26, ఫిబ్రవరి 2011, శనివారం

రైల్వే బడ్జెట్ – భండారు శ్రీనివాసరావు


రైల్వే బడ్జెట్ – భండారు శ్రీనివాసరావు


ఏ బడ్జెట్ అయినా – అది సార్వత్రిక బడ్జెట్ కానివ్వండి లేదా రైల్వే బడ్జెట్ కానివ్వండి అది రెండురకాలుగా కనిపిస్తుంది. అధికార పక్షం వారికి ‘ఆహా ఓహో’ బడ్జెట్ అయితే ప్రతిపక్షం వారికి ‘అంకెల గారడీ’ బడ్జెట్. కానీ ఈ రెండు కళ్ళే కాదు ‘మూడో కన్ను’ మరోటి వుంది. అది ప్రజలది.

మొన్నటికిమొన్న అసెంబ్లీలో ఆర్ధికమంత్రి రామనారాయణరెడ్డి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోనే కొత్త పన్నులువేసే పద్ధతికి ఏనాడో ప్రభుత్వాలు స్వస్తి చెప్పేశాయి కనుక, రాష్ట్ర బడ్జెట్ గురించి గతంలో వున్న ఆసక్తి ఈనాడు జనంలో లేనట్టే లెక్క. అయినా ప్రభుత్వ, ప్రతిపక్ష నాయకులందరూ తమ విద్యుక్త ధర్మానుసారం బడ్జెట్ మంచిచెడ్డలు గురించి వ్యాఖ్యానాలు గుప్పించారు.ముందే చెప్పినట్టు అధికార పక్షం వాళ్ళు బడ్జెట్ ‘అద్భుతం’ అన్నారు. విపక్షంవాళ్ళు ‘కొత్త సీసాలో పాతసారా’ వంటి పాతపల్లవులనే సరికొత్తగా వినిపించారు. అయితే, విద్యార్ధుల ఫీజు రీ ఇంబర్స్ మెంట్ వంటి సంక్షేమ పధకాలకు బడ్జెట్ లో అరకొరగా చేసిన కేటాయింపుల విషయం సమర్ధించుకోవడానికి ప్రభుత్వ పక్షాన మీడియాతో మాట్లాడిన వాళ్ళు తలలు పట్టుకోవాల్సివచ్చింది.

పోతే, నిన్నటికి నిన్న మమతా బెనర్జీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ద్వారా - కన్నతల్లి ‘బెంగాల్ మాత’ పాల రుణం తీర్చుకున్నారు. ఆమె కళ్ళకు బెంగాల్ తప్ప మరోటి కనిపించదన్న అపవాదును మోయడానికే ఆమె సిద్ధపడ్డారు. నిజానికి ఆమె చూపు రానున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలమీదా, వాటిల్లో గెలుపు సాధించడం ద్వారా దక్కించుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి పీఠం మీదా వుందన్న నిజాన్ని ఆమె దాచిపెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. అందుకే ఈసారి రైల్వే బడ్జెట్ ను ‘తూర్పు వెళ్ళే రైలు’ ఎక్కించడానికి మమతా బెనర్జీ ఎంతమాత్రం సంకోచించలేదు. ఆ రాష్ట్రంలో గత 34 ఏళ్లుగా అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్న ‘ఎర్రదండు’ పాలనకు శ్రీమతి బెనర్జీ ఎర్ర జెండా చూపగలదేమో అన్న ఆశతో వున్న యుపీఏ నాయకులు కూడా ఆవిడ ప్రతిపాదించిన బెంగాల్ బడ్జెట్ కు పచ్చజెండా వూపినట్టుగా అనుకోవాల్సి వస్తున్నది. శుక్రవారం నాడు బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆమె చేసిన గంటన్నర ప్రసంగంలో పశ్చిమ బెంగాల్ పై వరాలవర్షం కురిపించి అందరూ ఆశ్చర్యంతో ‘హౌరా’ అని నోళ్ళు వెళ్ళబెట్టేట్టు చేసారు. మధ్యలో అడ్డుతగిలిన మాజీ రైల్వే మంత్రి లాలూపై ఆడపులిలా తిరగబడ్డారు. పైపెచ్చు బెంగాల్ చెందినందుకు నేనెంతో గర్వపడుతున్నానని ప్రకటించి విమర్శకుల నోళ్లకు తాళం వేసారు. సింగూరులో మెట్రో కోచ్ ఫాక్టరీ, డార్జిలింగ్ లో సాఫ్ట్ వేర్ ఎక్సేలెన్సీ సెంటర్, కోల్ కతాకు ఇంటిగ్రేటెడ్ సబర్బన్ నెట్ వర్క్, అక్కడి మెట్రో కు 34 కొత్త సర్వీసులు – ఇలా వరాల వాన కురిపించారు. లోగడ రైల్వే మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ – తన అధికారాన్ని ఉపయోగించి అత్తవారి వూరికి ఏకంగా ఒక రైలును వేయగాలేనిది ఇప్పుడు తాను చేసిన దాంట్లో తప్పు పట్టాల్సింది ఏముంది అన్న రీతిలో మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్ ను రూపొందించి పుట్టింటిపై  ప్రేమను బాహాటంగా ప్రదర్శించి చూపారు. సొంత రాష్ట్రానికి, సొంత జనానికి ఏమి చేస్తే ఏమి తప్పుపడతారో అని సంకోచించే నిత్య శంకితులకు ఇది కనువిప్పే.

