2, ఆగస్టు 2024, శుక్రవారం

నాకేల చింత - భండారు శ్రీనివాసరావు


రమ్యమైన రెండో వారం పోస్టర్ వేయవచ్చేమో!
ఇవాల్టికి ఆరో రోజు నేను అమెరికాలో కాలు మోపి.
వృత్తి జీవితంలో ప్రతి జర్నలిస్టు కు కొద్దో గొప్పో Conducted Tours అనుభవం వుండే వుంటుంది. ఏదో మంత్రిత్వ శాఖ వాళ్లో, బ్యాంకు వాళ్ళో తమ ప్రగతిని పాత్రికేయులకు చూపించడానికి ఇలాంటి అధ్యయన యాత్రలు నిర్వహిస్తారు. జేబులో రూపాయి లేకపోయినా సరే మగ పెళ్లి వారి మర్యాదలకు తక్కువ వుండదు.
అలాగే ఈ అమెరికా యాత్రలు కూడా.
గతంలో ఒకసారి ఆటా సభలు అనుకుంటా, డాలర్ల డిక్లరేషన్ చేసే సమయంలో అడిగిన గుర్తు, డబ్బు లేకుండా ఈ దేశంలో ఎలా బతుకుతారని. అతడికి తెలియదు, కొందరు జర్నలిస్టులు అలా బతకగలరని. నేనిది జనరలైజ్ చేసి చెప్పానని పాత్రికేయ సోదరులు కినుక పూనకండి. మెజారిటీ జర్నలిస్టులకు జీత భత్యాలు తక్కువ. ఇక ఇలాంటి టూర్లకు కూడా సొంత డబ్బు ఖర్చు చేయడం అనేది అలవికాని భారం.

ఇంతకూ నేను చెప్పవచ్చేది ఏమిటంటే ఈ ప్రయాణం కోసం నేనూ కొన్ని డాలర్లు వెంట తెచ్చుకున్నాను. కానీ మా పిల్లలు నన్ను జేబులో చెయ్యి పెట్టనివ్వడం లేదు. అంతేకాదు, చేతితో ఏదీ పట్టుకోనివ్వడం లేదు. హాండ్స్ ఫ్రీ ప్రయాణం. అది మాల్ కావచ్చు, స్టార్ హోటల్ కావచ్చు, ఎయిర్ పోర్టు కావచ్చు. అన్నీ వాళ్ళే. 
మొదటి రోజు నాలుగు కార్లలో రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఆ పది మంది ఇప్పటి వరకూ మావెంటే వున్నారు. 

గురువారం రాత్రి బాల్టి మోర్ ఎయిర్పోర్ట్ నుంచి పదిహేను మందిమి బయలుదేరి అర్ధ రాత్రి టాంప చేరుకున్నాము. అదేదో చిన్న వూరు అనుకుంటే హైదరాబాదు కంటే అనేక రెట్లు పెద్దదిగా కనిపించింది. ఎకరాలకు ఎకరాలు రోడ్లు వేశారా అన్నట్టు చాలా విశాలంగా,  అప్పుడే వేసినట్టు నల్లగా నిగనిగ లాడిపోతున్నాయి. అమెరికాలోనే వుంటున్న మా అన్నయ్య మనుమరాళ్ళు శిఖిర, శిశిర, కోడలు హేమ మా కంటే ముందుగానే  టాంపా చేరుకుని మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రెండు పెద్దసైజు అద్దె కార్లలో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 
హైదరాబాదు శంషాబాద్ విమానాశ్రయంలో ఒకే ప్రవేశ ద్వారం వుండడం చేత,  వచ్చి పోయే ప్రయాణీకుల వాహనాలతో బయట చాలా రద్దీగా కనిపిస్తుంది. అయితే వాషింగ్ టన్ డీసీ, బాల్టి మోర్ ఎయిర్పోర్ట్ ల్లో పరిస్థితి వేరేగా  వుంది. ఒక్కో ఎయిర్ లైన్స్ కు ఒక్కో గేటు పెట్టారు. అంచేత ఎక్కడా రద్దీగా వుండదు. హాయిగా కారుని నేరుగా గేటు దగ్గర ఆపుకుని ఎయిర్ పోర్టులోకి వెళ్లి పోవచ్చు. అదొక మంచి సదుపాయం అని నాకు అనిపించింది.

 విమానం ల్యాండ్ ఆయిన తర్వాత ఏవో  సాంకేతిక కారణాలు చెప్పి నలభయ్ నిమిషాలు మమ్మల్ని విమానంలోనే వుంచేసారు, వెనుకటి రోజుల్లో ప్లాటుఫారం ఖాలీ లేక బెజవాడ వెళ్లే నిజాం పాసింజర్ రైలును రాయన పాడు స్టేషన్ లో నిలిపేసినట్టు.

