15, అక్టోబర్ 2021, శుక్రవారం

ఆర్కే ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు

ఆర్కే పోయాడు అనగానే ‘అయ్యో పాపం! అలానా’ అన్నవాళ్లు, ‘ఎన్కౌంటర్ లోనా!’ అని నొసలు విరిచిన వాళ్ళు వున్నారు.

మంచిదో చెడ్డదో ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవితాన్ని మలచుకున్న వ్యక్తుల విషయంలో సమాజం ప్రదర్శించే స్పందన విభిన్నంగా వుండడం కొత్తేమీ కాదు. అలాగే ఆర్కే అలియాస్ రామకృష్ణ కూడా మినహాయింపు కాదు. ఆర్కే అసలు పేరు అక్కరాజు హరగోపాల్.
‘ఆర్కే కనిపిస్తే కాల్చేయాలి’ అని పోలీసులకు ఉత్తర్వులు, ఆర్కేను పట్టించిన వారికి కోటి రూపాయలు రివార్డు వున్న ఈ ఆర్కే అనే మావొయిష్టు అగ్ర నేతను, పదిహేడేళ్ల క్రితం, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అదే పోలీసులు అడవుల నుంచి సగౌరవంగా హైదరాబాదుకు తీసుకురావడం, అప్పుడు రేడియో విలేకరిగా పనిచేసిన నాకు కూడా విభిన్నమైన అనుభవం.
మావొయిష్టులు అనే విప్లవకారులతో ప్రభుత్వం చర్చలకు సిద్ద్ధపడడం, అందుకు వారిని ఆహ్వానించడం ఆ కాలంలో ఓ పెద్ద విశేషమైన, సంచలనాత్మకమైన వార్త. అయుధాలు వదిలిపెట్టి నగరానికి రావాలి అనే ప్రభుత్వ షరతు కారణంగా మొదట్లో ఈ చర్చలు జరుగుతాయా లేదా అనే విషయంలో కొంత సంగ్దిగ్ధత ఏర్పడ్డా, చివరికి ఆ నీలి నీడలు తొలగిపోయి చర్చలు జరిగాయి. అవి ఫలించాయా లేదా అనేది వేరే విషయం. ఒక ముందడుగు పడింది అని భావించినవారే ఎక్కువ.
దట్టమైన అడవుల్లో దశాబ్దాలుగా సంచరిస్తూ, ఒక స్థావరానికీ మరో స్థావరానికీ నడుమ, పోలీసుల డేగ కళ్ళు కప్పి వేరే స్థావరంలో తాత్కాలికంగా తల దాచుకుంటూ జీవితాలు గడుపుతున్న మావోయిష్టు నాయకులకు, నాటి ప్రభుత్వం వారిని ప్రభుత్వ అతిధులుగా పరిగణిస్తూ సమస్త మర్యాదలు చేసింది. సంవత్సరాల తరబడి అడవుల్లో దొరికింది తింటూ కాలం గడిపిన వారికి ప్రభుత్వ అతిథి గృహంలో చేసిన ఏర్పాట్లు విస్మయం కలిగించాయి. ఒక దిన పత్రిక అయితే ఒక అడుగు ముందుకు వేసి అతిథి గృహంలో మావోయిష్టు నాయకులకు జరుగుతున్న మర్యాదలను ఉటంకిస్తూ ఏకంగా వారికి భోజనాల్లో వడ్డిస్తున్న వివిధ రకాల వంటకాల జాబితాను సవివరంగా ప్రచురించింది.
ఈ విషయం దృష్టికి రాగానే మావోయిష్టు నాయకుడు ఆర్కే వెంటనే స్పందించి తమకు ప్రత్యేక మర్యాదలు, భోజన ఏర్పాట్లు అవసరం లేదని మృదువుగా తిరస్కరించి ఆ విషయం అధికారులకు తెలియచేసారు.
మావోయిష్టులు అక్కడ బస చేస్తున్నారని తెలిసి సామాన్య జనం తమ కష్టనష్టాలను ఏకరువు పెట్టుకోవడానికి, వారికి మహజర్లు ఇవ్వడానికి క్యూలు కట్టారు.
తాము ఇక్కడికి వచ్చింది ప్రభుత్వంతో చర్చలు జరపడానికి మాత్రమే అని ఆర్కే వారితో స్పష్టంగా చెప్పేవారు. సమాజంలోని ఈ అసమానతలు తొలగించడానికే తాము ఆయుధాలు చేతబట్టామని, తమ లక్ష్యం సాధించుకోవడానికి ప్రభుత్వంతో పోరాడుతాము కానీ సిఫారసులు చేయడం తమ పని కాదనీ ఆయన స్పష్టం చేశారు.
బీ టెక్ చదివి, కుటుంబాన్ని ఉద్ధరిస్తాడు అనుకున్న కొడుకు సమాజాన్ని ఉద్ధరించడానికి తుపాకీ చేతబట్టి అడవులకు వెళ్ళడం ఉత్తమ ఉపాధ్యాయుడిగా మన్ననలు అందుకున్న ఆర్కే తండ్రికి ఎలాంటి మనస్తాపం కలిగించిందో ఎవరికీ తెలియదు. సంఘాన్ని బాగుచేయాలనే సదుద్దేశ్యంతో అడవి బాట పట్టిన ఇలాంటి అడవి వీరులు ఎందరో ఇలా తమ బతుకులను తెల్లవార్చుకోవడం విషాదం అనిపిస్తుంది. గమ్యం మంచిదైనా నడిచే మార్గం మంచిది కాదని అనేవాళ్ళు వుంటారు. నిజం కూడా. కానీ లక్ష్యశుద్ధి వుంటే మార్గం గురించి ఆలోచించాల్సిన పని లేదని ఆ వీరుల నమ్మకం.
అయితే, పోరాడితే పోయేది లేదు అనే ఒకే ఒక జవాబు తప్ప, ఇన్నేళ్ళుగా సాధించింది ఏమిటి అనే ప్రశ్నకు వారి నుంచి సరయిన సమాధానం లేదు,.
ముందే చెప్పినట్టు మంచి చెడులను తేల్చి చెప్పేది ఒక్క కాలం మాత్రమే.
ఆర్కే కుటుంబానికి నా సానుభూతి.