ఇక, లోకసభలో 32 మంది అధికారపక్ష సభ్యులున్న ఆంధ్ర ప్రదేశ్ కి రైల్వే బడ్జెట్ లో దక్కిన వాటా ఎంత అని ఆలోచించుకుంటే, కడుపుచించుకుంటే కాళ్ళమీద పడ్డట్టయిందన్న చందానవుంది.

ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు అన్నట్టు లోక సభ సభ్యుడు ఎవరయినా రైల్వే మంత్రిని కలిసినప్పుడు, తన నియోజక వర్గం సమస్యలు తీర్చాలని మాత్రమే మహజరులు సమర్పిస్తారు. ఇవి ఎక్కువగా, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు గురించో, లేక ఫలానా స్టేషనులో ఫలానా రైలుకు ‘స్టాప్’ ఏర్పాటు చేయాలనో – ఇలా చాలావరకు స్తానిక సమస్యలపైనే వుంటాయి. మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కలగచేసుకుని ముందుగా తమ అవసరాలను రైల్వే మంత్రికి తెలియచేసుకోవాల్సి వుంటుంది. నిజానికి ఈ విషయంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా తమ కోరికల చిట్టాలను ఏటా రైల్వే మంత్రికి అందచేస్తూనే వుంటారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కిందటి నెలలోనే ఢిల్లీ లో మమతాబెనర్జీ ని కలుసుకుని కొన్ని కీలక ప్రతిపాదనలు సమర్పించారు. రాష్ట్రానికి కొత్తగా 35 రైళ్ళు కావాలని కోరారు. వీటిలో పదిహేడు ఎక్స్ ప్రెస్ రైళ్ళు వున్నాయి. కానీ, రైల్వే మంత్రి వాటికి మొండి చేయి చూపారు. కాకపొతే, పాసింజర్ రైళ్ళు, ఎం ఎం టి ఎస్ రైళ్ల విషయంలో ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనలను చాలావరకు మమతా బెనర్జీ మన్నించినట్టే కానవస్తున్నది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో గద్వాల-మాచర్ల, కొండపల్లి-కొత్తగూడెం, ప్రొద్దుటూరు-కంభం ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కోరినా, బడ్జెట్ లో వీటి ప్రస్తావన లేదు. అలాగే, సర్వే కూడా పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ప్రస్తావించారు కానీ, రైల్వే మంత్రి వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్రానికి సంబంధించి ఈసారి బడ్జెట్ లో ప్రతిపాదించిన కొన్ని ప్రాజెక్టులు నిజానికి పదేళ్ళనాటివి. వాటినే ఇప్పుడు కొత్త ప్రాజెక్టులుగా బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ప్రస్తావించారు.

ఏదిఏమయినా, ఈసారి రాష్ట్రానికి అనుకున్న రీతిలో రైల్వే మంత్రి న్యాయం చేయకపోయినా కిందటిసారి మాదిరిగా పూర్తిగా అన్యాయం చేసారని చెప్పలేము. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, రోజురోజుకూ మారిపోతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు, అధికార పార్టీలోనే వినిపిస్తున్న ధిక్కార స్వరాలూ, కారణాలు ఏమయినా రైల్వే బడ్జెట్ పై ఎంతోకొంత ప్రభావం చూపాయనే అనుకోవాలి. అందువల్లే మమతా ఎక్స్ ప్రెస్ రవంతసేపు రాష్ట్రంలో ఆగిన అనుభూతిని రైల్వే మంత్రి ప్రసంగం మనకు మిగిల్చింది.

సికింద్రాబాద్- విశాఖల నడుమ వారానికి మూడుసార్లు నడిచే దురంతో ఎక్స్ ప్రెస్, పుణే – సికింద్రాబాదుల మధ్య రోజూ నడిచే శతాబ్ది ఎక్స్ ప్రెస్ వంటి అనేక కొత్త రైళ్లకు బడ్జెట్ లో ప్లాట్ ఫారం దొరికింది. టీవీ స్క్రోలింగ్ లలో కనబడ్డ ఈ కొత్త రైళ్ల న్నీ పట్టాలు ఎక్కినప్పుడే జనాలకు వూరట.

అలాగే 17 కొత్త రైల్వే లైన్లు సర్వే చేయడానికి అనుమతి లభించింది. హైదరాబాద్ ఎం ఎం టి ఎస్ రెండోదశకు పచ్చ జెండా వూపారు. మూడు కొత్త రైల్వే లైన్లు రాష్ట్రానికి మంజూరు చేసారు. రైలు ప్రమాదాలను నివారించడానికి ఉద్దేశించిన ‘యాంటీ కొలిజన్ డివైజ్’ ను దక్షిణ మధ్య రైల్వే లో కూడా ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సగం ఖర్చు భరించే పద్ధతిలో, మూడువేల మూడువందల కోట్ల రూపాయల అంచనా వ్యయం కలిగిన నాలుగు కొత్త ప్రాజెక్టులను ఈ బడ్జెట్ లో మంజూరు చేసారు. అలాగే, ఎన్నేళ్ళబట్టో అంతా ఎదురుచూస్తున్న కాజీపేట వాగన్ ఫాక్టరీ.

