24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

దేవుడికి కులమేదీ? – భండారు శ్రీనివాసరావు

 గాలికి కులమేదీ అని శివాజీ గణేషన్  కర్ణుడిగా నటించిన ‘కర్ణ సినిమాలో ఓ పాట వుంది. అలాగే దేవుడికి ఏమైనా కులం ఉందా! లేదు అనేదే నా జవాబు

సుమారు అరవై ఏళ్ళ కిందటి మాట.

ఖమ్మం జిల్లా, వల్లభి గ్రామం. కారణం తెలవదు కానీ ఆ వూళ్ళో అగ్రవర్ణాలకు, దళితులకు నడుమ ఘర్షణలు తలెత్తాయి. దళితవాడకు చెందిన మగవాళ్ళు, పెద్ద పెద్ద ఖామందులు ఎవరూ వూళ్ళో వుండలేక బయట ఎక్కడో తలదాచుకోవాల్సిన పరిస్తితి. మా పెద్ద బావగారు అయితరాజు రామారావు గారు ఆ ఊరుకు పెద్ద. ఆయన పూనికపై నాగపూరు నుంచి కాబోలు, వినోబా శిష్యులు బన్సాలీ గారు వల్లభి వచ్చి అనేక రోజులు అక్కడే మకాం వేశారు. ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనేలా రెండు వర్గాల నడుమ సయోధ్య కుదిర్చి వెళ్ళారు.

తరువాత మా బావగారు వూళ్ళో ఓ రామాలయం కట్టించారు. ఒక హరిజనుడిని (ఇప్పుడు ఈ మాట వాడడం లేదు, దళితుడు అంటున్నారు, ఆ రోజుల్లో పత్రికలు అన్నీ ‘రామాలయంలో హరిజన పూజారి’ అనే పేరుతొ ఒక విడ్డూరమైన వార్తగా ప్రచురించాయి) ఆ గుడిలో పూజారిగా నియమించారు.



(NOTE: COURTESY IMAGE OWNER)


 

23, సెప్టెంబర్ 2021, గురువారం

ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా! – భండారు శ్రీనివాసరావు

 ఒక కధ చెబుతాను. నిజానికి ఇది కధ కాదు, ప్రతి చోటా జరుగుతున్న కధే.

అనగనగా ఒక ఊరు. ఉన్నట్టుండి ఆ ఊరికి ఓ వ్యాపారి వచ్చి ఓ దుకాణం తెరిచాడు. దాన్నిండా రకరకాల స్టీలు సామాన్లు. ఒకటి కొంటే మరోటి ఉచితం అన్నాడు. ఇంకేం జనం ఎగబడ్డారు. కొన్ని రోజులకు పోలీసులు లాఠీలు ఝలిపించాల్సినంతగా క్యూ లైన్లు పెరిగిపోయాయి.

అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ వ్యాపారి కష్టమర్లతో నమ్మకంగా చెప్పాడు. ఉత్తర హిందూ స్థానం నుంచి తెచ్చిన సరుకు అంతా అయిపొయింది. మళ్ళీ స్టాక్ వస్తోందని కబురు వచ్చింది. అప్పటివరకు మీరు డబ్బులు చెల్లిస్తూ వుండండి. సరుకు రాగానే రసీదు చూపించి వస్తువులు తీసుకువెళ్ళండి అని. అంతకు ముందు కొనుక్కుని లాభ పడ్డవాళ్ళు, కొనుక్కోవాలని చూసి నిరాశ పడ్డవాళ్ళూ మళ్ళీ ఎగబడి డబ్బులు కట్టారు.

అలా కొంత కాలం గడిచిన తర్వాత అతడు గుడారం ఎత్తేశాడు. జనం లబోదిబో అన్నారు.

 ఒక విలేకరి వెళ్లి ఓ పోలీసు అధికారిని అడిగాడు, ఆ వ్యాపారి షాపు ఓపెన్ చేసి ఇలా ఒకటికి మరోటి ఫ్రీ అని ఆశ పెట్టినప్పుడే చర్య తీసుకుని వుంటే బాగుండేది కదా! అని.

