5, నవంబర్ 2017, ఆదివారం

భాగవత సప్తాహం – భండారు శ్రీనివాసరావు


మరణం తధ్యమని తెలిసిన పరీక్షిత్తు ఏం చేశాడు ? శుక మహర్షి ఆధ్వర్యంలో భాగవత సప్తాహంలో  శేషజీవితాన్ని గడిపాడు.
దాదాపు ఇదే మాదిరి వృత్తాంతం విశాఖ నుంచి వినవచ్చింది. కాకపొతే ఇది జరిగి నలభయ్ అయిదేళ్ళు గడిచాయి.
భాగవతుల పరమేశ్వర రావు గారి అసలు ఇంటి పేరు ఇదో కాదో తెలవదు. కానీ ఇదే పేరు అలా నిలబడి పోయింది. దానికి కారణం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆ కుటుంబం ఇచ్చే చేయూత.
ఉత్తరాంధ్రలో వారిది  బాగా కలిగిన కుటుంబం. తల్లి సీతమ్మ గారు వయో వృద్ధులు. మరణ సమయం ఆసన్న మైందని ఆవిడగారికెందుకో తోచింది. కొడుకును పిలిచింది. ఆస్తిపాస్తుల అప్పగింత కోసం కాదు, చెవులు వినబడుతూ ఉండగానే ధార్మిక ప్రవచనాలు వినాలని ఉందన్న తన మనోభీష్టాన్ని కుమారుడికి ఎరుక పరిచింది.
ఆయన కూడా తల్లికి తగ్గ కుమారుడు. పైగా సంపన్న కుటుంబం. కన్న తల్లి కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నాడు. పరీక్షిత్తుకు శుక మహర్షి మాదిరిగా తల్లికి ఆధ్యాత్మిక ప్రవచానాలు వినిపించగల సమర్ధుడు ఎవ్వరన్న మీమాంస మొదలయింది. ఆ ప్రశ్నకు శ్రీ భాష్యం  అప్పలాచార్య స్వామి రూపంలో సమాధానం లభించింది. శ్రీరామ నవమి నాడు జన్మించిన అప్పలాచార్య సంస్కృతాంధ్ర భాషల్లో నిష్ణాతులు. ఉగాది పర్వదినం నాడు మొదలు పెట్టి శ్రీరామనవమి  వరకు  విశాఖ  గురజాడ కళాక్షేత్రంలో తొమ్మిది రోజులపాటు రామాయణ ప్రవచనాలు చేసేవారు. ఆ విధంగా ఆ ప్రాంతంలో ఆయన ప్రసిద్ధులు. శ్రీ భాష్యం వారిని పరమేశ్వర రావు గారు  తమ స్వగ్రామానికి ఆహ్వానించారు. పరీక్షిత్తుకు ఏడురోజుల్లో మరణం తధ్యం అని తెలిసిపోయింది  కాబట్టి భాగవత సప్తాహంతో ఆ కార్యక్రమం పూర్తయింది. అప్పలాచార్య స్వామి   త్రి సప్తాహం అంటే మూడు ఏళ్ళు  ఇరవై ఒక్క రోజులు భాగవత పారాయణం చేశారు.

తన ఆఖరి కోరిక తీరిన తరువాత  కొంత కాలానికి ఆవిడ కాలం చేశారు. పరమేశ్వర రావు గారికి ఆ సత్కార్యాల ఫలితంగా భాగవతం ఇంటి పేరుగా మారి భాగవతుల పరమేశ్వర రావుగా మారారు. 
త్రి సప్తాహం నిర్వహించిన శ్రీ భాష్యం  వారిప్పుడు లేరు. కీర్తిని మిగిలించుకుని  నిజమైన కీర్తిశేషులయ్యారు.  

4, నవంబర్ 2017, శనివారం

మంత్రి కేటీఆర్ ధారణశక్తి – భండారు శ్రీనివాసరావు


తెలంగాణా మునిసిపల్ వ్యవహారాలు, ఐ.టీ. శాఖల మంత్రి శ్రీ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) బీబీసి తెలుగు ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దాదాపు ముప్పయి నిమిషాల పాటు సాగింది. బీబీసి తరహాలోనే విలేకరుల బృందం ప్రశ్నలు సంధించింది. వాటికి కేటీఆర్ తనదయిన శైలిలో తడబాటు లేకుండా సమాధానాలు ఇచ్చారు. ఇందులో వింతేమీ లేదు. కాకపోతే చివర్లో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎప్పుడో ఏడాది క్రితం నేను ఫేస్ బుక్ లో రాసిన ఒక కధనాన్ని నా పేరుతొ సహా (ముమ్మారు) ప్రస్తావించడం నన్ను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఇంటర్వ్యూ ను చూసిన టైమ్స్ ఆఫ్ ఇండియా సీనియర్ కరస్పాండెంట్, మిత్రుడు సుశీల్ రావు ఆ సంగతి నాకు తెలియచేశారు. ఢిల్లీలో బీబీసీ తెలుగు విభాగంలో పనిచేస్తున్న మరో మిత్రుడు శ్రీధర్ బాబు సంబంధిత లింక్ నాకు పంపారు. వారిద్దరికీ నా కృతజ్ఞతలు. కేటీఆర్ ధారణశక్తికి నమోవాకాలు.