ముందే చెప్పినట్టు ఈ బడ్జెట్ ని ప్రజల దృక్కోణంలో నుంచి పరిశీలిస్తే ఒకింత వూరట కలిగించే పద్ధతిలో వుందనే చెప్పాలి. వాళ్ళమీద కొత్త భారాలేవీ మోపలేదు. టిక్కెట్ల ధరను వరసగా మూడో ఏడు కూడా పెంచకపోవడం హర్షనీయం. అలాగే కొద్దో గొప్పో తగ్గించిన రిజర్వేషన్ చార్జీలు. సీనియర్ సిటిజన్ లకు ఇచ్చే రాయితీని 30 నుంచి 40 శాతానికి పెంచడం. ఆ చేత్తోనే, మహిళలకు 58 ఏళ్ళ నుంచే ఈ సదుపాయం వర్తింప చేయడం. రాజధాని,శతాబ్ది వంటి రైళ్ళలో కూడా వికలాంగులకు రాయితీ తో కూడిన ప్రయాణ సదుపాయం, పోస్ట్ ఆఫీసుల్లో కూడా టికెట్ రిజర్వేషన్ కౌంటర్లు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన కూడా ఆహ్వానించదగ్గదే. పాసింజర్ రైళ్ల సంఖ్యను పెంచడంవల్ల ప్రయోజనం పొందేది సామాన్యులే అన్నది కూడా ఇక్కడ గమనంలో వుంచుకోవాలి. ఎందుకంటె రైల్వే లకు మొదటి రూపాయి చెల్లించేది సాధారణ ప్రయాణీకులే.

‘ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ ‘ఎక్కిన రైలు గమ్యం చేరుతుందా లేదా అనే డౌటు’ ప్రయాణీకులకు లేకుండా చేయగలిగితే ఆ బడ్జెట్ సార్ధకమైనట్టే లెక్క. (26-02-2011)





23, ఫిబ్రవరి 2011, బుధవారం

వినదగునెవ్వరు చెప్పిన – భండారు శ్రీనివాసరావు


వినదగునెవ్వరు చెప్పిన – భండారు శ్రీనివాసరావు

“నిద్రపోతూ కలలు కనడం అన్నది జీవితంలో సాధారణ విషయం. కన్న కలలను నిజం చేసుకోవడానికి నిరంతరం శ్రమించడం సాధకుల జీవితం.”


“బాల్యంలో ఒక్క చెమట చుక్కను ధారపోసినా అది ముసలితనంలో పది కన్నీటి చుక్కలు రాలకుండా చేస్తుంది.”


“నన్ను ద్వేషించే వాళ్ళను ద్వేషించే వ్యవధానం నాకు లేదు. ఎందుకంటే నన్ను ప్రేమించే వాళ్ళను ప్రేమించడానికే ఎక్కడి సమయం సరిపోవడం లేదు.”


“సంకుచిత మనస్కులు ఇరుగుపొరుగువారిని గురించి మాట్లాడుకుంటారు. పెద్దమనసున్న వాళ్ళు ఇరుగుపొరుగు ఎదుర్కునే సమస్యల పరిష్కారం గురించి మాట్లాడుకుంటారు.”


“సానుకూల దృక్పధం కలిగినవారిని ఎలాటి విషం ఏమీచేయలేదు. ప్రతికూల మనస్తత్వం వున్నవారిని ఏ వైద్యుడు బాగుచేయలేడు.”


“మీ జీవితంలో మీరు ఎక్కువ సమయం గడిపేది ఎవరితోనో తెలుసా? అదెవరో కాదు. మీరే.”


“అదృష్టం అన్నది మీ చేతుల్లో వుండదు. కానీ పని చేయడం అనేది మీ చేతుల్లోనే వుంటుంది. మీరు చేసే పనివల్ల మిమ్మల్ని అదృష్ట దేవత పలకరించవచ్చు. కానీ అదృష్టం మాత్రం మీరు చేయాల్సిన పని ఎన్నటికీ చేయలేదు.”


“ఈ ప్రపంచంలో రెండే రెండు విలువయిన ప్రదేశాలు వున్నాయి. ఒకరి ఊహల్లో లేదా ఆలోచనల్లో మనం వుండగలగడం జరిగితే అంతకంటే మధురమయిన ప్రదేశం మరోటి వుండదు. అల్లాగే ఒకరి హృదయంలో మనం వున్నామంటే దానికంటే భద్రమయిన స్తానం ఇంకొకటి వుండదుగాక వుండదు.”


“జీవితంలో విషాదం ఏమిటంటే అది అంత త్వరగా ముగిసిపోవడం. దాన్ని తిరిగి మొదలుపెట్టడానికి ఎంతో కాలం వేచివుండాల్సిరావడం కూడా అంతే విషాదం.”


“ఒక్క క్షణం ఆగ్రహాన్ని అణచి పెట్టుకోగలిగితే, ఆ తర్వాత వంద రోజుల దుఃఖాన్ని దూరం చేసుకోగలుగుతాం.”

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

‘ఇంక్రెడిబుల్ ఇండియా’ - భండారు శ్రీనివాసరావు

‘ఇంక్రెడిబుల్ ఇండియా’ - భండారు శ్రీనివాసరావు


‘ఇంక్రెడిబుల్ ఇండియా’ (నమ్మ శక్యం కాని భారత దేశం) అని టూరిజం శాఖ వాల్ పోస్టర్లలో ప్రముఖంగా కానవస్తుంటుంది. ఒక విధంగా ఇది పచ్చినిజమేనేమో అనిపిస్తుంది ఈ మధ్య అందుకున్న ఒక ఎస్ ఎం ఎస్ ని చదివిన తరవాత. దాంట్లో ఏముందంటే:

ఈ దేశంలో-
అవసరమై ఫోన్ చేస్తే అంబులెన్స్ ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో ఎవరూ చెప్పలేరుకాని పిజ్జా ఆర్డర్ చేస్తే మాత్రం ఆఘమేఘాలమీద ఇంటికి చేరుతుంది.

ఈ దేశంలో –
ఎనిమిది శాతం వడ్డీపై కారు రుణం ఇవ్వడానికి అన్ని బ్యాంకులు బారులు  తీరి నిలబడతాయి. అదే పిల్లల పైచదువులకోసం రుణం కావాలంటే అవే బాంకులు పన్నెండు శాతం వడ్డీ ముక్కు పిండి వసూలు చేస్తాయి.

