21, డిసెంబర్ 2024, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (45) - భండారు శ్రీనివాసరావు

 


డెబ్బయ్యవ దశకానికి ముందు మా అన్నయ్య పర్వతాలరావు గారికి ఖమ్మం నుంచి బెజవాడ బదిలీ కావడం వల్ల నేను ఎస్సారార్  కాలేజీలో,  బీ కామ్ మొదటి సంవత్సరంలో చేరాను. చేరిన కొత్తల్లోనే విద్యార్ధి సంఘం ఎన్నికల్లో భాగంగా లాంగ్వేజ్ అసోసియేషన్ ఎన్నిక జరిగింది. మా క్లాసులో శతమానం భవతి అన్నట్టు వంద మంది. అదే కాలేజీలో బీ ఎస్సీ చదువుతున్న నా మేనల్లుడు తుర్లపాటి సాంబశివరావు పూనికపై నేను కూడా పోటీ చేస్తున్నట్టు పేరు ఇచ్చాను. మాచవరం నుంచి ఇద్దరం రిక్షాలో కాంగ్రెస్ ఆఫీసు రోడ్డులో సింహాల మేడలోని  విశ్వా టైప్ ఇన్స్తిటూట్ లో సూర్యనారాయణ అనే ఫ్రెండ్ ని కలిసి, తెలుగులో అక్కడికక్కడే ఒక గేయం రాసి టైపు చేయించి, సైక్లో స్టైల్ చేయించి  కాలేజీకి  తిరిగి వచ్చి వాటిని క్లాసులో పంచిపెడుతుండగానే గంట మోగింది. వందలో నాకు పదిహేడు ఓట్లు వచ్చినట్టు జ్ఞాపకం. దండిగా ఓట్లు తెచ్చుకుని గెలిచినదెవరంటే జేవీడీఎస్ శాస్త్రి.

చదువులోనే కాకుండా శాస్త్రి, ఇతర విషయాల్లో కూడా ముందుండేవాడు. కాలేజీ కల్చరల్ అసోసియేషన్ కు ఆయనే మకుటంలేని కార్యదర్శి. కవితలు, గేయాలు గిలికే అలవాటున్న నాకు కూడా ఆ మకుటంమీద కన్నుపడింది. వెనకాముందూ చూసుకోకుండా ఏకంగా ఆయనపైనే పోటీ చేశాను. అయితే ఆయన మకుటం గట్టిది, నేను కొట్టిన దెబ్బ ఓటిది అని ఇట్టే తేలిపోయింది. ఓడిపోతే పోయాను కానీ, ఆయనతో నా స్నేహం గట్టిపడింది. ఆయన మిత్ర బృందంలో నాకూ స్థానం దొరికింది. ఇక ఆ మూడేళ్ళూ కలిసే తిరిగాము చదువయినా, సంధ్యయినా! 

'ఒక్కక్షణం' అనే  గేయం ఇలా సాగుతుంది.

"ఒక్క క్షణం తొందరపడి ఓటు వృధా చేయకు - నిప్పుకణికెలాంటిదది నిర్లక్ష్యము చేయకు - మాటలాడబోవుముందు ఒక్కసారి యోచించు - ఓటు వేయబోవుముందు కొద్దిగ ఆలోచించు - స్నేహితునకు ఇవ్వదగిన బహుమానము కాదు ఓటు - శత్రువైన సరే నీకు! అర్హతున్నవానికేయి - చేతులు కాలిన పిమ్మట ఆకులకై  వెదుకకు - మంచికైన చెడుకైన నీదే బాధ్యత మరువకు -  అర్హుడైన వాని గెలుపు నిజము సుమ్ము నీ గెలుపే"

ఎందుకో మా తరగతిలో చాలామంది నా మాట మన్నించారు. చివరి పాదంలో చెప్పినట్టు జేవీడీఎస్ శాస్త్రిని  గెలిపించారు.    

పూర్తి పేరు జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ్రమణ్య శాస్త్రి. ఇంగ్లీష్ అక్షరాల్లో పొడి పొడిగా రాస్తే జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఇంకా పొడి చేసి క్లుప్తంగా చేస్తే జంధ్యాల.  తెలుగు సినీ ప్రేక్షకుల అభిమాన, ఆహ్లాద దర్శకుడు, రచయిత.  

మొదటి పొడుగాటి పేరు బారసాలనాడు బియ్యంలో రాసి పెట్టింది. రెండోది, కాస్త పొట్టిపేరు, స్కూలు, కాలేజీ రికార్డుల్లో రాసుకున్నది. ముచ్చటగా మూడోది ‘జంధ్యాల’ అనే ‘కలం పేరు’ చిరస్థాయిగా వెండి తెరపై స్థిరపడిపోయిన పేరు. తెలుగు హాస్యానికే వన్నె తెచ్చిన పేరు. అందుకే, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకుని అలా వుండిపోయింది.

ఈ భూమ్మీద పడ్డ ప్రతి బిడ్డా ఏడుస్తూనే కళ్ళు తెరుస్తుంది. 1951లో నరసాపురంలో జంధ్యాల పుట్టినప్పుడు బొడ్డు కోసిన మంత్రసాని జాగ్రత్తగా గమనించి వుంటే, ఏడుస్తున్న ఆ పిల్లాడి పెదవుల నడుమ సన్నటి నవ్వుతెర కనిపించి వుండేదేమో.

జంధ్యాల నాన్నగారు జంధ్యాల నారాయణమూర్తి బెజవాడలో పేరుమోసిన వ్యాపారి. అనేక జిల్లాలకు బుష్ రేడియో డీలరు. ఆ రోజుల్లో రేడియోలకి మంచి గిరాకి. అంచేత నారాయణ మూర్తిగారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోయింది.

పుటకల నాటికే జంధ్యాల బంగారు పిచిక. బీసెంటు రోడ్డులో ఏడంతస్తుల భవనం.

(ఏడంటే ఏడు అనికాదు, పెద్ద భవనం అని కవి హృదయం. నిజంగానే చాలా పెద్ద ఇల్లు. ఎదురుగా వున్న మోడరన్ కేఫ్ కంటే ఎత్తుగా వుండాలని నారాయణమూర్తిగారు ముచ్చట పడి కట్టించుకున్నారని ఆ రోజులనాటి ముచ్చట) అది కట్టుకున్నాక వాళ్ళ నివాసం, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి దగ్గర నుంచి బీసెంటు రోడ్డుకి మారింది.

మాచవరం ఎస్సారార్ కాలేజీలో మేము, అంటే జంధ్యాల, నేను ఒకే బెంచిలో కూర్చుని బీకాం చదువుతున్నట్టు నటిస్తున్నరోజుల్లో, కాలేజీ ప్రిన్సిపాల్ తో సహా అయ్యవార్లందరూ రిక్షాలు,  సైకిళ్ళమీద కాలేజీకి వస్తుండేవారు. మన జేవీడీఎస్ శాస్త్రి మాత్రం, అంబాసిడర్ కారులో వెనక సీట్లో కూర్చుని దర్జాగా వచ్చేవాడు. డ్రైవరు డోరు తెరిచి నిలబడితే, కారు దిగి కాలేజీలో కాలు పెట్టే జంధ్యాలకు ‘కారున్న కుర్రకారు’ అని పేరు పెట్టింది కూడా నేనే. (మరో విషయం జంధ్యాల చెప్పిందే. ఒకసారి ఆయన హైదరాబాదు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చాడు. అప్పుడు తెలిసింది ఆయన నోటి నుంచి, మా ఆవిడ నిర్మల, పూర్వాశ్రమంలో పేరు బాండ్ జేమ్స్ బాండ్ మాదిరిగా దుర్గ, కనక దుర్గ, ఆవిడా  ఆయనా  మాంటిసొరి స్కూల్లో క్లాస్ మేట్లు అని)

జంధ్యాల రాసిన ‘సంధ్యారాగంలో శంఖారావం’  నాటకం రిహార్సల్స్  హనుమంతరాయ గ్రంధాలయంలో వేస్తుంటే  వెంట నేనూ  వుండేవాడినిఏ వేషమూ వేయకపోయినా. ఏదో కవితలు గిలకడం వచ్చనే పేరు నాకూ వుండేది. దాంతో మా స్నేహం మరింత చిక్కబడింది. డిగ్రీ తరువాత మా దారులు వేరయ్యాయి. నేను ఆంధ్రజ్యోతిలో చేరాను. ఆయన కధ సినిమా మలుపులు తిరుగుతూ  చెన్నై చేరింది.

కట్ చేస్తే...