2, నవంబర్ 2017, గురువారం

నవ్వండి! నవ్వించండి!! – భండారు శ్రీనివాసరావు

నిదానంగా చదవండి....... ఖచ్చితంగా నవ్వితీరుతారు మీ గురించి 5 మాటలు మీరు You You You You You You You You You You You You You You You You You You You.... 1. మీరు పరమ పరమ బద్ధకస్తులు ... ఎందుకంటే అన్ని You లను మీరు చదవలేదు.. 2. You ల మధ్యలో ఒక Yoo కూడా ఉంది. దాన్ని మీరు గమనించలేదు. 3 .జస్ట్ ఇప్పుడే మీరు Yoo కోసం వెతికారు. 4. మీ మొఖం ఎర్ర బడు తోంది.. అక్కడ Yoo లేదని... మీ గురించి 13 నిజాలు చెబుతాను.......... 1.మీరిప్పుడు మొబైల్ పట్టుకుని ఉన్నారు.... 2 మీరిప్పుడు whats up చూస్తున్నారు 3. whats up లో నా మెసేజ్ చదువుతున్నారు 4. ఈ నాలుగో వాక్యం ఇంతకు మునుపెప్పుడూ చదవలేదు 5. మీరు ఒక మనిషి 7. P ని మీరు మీపెదవులను కలపకుండా పలకలేరు 8. ఇప్పుడే దానిని మీరు ప్రయత్నించారు 9. మీలో మీరు చిన్నగా నవ్వుకుంటున్నారు 10.ఇప్పుడు మీ నవ్వు మరికాస్త ఎక్కువయ్యింది 11.మీరు 6 వ పాయింట్ చదవలేదు 12.ఇక్కడ 6 వ పాయింట్ లేదన్న విషయం మీకు ఇప్పుడే తెలిసింది. 13.మీరు ఇప్పుడు నవ్వుతున్నారు.. ఈ మెసేజ్ ని మీ ఫ్రెండ్స్ కి ఫార్వార్డ్ చేసి వాళ్ళని కూడా నవ్వించాలి.... అనుకుంటున్నారు... (నా లాగా) (అవునా? కాదా?)

(యధారీతి ఒక ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)

