27, జూన్ 2022, సోమవారం

1 1 1 1 1 1 1

 

1 1 1 1 1 1 1

ఇన్ని ఒకట్లలో ఓ పెద్ద సంఖ్య దాగివుంది.

ఇప్పటికి అంటే ఈ నిమిషానికి  నా బ్లాగు భండారు శ్రీనివాసరావు వార్తావ్యాఖ్య  (https://bhandarusrinivasarao.blogspot.com/2022/06/blog-post_27.html)  వీక్షకుల సంఖ్య అన్నమాట.

అంటే అక్షరాలా పదకొండు లక్షల పదకొండు వేల నూటపదకొండు.







   

   

తప్పులపై కత్తి దూసిన పాత్రికేయుడు

 ఈ సంగతి చెప్పింది ఆంధ్రభూమి ఎడిటర్ గా పని చేసిన శ్రీ ఎం.వీ.ఆర్. శాస్త్రి.

సందర్భం : వయోధిక పాత్రికేయ సంఘానికి నిన్న మొన్నటివరకు అధ్యక్షులు, పాత్రికేయ కురువృద్ధులు (తొంభయ్ ఏళ్ళు) శ్రీ గోవర్ధనం సుందర వరదాచారి సన్మాన సత్కార సభ.

ఈ సభలో మాట్లాడుతూ శాస్త్రి గారు తాను ఆంధ్రభూమిలో పనిచేసేటప్పుడు  ఓ వింత ఆలోచన కలిగిందనీ, దాన్ని ఆచరణలో పెట్టడానికి వరదాచారి గారు ఒక్కరే సమర్ధులని నిర్ణయించుకుని ఆ బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంచామని చెప్పుకొచ్చారు. అదేమిటంటే వివిధ తెలుగు దినపత్రికల్లో వస్తున్న భాషా  దోషాలను, సంపాదకీయాల్లో దొర్లే  గుణదోషాలను ఎత్తి చూపే ఒక శీర్షిక నిర్వహణ అన్నమాట. దిద్దుబాటు అనుకుంటా ఆ కాలమ్ పేరు.   

ఈ రోజుల్లో శాస్త్రిగారు చెప్పిన సంగతి పెద్ద విషయం కాకపోవచ్చు. ఎందుకంటే పత్రికల నడుమ జరుగుతున్న కలం పోట్లని జనం అందరూ గమనిస్తున్నారు.  కానీ ఇది పాతకాలం  ముచ్చట. విలువలు, మశానము అంటూ దేవిరించే రోజులు అవి.

వరదాచారి గారి నాలుకకే పదును ఎక్కువ అనుకుంటే, ఇక ఆయన కలానికి ఉన్న పదును ఎలాంటిదో వేరే చెప్పాలా!

శాస్త్రి గారి మాటపై ఆయన కలాన్ని ఝలిపించారు. అన్ని పత్రికలు ముందేసుకుని చిత్రిక పట్టారు. ఎక్కడ ఏ దోషం వున్నా దాన్ని ఉతికి ఆరేసేవారు. పక్క పత్రికల మీద రాతలు కదా! భూమిలో పనిచేసేవాళ్ళు వరదాచారి గారి చెణుకులను  బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఆ వరద హస్తం మన వైపు చూపిస్తే, కొంపలు అంటుకుంటాయి అనే భయం కూడా మనసు మూలల్లో వుండేది.

అన్నంత పనీ జరిగింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇంకా అనేక ఇతర ప్రముఖ పత్రికల భరతం పట్టిన తర్వాత వరదాచారి గారు ఆంధ్రభూమి వైపు దృష్టి సారించడమే కాదు, బాణం ఎక్కుపెట్టి గురిచూసి కొట్టారు. భూమిలో వచ్చే రాతలపై చీల్చి చెండాడారు. దొర్లుతున్న స్ఖాలిత్యాలను ఎత్తి చూపారు. ఈ విషయంలో ఆయనకు స్వపరబేధం లేదు.

ఆ దూకుడు రాతలు చూసి భూమి సిబ్బందే నివ్వెరపోయారు.  

ఇలాంటి రాతలు వరదాచారి గారు మాత్రమే రాయగలరు.

ఇలాంటి మాటలు ధైర్యంగా చెప్పగలిగేది శాస్త్రి గారే!

