.

వినిపిస్తున్న సందేశం మంచిదే. విభిన్న స్వరాలే అపస్వరాలతో అసలు అర్ధాన్ని మార్చి వేస్తున్నాయి.

అందరూ మంచివాళ్ళే. కానీ మానసిక కాలుష్యమే  వాళ్ళ మంచితనాన్ని మంచులా కరిగించి వేస్తోంది.

స్వార్ధం ముందు నిస్వార్ధం తలవంచుతోంది. అధికారం అన్నదే పరమావధిగాధనార్జన అన్నదే అంతిమ ధ్యేయంగా - అవలక్షణలక్షిత సమాజం రూపుదిద్దుకుంటోంది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ రకమయిన పరిణామాలు అనివార్యంఅతి సహజం. అయితే అవి  తాత్కాలికం కావాలి. శాశ్వితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం అందరిదీ.

ఒకరిపై మరొకరు నెపాలు మోపకుండాతప్పులు దిద్దుకోగలిగితే మార్పు అనివార్యం.

ఈ శుభసమయంలో  మనమందరం జాతికి కలసికట్టుగా ఇవ్వాల్సిన కానుక అదే.

-భండారు శ్రీనివాసరావు  (13-05-2012)

1 కామెంట్‌:

tarakam చెప్పారు...

well said.let's hope for the best.