ఆ సమయంలో మా వాళ్ళు అందరూ టాంపా వాట్స్ అప్ గ్రూపులో చాట్ చెయ్యటంలో మునిగిపోయారు. విషయం ఏమిటంటే,
ఈ వూర్లో మాకు వసతి కల్పించాల్సిన Gary's AIR BNB (BNB అంటే బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ అని తర్వాత తెలిసింది) కంపెనీ వాడు అంతమందికి వసతి కుదరదని మెలిక పెట్టాడుట. వెంటనే గ్రూపులోని వార్ రూమ్ టీమ్ ముందు నన్ను, ఆడవాళ్ళు పిల్లల్ని ముందు రిజర్వ్ చేసుకున్న వసతి గృహానికి పంపించారు. అప్పటికప్పుడు ఆన్ లైన్లో కోర్టు యార్డ్ మ్యారియేట్ హోటల్లో రెండు గదులు బుక్ చేసి నన్ను కూడా అక్కడికి తీసుకు వెళ్ళారు. 

ఉడ్ స్టాక్ నుంచి చక్కగా విడివిడిగా ప్యాక్ చేసి వెంట తెచ్చుకున్న పులిహార, పెరుగన్నం పదార్థాలకు బాల్టి మోర్ సెక్యూరిటీ నో చెప్పింది. పెరుగన్నం తేమగా వుండడంతో ఆ ప్యాకెట్లను రకరకాలుగా శోధించి వీలు కాదన్నారు. సాయి వాళ్లకు నచ్చచెప్పాడు. ఏ కళన వున్నాడో కానీ చివరికి పెరుగన్నం ప్యాకెట్లను అనుమతించారు. 
అప్పటికే విమానం బోర్డింగ్ టైం కావడంతో హడావిడిగా తినేసి ఫ్లయిట్ ఎక్కాము.
అంచేత కాబోలు, హోటల్ కు దగ్గరలో వున్న మెక్ డొనాల్డ్ కు వెళ్లి అర్ధరాత్రి మూడు గంటల సమయంలో డిన్నర్ కం బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసుకున్నాము.
ఇప్పుడు అంతా నిద్దర్లలో వున్నారు. లేచాక ఇవాల్టి కార్యక్రమం ఏమిటన్నది తెలుస్తుంది.
ముందే చెప్పినట్టు Conducted Tour లాగా సాగుతోంది.
నాకేల చింత!

కింది ఫోటోలు:
బాల్టి మోర్ నుంచి టాంపా ( ఫ్లోరిడా) వెడుతూ, టాంపాలో మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ లో

1, ఆగస్టు 2024, గురువారం

భూమంటే చేదా !

 కన్నంతలో, విన్నంతలో అమెరికా భండారు శ్రీనివాసరావు

అమెరికా అనేది అవకాశాల దేశమే కాదు, వింతలు, విశేషాల దేశం కూడా.

నేను అమెరికా రావడం ఇది ఐదో సారి. మా మూడో అన్నయ్య కుమారుడు సత్య సాయి ఉంటున్న ఉడ్ స్టాక్ పట్టణంలో వాళ్ళ ఇంటికి దగ్గరలోనే హోవార్డ్ కౌంటీ కన్సర్వెన్సీ కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి వుంది.

పచ్చదనం పరచుకున్న కొండలు, గుట్టలతో నిండి వుండి, తాటి ప్రమాణంలో  గుబురుగా పెరిగిన చెట్ల మాటున చిన్న చిన్న కాలిబాటలు, సెలయేళ్ళు, క్రమంగా మాయమవుతున్న జాబితాలో చేరుతున్న జంతుజాలం, పాత కాలపు వ్యవసాయపు పనిముట్లు, పరికరాలు   ఇవన్నీ చూస్తుంటే, పెద్దనామాత్యులు రచించిన మనుచరిత్రలోని,

‘అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్’ అనే పద్యం గుర్తుకు రాకమానదు.

ఎప్పటినుంచో నూట అరవై అయిదు సంవత్సరాలుగా ఒక కుటుంబం హక్కుభుక్తంలో వుంటూ, సామ్యుయేల్ బ్రౌన్ అనే పెద్దమనిషికి ఈ అపారమైన విలువగలిగిన ఆస్తి, తండ్రి తాతల నుంచి వంశపారంపర్యంగా లభించింది. బ్రౌన్ మహాశయుల  మరణానంతరం ఆయన కుమారుడికి అది దఖలు కాగా, ఆయన చనిపోతూ మూడోవంతు భూమిని తన ఇద్దరు చెల్లెళ్లకు రాసిపోయాడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయులైన రూత్ బ్రౌన్,  ఫ్రాన్సెస్ బ్రౌన్ లు, వన్య, జంతు సంపదతో కూడిన, మౌంట్ ప్లెజెంట్ గా ప్రసిద్ధి చెందిన తమ సువిశాల భూ సంపదను సమాజం బాగుకోసం త్యాగం చేశారు. పిల్లలకు చిన్నతనం నుంచే వన్య, జంతు ప్రాణి సంరక్షణ విషయంలో అవగాహన, ఆసక్తితోపాటు ప్రకృతి సంరక్షణ పట్ల భవిష్యత్ తరాలకు తెలియచెప్పే కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ యావత్ ఆస్తిని ఒక ట్రస్టుకు ఒప్పచెప్పారు.

