16, నవంబర్ 2021, మంగళవారం

మంచి పిచ్చి అధికారి – భండారు శ్రీనివాసరావు


ఇది ఇప్పటి మాట కాదు. ఈ రోజుల్లో అయితే ఇలాంటి అనుభవాలకు ఆస్కారమే లేదు.
“ఏమండీ ఆయన గారు వచ్చారు, మళ్ళీ ట్రాన్స్ ఫర్ అయిందేమో!”
బయటకు వచ్చి చూస్తే ఆయనే. మొహం వాడిపోయినట్టు వుంది. మనిషి దిగాలుగా వున్నాడు.
పేరుకు పెద్ద అధికారి. పైగా సీనియర్ ఐ.ఏ.ఎస్. మా ఇంటికి వచ్చి నాకోసం ఎదురు చూడడం ఏమిటి చిత్రం కాకపోతే!
నిమిషాల్లో తయారై ఆయన్ని తీసుకుని ఆటోలో వెళ్ళాల్సిన వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆయన్ని బయట కూర్చోబెట్టి లోపల చెప్పాల్సిన వాళ్లకు ఆయన గురించి చెప్పాను.
‘నువ్వు ఇంతగా చెప్పాలా శ్రీనివాసరావ్ ఆయన గురించి నాకు బాగా తెలుసు. నిజాయితీపరుడు. తన డ్యూటీ శ్రద్ధగా చేస్తాడు. కానీ..”
“ఆ కానీ ఏమిటో నాకూ తెలుసండీ. మీరు ఆయన అడిగిన పోస్టు ఇస్తే రేపు నేను వెళ్లి ఆయన్ని కలిసినా ఎవరు అన్నట్టే చూస్తారు. ఫోన్ చేసినా రెస్పాన్స్ వుండదు. మళ్ళీ బదిలీ అయిన దాకా నేనెవరన్నది ఆయనకు గుర్తు కూడా వుండదు. ఏ పని చేయాలన్నా రూలు బుక్కే వేదం. మీరే కాదు, ముఖ్యమంత్రి చెప్పినా వినే రకం కాదు. నిజంగా ఇలాంటి అధికారులే కావాలి. అందుకే వెంట బెట్టి తీసుకువచ్చాను. ఇక మీ ఇష్టం”
“నేనూ అదే చెబుతున్నా! ఇక నీ ఇష్టం. ఈసారి చేస్తాను. ఆరు నెలల్లో మళ్ళీ నువ్వే వస్తావు, ఆయన సంగతి చూడమని. రూలు బుక్కు అంటూ ఎక్కడా ఇమిడే రకం కాదు. ఎవరి మాటా వినే రకం కాదు.”
మూడు రోజుల్లో ఆయన కోరుకున్న పోస్టు దొరికింది. నాకు తెలుసు దొరుకుతుందని. మరో విషయం కూడా తెలుసు తిరిగి బదిలీ అయ్యేదాకా నేను ఎవరన్నది ఆయనకు గుర్తు కూడా ఉండదని.
అయితే ఇలాంటి నిజాయితీ అధికారులు వుండాలి అని కోరుకునే వాడిని కనుక ఆయన నన్ను పట్టించుకున్నాడా లేదా అనే విషయాన్ని పట్టించుకునే వాడిని కాదు.
పొతే, ఇంత నిబద్ధత కలిగిన అధికారికి ఈ పోస్టుల మీద వ్యామోహం ఏమిటి అనే అనుమానం తొలుస్తూ వుండేది.
ఒకసారి బదిలీ అయినప్పుడు ఆయనే చెప్పారు ఇలా.
“సాయం చేయగలిగిన అదీ అవసరంలో వున్న పేదవారికి సహాయపడగలిగిన పోస్టులో వుంటే చేయగలిగింది చేస్తాను. కలక్టరుగా వున్నప్పుడు ఆ స్వేచ్ఛ వుండేది కొంతవరకు. కానీ సచివాలయానికి వచ్చిన తర్వాత అలా కుదరదు. ఎవరికీ ఉపయోగపడలేని పోస్టులో వేస్తె గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని జీతం తీసుకుకోవడం తప్పిస్తే ఏం చేయగలను చెప్పు”
“అది సరే! మీకు సాయం చేసిన వారి మాట చెవిన పెడితే మీ గురించి అలా మాట్లాడరు కదా!”
“సరి సరి భలే మాట చెప్పావు. వాళ్ళ మాటలు వినడం మొదలు పెడితే నాచేత వాళ్ళు చేయించేవి పనులు కాదు, అకృత్యాలు”
(ఆ అధికారి ఎవరన్నది ముఖ్యం అనుకోను. ఆయనిప్పుడు జీవించి కూడా లేరు. సర్వీసులో ఉన్న రోజుల్లో తోటి అయ్యేసులు ఆయనకీ పెట్టిన పేరు పిచ్చోడు)
16-11-2021

