10, జులై 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో ( 191 ) : భండారు శ్రీనివాసరావు

 

భార్యావియోగం
‘ఎప్పుడూ ఈయనకు ఈ భార్య నామస్మరణ ఏమిటి? ఎవరికి లేరు భార్యలు?’ అనే మాటలు నా చెవినపడక పోలేదు. అది నిజమే కదా! సమర్థించుకోవాల్సిన అవసరమేముంది?
మా ఆవిడకి ప్రియనేస్తం వనం గీత ఈ వాక్బాణాన్నే మరోరకంగా మా ఆవిడ మీద ప్రయోగిస్తూ వుండేవారు.
‘వస్తానండీ! మా ఆయన వచ్చే వేళ అయింది’ అనగానే, ‘ఏమిటి దుర్గా! (మా ఆవిడకి మరోపేరు) మాకు లేరా మొగుళ్లు? మీరు పోయి కాఫీ కలిపి ఇవ్వాలా! ఆ మాత్రం ఆయన చేసుకోలేరా! మరీ గారాబం చేస్తున్నారు’ అనేది నవ్వుతూ.
నిజానికి భార్య నామస్మరణ వేరు, భార్యావియోగం కారణంగా ఆమెను పదేపదే తలచుకోవడం వేరు. ఈ వియోగబాధ శ్రీరామచంద్రులవంటి వారికే తప్పలేదు. రావణ వధ అనంతరం సీతాదేవిని మళ్ళీ కనులారా చూసేవరకు సీతా సీతా అంటూ ఎన్ని సార్లు తలచుకున్నది రామాయణం గురించి తెలిసినవారందరికీ తెలుసు.
భార్యా వియోగం గురించి విశ్వనాధ వారి అనుభవం ఫేస్ బుక్ మితృలు, పెద్దలు జేవీపీఎస్ సోమయాజులు గారు రాసిన విషయాలు చదివిన తర్వాత అంతటి కవి సామ్రాట్ కే ఈ వేదన తప్పలేదని అర్ధం అయింది. విశ్వనాధ ప్రియ శిష్యులు పేరాల భరత శర్మ గారి ద్వారా ఈ సంగతులు సోమయాజులు గారికి తెలిశాయి. వారు పేర్కొన్న విషయాలు సంగ్రహంగా .
విశ్వనాధ వారు రాసిన రామాయణ కల్పవృక్షం గ్రంధానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. బెజవాడ రేడియో స్టేషన్ వారి ఆహ్వానంపై విశ్వనాధ సత్యనారాయణ గారు, తన శిష్యులు అయిన పేరాల భరత శర్మ గారిని వెంటబెట్టుకుని కారులో వెడుతున్నారు. అప్పుడు ముచ్చట్ల నడుమ విశ్వనాధ గారు ఇలా చెప్పుకొచ్చారట.
‘ఈ శరీరమే చిత్రమైనది. ఎన్ని బాధలు పడిందో అన్ని సుఖాలూ పడింది. ఈ శరీరంలో ఉన్న సత్యనారాయణ నాటికీ నేటికీ ఒక్కడే. కాని వీడిచుట్టూవున్న సంసారం మారిపోయింది. అప్పుడు నాతో బ్రతికిన భార్య యిప్పుడు లేదు. ఇప్పుడు నా యింట్లో ఎన్ని కూరలున్నా, చుట్టం వస్తే మళ్ళా ఏ బంగాళాదుంపలో ఏవో తెప్పిస్తేగాని తృప్తిగా వుండదు. అప్పట్లో నా కొంపకు చుట్టం వస్తే, వానికి ఏమి మర్యాద చేయగలమా అని నాకు కొంచెం కష్టంగా వుండేది. భోజనం వేళ ఆగదుగదా ! ఆ వేళకు మాఆవిడ వచ్చిన చుట్టానికి, నాకు తిండి సృష్టించేది. ఇంట్లో ఆ పదార్థాలు ఎలా ఎక్కడనుండి ఊడిపడినాయో నాకు తెలియదు. షడ్రసోపేతంగా అమృతాయమానమైన తిండి సృష్టించేది. సృష్టించడమే సుమా! కూర, పప్పు, పులుసు, పచ్చడి ఏమి కావాలో అన్నీ, ఎలా వచ్చినాయి యివన్నీ! నా బీదకాపురానికి అటువంటి సృష్టిచేయడానికి, ఆ మర్యాద దక్కించడానికి ఆ మహా యిల్లాలు పడిన శ్రమ తలచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అదంతా ఎందుకండి! నేను 1956 లో మేడ కట్టాను. అప్పటివరకూ పాకలో వున్నాను. అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే. కాని అప్పటి మా ఆవిడ పడిన కష్టం అంతా ఇంతా కాదు. వాన కురిస్తే ఇంట్లో మోకాటి లోతు నీళ్ళు. ఆ నీళ్ళు తోడేసి రాళ్ళు పేర్చి వాటిమీద యింత ఉడకేసి పెట్టాల్సివచ్చేది. అప్పటి విశ్వనాథ సత్యనారాయణకి యిప్పటి విశ్వనాథ సత్యనారాయణకి తేడా ఏమిటి? అదే శరీరం కారులో పోతుంది. రైలులో పోతుంది. కొన్ని యేండ్లుగా యిలా సుఖపడుతున్నది. లోపల ఉన్న జీవుడు ముందు స్థితి మరచిపోలేదు. మా తండ్రిగారుండగా నేను యువరాజును. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ. ఈ కనపడే భోగం, మేడ అంతా ఆ జీవుడినంటుకోవడం లేదు. అందువల్ల వాడికి దుఃఖమేమిటో కష్టమేమిటో తెలిసినంత సుఖం గూర్చి తెలీదు. వానికి గర్వం ఎలా వుంటుంది? బ్రతికి వున్నాను కనుక యివన్నీ అనుభవిస్తున్నాను. ఆ భార్య లేదు. ఆమెకీ అనుభవంలేదు. ఇప్పుడింత మహాకవిని, అప్పుడూ మహాకవినే నన్ను మహాకవిని చేసినది ఆమె’’ ఈ మాటలాయన కళ్ళల్లో చెమ్మతో అన్న మాటలు. వరలక్ష్మీ త్రిశతిలో అన్నారు కదా!
‘‘వట్టి నీరసబుద్ధి నట్టినన్ను రసోత్థపథముల సత్కవీశ్వరుని జేసి
…….ఇతరు లెవ్వరు నెరుగని యీ రహస్య ఫణితి నను
నేలుకొనిన నా పట్టమహిషి’’
‘‘నా యఖిల ప్రశస్త కవనమ్మున కాయమ పట్టభద్రురా
లాయమ లేక యాధునికమైన మదున్నత చిత్తవృత్తి లేదు’’
అని చెప్పారు.
శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరుఏండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకు కూడా సరిగా అదే వయస్సులో ఆ భార్యావియోగ మహాదు:ఖం సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయినాడాయన’ అని ముగించారు భరత శర్మగారు.
ఇంత అద్భుతమైన వృత్తాంతాన్ని అందచేసిన సోమయాజులు గారికి ధన్యవాదాలు.
అంత పెద్దవారితో పోల్చుకుని నా భార్యా వియోగానికి ఉన్నతిని కల్పించడం కోసం కాదు ఇది మొదలు పెట్టింది.
అమెరికా వచ్చిన తర్వాత కాలక్షేపం కోసం నెట్ సంచారం చేస్తుంటే, కొన్ని పాత వీడియోలు కంటపడ్డాయి. వాటిల్లో ఒకటి మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత్రికేయ రంగంలో జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించి నాకు అందచేసింది. ముఖ్యమంత్రి నుంచి అది స్వీకరిస్తున్నప్పుడు దాన్ని పైలోకాల్లో వున్న మా ఆవిడకి చూపించడానికి పైకి ఎత్తాను. నా ఈ చర్యను ఎవరు గమనించారో లేదో నాకు తెలియదు. నాకు రావాల్సిన గుర్తింపు రాలేదని ఆమెకు మనసులో కొంచెం కినుకగా వుండేది. అది వచ్చిన రోజున ఆమె లేదు.
తోకటపా!
ఈ అవార్డు వచ్చిన ముహూర్త బలం ఏమిటో కానీ అప్పటి నుంచి నా రాజకీయ రచనా వ్యాసంగానికి స్వస్తి చెప్పాల్సిన దుర్గతి దాపురించింది.
అది ఒక ప్రభుత్వం ఇచ్చిన అవార్డు.
అయితే అప్పటికే రాజకీయ పారావారాలుగా విడిపోయిన సోషల్ మీడియాలో ఒక వర్గం నామీద దాడి మొదలుపెట్టింది. ఆఖరికి ఈ ట్రోలింగు (అప్పుడే మొదటిసారి ఈ పదానికి వున్న పదును నాకు బోధపడింది) గొడవల్లో అభం శుభం ఎరుగని, చనిపోయిన నా ఇల్లాలిని కూడా ఇరికించి అభాండాలు వేశారు. నలభయ్ ఏళ్ళ జర్నలిజం కెరీర్ లో ఏనాడు ఇటువంటి అపప్రథకు గురికాని నాకు ఆ పరిణామాలు చాలా మనోవేదన కలిగించాయి. నా భార్య చనిపోయి బతికిపోయిందనే భావన కలిగింది. దానితో రాజకీయ రచనా వ్యాసంగానికి భరత వాక్యం పలికాను. ఇతరుల రాజకీయ పోస్టులు, అవి ఎంత సమ్మతంగా ఉన్నాసరే, వాటికి లైకులు కొట్టడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ స్వచ్చందంగా మానేశాను. టీవీ చర్చల నుంచి తప్పుకున్నాను. ఒంటరి జీవితంలో కొంత ఉపశమనం ఇస్తున్న వ్యాసంగాన్ని వదులుకుని మళ్ళీ ఒంటరి గుహలో కూర్చుని నా జీవిత కధా రచనతో కాలక్షేపం చేస్తున్నాను.