మొక్కలు, జంతువులు, పక్షులు గురించి చిన్నతనం నుంచి బోధించే ప్రత్యేక తరగతులను ఆ ట్రస్టు నిర్వహిస్తోంది. ప్రకృతి ప్రేమికులకు ప్రోత్సాహం కలిగించే అనేక కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటాయి. అక్కడ ప్రవేశం ఉచితం. ఎవరైనా సరే  పౌరులు కూరగాయలు సొంతంగా పండించుకోవాలి అనుకుకుంటే అందుకు కావాల్సిన భూమిని ఉచితంగా ఇస్తారు.

ఇక్కడ పాఠాలు చెప్పేవాళ్ళు, ఇతర వ్యవహారాలు చూసేవాళ్ళు అంతా జీత భత్యాలు లేకుండా వాలంటీర్లుగా పనిచేస్తున్నట్టు అనిపించింది. తిరిగి వచ్చేటప్పుడు కారు పార్కింగ్ దగ్గర ఒక వృద్ధ మహిళతో మాట్లాడాము. మిసెస్ ఆద్రే  అనే ఆవిడ వయస్సు 81 సంవత్సరాలు.  2007 రిటైర్ అయ్యారు. భర్త చనిపోయాడు.  ప్రవృత్తి రీత్యా ప్రకృతి ప్రేమికురాలు అయిన ఆవిడ తన ముదిమి వయసులో కాలక్షేపం కోసం కాకుండా స్వచ్చందంగా సిద్ధపడి ఇక్కడ పనిచేస్తున్నారు. మేము ఇండియా నుంచి వచ్చాము అని చెబితే చాలా సంతోష పడ్డారు. చెట్లను, జంతువులను, పక్షులను భగవత్ స్వరూపాలుగా భావించే భారతీయ సంస్కృతి అంటే తనకు చాలా గౌరవమని అన్నారు. ఆవిడ అలా అంటూ వుంటే నేను సిగ్గుతో ముడుచుకు పోయాను. కారణం మీకూ తెలుసు.

వందల ఎకరాల భూమిని ప్రకృతి సంరక్షణ కోసం అతి సులభంగా త్యాగం చేయడం నిజంగా గొప్ప విషయమే.

పెంపుడు పిల్లులకు, కుక్కలకు కోట్లాది డాలర్ల సంపదను వీలునామా రాసే సంపన్నుల దేశం కనుక ఇక్కడ ఇదొక వింత కాకపోవచ్చు.

కానీ, హైదరాబాదు జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ వంటి ప్రాంతాలలో కొన్ని వందల గజాల జాగాలో సువిశాలమైన భవంతులు నిర్మించుకున్న సంపన్న ఆసాములు, రోడ్ల వెడల్పు వంటి ప్రజోపయోగ కార్యక్రమాలకు హీనపక్షం కొద్ది అడుగుల భూమిని వదులుకోవడానికి ఇష్టంలేక, కోర్టులను ఆశ్రయించిన ఉదంతాలు తెలిసిన దేశం నుంచి వచ్చాను కనుక, ఈ సోదరీమణుల వదాన్యం వింతల్లో వింతగానే నాకు  అనిపించింది.  















(01-08-2024)          

 

బార్ అండ్ రెస్టారెంట్ గా మారిన రైల్వే స్టేషన్ – భండారు శ్రీనివాసరావు

 

 

కన్నంతలో, విన్నంతలో అమెరికా 


అమెరికన్లకు మార్పు ఇష్టం. స్తబ్దతను ఇష్టపడరు. ప్రతిక్షణం కదలికలో ప్రగతిని కోరుకుంటారు. నేను గమనించిన మరో విషయం ఏమిటంటే మార్పును ఎంత గాఢoగా కోరుకుంటారో గతాన్ని అంతగా ప్రేమిస్తారు. గతం గుర్తులను పదిలంగా దాచుకుంటారు. భావితరాల కోసం వాటిని భద్రపరుస్తారు.

