ఆర్కే పోయాడు అనగానే ‘అయ్యో పాపం! అలానా’ అన్నవాళ్లు, ‘ఎన్కౌంటర్ లోనా!’ అని నొసలు విరిచిన వాళ్ళు వున్నారు.
15, అక్టోబర్ 2021, శుక్రవారం
ఆర్కే ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు
14, అక్టోబర్ 2021, గురువారం
కులాల ప్రసక్తి అవసరమా – భండారు శ్రీనివాసరావు
మా బావగార్లలో
ఇద్దరు శ్రీ అయితరాజు రామారావు (వల్లభి), శ్రీ కొలిపాక
రామచంద్ర రావు (రెబ్బారం) స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఖమ్మం జిల్లాలో బ్రిటిష్
వ్యతిరేక ఆందోళనలు నడిపి పద్నాలుగు మాసాలకు పైగా కఠిన జైలు శిక్ష
అనుభవించారు. మహాత్ముని బోధనలకు ప్రభావితులై తమ గ్రామాల్లో అంటరానితనాన్ని
నిర్మూలించే విషయంలో గ్రామీణులను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించేవారు.
వున్నవాళ్ళు, లేనివాళ్ళు అనే తేడా లేకుండా వూరివాళ్ళతో రోజంతా తిరిగొచ్చి మళ్ళీ ఇంట్లో
అనుష్టానాలు చేసేవాళ్ళు. అన్ని కులాలవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో స్వేచ్చగా మసిలేవాళ్ళు.
భోజనాలు చేసేవాళ్ళు. అందరూ వాళ్ళది కాంగ్రెస్ మడి’ అనే వాళ్ళు. పెద్ద బావగారు
అయితరాజు రామారావు గారు వాళ్ళ వూరు
వల్లభిలో ఏకంగా ఒక హరిజనుడిని రామాలయ పూజారిగా నియమించారు. ఆ రోజుల్లో అదొక సంచలన
వార్త. మా నాన్నగారు మా వూరు కంభంపాడు కరణం. ఆయన దగ్గర
పనిచేసే వెట్టి వాళ్ళు ఇంట్లోకి రాకుండా ఇంటి ముందు వాళ్ళకోసం ఒక చావిడి లాంటిది
వుండేది. ఆయన మరణించిన తర్వాత కరణీకం బాధ్యతలు స్వీకరించిన మా మూడో అన్నయ్య భండారు
వెంకటేశ్వరరావు చేసిన మొట్టమొదటి పని ఆ చావిడిని నేలమట్టం చేసి వెట్టివారిని
ఇంట్లో తిరిగేలా చేయడం. వూళ్ళో నిరసన వెల్లువెత్తినా మా అన్నయ్య లెక్కచేయలేదు. ఆయన
చనిపోయిన రోజు ఊళ్ళోని దళితులందరూ ఆడామగా తేడా
లేకుండా దహన సంస్కారాల్లో పాల్గొన్నారు.
మా బాబాయి కుమారుడు భండారు సత్యమూర్తి అన్నయ్య మా గ్రామానికి సుదీర్ఘ కాలం
సర్పంచ్ గా పనిచేశారు. ఊళ్ళోని అన్ని కులాల వారు ఆయన్ని బాగా అభిమానించే వారు. ఆయన
గుండెపోటుకు గురై ఆకస్మికంగా
మరణించినప్పుడు ఇది మరింత ప్రస్పుటంగా కనబడింది. మామూలుగా పాడె మీద కాకుండా బండి
మీద పడుకోబెట్టి మనుషులు లాగుతూ ఊరేగింపుగా దాన్ని శ్మశానానికి చేర్చారు. ఆయనకీ తల కొరివి
పెట్టే హక్కు మాకూ వుందని బహిరంగంగా ప్రకటించి అలాగే చేశారు. ఇంట్లో వాళ్ళు కూడా
వాళ్ళ డిమాండ్ కాదనలేని పరిస్థితి. ఆరోజు మొత్తం గ్రామంలో ఎవరింట్లో పొయ్యి
వెలిగించలేదు.
“అంటరానివాడు, అని మీరు
అనుకుంటున్నవాడు, అంటుకున్నాడో, ఇక ఆరని మంటే” అని మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాల రావు గారు
ఏకంగా ఒక కవితలో రాశారు.