ఈ దేశంలో-
ఓ కిలో ఉల్లిపాయల ధర ఇరవై నాలుగు రూపాయలు. సెల్ ఫోన్ లో వేసుకునే సిమ్ కార్డ్ మాత్రం పూర్తిగా ‘ఉచితం’

ఈ దేశంలో –
జీవకారుణ్యం గురించి గంటలు గంటలు మాట్లాడే వాళ్ళు ఎక్కడబడితే అక్కడ కానవస్తారు. కానీ, తల్లి గర్భంలో ప్రాణం పోసుకున్న శిశువు ఆడదని తెలిస్తే మాత్రం అరనిమిషం కూడా ఆలోచించకుండా కడుపులో పిండాన్ని కడుపులోనే చిదిమేయాలని అనుకుంటారు.

ఈదేశంలో -
ఒలింపిక్ పోటీల్లో పసిడి పతకం సాధించిన ‘షూటర్’ ను ప్రభుత్వం మూడు కోట్ల రూపాయల నగదు బహుమతితో సత్కరిస్తుంది. అదే, టెర్రరిస్టులను షూట్ చేసి ఆ పోరాటంలో అసువులుబాసిన అమరవీరుల కుటుంబాలకు లక్ష రూపాయలు ఇవ్వడానికి ముందూ వెనకా చూస్తుంది.
మరి నిజంగా ఇది-
– ‘ఇంక్రెడిబుల్ ఇండియా’ – ఔనా!





12, ఫిబ్రవరి 2011, శనివారం

విశ్వాసమా! విలీనమా! - భండారు శ్రీనివాసరావు

విశ్వాసమా! విలీనమా! - భండారు శ్రీనివాసరావు


ఎన్నికల సీజనులో అవసరార్ధం ‘తోక పార్టీలు’ పుట్టుకొస్తుంటాయి. ఒక్కోసారి అసలు పార్టీలకన్నా ఈ తోక పార్టీల హవా ఎక్కువగా వుంటుంది. తోక పదం బాగాలేదనుకున్నారో ఏమో కానీ ఈ మధ్య వీటిని బ్రాంచ్ ఆఫీసులని పిలుస్తున్నారు. కాంగ్రెస్ ను మధ్య పెట్టుకుని, టీ ఆర్ ఎస్, టీ డీ పీ నడుమ సాగిన ఈ బ్రాంచ్ ఆఫీసుల గొడవ మీడియా పుణ్యమా అని గంటల్లోనే ముదిరిపోయి, చివరకి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మెడకు చుట్టుకునేలావుంది.

కాంగ్రెస్, టీ ఆర్ ఎస్ నడుమ లోపాయకారీ వొప్పందం వున్నట్టు తెలుగుదేశం నాయకుడు ఒకరు చేసిన ఆరోపణ- టీ ఆర్ ఎస్ అధినేతను ఎక్కడ తాకకూడదో అక్కడే తాకింది. టీ ఆర్ ఎస్ పార్టీ, కాంగ్రెస్ కు బ్రాంచ్ ఆఫీసుగా తయారయిందని టీ డీ పీ చేసిన ఆరోపణనీ, చిరంజీవి తరహాలోనే టీ ఆర్ ఎస్ కూడా కాంగ్రెస్ లో కలిసిపోతుందని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు పదేపదే చేస్తున్న ప్రకటనలను ఆయన జీర్ణించుకోలేకపోయారు. మాటల తూటాలు పేల్చడంలో చంద్రశేఖరరావుని మించిన రాజకీయ నాయకుడు రాష్ట్రంలో మరొకరు లేరు. తనదయిన తరహాలోనే ఆయన తెలుగుదేశం పార్టీకి ఓ సవాలు విసిరారు. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయి, సీమాంధ్రలో జగన్ కు చెక్ పెట్టడానికీ, ఇటు తెలంగాణా వాదాన్నిదెబ్బతీయడానికీ లోపాయకారీ వొప్పందం కుదుర్చుకున్నారని ప్రత్యారోపణ చేసారు. వచ్చేవారం మొదలుకానున్న అసెంబ్లీ సమావేశాల్లో, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెడతామని, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా చెప్పుకుంటున్న టీ డీ పీకి ఏమాత్రం చిత్తశుద్ధి వున్నా ఆ తీర్మానాన్ని సమర్ధించాలంటూ చంద్రశేఖరరావు బంతిని మళ్ళీ టీడీపీ కోర్టులోకే గిరాటు వేసారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీ డీ పీ కి ఈ సవాలుతో గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా ప్రధాన ప్రతిపక్షంగా దాన్ని సమర్ధించాల్సి వస్తుంది. టీడీపీ మద్దతు వుంటే తీర్మానం నెగ్గడం ఖాయం. నెగ్గితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం మరింత ఖాయం. ప్రభుత్వం పడిపోయి రాష్ట్రపతి పాలన వొచ్చినా, లేక మరికొన్నాళ్లకు మధ్యంతర ఎన్నికలు వచ్చినా దానివల్ల ఇటు తెలుగు దేశానికి కానీ, అటూ కాంగ్రెస్ కు కానీ ఒరిగేదేమీ వుండదు. ఆ పార్టీలనుంచి ఎన్నికయిన వారెవ్వరూ ఇంత త్వరగా మరో మారు ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. ఎన్నికలంటూ వస్తే కొద్దో గొప్పో ఉపయోగం జగన్ పెట్టబోయే పార్టీకి కానీ, తెలంగాణలో టీ ఆర్ ఎస్ కు కానీ వుంటుంది. ఇవన్నీ గ్రహించిన టీడీపీ నాయకులు నష్ట నివారణ ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే టీ ఆర్ ఎస్ కు కనీసం ముప్పయి మంది శాసన సభ్యుల బలం వుండాలని, కేవలం పదకొండుమంది సభ్యులను పెట్టుకుని చేతకాని సవాళ్లు విసురుతోందనీ వాళ్ళు ఎదురుదాడి ప్రారంభించారు. ఈ వాద ప్రతివాదాలు ప్రకటనల వరకే పరిమితం అయితే పరవాలేదు. కానీ, అసెంబ్లీ దాకా చేరినప్పుడు పరిణామాలు ఆసక్తికరంగానే కాకుండా, అనూహ్యంగా కూడా వుండే అవకాశం వుంటుంది.(12-02-2011)