కడుపు చించుకుంటే..... భండారు శ్రీనివాసరావు

 (నవంబర్ పదహారు జాతీయ పత్రికా దినోత్సవం)

పత్రికలు, మీడియాకు సంబంధించి ఎవరైనా వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఇష్టం లేకపోయినా, ఆ రంగానికి చెందిన ఒకప్పటి మనిషిగా ఒక్కోసారి కల్పించుకోవాల్సి వస్తోంది.
చాలామంది 'పలానా పత్రిక చదవం, పలానా మీడియా చూడం' అంటుంటారు. ఎందుకంటే అవి పాక్షికంగా ఏదో ఒక పార్టీకి వెన్ను కాస్తున్నాయి అనేది ప్రధాన ఆరోపణ. ‘చదవం, చూడం’ అని అంటూనే వాటిల్లో వచ్చిన వార్తలని గురించి ప్రస్తావిస్తుంటారు. అదో వైచిత్రి.
నా వరకు నేను నలభై ఏళ్లనుంచి రోజూ మూడు నాలుగు పత్రికలు చందా కట్టి ఇంటికి తెప్పించుకుని చదువుతుంటాను. ‘అవి ఏం రాస్తున్నాయి’ అనే దానికంటే, అవి వార్త ఇచ్చే విధానంలోని వైవిధ్యాన్ని గమనిస్తుంటాను. పత్రికల నడుమ వృత్తి పరమైన పోటీ వుండడం తప్పేమీ కాదు. పై చేయి అనిపించుకోవడానికి ప్రయత్నించడం తప్పుపట్టేదేమీ కాదు. కానీ క్రమంగా ఈ పోటీ పాత్రికేయుల చేతుల్లోనుంచి ఆ పత్రికల యజమానుల చేతుల్లోకి పోతోంది. దానితో ఏ పత్రికకు ఆ పత్రికకు ఓ రంగూ రుచీ వాసనా ఏర్పడుతున్నాయి. కొంచెం అటూ ఇటూగా ఈ దోషం అంటుకోని పత్రికంటూ కలికానికి కూడా కనిపించడం లేదు.
నిజమే! మునుపటి రోజుల్లో మాదిరిగా మడి కట్టుకుని పత్రిక నడపడం సులభం కాని పరిస్తితి వున్న మాట వాస్తవమే. అయితే, మనుగడకోసం ఎంతో కొంత రాజీ పడే ధోరణి కాస్తా అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయి ఇతరేతర రంగాల్లో వుండే అవలక్షణాలన్నీ కట్ట గట్టుకుని ఈ రంగంలో ప్రవేశించాయి. ఈ రంగానికి వున్న అపరిమితమైన 'రీచింగ్' వల్ల, యేది చెప్పాలన్నా, ప్రజలకు క్షణాల మీద యేది చేరాలన్నా మీడియాను మించిన మార్గం లేకపోవడంతో రాజకీయుల కళ్ళు ఈ రంగం మీద పడ్డాయి. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు తమ పెట్టుబళ్లను ఈ రంగంలోకి మళ్ళిస్తున్నారు. నేరుగా 'రిటర్న్స్' వెంటనే రాకపోయినా మరో మార్గంలో అందుతున్న ప్రయోజనాలు వారిని ఇందుకు ఆకర్షిస్తున్నాయి. డబ్బు పోయినా అంతకు మించిన గౌరవం, తద్వారా సామాజికంగా, రాజకీయంగా వొనగూడుతున్న లాభాలు వారిని ఇందుకు పురిగొల్పుతున్నాయి. అందుకే దేశంలో ఎక్కడా లేనన్ని టీవీ ఛానళ్ళు తెలుగునాట పురుడు పోసుకుంటున్నాయి. పెట్టుబళ్ల వరకు అయితే పరవాలేదు. రాజకీయాల్లో వుండే కల్మషం, కుళ్ళూ, ఒకళ్ళను మరొకళ్ళు కత్తులతో నరుక్కునే సంస్కృతి - కాఫీ డికాషన్ మాదిరిగా ఇందులోకి దిగుమతి అవుతున్నాయి. ఆ పత్రిక ఏం చెప్పింది అని గతంలో మరో పత్రిక గమనించేది. దాన్ని గురించి ప్రస్తావించాల్సివస్తే పాత్రికేయ మర్యాదలు పాటించేవారు. పేరు పెట్టకుండా ‘ఒక పత్రిక’ అనేవారు. లేదా ‘మా పత్రిక కాదు’ అని రాసుకునే వారు.
కానీ ఇప్పుడో. ఒక పత్రిక ఏదైనా రాస్తే దాన్ని తమ పత్రికలో ఖండఖండాలుగా ఖండించడం ఎల్లా అన్నదొక్కటే యావ.
ఫలితం. 'ఈ పత్రిక అలాగే రాస్తుంది, ఈ టీవీ అలాగే చూపిస్తుంది' అని జనం తేలిగ్గా మాట్లాడుకునే పరిస్తితి. ఇది జర్నలిజానికి మంచిదా అంటే అంత ఆలోచించే తీరిక ఎవ్వరికీ లేకుండా పోతోంది.
ఇందులో ఒకర్ని నిందించే పరిస్తితి ఎప్పుడో దాటిపోయింది. అందరూ అందరే. ఎవరికీ మినహాయింపు ఇవ్వలేని స్తితి.
పత్రికలు, టీవీల్లో పనిచేసే సిబ్బంది, వాటి యజమానులు, వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడే పార్టీలు సొంత ఎజెండాలతో ముందుకు పోవడాన్ని కొంత అర్ధం చేసుకోవచ్చు. అసలు విషాదం ఏమిటంటే ఆయా పార్టీల అభిమానులైన పాఠకులు సైతం వేర్వేరు పారావారాలుగా విడిపోయి తగువులు పడడం. సోషల్ మీడియాలో కూడా ఆ రంగుల్ని చల్లడం.
ఎవరు ఏమైనా అనుకోండి కానీ, ఈ రంగంలో దశాబ్దాల తరబడి పనిచేసిన వాడిగా ఇది నా నిశ్చితాభిప్రాయం.
ఇష్టం వున్న వాటిని చదవండి. ఇష్టం వున్నవాటిని చూడండి. 'అలా యెందుకు రాశారు, ఇలా యెందుకు చూపారు' అని ప్రశ్నిస్తే అవే ప్రశ్నలు మీకూ ఎదురవుతాయి.
ఎందుకంటే అన్నం తింటున్నది గొంగట్లో కనుక.
(NOTE: Courtesy Image Owner)