మద్రాసులో చందమామ రామారావు గారింట్లో ఒక ముందు గదిలో జంధ్యాల  అఫీసు తెరిచాడు. నేనొకసారి వెళ్లాను. గది బయట ‘జంధ్యాల, స్క్రిప్ట్ రైటర్’  అనే నేమ్ ప్లేటు. గదిలో ఒక మేజా బల్ల. దాని వెనుక  కుర్చీలో కూర్చుని రాసుకుంటున్న  జంధ్యాల అనే  జేవీడీఎస్ శాస్త్రి. వెనుకటి రోజుల్లో మాదిరిగా  లేడు. మామూలుగానే మంచి ఛాయ కలిగిన మనిషి. కాకపోతే   జుట్టు కాస్త పలచబడింది.  మొహంలో నవ్వు, ఆ నవ్వులో అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. హాయిగా పలకరించాడు. హాయిగా కబుర్లు చెప్పుకున్నాము. హాయిగా నవ్వించాడు. హాయిగా నవ్వుకున్నాను. ఆ హాయి మనసంతా నింపుకుని బెజవాడ తిరిగొచ్చాను.

మళ్ళీ కట్ చేస్తే...

నేను బెజవాడ ఆంధ్రజ్యోతిని ఒదిలి, హైదరాబాదు రేడియోలో చేరాను. జంధ్యాల మద్రాసులో సినిమాల్లో బిజీ అయిపోయాడు. పదేళ్ళలో రెండువందల సినిమాలకు మాటలు రాశాడంటే ఎంత పని రాక్షసుడిగా మారివుండాలి!

ఒకసారి హైదరాబాదు వచ్చాడు. రేడియో స్టేషన్ కు వచ్చాడు. తన దర్శకత్వంలో మొదటి సినిమా ‘ముద్దమందారం’ తీస్తున్నట్టు చెప్పాడు. ఒక గ్రామ ఫోను రికార్డు ఇచ్చి తన సినిమా పాటలు రేడియోలో వచ్చేలా చేయడం కుదురుతుందేమో చూడమన్నాడు. ఎలాగూ వచ్చాడు కదా అని రేడియోలో ఇంటర్వ్యూ రికార్డు చేసాము. స్టేజి నాటకానికీ, రేడియో నాటకానికీ వుండే తేడా ఆయన అందులో విడమరచి చెప్పిన తీరు నన్ను విస్మయపరిచింది. నాకు తెలిసిన జంధ్యాల, ఇప్పుడు చూస్తున్న జంధ్యాల ఒకరేనా అనిపించింది.. ఇంకోసారి కట్ చేస్తే...

ఓసారి ఢిల్లీలో కలిశాడు. హైదరాబాదుకు చెందిన ఓ లాయర్ తో కలిసి, నేనూ జ్వాలా  ఫైవ్ స్టార్ హోటల్లోని పుస్తకాల షాపులో తిరుగుతుంటే, తెలుగులో మాట్లాడుతున్న మమ్మల్ని జంధ్యాల  గుర్తుపట్టి అదే హోటల్లోని తన గదికి తీసుకుపోయాడు.

గదికి వెళ్ళగానేమాతో వచ్చిన లాయరు గారు ఎలాటి మొహమాటం లేకుండాకొత్త చోటనికానీ, కొత్త మనిషని కానీ  సందేహించకుండా ‘ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చా’ అని అడుగుతూనే జవాబుకోసం ఎదురుచూడకుండా అందులో దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే ఆ గదిలో పరచిన తివాచీ పై తల కిందకు పెట్టి, కాళ్ళు పైకి లేపి లిప్త మాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా అందరికీ కళ్ళు తిరిగిపోయాయి. చిన్న తలపెద్ద బొజ్జఅంత భారీకాయంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెర పోయారు. ఏనుగు శీర్షాసనం వేస్తే ఎలా వుంటుందో అలాంటి దృశ్యాన్ని ఆరోజు చూశాము.

తరువాత వారిరువురి నడుమ సాగిన కవి పండిత చర్చ విని తీరాలి. అప్పటికే  ‘శంకరాభరణం’ సినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాలవిశ్వనాద్ గారిదే మరో సినిమా ‘సప్తపదికి మాటలు రాస్తున్నాడు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ జరిగిన సంభాషణ నిజానికి ఇద్దరు పండిత శ్రేష్ఠుల మధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం స్వరం పెంచకుండాఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకర్ని మించి మరొకరు, అక్షర లక్షలు చేసే తర్కవిన్యాసాలు ప్రదర్శించారు. ‘సప్తపది’ సినిమా క్లైమాక్స్ లో ధర్మాధర్మ విచక్షణకు సంబంధించిన ఈ అంశాలలో  కొన్నింటిని   జంధ్యాల పొందుపరచినట్టున్నారు కూడా.

ఈ చర్చ సాగిన తీరు గమనిస్తేనాకు కాలేజీలో తెలిసిన శాస్త్రిఇప్పుడు చూస్తున్న  ఈ జంధ్యాల, ఈ ఇద్దరూ  ఒకరేనా అన్న సందేహం మరోసారి  కలిగింది. అంతటి పరిణతి ఆయనలో కనబడింది.

మరోసారి కట్ చేస్తే....

నా మకాం మాస్కోకి మారింది. జంధ్యాల  మద్రాసుకి అతుక్కుపోయాడు. క్షణం తీరిక లేని జీవితచట్రంలో ఒదుగుతూ, ఎదుగుతూ   ఏళ్ళతరబడి ఉండిపోయాడు. కధా చర్చలు జరపడం కోసం, రాసుకోవడం కోసం ఒకటి రెండు పెద్ద పెద్ద హోటళ్ళలో ఆయనకు పర్మనెంటు గదులు ఉండేవి. మాస్కో నుంచి   విశ్వప్రయత్నం చేస్తే  మద్రాసులో ఏదో ఒక అయిదు నక్షత్రాల హోటల్లో దొరికేవాడు. అంత దూరం నుంచి ఫోను చేస్తున్నందువల్లనో ఏమో, కాసింత తీరిక చేసుకుని లైన్లోకి వచ్చి మాట్లాడేవాడు. అప్పటికే ఆయన బిజీ డైరెక్టర్ల కోవలోకి చేరిపోయాడు.  మాస్కో థియేటర్లో శంకరాభరణం చూశానని చెబితే ఎంతో సంబరపడ్డాడు.  మాస్కో రమ్మని, అక్కడి మంచు వాతావరణంలో ఒక తెలుగు సినిమా తీయమని అనేక మార్లు చెప్పాను. రెండేళ్ళదాకా కొత్త సినిమాలు గురించి ఆలోచించే తీరుబాటు లేదని చెప్పేవాడు.

సోవియట్ యూనియన్ పతనానంతరం నేను హైదరాబాదు తిరిగి వచ్చి రేడియోలో చేరాను. జంధ్యాల మకాం కూడా చెన్నై నుంచి భాగ్యనగరానికే  మారింది. సినిమాల హడావిడి కొంత తగ్గినట్టు వుంది. ఎప్పుడయినా వెళ్లి కలిసినా తీరిగ్గానే కనిపించేవాడు.

తరువాత చాలా సార్లు కలుసుకున్నాము. భక్త రామదాసు ప్రాజెక్టు కోసం తరచూ ఖమ్మం వెడుతుండేవాడు. ఆయన కారులోనే అప్పుడప్పుడు ఖమ్మం వెళ్లి వస్తుండేవాణ్ని. దోవలో ఎన్నో జోకులు చెప్పేవాడు. చెప్పే సంగతులు మారేవి కానీ చెప్పే తీరులో మాత్రం తేడాలేదు.   

ఇరవైనాలుగు గంటలు బిజీ బిజీగా అనేక సంవత్సరాలు గడిపిన మనిషి ఖాళీగా వుండడం ఎంత బాధాకరంగా  వుంటుందో ఎప్పుడూ నవ్వుతుండే ఆయన మొహంలో అప్పుడప్పుడూ లీలగా కానవచ్చేది.

నిండు నూరేళ్ళ జీవితం అనుకుంటే జంధ్యాల బతికింది యాభయ్ యేళ్ళే. కానయితేనేమి నూరేళ్ళకు సరిపడా  నవ్వులు నలుగురికీ పంచి పెట్టిపోయాడు.

ఆరోజు, 2001 జూన్,19,  నాకు బాగా జ్ఞాపకం వుంది. నేను రేడియోలో వుంటే, రాంపా ఫోను చేసి జంధ్యాల పోయాడని చెప్పాడు. నేను వెంటనే వార్త రాసి ఇచ్చేసి రాజభవన్ రోడ్డులోని వాళ్ల ఇంటికి వెళ్లాను. అప్పుడే కబురు  తెలిసి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఓ కుర్చీలో జంధ్యాల నాన్నగారు నారాయణమూర్తి గారు కూర్చుని వున్నారు. కానీ ఆయనకు ఏదీ తెలియని పరిస్తితి. జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది. ఏమి జరిగిందన్నది, ఒక్కగానొక్క కొడుకు పోయాడన్నది  అర్ధం చేసుకునే స్తితి కాదు. ఏమిటో ఈ జీవితం అనిపించింది.

జంధ్యాల చనిపోయిన రెండేళ్లకు వేటూరి సుందరరామమూర్తి ఇలా గుర్తుచేసుకున్నారు.