కింది ఫోటో:
విశ్వనాధ సత్యనారాయణ గారు

No photo description available.

(ఇంకా వుంది)

9, జులై 2025, బుధవారం

జులై తొమ్మిది

 దేవుడికి తెలియదా తనకు దగ్గరి వారెవ్వరో! అందుకే తన దాపున వున్న మీ ఇద్దరినీ తన దగ్గరకు చేర్చుకున్నాడు.

సంతోష్! నువ్వూ అమ్మా ఇద్దరూ ఒకే తేదీన పుట్టారు. తను ఫిబ్రవరి తొమ్మిది, నువ్వు జులై తొమ్మిది. చెట్టంత పెరిగి చల్లగా చూసుకుంటావని కన్న కలలు కల్లలు అయ్యాయి. అయినా నీ చేతిలో ఏముంది?
ఈరోజు నీ పుట్టినరోజు. నీకు శుభాకాంక్షలు. ఎక్కడ వున్నా అక్కడినుంచే నీ చిన్నారి ముద్దులపట్టి జీవికను ఆశీర్వదించు. నీ ఫోటో చూడగానే నాన్న, నాన్న అంటుంది. నువ్వెలా మరచిపోతావ్!













8, జులై 2025, మంగళవారం

నెత్తినే వుంది గంగమ్మ – భండారు శ్రీనివాసరావు

 శివ రాచర్ల గారితో ఓ పదిహేనేళ్ల క్రితమే పరిచయం అయివుంటే బాగుండేదని మరో పాతికేళ్ళ తర్వాత కూడా అనుకుంటాను. వచ్చే నెలలో ఎనభయ్యవ పడిలో పడతాను కనుక నాకా అదృష్టం ఉండకపోవచ్చు.

పిలిచిన ప్రతి ఛానల్ కు వెళ్లి ఇంటర్వ్యూలు ఇచ్చే రోజుల్లో,  ఒకరోజు ఆయన ఒక స్టుడియోలో పరిచయం అయ్యారు. తర్వాత కూడా కొన్నిసార్లు కలిశాము. నాదీ స్నేహ స్వభావమే కానీ పేర్లు, మొహాలు చప్పున గుర్తు రావు. అంచేత మధ్యలో ఎవరో మళ్ళీ పరిచయం చేయడం, నేను శివగారు నాకెందుకు తెలియదు అన్నట్టు కప్పి పుచ్చుకోవడం వారికి అర్ధం అయ్యే వుంటుంది. అయితే తర్వాతి రోజుల్లో  నా మతిమరపు తత్వాన్ని ఆయన అర్ధం చేసుకున్నారు అనే అనుకుంటున్నాను. లేకపోతే, నన్నో పొగరుమోతుగా భావించి,  మధ్యమధ్యలో ఫోన్ చేసి మాట్లాడేవారు కాదు.

ఇక ఆయన సంగతి చెప్పాలంటే  ఒక నడిచే ఎన్సైక్లో పీడియా. చేయి తిరిగిన జర్నలిస్టుల దగ్గర కూడా లేనంత రాజకీయ సమాచారం శివ గారి దగ్గర వుంది. ఇక ఇరిగేషన్ రంగంలో ఆయన పరిజ్ఞానం అపూర్వం. ఇవ్వాళ ఎవరో పోస్టు పెడితే అదే కామెంటు పెట్టాను, శివుడి నెత్తి మీదే గంగ వుంది, ఇక నదుల గురించి ఆయనకు మనం చెప్పాలా అని.

ఆయన గురించి అనేకమంది కామన్ మితృలు రాసిన పోస్టులు అమెరికాలో తీరి కూర్చుని చదివాను . శివగారిలో  నాకు తెలియని అద్భుత  కోణాలను పరమాద్భుతంగా ఆవిష్కరించారు. వారందరికీ నా ధన్యవాదాలు.

ఇక ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటారా! ఈ ఒక్కరోజే ఎందుకు? వారికి నా తరపున ప్రతిరోజూ, ప్రతి ఉదయం  వుంటాయి.

మరో ముక్కతో ఈ పోస్టు ముగిస్తాను.

కిందటి నెలలో నా అమెరికా ప్రయాణం.

ఓరోజు పొద్దున్నే శివగారి నుంచి ఫోను. పదిన్నరకు వస్తాను అన్నారు. అన్నట్టే వచ్చారు.

ఇలా నా అంతట నేనుగా మిత్రులను వెళ్లి  కలిసే రోజు ఎప్పుడు వస్తుంది?  రాదని తెలుసు. ఎందుకంటే నేనో సీతయ్యను.

Many many happy returns of the day Siva Racharla garu  





7, జులై 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (190) : భండారు శ్రీనివాసరావు


నాకు సముద్రం అంటే వల్లమాలిన ప్రేమ. తీరంలో కూర్చుని ముందుకు వెనక్కి వెళ్ళే అలలు చూస్తూ, సముద్రపు హోరు వింటూ గంటలు గంటలు గడపాలని అనిపిస్తుంది. కానీ నా చదువు సంధ్యలు సాగిన విజయవాడలో కానీ, ఖమ్మంలో కానీ, ఉద్యోగాలు వెలగబెట్టిన హైదరాబాదు, మాస్కోలలో కానీ ఎక్కడా సముద్రం లేదు. పెద్దయ్యేవరకు సినిమాల్లో చూసి సంతోషించడమే.

అలాంటిది 2025 జులై ఆరో తేదీ, ఒకే రోజున ఒకే సముద్రంతో, అదీ ప్రపంచంలో అతిపెద్దదైన పసిఫిక్ మహాసముద్రంతో  మూడు చోట్ల ములాఖత్తులు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ మొదలుకుని  రాత్రి డిన్నర్ వరకూ పసిఫిక్ తీరాల్లోనే గడిపాము.  కేనన్ బీచ్, హగ్ పాయింట్ బీచ్, షార్ట్ శాండ్ బీచ్ ఈ సముద్రానికి సంబంధించి అరెగాన్ రాష్ట్రంలో మూడు ప్రముఖమైన పర్యాటక ప్రాంతాలు. లాంగ్ వీకెండ్ కావడంతో జనం పోటెత్తారు. ఫలితం రహదారులపై వాహనాల వరద. కారు పార్కింగ్ కోసం వెతుకులాట. చాలా సమయం కృష్ణార్పణం. 