23, అక్టోబర్ 2017, సోమవారం

వార్తలపై పెత్తనం ఎవ్వరిది, సంపాదకుడిదా? యజమానిదా? – భండారు శ్రీనివాసరావు



పత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా?
ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నే కాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను  అదుపు చేసే అధికారం కూడా వుంటుంది.
అయితే ఇది ఇప్పటి విషయం కాదు. కొంచెం అటూ ఇటూగా  మూడు దశాబ్దాలు గడిచాయి.
అప్పటి ఆంద్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్.
విజయవాడలో రంగా హత్య దరిమిలా జరిగిన విధ్వంస కాండపై,  రామోజీరావు గారు చైర్మన్ గా ఉన్న ఎడిటర్స్ గిల్డ్  ఒక నిజనిర్ధారణ కమిటీ వేసింది. కుల్ దీప్ నాయర్,  చెన్నై ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ జగన్నాధన్ తో  పాటు  ఆంధ్రప్రభ ఎడిటర్ హోదాలో పొత్తూరి వెంకటేశ్వర రావు గారు కూడా అందులో ఒక సభ్యులు.  పొత్తూరివారు విడిగా బెజవాడ వెళ్లి పరిస్తితులను పరిశీలించి   ఒక నివేదిక  పంపారు. అది ఎలా చేరిందో ఇండియన్ ఎక్స్ ప్రెస్   అధినేత రామనాద్ గోయంకాకు చేరింది. అది ఆయనకు రుచించినట్టు లేదు. వెంటనే వెంకటేశ్వర రావు గారికి ఒక లేఖ పంపారు. ‘మీ  నివేదిక నాకు దిగ్భ్రాంతితో కూడిన నిరుత్సాహాన్ని కలిగించింది’ (I am appalled with your report) అన్నది దాని సారాంశం. గోయంకా యజమాని. పొత్తూరి వారు ఆయన దగ్గర ఒక ఉద్యోగి. అయినా అలా ఉత్తరం రాయడం ఆయనకు నచ్చలేదు. వెంటనే నిరసనగా రాజీనామా లేఖ గోయంకాకు పంపించారు.
గోయంకా నుంచి పిలుపు వచ్చింది, మద్రాసు వస్తున్నాను అక్కడికి రమ్మని. పొత్తూరిగారు వెళ్ళారు.
 “నా ఎడిటర్ అభిప్రాయంతో విబేధించే స్వేచ్చ నాకు లేదా?” అని సూటిగా అడిగారు, రాజీనామా విషయం ప్రస్తావించకుండా గోయంకా. (Don’t I have the freedom to differ with my editor?)
ఇంకా ఇలా అన్నారు.
“మన పత్రికలో పాఠకుల ఉత్తరాలు ప్రచురిస్తాము కదా. పత్రిక విధానాలతో విబేధించే ఉత్తరాలు కూడా వేస్తుంటాం. యజమానిగా ఒక విషయం మీ దృష్టికి తెచ్చాను. అది మీకు నచ్చలేదు. సరే! ఒక సాధారణ పాఠకుడికి వుండే ఈ వెసులుబాటు కూడా ఒక యజమానిగా నాకు లేదా చెప్పండి”
ఇలాంటి యజమానికి ఏ సంపాదకుడు అయినా ఏం జవాబు చెబుతారు.
అందుకే గుంభనగా వుండిపోయారు. రాజీనామా విషయం పట్టుబట్టలేదు.
గోయంకానే స్వయంగా రాజీనామా లేఖ పొత్తూరి వారి చేతిలో పెట్టి సాదరంగా సాగనంపుతూ అన్నారు.
“మీరు ఎడిటర్ గా ఉన్నంత కాలం మీరు మీ అభిప్రాయాలనే రాస్తూ వుండండి”

17, అక్టోబర్ 2017, మంగళవారం

తీరు మారుతున్న పార్టీ మార్పిళ్లు


పార్టీ మార్పిడుల విషయంలో వార్తల స్క్రోలింగులు వారాల తరబడి సాగుతాయి ఇలా:
పార్టీ మారాలనే ఆలోచనలో పలానా
పార్టీ మారే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన పలానా
పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను ఖండించిన పలానా
తుది శ్వాస వరకు పార్టీలోనే కొనసాగుతానని  స్పష్టం చేసిన పలానా
పార్టీ అధినాయకత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసిన పలానా
నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైతే తీవ్ర నిర్ణయాలు తప్పవంటున్న పలానా
అధికార పార్టీ అగ్రనేతతో సమావేశమైన పలానా
దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదంటున్న పలానా
ఏ నిర్ణయమైనా కార్యకర్తలతో చర్చించి నిర్ణయిస్తానన్న పలానా
రేపోమాపో పార్టీ మారనున్న పలానా
పార్టీ మారి కొత్త కండువా కప్పుకున్న పలానా

( కొన్ని రోజుల పాటు వార్తల్లో ఉండడానికి ఇదొక కొత్త టెక్నిక్ అని గిట్టని వారి ఆరోపణ) 