15, నవంబర్ 2021, సోమవారం

ఆదర్శమూర్తికి కాంస్య విగ్రహం

 ఆదర్శం ముందెన్నడు అవసరాన్ని చూడకు అనేవారు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు. అలా చూడడం మొదలు పెడితే అవసరాలదే ఎప్పుడూ  పై చేయి అవుతుంది.

ఆదర్శాలకు విలువ తగ్గిపోతూ ఉండడానికి  ప్రధాన కారణం వాటిని వల్లె వేసేవారు ఎక్కువై, ఆచరించేవాళ్లు స్వల్ప సంఖ్యాకులు కావడం.

ఈ నేపధ్యంలో ఎన్నదగిన ఓ సామాన్యుడు డాక్టర్ అయితరాజు పాండురంగారావు.

ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా వల్లభి.

హైదరాబాదులో డాక్టరీ చదివి, ఇంగ్లాండులో పై చదువులు పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగివచ్చి, అందివచ్చిన  ప్రభుత్వ ఉద్యోగానికి హైదరాబాదును కాకుండా  మారుమూల బూర్గుంపాడు ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు, పై అధికారులతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ విధంగా ‘తానమ్మిన సత్యాన్నే బోధించిన ధీశాలి, బోధించిన సత్యాన్నే పాటించిన వ్రతశీలి’ అనిపించుకున్నాడు.

ఉద్యోగపర్వంలో బూర్గుంపాడు, భద్రాచలం, హైదరాబాదు ఇలాగే రోజులు గడిచిపోయాయి. ఒక ప్రభుత్వ డాక్టరుగానే జీవితం గడిపివుంటే ఆయన్ని గురించి రాయాల్సిన అవసరం, తలచుకోవాల్సిన సందర్భం ఉండేదే కాదు. వైద్య విద్యార్ధిగా తొలిపాఠం నేర్చుకున్నప్పుడే డాక్టర్లకు నేర్పే మరో నీతిపాఠాన్ని ఆయన ఒంటపట్టించుకున్నాడు. జీవితాంతం దాన్నే పాటిస్తూ వచ్చాడు.

‘రోగికి అవసరం లేని వైద్యం చేయకూడదు, చేసిన వైద్యానికి డబ్బు తీసుకోకూడదు’ అన్నది ఆ పాఠం.

108, 104 అంటే ఏమిటో ఈరోజు తెలుగు రాష్ట్రాలలో యావన్మందికీ తెలుసు. వాటి రూపశిల్పి ఈ డాక్టరు గారే. హైదరాబాదులో ఉంటున్నా, నెలలో చాలా రోజులు వాళ్ళ సొంతూరు వల్లభిలో గడిపిన ‘శ్రీమంతుడు’ డాక్టర్ అయితరాజు పాండురంగారావు. దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేని గ్రామ ప్రజలకోసం పుష్కరకాలానికి పైగా సొంత ఊరిలో టెలి మెడిసిన్ సదుపాయాన్ని కల్పించి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు సాయపడ్డాడు. ఇప్పటికీ అది కొనసాగుతోంది.