వయసులో తేడా వున్నా ఇద్దరిదీ కంచుగొంతే! గొంతులోనుంచి వచ్చే ప్రతి మాటా వారి గుండెల్లోనుంచి వస్తుంది కనుక దానికి అంత పవర్.



(27-06-2022)

మాట్లాడడం రాదంటూనే మాట్లాడడం ఎలా! అంటే ఇలా!

 నా గురించి సరిగా తెలిసో తెలియకో హైదరాబాదులోని ఓ  ప్రైవేటు కాలేజీ వాళ్ళు నన్ను  వాళ్ళ కాలేజీ  స్నాతకోత్సవానికి అతిధిగా పిలిచారు. నా డిగ్రీ తెచ్చుకోవడానికే  నానా యాతనలు పడ్డాను, అలాంటిది నా చేతుల మీదుగా పట్టాలు ఇవ్వడం ఏమిటనే భేషజాలు పెట్టుకోకుండా వెళ్లి, నేను సైతం అక్కడ ఓ ప్రసంగం చేశాను. అదే ఇది:

సభకి నమస్కారం -

ఈ ఒక్క వాక్యం కనిపెట్టి నా కాలేజీ స్నేహితుడు, సినిమా దర్శకుడు 'జంధ్యాల', సభల్లో వృధా అవుతున్న ఎంతో విలువయిన సమయాన్ని ఆదా చేసాడు. వేదికమీద వున్న పెద్దల పేర్లను, ప్రతివక్తా ప్రస్తావిస్తూ వచ్చే ఒక సంప్రదాయానికి జంధ్యాల ఆ విధంగా మంగళం పాడాడు.

సరే. విషయానికి వస్తాను. ఈ సభలో మాట్లాడమని నన్ను ఆహ్వానించిన క్షణం నుంచి నన్నో ప్రశ్న అదేపనిగా తొలుస్తూ వచ్చింది. ఇందుకు, నాకున్న అర్హత ఏమిటన్నది ఆ ప్రశ్న. రేడియోలో పనిచేసాడు కనుక ఏదో కొంత మాట్లాడకపోతాడా అన్న నమ్మకం కావచ్చు. అయితే రేడియో వాళ్ళతో ఓ ఇబ్బంది వుంది. వాళ్లకు అన్నీ టైం ప్రకారం జరగాలి. పదినిమిషాలు వార్తలు అంటే పిడుగులు పడ్డా ఒక్క క్షణం ఆలస్యం కాకూడదు. అలాగే పది నిమిషాలు దాటకూడదు. విషయం యెంత పెద్దదయినా క్లుప్తంగా చెప్పాలి. బ్రివిటీ ఈజ్ సోల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది రేడియోలో చెప్పే మొదటి పాఠం.

అంచేత క్లుప్తంగా మాట్లాడేవాళ్ళు ఇలాటి సభల్లో మాట్లాడడానికి పనికి రారేమో అనేది నాకు కలిగిన మరో సందేహం.

మాట్లాడ్డం అంటే గుర్తుకు వచ్చింది.

పశుపక్ష్యాదులు కూడా భావాలను పంచుకుంటాయి. కానీ మాటలతో వాటిని వ్యక్తీకరించలేవు. అయితే ఒకటినొకటి అర్ధం చేసుకుంటాయి. మాటలు రాని పాపాయి పలికే మాటలు తల్లి అర్ధం చేసుకున్నట్టుగా.

గుర్రం సకిలిస్తుంది. ఆవు అంబా అంటుంది. సింహం గర్జిస్తుంది. పాము బుస కొడుతుంది. అయితే ఈ చరాచర సృష్టి మొత్తంలో మాట్లాడగలిగే శక్తి ఒక్క మనిషికే దక్కింది.

అంటే ఏమిటన్నమాట. మాట్లాడే ప్రతిమాటా ఆచితూచి మాట్లాడాలి. ఆదీ మంచి మాట అయివుండాలి. మంచికోసమే మాట్లాడాలి. ఇతరులని నొప్పించడం కోసం కాకుండా సాధ్యమైనంతవరకు వారిని మెప్పించడం కోసం లేదా ఒప్పించడం కోసం మాట్లాడాలి. మంచిని చూసి, మంచిని విని, మంచినే మాట్లాడ్డం వల్ల మనలో పాజిటివ్ వేవ్స్ ప్రసరిస్తాయి. శరీరం మనస్సూ రెండూ తగిన శక్తిని సమకూర్చుకుంటాయి.