హగ్ పాయింట్

వున్నవూరు వాడికి వల్లకాడు  భయం, పొరుగూరువాడికి  ఏటి భయం అనేది మా బామ్మగారు. 

వున్న ఊరు వాడికి ఏటి భయం వుండదు. ఏట్లో ఎంత వరద పారుతోందో, ఎక్కడ సుడిగుండాలు వున్నాయో ఈ వివరాలు తెలుసు కనుక భయం లేకుండా ఏరు దాటేస్తాడు. అదే స్మశానం అంటే జంకుతాడు. పొరుగూరు వాడికి అంటే పరదేశికి ఏటిలో ఎక్కడ ఎంత లోతు ఉన్నదో అని భయపడి ఏరు దాటడానికి భయపడతాడు. వల్లకాడు అని తెలియదు కాబట్టి నిక్షేపంగా అందులో నడిచి వెడతాడు.

హగ్ పాయింట్ బీచ్ లో నా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో విలాసంగా కూర్చుని ఎదురుగా కనబడుతున్న అనంత జలరాశిని చూస్తూ కాలక్షేపం చేస్తున్న సమయంలో, మూడు నాలుగేళ్ల కుర్రాడు ఒకడు సముద్రం ఎదురుగా వెడుతూ కనిపించాడు. చుట్టుపక్కల చూస్తే అతడి తాలూకు వాళ్ళు ఎవరూ కనిపించలేదు. అరెరే అనుకుంటుంటే ‘భయపడకండి ఇక్కడి వాళ్లకు ఇవన్నీ మామూలే’ అన్నట్టు మా వాళ్ళు కళ్ళతోనే వారించారు. ఆ పిల్లాడు కూడా సముద్రంలో దిగి అలలతో ఆడుకుంటున్నాడు. ముందుకు పోవడం, ఎగిసే కెరటాలతో పాటు వెనక్కి రావడం. కాసేపటి తర్వాత  ముందు పరిగెత్తుతున్న ఓ కుక్క, దాని వెనుకనే పరిగెత్తుకుంటూ అతడి తలితండ్రులు కాబోలు,  పిల్లాడికంటే అదే ఎక్కువ అన్నట్టు కనిపించారు.    

మా చిన్నప్పుడు  మా ఊళ్ళో కొందరు నా దోస్తులు లోతయిన దిగుడుబావిలోకి పైనుంచిదూకేవారు. వాళ్ళ పెద్దవాళ్లు కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. మోచేతులు, మోకాళ్లు చీరుకుపోయినా తేలిగ్గా తీసుకునే వారు. జీవితంలో ఢక్కా మొక్కీలు తినాలంటే ఇవన్నీ తప్పవు అన్నట్టు వుండేది వాళ్ళ వ్యవహారం.

పసిఫిక్ తీరంలో ఇసుక కూడా సాయంత్రపు సూర్య కాంతికి మిలమిలా మెరుస్తోంది. నాలుగుసార్లు మర పట్టించిన బియ్యపు తవుడులా ఎంతో మెత్తగా వుంది. ఈ బీచ్ లోకి వెళ్ళాలి అంటే పైన కార్లు ఆపుకుని కాలినడకన దాదాపు ఓ కిలోమీటరు  కొండ దిగి వెళ్ళాలి. ఆ కొండదారికి ఇరువైపులా ఆకాశాన్ని తాకుతున్నట్టు పొడవైన వృక్షాలు.  నడుమ సెలయేళ్ళు. వాటి మీద కర్ర వంతెనలు. ఆ కాలిబాటలో నడిచేవాళ్ళు ఒక నిబంధన పాటించడం గమనించాను. దిగేవాళ్ళు కుడివైపుగా దిగుతుంటే, పైకి వచ్చేవాళ్ళు ఎడమవైపుగా ఎక్కుతున్నారు.

ఆ చెట్లని చూస్తుంటే ఇవి కూడా పసిఫిక్ సముద్రంతో పాటే పెరిగాయా అన్నట్టు కొన్ని గజాల చుట్టుకొలతతో, మెడలు రిక్కించి చూడాల్సిన  ఎత్తులో వున్నాయి. గొడ్డలి వేటు అంటే ఏమిటో తెలియనట్టుగా పెరుగుతున్నాయి. పెనుగాలులు వీచినప్పుడు కూకటి వేళ్ళతో కూలిన పెద్ద చెట్టు ఒకటి కనిపించింది. అది అలాగే పడివుంది. దాని కాండం మీద మరికొన్ని చెట్లు పెరుగుతున్నాయి.  

ఆ కిలోమీటరు నడవడానికి నా ఒళ్ళు నాకే బరువనిపించి ఆయాసపడుతుంటే, ఆడా మగా తేడా లేకుండా చాలామంది బరువైన సర్ఫింగ్ బోట్లు పట్టుకుని చులాగ్గా నడిచి వెడుతున్నారు. రోజంతా బీచిలో, సముద్రంలో గడపడానికి తమవెంట తెచ్చుకున్న టెంట్లు, కుర్చీలు, తిండి పదార్ధాలు ఈ బరువుకి అదనం. బీచిలోకి అడుగు పెట్టగానే దుస్తులు తీసేసి, ఈత దుస్తుల్లోకి మారిపోయి సర్ఫింగ్ బోట్లు తీసుకుని, నేరుగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నారు. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ  సర్ఫింగ్ చేయడం వాళ్ళకో ఆట మాదిరిగా వుంది. 

రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా వెలుతురు తగ్గలేదు. నీరెండలో నా నీడ పొడవు రెండింతలు సాగింది. సముద్రం మీద నుంచి వీస్తున్న బలమైన గాలులకు వాతావరణం బాగా చల్లబడింది. ఆ చలి గాలి తగలకుండా నన్ను రెండు గుట్టల నడుమ కూర్చోబెట్టారు. కోడలు భావన ముందుగా సిద్ధం చేసి తీసుకువచ్చిన పులిహార పెరుగన్నం తింటూ మెత్తటి ఇసుకపై మా చిన్న మనుమరాలి పేరు తెలుగులో రాశాను. అదోతుత్తి. అంతే!


కేనన్ బీచ్ లో, సముద్ర జలాల మధ్య వుండే  హే క్ కొండని చూడడానికి వెళ్ళాము. విపరీతమైన రద్దీ. పెయిడ్ పార్కింగ్ కోసం అరగంట వెతికినా దొరకలేదు. పదిహేనేళ్ల క్రితం వచ్చినప్పుడు దీన్ని దగ్గర నుంచి చూశాము. అప్పుడు సముద్రం బాగా వెనక్కి పోయింది. దానితో  కొండ తీరంలోకి వచ్చింది. చుట్టూ నీళ్ళ మధ్య వుండే ఈ కొండను పక్షుల సంరక్షణా కేంద్రంగా అభివృద్ధి చేశారు.   

కేనన్ బీచ్ కి వెళ్లే దోవలో అడవి మలుపులో అడవి దుప్పి ఒకటి  కనిపించింది. చాలా బలిష్టంగా వుంది. అడవి జంతువుల స్వేచ్ఛకు భంగం కలిగించడం కానీ, అడవిలో దొరికే ఆహారం తప్పిస్తే, వాటికి  వేరే ఆహారం అందించడం కానీ వీల్లేదు. ‘మీరు అడవి జంతువుల ఆవాసాల్లోకి అతిధులుగా వచ్చారు. అలాగే వెళ్లిపోండి’ అనే బోర్డులు కొన్ని చోట్ల కనిపించాయి. 