ఆ డాక్టర్ చనిపోయిన తర్వాత కూడా ఆ ఊరి ప్రజలు ఆయన్ని తమ గుండెల్లో పెట్టుకున్నారు. డాక్టర్ రంగారావు జీవించి వున్న కాలంలో ఆవిష్కరించిన మహాకవి కాళోజి విగ్రహం సరసనే డాక్టర్ రంగారావు  కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు.

నిన్న ఆదివారంనాడు  రంగారావు విగ్రహావిష్కరణ ఆయన ఆశయాలకు తగ్గట్టుగానే ఆ వూరి ప్రజలు నిరాడంబరంగా నిర్వహించారు.

తెలంగాణా ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించి వైద్య రంగంలో డాక్టర్ రంగారావు సేవలను సోదాహరణంగా వివరించారు. సికిందరాబాదు గాంధీ హాస్పిటల్ మాజీ సూపర్ ఇన్ టెండెంట్ డాక్టర్ నాగభూషణం అధ్యక్షత వహించారు. గతంలో ప్రాజక్టు సీఈ ఓ గా పనిచేసిన డాక్టర్ బాలాజీ ఊట్ల, డాక్టర్ రంగారావుతో సన్నిహితంగా పనిచేసిన డాక్టర్ గోపాల్, శశి కుమార్ వంటి అనేకమంది హైదరాబాదు నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   

ఖమ్మం జిల్లాలో కడగొట్టు గ్రామం అయిన ఆ పల్లెలోని బడుగు బలహీన వర్గాల నుంచి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో  అత్యున్నత చదువులు  అభ్యసించి జీవితంలో బాగా  ఎదిగివచ్చిన  నలుగురు యువకులను ఈ సందర్భంగా సత్కరించిన నిర్వాహకులు అభినందనీయులు.

అలాగే సభకు వచ్చిన గ్రామస్తులు అందరూ ‘నేను కరోనా టీకా తీసుకున్నాను అని రాసి వున్న బాడ్జ్ ధరించడం ఓ విశేషం.




(14-11-2021)

 

 

13, నవంబర్ 2021, శనివారం

తనదాకా వస్తే కానీ..

 మనిషి కురచగా వున్నా మనసు విశాలంగా వుండాలని అంటారు.

నా బాల్య మిత్రుడు ఒకరు చాలా ఏళ్ళ తర్వాత  ఫేస్ బుక్ ద్వారా మళ్ళీ కాంటాక్టు లోకి వచ్చాడు. దేశాలు తిరిగి వచ్చిన అనుభవం అతడికి  వుంది. అయినా ఆలోచనలు, భావాల్లో మార్పు లేదు. తన మతం అంటే ఎనలేని గౌరవం. తప్పులేదు.  కానీ పరాయి మతాలూ అంటే తగని ద్వేషం.  క్రైస్తవులను కావాలని కిరస్తానీవాళ్ళు  అంటాడు. ముస్లిం లను తురకోళ్ళు అంటాడు. ఇది సభ్యత కాదని చాలా సార్లు చెప్పాను. అయినా వినిపించుకోలేదు.

కొన్నాళ్ళుగా ఫేస్ బుక్ లో అతడి పోస్టులు లేవు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆరా తీస్తే తెలిసింది. అతడి ఇద్దరి పిల్లలు అమెరికాలో వుంటున్నారు. కొడుకు క్రైస్తవమతానికి  చెందిన అమ్మాయిని, కుమార్తె ఆఫ్రికన్ అమెరికన్  (ముస్లిం) అబ్బాయిని   ఆ దేశంలోనే వాళ్ళ మతాచారాల  ప్రకారం పెళ్లి చేసుకున్నారు. తలితండ్రులను పిలిపించుకుంటే వెళ్లి వచ్చారు. అప్పటి నుంచీ  ఇతర మతాల పట్ల  అక్కసుతో కూడిన అతడి పోస్టులు కనబడడం లేదు.

మనం మనలాగా జీవిస్తే ఎవరికీ ఇబ్బంది వుండదు, అందరూ మనలాగే వుండాలని అనుకుంటేనే  ఎదురు దెబ్బలు తగులుతాయి.

అతడి పిల్లలు చేసిన పనిని నేను సమర్థించడం లేదు.  సాటి మానవుల విషయంలో  నా స్నేహితుడి ప్రవర్తన పట్లే నా అభ్యంతరం.