హాస్యం, సంగీతం కలిసి ఒకే జన్మ ఎత్తిన హాసంనిన్నటి దరహాసం, జంధ్యాల ఇతిహాసంలో చేరిపోయి రెండేళ్ళు గడిచాయి.ఎన్నేళ్ళు  గడిచినా ఆయన మధుర స్మృతికి మరణం లేదు. ఎంత కాదనుకున్నా కన్నీళ్ళు  కళ్ళతోనే మింగటం కన్నా శరణ్యం లేదు”.

తెలుగుజాతి ‘చిరునవ్వు’, జంధ్యాల అన్నారు వేటూరి.

ఆ వేటూరిగారు కూడా ఇప్పుడు లేరు.  జంధ్యాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.

కానిఆయన అన్నట్టు జంధ్యాల మార్కు  నవ్వుకు మాత్రం   మరణం లేదు.

తెలుగు సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన నాగయ్య ఒక తరానికి తెలుసు. నాగేశ్వరరావు మరో తరానికి తెలుసు. నాగార్జున ఇంకో తరానికి తెలుసు. ఒక తరానికి తెలిసిన వాళ్ళు మరో తరానికి అట్టే తెలియకపోవడంలో విడ్డూరం ఏమీ లేదు. అన్ని తరాలను నవ్వుల్తో రంజింప చేసిన జంధ్యాల నిజంగా అమరుడు

 

తోక టపా :

నేను వంటింట్లోకి వేరే పనిమీద వెళ్ళినాకూడావంట చేస్తున్న మా అమ్మగారు‘పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు’  అనేవారు నొచ్చుకుంటూ,  నేను అన్నం కోసం వచ్చాననుకుని. 
ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే !”

అమ్మ ప్రేమ గురించి ఇంత గొప్పగా చెప్పడం ఆ జంధ్యాలకే సాధ్యం!

కింది ఫోటోలు:


కాలేజి రోజుల నాటి జే.వి.డి.ఎస్. శాస్త్రి


సినీ రంగానికి  చేరిన తర్వాత జంధ్యాల





(ఇంకా వుంది)

చిరకాల సమాగమం – భండారు శ్రీనివాసరావు

సుప్రసిద్ధ పాత్రికేయుడు ఐ.వెంకట్రావు గారిని కలవక చాలా కాలం అయింది. బెజవాడ ఆంధ్రజ్యోతిలో కలిసి పనిచేసే రోజుల్లో అనుదినం కలిసేవాళ్ళం. ఆఫీసుకు దగ్గరలోనే మా ఇల్లు. వారి శ్రీమతి నిర్మల గారితో మా ఆవిడ నిర్మలకు మంచి స్నేహం. ఇద్దరం హైదరాబాదుకు ఆల్ మకాం మార్చిన తర్వాత ఆయన జ్యోతిలో, నేను రేడియోలో పని చేస్తున్న రోజుల్లో తరచుగా కలుస్తుండేవాళ్ళం. ఇక మహా న్యూస్ ఛానల్ ప్రారంభించిన తర్వాత వారానికి ఒకటి రెండు సార్లు టీవీ చర్చల్లో కలవడం జరిగేది. ఫోన్ ఇన్ లోకి తీసుకున్న ప్రతిసారీ నా గురించి నాలుగు మంచి పరిచయ వాక్యాలు చెప్పకుండా ఎప్పుడూ కార్యక్రమం మొదలు పెట్టేవారు కారు. అదీ ఆయన సహృదయత. వెంకటరావు గారిని, వారి శ్రీమతి నిర్మల గారిని రాత్రి ఒక శుభ సందర్భంలో కలుసుకున్నాను.

82 ఏళ్ళు మీద పడ్డాయి, బయట తిరగడం బాగా తగ్గించుకున్నాను అనేది ఎప్పుడు ఫోన్ చేసినా ఐ.వి.ఆర్ చెప్పేమాట. తిరగడం తగ్గించుకున్నారు సరే, రాయడం తగ్గించకండి అనేది నా మాట.

ఈ సందర్భంలో చాలామంది పాత జర్నలిస్ట్ మితృలు తారసపడ్డారు. పాత కబుర్లకు, కాలక్షేపానికి కొదవేముంటుంది. అందులో తెలంగాణా సంస్కృతి పరిఢవిల్లిన ఆ ప్రాంగణంలో.  

తెలంగాణా మీడియా అకాడమి చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి మనుమరాలి వివాహ నిశ్చితార్దానికి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో ఇది.



Photo Courtesy : Journalist Jagan   (20-12-2024)

20, డిసెంబర్ 2024, శుక్రవారం

జీవితమే మధురము రాగసుధా భరితమూ - భండారు శ్రీనివాసరావు

 

జీవితం అంటే ఓ సరదా అనుకునే రోజులు ప్రతివారి జీవితంలో కొన్ని వుంటాయి.
అలాంటిదే ఇదొక రోజు. భలే మంచి రోజు.1995 నాటిది. 

అయిదేళ్ళ మాస్కో జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి 1992 లో హైదరాబాదు తిరిగివచ్చిన తరువాత పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాము.  రష్యా నుంచి ఓడలో వచ్చిన సామానుకు సరిపడిన ఇల్లు.  అదేమిటో కానీ ఆ ఇంట్లో అన్నీ విశాలమైన హాల్సే. గదుల బదులు హాల్స్ కట్టినట్టు వుంది. బాత్ రూములు పడక గది అంత విశాలంగా కట్టి అసలు ముఖ్యమైన వంట గదిని బాత్ రూమ్ సైజులో కట్టి, మమ అనిపించినట్టున్నారు. ఏదైతేనేం, వాస్తు సరిగా లేని ఆ పెద్ద ఇల్లు కొద్ది అద్దెలో దొరికిందని సంతోషించాము. ఆ రోజుల్లో మా ఇల్లు మగపిల్లల హాస్టల్ మాదిరిగా వుండేది.  మా పిల్లలు, వాళ్ళ స్నేహితులు, స్నేహితుల స్నేహితులు ఇలా చాలామంది. సత్తేపే సత్తా సినిమాలో హీరోల్లా  జుట్లు పెంచుకుని అందరూ మగపిల్లలే. ఆఖరికి ఇంట్లో పిల్లి కూడా మగ పిల్లే. 
వాళ్లకు కాఫీలు, టిఫిన్లు, కొండొకచో భోజనాలు, అదనంగా నా స్నేహితులు వాళ్లకు మంచింగులు వగైరా ఏర్పాట్లతో మా ఆవిడ 24 x 7 బిజీబిజీ.  24 x 7  అని ఎందుకు అంటే ఈ మగపిల్లలు అందరూ నిశాచరులు. అందులో నేను కూడా.  ఎవరు ఎప్పుడు ఇంటికి  వస్తారో వాళ్ళకే తెలియదు. ఎప్పుడూ పాటలు,   డాన్సులతో ఇల్లు మార్మోగుతూ వుండేది. మా పొరుగింటాయన బహు శాంతమూర్తి కావడం వల్ల మర్యాద దక్కింది.
అలాటి రోజుల్లో ఒకనాటి సరదా వీడియో ఇది. ఇందులో చనిపోయిన మా అక్కయ్యలు, మా ఆవిడ వున్నారు. మా అన్నయ్య వదినల చేత కూడా డాన్సులు చేయించారు.  నేనూ. మా ఆవిడ సరే. ఇష్టం వున్నా, ఇష్టం లేనట్టుగా రెండు స్టెప్పులు వేసింది.
ఆ నాటి బ్లాక్ అండ్ వైట్ వీడియోకి, ఆ రోజుల్లో బాగా పాపులర్ అయిన  ప్రేమ దేశం  సినిమా పాట స్థానంలో    కొత్త సినిమా పాట ( డీజే టిల్లు సినిమాలోది)  రీమిక్స్ చేసి యూ ట్యూబ్ లోకి ఎక్కించాడు మా మూడో అన్నయ్య కుమారుడు భండారు రమేష్.
మరో విషయం చెప్పుకోవాలి. ఆరోజుల్లో మా ఇంట్లో రికామీగా తిరిగి పెరిగిన ఆ పిల్లలు అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని, జీవితంలో చాలా మంచి స్థాయిలో స్థిరపడ్డారు. వాళ్ళలో అధిక శాతం విదేశాల్లోనే.
వాస్తు మహిమ కాబోలు.



Video Courtesy: Ramesh Bhandaru (rams old dance videos)






అయాం ఎ బిగ్ జీరో (44) - భండారు శ్రీనివాసరావు

 

హైస్కూలు నుంచి కాలేజీలో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థి లాగే నేనూ ఏదో ప్రమోషన్ వచ్చినట్టు ఫీలయ్యేవాడిని. బట్టలు వేసుకోవడంలో, జుట్టు దువ్వుకోవడంలో, పుస్తకాల సంచీ కాకుండా ఏదో ఒక నోటు పుస్తకం మాత్రం చేతిలో పట్టుకుని ఉల్లాసంగా క్లాసులకు వెళ్ళడంలో ఈ మార్పు చాలా కొట్టవచ్చినట్టు కనిపించేది. క్లాస్ మేట్స్ ని ఏరా అనడం కాకుండా మీరు అని గౌరవంగా సంబోధించడం ఇవన్నీ ఎవరూ చెప్పకుండానే అర్ధం అయ్యాయి.