ఇలాంటిదే ఒకటి అమెరికా కెనడా సరిహద్దులో చూశాను.

‘పక్షులు విశ్రాంతి తీసుకుంటున్నాయి వాటికి ఇబ్బంది కలిగించకండి’ అని బోర్డు పెట్టారు.

పోర్ట్ లాండ్ లో నాలుగు రోజులు గడిపి ఈ ఉదయం సియాటిల్ తిరిగివస్తూ మధ్యలో వాషింగ్టన్ రాష్ట్ర రాజధాని అయిన ఒలింపియాలో కాసేపు ఆగి అసెంబ్లీ భవనం, సుప్రీం కోర్టు (టెంపుల్ ఆఫ్ జస్టిస్) భవనాలను చూశాము. ఈరోజు ఆదివారం అనే కాకుండా చూడాలనుకునే వారు ఎప్పుడైనా వెళ్ళవచ్చు. నిషేధాలు లేవు. అనుమతి పత్రాలు అక్కరలేదు. సెక్యూరిటీ తనిఖీలు లేవు. అసలు పోలీసులే లేరు. పైగా ఒక గైడ్ ని పెట్టి భవన విశేషాలను వివరిస్తారు. స్వేచ్ఛగా ఫోటోలు తీసుకోవచ్చు. చాలా పెద్ద భవనం. అనేక మెట్లు ఎక్కి వెళ్ళాలి. భవన నిర్మాణ శైలి అద్భుతంగా వుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో అసువులు బాసిన అమర వీరుల స్మారక స్థూపం ఆ ఆవరణలో వుంది. 

ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా చట్ట సభల్లో శాసనాలు చేస్తారు. ఆ భవనంలో పౌరుల ప్రవేశానికి అభ్యంతరాలు  ఎందుకు? ఆంక్షలు ఎందుకు అనే ప్రశ్నలకు తావు లేకుండా చేశారు.    

కింది ఫోటోలు: అరెగాన్ రాష్టంలో పసిఫిక్ మహాసముద్ర తీరాల్లో విహారం 



















(ఇంకా వుంది)

5, జులై 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (189) : భండారు శ్రీనివాసరావు

 

2025 జులై మూడో తేదీ మధ్యాన్నం భోజనాలు చేసి రోడ్డు ఎక్కాము. సియాటిల్ నుంచి పోర్ట్ లాండ్ 280 కిలోమీటర్లు. అక్కడ కొన్ని రోజుల బస. మళ్ళీ అవే విశాలమైన రోడ్లు. రోడ్లకు ఇరువైపులా అవే పొడవాటి చెట్లు. ఎన్ని మైళ్ళు వెళ్ళినా గోధుమరంగు తివాచీలు పరచినట్టుగా అవే మైదానాలు. ఒక మిత్రుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. సరదాకే అనుకోండి. ఒకాయన అమెరికా వచ్చి నెల తిరక్కముందే ఇంటిదారి పట్టాడట. కారణం అడిగితే, ఏముంది ఇక్కడ! మనిషి మొహమే కనపడదు, ఎటు చూసినా చెట్లూ మైదానాలు అన్నాడట.
జులై నాలుగు అమెరికన్ ఇండిపెండెన్స్ డే. దేశం మొత్తం సెలవు. శని ఆది వారాలు లాంగ్ వీకెండ్. పొలోమని జనం టూరిస్టు రిసార్టులకు బయలుదేరారు. రోడ్లన్నీ కార్లతో నిండిపోయాయి. మూడు గంటలు అనుకున్న ప్రయాణం సాగిసాగి ఆరుగంటలు అయింది.
సువిశాల దేశం. కావాల్సినంత భూమి వుంది. మాంధాతల కాలం నాడే దేశమంతా విశాలమైన రోడ్లు పరిచేశారు. నాలుగు దిక్కులకు, ఎనిమిది మూలలకు. అడ్డంగా, నిలువుగా. ఐ మూలగా. శరీరంలో నాడీ మండలంలాగా దేశాన్ని ఏకం చేస్తూ, ఎక్కడినుంచయినా, ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా రోడ్లు వేసుకున్నారు. అండర్ పాసులు, ఓవర్ బ్రిడ్జీలు, అవీ మూడు నాలుగు వరసలు. ఉత్తరం నుంచి తూర్పు వైపు. పడమర నుంచి దక్షిణం వైపు ఎటు వెళ్ళాలి అంటే అటు వైపు వెళ్ళేలా పద్మవ్యూహం లాంటి రోడ్లు. ఎలా వేసారన్నది కాదు, ఎలా వాటిని మెయిన్ టైన్ చేస్తున్నారన్నది పాయింటు. ఎక్కడా రోడ్లకు మరమ్మతులు చేస్తున్నట్టు కనబడదు. అప్పుడే వేసిన వాటి మాదిరిగా కొత్తగా కనిపిస్తాయి. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ మొదటిసారి అమెరికా వెళ్లి వచ్చినప్పుడు అక్కడి రోడ్లు ఒక సినిమాతార బుగ్గల మాదిరి నున్నగా వున్నాయని చెప్పిన సంగతి గుర్తుంది కదా!
వెళ్ళే దారిలో కొలంబియా నది తగులుతుంది. అది దాటితే అవతల ఒడ్డున అరెగాన్ రాష్ట్రం లోని పోర్ట్ లాండ్ పట్టణం. నది ఇవతల ఒడ్డున వాషింగ్టన్ రాష్ట్రంలోని వాంకూవర్ పట్టణం. కెనడాలోని వాంకూవర్ కాదు, ఇది వేరే. ముందే చెప్పాకదా ప్రపంచంలోని నగరాలన్నీ అమెరికాలో వున్నాయి. అవే పేర్లతో.
వాంకూవర్ లో కాసేపు ఆగి కొలంబియా నది తీరంలో సాయంత్రపు నడక పూర్తిచేయాలని మా వాళ్ళు అనుకున్నారు. నడవడం సంగతి ఎలా వున్నా కొత్త ప్రదేశాలు చూడాలనే ఆసక్తితో నేను కూడా వారితో జత కలిసాను. రెండు రాష్ట్రాలను విడదీస్తూ ఆ నదీ జలాలు సాయంత్రపు సూర్య కాంతిలో అత్యంత మనోహరంగా ఉరకలు పెడుతూ పారుతున్నాయి. నదిలో నీళ్ళు అంత స్వచ్చంగా, కాలుష్యరహితంగా ఎలా వున్నాయో అర్ధం కాని విషయం. నదీ తీరాన్ని గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దారు.
కొలంబియా వంతెన దాటగానే పోర్ట్ లాండ్. జీపీఎస్ చెప్పినట్టు వెడితే మేము నాలుగు రోజులు వుండబోయే బస (AIR BNB) దొరికింది. దాని యజమానులు నెట్లో పంపిన పాస్ వర్డ్ సాయంతో తాళం తీసుకుని లోపలకు వెళ్ళాము. కింద మొత్తం డ్రాయింగు రూము, టీవీ, కిచెన్, డైనింగ్ హాలు. వంట సామాగ్రి, వెనుక విశాలమైన పెరడు. షటిల్ ఆడుకునే ప్రదేశం. ఆరేడు మంది కలసి జలకాలు ఆడుకునే హాట్ టబ్, క్యాంప్ ఫైర్, బార్బీక్యూ, పైన మొదటి అంతస్తులో పడక గదులు. బాత్ టబ్స్ తో స్నానాల గదులు. స్టార్ హోటళ్ళలో మాదిరిగా అన్నీ అమర్చి పెట్టి వున్నాయి. భోజనాల బల్ల మీద రాసి ఉంచిన FAMILY IS EVERYTHING అనే సూక్తి బాగా నచ్చింది.
ఆ సాయంత్రం బాత్ టబ్ లో వేడినీటి జలకాలాతలు, క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చుని చలి కాచుకుంటూ సాయంకాలక్షేపం, తర్వాత వేడివేడి భోజనం కబుర్లు.
పోర్ట్ లాండ్ గులాబీ తోటలకు, ద్రాక్ష తోటలకు ప్రసిద్ధి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైన్ బ్రూవరీస్ వున్నాయి. వాటిల్లో ఎల్క్ కోవ్ ( ELK COVE) వైన్ యార్డ్ సందర్శనకు వెళ్ళాము. ముందుగా రిజర్వ్ చేసుకుని వెళ్ళాలి. దట్టమైన అడవుల నడుమ బ్రహ్మాండంగా వేసిన నున్నటి రోడ్లమీడుగా ఓ గంట ప్రయాణం. అక్కడక్కడా విసిరేసినట్టు ఇళ్లు. స్కూలు బస్ స్టాప్ అనే బోర్డు కనిపించింది. ఎక్కడ ఏ ఆవాస ప్రాంతంలో అయినా నిర్దిష్ట జనాభా వుంటే అక్కడ స్కూలు, ఆసుపత్రి వుండి తీరాలి అనే నిబంధన వుందని చెప్పారు. ఇలా ప్రాధమిక వసతులు అన్ని చోట్లా వున్నండువల్లె పట్టాణాలు, నగరాల మీద భారం పడకుండా జనాలు పల్లె పట్టుల్లో జీవిస్తున్నారేమో అనిపించింది.
కొండల మీద, కొండ సానువుల్లో వందల ఎకరాల్లో విస్తరించి వుంది ఈ ఎల్క్ కోవ్ ( ELK COVE) వైన్ యార్డ్. కొండ శిఖరం మీద వుంది మేము బుక్ చేసుకున్న వైన్ టేస్టింగ్ (రకరకాల వైన్స్ ని రుచి చూపించే రెస్టారెంటు) సెంటర్. నడికారు వయసు వున్న అమెరికన్ మహిళ ఒకరు ఆరు రకాల వైన్స్ ను రుచి చూపించారు. ప్రతి ఒక్క రకం వైన్ విశిష్టతను, అది తయారు చేసిన విధానాన్ని, పండించిన భూమి తరహాను బట్టి రుచుల్లో వచ్చే తేడాలను సమగ్రంగా వివరిస్తూ వైన్ సర్వ్ చేశారు. ఇదంతా ఉచితమే కానీ, వెళ్ళిన వాళ్ళు తమకు నచ్చిన వైన్ బాటిల్స్ కొనుక్కుని వెడతారు. బహుశా ఇదంతా కార్పొరేట్ మార్కెటింగ్ మెలకువల్లో భాగం కావచ్చు.
ఇక్కడి వైన్ యార్డులు, ద్రాక్ష తోటల వైభవం చూసిన తర్వాత రియల్ ఎస్టేట్ ప్రభావానికి బలైపోయిన, ఒకనాటి హైదరాబాదు శివార్లలో వందల ఎకరాల్లో విస్తరించి నగరానికి చక్కటి గుర్తింపు తెచ్చిపెట్టిన అనాబ్ షాహీ ద్రాక్ష తోటల ప్రాభవం గుర్తుకువచ్చి మనస్సు చివుక్కుమంది.
కింది ఫోటోలు:
కొలంబియా నదీ తీర దృశ్యాలు, పోర్ట్ ల్యాండ్ లో మేము బస చేసిన హోటల్ లాంటి ఇల్లు, ఎల్క్ కొవ్ వైన్ యార్డు.




