(13-11-2021)

కాళోజీ గర్వభంగం - భండారు శ్రీనివాసరావు

 కాళోజీ గర్వభంగం - భండారు శ్రీనివాసరావు

(కాళోజీ గర్వభంగం అనే పదాన్ని కాళోజీనే స్వయంగా తన ఆత్మకధలో వాడారు - ఈరోజు నవంబరు పదమూడు ప్రజాకవి కాళోజీ వర్ధంతి)
కాళోజీ నారాయణ రావు ‘ఇదీ నా గొడవ’ అనే పేరుతొ తన ఆత్మకధ రాసుకున్నారు. స్నేహసాహితి వారు ప్రచురించిన ఈ పుస్తకం 1995 సెప్టెంబరు నెలలో విడుదల అయింది. తెలుగు భాష గురించీ, తెలంగాణా యాస గురించీ ఆయనకున్న మక్కువను ఆయన తన ఈ రచనలో వ్యక్తం చేసారు. అలాగే కొన్ని సందర్భాల్లో తనకు జరిగిన ‘గర్వ భంగాలను’ కూడా ఆయన చాలా హృద్యంగా ఆయన శైలి లోనే ఈ పుస్తకంలో ప్రస్తావించారు. మితృడు జ్వాలా వద్ద నాకీ పుస్తకం దొరికింది. కాళోజీ సాహిత్యం చాలావరకు ఆయన లైబ్రరీలో వుంది. పాఠకుల కోసం కాళోజీ స్వయంగా రాసుకున్న ఆ జ్ఞాపకాల్లో కొన్ని కాళోజీ మాటల్లోనే :
“కులాల్లో ఎన్నో తరతమ భేదాలు పాటిస్తున్నాం. అది గ్రామ్యం, ఇది గ్రాంధికం అంటూ భాషలో కూడా తేడాలు పాటిస్తున్నాం.
“భాషకి సంబంధించి రెండే రెండు. ఒకటి మాట రెండు రాత. అంటే ఉచ్చారణ, దస్తూరి. అదే ‘అ’ అదే ‘ఇ’,
అదే ‘ఉ’ అదే ‘క’, అదే ‘య’. అక్షరమైతే ఒకటే. ‘క’ అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాస్తారు. ఎట్ట రాసినా అది ‘క’ అనే అంటం కాని ‘హ’ అని ఎవడూ అనుకోడు.
“దస్తూరి విషయంలో వుండే ఈ ఉదారత, సహృదయత ఉచ్చారణ విషయంలో ఎందుకు లేవు ? ఏ ఇద్దరి దస్తూరి ఒక రకంగా వుండనట్టు ఏ ఇద్దరి ఉచ్చారణా ఒక రకంగా వుండది. ఉచ్చారణ ఏ యాసలో వున్నా అర్ధం చేసుకోవడానికి ఇబ్బంది వుండకూడదు. మాండలికాలు లేని భాష చచ్చి వూరుకుంటది. మాండలికంలో తేడాలు, యాసలో వ్యత్యాసాలు వుండడమే భాషకి జీవ లక్షణాలు.
“‘అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అన్నను. అన్ని భాషలు నేర్చుకో కానీ నీ మాతృభాషని మాత్రం తప్పకుండా నేర్చుకో.
“రావిశాస్త్రి విశాఖ భాష, తెలుగు కాదని మేమూ, నల్గొండ వాళ్ళది వేరే యాస కాబట్టి అది తెలుగు కాదని వరంగలోడు, వరంగల్ వానిది తెలుగు కాదని బెజవాడవాడు, బెజవాడ వానిది తెలుగే కాదని రాయలసీమ వాడు – ఇట్లా అనుకుంటపొతే మన మద్య సుహృద్భావం ఎట్టవస్తది. మనందరం తెలుగు వాండ్లం అనే ఎమోషనల్ ఇంటిగ్రేషన్ – ఆత్మీయత ఏముంటది . ఒకని భాష విషయంలో, యాస విషయంలో తిండి విషయంలో ఎగతాళి చేస్తే అతని ఆత్మాభిమానం దెబ్బ తింటది. దానికి వెల కట్టలేం.
“హైద్రాబాదు రేడియోలో బాలల కార్యక్రమం వచ్చేది. ఆంద్ర ప్రదేశ్ ఏర్పడిన (1956) నాటినుంచి ఈనాటి (1985) దాకా అంటే దాదాపు ముప్పయ్ ఏండ్లపాటు బాలల కార్యక్రమాలు వందలు వేలు జరిగివుండాలె. వీటిల్లో తెలంగాణా పిల్లలు ఎందరు పాల్గొన్నరు. వాండ్ల వాడుక భాష ఏది. వాండ్లు కనబడరు. వాండ్ల భాష వినబడదు. బిరుదు రామరాజు పిల్లలు, పల్లా దుర్గయ్య పిల్లలు, సినారె పిల్లలు ఎన్నడయినా బాలానందంలో పాల్గొన్నరా. రేడియో అన్నయ్య, అక్కయ్యల పాటా, మాటా, యాసా ఏదీ తెలంగాణది కాదు.