ఈ నేపధ్యం వుంది
కాబట్టి వివిధ రాజకీయ పార్టీల్లో SC నాయకులను ఒక
ప్రశ్న అడుగుతూ వచ్చాను, మహాత్మా గాంధి వారిని ఉద్దేశించి పెట్టిన పేరు ‘హరిజన్’ అనే పేరు ఎందుకు
మార్చారని. అసలా పదం వాడకూడదు, వారిని SC లుగా మాత్రమే
వార్తల్లో పేర్కొనాలని రేడియోలో పనిచేసేటప్పుడు తెలుసుకుని ఆశ్చర్య పోయాను. నిజంగా
‘హరిజన్’ అనేది నిషేధిత పదమా! అందులో ఏదైనా మతానికి సంబంధించిన అన్వయం నాటి
పాలకులకి స్పురించి అలా చేశారా అనే అనుమానం ఇప్పటికీ తీరలేదు. వారి నుంచి
సంతృప్తికరమైన సమాధానం ఇంతవరకు లభించలేదు.
నా పోస్టులను ఫాలో
అయ్యేవారు ఒక విషయాన్ని గమనించే వుంటారనే నమ్మకంతో ఇది రాస్తున్నాను.
సాధ్యమైనంతవరకు, ఎంతో అవసరమైన సందర్భాలలో తప్ప నేను కులాలు, మతాల ప్రసక్తి
తీసుకురాను. ఫేస్ బుక్ అనేది అయినా ‘మనుషుల నడుమ మతాల గళ్ళు, కులాల ముళ్ళు లేని ప్రపంచంగా’ వుంటే బాగుటుందని, ఇందులో విహరించే
కాస్త సమయంలో అయినా వాటికి అతీతంగా వుంటే ఇంకా ఎంతో హాయిగా ఉంటుందని భావించే
అనేకమందిలో నేనొకడిని.
ఇది చరిత్ర
రికార్డుకు అవసరమయ్యే అంశం కాబట్టి, కేవలం
తెలుసుకోవాలనే జిజ్ఞాసతో నా సందేహం తీర్చాలని కోరుకుంటున్నాను.
13, అక్టోబర్ 2021, బుధవారం
డ్రైవర్ పక్క ఫ్రంటు సీటు - భండారు శ్రీనివాసరావు
11, అక్టోబర్ 2021, సోమవారం
గుడ్డుగారికో రోజు - భండారు శ్రీనివాసరావు
ఏ దేశమేగినా, ఎందుకాలిడినా పాలూ, నీళ్ళతో పాటు తప్పకుండా దొరికేది మరోటివుంది. అదే కోడి గుడ్డు.
9, అక్టోబర్ 2021, శనివారం
వాడుకోలేని అధికారం ఎందుకు? – భండారు శ్రీనివాసరావు
కొన్ని సంవత్సరాలు వెనక్కి వెడితే...
సాక్షి టీవీలో అమర్ ఫోర్త్ ఎస్టేట్
ప్రోగ్రాం. పక్కన ఎక్జిక్యూటివ్ ఎడిటర్ రామచంద్ర మూర్తి గారు కూడా వున్నారు, నంద్యాల ఎన్నికల తరువాత అనుకుంటాను.
“అధికారం ఉన్నదే దుర్వినియోగం చేయడానికి, లేకపోతే
ఆ అధికారం ఎందుకు?” అన్నాను ఒక ప్రశ్నకు జవాబుగా.
అధికార దుర్వినియోగాన్ని నేను
సమర్దిస్తున్నానా అనే భావం వారి మొహాల్లో కనిపించి నేను కొంత వివరణ ఇవాల్సి
వచ్చింది.
అధికారాన్ని వినియోగించడం, దుర్వినియోగం చేయడం అనే విషయంలో చాలామందికి చాలా అభిప్రాయాలువుంటాయి.
పూర్వం నాకు తెలిసిన ఒక ఐ.ఏ.ఎస్.
అధికారి వుండేవారు. ఇప్పుడు లేరు. జిల్లా కలెక్టర్ గా పనిచేసే రోజుల నుంచి తెలుసు.