(ఇంకా వుంది)

2, జులై 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (188) : భండారు శ్రీనివాసరావు

 నదీనాం సాగరో గతి

జులై నాలుగు.
అమెరికా స్వాతంత్ర దినోత్సవం. అతి పెద్ద పండుగ. ప్రధానమైన వేడుక జరిగేది దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ లో అయినా, దేశంలోని అన్ని రిపబ్లిక్ లలో కన్నుల పండుగగా ఈ సంబరం జరుపుకుంటారు.
తీరిక సమయాల్లో మీరేం చేస్తారు అని ఏ అమెరికన్ ని అయినా వచ్చే జవాబు ఒకటే అని నాకనిపిస్తుంది. తీరిక సమయంలో కాదు, తీరిక చేసుకుని మరీ తిరుగుతుంటామనేది వారి సమాధానం. శుక్రవారం సాయంత్రం నుంచి కార్లలో బయలుదేరి ఏదో ఒక పర్యాటక ప్రాంతంలో కాలక్షేపం చేసి మళ్ళీ సోమవారం పని వేళలకు ఇళ్లకు చేరుకుంటారు కాబోలు అనిపించేలా దేశంలోని ప్రధాన రహదారులన్నీ కార్లతో బారులు తీరతాయి. సముద్ర తీరాలు ఉన్న ప్రాంతాలు అయితే, చిన్నదో పెద్దదో ఒక మోటారు బోటును తమ కారుకు తగిలించుకుని వారాంతాలు సముద్రయానాల్లోనో, ఫారెస్ట్ క్యాంపుల్లోనో గడుపుతారు. ఆ సమయంలో వాళ్లకు వయసు గుర్తుకు రాదు.
నాలుగో తేదీ అమెరికన్ ఇండిపెండెన్స్ డే కారణంగా లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి నాలుగు రోజులు పోర్ట్ లాండ్ లో గడపాలని సందీప్ తలపెట్టి దానికి తగ్గ ఏర్పాట్లు చాలా రోజులు ముందుగానే చేశాడు. ఒక స్నేహితుడి కుటుంబం కూడా జాయిన్ అవుతుంది కాబట్టి అన్ని వసతులు వున్నఒక పెద్ద బంగళాను అద్దెకు తీసుకున్నాడు. అక్కడ బస అయిదు పగళ్ళు, నాలుగు రాత్రులు. రేపు మూడో తేదీన రోడ్డు మార్గంలో బయలుదేరి పోర్ట్ లాండ్ ప్రయాణం.
గతంలో ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం అమెరికా వచ్చినప్పుడు ఆ ఏడాది మా పెళ్లి రోజును పురస్కరించుకుని పసిఫిక్ సముద్రపు ఒడ్డున డిపో బే అనే టూరిస్టు పట్టణంలో ఇలాగే మూడు రాత్రులు, నాలుగు పగళ్ళు గడిపేలా చేసిన ఏర్పాట్లు గుర్తుకు వచ్చాయి. ఆ ప్రయాణంలోనే మేము అనేక వింతలు చూశాము.
పసిఫిక్ సముద్ర తీరం పొడవునా కొన్ని వందల మైళ్ల దూరం నిర్మించిన విశాలమయిన రహదారి వెంట కారులో వెడుతుంటే ఎత్తైన చెట్ల నడుమనుంచి అతి పెద్ద ఆ మహాసముద్రం దోబూచులాడుతున్నట్టు దోవపొడుగునా కానవస్తూనే వుంటుంది.
వాషింగ్టన్ స్టేట్ లోని సియాటిల్ నుంచి ఆరెగన్ రాష్ట్రంలోని డీపోబే టూరిస్ట్ రిసార్ట్ కు చేరడానికి ఆరేడు గంటలు పట్టింది.
మధ్యలో ఒక పార్కులో ఆగి ఓ చెట్టు కింద కూర్చుని ఇంటినుంచి తెచ్చుకున్న పులిహోర లాగించాము. డీపోబే లో అయిదు గదులు వున్న ఒక ఇంటి మొత్తాన్ని నెట్లో బుక్ చేయడం వల్ల, కార్లో వున్న జీ పీ ఎస్ సిస్టం సాయంతో ఆ ఇంటిని తేలిగ్గానే పట్టుకోగలిగాము.(అప్పటికి ఈ టెక్నాలజీ కొత్త) మాంత్రికుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలో వున్నట్టు ఆ ఇంటి తాళం చెవిని ఇంటి ముందువున్న ఒక చిన్న లాకరులో భద్రపరిచారు. ఒక కోడ్ నెంబరు ద్వారా దాన్ని తెరిచి తాళం చెవి తీసుకుని లోపల ప్రవేశించాము.
మూడంతస్తుల భవనం. కింద రెండు కార్లు పార్క్ చేసుకోవడానికి షెడ్డు వుంది. పైన విశాలమయిన డ్రాయింగ్ రూముతో పాటు గ్యాస్, డిష్ వాషర్, వంట సామాగ్రి, ప్లేట్లు గ్లాసులతో సహా అన్ని వసతులతో కూడిన కిచెన్ వుంది. పదిమంది భోజనం చేయడానికి వీలయిన డైనింగ్ టేబుల్, అతి పెద్ద ప్లాస్మా టీవీ, ఫైర్ ప్లేస్, సోఫాలు వున్నాయి. పైన పడక గదులు, ఒక పక్కన బాల్కానీలో ‘హాట్ టబ్’ ఏర్పాటు చేసారు. అయిదారుగురు కలసికట్టుగా అందులో కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చు. వెచ్చటి నీటి ధారలు అతి వేగంగా చిమ్ముతూ అన్నివైపులనుంచి శరీరాలను తాకుతూ మసాజ్ చేస్తుంటాయి. అందులోకి దిగిన తరవాత పిల్లలకూ పెద్దలకూ కాలం తెలియదు. చల్లని సముద్రతీరంలో వెచ్చగా జలకాలాడడం అదో అనుభూతి.