“ప్రతి విషయంలో ఈ తేడాలు వుంటుంటే మరి మనమంతా కలిసి తెలుగోళ్ళమనుకుండేదెట్ట. ఆ భాష బాంధవ్యం కానీ, ఆ సామరస్యం కానీ ఎట్ట రావలె. ఏడనుంచి ఒస్తది. ఇది మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం”
పొతే కాళోజీ తన ఆత్మ కధలో తన గర్వం అణిగిన సందర్భం ఒకటి ఉదహరించారు ఇలా.
“వరంగల్లు రాజరాజ నరేంద్ర గ్రంధాలయంల ఆంజనేయులు అనే ఒకవిద్యార్ది సాయంకాలాలు పనిచేసేటోడు. ఐదో ఆరో ఇచ్చేటిది. ఆ లైబ్రరీకి బెజవాడ నుంచి ఓ ఉత్తరం వచ్చిందట. పై కవరు మీద ఆంజనేయులు అడ్రెసు, లోపల మాత్రం రావి నారాయణరెడ్డి నాకు రాసిన ఉత్తరం. మరి సీ.ఐ.డీలు ఎట్ల పసికట్టిన్రో ఏమో, అది పట్టుకుని నన్నూ ఆంజనేయుల్నీ అరెస్టు చేసిన్రు. నన్నొక లాకప్ లోను, ఆంజనేయుల్ని మరో లాకప్ లోను పెట్టిన్రు. ఆ లాకప్ లో నాతో పాటు ఓ దొమ్మరాయన వున్నడు. .....నేను సత్యాగ్రహిని. ఈ నేరస్థునితో సమానం చేస్తరా. నా ప్రిస్టేజికి భంగం వచ్చినట్టు అనిపించింది. దొమ్మరతని చెవిలో సగం కాలిన ఆకు చుట్ట వుంది. అది తీసి, కొరికి, అక్కడే ఉమ్మి వేసి నా వైపు చూస్తూ ‘అగ్గిపుల్ల ఉందా’ అని అడిగాడు. నేను చీదరించుకున్నట్టు ‘హట్! నన్నడుగుతవా’ అన్న. అతడు సెంట్రీ నడిగి చుట్ట ముట్టించుకుని నా ముంగిట కూర్చుని అడిగిండు నన్ను ఏ నేరంలో పోలీసులు పట్టుకొచ్చారని. రాజకీయ సత్యాగ్రహం, బాధ్యతాయుత ప్రభుత్వం ఇవన్నీ నేను చెప్తె వానికేమి తెలస్తది.
“చూడండి మనిషి స్వభావం యెంత విచిత్రమో. కులమతాల పట్టింపులు లేనివాడిని. ఆర్య సమాజపు మనిషిని. ఇలాటోడిని లాకప్పులో తోటి మనిషి పట్ల ఇట్లుండడం.
“చోరీ చేస్తివా ?”
“ఎవుడి తలన్నా పగలగొట్టి వస్తివా ?”
“ఎవుడి పెళ్ళాన్నన్నా ఎత్తుకు వస్తివా ?”
ఇలా నేరాలన్నీ ఏకరువు పెట్టి అడుగుతున్నాడు.
“ఛీ ఛీ అంటూ అన్నిటికీ కాదు కాదనే చెబుతున్న. ఈ ప్రశ్నలన్నీ అయినంక ఒక నిమిషం ఆలోచించి ఒక్క ప్రశ్న వేసిండు. కాళోజీ గర్వభంగం అని చెప్పే నాలుగైదు సంఘటనల్లో ఇది మొదటిదన్న మాట.
అతనాలోచించి అడిగిన ప్రశ్న. ‘గాంధీ మహారాజ్ కిన్నీ, హుజూర్ నైజాంకీ లడాయ్ జరుగుతుందట. దాంటోగిన రాలేదు కద నువ్వు?’
“దొంగతనాలు, దోపిడీలు కాకుండా వేరే రకంగా ఓ పోరాటం జరుగుతున్నదనే ఒక పిక్చర్ అతని లోపల కట్టి వున్నదన్నమాట. దాంతో నేను విచిత్రపడిపోయి, దగ్గరకి జరిగి కౌగలించుకుని ‘అవున్నాయనా ఆ లడాయిలోనే వచ్చిన’ అని కళ్ళనీళ్ళు పెట్టుకున్న. నా జీవితంలో ఇది మరపురాని ఘట్టం’ అని కాళోజీ తన ఆత్మకధలో రాసుకున్నారు.
ఈ కాలంలో వచ్చే ఆత్మకధల్లో ఇలాటి నిజాయితీని ఊహించగలమా!