చాలా నిక్కచ్చి మనిషి. విజయ నగర్ కాలనీలో ఒక టూ ఆర్టీ ఇంట్లో కాపురం. ఆయన భార్య
రెండు సిటీ బస్సులు మారి నారాయణ గూడాలోని మా బంధువుల ఆసుపత్రికి వచ్చి
వెడుతుండేది. ఆయన ఆఫీసు కారు ఆయన ఆఫీసు వరకే. అలాంటి మనిషి ఒక మేనేజింగ్ డైరెక్టర్
హోదాలో విలేకరుల సమావేశాలు పెడుతుండేవారు. నేను మామూలుగా అందరు విలేకరులతో వెళ్లి
కూర్చుంటే, ఆయన నన్ను తన పక్కన వచ్చి కూర్చోమనే
వారు. అలా ఒక విలేకరిని విడిగా మర్యాద చేయడం మర్యాద కాదని ఆయనతో ఎన్నో సార్లు
మర్యాదగానే చెప్పేవాడిని. కానీ పిలిచిన ప్రతిసారీ అదే వరస. చివరికి నేను పోవడం
మానేసి, వాళ్ళ పీఆర్వో తో మాట్లాడి ప్రెస్ నోట్
తెప్పించుకునే వాడిని. ఇదెందుకు చెబుతున్నాను అంటే అధికార దుర్వినియోగం అంటే
తెలియని ఆ అధికారి కూడా తన తోటి సిబ్బంది దృష్టిలో మాట పడే పరిస్తితి
తెచ్చుకున్నాడు. ‘ఈయన సరే లెండి, ఒక రూలూ లేదు చట్టుబండలు లేదు. తనకెంత
తోస్తే అంతే!’ అనేవాళ్ళు వాళ్ళు ఆయన పరోక్షంలో.
ఒకప్పటి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్
గోయల్ గారు ఆయన శాఖలో అధికార దుర్వినియోగానికి అడ్డు కట్ట వేసే ప్రయత్నం మొదలు
పెట్టారు. ఉన్నతాధికారులు ఎవరి పని వాళ్ళు చూసుకోవాలని, పై అధికారులు పర్యటనలకు వచ్చినప్పుడు విమానాశ్రయాలకు వెళ్లి రిసీవ్
చేసుకునే పద్దతికి స్వస్తి చెప్పాలని, ప్రత్యేక
బోగీల్లో (సెలూన్ అంటారు, ఒక స్టార్ హోటల్ గదిలా సర్వ సౌకర్యాలు
వుంటాయి, వెనక మల్లికార్జున్ గారు రైల్వేశాఖ
డిప్యూటీ మంత్రిగా వున్నప్పుడు ఈ వైభోగం అనుభవించే అవకాశం హైదరాబాదులోని మా బోటి
విలేకరులకు తరచూ కలుగుతుండేది) ప్రయాణాలు మానుకోవాలని ఇలా అనేక ఆదేశాలు జారీ
చేసారు. ఈ వార్త పత్రికల్లో వచ్చినప్పుడు సంతోషం అనిపించింది. వార్త అయితే
వచ్చింది కానీ, అమలు జరిగిన వార్త నా కంటికి
కానరాలేదు. పోనీండి.
పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
తెలుగు మంత్రులు కేంద్రంలో వున్నప్పుడు వారానికి రెండు మార్లు, ముఖ్యంగా శనాదివారాల్లో హైదరాబాదు వచ్చి పోయేవాళ్ళు. ఈ విషయంలో ఎన్డీయే
ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం అనే తేడాలేదు.
శుక్రవారం సాయంత్రం కల్లా వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన ఓ వంద వాహనాలు ఎయిర్
పోర్టుకు చేరుకునేవి. వాటిల్లో కనీసం ఓ పాతిక అయినా అద్దెకు తీసుకున్న ఖరీదైన
వాహనాలు. అవి వచ్చే అతిధులకు, వారి పరివారం కోసం. వాటికి వారం వారం
బిల్లులు కట్టడం తప్ప అవి ఎవరు వాడారు, ఎక్కడెక్కడ
తిరిగారు అని ఆరా తీసే నాధుడు ఉండేవాడు కాదు. వచ్చే మంత్రిగారి శాఖ స్థాయిని బట్టి
ఏర్పాట్ల స్థాయి కూడా పెరుగుతుండేది. బస చేయడానికి ప్రభుత్వ అతిధి గృహాలు
ఉన్నప్పటికీ ఎందుకయినా మంచిదని అయిదు నక్షత్రాల హోటళ్ళు కూడా బుక్ చేసేవాళ్ళు.