సైన్స్ గ్రూపు తీసుకున్న ప్రతివాడు భవిష్యత్తులో తానో డాక్టర్ కాబోతున్నట్టు కలలు కనేవాళ్ళు. ప్రవర్తన కూడా అదేవిధంగా వుండేది.

మా క్లాసులో రావులపాటి గోపాలకృష్ణ అని మా బంధువు ఉండేవాడు. రావులపాటి జానకి రామారావు గారి కుమారుడు. చక్కని పసిమి ఛాయ. నల్లటి రింగులు తిరిగిన ఒత్తయిన జుట్టు. చాలా అందగాడు. బాగా చదివేవాడు. క్లాసులో ఫస్ట్ మార్క్ టైపు. దానికి తగ్గట్టే జీవితంలో నిజంగానే డాక్టరు అయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద పదవులు నిర్వహించి రిటైర్ అయ్యాడు. పిల్లలు విదేశాల్లో సెటిల్ అయ్యారు. నాకు మంచి స్నేహితుడు. చదువుసంధ్యల్లో నాకు అంత మంచి పేరు లేకపోయినా, కాలేజీలో మంచి విద్యార్ధులు అందరూ నాకు మంచి స్నేహితులు. కవితలు గిలికే అలవాటు ఇక్కడ అక్కరకు వచ్చింది.

ఆ రోజుల్లో ఎన్.సీ.సీ. లో కేడెట్లుగా చేరే అవకాశం వుండేది. అందులో చేరితే రెండు జతల ఖాకీ యూనిఫారాలు, జత బూట్లు, సాక్స్, టోపీ ఇస్తారు. వీటిల్లో నన్ను ఆకర్షించింది బూట్లు. అంతవరకూ హవాయ్ శాండల్స్ తప్పిస్తే షూస్ మొహం ఎరగం కనుక మరో మాట లేకుండా అందులో చేరిపోయాము చాలామందిమి.

యూనిఫారాలు చూసుకుని మురిసిపోయాము. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మా కొలతలు తీసుకుని కుట్టించినవి కావు. లుడుంగు బుడుంగు మంటూ అవి వేసుకుని కవాతు చేస్తుంటే మమ్మల్ని  చూసి మాకే విచిత్రం అనిపించేది.

ఒకసారి వరంగల్ అనుకుంటా క్యాంపుకి తీసుకువెళ్ళారు. ఊరి బయట ఎక్కడో ఆ క్యాంపులో పెట్టారు. చుట్టూ అడవిలా వుంది. ప్రతితోజు పొద్దున్నే లేవడం, కాసేపు డ్రిల్లు, ప్లేట్లు పట్టుకుని లైన్లో నిలుచకుంటే రెండు రొట్టెలు, కూరా వడ్డించేవారు. తిని, ప్లేట్లు కడుక్కుని మళ్ళీ మనకు ఇచ్చిన బెడ్ రోల్ పైన పెట్టి మళ్ళీ లెఫ్ట్, రైట్.

చిన్నప్పుడు ఈ మిలిటరీ పదాలు బాగా వినవచ్చేవి, ఎందుకంటే మా చుట్టాల్లో కొందరు మిలిటరీలో కొంత కాలం పనిచేసిన వాళ్ళే. ఆ రోజుల్లో లెఫ్ట్ రైట్, అబౌట్ టర్న్, అటెన్షన్, స్టాండిటీజ్ (Stand at ease)  ఇలా ఉండేవి. సీవీఆర్  స్కూల్లో డ్రిల్లు టీచర్స్ కూడా ఇలానే డ్రిల్ చేయించేవారు.  వరంగల్ క్యాంపులో సావదాన్, విశ్రాం, పీచేముడ్, తేజ్ చల్.   ఇలా అవన్నీ  హిందీలోకి మారిపోయాయి.

రాత్రి పూట క్యాంపులో నిద్రపట్టేది కాదు. కీచురాళ్ళు చేసే ధ్వని. ఇళ్ళల్లో ఇలా పడుకునే అలవాటు లేకపోవడం. అయితే పొద్దంతా చేసిన కసరత్తుల వల్ల కాసేపటికి నిద్ర పట్టేది.

క్యాంపు ఒక రోజులో ముగుస్తుంది అనే సమయంలో ఆ రాత్రి ఒక కబురు తెలిసింది. దగ్గరలో వున్న ఒక దిగుడు బావిలో ఎవరో దూకి ఆత్మహత్య చేసుకున్నారని. భయం భయంగా వెళ్లి చూస్తే ఆ శవం బొక్కబోర్లాగా నీళ్ళపై తేలుతోంది. అప్పటికే నాని, బాగా ఉబ్బిపోయి వుంది. చాలామంది ఆ రాత్రి నిద్రపోలేదు. గమ్మత్తయిన విషయం ఏమిటంటే సైన్స్ గ్రూపులో చేరిన ప్రతి ఒక్కరు డాక్టరు కావాలనుకున్న వాళ్ళే. శవాలను అతి దగ్గరగా చూసి, వాటిని కోసి చదువు నేర్చుకోవాల్సిన వాళ్ళే. కానీ ఆ రాత్రి వారి భయం వర్ణనాతీతం.

మర్నాడు రైలు టైము కల్లా మమ్మల్ని  రైలు స్టేషన్ కు చేర్చారు. ఖమ్మంలో దిగి ఇంటికి చేరాము అన్నమాటే కానీ బావిలో తేలిన శవం కళ్ళల్లో మెదులుతూనే వుంది.

భయం సంగతి ఏమో కాని, ఎన్.సీ.సీ. లో చేరడం వల్ల కొంతలో కొంతయినా క్రమశిక్షణ అలవడింది.

కొన్ని దేశాల్లో వున్నట్టు విద్యాభ్యాసం పూర్తి కాగానే కొంత కాలం నిర్బంధంగా మిలిటరీలో పనిచేయాలనే నిబంధన మన దేశానికీ చాలా అవసరమేమో అని అనిపిస్తోంది. కుల, మత,  ప్రాంతీయ, భాషా  సంబంధమైన వివక్షల నుంచి భావి భారత పౌరులను విముక్తులను చేయాలి అంటే ఈ  రకమైన శిక్షణ విద్యార్థిదశ నుంచే అవసరం అనిపిస్తోంది.

ఇక నా చదువు విషయానికి వస్తే షరామామూలుగా తప్పడం, మళ్ళీ సెప్టెంబరులో ఊహాతీతంగా గట్టెక్కడం, ఈ  లోగా మా పెద్దన్నయ్యకు విజయవాడ బదిలీ కావడం, నేను కూడా వెళ్లి మాచవరం లోని ఎస్సారార్ అండ్ సీవీఆర్  ప్రభుత్వ కళాశాలలో బీ కాం లో చేరిపోవడం అన్నీ కామ్ గా జరిగిపోయాయి.  

కింది ఫోటో:


పీయూసీ లో నా క్లాస్ మేట్: డాక్టర్ రావులపాటి గోపాలకృష్ణ, భార్య డాక్టర్ రుక్మిణి


      

(ఇంకా వుంది)

 

 

 

పుస్తకానికి పురిటి నొప్పులు – భండారు శ్రీనివాసరావు

 

నేలలో పాతిన విత్తనం భూమిని చీల్చుకుని ఒక  చిన్ని మొలకగా రూపం దాల్చడానికి ఎంత ప్రసవవేదన పడుతుందో రచయిత మనసులోని మాటలు, భావాలు అక్షర రూపంలో పెట్టడానికి అంతటి వేదన పడతాడని నా చిన్నప్పుడు చదివిన జ్ఞాపకం.  ఇలా గుర్తుకు వచ్చినవన్నీ రాస్తూ పోతుంటే, కొందరు మిత్రులు తరచుగా చెప్పే మాట ఒక్కటే. ఇవన్నీ ఒక పుస్తకంగా ఎందుకు వేయరు అని. వారి అభిమానానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతగా వుండాల్సిందే. అయితే అలాంటి సలహాలకు నేను పలుమార్లు ఇస్తూ వచ్చిన రొటీన్ జవాబు ఒక్కటే. సినిమా చూసేవాడు, సినిమా చూడాలి. అంతేకానీ, సేనిమా తీయాలని అనుకోకూడదు. అలాగే రాసేవాడు రాయడం మాత్రమే చేయాలి. పుస్తకంగా వేయాలి అనుకుంటే పెళ్లి చేసి చూడు అనే సామెత మాదిరిగా పరిస్థితి తయారవుతుంది. నిజానికి నలుగురికి నచ్చేలా రాయడం ఒక ఆర్టు. అది నలుగురు చదివేలా పుస్తకంగా వేయడం వుంది చూశారూ, అదో మహా యజ్ఞం. నవ మాసాలు మోసి కన్న బిడ్డను చూస్తే తల్లికి ఎంత సంతోషం వేస్తుందో, రోజులతరబడి మేధో మధనం చేసి రాసిన పుస్తకాన్ని అచ్చులో చూసుకున్నప్పుడు కూడా అంతటి ఆనందం రచయితకు  కలుగుతుంది. అయితే అంతకు ముందు ఆ తల్లి పడిన పురుటి నొప్పుల మాట ఏమిటి? అవి తట్టుకోగల మనోధైర్యం వున్నప్పుడే ఈ సాహసానికి ఒడి కట్టాలి. అంతవరకూ ఫేస్ బుక్ వంటి మాధ్యమాలతో సర్దుకుపోవాలి. తప్పదు.