ప్రస్తుతం నేను ఉంటున్న మేరీ లాండ్ రాష్ట్రంలోని ఉడ్ స్టాక్ నగరానికి దాపులో సైక్స్ విల్  (Sykes Ville) అనే చోట ఒక రైల్వే స్టేషన్ వుంది. దీన్ని 1831 లో ఏర్పాటు చేశారు. 1863 లో జరిగిన  రైల్వే కార్మికుల సమ్మె హింసాత్మకంగా మారింది. ఆ విధ్వంసకాండలో రైలు మార్గంతో పాటు నగరంలోని ఆస్తులు కూడా దెబ్బతిన్నాయి.  1883 లో తిరిగి ఈ రైల్వే స్టేషన్ ను ఇప్పుడున్న రూపంలో పునరుద్ధరించారు. మరుసటి ఏడాది నుంచి రైళ్ళ రాకపోకలు మొదలయ్యాయి. కానీ పరిణామక్రమంలో భాగంగా 1950 లో ఈ స్టేషన్ ను మూసివేశారు. కొన్ని గూడ్స్ రైళ్లు నడుపుతున్నారు. స్టేషన్ భవనంలో ప్రస్తుతం బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతున్నారు. అక్కడ విందు వినోదాలతో కాలక్షేపం చేస్తూ, వచ్చి పోయే గూడ్స్ రైళ్ళను తిలకించడానికి సెలవు దినాల్లో అనేకమంది పర్యాటకులు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ వుంటారు. సుమారు రెండువందల ఏళ్ళ నాటి రైలు బోగీలను, రైలు ఇంజన్ ను మ్యూజియంగా మార్చి అలనాటి రైళ్ళ స్వరూప స్వభావాలను నేటి తరానికి పరిచయం చేస్తున్నారు. అలనాటి రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రతి శనివారం, ఆదివారాల్లో రైతు బజార్లు నిర్వహిస్తున్నారు. (బెజవాడలో ఇలాగే సత్యనారాయణ పురం రైల్వే స్టేషన్ ను మూసివేశారు. ఇప్పుడు ఆ ప్రదేశం రద్దీ రోడ్లతో సమూలంగా రూపం మార్చుకుంది. స్టేషన్ అవశేషాలు మచ్చుకు కూడా లేవు. ఒకప్పుడు అక్కడ ఓ రైల్వే స్టేషన్ వుందంటే ఈ తరం వారెవ్వరూ నమ్మరు)

స్టేషన్ దాపుల్లో రోడ్డుకు ఇరువైపులా హోటల్లు, రెస్టారెంట్లు, విడిది గృహాలు లెక్కకు మిక్కిలిగా వున్నాయి.

కాశ్యప్ వాహిని ఇంట్లో భోజనాల అనంతరం తిన్నది అరగడానికి తిరగడానికి మళ్ళీ బయలు దేరాం.

చుట్టుపక్కల అంతా దట్టమైన అడవులు. వాటిగుండా వేసిన చక్కటి రహదారుల వెంట పొతే, చిట్టడవి నడుమ గలగలా పారుతున్న సెలయేరు. దాని మధ్య చిన్నాపెద్ద బండరాళ్ళు. వాటి మీద దుముకుతూ, కేరింతలు కొడుతూ  పిల్లలు చాలాసేపు కాలక్షేపం చేశారు. నిజానికి అరకు లోయలో కూడా ఇలాంటి సెలయేరు వుంది. కానీ ఇంత గొప్ప రహదారి సౌకర్యం ఉందా అంటే అనుమానమే. ఏటి వొడ్డున  నలుచదరంగా ఉన్న ఓ బండరాయిపై నేను విశ్రాంతి తీసుకుంటూ పిల్లలు చేస్తున్న  తమాషాలను చూస్తుండిపోయాను. రమణీయమైన ప్రకృతి అందాలను, నింగిని తాకుతున్న ఎత్తైన వృక్షాలు చూస్తూ కాలక్షేపం చేశాను.

ఇదే ఊర్లో మా అన్నయ్య, మేనల్లుడు, మేనకోడలి పిల్లలు దగ్గర దగ్గరగానే (వుడ్ స్టాక్, సైక్స్ విల్, టర్ఫ్ వ్యాలీ) ఇండిపెండెంట్ ఇళ్ళు కొనుక్కుని  వుంటున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తప్పిస్తే, ఉన్న పద్దెనిమిది మందిమీ కలిసి ఎవరో ఒకరి ఇంట్లో  మధ్యాహ్నభోజనాలు, రాత్రి డిన్నర్లు. ఎక్కడకు వెళ్ళినా నాలుగు కార్లు కదలాల్సిందే.

పరాయిదేశంలో కూడా కుటుంబ ఆప్యాయతలు అలాగే వున్నాయి. అందరూ వర్క్ ఫ్రం హోం బాపతే కాబట్టి లాప్ టాపుల్లో ఆఫీసు పని. పనిలోపనిగా కాలక్షేపం కబుర్లు. మధ్య మధ్య వేడి వేడి పకోడీలు, కాఫీలు సరేసరి.