ఆయన చిద్విలాసంగా ఒక నవ్వు విసిరేసి ఇలా అన్నాడు.

“నిజమే! మాకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కదా! చర్య తీసుకునేది”

అప్పటి స్టీలు సామాను నుంచి, పువ్వు మీ అదృష్టం చెప్పును, పన్నెండు బ్యాండ్ల రేడియో ఉచితం అనే లూధియానా ప్రకటనల నుంచి, గల్లీల్లో చీట్లు వేసేవారి నుంచి,  అర్ధ శాతం అధిక వడ్డీ ఎక్కువ ఇస్తామని భ్రమ పెట్టే ప్రైవేటు గిడిగిడి బ్యాంకుల నుంచి, అది కట్టిస్తాం, ఇది కట్టిస్తాం, ముందు డబ్బు కట్టండి అని  పత్రికల్లో ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పించే వారి నుంచి, ఇదిగో ఇప్పటి సైబర్ మోసాల వరకు పరిస్థితి ఇంతే! ఏమీ మారలేదు. జనమూ మారలేదు. అలాగే మోసపోతూనే వున్నారు. పోలీసులూ మారలేదు, అప్పటిలాగే కంప్లయింట్ ఎక్కడా అని అడుగుతూనే వున్నారు.

Prevention is better than cure అంటూ నీతి పాఠాలు చెప్పేవాళ్ళు చెబుతూనేవున్నారు.

పుణ్యభూమి కళ్ళు మూసుకుని చూస్తూనే వుంది, ఆశ చచ్చినా, దురాశ పుట్టినా ఆ మనిషి చచ్చినవాడితో సమానం అనే సూక్తిని మౌనంగా మననం చేసుకుంటూ.


NOTE: Courtesy Image Owner  


(23-09-2021)      




“….also spoke” – భండారు శ్రీనివాసరావు

 సాంస్కృతిక సభలు, సమావేశాలు కవర్ చేసే ఇంగ్లీష్ పత్రికావిలేకరులకు అలవాటయిన పదం.