పుస్తకాల విషయంలో జర్నలిస్టులకు ఒక వెసులుబాటు వుంది. ప్రత్యేకించి రాయాల్సిన అవసరం వుండదు. వృత్తి జీవితంలో రాసిన వ్యాసాలను, రచనలను ఏరుకుని,  ఒక క్రమ  పద్దతిలో కూర్చుకుని పుస్తక రూపంలో తీసుకువస్తే సరిపోతుంది. ఎడిటింగ్ అనుభవం ఎలాగు వుంటుంది కాబట్టి, మరికొంత వెసులుబాటు.

డమ్మీ కాపీలు నాలుగయిదు వేసుకుంటే సరిపోతుంది.

కానీ అసలు లక్ష్యం అది కాదు కదా. నలుగురు చదవాలి అనుకుంటే ఏదో విధంగా అచ్చు వేయించాలి. ఇంత చేసిన తరువాత స్నేహితుల ఒత్తిడి కూడా  మొదలవుతుంది. నువ్వు మొదలు పెట్టు, తలో చేయీ వేస్తాము అనే శ్రేయోభిలాషులు కూడా ముందుకు వస్తారు. ఇక్కడే అసలు యజ్ఞం మొదలవుతుంది.

మొన్ననే అనుకుంటా, పాత మిత్రుడు, చేయి తిరిగిన పాత్రికేయుడు అయిన సాయి శేఖర్ చెప్పిన విషయాలు విన్నాను.  ఆ తర్వాత ఈ ప్రచురణ ప్రక్రియ నేను అనుకున్న దానికంటే కూడా క్లిష్టతరము, కష్టతరము అనిపించింది. ఇటీవలే తన పాత్రికేయ అనుభవాలతో కూడిన ఒక అద్భుతమైన పుస్తకాన్ని వెలువరించిన అనుభవం అతడికి వుంది. చెప్పే విషయాన్ని హాస్యస్పోరకంగా చెప్పడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఫేస్ బుక్ లో అతడి పోస్టింగులు ఫాలో అయ్యేవారికి ఇది అనుభవైకవేద్యం. అంచేత తన ముద్దుల మొదటి పుస్తక సంతానానికి “విట్టీ లీక్స్” అనే అద్భుతమైన పేరు పెట్టాడు. రాయడంలోనే కాదు, మాట్లాడడంలో కూడా అతడిలోని హాస్యపు గుళికలను మనం ఆస్వాదించవచ్చు. ఈ పుస్తకం ప్రచురించడంలో తాను పడిన ఇబ్బందులను అతడు ఎంత తేలిగ్గా తీసుకుని ఈ క్రతువును ఎలా నిర్విఘ్నంగా పూర్తి చేసాడో అనేది  నేరుగా అతడి నోటనే వినే అవకాశం నాకు కలిగింది.

2019 నుంచి తాను రాసిన తన రాతలను తానే గుదిగుచ్చి, ఒక మాలగా  అల్లుకున్నాడు. దండలో దారంలాగా వాటినన్నిటినీ కలిపేందుకు హాస్యం తొణికిసలాడే వాక్యాలను తయారు చేసుకున్నాడు.

రచయిత ఒక ప్రెస్ రిపోర్టర్ . ఇందులో ఏముంటుంది, అన్నీ పాత చింతకాయ పాత వార్తలు అనుకోకుండా, ఇంతవరకు ప్రచురించని అంశాలనే ఎంచుకున్నాడు. ఇక్కడ వరకు బాగానే వుంది. అంతా స్వయం పాకం. ఇంట్లో కూర్చుని వండే వంటకాలే. వంట వేరు, వడ్డన వేరు అనేది వాస్తవం. వడ్డించే ప్రచురణకర్త దొరకాలి కదా! ఇన్నాళ్ళు తాను రాసిన వార్తలను, వార్తా కధనాలను తెల్లారేసరికల్లా ప్రచురించే వార్తాపత్రికల యాజమాన్యాలు తెలుసు కాని, పుస్తకాలు వేసే వాళ్ళు ఎవ్వరు, అందులోను ఇంగ్లీష్ లో రాసిన పుస్తకాన్ని వేసేదెవ్వరు ? వేసే వాళ్ళు చాలామంది వున్నారు. కానీ రాయక రాయక రాసిన తన ముద్దుల పుస్తకాన్ని తన ఆకాంక్షల మేరకు అందంగా అచ్చువత్తించి, ప్రచురించే మహాను భావులు ఎవ్వరు?

వేట మొదలైంది. ముందు గూగుల్ లో అన్వేషణ. పెయిడ్ సెల్ఫ్ పబ్లిషర్స్ అని సెర్చ్ చేయగానే చాలా ఆప్షన్స్ కనబడ్డాయి.  చండీఘర్ కు చెందిన వైట్ ఫాల్కన్ అనే రైట్ ఛాయిస్ దొరికింది. వాళ్ళతో మాటామంతి జరిగింది. ఇంగ్లీష్ జర్నలిస్ట్, అందులోను బిజినెస్ జర్నలిస్టు  కనుక వాళ్ళతో నిస్సంకోచంగా, ఎలాంటి మొహమాటాలు లేకుండా మాట్లాడాడు. అయితే ఈ రంగంలో ఆ పబ్లిషర్స్ కు కూడా విశేషమైన అనుభవం వుంది. వాళ్ళూ ఆ తరహాలోనే సంప్రదింపులు జరిపారు. తమ షరతుల జాబితా వాళ్ళు, తన నిబంధనల జాబితా శేఖర్ బయట పెట్టారు. ఇలా సాగే వ్యవహారాల్లో నాన్చుడు వుండదు. మాకిది, మీకిది అనే ఆదినిష్టూరం మంచిది  తరహాలో వుంటాయి. అన్ని విషయాల్లో స్పష్టత వుంటుంది. ఇలా చెప్పారు, అలా చేశారు అనే శషభిషలకు తావుండదు.

రెండంటే రెండు కలర్ ఫోటోలు వేస్తాం. అయిదు పుస్తకాలు రచయితకు  ఉచితంగా ఇస్తాం. ఎడిటింగ్, పేజి మేక్ అప్, కవర్ డిజైన్, అమెజాన్, ఫ్లిక్ కార్ట్  లో సేల్స్ కి పెట్టడం, రచయిత పాల్గొనే పక్షంలో బుక్ ఎగ్జిబిషన్ లలో, లిటరరీ ఫెస్టివల్స్ లో పుస్తకాన్ని ప్రదర్శనకు పెట్టడం, వెబ్ సైట్ తయారు చేయడం, రెండేళ్ల వరకు సోషల్ మీడియా ప్రమోషన్లు ఇత్యాదయః మా పూచీ”  అన్నారు వాళ్ళు.  అంతే కాదు మరో మాట అన్నారు, మీ పుస్తకం ఏ ప్రెస్సులో వేయించేది మీకు ముందు చెప్పం అని. శేఖర్ కు నిరుత్సాహం కలిగించిన షరతుల్లో ఇదొకటి.

పుస్తకం ఎడిట్ చేయడానికి వాళ్లకి ఎడిటర్స్ ప్యానెల్ వుంటుంది. వాళ్ళు సూచించిన మార్పులు రచయిత ఒప్పుకోవాలి.

ఈ చివరి షరతు శేఖర్ కి నచ్చలేదు. ఘనాపాటీల లాంటి ఎడిటర్ల చేత నేనే ఎడిటింగ్ చేయించుకుంటానని వాళ్ళతో గట్టిగా చెప్పాడు. జర్నలిస్టు కదా. మరీ కాదనలేకపోయారు. ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్ గా రిటైర్ అయిన పద్మజా షా తో ముందు మాట్లాడాడు. ఆవిడ గారు అంతకు ముందు ఒప్పుకున్న కార్యక్రమాలతో తలమునకలుగా వున్నారు. దాంతో ఇంటర్ నేషనల్ పబ్లికేషన్స్ లో విశేష అనుభవం వున్న సీనియర్ జర్నలిస్ట్ జి. కృష్ణన్ గారి తో మాట్లాడితే ఆయన సరే అన్నారు. హిందూ  బిజినెస్ లైన్ పత్రికలో సీనియర్ డిప్యూటి ఎడిటర్ గా పనిచేసిన స్రవంతి చల్లపల్లి పేరు మనవాడు చెప్పగానే, ఆవిడ బెస్ట్ చాయిస్ అని కృష్ణన్ చెప్పారు. స్రవంతి చల్లపల్లితో శేఖర్ కు మూడు దశాబ్దాల పరిచయం వుంది. అడగగానే ఒప్పుకోవడమే కాక మొత్తం పని పదిహేను రోజుల్లో పూర్తి చేసి ఇచ్చారు ఆమె.