యెంత చెట్టుకు అంత గాలి అన్నట్టు కాస్త గిట్టుబాటు వుండే శాఖల వాళ్ళు విరగబడి
ఖర్చులు పెట్టేవాళ్ళు.
నేను హైదరాబాదు
ఆకాశవాణిలో పనిచేస్తూ చిక్కడపల్లిలో
అద్దెకు ఉండేవాడిని. విలేకరి ఉద్యోగం
కావడం వల్ల ఇంట్లో ఫోను అవసరం జాస్తి. అది మూగనోము పట్టిన సందర్భాల్లో ఫోను అవసరం
వచ్చినప్పుడు దగ్గరలో వున్న ఒక ప్రభుత్వ అధికారి ఇంటికి వెళ్ళేవాడిని. మంచి
నిజాయితీపరుడు అన్న పేరు ఆయనకు ఇంటాబయటా
బాగా పేరుకుపోయివుంది. ఫోను కోసం వెళ్ళినప్పుడు అయన నన్ను కూర్చోబెట్టి పిచ్చాపాటీ
మాట్లాడుతుండేవాడు. ఆయన భార్య బొంబాయిలో ఉంటున్న వాళ్ళ అమ్మాయితో ఎస్.టీ.డీ. లో
మాట్లాడుతుండేది. ఆ సంభాషణ తెగే దాకా నాతో ఆయన ముచ్చట్లు కూడా కొనసాగేవి. అలా
ఒకరోజు ఆయన నాతొ ముచ్చటిస్తూ, ఆ రోజుల్లో నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ
బంధుమిత్రులతో కలిసి లక్షద్వీప్ యాత్ర గురించి ప్రస్తావించారు. రాజీవ్ విహార యాత్ర ఆయనకు సుతరామూ
నచ్చినట్టులేదు. 'ఎంత ప్రధానమంత్రి
అయితే మాత్రం అలా ప్రభుత్వ ఖర్చుతో, స్నేహితులతో కలిసి
ఇలా విలాస యాత్రలు చేయడం ఏం సబబు' అనేది ఆయన ఆవేదన.
కానీ అదేసమయంలో ఆయన భార్య అరగంట నుంచి
ఇంట్లో ప్రభుత్వం సమకూర్చిన ఫోనులో మాట్లడుతున్నదేమిటంటే, పోయిన పండక్కి తాను కొనుక్కున్న
చీరెల రంగులూ, వాటి అంచులు గురించిన వివరాలు, వాళ్ళమ్మాయి కొనుక్కున్న కొత్త చీరెల గురించిన
ఆరాలు. తల్లీకూతుళ్ళ ముచ్చట్లు ఇలా అప్రతిహతంగా టీవీ సీరియల్
మాదిరిగా సాగిపోతూ ఉండగానే, ఆఫీసరు గారి
డ్రైవర్, ప్రభుత్వ వాహనంలో ఆయన పిల్లల్ని తీసుకువెళ్ళి స్కూల్లో దింపి వచ్చాడు.
లోపల అడుగుపెట్టాడో లేదో అయన నాతో మాటలు మానేసి, సుల్తాన్ బజారో, ఆబిడ్సో, గుర్తు
లేదు, కారేసుకు వెళ్లి
పలానా దుకాణంలో మాత్రమే దొరికే ఓ వక్కపొడి డబ్బా కొనుక్కు రమ్మన్నాడు. డబ్బులు
ఇచ్చిందీ లేనిదీ నేను చూడలేదు. ఆ డ్రైవర్ వెళ్ళగానే మళ్ళీ అయన రాజీవ్ గాంధీ విషయం
ఎత్తుకున్నాడు. 'ఇలా ప్రభుత్వధనం ఖర్చుచేయడానికి పద్దూ పాడూ అక్కరలేదా, హద్దూ
అదుపూ ఏమీ లేదా ' అన్నది ఆయన ప్రశ్న. ఆఫీసరు గారి భార్య ఫోను సంభాషణ ఇంతట్లో తెమిలే అవకాశం లేదని గ్రహించి నేనే ఏదో
సాకుచెప్పి బయటపడ్డాను.