(30-07-2024)

(అమెరికాలో రెండో రోజు కొన్ని ఫోటోలు, వీడియోల లింకులు)

  










  

 

పత్రికల మంత్రసాని ఏబీకే


ఆయన ఎన్నో పత్రికలకి పురుడు పోశారు. కానీ మంత్రసాని పాత్రకే ఆయన్ని  పరిమితం చేసారు యజమానులు. పురుడు పోసిన పత్రికలు ఆకాశానికి ఎదిగాయి. కానీ ఆయన మాత్రం నేల మీద తన కాళ్లపై తాను నిలబడే వున్నారు. ఏదన్నా నష్టపోతే ఆ పత్రికలే. ఆయన కాదు.

ఈరోజు తొంభయ్యవ పడిలో అడుగిడుతున్న ఏబీకే ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు - భండారు శ్రీనివాసరావు

30, జులై 2024, మంగళవారం

మా అమ్మ కధ - భండారు శ్రీనివాసరావు

మా అమ్మ కధ - భండారు శ్రీనివాసరావు

“ మా అమ్మగారి పేరు వెంకట్రామమ్మ. ఆమె కృష్ణా జిల్లా గండ్రాయిలో 1907 నవంబర్ ఒకటో తేదీన జన్మించింది. తండ్రి కొండపల్లి శ్రీనివాసరావు. తల్లి వెంకటమ్మ. పుట్టింటి వారిది శ్రీవత్స గోత్రం. చిన్న తనంలోనే తల్లీ తండ్రీ గతించారు. బాల్యం చాలా ఇబ్బందులతో గడిచిందని చెబుతారు. ఆమె పెద్దన్న గారు కొండపల్లి రామచంద్ర రావు కష్టపడి చదువుకుని ప్లీడరుగా బెజవాడలో ప్రాక్టీసు పెట్టి పేరుమోసిన న్యాయవాదిగా కీర్తి గడించారు. ఆయన నివాసం వున్న రోడ్డుకు ఆయన పేరే పెట్టారు. రెండో అన్న కృష్ణారావు గారు గండ్రాయి కరణీకం చేస్తుండేవారు.
“ మా నాన్న గారు భండారు రాఘవ రావు గారు. ఆయన కంభంపాడు కరణం. పర్వతాలయ్య గారి పెద్ద కుమారుడు. ఆయనకు వివాహం చేయడానికి మా తాతగార్లు ముగ్గురూ గుమ్మడిదుర్రో మరే వూరో గుర్తులేదు – వెళ్లి పిల్లను చూసి సంబంధం అనుకూలంగానే వుందనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చారుట. అదేసమయానికి, అప్పటికింకా ప్రాక్టీసు మొదలుపెట్టని మా పెద్ద మేనమామ రామచంద్రరావు గారు మా వూరు వచ్చి ఇంటి అరుగు మీద కూర్చుని మా తాతల రాకకోసం ఎదురు చూస్తున్నారు. మా నాన్న గారికి, ఆయన చెల్లెల్ని అంటే మా అమ్మగారిని ఇవ్వాలని వచ్చిన సంగతి అర్ధం చేసుకున్న మా తాతగార్లు అప్పుడేం చేయాలన్న మీమాంసలో పడ్డారు. వారు వెళ్లి వచ్చిన సంబంధం వాళ్లు చాలా కలిగిన వాళ్లు. పదెకరాల తోట, సొమ్ములు పెడతాం అని చెప్పారట. ఇటు చూస్తే మా మేనమామ వాళ్ళది వేలు విడిచిన మేనరికం. బాగా లేమిలో వున్న కుటుంబం. ‘యేది ఏమయినా రామచంద్రం వచ్చి కూర్చుని పిల్లను ఇస్తానంటున్నాడు. కనుక మేనరికం కాదని బయటకు పోవడం ఉచితం కాద’ని తీర్మానించుకున్న మా తాతగార్లు రామచంద్రరావును లోపలకు పిలిచి సంబంధం ఖాయం చేసారుట. అలా అయింది మా నాన్న గారితో మా అమ్మగారి పెళ్లి. ఈ నాటిలా కాసులకు కాకుండా బంధుత్వాలకు ప్రాధాన్యం ఇచ్చే రోజులవి.