అప్పటికి ఇల్లు అలకడం అయ్యింది. పండగ మిగిలే వుంది.

తాను పనిచేసిన డెక్కన్ క్రానికల్, హిందూ యాజమాన్యాల నుంచి క్లిప్పింగ్స్ వాడుకోవడానికి అనుమతులు తన పరపతితో సాధించాడు. డెక్కన్ క్రానికల్ లో రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేసిన శేఖర్ మిత్రుడు శ్రీరాం కర్రి ఈ విషయంలో చేసిన మరువలేనిదని శేఖర్ చెప్పాడు. జర్నలిస్టుగా తనకున్న పరిచయాలు చాలా వరకు ఉపయోగపడ్డాయి. కేంద్ర మాజీ మంత్రి జై రాం రమేష్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పనిచేసిన సీనియర్ జర్నలిస్టు సంజయ్ బారు, ప్రముఖ రచయిత హరి మోహన్ పరువు వంటి పెద్దలు పుస్తకం బ్యాక్ కవర్ కామెంట్స్ రాసి పంపారు.

పేజి మేకింగ్ పూర్తయిన తరువాత కూడా ఆరు సార్లు ఎన్నో దిద్దుబాట్లకు ఒప్పుకున్నారు పబ్లిషర్లు.

ప్రముఖ ప్రచురణాలయం ప్రగతి ప్రింటర్స్, కళా జ్యోతి  లో పెద్ద హోదాల్లో పనిచేసిన శ్రీ విజయకుమార్  ప్రింటింగ్ కి ఎంత జి. ఎస్.ఎం. కాగితం వాడాలి, డస్ట్ జాకెట్, హార్డ్ బౌండ్ కవర్, కలర్ పేజీల కి ఎలాంటి కాగితం వాడాలి అన్న విషయంలో సరైన సమయంలో తగిన సూచనలు పుస్తకం నాణ్యతను పెంచడంలో తోడ్పడ్డాయి.

అంశాలకు తగిన ఫోటోలు సేకరించడం కష్టం అయినా, ప్రముఖ ఫోటోగ్రాఫర్లు  రవీందర్ రెడ్డి, గంగాధర్ అనుమాండ్ల బాగా సహకరించారని శేఖర్ చెప్పాడు.

ఐటీసీ చైర్మన్ గా పనిచేసిన కీర్తిశేషులు యోగీ దేవేశ్వర్ ఫోటో కంపెనీ సీనియర్ అధికారి శివకుమార్ సూరంపూడి ఏర్పాటు చేశారు.

ఇక డెక్కన్ క్రానికల్ కార్టూనిస్ట్ సుభాని సాయం నేను ఎప్పటికీ మరువలేను. అడగగానే ఎంతో పని వత్తిడిలో వుండి కూడా అద్భుతమైన ముఖచిత్రాన్ని టైటిల్ కు తగ్గట్టుగా గీసి ఇచ్చాడు.  అలాగే ఆర్బీసీ మేనేజింగ్ డైరెక్టర్ రమాకాంత్ గారు కవర్ పేజి డిజైన్ చేశాడు. అతడికి కూడా కృతజ్ఞతలు తెలిపాడు శేఖర్.

ఇన్ని పనులు చేసిన తర్వాత శేఖర్ కు పబ్లిషర్స్  కు  షరతులు విధించే ధైర్యం వచ్చింది.

అయిదు కాదు, పాతిక పుస్తకాలు ఇవ్వాలన్నాడు. రెండు కాదు పదిహేను కలర్ ఫోటోలు వేయాలన్నాడు. ఒప్పుకోవడం మినహా వాళ్లకు గత్యంతరం లేకపోయింది.

పండంటి కన్న బిడ్డ లాంటి పుస్తకం తయారైంది. మరి విడుదలచేయించాలి అదీ ఎవరితో అనే మీమాంస మొదలైంది.

శ్రీరాముల వారి సహాయము కావలెను అనుకున్నాడు. మళ్ళీ   రాముడి సాయమే అక్కరకు వచ్చింది. శ్రీ రామ్ కర్రి గారు, తెలంగాణా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అపాయింట్ మెంట్ ఏర్పాటుకు సహకరించి ఆ గౌరవ లాంఛనం ఆయన చేత పూర్తి చేయించారు. ఆ విధంగా శేఖర్ మొదటి పుస్తకం మార్కెట్లోకి వచ్చింది.

మంగళం మహత్ శ్రీ శ్రీ శ్రీ

తోకటపా: సాయి శేఖర్ వయసులో చిన్నవాడు, ఉత్సాహవంతుడు.  పట్టిన పట్టు విడవడు. అందుకే ఇన్ని నొప్పులు పంటి బిగువన భరించాడు. అనుకున్నది సాధించాడు.  అతడికీ నాకూ వయసులో దాదాపు రెండు దశాబ్దాల పైగా తేడా. పులిని చూసి వాతలు పెట్టుకోవడానికి నేను నక్కను కాదు.

REVIEW FOLLOWS

కింది ఫోటోలు: 


శేఖర్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి


రచయితతో నేను


శ్రీరాం కర్రి, నేను, శేఖర్


విట్టీ లీక్స్ బుక్  ముఖచిత్రం











 

 

 

   

 

 

 

 

           

 

     

 

 

 

 

 

19, డిసెంబర్ 2024, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (43) - భండారు శ్రీనివాసరావు

 

హెచ్ ఎస్ సీ పరీక్షల్లో నేనెక్కిన ఎం.ఎస్.ఎం. బండి మొత్తం మీద చివరి స్టేషన్ చేరి ఆ మార్చిలో పరీక్ష గట్టెక్కాను. ఖమ్మం గుట్టల బజారు దాటి వెళ్ళిన తర్వాత ఫుడ్ కార్పొరేషన్ వారు వాడి వదిలేసిన రేకు గోడౌన్లలో కొత్తగా పెట్టిన శ్రీ రామ భక్త గెంటేల నారాయణ రావు ప్రభుత్వ కళాశాలలో పీ యూ సీ సైన్స్ గ్రూపులో చేరాను. అది ఏడాది కోర్సు. తరువాత బీ ఎస్సీ మూడేళ్లు. అయితే పీ యూ సీ సైన్స్ గ్రూపు తీసుకున్న ప్రతివాడు తరువాత కాలు పెట్టేది మెడికల్ కాలేజీలోనే అనే ధీమాతో కాలర్ ఎగరేస్తుంటాడు. దానికి నేనూ మినహాయింపు కాదు. చదువు సరిగా రానివాడికి ఆశల పల్లకీలో ఊరేగింపులు ఎక్కువ. సరే ఇక్కడ కో ఎడ్యుకేషన్. ఆడపిల్లలు కూడా వుంటారు. చదువులో రాణించి వాళ్ళను ఆకట్టుకోవడంకష్టం కాబట్టి నా బోటి మగపిల్లలు ఇతర మార్గాలు అన్వేషిస్తూ వుంటారు. నాకు తేలిగ్గా కనబడింది కవిత్వం. కాపీ కవిత్వం అయినా సరే ఏదో విధంగా కుర్రకవిని అని అనిపించుకోవాలని తాపత్రయం.

సైన్స్ లాబ్ లో జువాలజిలో కప్పలను కోసి చూపించేవాళ్ళు. రైలు కట్త పక్కన నీటి మడుగుల్లో కప్పలను వెతికి పట్టుకుని హీరోల మాదిరిగా కాలేజీ లాబ్ లో డిసెక్షన్ చేసేవాళ్ళం.

‘నే కోసిన కప్పల నెత్తురు భగవంతుని హృదయంలో నిప్పులు, ఈ ఏటిలో నే చేసిన పాపాలన్నీ పై చదువుకు సోపానాలే అంటూ కవితలు గిలకడం.    ఆర్ట్స్ సెక్షన్ లో అయితే ఈ ట్రిక్కులు కొంత పనిచేస్తాయి. సైన్స్ గ్రూపు పిల్లలు చాలావరకు బుద్ధిమంతులు. బాగా చదివి డాక్టర్ కావాలనుకునే బాపతు. నా స్నేహితుడు రావులపాటి గోపాలకృష్ణ ఈ కోవలోకి వస్తాడు. బాగా చదివి నిజంగానే డాక్టర్ అయ్యాడు.  

అతి తెలివితేటలు వికసించేది కూడా బహుశా ఆ వయసులోనే అనుకుంటా.

తెలుగు మాస్టారు మనుచరిత్ర పద్యాలను మనోహరంగా పాడేవారు.