(15-10-2021)

14, అక్టోబర్ 2021, గురువారం

కులాల ప్రసక్తి అవసరమా – భండారు శ్రీనివాసరావు

 

మా బావగార్లలో ఇద్దరు శ్రీ అయితరాజు రామారావు (వల్లభి), శ్రీ కొలిపాక రామచంద్ర రావు (రెబ్బారం) స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఖమ్మం జిల్లాలో బ్రిటిష్ వ్యతిరేక ఆందోళనలు నడిపి పద్నాలుగు మాసాలకు పైగా కఠిన జైలు శిక్ష అనుభవించారు. మహాత్ముని బోధనలకు ప్రభావితులై తమ గ్రామాల్లో అంటరానితనాన్ని నిర్మూలించే విషయంలో గ్రామీణులను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించేవారు. వున్నవాళ్ళు, లేనివాళ్ళు అనే తేడా లేకుండా వూరివాళ్ళతో రోజంతా తిరిగొచ్చి మళ్ళీ ఇంట్లో అనుష్టానాలు చేసేవాళ్ళు. అన్ని కులాలవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో స్వేచ్చగా మసిలేవాళ్ళు. భోజనాలు చేసేవాళ్ళు. అందరూ వాళ్ళది కాంగ్రెస్ మడి’ అనే వాళ్ళు. పెద్ద బావగారు అయితరాజు రామారావు గారు వాళ్ళ వూరు వల్లభిలో ఏకంగా ఒక హరిజనుడిని రామాలయ పూజారిగా నియమించారు. ఆ రోజుల్లో అదొక సంచలన వార్త. మా నాన్నగారు మా వూరు కంభంపాడు కరణం. ఆయన దగ్గర పనిచేసే వెట్టి వాళ్ళు ఇంట్లోకి రాకుండా ఇంటి ముందు వాళ్ళకోసం ఒక చావిడి లాంటిది వుండేది. ఆయన మరణించిన తర్వాత కరణీకం బాధ్యతలు స్వీకరించిన మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వరరావు చేసిన మొట్టమొదటి పని ఆ చావిడిని నేలమట్టం చేసి వెట్టివారిని ఇంట్లో తిరిగేలా చేయడం. వూళ్ళో నిరసన వెల్లువెత్తినా మా అన్నయ్య లెక్కచేయలేదు. ఆయన చనిపోయిన రోజు ఊళ్ళోని దళితులందరూ ఆడామగా తేడా లేకుండా దహన సంస్కారాల్లో పాల్గొన్నారు.

మా బాబాయి కుమారుడు భండారు సత్యమూర్తి అన్నయ్య మా గ్రామానికి సుదీర్ఘ కాలం సర్పంచ్ గా పనిచేశారు. ఊళ్ళోని అన్ని కులాల వారు ఆయన్ని బాగా అభిమానించే వారు. ఆయన  గుండెపోటుకు గురై ఆకస్మికంగా మరణించినప్పుడు ఇది మరింత ప్రస్పుటంగా కనబడింది. మామూలుగా పాడె మీద కాకుండా బండి మీద పడుకోబెట్టి మనుషులు లాగుతూ ఊరేగింపుగా  దాన్ని శ్మశానానికి చేర్చారు. ఆయనకీ తల కొరివి పెట్టే హక్కు మాకూ వుందని బహిరంగంగా ప్రకటించి అలాగే చేశారు. ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ డిమాండ్ కాదనలేని పరిస్థితి. ఆరోజు మొత్తం గ్రామంలో ఎవరింట్లో పొయ్యి వెలిగించలేదు.

అంటరానివాడు, అని మీరు అనుకుంటున్నవాడు, అంటుకున్నాడో, ఇక ఆరని మంటే” అని మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాల రావు గారు ఏకంగా ఒక కవితలో రాశారు.

ఈ నేపధ్యం వుంది కాబట్టి వివిధ రాజకీయ పార్టీల్లో SC నాయకులను ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాను, మహాత్మా గాంధి వారిని ఉద్దేశించి పెట్టిన పేరు ‘హరిజన్’ అనే పేరు ఎందుకు మార్చారని. అసలా పదం వాడకూడదు, వారిని SC లుగా మాత్రమే వార్తల్లో పేర్కొనాలని రేడియోలో పనిచేసేటప్పుడు తెలుసుకుని ఆశ్చర్య పోయాను. నిజంగా ‘హరిజన్’ అనేది నిషేధిత పదమా! అందులో ఏదైనా మతానికి సంబంధించిన అన్వయం నాటి పాలకులకి స్పురించి అలా చేశారా అనే అనుమానం ఇప్పటికీ తీరలేదు. వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం ఇంతవరకు లభించలేదు.