వెనక అంటే ఓ నాలుగు దశాబ్దాల క్రితం ఒక
వారపత్రికలో వచ్చిన కార్టూన్ నాకు బాగా గుర్తుండిపోయింది.
ఒక సినిమా హాలుకు జిల్లా కలక్టర్ గారు
భార్యను తీసుకుని ప్రభుత్వ జీపులో వస్తాడు. (ఆ రోజుల్లో కలెక్టర్లకు కూడా జీపులే).
జిల్లా వైద్యాధికారి అంబులెన్సులో వస్తాడు. పురపాలక శాఖ అధికారి ' మీ వీధులను మురికి చేయకుడి' అని రాసివున్న చెత్త లారీలో వస్తాడు.
అగ్నిమాపక అధికారి ఏకంగా గంటలు మోగించుకుంటూ అగ్నిమాపక వాహనంలో వచ్చేస్తాడు.
కార్టూన్ లో కాస్త ఘాటు ఎక్కువ ఉండవచ్చు. కొంత అతిశయోక్తి కూడా ఉండవచ్చు. కానీ అధికార దుర్వినియోగానికి ఓ మేరకు అయినా అది అద్దం పడుతోంది.
తోక టపా :
కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు దేశ
వ్యాప్తంగా కార్యాలయాలు వుంటాయి. ఒకానొక కీలక శాఖలో పనిచేసే ఒకానొక కీలక
ఉన్నతాధికారి అమ్మాయికి వివాహం నిశ్చయం
అయింది. దేశంలోని నలుమూలల నుంచి
వందిమాగధులు ఈ శుభ కార్యానికి హాజరు కావాల్సిన సందర్భమాయే! వెళ్లక తప్పని
పరిస్థితి.
అంతే! ఆ పెళ్లి ముహూర్తానికి ఒక రోజు
ముందు దేశ రాజధానిలో జాతీయ స్థాయిలో ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేస్తూ, ఒక
ఉత్తర్వు ఆఘమేఘాల మీద జారీ అయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని అన్ని చోట్ల నుంచి అధికారులు విమానాల్లో
రాజధానికి తరలి వెళ్లి, వారి వారి విభవానికి తగిన నక్షత్రాల హోటళ్ళలో ప్రభుత్వ ఖర్చుతో బసచేసి, పెళ్ళికి
హాజరై వధూవరులను ఆశీర్వదించి, తమ అవధికి మించిన చదివింపులు
సమర్పించుకుని,
తమ పై అధికారి మన్ననలను చూరగొన్నవారై, తిరిగి స్వస్థానములకు చేరుకొని
సుఖంబుననుండిరి.
ఓం! తత్ సత్! మంగళం మహత్!
NOTE: Cartoon Courtesy Cartoonist/Owner
8, అక్టోబర్ 2021, శుక్రవారం
మా బామ్మ మంచం నా కంచం – భండారు శ్రీనివాసరావు
అరవై ఏళ్ళ కిందటి జ్ఞాపకం. కంభంపాడు పెద్దబామ్మ
అంటే రుక్మిణమ్మ బామ్మకు అప్పుడు అరవై ఏళ్ళు పైమాటే. మొత్తం కుటుంబానికి ఆవిడ విక్టోరియా మహారాణి. నాన్న
నాకు ఎరుకలేని చిన్నవయస్సులోనే పోయారు. ఆయనకు ఏడుగురు ఆడపిల్లలు. నలుగురు
మగపిల్లలం. అయిదుగురు అక్కయ్యలకు ఆయన హయాములోనే పెళ్ళిళ్ళు అయ్యాయి. మగపిల్లలం
చాలా చిన్నవాళ్ళం. మగ దక్షత లేని కుటుంబ భారాన్ని ఆవిడ అప్పటినుంచీ భుజాలకు
ఎత్తుకుంది. లెక్కలు చెప్పుకోవడానికి పెద్ద ఆస్తి. కానీ లెక్క తీస్తే అయివేజు
అంతంత మాత్రం.