"అటజనికాంచెభూమిసురుడంబరచుంబి

శిరస్సరజ్ఝరీపటలముహుర్ముహుర్లుఠదభంగతరంగమృదంగనిస్వన
స్ఫుటనటనానుకూలపరిఫుల్లకలాపకలాపిజాలమున్
గటకచరత్కరేణుకరకంపితసాలముశీతశైలమున్"

ఈ పద్యం చదివి ప్రతిపదార్ధం చెబుతుంటే, రవిగాంచనిచో  కవి గాంచును అని ఎందుకు అంటారో బోధపడింది. పెద్దన ఎక్కడి వాడు, హిమాలయాలు ఎక్కడివి, ఎప్పుడు వెళ్ళని చోటును గురించి పెద్దనామాత్యులు అంత కవితాత్మకంగా ఎలా ఊహించి వర్ణించ గలిగాడు అనే విషయాలను వివరిస్తుంటే తెలుగు మాస్టారి గొప్పతనం పట్ల గౌరవం మరింత పెరిగేది.   

 

అదేమిటో తెలియదు, విద్యార్ధులు ఏడిపించాలని చూసేది కూడా ఈ  లెక్చరర్లనే. ఒకరోజు పాఠం చెబుతుంటే, ప్లవంగం అనే మాట వచ్చింది. ఒకడు లేచి ప్లవంగం అంటే ఏమిటి అదో రకం లవంగమా అనే వెక్కిరింతగా అన్నాడు. మాస్టారు కోపం తెచ్చుకోకుండా ప్లవంగం అంటే ఎవరో కాదు, నువ్వే అన్నారు. అప్పుడు ఎవరికీ అర్ధం కాలేదు. తరువాత డిక్షనరీ చూస్తే, ప్లవంగం అంటే కోతి అనే అర్ధం కనబడింది.

నేను ఒక ఏడాది మాత్రమే చదువుకున్న ఈ కాలేజీకి పూర్వచరిత్ర వుంది. నిజాం పాలన ముగిసిన తరవాత హైదరాబాదు స్టేట్ (సంస్థానం) ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారికి కలిగిన ఆలోచన ఫలితమే ఈ కాలేజి. వరంగల్ జిల్లా నుంచి విడదీసి ఖమ్మం కేంద్రంగా కొత్తగా ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశారు. ఆ కాలంలో ఒక్క హైదరాబాదు నగరం, వరంగల్  మినహాయిస్తే మొత్తం తెలంగాణా ప్రాంతంలో ఎక్కడా డిగ్రీ కాలేజి లేదు. అప్పుడు ముఖ్యమంత్రిగా వున్న బూర్గుల రామకృష్ణారావు గారు, తెలంగాణలో ప్రతి జిల్లాలో ఒక డిగ్రీ కాలేజి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నాటి  జిల్లా కలెక్టర్ జీ.వీ. భట్, జిల్లాకు చెందిన ప్రముఖులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. శ్రీయుతులు బొమ్మకంటి సత్యనారాయణ రావు, ఎస్.ఎన్. మూర్తి, వి.శ్రీనివాసరావు,  కౌటూరి కృష్ణ మూర్తి, (మా నాలుగో బావగారు), రావులపాటి జానకి రామారావు ఈ కమిటీలో సభ్యులు. కళాశాల స్థాపనకు నిధుల సేకరణ పెద్ద ఇబ్బందిగా మారింది. భద్రాచలం సీతారామస్వామి దేవాలయంలో సీతమ్మ వారికి భక్తరామదాసు చేయించి ఇచ్చిన పచ్చల పతకాన్ని అమ్మాలనే ఆలోచన కూడా చేశారు. ఈ విషయం గెంటేల నారాయణ రావుగారి చెవిన పడి మనస్తాపానికి గురయ్యారు. ఆయన గొప్ప రామ భక్తుడు. వెంటనే ఆయన వెళ్లి జిల్లా కలెక్టర్ ని కలిసి, అమ్మవారి పతకం అమ్మే పనికి పూనుకోవద్దని, భూసేకరణకు అవసరం అయ్యే లక్ష రూపాయలు తాను విరాళంగా ఇస్తానని చెప్పడమే కాకుండా ఆ డబ్బు అందచేశారు.

ఈ కారణంగా ఈ కాలేజీకి శ్రీ రామభక్త గెంటేల నారాయణ రావు గారి పేరు పెట్టారు.     

ఖమ్మం జిల్లాలో ఈ  మొట్టమొదటి కాలేజీని ప్రారంభించడానికి అప్పటి హైదరాబాద్  స్టేట్  ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఖమ్మం వచ్చారు. ముఖ్యమంత్రి వచ్చిన నాన్ ఏసీ అంబాసిడర్ కారులో ఆయనతో పాటు  బొమ్మకంటి సత్యనారాయణ రావు గారు కూడా వచ్చారు. ఎలాటి హడావిడీ లేదు.

బూర్గుల గారు తమ ఉపన్యాసంలో చెప్పారు.

‘తెలంగాణా మొత్తంలో అటు హైదరాబాదు, వరంగల్ మినహాయిస్తే ఎక్కడా కాలేజీలు లేవు. అందుకే జిల్లాకు ఒక కాలేజీ పెట్టుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఖమ్మం వంతు. పెద్దలు బొమ్మకంటి గారు ఖమ్మం వచ్చి తీరాలని ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞాబద్ధుడనై వచ్చాను’.

ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించిన బొమ్మకంటి సత్యనారాయణరావు గారు మా బాబాయి.

మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారు కొత్తగా ఏర్పాటయిన ఈ కాలేజీలో రెండో బ్యాచ్ స్టూడెంటు. డాక్టర్ ఏపీ రంగా రావు, డాక్టర్ మనోహర్, జ్వాలా నరసింహా రావు ఈ కాలేజీలోనే చదువుకున్నారు. 

ఇప్పుడా కాలేజీని  కలెక్టర్ ఆఫీసు సమీపంలో విశాలమైన ప్రాంగణానికి మార్చారు.

సరే! కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఖమ్మం కాలేజీలో నా ఒక సంవత్సరం చదువు మళ్ళీ ఎం.ఎస్.ఎం. బండి ఎక్కింది.

నేను మా ఊరు వెళ్లేందుకు రైలు బండి ఎక్కాను.

కింది ఫోటో:

శ్రీరామ భక్త గెంటేల నారాయణరావు గారు, వారి భార్య సీతమ్మ గారు)  (Photo Courtesy : Smt. Annapurna, Khammam)  



(ఇంకా వుంది)

18, డిసెంబర్ 2024, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (42) - భండారు శ్రీనివాసరావు

 


 

వాస్తవానికి సమాజంలో వైద్యులది విశిష్టమయిన స్తానం. అందుకే డాక్టరును ‘డాక్టరు గారు’ అని గౌరవంగా

సంబోధిస్తారు. నలుగురిలో వారికి పెద్దపీటవేసి మన్నన చేస్తారు. రోగాలబారి నుంచి కాపాడే అపర ధన్వంతరులుగా, ప్రాణబిక్ష పెట్టే కలియుగ దైవాలుగా కొలుస్తారు. నాకిప్పటికీ గుర్తు. మా చిన్నతనంలో మా వూరికి వారానికోసారి, పొరుగూరు  ఆలూరుపాడు నుంచి రామకృష్ణయ్య గారనే ఓ డాక్టరుగారు సైకిలు మీద వచ్చేవారు. చిన్న చితకా జ్వరాలకు తనతో తెచ్చుకున్న తోలుపటకా సంచీ నుంచి మందు గోలీలు ఇచ్చి వైద్యం చేసేవారు. నాకు అప్పుడు తెలియదు కానీ ఆ డాక్టరు గారు చేసేది హోమియో వైద్యం. ఆయన వస్తూనే మా ఇంటి ముందు నులక మంచం మీద కూర్చుని ముందు మా ఇంట్లో వాళ్ళ యోగక్షేమాలు కనుక్కునే వారు. ఆయన వచ్చారు అని తెలియగానే ఒంట్లో నలతగా ఉన్న బీదా బిక్కీ రోగులు వచ్చేవారు. ఎవరి దగ్గర నుంచి ఇంత అని అడిగి డబ్బులు తీసుకోవడం నేను చూడలేదు.  పంటలు చేతికందినప్పుడు వూళ్ళోని పెద్ద పెద్ద ఆసాములు ఏడాదికోసారి కొలిచి ఇచ్చే ధాన్యం మినహా ఆ డాక్టరు గారు ఏనాడూ రోగులనుంచి ఫీజు వసూలు చేసిన దాఖలా లేదు. ఆయన వూరికి వస్తే చాలు దేవుడే నడిచివస్తున్నట్టుగా జనం భక్తి ప్రపత్తులు ప్రదర్శించేవారు. నాడి పట్టుకుని చూసి ‘ఇప్పుడెలావుందయ్యా రాముడూ’ అని ఆప్యాయంగా అడగగానే సగం రోగం చేతులతో తీసివేసినట్టు వుండేది. చుట్టుపక్కల అయిదారు వూళ్ళకు ఆయనే దిక్కు. సైకిల్ తొక్కుకుంటూ రోజుకో వూరు చుట్టబెట్టేవారు. ఆ రోజుల్లో సౌకర్యాలు అంతంత మాత్రమే. కరెంటు వుండేది కాదు. ఉక్కపోస్తున్నా, నులక మంచంమీద కూర్చుని తన మానాన తాను రోగులకు వైద్యం చేస్తుండేవారు. కళ్ళల్లో కారుణ్యం. మొహంలో చెదరని చిరునవ్వు. ఆయన హస్తవాసిపట్ల అందరికీ అపరితమయిన గురి. జనాలకు కొండంత ధైర్యం.