నా పోస్టులను ఫాలో అయ్యేవారు ఒక విషయాన్ని గమనించే వుంటారనే నమ్మకంతో ఇది రాస్తున్నాను. సాధ్యమైనంతవరకు, ఎంతో అవసరమైన సందర్భాలలో తప్ప నేను కులాలు, మతాల ప్రసక్తి తీసుకురాను. ఫేస్ బుక్ అనేది అయినా ‘మనుషుల నడుమ మతాల గళ్ళు, కులాల ముళ్ళు లేని ప్రపంచంగా’ వుంటే బాగుటుందని, ఇందులో విహరించే కాస్త సమయంలో అయినా వాటికి అతీతంగా వుంటే ఇంకా ఎంతో హాయిగా ఉంటుందని భావించే అనేకమందిలో నేనొకడిని.

ఇది చరిత్ర రికార్డుకు అవసరమయ్యే అంశం కాబట్టి, కేవలం తెలుసుకోవాలనే జిజ్ఞాసతో నా సందేహం తీర్చాలని కోరుకుంటున్నాను.

 

13, అక్టోబర్ 2021, బుధవారం

డ్రైవర్ పక్క ఫ్రంటు సీటు - భండారు శ్రీనివాసరావు


ఈ కాలంలో సీటుకోసం వెంపర్లాడని వెర్రివాళ్ళెవ్వరుంటారు?
రాజకీయాలు తీసుకుంటే సర్పంచ్ సీటుతో ప్రారంభించి సీఎం సీటు వరకు ఎగబాకాలనుకుంటారు.
సినిమాల్లో అయితే ఎగస్ట్రా పాత్రనుంచి మొదలుపెట్టి, సెట్లో వెనుక ‘హీరో’ అనో ‘హీరోయిన్’ అనో రాసున్న సీటు సొంతం చేసుకోవాలని కలలు కంటారు.
మహాసభల్లో స్టేజీ మీద మొదటి వరస సీటు దక్కించుకోవాలనుకునేవారు కోకొల్లలు.
ప్రేక్షకుల్లో కూర్చోవాల్సిన పరిస్తితే వస్తే అక్కడా మళ్ళీ ముందు వరస కోసం వెతుకులాటే!
చిన్న చిన్న సాంస్కృతిక సమావేశాలనుంచి పెద్ద పెద్ద సభలవరకూ ఈ సీట్ల గోల తప్పదు.
కెమెరా యాంగిల్ నుంచి వీ.వీ.ఐ.పీ. పక్క సీటు కోసం ఆత్రపడేవాళ్ళు తక్కువేమీ కాదు.
యాభై అరవై ఏళ్ళక్రితం పల్లెటూళ్ళకు వచ్చే బస్సుల్లో డ్రైవర్ పక్కన వుండే ఫ్రంటు సీటు కోసం వూళ్ళో మోతుబరులు పోటీపడేవారు.
ఎనభయ్యవ దశకం మొదట్లో ముఖ్యమంత్రి అయిన శ్రీ టంగుటూరి అంజయ్య అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కార్లో డ్రైవర్ పక్కన ముందు సీట్లో ఆసీనులయ్యేవారు. ‘అమ్మ’ (శ్రీమతి ఇందిరాగాంధి) కూడా ఫ్రంటు సీటే సుమా!’ అని అమాయకంగా అనేవారు. ఆవిడ కూడా ప్రధాని హోదాలో అంబాసిడర్ కార్లో ముందు సీట్లోనే కూర్చునేవారు. అంజయ్య గారు ముందు సీటు ఎంపిక చేసుకోవడంలో నాకు మరో కోణం కనిపించేది. ప్రజల మనిషి అయిన అంజయ్య గారికి జనం తాకిడి ఎక్కువ. ‘లైఫ్ బాయ్ ఎక్కడవుంటే ఆరోగ్యం అక్కడ వుంటుంది’ అనే వాణిజ్య ప్రకటన తరహాలో అంజయ్య గారు ఎక్కడ వుంటే అక్కడ జనమే జనం. బాత్రూం, బెడ్ రూముల్లో కూడా ఆయనకు ఈ తాకిడి తప్పేది కాదని చెప్పుకునేవారు. సెక్యూరిటీని కూడా తోసుకువచ్చి కారెక్కాలని చూసే అనుయాయుల వల్ల కలిగే తొడతొక్కిడిని తప్పించుకోవడానికి ఆయన హాయిగా ముందు సీటుకు మారిపోయారని అప్పట్లో ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా పనిచేసిన బాలాజీ చెబుతుండేవారు.
ఒకప్పుడు కారులో వెనుక సీటులో కూర్చునేవారే ఆ కారుకు యజమాని అని జనం భావించేవారు. ఇప్పుడా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. మంత్రులు, ముఖ్యమంత్రులు, శాసన సభ్యులు ఒకరేమిటి అంతా ఫ్రంటు సీటుకు అతుక్కుపోతున్నారు. టీవీ కెమెరా యాంగిళ్లకి కూడా ఈ సీటే అనువుగా వుండడం ఒక కారణం అయితే దారివెంట ప్రజలకు చేయి ఊపుతూ అభివాదం చెయ్యడానికీ, రెండు వేళ్ళు విజయసూచిక మాదిరిగా ప్రదర్శించడానికీ ఫ్రంటు సీటే బెటరన్న నమ్మకం కుదరడం మరో కారణం.