12, నవంబర్ 2021, శుక్రవారం

నా నడక చూడ తరమా! – భండారు శ్రీనివాసరావు

 “ఎక్కడికి వెళ్ళాలి పాపా! నేను డ్రాప్ చేస్తాను అంది నా కోడలు నిషా నేను చెప్పులు వేసుకోవడం గమనించి.

“ఇక్కడికి దగ్గరే. స్టేట్ బ్యాంకుకు వెళ్ళాలి. అప్పుడప్పుడు నాలుగడుగులు వేస్తుండడం నాకూ మంచేదేగా” అంటూ కిందికి వచ్చాను.
నేను వెళ్ళాల్సిన స్టేట్ బ్యాంకు బ్రాంచి కిలోమీటరు లోపలే వుంటుంది. మెయిన్ రోడ్డులో మధురా నగర్ మెట్రో స్టేషన్ దగ్గర.
మధ్యలో మెట్రో వుండడం వల్ల రోడ్డు కాస్త కుంచించుకు పోయింది. ఫుట్ పాతులు వున్నాయి కానీ దుకాణాల వాళ్ళ మోటారు సైకిళ్ళు, కార్లతో నిండి పోయాయి. కొంత దూరం నడవగానే మురికి నీళ్ళు ధారగా పారుతున్నాయి. ఏదో అపార్ట్ మెంటు లోపలనుంచి వస్తున్నాయి. వాళ్ళూ పట్టించుకుంటున్న దాఖలా లేదు. మహాకవి శ్రీశ్రీ తన గేయంలో చెప్పినట్టు “ఇటు చూస్తే అప్పులవాళ్లూ, అటు చూస్తే బిడ్డల ఆకలి!" అన్నట్టు రోడ్డు మీద ఎదురుగా వస్తున్న వాహనాల నుంచి తప్పించుకుని పక్కకు జరిగి బురదలో కాలు పెట్టాలో లేదా ధైర్యం చేసి వాహనాలకు ఎదురు వెళ్ళాలో అర్ధం కాలేదు. ఈ రెంటికీ ధైర్యం చాలక అక్కడ ఓ పండ్ల బండి వాడిని అడిగాను. అతడు కుడి వైపు సందులోకి తిరిగి కొంత దూరం పోయి మళ్ళీ ఎడమ వైపు తిరిగితే బ్యాంకు వస్తుంది అని తరుణోపాయం చెప్పాడు. అతడికి థాంక్స్ చెప్పి కుడికి తిరిగాను. కొంత దూరం పోగానే మళ్ళీ రోడ్డు మీద మురికి నీళ్ళు. అవి కూడా ఒక అపార్ట్ మెంటు వాళ్ళ పుణ్యమే. తమ ఇంటి నుంచి డ్రైనేజి నీళ్ళు బయటకి పోతున్నాయి కదా! అంతే చాలు! అని భావిస్తున్నట్టు వుంది.
అక్కడి వీధులకు ఈ నీళ్ళ ప్రవాహాలకు ఏదో లింక్ ఉన్నట్టుంది. కొద్ది దూరం పోగానే మళ్ళీ రోడ్డు మీద వైతరణి. తప్పించుకోవడానికి అలా కుడి ఎడమ రోడ్లు చుట్టబెడుతూ ఆఖరికి బ్యాంకుకు చేరాను.
అదేదో వాకర్స్ వాడే మిషన్/ మీటర్ ఉన్నట్టయితే ఎన్ని కిలోమీటర్లు ఆఫ్టర్ నూన్ వాక్ చేసిందీ లెక్క తేలేది.
వచ్చేటప్పుడు ఆటో పట్టుకు వచ్చాను అని వేరే చెప్పక్కర లేదు.
(12-11-2021)

“మీ పేరు త్రినాథ్ కదూ’

 అడిగాను నేను  బ్యాంకుకు వెళ్ళిన అరగంట తర్వాత వచ్చి కౌంటర్ లో కూర్చొన్న ఉద్యోగిని.

“అవును మీకు ఎలా తెలుసు?” అడిగాడు ఆశ్చర్యంగా.

సెల్ ఫోన్ అతడి ముందుకు తోసి, “మీకు అభ్యంతరం లేకపోతె ఒక నిమిషం ఇది చదువుతారా” అని అడిగాను సాధ్యమైనంత వినమ్రతతో కూడిన స్వరంతో. నా గొంతులోని మార్దవాన్ని గమనించి అతడు చదవడం మొదలు పెట్టాడు.

అది నిరుటి సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటిన పోస్టు చేసిన కధనం.