స్నానపానాదులు ముగించుకుని, డీపోబే టూరిస్ట్ రిసార్ట్లో వింతలూ విశేషాలు చూస్తూ, అతి దగ్గరలో అలలతో తీరాన్ని తాకుకుతున్న అతి పెద్ద మహాసముద్రాన్ని తిలకిస్తూ కలయ తిరిగాము.
పసిఫిక్ మహా సముద్రం అంటే శాంతిసముద్రమని చదువుకున్నట్టు గుర్తు. కానీ, ‘ఈ పాయింట్ దాటి వెళ్ళవద్దు. అతి పెద్ద అలలు హఠాత్తుగా విరుచుకు పడే ప్రమాదం వుంది.’ అనే హెచ్చరిక బోర్డు కనిపించింది. సునామీలు సృష్టిస్తున్న ప్రమాదాల నేపధ్యంలో ఇలాటి హెచ్చరిక బోర్డులు పెడుతున్నారని తెలిసింది. మేమున్న చోటికి కొన్ని మైళ్ల పరిధిలో ఫ్లారెన్స్, న్యూ పోర్ట్, లింకన్ సిటీ వంటి పట్టణాలు వున్నాయి. ఇవన్నీ టూరిస్ట్ రిసార్టులే. వారికి కావాల్సిన అన్ని వసతులూ పుష్కలంగా వున్నాయి. దేనికోసం వెదుక్కోవాల్సిన అవసరం వుండదు.
ప్రతిచోట ఏదో ఒక ప్రత్యేక ఎట్రాక్షన్ . ఒకచోట సముద్ర గర్భంలో జలచరాల జీవనం ఎలా వుంటుందో తెలియచెప్పే ఆరెగన్ స్టేట్ ఆక్వేరియం చూసాము.
షార్కులు, డాల్ఫిన్ లు, ఆక్టోపస్ లు, ఆనకొండల మధ్య తిరుగుతూ పొద్దు తెలియకుండా గడిపాము.
జీ పీ ఎస్ సిస్టం పుణ్యమా అని దారి కోసం ఎవరినీ దేవులాడాల్సిన పని అంతకన్నాలేదు. అందువల్ల యెంత తెలియని ప్రదేశానికి వెళ్ళినా ‘దారి తప్పే ప్రమాదం’ ఎంతమాత్రం వుండదు.
అతి చిన్న నది
లింకన్ సిటీ సముద్ర తీరంలో ఒక ‘బుల్లి’ అద్భుతాన్ని కూడా చూసాము. నిజానికి అది అద్భుతమేమీ కాదు. దేన్నయినా టూరిస్ట్ ఎట్రాక్షన్ గా అమెరికన్లు ఎలా మార్చుకుంటారనడానికి ఇది మరో ఉదాహరణ.
‘ప్రపంచంలో అతి ’పొట్టి’ నదిని ఇక్కడ చూడవచ్చు’ - అన్న బోర్డు చూసి దాన్ని చూడడానికి ఎంతో ఉత్సాహపడ్డాము. తీరా చూస్తే అదొక పిల్ల కాలువలా వుంది. తీరం పక్కన రోడ్డుకు ఆవల వున్న కొండల్లో పుట్టి సముద్రంలో కలుస్తున్న నది అని తెలిసింది. దాని పొడవు కేవలం 440 అడుగులు. దాన్ని దొరకబుచ్చుకుని టూరిస్ట్ ఆకర్షణగా మార్చివేసారు. ఈ చిట్టి పొట్టి నది సముద్రంలో కలుస్తున్న చోట ఇంకో విశేషం గమనించాము. అదేమిటంటే, ఈ నదిలో నీళ్ళు గోరువెచ్చగా వుంటాయి. ఒక్క అడుగు ముందుకు వేసి సముద్రంలో కలుస్తున్న చోట కాలు పెడితే, గడ్డ కట్టేంత చల్లగా వుంటాయి.
సియాటిల్ తిరిగి వచ్చేటప్పుడు మార్గం మార్చుకుని పసిఫిక్ తీరంలో వున్న మరో పెద్ద టూరిస్ట్ రిసార్ట్ కానన్ బీచ్ కి వెళ్లి ప్రపంచ ప్రసిద్ది పొందిన ‘హేస్టాక్ రాక్’ ని చూసాము. సముద్రంలో వుండే ఈ కొండ, సముద్రాన్ని చీల్చుకు పైకి వచ్చిందా అన్నట్టుగా వుంటుంది. దాన్ని పక్షుల సంరక్షణా కేంద్రంగా అభివృద్ధి చేసారు. మేము వెళ్ళిన రోజు సముద్రం ఎందుకో లోపలకు వెళ్ళిపోయి ఆ కొండ వరకూ వెళ్ళడానికి వీలుచిక్కింది.
అక్కడి వారు చెప్పిన దాని ప్రకారం ఇది అరుదైన విషయమే. వేలమంది ఆ వింతను చూడడానికి రావడంతో ఆ బీచ్ అంతా ఎంతో కోలాహలంగా కానవచ్చింది. మనవైపు ఏటి వొడ్డున ఇసకలో గుజ్జన గూళ్ళు కట్టినట్టు అక్కడ పిల్లలందరూ ఆ తీరంలో ఇసుకతో పెద్ద పెద్ద ప్రాకారాలు నిర్మించి ఆడుకోవడం గమనించాము. ఇందుకు అవసరమయిన పరికరాలన్నీ వారు వెంట తెచ్చుకున్నట్టున్నారు. ఇవికాక అనేక రకాల ఆకారాలతో పెద్ద పెద్ద పతంగులు (గాలిపటాలు) ఎగురవేస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు వందల సంఖ్యలో కనిపించారు.
చూసినవాటిని మనస్సులో భద్రపరచుకుంటూ సియాటిల్ రోడ్డు ఎక్కాము.
కింది ఫోటోలు: (పదిహేను ఏళ్ల నాటివి)
పసిఫిక్ సముద్ర తీరంలో విహార యాత్ర.














(ఇంకా వుంది)

1, జులై 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (187) : భండారు శ్రీనివాసరావు

మీ పేరు త్రినాధ్ కదూ!