11, అక్టోబర్ 2021, సోమవారం

గుడ్డుగారికో రోజు - భండారు శ్రీనివాసరావు

 ఏ దేశమేగినా, ఎందుకాలిడినా పాలూ, నీళ్ళతో పాటు తప్పకుండా దొరికేది మరోటివుంది. అదే కోడి గుడ్డు.

అక్టోబర్ నెలలో రెండో శుక్రవారం అంతర్జాతీయ కోడిగుడ్డు దినం అంటున్నారు.
1975 వరకు ఎగ్గూ పెగ్గూ రెండూ మా ఇంటావంటా లేవు. వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా రెండోది ముందుగా వచ్చి చాలా కుటుంబాలలో తిష్ట వేసింది. మొదట్లో నిరసన ధ్వనులు వినపడ్డా మొత్తం మీద దానికి పసుపు నీళ్ళు చల్లి ఇళ్ళల్లోకి రానిచ్చారు. దాంతో పాటే మొదటిది కూడా తగుదునమ్మా అని గృహప్రవేశం చేసి ఓటరు కార్డు, ఆధార్ కార్డు లేకుండానే ఇంట్లో సభ్యురాలు అయిపోయింది. మంచి ఎండాకాలంలో కూడా చలి దుప్పటి కప్పుకుని ఫ్రిజ్ లో పడుకునేది ఆ కోడిగుడ్డే. మేము తిన్నా తినకపోయినా, ఇంటికి వచ్చిన నాన్ వెజ్ ఫ్రెండ్స్ ఎవరికయినా అవసరం పడుతుందో ఏమో అని మా ఆవిడ ముందు జాగ్రత్తగా వాటిని కొని ఫ్రిజ్ లో దాచి వుంచేది.
ఎప్పుడో మా చిన్నప్పుడు మా చుట్టాల అమ్మాయికి టైఫాయిడ్ వచ్చి నిమ్మలించిన తర్వాత త్వరగా కోలుకోవడానికి డాక్టర్ ఉడక పెట్టిన కోడి గుడ్డు రోజూ ఒకటి తినమన్నారు. అసలే నిప్పులు కడిగే ఆచారం. గుడ్డు తినమనగానే ఇంట్లో వాళ్లకి నిలువు గుడ్లు పడడం చూసిన డాక్టరు గారు, పేషెంటు ముక్కూ, కళ్ళూ మూసి, నోరు తెరిపించి పటేల్ మని గుడ్డు పగల గొట్టి తటాలున నోట్లో పోసి మింగించాడు. అటువంటి భీకర భీభత్స దృశ్యాలు చూసిన తరువాతే వ్యాధి కంటే చికిత్స ప్రమాదకరం అనే సామెత పుట్టి వుండాలి.
అసలు కోడి గుడ్డు అనగానే గుర్తుకు రావాల్సిన వ్యక్తి ఒకరు వున్నారు. ఆయనే బీ.వీ. రావు (బి.వాసుదేవరావు, ఇప్పుడు లేరనుకోండి). తెలంగాణాకు చెందిన ఈ పెద్దమనిషి వెంకటేశ్వరా హేచరీస్ అనే పరిశ్రమను స్థాపించి కోడిగుడ్డుకు ఎనలేని ప్రాముఖ్యాన్ని కట్టబెట్టారు. మేము మాస్కోలో ఉన్నరోజుల్లో నాటి ప్రభుత్వ అతిథి హోదాలో ఆయన రష్యా వచ్చారు. ఓరోజు మా ఇంటికి వచ్చి మా ఆవిడ చేతి భోజనం చేసి వెళ్ళారు. తర్వాత మేము ఇండియాకు తిరిగి వచ్చిన తరవాత కూడా గుర్తు పెట్టుకుని మా పిల్లలు ఇద్దర్నీ పూనాలో వున్న తమ స్టడ్ ఫాం కు తీసుకువెళ్ళారు. అదో సంగతి.
ఏది ఏమైనా పిడికెట్లో నాలుగోవంతు లేని కోడిగుడ్డుకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చి, దాని పేరిట ఒక దినం ఏర్పాటు కావడం, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని గుడ్డు ప్రాముఖ్యతను ప్రస్తుతిస్తూ రేడియో ప్రసంగాలు, టీవీ కార్యక్రమాలు జరగడం కోడిగుడ్డు చేసుకున్న పూర్వజన్మ సుకృతం.
గుడ్డుగా వున్నప్పుడూ, గుడ్డు నుంచి కోడిగా మారిన కొత్త అవతారంలో కూడా మానవులకు ఆహారంగా సేవలందిస్తూ త్యాగంలో బలి, శిబి చక్రవర్తులను మించిన ఆ త్యాగశీలికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం, ఆమ్లెట్ గా వేసుకుని నోరారా తినడం తప్ప అంటారు కొందరు ఎగ్గేరియన్లు.



NOTE: Courtesy Image Owner

9, అక్టోబర్ 2021, శనివారం

వాడుకోలేని అధికారం ఎందుకు? – భండారు శ్రీనివాసరావు

 

కొన్ని సంవత్సరాలు వెనక్కి వెడితే...

సాక్షి టీవీలో అమర్ ఫోర్త్ ఎస్టేట్ ప్రోగ్రాం. పక్కన ఎక్జిక్యూటివ్ ఎడిటర్ రామచంద్ర మూర్తి గారు కూడా వున్నారు, నంద్యాల ఎన్నికల తరువాత అనుకుంటాను.