వక్తల సంఖ్య భారీగా వుంటే అందరి పేర్లూ, వాళ్ళు చేసిన ప్రసంగాలు తమ రిపోర్టులో ప్రస్తావించడం కష్టం కనుక, పలానా పలానా వాళ్ళు కూడా మాట్లాడారు అనడానికి ఇలా క్లుప్తంగా రాసి సరిపుచ్చుతుంటారు. అలాంటిదే ఇది.
హిందూ పత్రికలో ఓ పేరా వస్తే చాలు అదే మహాప్రసాదం అని మహామహులే భావిస్తారు. అలాంటిది ఓ పుస్తకం గురించి ఆ పత్రికలో ఏకంగా ఓ సమీక్షే వచ్చింది. ఇక నేను అనగానెంత. అంచేత నేను కూడా, పైన చెప్పినట్టు “….also spoke” అన్నమాట.
ఇక విషయం ఏమిటంటే!
ఓ పుస్తకం గురించి ఈ నెల మొదట్లోనే చెప్పుకోవడం జరిగింది. ఆ పుస్తకాన్ని తెలంగాణా గవర్నర్ (శ్రీమతి) డాక్టర్ తమిళసై రాజ్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఆ పుస్తకం రాసింది దాసు కేశవ రావు గారనే పెద్ద మనిషి (1867- 1934). ఈ దాసు గారెకి ఓ మనుమడు. ఆయన పేరు కూడా దాసు కేశవరావే. ఈ చిన్న దాసుగారు నా ఈడువాడే కానీ నాకంటే చాలా పెద్దవాడు, గొప్పవాడున్నూ. హిందూ దినపత్రిక హైదరాబాదు ఎడిషన్ డిప్యూటి ఎడిటర్/ బ్యూరో చీఫ్ గా చేసిన సీనియర్ జర్నలిస్టు. ఆయనా నేనూ ఉద్యోగార్ధులమై, దాదాపు కొంచెం అటూ ఇటూగా ఒకేసారి హైదరాబాదు వచ్చాము. అప్పటినుంచి పరిచయం.
పుస్తకం గురించి ఇప్పటికే హిందూ పేపర్లో సమీక్ష వచ్చింది కాబట్టి రచయితను గురించి చెప్పుకుందాం.
జర్నలిస్ట్ దాసు కేశవరావు గారి కుటుంబం చాలా పెద్దది. సుప్రసిద్ధమైనది. దాసు గారి కుటుంబానికి మూల పురుషుడు, దేవీ భాగవతం కావ్యం సృష్టికర్త అయిన దాసు శ్రీరాములు (1846- 1908) గారి కుమారుడే మన కథానాయకుడు దాసు కేశవ రావు సీనియర్. (బొంబాయి మొదలయిన చోట్ల చాలా కాలం వుండబట్టేమో, ఆయన పేరుకి చివర పంత్ అని చేర్చినట్టున్నారు) వారి కుటుంబంలో దాదాపు అందరూ న్యాయవాది వృత్తిలో స్థిర పడినప్పటికీ, ఈయన గారి అభిప్రాయాలు విభిన్నం. మన ఒక్కరి కడుపు నింపుకోవడం కాదు, పదిమందికీ ఉపాధి కల్పించాలనే సదుద్దేశ్యంతో వ్యాపారాలు చేయాలని అప్పటి బొంబాయి, హైదరాబాదు, ట్రావెన్ కూర్ సంస్థానాల్లో రైల్వే కాంట్రాక్టులు అవీ చేసి పుష్కలంగా డబ్బు గడించారు. ఆ డబ్బుతో, సంపాదించిన అనుభవంతో బెజవాడకు వచ్చి అత్యంత అధునాతన ముద్రణా పరికరాలతో 1896లో వాణి ప్రెస్ ప్రారంభించారు. అప్పటికి బెజవాడ వాసులకు కరెంటు అంటే ఏమిటో తెలియదు. తన సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి, ఒక చిన్నపాటి విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసుకుని వాణి ప్రెస్ తో పాటు,ఇరవై ఒక్క గదుల తన రాజ ప్రసాదానికి కూడా విద్యుత్ కాంతుల సొగసులు అద్దారు. అలాగే బాపట్లలో తన కుమార్తె పెళ్లి చేసినప్పుడు, అక్కడే ఒక పవర్ హౌస్ నిర్మించి (ఇప్పుడు రంగారావు తోట అంటున్నారు) కళ్యాణ మండపం యావత్తూ విద్యుత్ వెలుగులు నింపారు. అయిదు రోజులపాటు రంగరంగవైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలని, ప్రత్యేకించి విద్యుత్ దీపాల తోరణాలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బండ్లు కట్టుకుని బాపట్ల వచ్చేవారని ఆ రోజుల్లో వైనవైనాలుగా చెప్పుకున్నారు.
తెలంగాణా గవర్నర్ డాక్టర్ (శ్రీమతి) తమిళ్ సై రాజభవన్ లో ఆవిష్కరించిన ఈ పుస్తకానికి నా ముందు మాట - ఇంగ్లీష్ పుస్తకం గురించి తెలుగులో పరిచయం- అనే పేరుతొ రాశాను.