వినదగునెవ్వరు చెప్పిన – భండారు శ్రీనివాసరావు

వినదగునెవ్వరు చెప్పిన – భండారు శ్రీనివాసరావు


“నా ప్రియతములందరికీ నాదో విజ్ఞప్తి : “మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్నాను. కానీ, అంతమాత్రాన నేనో గుడ్డివాడినని రుజువు చేసే ప్రయత్నం మాత్రం చేయకండి.”

“మీకు బాగా ఆత్మీయులయిన వాళ్ళు మీతో ఎప్పుడూ ఏదో వాదులాట పెట్టుకుంటూనే వుంటారు. మీరంటే గిట్టకో, లేదా మీమీద అసూయతోనో వాళ్ళు అలాచేస్తున్నారనుకుంటే మీ పొరబాటే అవుతుంది. మీ దృష్టిలో సదా వుండాలనుకునే వాళ్ళు కనుకనే అలా చేస్తుంటారు.”

“తెల్లవారవస్తోంది. ఇక మేలుకోండి. రాత్రంతా కన్న కలలను నిజం చేసుకోవడానికి నిద్ర లేవండి. ఈరోజు రాత్రి మళ్ళీ మరికొన్ని అద్భుతమయిన కలలు కనేందుకు వీలుగా చిరునవ్వుతో కొత్త రోజును ప్రారంభించండి.

“మనుషుల నడుమ పొరపచ్చాలు రావడానికి కారణం పెద్దదేమీకాదు. ఇతరులు చెప్పేది అర్ధం చేసుకోవడం కోసం వాళ్ల మాటలు ఎప్పుడూ వినం. కేవలం సమాధానం చెప్పడానికి మాత్రమే మనం ఇతరులు చెప్పేది వింటుంటాం.”

“అంతరాత్మకు కూడా కొన్ని బలహీనతలుంటాయి. ఇతరులు తప్పుచేసినప్పుడు తీర్పుచెప్పడానికో, లేదా దండించ దానికో అది మనల్ని పురికొల్పుతుంది. అదే తప్పు మనం చేసినప్పుడు మాత్రం అది కిమ్మనకుండా వుండిపోతుంది. అలా వున్నా పరవాలేదు, మనం చేసిన దాన్ని సమర్ధించుకునేలా మనమీద వొత్తిడి పెంచుతుంది.”

“జీవితమంటే ఏమిటి? ఎదగడం లేదా ఏళ్ళు పెరగడం. వయసు మీద పడడం అంటే జీవితానికి ఏళ్ళు కలుపుకుంటూ పోవడం. ఎదగడం అంటే వయసుకు జీవితాన్ని కలుపుకుంటూ పోవడం.”

“ఎప్పుడూ ఎవరిమీదా కోపం తెచ్చుకోకపోవడం, కస్సుబుస్సులాడక పోవడం ఇవేవీ ఇతరులతో మంచి సంబంధాలకు కొలమానాలు కావు. కాకపొతే, ఆ విధమయిన భావోద్రేకాలను ఎంత త్వరగా అదుపులోకి తెచ్చుకుని మామూలు మనుషులు కాగలరన్న దానిపై సాటివారితో మీ సత్సంబంధాలు ఆధారపడివుంటాయి.”

“తప్పో, పొరబాటో చేసినప్పుడు ‘సారీ’ చెప్పడం బాగుంటుంది. అయితే, నమ్మకాన్ని దెబ్బతీసే పని చేసినప్పుడు ‘సారీ’ చెబితే సరిపోదు. కాబట్టి, పొరబాట్లు చేస్తే చెయ్యండి కానీ నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయవద్దు.”

“లక్ష లక్ష్యాలు పెట్టుకోండి. అది మానవ సహజం. కానీ, లక్ష్య సాధకుడు ఒకే లక్ష్యాన్ని లక్ష పద్ధతుల్లో సాధించాలని చూస్తాడు. అతడే సాధించగలుగుతాడు కూడా.”

“ఇతరులు మీకోసం చేస్తున్నదాన్నిబట్టి మీ జీవితాన్ని అంచనా వేసుకోవడం వల్ల మిగిలేది ఆశాభంగమే. కానీ ఇతరులకోసం మీరు చేస్తున్న దాన్ని కూడా కలుపుకుని లెక్కవేసుకుంటే దానివల్ల మీ మనసుకు మరికొంత హాయి కలుగుతుంది. మీ జీవితానికి పరమార్ధం కూడా లభిస్తుంది.”