“అలా కంభంపాడులో మా ఇంటి గడప తొక్కిన మా అమ్మ, దాదాపు అరవై ఏళ్ళపాటు ఆ ఇంటితో అనుబంధం పెంచుకుంది. మొత్తం పన్నెండు కాన్పులు. ఒక పిల్లవాడు (ఏడో కాన్పు) పురిటిలో పోగా, ఏడుగురు ఆడపిల్లలూ, నలుగురు మగపిల్లలు కలిగారామెకు.
“కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, ముని మనుమలు, ముని మనుమరాళ్లనే కాకుండా ముని ముని మనుమరాళ్లను కూడా కళ్ళారా చూసుకోగలిగిన పూర్ణ జీవితం గడిపింది.
“1993 జులై 30 నాడు – ఆ రోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం – శుద్ద త్రయోదశి, అంతా వరలక్ష్మీ వ్రతం నోచుకున్నారు. ముత్తయిదువలు రావడం, ఫలహారాలు చేయడం, వాయనాలు తీసుకుని వెళ్లడం అంతా అయిపోయింది. ఇల్లంతా సందడి ఓ పక్క. మరో వైపు మరణ శయ్యపై అమ్మ. ఆ రోజు ఉదయం నుండి అమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ వుంది. ఏ క్షణానికి యేమో అన్నట్టుగా వుండడంతో, అందరికీ కబురు వెళ్ళింది. చివరకు ఆ రాత్రి ఎనిమిది గంటల ఇరవై అయిదు నిమిషాలకు, ఇచ్చిన ‘కీ’ అయిపోతే గడియారం దానంతట అదే ఆగిపోయినట్టు అమ్మ ప్రశాంతంగా తుది శ్వాస విడిచింది. మమ్మల్ని అందర్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సంవత్సరం క్రితం కనకాభిషేకం చేసుకున్న ఒక సుదీర్ఘ జీవితం ముగిసిపోయింది. మర్నాడు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరిగిన అంత్య క్రియలకు అశేష సంఖ్యలో బంధు మిత్రులు తరలి వచ్చారు.
“మూడో రోజు ఉదయం, అస్తి నిమజ్జనం గురించిన ప్రస్తావన వచ్చింది. చిన్న అల్లుడు, భారతి అక్కయ్య మొగుడు తుర్లపాటి పాండురంగారావు గారు ‘కాశీ వెళ్లి గంగలో కలిపితే బాగుంటుంద’ని సూచించారు. దానిపై చర్చ సాగి సాగి అసలు మొత్తం కర్మ కాండ కాశీలోనే చేస్తే బాగుంటుందన్న సలహాను అంతా సమర్ధించారు. ఆ విధంగా కాశీ ప్రయాణం దైవికంగా నిర్ణయం అయిపోయింది. అమ్మ అపర కర్మలు యావత్తు సమీప బంధు జన సమక్షంలో కాశీలో జరగడం ఓ విశేషం ”
( 1987 లో నేను మాస్కో వెళ్లేముందు మా అమ్మగారు జీవించి వున్నప్పుడు కొందరు కుటుంబ సభ్యులతో తీసిన ఫోటో )