మళ్ళీ ఇలాంటి డాక్టరుని ఖమ్మం జిల్లా రెబ్బారం లోని మా రెండో బావగారు కొలిపాక రామచంద్రరావు గారింట్లో చూసాను. ఆయన్ని గొల్లపూడి డాక్టరు గారు అని పిలిచేవాళ్ళు. రెబ్బారం పక్కన వున్న గొల్లపూడి నుంచి సైకిల్ మీద చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ వైద్యం చేసేవారు.  

ఇంగ్లీష్ వైద్యం కావాలి అంటే నాలుగు మైళ్ళ దూరంలో వున్న పెనుగంచి ప్రోలుకో, మరో పక్క ఊరు వత్సవాయి కో వెళ్ళాలి. వానాకాలం వస్తే వాగులు, వంకలు పొంగి బండ్ల మీద పోవడం కష్టం అయ్యేది. పెనుగంచి ప్రోలుకు మా ఊరికీ మధ్య మునేరు.  ఎగువన పెద్ద వర్షం పడితే ఆ ఏటికి ఆకస్మిక వరదలు వచ్చేవి. పడవల మీద దాటి వెళ్ళాలి. పడవ ఎక్కాలంటే మా బోటి చిన్నపిల్లలకి నడుం దాకా నీళ్ళు వచ్చేవి. కాలి కింద ఇసుక కదిలి కొట్టుకు పోతామేమో అనే భయం వేసేది. ఇద్దరు పనివాళ్లు మా రెండు రెక్కలు గట్టిగా పట్టుకుని పడవ  ఎక్కించేవాళ్లు, పడవకు కూడా డబ్బులు ఇచ్చేపనిలేదు. ఏడాదికోసారి కళ్లాల సమయంలో ధాన్యం కొలిచి ఇచ్చేవాళ్ళు. పడవలో పోతుంటే ఎంతో హుషారుగా, మరెంతో భయంగా వుండేది.  ఒకవైపు పోతున్నట్టు కనబడి, మరో వైపు వెళుతున్న అనుభూతి. పడవ అంచున నిలబడి అటూ ఇటూ నడుచుకుంటూ పడవ నడిపేవాళ్ళు పెద్ద పెద్ద గడలతో తిరుగుతుంటే వీళ్ళకి నీళ్ళంటే భయం వుండదా అనిపించేది. సగం తడిసిన బట్టలతోనే పెనుగంచి ప్రోలు చేరేవాళ్ళం. ఆ వూళ్ళో మా బాబాయి వరుస అయిన డాక్టరు జగన్నాధం గారు చుట్టుపక్కల నలభయ్ గ్రామాలకు పెద్ద దిక్కు. పెద్ద వైద్యం కావాలంటే ఆయన దగ్గరికే పోవాలి. పచ్చటి శరీరచ్చాయ,  తెల్లటి మల్లెపూవులాంటి పంచె, లాల్చి, రిం లెస్ గోల్డ్ ఫ్రేం కళ్ళజోడు, మెడలో స్టెతస్కోప్. ఆయన చేయిపట్టి చూసాడు అంటే ఎంతటి రోగమైనా తగ్గిపోవాల్సిందే. డాక్టరు బాబాయి రాసే కొన్ని మందు గోలీలకోసం ఇరవై మైళ్ళ దూరంలో వున్న జగ్గయ్యపేట వెళ్ళేవాళ్ళు. ఆయనంటే అంత గురి. ఈనాడు సంపన్నులు నివసించే ప్రాంతాలలో కనిపించే ఇళ్ళ వంటి అధునాతన భవంతిని 1947 లోనే ఆయన కట్టుకోగలిగారు. అంటే ఆయన ప్రాక్టీసు ఏ స్థాయిలో వుండేదో అంచనా వేసుకోవచ్చు. ఆ వీధిని పెద్ద పోస్టాఫీసు వీధి అనే వారు. డాక్టరు బాబాయి ఇంటి పక్కనే వుండేది. చుట్టుపక్కల నలభయ్ ఊళ్ళ నుంచి బ్రాంచి పోస్టాఫీసుల్లో పని చేసే తపాలా బంట్రోతులు కాలి నడకన పెనుగంచి ప్రోలు వచ్చి, సార్టింగ్ సిబ్బంది ఇచ్చిన ఆయా గ్రామాల ఉత్తరాలను తడవని సంచుల్లో పెట్టుకుని మళ్ళీ అంత దూరాలు నడుచుకుంటూ తమ గ్రామాలకు వెళ్ళే వాళ్ళు. చాలా రోజులు ఖాళీ సంచులే. ఒక్క ఉత్తరం కూడా వుండేది కాదు. అయినా  సరే, ప్రతిరోజూ వారికి ఈ నడక తప్పదు. ఆ రోజుల్లో వారికి ఇచ్చే గౌరవ వేతనాలు పదీ పరక మాత్రమే.

జగన్నాధం బాబాయి ఇంటికి దగ్గరలో ముచ్చింతాల కరణం గారు పూర్ణచందర్ రావు గారి ఇల్లు. ఆయన అల్లుడే కొప్పరపు కవుల మనుమడు మా శర్మ గారు. సుప్రసిద్ధ పాత్రికేయుడు.

నేను బాగా పెద్దవాడిని అయ్యేదాకా మా ఊర్లో వైద్య సౌకర్యాలు అంతంత మాత్రమే. ఆలూరుపాడు డాక్టరు గారు చనిపోయిన తర్వాత ఊళ్ళో డాక్టరు అంటూ ఎవరూ లేకుండా పోయారు.

మరీ చిన్నతనంలో ఖమ్మం నుంచి బయలుదేరి మోటమర్రి స్టేషన్ లో దిగి మా ఊరు వెళ్ళే వాళ్ళం. అక్కడ సామాన్లు మోసే కూలీ బచ్చా అని ఒకడు ఎప్పుడూ కనిపించేవాడు. కొన్నేళ్ళ తర్వాత అతడు మా ఊరిలో ప్రత్యక్షమయ్యాడు. అందరూ అతడిని డాక్టర్ గారు అంటుంటే ఆశ్చర్యపోవడం మా వంతయింది. ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు, చిన్న చిన్న జ్వరాలకు గోళీల వైద్యం నేర్చుకున్నట్టున్నాడు. వాటి పేర్లు కూడా అతడికి తెలియదల్లే వుంది. ఎర్ర గోళీ ఒకటి పొద్దున్న వేసుకో, తగ్గకపోతే పచ్చ గోళీ రాత్రికి వేసుకో అని చెబుతుండేవాడు. అతడి మీద కొన్ని జోకులు కూడా ప్రచారంలో ఉండేవి. ధర్మామీటరు వంద చూపిస్తే, అంత తక్కువ జ్వరానికి  నా దగ్గర మందు లేదు, ఒక పని చేయండి ఈ పూట అన్నం పెట్టండి, సాయంత్రానికి జ్వరం పెరుగుతుంది. అప్పుడు ఈ మాత్ర వేయండి అని రోగి బంధువులకు చెబుతుంటాడు అని ప్రతీతి. కొన్నేళ్ళ తర్వాత అతడి  జాడ లేదు. ఎలా వచ్చాడో అలా మాయమై పోయాడు.  

మా లాంటి వెనుకబడిన ఊళ్లల్లోనే కాదు, హైదరాబాదు వంటి మహా నగరాల్లో కూడా వైద్యానికి సంబంధించిన చిత్రం పూర్తిగా మారిపోయింది.

రోగులు పెరిగారు. రోగాలు పెరిగాయి. వైద్యులూ పెరిగారు. ఇచ్చే మందులూ పెరిగాయి. వాటి ఖరీదులూ పెరిగాయి. పెరగనిదల్లా వైద్యులపట్ల రోగులకు వుండే భరోసా! వుండాల్సిన దిలాసా!!

వైద్యులకు రోగులకు నడుమ ఉండాల్సిన అనుబంధం క్రమంగా కనుమరుగవుతోంది. నాడి పట్టి చూసేవాళ్ళే లేరు.

ఇప్పుడు వైద్యం అనేది వైద్యుల చేతుల్లో నుంచి కార్పొరేట్ల హస్తాలలోకి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు మాత్రం ఏం చెయ్యగలరు?

 

కింది ఫోటో: (Courtesy Maa Sarma garu  and Komaragiri Sankraath)


పెనుగంచిప్రోలులో  డాక్టర్ జగన్నాధరావు గారు.












(ఇంకా వుంది)