“అందం కోసం వెంపర్లాడకండి. కొన్నాళ్లకది ఎట్లాగూ కనుమరుగవుతుంది. డబ్బు మీద యావ పెంచుకోకండి. ఎందుకంటె అది ఎంతమాత్రం శాశ్వతం కాదు. అందుకని ఒక మంచి హృదయం కోసం వెతుక్కోండి. అదే మిమ్మల్ని అహరహం కోరుకుంటుంది. మీ కోసం తపిస్తుంది. కడకంటా మీతో వుండిపోయే ‘తోడు’ ఆ ఒక్కటే.”

“కొవ్వొత్తుల వెలుగులో భోజనాలు, సముద్రపు వొడ్డున షికార్లు ఇవేవీ నిజమయిన ప్రేమకు నిదర్శనాలు కావు. పరస్పర గౌరవం, రాజీ పడే తత్వం, కష్ట సుఖాలలో తోడుగా వుండగలమనే నమ్మకం, ఒకరిపై మరొకరికి అంకిత భావం ఇవే అసలు సిసలు ప్రేమకు పునాదులు.”

“ఆనందంగా , సంతోషంగా, హాయిగా వున్నామని చెప్పుకుంటున్నారంటే అంతా సజావుగా వున్నట్టు లెక్క కాదు. అలాటివారు జీవితంలో మరో కోణాన్ని చూడడానికి ఇష్టపడడం లేదనికూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఏ జీవితమూ సంపూర్ణంగా పరిపూర్ణం కాదు.”

“మాట్లాడకుండా ఎలా వుండాలో తెలియనివాడికి ఎలా మాట్లాడాలో కూడా తెలియదనుకోవాలి”

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

వరస కుంభ కోణాలతో కుదేలవుతున్న కాంగ్రెస్ – భండారు శ్రీనివాసరావు


వరస కుంభ కోణాలతో కుదేలవుతున్న కాంగ్రెస్ – భండారు శ్రీనివాసరావు

కేంద్రంలో యుపీఏ సర్కారు వరసగా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన ఆనందం ఆ కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ కు ఎన్నో ఎంతో కాలం మిగిలివుండేట్టు లేదు. వెలుగు చూస్తున్న వరస కుంభకోణాలు, మచ్చలేని ప్రధానిగా ముద్రపడిన మన్మోహన్ సింగ్ ని మానసికంగా బాగా కుంగదీస్తున్నాయి. బీహారుతో మొదలయిన కాంగ్రెస్ వ్యతిరేక ప్రజా తీర్పులు, 2014 ఎన్నికల తరవాత, రాహుల్ గాంధీని భావి భారత ప్రధానిగా చూడాలనుకునేవారి ఆశలపై నీళ్ళు చల్లుతున్నాయి. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి ఏకైక కంచుకోటగా మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ లో – రాజశేఖరరెడ్డి మరణం తదుపరి సంభవిస్తున్న పరిణామాలు – ఆ పార్టీ భవిష్యత్తుకు పెనుసవాలుగా మారిపోతూవుండడం పార్టీ అధినేత్రి సోనియాను కలవరపెడుతున్న సంగతి బహిరంగ రహస్యం. ఏకంగా పార్టీ అధినాయకురాలినే సవాలు చేస్తూ, కొరకరాని కొయ్యగా తయారయిన జగన్ మోహనరెడ్డిని అడ్డుకోవడం కోసం తీసుకుంటున్న చర్యలు, నూటపాతికేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి శోభస్కరంగా లేవని ఆ పార్టీవారే దవడలు నొక్కుకుంటున్నారు. చిరంజీవి పార్టీని విలీనం చేసుకోవడం ద్వారా జగన్ ని నేరుగా డీకొట్టగల జనాకర్షణ స్తాయి కలిగిన నాయకుడిని రాష్ట్ర విభాగానికి సమకూర్చిపెట్టామన్న అల్ప సంతోషం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి మిగిలింది. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు కాంగ్రెస్ పరిస్తితి సజావుగా లేదన్న విషయం ఆ పార్టీ నాయకులకు తెలియదని అనుకోలేము. కాకపొతే, నష్టనివారణకు తీసుకుంటున్న చర్యలు సర్వజనామోదం పొందే రీతిలో లేవనే చెప్పాలి. పైపెచ్చు పరిష్కారం దిశగా వేస్తున్న అడుగులు కొత్త సమస్యలకు ఊపిరి పోస్తున్నాయి. చిరంజీవి పార్టీని తమలో కలుపుకునే క్రమంలో వేసిన ఎత్తులు పార్టీ రాజకీయ పరిణతిని సూచిస్తున్నాయని అంచనా వేసుకున్న అధిష్టానం మరి కొన్ని విలీనాలకు తెర తీయబోతున్నట్టు వెలువడిన కొత్త ఊహాగానాలు సరికొత్త చర్చలకు తలుపులు తెరిచాయి. సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా, ఎన్నికల తరవాత కుదుర్చుకునే పొత్తులతో, అధికారమే పరమావధిగా గద్దె ఎక్కాలని అనుకున్నప్పుడు, అన్ని పార్టీలను కలుపుకుని సీట్ల దామాషా ప్రాతిపదికపై, అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాలలో జాతీయ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది కదా అని భావించే వారు కూడా లేకపోలేదు.