అధికారం ఉన్నదే దుర్వినియోగం చేయడానికి, లేకపోతే ఆ అధికారం ఎందుకు?” అన్నాను ఒక ప్రశ్నకు జవాబుగా.

అధికార దుర్వినియోగాన్ని నేను సమర్దిస్తున్నానా అనే భావం వారి మొహాల్లో కనిపించి నేను కొంత వివరణ ఇవాల్సి వచ్చింది.

అధికారాన్ని వినియోగించడం, దుర్వినియోగం చేయడం అనే విషయంలో చాలామందికి చాలా అభిప్రాయాలువుంటాయి.

పూర్వం నాకు తెలిసిన ఒక ఐ.ఏ.ఎస్. అధికారి వుండేవారు. ఇప్పుడు లేరు. జిల్లా కలెక్టర్ గా పనిచేసే రోజుల నుంచి తెలుసు. చాలా నిక్కచ్చి మనిషి. విజయ నగర్ కాలనీలో ఒక టూ ఆర్టీ ఇంట్లో కాపురం. ఆయన భార్య రెండు సిటీ బస్సులు మారి నారాయణ గూడాలోని మా బంధువుల ఆసుపత్రికి వచ్చి వెడుతుండేది. ఆయన ఆఫీసు కారు ఆయన ఆఫీసు వరకే. అలాంటి మనిషి ఒక మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో విలేకరుల సమావేశాలు పెడుతుండేవారు. నేను మామూలుగా అందరు విలేకరులతో వెళ్లి కూర్చుంటే, ఆయన నన్ను తన పక్కన వచ్చి కూర్చోమనే వారు. అలా ఒక విలేకరిని విడిగా మర్యాద చేయడం మర్యాద కాదని ఆయనతో ఎన్నో సార్లు మర్యాదగానే చెప్పేవాడిని. కానీ పిలిచిన ప్రతిసారీ అదే వరస. చివరికి నేను పోవడం మానేసి, వాళ్ళ పీఆర్వో తో మాట్లాడి ప్రెస్ నోట్ తెప్పించుకునే వాడిని. ఇదెందుకు చెబుతున్నాను అంటే అధికార దుర్వినియోగం అంటే తెలియని ఆ అధికారి కూడా తన తోటి సిబ్బంది దృష్టిలో మాట పడే పరిస్తితి తెచ్చుకున్నాడు. ‘ఈయన సరే లెండి, ఒక రూలూ లేదు చట్టుబండలు లేదు. తనకెంత తోస్తే అంతే!’ అనేవాళ్ళు వాళ్ళు ఆయన పరోక్షంలో.

ఒకప్పటి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు ఆయన శాఖలో అధికార దుర్వినియోగానికి అడ్డు కట్ట వేసే ప్రయత్నం మొదలు పెట్టారు. ఉన్నతాధికారులు ఎవరి పని వాళ్ళు చూసుకోవాలని, పై అధికారులు పర్యటనలకు వచ్చినప్పుడు విమానాశ్రయాలకు వెళ్లి రిసీవ్ చేసుకునే పద్దతికి స్వస్తి చెప్పాలని, ప్రత్యేక బోగీల్లో (సెలూన్ అంటారు, ఒక స్టార్ హోటల్ గదిలా సర్వ సౌకర్యాలు వుంటాయి, వెనక మల్లికార్జున్ గారు రైల్వేశాఖ డిప్యూటీ మంత్రిగా వున్నప్పుడు ఈ వైభోగం అనుభవించే అవకాశం హైదరాబాదులోని మా బోటి విలేకరులకు తరచూ కలుగుతుండేది) ప్రయాణాలు మానుకోవాలని ఇలా అనేక ఆదేశాలు జారీ చేసారు. ఈ వార్త పత్రికల్లో వచ్చినప్పుడు సంతోషం అనిపించింది. వార్త అయితే వచ్చింది కానీ, అమలు జరిగిన వార్త నా కంటికి కానరాలేదు. పోనీండి.

పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మంత్రులు కేంద్రంలో వున్నప్పుడు వారానికి రెండు మార్లు, ముఖ్యంగా శనాదివారాల్లో హైదరాబాదు వచ్చి పోయేవాళ్ళు. ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం అనే తేడాలేదు. శుక్రవారం సాయంత్రం కల్లా వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన ఓ వంద వాహనాలు ఎయిర్ పోర్టుకు చేరుకునేవి. వాటిల్లో కనీసం ఓ పాతిక అయినా అద్దెకు తీసుకున్న ఖరీదైన వాహనాలు. అవి వచ్చే అతిధులకు, వారి పరివారం కోసం. వాటికి వారం వారం బిల్లులు కట్టడం తప్ప అవి ఎవరు వాడారు, ఎక్కడెక్కడ తిరిగారు అని ఆరా తీసే నాధుడు ఉండేవాడు కాదు. వచ్చే మంత్రిగారి శాఖ స్థాయిని బట్టి ఏర్పాట్ల స్థాయి కూడా పెరుగుతుండేది. బస చేయడానికి ప్రభుత్వ అతిధి గృహాలు ఉన్నప్పటికీ ఎందుకయినా మంచిదని అయిదు నక్షత్రాల హోటళ్ళు కూడా బుక్ చేసేవాళ్ళు. యెంత చెట్టుకు అంత గాలి అన్నట్టు కాస్త గిట్టుబాటు వుండే శాఖల వాళ్ళు విరగబడి ఖర్చులు పెట్టేవాళ్ళు.