14, అక్టోబర్ 2017, శనివారం

కేవలం తెలుసుకోవాలన్న జిజ్ఞాస మాత్రమే! – భండారు శ్రీనివాసరావు


మా బావగార్లలో ఇద్దరు శ్రీ అయితరాజు రామారావు (వల్లభి), శ్రీ కొలిపాక రామచంద్ర రావు (రెబ్బారం) స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఖమ్మం జిల్లాలో బ్రిటిష్ వ్యతిరేక ఆందోళనలు నడిపి పద్నాలుగు మాసాలకు పైగా కఠిన  జైలు శిక్ష అనుభవించారు. మహాత్ముని బోధనలకు ప్రభావితులై తమ గ్రామాల్లో అంటరానితనాన్ని నిర్మూలించే విషయంలో గ్రామీణులను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించేవారు. వున్నవాళ్ళు, లేనివాళ్ళు అనే తేడా లేకుండా వూరివాళ్ళతో రోజంతా తిరిగొచ్చి మళ్ళీ ఇంట్లో అనుష్టానాలు చేసేవాళ్ళు. అన్ని కులాలవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో స్వేచ్చగా మసిలేవాళ్ళు. భోజనాలు చేసేవాళ్ళు. అందరూ వాళ్ళది కాంగ్రెస్ మడి’ అనే వాళ్ళు. పెద్ద బావగారు అయితరాజు రామారావు గారు  వాళ్ళ వూరు వల్లభిలో ఏకంగా ఒక హరిజనుడిని రామాలయ పూజారిగా నియమించారు. ఆ రోజుల్లో అదొక సంచలన వార్త.  మా నాన్నగారు మా వూరు కంభంపాడు  కరణం. ఆయన దగ్గర పనిచేసే వెట్టి వాళ్ళు ఇంట్లోకి రాకుండా ఇంటి ముందు వాళ్ళకోసం ఒక చావిడి లాంటిది వుండేది. ఆయన మరణించిన తర్వాత కరణీకం బాధ్యతలు స్వీకరించిన మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వరరావు చేసిన మొట్టమొదటి పని ఆ చావిడిని నేలమట్టం చేసి వెట్టివారిని ఇంట్లో తిరిగేలా చేయడం. వూళ్ళో నిరసన వెల్లువెత్తినా మా అన్నయ్య లెక్కచేయలేదు. ఆయన చనిపోయిన రోజు ఊళ్ళోని దళితులందరూ    ఆడామగా తేడా లేకుండా దహన సంస్కారాల్లో పాల్గొన్నారు.  
“అంటరానివాడు, అని మీరు అనుకుంటున్నవాడు, అంటుకున్నాడో, ఇక ఆరని మంటే” అని మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాల రావు గారు ఏకంగా  ఒక కవితలో రాశారు.
ఈ నేపధ్యం వుంది కాబట్టి వివిధ రాజకీయ పార్టీల్లో నాయకులను ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాను, మహాత్మా గాంధి వారిని ఉద్దేశించి పెట్టిన పేరు ‘హరిజన్’ అనే పేరు ఎందుకు మార్చారని. అసలా పదం వాడకూడదు, వారిని SC లుగా మాత్రమే వార్తల్లో పేర్కొనాలని రేడియోలో పనిచేసేటప్పుడు తెలుసుకుని ఆశ్చర్య పోయాను. నిజంగా ‘హరిజన్’ అనేది నిషేధిత పదమా! అందులో ఏదైనా మతానికి సంబంధించిన అన్వయం నాటి పాలకులకి స్పురించి అలా చేశారా అనే అనుమానం ఇప్పటికీ తీరలేదు. వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం ఇంతవరకు లభించలేదు.
నా పోస్టులను ఫాలో అయ్యేవారు ఒక విషయాన్ని గమనించే వుంటారనే నమ్మకంతో ఇది రాస్తున్నాను. సాధ్యమైనంతవరకు, ఎంతో అవసరమైన సందర్భాలలో తప్ప నేను కులాలు, మతాల ప్రసక్తి తీసుకురాను. ఫేస్ బుక్ అనేది అయినా ‘మనుషుల నడుమ మతాల గళ్ళు, కులాల  ముళ్ళు లేని ప్రపంచంగా’ వుంటే బాగుటుందని, ఇందులో విహరించే కాస్త సమయంలో అయినా వాటికి అతీతంగా వుంటే ఇంకా ఎంతో హాయిగా ఉంటుందని భావించే అనేకమందిలో నేనొకడిని.

ఇది చరిత్ర రికార్డుకు అవసరమయ్యే అంశం కాబట్టి, కేవలం తెలుసుకోవాలనే జిజ్ఞాసతో నా సందేహం తీర్చాలని కోరుకుంటున్నాను.       

దేవుడికి కులమేదీ?


సుమారు అరవై ఏళ్ళ కిందటి మాట.
ఖమ్మం జిల్లా, వల్లభి గ్రామం. కారణం తెలవదు కానీ ఆ వూళ్ళో అగ్రవర్ణాలకు, దళితులకు నడుమ ఘర్షణలు తలెత్తాయి. దళిత వాడకు చెందిన మగవాళ్ళు, పెద్ద పెద్ద ఖామందులు ఎవరూ వూళ్ళో వుండలేక బయట ఎక్కడో తలదాచుకోవాల్సిన పరిస్తితి. మా పెద్ద బావగారు అయితరాజు రామారావు గారు ఆ ఊరుకు పెద్ద. ఆయన పూనికపై నాగపూరు నుంచి కాబోలు, వినోబా శిష్యులు బన్సాలీ గారు వల్లభి వచ్చి అనేక రోజులు అక్కడే మకాం వేశారు. ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనేలా రెండు వర్గాల నడుమ సయోధ్య కుదిర్చి వెళ్ళారు.

తరువాత మా బావగారు వూళ్ళో ఓ రామాలయం కట్టించారు. ఒక హరిజనుడిని (ఇప్పుడు ఈ మాట వాడడం లేదు, దళితుడు అంటున్నారు, ఆ రోజుల్లో పత్రికలు  అన్నీ ‘రామాలయంలో హరిజన పూజారి’ అనే పేరుతొ ఒక విడ్డూరమైన వార్తగా ప్రచురించాయి) ఆ గుడిలో పూజారిగా నియమించారు.