ఇక ప్రధాని మన్మోహన్ విషయం తీసుకుంటే, ఆయనలో మొదటిసారి వున్న ధీమంతం ఇప్పుడు కానరావడం లేదు. అణు ఒప్పందం విషయంలో వామపక్షాల డిమాండ్లను, బెదరింపులను లెక్కచేయకుండా ఎదురొడ్డి నిలచిన వైఖరిని ఇంకా ప్రజలు మరచిపోలేదు. ఆయనది అధికార దాహం కాదనీ, అవకాశవాద రాజకీయం అంతకంటే కాదనీ ప్రజలు నమ్మారు. అలాగే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోని ముఖ్య మంత్రులను ఏదో ఒక సాకు చూపి ఇంటికి పంపే పాత పద్ధతులకు సోనియా గాంధీ స్వస్తి పలికిందని మరో సంకేతాన్ని ప్రజల్లోకి పంపడంలో కూడా ఆ పార్టీ చాలావరకు మెరుగయిన ఫలితాలు సాధించింది. కాంగ్రెస్ లో వచ్చిన ఈ రకమయిన మార్పు స్వాభావికమయినదనీ, కాంగ్రెస్ నిజంగానే మారిపోయిందనీ నమ్మి గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీనే నెత్తిన పెట్టుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో కూడా ఓటర్లపై ‘మన్మోహన్ – సోనియా’ ప్రభావం గణనీయంగా వుందని, వై ఎస్సార్ వ్యతిరేకులు గణాంకాలతో సహా ఇటీవలి కాలంలో పదేపదే ఉద్ఘాటించడానికి ఇది ఉపయోగపడింది కూడా.

అయితే, కేంద్రంలో రెండోసారి అధికారం లోకి వచ్చిన తరవాత, క్రమేపీ యూ పీ ఏ సంకీర్ణం లో రంగులు మారడం మొదలయింది. జట్టులోని వారంతా ఎవరికి వారు నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం ఎలాగా అనే యావ పెరిగిపోయి, అవినీతి కూపంలోకి దిగజారడంలో పోటీపడడం ప్రారంభించారు. ఫలితం, ఒలింపిక్ క్రీడల ఏర్పాటు పేరుతొ కోట్ల రూపాయలు చేతులు మారడం. టూజీ స్పెక్ట్రం కేటాయింపుల్లో లక్షల కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వ ఖజానాకు సాక్షాత్తూ పాలకులే గండి కొట్టారని ఆరోపణలు వెల్లువెత్తడం. స్వాతంత్రం వచ్చిన తరవాత వెలుగు చూసిన కుంభకోణాలు అన్నిటిలో ఇదే అతి పెద్దదని సర్వోన్నత న్యాయస్తానం పేర్కొనడాన్ని బట్టి చూస్తే, ఈ విషయంలో యూ పీ ఏ సర్కారుకు అంటిన మకిలి ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. జట్టులోని వారు చేసే పనులకు బాధ్యత, జట్టుకు నాయకత్వం వహించేవారికి కూడా కొద్దో గొప్పో వుంటుందనడం నైతికంగా చూస్తే సహజమే. అయితే, ఆ నాయకుడు మన్మోహన్ సింగ్ వంటి సచ్చీలి కావడం వల్ల నేరుగా ఈ కుంభకోణాలతో ఆయనకు ప్రమేయం వుందని ఆరోపించలేని పరిస్తితి. కానీ, ఈ పరిణామాలు ఆయనకు కలత కలిగించాయనడంలో మాత్రం సందేహం లేదు.

ఈ వివాదం పై చెలరేగిన రగడ అంతా ఇంతా కాదు. సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని(జే పీ సీ) ఏర్పాటు చేసి విచారణ జరపాలన్న డిమాండ్ తో ప్రతిపక్షాలన్నీ ఏకమై నిరుడు చివర్లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలను స్తంభింప చేసాయి. రాజకీయాల వాసన అంతగా పట్టని ప్రధాని మన్మోహన్ సింగ్, జే పీ సీ విషయంలో కొంత మెత్తబడ్డా- కాంగ్రెస్ రాజకీయ సలహాదారులు ఒప్పుకోలేదు. అయితే, ఆ దరిమిలా చోటుచేసుకున్న పరిణామాల నేపధ్యంలో జే పీ సీ అంశంపై సోనియా కూడా ఓ మెట్టు దిగిన దాఖలాలు కానవస్తున్నాయి. ‘టూ జీ స్పెక్ట్రం’ వ్యవహారంలో సంబంధిత కేంద్ర మంత్రి, డీ ఎం కే కు చెందిన రాజా రాజీనామా చేయడం, అతడిని అరెస్ట్ చేయడం, బడ్జెట్ సమావేశాలు త్వరలో జరగనుండడం - వీటన్నిటినీ దృష్టిలో వుంచుకుని కాంగ్రెస్ అధిష్టానం జే పీ సీ విషయంలో ప్రతిపక్షాల డిమాండుకు తలవొగ్గే వీలుంది. అంతేకాకుండా , సుప్రీంకోర్టు వేస్తున్న చురకలు సయితం కేంద్ర ప్రభుత్వంపై వొత్తిడి పెంచుతున్నాయి. సీ బీ ఐ ఈ కేసును స్వేచ్చగా దర్యాప్తుచేయాలనీ, కుబేరులనీ, కార్పోరేట్ దిగ్గజాలనీ వెనకాడకుండా అందరినీ ప్రశ్నించి నిజాన్ని నిగ్గు తేల్చాలనీ సుప్రీం కోర్టు ధర్మాసనం గత గురువారం కేంద్ర దర్యాప్తు సంస్తను ఆదేశించింది. అంతే కాకుండా, విచారణకు ఎలాటి అడ్డంకులు కలగకుండా ఈ కేసుకు సంబంధించి దేశంలో ఇతర న్యాయస్తానాలేవీ ఎటువంటి ఆదేశాలు జారీ చేయకుండా నిషేధం విధించింది. ఈ రకమయిన వ్యాఖ్యలు, ఆదేశాలు ప్రభుత్వాన్ని సహజంగానే ఇరకాటంలో పడేస్తాయి. అదే జరుగుతోంది కూడా.