నేను హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేస్తూ  చిక్కడపల్లిలో అద్దెకు   ఉండేవాడిని. విలేకరి ఉద్యోగం కావడం వల్ల ఇంట్లో ఫోను అవసరం జాస్తి. అది మూగనోము పట్టిన సందర్భాల్లో ఫోను అవసరం వచ్చినప్పుడు దగ్గరలో వున్న ఒక ప్రభుత్వ అధికారి ఇంటికి వెళ్ళేవాడిని. మంచి నిజాయితీపరుడు అన్న పేరు ఆయనకు  ఇంటాబయటా బాగా పేరుకుపోయివుంది. ఫోను కోసం వెళ్ళినప్పుడు అయన నన్ను కూర్చోబెట్టి పిచ్చాపాటీ మాట్లాడుతుండేవాడు. ఆయన భార్య బొంబాయిలో ఉంటున్న వాళ్ళ అమ్మాయితో ఎస్.టీ.డీ. లో మాట్లాడుతుండేది. ఆ సంభాషణ తెగే దాకా నాతో ఆయన ముచ్చట్లు కూడా కొనసాగేవి. అలా ఒకరోజు ఆయన నాతొ ముచ్చటిస్తూ, ఆ రోజుల్లో నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ బంధుమిత్రులతో కలిసి లక్షద్వీప్ యాత్ర గురించి ప్రస్తావించారు.  రాజీవ్ విహార యాత్ర ఆయనకు సుతరామూ నచ్చినట్టులేదు. 'ఎంత ప్రధానమంత్రి అయితే మాత్రం అలా ప్రభుత్వ ఖర్చుతో, స్నేహితులతో కలిసి  ఇలా విలాస యాత్రలు చేయడం ఏం సబబుఅనేది ఆయన ఆవేదన. కానీ అదేసమయంలో ఆయన భార్య అరగంట నుంచి  ఇంట్లో ప్రభుత్వం సమకూర్చిన ఫోనులో మాట్లడుతున్నదేమిటంటే, పోయిన  పండక్కి తాను కొనుక్కున్న  చీరెల రంగులూ, వాటి  అంచులు  గురించిన వివరాలు, వాళ్ళమ్మాయి కొనుక్కున్న కొత్త చీరెల గురించిన ఆరాలు. తల్లీకూతుళ్ళ ముచ్చట్లు ఇలా  అప్రతిహతంగా టీవీ సీరియల్ మాదిరిగా సాగిపోతూ ఉండగానే,  ఆఫీసరు గారి డ్రైవర్, ప్రభుత్వ వాహనంలో ఆయన పిల్లల్ని తీసుకువెళ్ళి స్కూల్లో దింపి వచ్చాడు. లోపల అడుగుపెట్టాడో లేదో అయన నాతో మాటలు మానేసి,  సుల్తాన్ బజారో, ఆబిడ్సో, గుర్తు లేదు,  కారేసుకు వెళ్లి పలానా దుకాణంలో మాత్రమే దొరికే ఓ వక్కపొడి డబ్బా కొనుక్కు రమ్మన్నాడు. డబ్బులు ఇచ్చిందీ లేనిదీ నేను చూడలేదు. ఆ డ్రైవర్ వెళ్ళగానే మళ్ళీ అయన రాజీవ్ గాంధీ విషయం ఎత్తుకున్నాడు. 'ఇలా ప్రభుత్వధనం ఖర్చుచేయడానికి పద్దూ పాడూ అక్కరలేదా, హద్దూ అదుపూ ఏమీ లేదా ' అన్నది ఆయన ప్రశ్న. ఆఫీసరు గారి భార్య  ఫోను సంభాషణ ఇంతట్లో తెమిలే అవకాశం లేదని గ్రహించి నేనే ఏదో సాకుచెప్పి బయటపడ్డాను.

వెనక అంటే ఓ నాలుగు దశాబ్దాల క్రితం ఒక వారపత్రికలో వచ్చిన కార్టూన్ నాకు బాగా గుర్తుండిపోయింది.

ఒక సినిమా హాలుకు జిల్లా కలక్టర్ గారు భార్యను తీసుకుని ప్రభుత్వ జీపులో వస్తాడు. (ఆ రోజుల్లో కలెక్టర్లకు కూడా జీపులే). జిల్లా వైద్యాధికారి అంబులెన్సులో వస్తాడు. పురపాలక శాఖ అధికారి మీ వీధులను మురికి చేయకుడిఅని రాసివున్న చెత్త లారీలో వస్తాడు. అగ్నిమాపక అధికారి ఏకంగా గంటలు మోగించుకుంటూ అగ్నిమాపక వాహనంలో వచ్చేస్తాడు.

కార్టూన్ లో కాస్త ఘాటు ఎక్కువ ఉండవచ్చు. కొంత అతిశయోక్తి కూడా ఉండవచ్చు. కానీ అధికార దుర్వినియోగానికి ఓ మేరకు అయినా అది అద్దం పడుతోంది. 

తోక టపా :

కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు దేశ వ్యాప్తంగా కార్యాలయాలు వుంటాయి. ఒకానొక కీలక శాఖలో పనిచేసే ఒకానొక కీలక ఉన్నతాధికారి అమ్మాయికి  వివాహం నిశ్చయం అయింది. దేశంలోని  నలుమూలల నుంచి వందిమాగధులు ఈ శుభ కార్యానికి హాజరు కావాల్సిన సందర్భమాయే! వెళ్లక తప్పని పరిస్థితి.