"మూడు దశాబ్దాల క్రితం నాకు రేడియో మాస్కోలో ఉద్యోగం వచ్చింది. నేను నా కుటుంబాన్ని వెంటబెట్టుకుని అక్కడికి వెళ్లాను. ఆ దేశంలో శాకాహారులకు భోజనానికి ఇబ్బంది అని ఎవరో చెప్పగా విని, కొన్ని నెలలకు సరిపడా ఉప్పూ కారాలు, పోపుగింజలు మొదలయిన తిండిసామానులు సూటుకేసుల నిండా సర్దుకుని పట్టుకు పోయాము.
మాస్కో షెర్మితోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు కానీ మా ఆవిడ తెచ్చిన ఇంగువ డబ్బా కొంత తంటా తెచ్చిపెట్టింది. ఇంగువని ఇంగ్లీషులో ఏమంటారో ఆ క్షణాన చప్పున గుర్తు రాలేదు. అది తినే వస్తువనీ, వంటల్లో వాడతామనీ ఎన్నో విధాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసాను. ఘాటయిన ఇంగువ వాసన, వారి అనుమానాలను మరింత పెంచింది. చివరకు ఇంగువ ముక్క నోటిలో వేసుకుని నమిలి చూపించి, అది వారనుకునే మాదక పదార్ధము కాదని రుజువు చేసుకున్న తర్వాతనే అక్కడ నుంచి బయలుదేరలిగాము.
ఈ బాపతు మాలాంటి వాళ్ళు ఉంటారని దాసు కేశవరావు పంత్ గారు ఊహించే అంతకు యాభయ్ ఏళ్ళకు పూర్వమే ఒక పుస్తకం రాశారు. ‘ఇది జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకుంటే ఇంగ్లీషులో చక్కగా మాట్లాడగలుగుతారు’ అని దానికిందనే ఓ ట్యాగ్ లైన్ కూడా వుంది. ఆంగ్లంలో పట్టు సాధించాలని కోరుకునే తెలుగువాళ్ళకు పనికొచ్చే చిన్న పుస్తకం అన్నమాట. ఈ పుస్తకం పేరు A Vade Mecum. లాటిన్ పదం. చిన్ని పుస్తకం అని అనడం ఎందుకంటే, జేబులో పెట్టుకోవడానికి వీలైన గైడు లాంటిది అని తెలుగులో ఆ లాటిన్ పదానికి నిఘంటు అర్ధం.
ఇంగ్లీష్ బాగా తెలిసినవాళ్ళకు కూడా కొన్ని కొన్ని ఆంగ్ల పదాల తెలుగు సమానార్ధకాలు చప్పున స్పురించవు. మరీ ముఖ్యంగా సామెతలు, కాయగూరలు వగైరా.
ఉదాహరణకు ‘He is at his wits end for dinner’ అనే వాక్యాన్ని అనువాదం చేయాల్సివస్తే అది ఏ రూపం సంతరించుకుంటుందో వర్తమాన వార్తాపత్రికల్లో వస్తున్న అనువాదాలను చూస్తే తెలిసిపోతుంది. నిజానికి మనవైపు బాగా ప్రాచుర్యంలో ఉన్న ‘వాడికి పూటకు ఠికానా లేదు’ అంటుండే దానికి అది ఇంగ్లీష్ సమానార్ధకం అని ఈ పుస్తకంలో వుంది. అలాగే ‘She is near her time’ అని ఎవరైనా అన్నారనుకోండి. మన తెలుగు అనువాదకులు హడావిడిగా ఎలా రాస్తారో తెలుసుకోవడం పెద్ద కష్టమే కాదు. కానీ దాసు కేశవరావు పంత్ గారు దీనికి తెలుగు సమానార్ధకాన్ని పట్టుకున్నారు. ‘ఆవిడకు పురిటి ఘడియలు దగ్గరపడ్డాయి’.
గందరగోళంలోకి నెట్టే మరో వాక్యం. ‘It rains cats and dogs’. ఎప్పుడో, ఎక్కడో చదివాను. పిడుగుల వర్షం లాగా ‘పిల్లులు, కుక్కల వాన’ అనే అనువాదాన్ని. దాసు కేశవ రావు పంత్ గారు ‘కుంభపోత’గా వర్షం కురవడం’ అని రాసారు. బహుశా కుండపోతను ఆయన ‘కుంభ’పోతగా రాసివుంటారు. కుంభం అన్నా కుండ అనే అర్ధం కదా!.
ఇప్పుడు ఏది తెలుసుకోవాలన్నా గూగులమ్మ వుంది కదా అనే వాళ్ళు ఉండొచ్చు. వారికి ఇటువంటి పొత్తాలతో ఒరిగేది ఏమిటి అనే ప్రశ్న ఎదురు కావచ్చు.
అయితే ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన అంశం వేరే. దాసు కేశవ రావు పంత్ అనే పెద్దమనిషి ఎప్పుడో ఎనభయ్ ఏళ్ల క్రితమే ఇటువంటి బృహత్తర ప్రయత్నం చేసారు అనే సంగతిని వర్తమాన సమాజంలో జీవిస్తున్న వారికి తెలియచెప్పడానికి కూడా ఈ ప్రచురణ ఉపయోగపడుతుంది. ఇది పందొమ్మిదో ప్రచురణకు నోచుకున్నది అంటేనే దీనికి లభించిన ఆదరణ, దీనికి ఉన్న విశిష్టత బోధపడతాయి.
ప్రచురణకర్తలయిన మా వయోధిక పాత్రికేయ సంఘం వారికి మనఃపూర్వక అభినందనలు.