అన్ని రోజులకు ఒకటికి మించిన పేర్లు ఉన్నట్టే ఒకరోజు స్టేట్ బ్యాంక్ డే.
రిటైర్ అయి పుష్కరం దాటింది. ఆ కాలంనాటి రాతలు, కోతలు ఇప్పుడు లేవు. అంతా హైటెక్. అన్నీ కంప్యూటర్ల మీదే. అయినా ప్రతిదానికీ ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు మాత్రం తప్పడం లేదు. అదృష్టం! ఎవరూ దక్షిణలు అడగడం లేదు.
పెన్షన్ స్లిప్ మెయిల్ లో పంపారు. వివరాలు అన్నీ సరిగానే వున్నాయి. కానీ పెన్షన్ నామినీ కాలంలో మా ఆవిడ పేరు లేదు. పెళ్లి నాడు కూడా ఇద్దరం కలిసి ఫోటో దిగలేదు కానీ, రిటైర్ అయ్యేముందు పెన్షన్ పుణ్యమా అని ఇద్దరం పొలోమని స్టూడియోకి వెళ్లి మరీ ఫోటో తీయించుకుని ఆఫీసులో ఇచ్చాము. తీరా ఇప్పుడు చూస్తే నామినీ పేరు గల్లంతు.
ఇలాటి విషయాల్లో కాలయాపన పనికిరాదు అనే మా మాజీ స్టేషన్ డైరెక్టర్ శాస్త్రి గారి మాట విని కోటీలోని స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి వెళ్లాను. 1975లో రేడియోలో చేరినప్పటి నుంచి ఈనాటి వరకు నా అక్కౌంటు అక్కడే, ఎన్. మధుర బాబు గారు సీనియర్ బ్రాంచ్ మేనేజర్. అప్పట్లో అన్నీ మానవ సంబంధాలు. స్లిప్పు రాయడం, టోకెన్ తీసుకోవడం, మన నెంబరు పిలిచినదాకా ఆ ముచ్చటా ఈ ముచ్చటా చెబుతూ కాలక్షేపం చేయడం, లేదా బ్రాంచి మేనేజర్ దగ్గర భేటీ వేయడం అలా కాస్త కాలక్షేపం, కాస్త స్వకార్యం. ఇప్పడు అలా లేదు. ఒక పెద్ద అధునాతన ఎయిర్ పోర్ట్ మాదిరిగా వుంది.
అన్నీ కంప్యూటర్లు, వాటి వెనక కనీకనపడక సిబ్బంది తలకాయలు. పనిచేస్తున్నారో, సెల్ ఫోన్లు చేస్తున్నారో తెలవదు. అంతా హడావిడి. బయట కస్టమర్లది కూడా అదే తంతు. ఒకరికొకరు తెలవదు, ఎవరికి వారికి తమ పని ముందు చక్కబెట్టుకుని చక్కా పోవాలనే ఆత్రుత.
‘చివరికి ఇక్కడ కాదు, పెన్షనర్ల విభాగం మరో పక్కన ఇదే ఆవరణలో వుంది, అక్కడికి వెళ్లండని చల్లగా కబురు. ఆ బిల్డింగు పెద్ద పెద్ద పొడవాటి మెట్ల వరుసతో చాలా అందంగా, అధునాతనంగా వుంది. మొదటి అంతస్తులో వుంది ఈ విభాగం. మా ఆవిడను తీసుకుని వెళ్ళిన రోజు జనం లేరు, ఖాళీగా వుంది. బయట రిసెప్షన్ లో ఎవరూ లేరు. గాజు తలుపు నెట్టుకుని లోపలకు వెళ్లి అక్కడ ఒకర్ని వాకబు చేసాను. అతడు ఆశ్చర్యంగా నా వంక చూసి, ‘ఇక్కడి దాకా ఎలా వచ్చారు. లోపలకు ఎవరూ రాకూడదు, బయట రిసెప్షన్ వరకే మీకు అనుమతి’ అంటూ నాకు ఓ క్లాసు పీకాడు. బయటకు వచ్చి చూస్తే రిసెప్షన్ సీటు ఖాళీగా వుంది. కాసేపటికి ఒకావిడ వచ్చి అక్కడ నిల్చుంది. ఆవిడ ఉద్యోగా, నాలాగా వచ్చిన మనిషా అని తేరిపార చూస్తుంటే, ఆవిడ కళ్ళు విప్పార్చి ‘ఏం కావాలి’ అని అడిగింది. వెళ్లి చెప్పాను. పేరు, అక్కౌంట్ నెంబరు వివరాలు అడిగి తెలుసుకుంది. నేను, ‘మా ఆవిడ మా ఆవిడే’ అనడానికి నాదగ్గర ఉన్న అన్ని ఆధారాలు అంటే ఆధార్ కార్డు, పెన్షనర్ కార్డు, ఏళ్ళతరబడి అదే బ్యాంకులో ఉన్న బ్యాంకు జాయింటు అక్కౌంట్ వివరాలు, పాసుపోర్టు ఇలా అన్నీ ఆవిడ ముందు పెట్టాను. ‘పెన్షన్ పేమెంటు ఆర్డరు ఏదీ’ అని అడిగింది.
రిటైర్ అయిన తరువాత నాలుగిళ్ళు మారాను. ఈ సంధి కాలంలో ఏటీఎంలు, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు వగైరాలు వచ్చిపడి కొన్ని పాత కాగితాలకు కాలం చెల్లిపోయిందని నిర్లక్ష్యం చేసిన జాబితాలో ఈ కాగితం కూడా చేరి పోయివుంటుంది. కానీ ఆ కాగితం లేనిదే పని జరగదు అనే తెలివి తెచ్చుకుని ఇంటికి చేరి ఇంటిల్లిపాదీ ఆ కాగితాన్వేషణ కార్యక్రమంలో తలమునకలు అయ్యాము. ఇల్లంతా చిందర వందర కావడం తప్పిస్తే కాగితం జాడ లేదు. అతి ముఖ్యమైన వాటిని అతి జాగ్రత్తగా దాచే నైపుణ్యం కలిగిన మా ఆవిడే వాటి పత్తా కనుక్కుంది. మహా భారతం విరాట పర్వం అజ్ఞాత వాసంలో పాండవులు ఆయుధాలను జమ్మి చెట్టు కొమ్మల్లో దాచినట్టు, పెన్షన్ పత్రాలను ఒక సీనా రేకుల పెట్టెలో పెట్టి ఆ పెట్టెను భద్రంగా అటక ఎక్కించింది.దాన్ని దింపి చూస్తే ఎప్ప్పుడో పుష్కరం నాడు దిగిన మా దంపతుల ఫోటో ఉన్న పెన్షన్ పేమెంటు ఆర్డరు బుక్కు కనిపించింది. తెల్లారగానే దాన్ని పట్టుకుని, దారి మధ్యలో జిరాక్స్ కాపీలు తీయించి, అక్కడికి పడుతూ లేస్తూ వెళ్లాను.
పోయి చూస్తె, ఆ రిసెప్షన్ హాలు మొత్తం పెన్షనర్లతో కిటకిట లాడుతోంది. నా మొహం చూసి నాలాగే పనిమీద వచ్చిన ఒకాయన, ‘సోమవారం మాస్టారు, సోమవారం రష్ ఇలాగే వుంటుంది’ అన్నాడు. కాసేపటి తరవాత ఆయనే కలిగించుకుని ‘అలా నిలుచుండి పొతే అలాగే వుంటారు. ముందు ఆ రిసెప్షన్ బల్ల మీద ఉన్న రిజిస్టర్ లో మీ వివరాలు రాయండి’ అన్నాడు. “ఇక్కడ నిఘా కెమెరాలు వున్నాయి, కాస్త నవ్వు మొహం పెట్టండి’ అనే సెన్సాఫ్ హ్యూమర్ కలిగిన బోర్డులు వున్నాయి కానీ, ఇటువంటి ముఖ్యమైన సంగతి తెలిపే సమాచార సూచిక అక్కడ ఏమీ కనబడలేదు.
రిజిస్టర్ లో వివరాలు రాసి ఓ పక్కన నిలుచున్నాను. ఈసారి సీట్లో మరో అమ్మాయి కూర్చుని వుంది. ప్రతి ఒక్కరి కేసు తన కేసే అన్నంత శ్రద్ధగా వచ్చిన వారికి విసుక్కోకుండా పని చేసి పెడుతోంది. లైన్లో ఉన్న వాళ్లకు ఈ ఆలస్యం కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆ పని తీరు నాకు బాగా నచ్చింది. ఇంతలో ఒక వృద్ధుడు వచ్చాడు. అప్పుడే నా వంతు వచ్చింది. ఆ అమ్మాయి నాతో అన్నది, ‘చూడండి. నిజానికి వరసలో మీరే వున్నారు. ఈయన రిజిస్టర్ లో రాయలేదు. కానీ పెద్దాయన కదా! మీరు ఒప్పుకుంటే ముందీ పెద్దమనిషి విషయం కనుక్కుంటాను’