అంతే! ఆ పెళ్లి ముహూర్తానికి ఒక రోజు ముందు దేశ రాజధానిలో జాతీయ స్థాయిలో ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేస్తూ, ఒక ఉత్తర్వు ఆఘమేఘాల మీద జారీ అయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని  అన్ని చోట్ల నుంచి అధికారులు విమానాల్లో రాజధానికి తరలి వెళ్లి, వారి వారి విభవానికి తగిన  నక్షత్రాల హోటళ్ళలో ప్రభుత్వ ఖర్చుతో బసచేసి, పెళ్ళికి హాజరై వధూవరులను ఆశీర్వదించి, తమ అవధికి మించిన చదివింపులు సమర్పించుకుని,  తమ పై అధికారి మన్ననలను చూరగొన్నవారై, తిరిగి స్వస్థానములకు చేరుకొని సుఖంబుననుండిరి.

ఓం! తత్ సత్! మంగళం మహత్!

 

NOTE: Cartoon Courtesy Cartoonist/Owner





8, అక్టోబర్ 2021, శుక్రవారం

మా బామ్మ మంచం నా కంచం – భండారు శ్రీనివాసరావు

 

అరవై ఏళ్ళ కిందటి జ్ఞాపకం. కంభంపాడు పెద్దబామ్మ అంటే రుక్మిణమ్మ బామ్మకు అప్పుడు అరవై ఏళ్ళు పైమాటే.  మొత్తం కుటుంబానికి ఆవిడ విక్టోరియా మహారాణి. నాన్న నాకు ఎరుకలేని చిన్నవయస్సులోనే పోయారు. ఆయనకు ఏడుగురు ఆడపిల్లలు. నలుగురు మగపిల్లలం. అయిదుగురు అక్కయ్యలకు ఆయన హయాములోనే పెళ్ళిళ్ళు అయ్యాయి. మగపిల్లలం చాలా చిన్నవాళ్ళం. మగ దక్షత లేని కుటుంబ భారాన్ని ఆవిడ అప్పటినుంచీ భుజాలకు ఎత్తుకుంది. లెక్కలు చెప్పుకోవడానికి పెద్ద ఆస్తి. కానీ లెక్క తీస్తే అయివేజు అంతంత మాత్రం.

ఇదంతా ఎందుకంటే మా ఇంటికి మా బామ్మగారే మకుటం లేని రాణి అని చెప్పడానికి. ఇంట్లో ఆవిడకూ, మా అమ్మగారికీ వెండి భోజనం పళ్ళేలు, వాటి మధ్యలో ఒక బంగారం పువ్వు. పక్కనే వెండి గ్లాసులు. ఇంకా వెండి సామాను వుండేది కానీ అవన్నీ ఇనప్పెట్టె లోనే. వాటి తాళం చెవులు మా బామ్మగారి దిండు కిందా.

ఇంట్లో మిగిలిన వాళ్ళ కంచాలు అన్నీ రాతెండివే. బయటనుంచి వచ్చిన వాళ్ళకోసం  అమ్మ దొడ్లో ఉన్న బాదం చెట్టు ఆకులతో విస్తళ్ళు కుట్టేది.

కంచమే కాదు, మా బామ్మ మంచం కూడా సపరేటే. ఇంట్లో చాలా మంచాలు, నవారువీ, నులకవీ ఉండేవి. ఆమె మంచం మాత్రం ఆమెకే ప్రత్యేకం. మిగిలిన మంచాల మీద ప్రోటోకాల్ ప్రకారం దిండ్లూ, దుప్పట్లూ మారుతుండేవి. అంటే బావగార్లు కానీ అతిధులు కానీ వస్తే వాళ్లకు నవారు మంచాలు. మిగిలిన వాళ్లకి నులక మంచాలు. ప్రతి రోజూ ఉదయం పూట ఈ మంచాలకు సళ్ళు లాగి బిగించే కార్యక్రమం ఒకటి నడుస్తుండేది. దాన్ని ప్రేమక్కయ్య పర్యవేక్షించేది. లాంతర్లు, బుడ్డి దీపాలను ముగ్గుతో తుడిచి శుభ్రం చేసి, కిరసనాయిల్ పోసి సిద్ధం చేసే పని భారతక్కయ్య మీద పడేది. అప్పటికి వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు కాలేదు.







కంచాలతో కదా మొదలు పెట్టింది. అప్పుడప్పుడే స్టెయిన్ లెస్ స్టీల్ కంచాలు మార్కెట్లోకి వస్తున్న రోజులు అనుకుంటాను. అప్పటికి అవి గృహ ప్రవేశం చేయలేదు. శారదక్కయ్య ఓసారి పండక్కి వస్తూ రెండు స్టీలు భోజనం పళ్ళేలు తెచ్చి నాకు ఒకటీ, వెంకటేశ్వర రావుకూ (వెంకప్ప) ఒకటీ ఇచ్చింది. అప్పట్లో వాటి ఖరీదు రెండూ కలిపి పదిహేను రూపాయలు. అంటే కరణీకం చేస్తున్నప్పుడు నాన్న మూడు నెలల జీతం అన్న మాట. ఇహ అప్పుడు చూడాలి మా మోహంలో సంతోషం. ఏనుగు ఎలా వుంటుందో తెలవదు కానీ అదెక్కినంత ఆనందం.