ఇదంతా ఎందుకంటే మా ఇంటికి మా బామ్మగారే
మకుటం లేని రాణి అని చెప్పడానికి. ఇంట్లో ఆవిడకూ, మా
అమ్మగారికీ వెండి భోజనం పళ్ళేలు, వాటి మధ్యలో ఒక బంగారం పువ్వు. పక్కనే
వెండి గ్లాసులు. ఇంకా వెండి సామాను వుండేది కానీ అవన్నీ ఇనప్పెట్టె లోనే. వాటి
తాళం చెవులు మా బామ్మగారి దిండు కిందా.
ఇంట్లో మిగిలిన వాళ్ళ కంచాలు అన్నీ
రాతెండివే. బయటనుంచి వచ్చిన వాళ్ళకోసం అమ్మ దొడ్లో ఉన్న బాదం చెట్టు ఆకులతో విస్తళ్ళు
కుట్టేది.
కంచమే కాదు, మా బామ్మ మంచం కూడా సపరేటే. ఇంట్లో చాలా మంచాలు, నవారువీ, నులకవీ ఉండేవి. ఆమె మంచం మాత్రం ఆమెకే
ప్రత్యేకం. మిగిలిన మంచాల మీద ప్రోటోకాల్ ప్రకారం దిండ్లూ, దుప్పట్లూ మారుతుండేవి. అంటే బావగార్లు కానీ అతిధులు కానీ వస్తే వాళ్లకు
నవారు మంచాలు. మిగిలిన వాళ్లకి నులక మంచాలు. ప్రతి రోజూ ఉదయం పూట ఈ మంచాలకు సళ్ళు
లాగి బిగించే కార్యక్రమం ఒకటి నడుస్తుండేది. దాన్ని ప్రేమక్కయ్య పర్యవేక్షించేది.
లాంతర్లు, బుడ్డి దీపాలను ముగ్గుతో తుడిచి శుభ్రం
చేసి, కిరసనాయిల్ పోసి సిద్ధం చేసే పని భారతక్కయ్య
మీద పడేది. అప్పటికి వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు కాలేదు.
కంచాలతో కదా మొదలు పెట్టింది.
అప్పుడప్పుడే స్టెయిన్ లెస్ స్టీల్ కంచాలు మార్కెట్లోకి వస్తున్న రోజులు
అనుకుంటాను. అప్పటికి అవి గృహ ప్రవేశం చేయలేదు. శారదక్కయ్య ఓసారి పండక్కి వస్తూ
రెండు స్టీలు భోజనం పళ్ళేలు తెచ్చి నాకు ఒకటీ,
వెంకటేశ్వర రావుకూ (వెంకప్ప) ఒకటీ ఇచ్చింది. అప్పట్లో వాటి ఖరీదు రెండూ కలిపి
పదిహేను రూపాయలు. అంటే కరణీకం చేస్తున్నప్పుడు నాన్న మూడు నెలల జీతం అన్న మాట. ఇహ
అప్పుడు చూడాలి మా మోహంలో సంతోషం. ఏనుగు ఎలా వుంటుందో తెలవదు కానీ అదెక్కినంత
ఆనందం.
శారదక్కయ్య ఇచ్చిన ఆ కంచం మీద నాకు
మోహం ఎంతగా పెరిగిపోయిందంటే అది నాకే సొంతం అనుకునేవాడిని. ఆ తర్వాత ముప్పయ్
ఏళ్ళకు పైగా అది నాతోనే వుంది. 1987లో మాస్కో వెళ్ళేటప్పుడు లగేజి సమస్య
కారణంగా ఆ కంచంతో నా రుణానుబంధం తెగిపోయింది.
తిరిగొచ్చిన తర్వాత లోకమే మారిపోయింది.
డిన్నర్ ప్లేట్లు, డిన్నర్ సెట్లు వచ్చిపడిన తర్వాత, చాలా కొద్ది మంది ఇళ్ళల్లో తప్ప, ఇప్పుడు
ఈ విడి కంచాల గోల లేదు.
మళ్ళీ ముప్పయ్యారేళ్ళ తర్వాత మా ఆవిడకు
కలిగిన వింత కోరిక పుణ్యమా అని నాకు తిరిగి సొంత కంచం వైభోగం వచ్చిపడింది. ఓ దసరా
పండుగ సందర్భంగా చేసిన కొనుగోళ్లలో భాగంగా నాకు ఒక స్టీలు కంచం కొనుక్కొచ్చింది.