అదే ఇది:

21-11-2020 నాటికి  భండారు శ్రీనివాసరావు అనే వ్యక్తి బతికి వున్నట్టు మా కళ్ళారా చూశాము అని స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఎక్కువ శ్రమ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా ఓ సర్టిఫికేట్ ఇచ్చారివాళ.

మా ఇంటికి ఓ కిలోమీటరు దూరంలో కాబోలు స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ వుంది. శనివారం ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు మూస్తారో అని అనుమాన పడుతూనే బ్యాంకు వైపు అడుగులు వేసాను. మా ఆయన ఇన్నాల్టికి అడుగులు వేసాడు అని సంబరపడి అరిసెలు వండి పెట్టేదేమో, మా ఆవిడ బతికి ఉన్నట్టయితే. ప్రధాన మంత్రి మోడీ కరోనా వున్నది జాగ్రత్త! ఇంటిపట్టునే మూతి (కట్టుకు) మూసుకు వుండండి అని గత మార్చిలో హుకుం జారీ చేసినప్పటినుంచి బుద్దిగా ఇంట్లోనే పడి ఉంటున్నాను.

స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ కార్పొరేట్ తరహాలో తీర్చి దిద్ది వుంది. ఫ్రంట్ డెస్క్ లో ఓ అమ్మాయి కూర్చుని వచ్చిన వాళ్ళను కనుక్కుంటూ వుంది. నాది జీవన్ ప్రమాణ్ అని చెప్పగానే రెండో నెంబరు కౌంటరు చూపించింది. అప్పటికే అక్కడ నాలాంటి వాళ్ళు ఒకరిద్దరు వున్నారు. కరోనా కాలం అని గుర్తుకు వచ్చి కాసేపు ఎడంగానే నిల్చున్నాను. కౌంటర్ లోని వ్యక్తి తలెత్తి నా వైపు చూసి ఆధార్ జిరాక్స్ తెచ్చారా లేకపోతే అదిగో ఆ గదిలో జిరాక్స్ మిషిన్  వుంది వెళ్లి తెచ్చుకోండి అన్నాడు. ఈ మర్యాదకు ఆశ్చర్యపోతూనే అక్కడికి వెడితే నోట్ల కట్తల వెనుక  నగదు అధికారి ఒకరు తదేక  దీక్షగా డబ్బు కట్టలు లెక్కపెట్టే పనిలో వున్నాడు. అంత సొమ్ము వున్న చోట మసలడం క్షేమం కాదనుకుని గుమ్మం బయటే ఆగిపోయాను. ఈలోగా రెండో నెంబరు కౌంటరులో ఉద్యోగి ఓ నాలుగో తరగతి అధికారిని పిలిచి, నా పనిచేసిపెట్టమని గొంతెత్తి మరీ చెప్పాడు. కానీ అతగాడు మాత్రం తన తీరిక సమయంలోనే, అంటే తోటి సిబ్బందితో ముచ్చట్లు చెప్పడం, తేనీరు సేవించడం వంటి పనులు తీరిగ్గా కానిచ్చిన తరవాతనే నా పని చేసిపెట్టాడు. అయినా షరా మామూలుగా థాంక్స్ చెప్పి మళ్ళీ రెండో నెంబరు వద్దకు వచ్చాను. ఈసారి అతడు ఓ ఫారం ఇచ్చి పూర్తి చేసుకుని రమ్మన్నాడు. నామినీగా నా భార్య పుట్టిన తేదీని ధ్రువపత్రంతో పూరించాల్సిన ఖాళీని డాష్ డాష్ లతో నింపి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అని సెల్ఫ్ సర్టి ఫై చేసి ఇచ్చాను. అతడు నా వేలి ముద్రలు తీసుకుని LIFE CERTIFICATE నా చేతిలో పెట్టాడు.

వయసు మళ్ళిన పెన్షనర్లతో ఓపికగా డీల్ చేస్తున్న ఆ కుర్రాడి పేరు తెలుసుకుని, థాంక్స్ త్రినాద్ అని చెప్పి వచ్చేశాను.

 

ఏమైతేనేం , నా ఖాతా వున్న స్టేట్ బ్యాంక్  బ్రాంచ్ కోటీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ ఏడాది పని పూర్తి అయింది.”

ఇదంతా ఓపిగ్గా చదివిన త్రినాద్ అన్నాడు నాతొ మన్నింపుగా.

“సారీ అండీ మిమ్మల్ని బాగా వెయిట్ చేయించాను, మేనేజర్ దగ్గర పనిలో వుండి”

అంటూనే నా పని నిమిషాల్లో పూర్తి చేసి జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ నా చేతిలో పెట్టాడు.  

థాంక్స్ త్రినాద్! (హోప్ టు సీ యు నెక్స్ట్ ఇయర్)

బ్రాకెట్లోది పైకి అనలేదు.

(12-11-2021)