శారదక్కయ్య ఇచ్చిన ఆ కంచం మీద నాకు మోహం ఎంతగా పెరిగిపోయిందంటే అది నాకే సొంతం అనుకునేవాడిని. ఆ తర్వాత ముప్పయ్ ఏళ్ళకు పైగా అది నాతోనే వుంది. 1987లో మాస్కో వెళ్ళేటప్పుడు లగేజి సమస్య కారణంగా ఆ కంచంతో నా రుణానుబంధం తెగిపోయింది.

తిరిగొచ్చిన తర్వాత లోకమే మారిపోయింది. డిన్నర్ ప్లేట్లు, డిన్నర్ సెట్లు వచ్చిపడిన తర్వాత, చాలా కొద్ది మంది ఇళ్ళల్లో తప్ప, ఇప్పుడు ఈ విడి కంచాల గోల లేదు.

మళ్ళీ ముప్పయ్యారేళ్ళ తర్వాత మా ఆవిడకు కలిగిన వింత కోరిక పుణ్యమా అని నాకు తిరిగి సొంత కంచం వైభోగం వచ్చిపడింది. ఓ దసరా పండుగ సందర్భంగా చేసిన కొనుగోళ్లలో భాగంగా నాకు ఒక స్టీలు కంచం కొనుక్కొచ్చింది.

దానికి ప్రారంభోత్సవం చేయాలని సంకల్పం. దేవుడు మరోలా అనుకున్నాడు. కంచం మధ్యలో ఆ స్టీలు కంపెనీ వాడు ఒక పెద్ద స్టిక్కరు అతికించి కూర్చున్నాడు. దాన్ని తీయాలని మా పనిమనిషి గోటితో ప్రయత్నించింది. ఆ స్టిక్కరు ఊడిరాకపోగా అది వికటించి మరింత వికార స్వరూపం సంతరించుకుంది. ఇరుగింటి పొరుగింటి చిన్న ఆడ లేడీస్ (మరి మేము మాత్రమే ఈ అపార్ట్మెంట్లో అందరికీ ఆంటీలం,అంకుళ్ళం!) మరీ అంత చిన్నవాళ్ళేమీ కాదులెండి, పిల్లలకు పిల్లలు ఉన్నవాళ్ళే, కానీ ఆంటీ అంటే మాత్రం ఎంతో నొచ్చుకుంటారు, మధ్యలో కలగచేసుకుని, నీళ్ళు సలసలా మరగబెట్టి, ఆ వేడి వేడి నీళ్ళు గుమ్మరించి ఆ కంచానికి అభ్యంగన స్నానం, సంప్రోక్షణ వగైరా సలక్షణంగా పూర్తి చేశారు కానీ, ఆ స్టిక్కరు మాత్రం పోలింగు బూతులో వేలికి అసహ్యంగా అంటించిన ‘గుర్తు’ మాదిరిగా అలాగే వుండిపోయింది.

ఓ డౌటనుమానం కూడా మనసులోనే మిగిలి పోయింది.

అవునూ! ఈ స్టెయిన్ లెస్ స్టీల్ కంపెనీల వాళ్లు తమ కంపెనీ స్టిక్కరు, కంచాలకు వెనుక భాగంలో అరచేతి మందాన అంటిస్తే వాళ్ళ సొమ్మేమయినా పోతుందా!’

ఇప్పుడివన్నీ మరిచిపోలేని జ్ఞాపకాలు. కంచం వుంది. ముచ్చట పడి కొన్న మనిషే లేదు.

7, అక్టోబర్ 2021, గురువారం

నండూరి రామమోహనరావు గారు పెట్టిన మెత్తటి తొడపాశం

 జర్నలిజం తొలి రోజుల్లో, అంటే 1970 ప్రాంతాల్లో  నండూరి రామమోహన రావు గారు నన్ను సాన పట్టారు. ఆయన రూటే సపరేటు. చెప్పాల్సింది సూటిగా, సుతిమెత్తగా చెబుతారు. దాంతో ఆ పాఠం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ పాఠాల్లో ఇదొకటి.

బంగ్లాదేశ్ అవతరణ సమయంలో నాటి బంగ్లా నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ పేరు పలుసార్లు వార్తల్లో చోటు చేసుకునేది.

అప్పటికి ఇంకా తెలుగు పత్రికల్లో శ్రీ అనే గౌరవ వాచకం వాడుతుండేవారు. (ఇప్పటి నాయకులు అలాంటి గౌరవానికి తగరని అనుకున్నారేమో తెలియదు, శ్రీ, గారు, మిస్టర్ అనే పదాలకు ఇప్పుడు స్వస్తి చెప్పారు)

ఈ నేపధ్యంలో నేను ఒకసారి వార్తను తర్జూమా చేసే పనిలో ఓ తప్పు తొక్కాను. “శ్రీ షేక్ ముజిబుర్” అని రాశాను. ఆ అనువాదం నండూరి వారి దృష్టికి వెళ్ళింది. ఆయన వెంటనే ఒక చీటీ పంపారు. ఆ రోజుల్లో నండూరి వారి నుంచి చీటీ వచ్చింది అంటే ఓ మెమోతో సమానం. అందులో ఇలా వుంది

Sheikh itself is honorific.  Do not use sri before it.

Don’t say Mujibur when not followed by Rehman. Mujibur is enough. – NR