పులి మీది పుట్రలా మరో స్పెక్ట్రం వివాదం తెర మీదకు వచ్చింది. ఎస్ బాండ్ కేటాయింపుల్లో ఒక ప్రైవేటు సంస్తకు లాభం కలిగేలా విధాన లోపాలు జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ పక్క ‘టూ జీ స్పెక్ట్రం’ విషయం నానుతుండగానే, మరో పక్క అలాటిదే మరో వివాదం మెడకు చుట్టుకోవడం మన్మోహన్ సర్కారుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.’ టూ జీ’ అనుభవంతో తలబొప్పి కట్టిన సర్కారు ఈ విషయం లో కాలయాపన చేయకుండా ఈ అంశాన్ని కూలంకషంగా సమీక్షించేందుకు కేంద్ర కేబినేట్ మాజీ కార్యదర్శి చతుర్వేది నేతృత్వంలో ఒక ఉన్నత స్తాయి కమిటీని వెంటనే నియమించింది. ఒక నెలలో నివేదిక సమర్పించాలని కమిటీని కోరింది.
పోతే, స్విస్ బాంకుల్లో మూలుగుతున్న నల్ల డబ్బు వ్యవహారం కూడా కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ బాంకుల్లో డబ్బు దాచుకున్న వారి వివరాలను బహిర్గతం చేయాలన్న వొత్తిడి నానాటికీ పెరుగుతోంది. స్విస్ బాంకు ల్లో భారత కుబేరులు దాచుకున్న నల్లడబ్బును తిరిగి దేశంలోకి తీసుకురావడానికి అంతర్జాతీయ ఒప్పందాలు అడ్డుపడుతున్నాయన్న వాదనను ప్రజలు విశ్వసిస్తున్నట్టు లేదు.
యూ పీ ఏ సంకీర్ణ ప్రభుత్వ సారధిగా వున్న మన్మోహన్ సింగ్ నీతీ నిజాయితీలను గురించిన సందేహాలు ఎవరికీ లేకపోయినా వరసగా బయట పడుతున్న కుంభకోణాలు చూస్తున్నవారు, ఆయన ఏదో విధంగా వీటికి అడ్డుకట్ట వేయగలిగితే బాగుండుననే అనుకుంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వాలలో సహజంగా వుండే పరిమితులు ముందరి కాళ్ళకు బంధాలు వేస్తుండవచ్చు. పోతే, ఒకటివెంట మరొకటిగా ఇలా కుంభకోణాలు బయట పడుతూ వుండడానికి పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు కూడా కారణం కావచ్చు. మన్మోహన్ సింగ్ కు వ్యతిరేకంగా కొందరు పార్టీలోని పెద్దలే పనికట్టుకుని పనిచేస్తున్నారన్నది తెలిసికూడా ఏమీ చేయలేని అసమర్ధ స్తితిలో కాంగ్రెస్ పార్టీ వుండడం మరో విషాదం. (11-02-2011)


వినదగునెవ్వరు చెప్పిన – భండారు శ్రీనివాసరావు


వినదగునెవ్వరు చెప్పిన – భండారు శ్రీనివాసరావు

మీ మనసు మీ చెప్పుచేతల్లో వున్నంతకాలం అది మీకు మంచి స్నేహితురాలే. కానీ, ఎప్పుడయితే అది మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటుందో ఆ క్షణం నుంచి దాన్ని మించిన శత్రువు మీకు మరోటి వుండదు. – భగవద్గీత

విజేతలందరూ అనుకునే మాట ఒకటుంది.అదేమిటంటే:
‘పందెం ఇంకా పూర్తికాలేదు, ఎందుకంటె నేనింకా దాన్ని గెలవలేదు గనుక’

ప్రపంచాన్ని వొదిలిపెట్టినప్పుడు స్వర్గానికి వెళ్ళాలనుకోవడం కంటే, లోకాన్ని విడిచిపెట్టి వెళ్లేముందే నలుగురికోసం స్వర్గాన్ని నిర్మించగలిగితే అర్ధం పరమార్ధం రెండూ సిద్ధిస్తాయి.

అలారం కనుక్కున్నదెవరోకానీ, వాడు చాలా చురుకయినవాడయి వుంటాడు. దాని నోరు నొక్కేయడం కనుక్కున్నవాడు మాత్రం పరమ బద్ధకస్తుడు అయి వుంటాడు.

ఏమి సాధించాలి అన్న దానికి పరిమితులు పెట్టుకోనంతకాలం అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలం అన్నదృఢ నమ్మకాన్ని మీ తోటివారిలో కలిగించగలుగుతారు.

అబ్దుల్ కలాం గారిని ఎవరో అడిగారు ‘విషం అంటే ఏమిటి? అని. దానికి కలాం గారిచ్చిన సమాధానం ఎంత గొప్పగా వుందో చూడండి. ‘మితి మించినదేదయినా సరే అది కాలకూటవిషం కంటే ప్రమాదమే’

ఇతరుల గురించి తెలుసుకోవడం మేధావితనమే కానీ ఇతరులచేత వారిచేతనయిన పని చేయించుకోవడం మరింత తెలివికలిగిన పని అవుతుంది.
అలాగే, మన గురించి మనం తెలుసుకోవడం వివేకం. మనల్ని మనం కట్టడి చేసుకోవడం నిజమయిన బలం అవుతుంది.

మనిషి జీవితంలో మధుర ఘట్టాలు మళ్ళీ మళ్ళీ రావు. కానీ, స్నేహితులతో గడిపిన అద్భుత క్షణాలు, వారి స్మృతులు గుండెల్లో కలకాలం పదిలంగా వుండి పోతాయి.