ఈ రకంగా వృత్తి ధర్మం నెరవేరుస్తున్న ఒక ఉద్యోగిని చూడడం చాలా అరుదు. ఆ పెద్ద మనిషి పని పూర్తి చేసిన తరువాత నన్ను పిలిచింది. వివరాలు అన్నీ మరో మారు పరిశీలించింది. నేను రిటైర్ అయినప్పుడు నామినీ విషయంలో పుట్టిన తేదీ పట్టింపు లేదు. కానీ అదిప్పుడు తప్పనిసరి. నేను ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఒక వైద్యుడు రోగికి చెప్పినంత వివరంగా చెప్పింది. ఆ అమ్మాయి పనిచేసే విధానం చూసిన తరువాత నాకు నా పని కాలేదన్న విచారం కలగలేదు. ధన్యవాదాలు చెప్పి వచ్చేసాను.
నిజానికి ప్రస్తుతం దేశానికి కావాల్సింది ఇలాంటి ఉద్యోగులే.
మొత్తం మీద మా ఆవిడను నామినీగా చేర్చాను కానీ, ఆ అవసరం పడకుండా మరుసటి సంవత్సరమే నన్ను వదిలి వేరే లోకానికి తరలి వెళ్ళింది.
తోకటపా: (కొంచెం పెద్ద తోక సుమా!)
“మీ పేరు త్రినాథ్ కదూ’
అడిగాను నేను బ్యాంకుకు వెళ్ళిన అరగంట తర్వాత వచ్చి కౌంటర్ లో కూర్చున్న కూర్చొన్న ఉద్యోగిని.
“అవును మీకు ఎలా తెలుసు?” అడిగాడు ఆశ్చర్యంగా.
సెల్ ఫోన్ అతడి ముందుకు తోసి, “మీకు అభ్యంతరం లేకపోతే ఒక నిమిషం ఇది చదువుతారా” అని అడిగాను సాధ్యమైనంత వినమ్రతతో కూడిన స్వరంతో. నా గొంతులోని మార్దవాన్ని గమనించి అతడు చదవడం మొదలు పెట్టాడు.
అది నిరుటి సంవత్సరం అంటే 2020 నవంబర్ ఇరవై ఒకటిన పోస్టు చేసిన కధనం.
అదే ఇది:
21-11-2020 నాటికి భండారు శ్రీనివాసరావు అనే వ్యక్తి బతికి వున్నట్టు మా కళ్ళారా చూశాము అని స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఎక్కువ శ్రమ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా ఓ సర్టిఫికేట్ ఇచ్చారివాళ.
మా ఇంటికి ఓ కిలోమీటరు దూరంలో కాబోలు స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ వుంది. శనివారం ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు మూస్తారో అని అనుమాన పడుతూనే బ్యాంకు వైపు అడుగులు వేసాను. మా ఆయన ఇన్నాల్టికి అడుగులు వేసాడు అని సంబరపడి అరిసెలు వండి పెట్టేదేమో, మా ఆవిడ బతికి ఉన్నట్టయితే. ప్రధాన మంత్రి మోడీ కరోనా వున్నది జాగ్రత్త! ఇంటిపట్టునే మూతి (కట్టుకు) మూసుకు వుండండి అని గత మార్చిలో హుకుం జారీ చేసినప్పటినుంచి బుద్దిగా ఇంట్లోనే పడి ఉంటున్నాను.
స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ కార్పొరేట్ తరహాలో తీర్చి దిద్ది వుంది. ఫ్రంట్ డెస్క్ లో ఓ అమ్మాయి కూర్చుని వచ్చిన వాళ్ళను కనుక్కుంటూ వుంది. నాది జీవన్ ప్రమాణ్ అని చెప్పగానే రెండో నెంబరు కౌంటరు చూపించింది. అప్పటికే అక్కడ నాలాంటి వాళ్ళు ఒకరిద్దరు వున్నారు. కరోనా కాలం అని గుర్తుకు వచ్చి కాసేపు ఎడంగానే నిల్చున్నాను. కౌంటర్ లోని వ్యక్తి తలెత్తి నా వైపు చూసి ఆధార్ జిరాక్స్ తెచ్చారా లేకపోతే అదిగో ఆ గదిలో జిరాక్స్ మిషిన్ వుంది వెళ్లి తెచ్చుకోండి అన్నాడు. ఈ మర్యాదకు ఆశ్చర్యపోతూనే అక్కడికి వెడితే నోట్ల కట్టల వెనుక నగదు అధికారి ఒకరు తదేక దీక్షగా డబ్బు కట్టలు లెక్కపెట్టే పనిలో వున్నాడు. అంత సొమ్ము వున్న చోట మసలడం క్షేమం కాదనుకుని గుమ్మం బయటే ఆగిపోయాను. ఈలోగా రెండో నెంబరు కౌంటరులో ఉద్యోగి ఓ నాలుగో తరగతి అధికారిని పిలిచి, నా పనిచేసిపెట్టమని గొంతెత్తి మరీ చెప్పాడు. కానీ అతగాడు మాత్రం తన తీరిక సమయంలోనే, అంటే తోటి సిబ్బందితో ముచ్చట్లు చెప్పడం, తేనీరు సేవించడం వంటి పనులు తీరిగ్గా కానిచ్చిన తరవాతనే నా పని చేసిపెట్టాడు. అయినా షరా మామూలుగా థాంక్స్ చెప్పి మళ్ళీ రెండో నెంబరు వద్దకు వచ్చాను. ఈసారి అతడు ఓ ఫారం ఇచ్చి పూర్తి చేసుకుని రమ్మన్నాడు. నామినీగా నా భార్య పుట్టిన తేదీని ధ్రువపత్రంతో పూరించాల్సిన ఖాళీని డాష్ డాష్ లతో నింపి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అని సెల్ఫ్ సర్టి ఫై చేసి ఇచ్చాను. అతడు నా వేలి ముద్రలు తీసుకుని LIFE CERTIFICATE నా చేతిలో పెట్టాడు.
వయసు మళ్ళిన పెన్షనర్లతో ఓపికగా డీల్ చేస్తున్న ఆ కుర్రాడి పేరు తెలుసుకుని, థాంక్స్ త్రినాద్ అని చెప్పి వచ్చేశాను.
ఏమైతేనేం , నా ఖాతా వున్న స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ కోటీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ ఏడాది పని పూర్తి అయింది.”
ఇదంతా ఓపిగ్గా చదివిన త్రినాధ్ అన్నాడు నాతో మన్నింపుగా.
“సారీ అండీ మిమ్మల్ని బాగా వెయిట్ చేయించాను, మేనేజర్ దగ్గర పనిలో వుండి”
అంటూనే నా పని నిమిషాల్లో పూర్తి చేసి జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ నా చేతిలో పెట్టాడు.
థాంక్స్ త్రినాధ్! (హోప్ టు సీ యు నెక్స్ట్ ఇయర్)
బ్రాకెట్లోది పైకి అనలేదు.

కింది ఫొటో: రిటైర్ మెంట్ కోసం 2005 డిసెంబరులో ఒకరోజు కనపడ్డ స్టూడియోకి వెళ్లి ఆదరాబాదరాగా తీయించుకున్న ఫోటో