విద్యార్ధి దశలో ఇవన్నీ మీకు ప్రతిరోజూ అనుభవంలోకి వచ్చే విషయాలే. మంచి ఉపాధ్యాయులు, మంచి స్నేహితులు, మంచి వాతావరణం ఇంతకంటే మనిషీ, మనసూ ఎదగడానికి ఏం కావాలి చెప్పండి. ఉపాధ్యాయులు చెప్పే మంచి వినండి. స్నేహితులతో మంచి పంచుకోండి. మంచిగా మెలగండి. అలా మంచిగా ఉండడానికీ, లేకపోవడానికీ వుండే తేడా ఏమిటో మీ మనసుకే తెలుస్తుంది. అంతేకాదు, అలా రోజల్లా పంచుకుని, పెంచుకున్న మంచిని ఇంటికి కూడా తీసుకువెళ్ళండి. ఇంట్లో కూడా అమ్మానాన్నతో, అక్కాచెల్లెళ్ళతో, అన్నాతమ్ములతో, ఇరుగూ పొరుగుతో మంచిగా ఉన్నారనుకోండి. ఇక పండగే పండగ. చెడు అన్నది దరి చేరనీయకుండా మంచినే పెంచుతూ పొతే ఇక ఆ సమాజానికి అంతా మంచే జరుగుతుంది. ఇందులో ఇంత విషయం వుంది కాబట్టే నాకిచ్చిన ఈ సమయాన్ని ఇందుకోసం వాడుకుంటున్నాను.

షరామామూలుగా యేవో కొన్ని అనుభవాలు, యేవో కొన్నిఉద్బోధలు చెప్పి, చేసి నేను వెళ్లిపోవచ్చు. మాది గుంకే వయసు, మీది పొడిచే పొద్దు. మీరే సమాజానికి కావాల్సిన వాళ్ళు. మీ అవసరం సమాజానికి వుంది. నేను మాట్లాడుతోంది భావి పౌరులతోటి అన్న స్పృహతో మాట్లాడుతున్నాను. ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది. మీ చేతుల్లో మాత్రమే అది భద్రంగా వుంటుంది. సరయిన పౌర సమాజం మీవల్లనే రూపు దిద్దుకుంటుంది. అలా జరిగిన నాడు ఇక భవిష్యత్తు గురించి మాకెవ్వరికీ బెంగ అక్కరలేదు.

చదువుకునే మీరందరూ దీపాల్లాంటి వారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తూ పొతే, ఇన్ని కోట్ల దీపాలున్న మన దేశం వెదజల్లే వెలుగులు ఎల్లల్ని దాటి, సమస్త ప్రపంచానికి విజ్ఞాన కాంతుల్ని ప్రసరింపచేస్తాయి. యావత్ లోకం ఓ విజ్ఞానఖనిగా తయారవుతుంది.

మరో మాట. నా పిల్లల చిన్నతనంలో, మా ఇంటికి దగ్గరలో వున్న అరోరా కాలేజీలో చదివించాలని అనుకున్నాను. కానీ ఆ ఆశ అప్పుడు తీరలేదు. అందుకే ఈనాడు మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే నా కడుపు నిండినంత ఆనందంగా వుంది.

మంచి కాలేజీలో చేరారు. ఆరోరా విద్యార్ధిని అని గొప్పగా చెప్పుకునేలా మీ ప్రవర్తన వుండాలి. అంతే కాదు, పలానా విద్యార్ధి మా కాలేజీలో చదివాడు సుమా అని యాజమాన్యం కూడా చెప్పుకోగలిగితే ఇరువురూ ధన్యులే.

ఈ ధన్యత అరోరా కాలేజీ ఇప్పటికే సంపాదించుకుని ఉంటుందని నా నమ్మకం.

నా మాటలు ఓపిగ్గా విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు.

సభకి మరోమారు నమస్కారం!”

తోకటపా! ఇలా మాట్లాడే వాళ్ళను వాళ్ళే కాదు, మరెవరూ మళ్ళీ పిలవరు. అదే జరిగింది.




 

24, జూన్ 2022, శుక్రవారం

వ్యతిరేకత ఆగ్రహంగా మారనంత కాలం ఏమీ కాదు

మాస్కోలో అబద్ధం తెచ్చిన తంటా

చదువు 'కొనా'ల్సిందేనా ?..

రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము ఎంపిక