అమెరికాలో మొదటి రోజు



రెండో కుమారుడు సంతోష్ మాసికంతో మొదలయింది.
నాకు తోడుగా వచ్చిన మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారి కుమారుడు లాల్ బహదూర్, కోడలు, మేనకోడలు దీపతో కలిసి ఆదివారం ఉదయం వాషింగ్టన్ డి సి విమానాశ్రయం చేరుకున్నాను. మొత్తం ప్రయాణంలో వాళ్ళు కంటికి రెప్పలా చూసుకున్నారు. చిన్న లగేజ్ కూడా నన్ను ముట్టుకోనివ్వ లేదు. అదృష్టం నా మొబైల్ ను మాత్రం నా చేత్తో పట్టుకోనిచ్చారు.
ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని బయటకు వస్తుండగానే బిలబిలమంటూ మా రెండో అన్నయ్య, మూడో అన్నయ్య పిల్లలు లోపలకు వచ్చారు. నన్ను సియాటిల్ కు తీసుకు వెళ్ళడానికి మా వాడు సందీప్ రేపు వస్తున్నాడు. లగేజ్ తో బయటకు రాగానే నాలుగు మత్తేభాలు వంటి పెద్ద వాహనాలు సిద్ధంగా పెట్టారు. వెళ్ళింది ముగ్గురం. రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది పది మంది. ఈ వాహనాల్లో ఒకటి డ్రైవర్ లేని కారు. మా రెండో అన్నయ్య కొడుకు సత్య సాయి ముచ్చటపడి రెండేళ్ళ క్రితం కొనుక్కున్నాడు. డ్రైవర్ సీట్లో మనిషి వుంటాడు కానీ డ్రైవ్ చేయడు. అంతా ఆటోమేటిక్. కారుకు అమర్చిన సూక్ష్మమైన కెమేరాలు దారిలో వచ్చే పోయే వాహనాలను చూసుకుంటాయి. స్పీడ్ లిమిట్స్ వున్న ఇండికేటర్లు కనిపించినప్పుడు అదే వేగాన్ని వాటికి అనుగుణంగా సరిచేసుకుంటుంది. అంచేత ట్రాఫిక్ పోలీసుల ఓవర్ స్పీడ్ చలానాల ( ఇక్కడ టిక్కెట్స్ అంటారు) బెడద ఉండదు. అలాగే నిర్దేశించిన జాగాలో అదే తనను ముందుకు వెనక్కు జరిగి తనను తాను జాగ్రత్తగా పార్కు చేసుకుంటుంది. దీనివల్ల కారుకు సొట్టలు పడవు. అంతా బాగానే వుంది కానీ రయ్యి రయ్యిమని దూసుకు పోతున్న వాహనాల నడుమ మనం ప్రయాణిస్తున్న కారుకు డ్రైవర్ లేడు అనే భావన ( భయం అందామా) వెంటాడుతూనే ఉంటుంది). 
రెండు రాష్ట్రాలు దాటి మూడో రాష్ట్రం మేరీ ల్యాండ్ లో ప్రవేశించి మా మేనల్లుడు రామచంద్రం కుమారుడు కాశ్యప్, వాహిని దంపతుల ఇంటికి చేరాం. ముందూ వెనకా పెరళ్లు. వెనక దట్టమైన అడవి. నింగిని తాకుతున్నట్టు పొడవైన వృక్షాలు. అప్పుడప్పుడు జింకలు, కుందేళ్ళు కనిపిస్తాయి. వృక్ష, వన్య సంపదలను కాపాడు కుంటున్న తీరు ప్రశంసనీయం. ఇలాంటి విషయాలు అన్నీ గతంలో పదేళ్ళ క్రితం నా బ్లాగులో రాశాను. 
బ్రేక్ ఫాస్ట్ సమయంలో నా రెండో కుమారుడు సంతోష్ ఏడో మాసికం ప్రస్తావన వచ్చింది. ఆ వూళ్లోనే మా దగ్గరి బంధువు, నాకు స్కూల్లో క్లాస్ మేట్ వనం వరదా రావు కుమార్తె స్వప్న, అల్లుడు సుగుణాకర రావు దంపతులు చాలా కాలంగా వుంటున్నారు. అక్కడ మన వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఆయనే దిక్కు. ఫోన్ చేసి, తిథి చెబితే ఆయన పంచాంగం చూసి ఆదివారం మధ్యాహ్నం నుంచి మరునాడు సోమవారం  ఉదయం ఎనిమిదిన్నర వరకు వుందని అంచేత ఈ రోజే పూర్తి చేయడం మంచిదని సలహా చెప్పారు. అదే వూళ్ళో వివిధ గుళ్ళలో పనిచేస్తున్న ఇద్దరు ముగ్గురు పూజారులను సంప్రదించి చివరకు సాయిబాబా గుడి పూజారిని పట్టుకున్నారు. వెంటనే నాలుగు కార్లలో బయలుదేరి దారి మధ్యలో ఒక ఇండియన్ స్టోర్ లో పూజారి గారు చెప్పిన సంభారాల జాబితా ప్రకారం కొనుక్కుని వెళ్లాం. పేరుకు బాబా గుడి కానీ సమస్త దేవతలు అక్కడ కొలువు తీరి ఉన్నారు. పూజారి గారు నెమ్మదస్తులు. ప్రశాంతచిత్తులు. సావధానంగా కార్యక్రమం ఎలాంటి హడావిడీ చేయకుండా చక్కగా పూర్తి చేసారు. దేశం కాని దేశంలో, వచ్చిన మొదటి రోజునే పని పూర్తి అయ్యేలా చూడడం ఆ పై వాడి పనే అనుకున్నాను.
కాశ్యప్ ఇంట్లోనే లంచ్ పూర్తి చేసి సాయం కాలం దాకా కాలక్షేపం చేసి డ్రైవర్ లేని కార్లో దగ్గరా దూరం కాని మా సాయి ఇంటికి చేరుకుని డిన్నర్ చేసి కాసేపు కబుర్లు చెప్పుకుని నిద్రకు ఉపక్రమించాము. 
జెట్ లాగ్ బెడద లేని నిశాచరుడుని కనుక అంతా సక్రమంగా జరిగిందని హైదరా బాదులోని మా కోడలు, మా అన్నయ్యకు తెలియచెప్పే పనిలో పడ్డాను.
ఇప్పుడు సమయం  తెల్లవారు ఝామున జస్ట్ నాలుగున్నర.
గత అయిదేళ్లుగా నాకిది అలవాటే.