దానికి ప్రారంభోత్సవం చేయాలని సంకల్పం.
దేవుడు మరోలా అనుకున్నాడు. కంచం మధ్యలో ఆ స్టీలు కంపెనీ వాడు ఒక పెద్ద స్టిక్కరు
అతికించి కూర్చున్నాడు. దాన్ని తీయాలని మా పనిమనిషి గోటితో ప్రయత్నించింది. ఆ
స్టిక్కరు ఊడిరాకపోగా అది వికటించి మరింత వికార స్వరూపం సంతరించుకుంది. ఇరుగింటి
పొరుగింటి చిన్న ఆడ లేడీస్ (మరి మేము మాత్రమే ఈ అపార్ట్మెంట్లో అందరికీ ఆంటీలం,అంకుళ్ళం!) మరీ అంత చిన్నవాళ్ళేమీ కాదులెండి, పిల్లలకు
పిల్లలు ఉన్నవాళ్ళే, కానీ ఆంటీ అంటే మాత్రం ఎంతో
నొచ్చుకుంటారు, మధ్యలో కలగచేసుకుని, నీళ్ళు
సలసలా మరగబెట్టి, ఆ వేడి వేడి నీళ్ళు గుమ్మరించి ఆ
కంచానికి అభ్యంగన స్నానం, సంప్రోక్షణ వగైరా సలక్షణంగా పూర్తి
చేశారు కానీ, ఆ స్టిక్కరు మాత్రం పోలింగు బూతులో
వేలికి అసహ్యంగా అంటించిన ‘గుర్తు’ మాదిరిగా అలాగే వుండిపోయింది.
ఓ డౌటనుమానం కూడా మనసులోనే మిగిలి
పోయింది.
‘అవునూ! ఈ స్టెయిన్ లెస్ స్టీల్ కంపెనీల వాళ్లు తమ కంపెనీ స్టిక్కరు,
కంచాలకు వెనుక భాగంలో అరచేతి మందాన అంటిస్తే వాళ్ళ సొమ్మేమయినా పోతుందా!’
ఇప్పుడివన్నీ మరిచిపోలేని జ్ఞాపకాలు.
కంచం వుంది. ముచ్చట పడి కొన్న మనిషే లేదు.
7, అక్టోబర్ 2021, గురువారం
నండూరి రామమోహనరావు గారు పెట్టిన మెత్తటి తొడపాశం
జర్నలిజం తొలి రోజుల్లో, అంటే 1970 ప్రాంతాల్లో నండూరి రామమోహన రావు గారు నన్ను సాన పట్టారు. ఆయన రూటే సపరేటు. చెప్పాల్సింది సూటిగా, సుతిమెత్తగా చెబుతారు. దాంతో ఆ పాఠం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ పాఠాల్లో ఇదొకటి.
బంగ్లాదేశ్ అవతరణ సమయంలో నాటి బంగ్లా నాయకుడు షేక్
ముజిబుర్ రెహమాన్ పేరు పలుసార్లు వార్తల్లో చోటు చేసుకునేది.
అప్పటికి ఇంకా తెలుగు పత్రికల్లో శ్రీ అనే గౌరవ వాచకం
వాడుతుండేవారు. (ఇప్పటి నాయకులు అలాంటి గౌరవానికి తగరని అనుకున్నారేమో తెలియదు, శ్రీ, గారు, మిస్టర్
అనే పదాలకు ఇప్పుడు స్వస్తి చెప్పారు)
ఈ నేపధ్యంలో నేను ఒకసారి వార్తను తర్జూమా చేసే పనిలో ఓ
తప్పు తొక్కాను. “శ్రీ షేక్ ముజిబుర్” అని రాశాను. ఆ అనువాదం నండూరి వారి దృష్టికి
వెళ్ళింది. ఆయన వెంటనే ఒక చీటీ పంపారు. ఆ రోజుల్లో నండూరి వారి నుంచి చీటీ
వచ్చింది అంటే ఓ మెమోతో సమానం. అందులో ఇలా వుంది
“Sheikh itself is honorific. Do
not use sri before it.
Don’t say
Mujibur when not followed by Rehman. Mujibur is enough. – NR”