కింది ఫోటో:
గుడిలో పూజారి గారి ఆశీర్వ చనాలు తీసుకుంటూ.





https://photos.google.com/share/AF1QipMVC654XuBufk7Q22AMfe4h9Z0HL6DY-9u5d3irzPpwEIhuUKi0wOZPVYqKVehjBw?pli=1&key=Ti1paVV4NXVTbnk1bDQxdnZyd2t6ZlI1MmZJR3BB

దుబాయ్ సెక్యూరిటీ బొమ్మ నువ్వు నువ్వుకాదు పో అంది



విదేశీ ప్రయాణాలు కొత్త కాదు కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పేరుతో చేస్తున్న కొత్త కొత్త సెక్యూరిటీ ప్రయోగాలు ప్రతి ప్రయాణంలో కొత్త గానే వుంటున్నాయి.
మేము ప్రయాణిస్తున్న ఎమిరేట్స్ విమానం అరగంట ఆలస్యంగా హైదరాబాదులో బయలుదేరి దుబాయ్ విమానాశ్రయానికి సకాలంలో కాకపోయినా కనెక్టింగ్ ఫ్లయిట్ తప్పిపోయేంత ఆలస్యం మాత్రం చేయలేదు. 
దుబాయ్ లో సెక్యూరిటీ చెక్ విధానాన్ని అత్యంత ఆధునికం చేయాలని అనిపించడమే తడవు, డబ్బుకు కొరత లేని ఆ దేశపు రాజులు రెండు బొమ్మల్ని తెచ్చి అక్కడ పెట్టారు. ఆ బొమ్మలు సజీవ చిత్రాల మాదిరిగా కళ్ళు కదిలిస్తూ ఎదురుగా నిలబడ్డ మనిషిని ఆపాదమస్తకం పరీక్షించి, అసలు అని తను అనుకుంటే లోపలకు దయచేయమని చేయి చూపిస్తుంది. లేకపోతే బయటకు దయచేయమని వాళ్ల భాషలో వురిమి చెబుతుంది. నా వెంట వచ్చిన( లేదా వాళ్ల వెంట నేను అంటే బాగుంటుంది) మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారి మూడో కుమారుడు లాల్ బహదూర్, కోడలు, మేనకోడలు కూడా అయిన దీప ఇద్దరూ నాకు చెరో పక్క నిలబడి నాకు ఏ మాత్రం అలసట రాకుండా, ఎలాగంటే నా మొబైల్ ను మాత్రం నన్ను మోసుకోనిచ్చారు.
ప్రయాణం ఇలా సజావుగా సాగుతున్న నేపథ్యంలో ఈ దుబాయ్ బొమ్మ వాళ్ళిద్దరికీ పచ్చ జెండా ఊపి నా దగ్గరకు వచ్చి నో, నియత్, నువ్వు నువ్వు కాదు పొమ్మని ఎడమ చేతితో కసిరి పొమ్మంది. అక్కడున్న సెక్యూరిటీ నన్ను వెంటనే బయటకు పొమ్మనకుండా కాళ్ళు ఎక్కడ పెట్టాలి, కళ్ళు కెమెరా లోకి ఎలా చూడాలి అనే విషయాలు బోధ పరిచి మళ్ళీ అక్కడ నిలబెట్టాడు. ఆ బొమ్మ కళ్ళు విప్పార్చి మరీ. నన్ను చూసింది. కనురెప్పలు రెపరెప లాడించింది. బొమ్మ కాస్త మెత్త బడ్డట్టు ఆనిపించింది. కాసేపు అలా చూసి మళ్ళీ కళ్ళు ఉరిమి చూసి నువ్వు నువ్వు కాదు మరొకరివి అని  వాళ్ల భాషలో అరిచి చెప్పింది. 
అప్పుడు లైట్ వెలిగింది. పాస్ పోర్ట్ ఫొటోలో, అమెరికా వీసా ఫొటోలో నాకు మీసం వుంది. ఈ బొమ్మ కానీ ఆ తేడా కనిపెట్టి అలా తేడాగా బిహేవ్ చేస్తోందన్న సందేహం కలిగి ఆ సెక్యూరిటీ అధికారికి మీసాలతో వున్న నా పాత ఐడెంటిటీ కార్డులలోని ఫోటోలు, మీసాలు లేని తాజా ఫేస్ బుక్ ఫోటోలు చూపించి, ఆ బొమ్మ కాదు అంటున్న ఆ నేను ఈ నేనే అని వచ్చీరాని అన్ని భాషల్లో చెప్పేసరికి అతడు కరుణాంత, రంగుడై, ప్రశాంత చిత్తుడై నాకు మాన్యువల్ గా సెక్యూరిటీ చెక్ చేసి మొత్తానికి కథకు శుభం కార్డు వేశాడు. కొన్ని నెలలు నన్ను చూడకుండా వున్న నా రెండేళ్ళ మనుమరాలు జీవిక మొన్నీ మధ్య కటక్ నుంచి వచ్చినప్పుడు హైదారాబాద్ ఎయిర్ పోర్టులో తాతా అంటూ వాళ్ళమ్మ చంకలో నుంచి నా మీదకు ఎగిరి దూకింది. ఈ మాత్రం గ్రహింపు అంత డబ్బు పోసి కొన్న ఆ బొమ్మకు లేకపోవడం విచిత్రమే.