(21-09-2021)

22, సెప్టెంబర్ 2021, బుధవారం

టీవీల ముచ్చట్లు - భండారు శ్రీనివాసరావు

 

రైట్ రైట్

గతంలో ప్రైవేటు బస్సులు ఉన్నకాలంలో డ్రైవర్ కండక్టర్ తోపాటు ఒకక్లీనర్ కుర్రాడు కూడా ఉండేవాడు. ఎక్కాల్సినవాళ్ళు ఎక్కిన తరువాత బస్సు డోరుపై గట్టిగా చరుస్తూ రైట్ రైట్ అని గట్టిగా అరుస్తూ ముందున్న డ్రైవర్ కు వెళ్ళవచ్చు అనే సంకేతం ఇచ్చేవాడు. రైట్ రైట్ అంటే కదలమని అర్ధం. ఇప్పుడు టీవీ చర్చల మధ్యమధ్యలో యాంకర్లు రైట్ రైట్ అంటూ వుంటారు. ఇక్కడ రైట్ అంటే, చెప్పింది చాలు, ఆపమని సంకేతం. డ్రైవర్లు క్లీనర్ కుర్రాడి మాట వినేవాళ్ళు కానీ చర్చల్లో పాల్గొనే వాళ్ళు యాంకర్ గోడు వినిపించుకుంటారా.

 

ఇంత సింపుల్ అని ఇన్నాళ్ళు తెలియదు

"మొన్నీమధ్య ఏమీ తోచక పాలక పక్షాన్నీ, దాని నాయకుడి విధానాలను చెరిగిపారేస్తూ పోస్టు పెట్టాను. అప్పుడు ఏం జరిగిందో తెలుసా నేనే నమ్మలేకపోతున్నాను"

"ఏమి జరిగిందేమిటి? పోలీసులు కేసు పెట్టారా కొంపతీసి"

"కాదు, అలా అయితే ఆశ్చర్యం ఎందుకు? ఎప్పుడూ లేనిది ఓ ఛానల్ వాళ్ళు చర్చకు రమ్మని ఫోను చేసి ఇంటికి కారు పంపారు"

"తర్వాత...."

"ఇదా ఇందులో కిటుకని మర్నాడు ప్రతిపక్ష నాయకుడిని కడిగి గాలిస్తూ మరో పోస్టు పెట్టాను. తెల్లారేసరికల్లా చర్చలకు రావాలని మరో ఛానల్ నుంచి ఫోను"

 

ఈ పరిస్తితి ఇక మారదా?

"నగరంలో వర్షాలు, వరదలవల్ల ఘోరమయిన పరిస్తితి ఏర్పడిన పరిస్తితి కనబడుతోంది. ఈ పరిస్తితి ఇక మారదా అని స్థానికులు అనుకుంటున్న పరిస్తితే అనీచోట్లా కానవస్తున్న పరిస్థితి వుంది. అధికారులు ఎవ్వరూ రాని పరిస్తితిలోనే మా ఛానల్ ముందుగా అక్కడికి చేరుకున్న పరిస్తితి అని బాధితులు,  తమ పరిస్తితి గురించి మా విలేకరితో తమ గోడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి మీరు చూస్తున్నారు........"

అహో! టీవీ భాషకు పట్టిన దురవస్థ. ఒకే పేరాలో ఇన్ని పరిస్తితులా!

 

ఇక, ఈ మధ్య వచ్చిన కొన్ని ‘పదాలకు’ సోషల్ మీడియాలో లభించిన ప్రాచుర్యం ఏ స్థాయిదో అందరికీ తెలిసిందే!

జాతకం అంటేనే మారడం

 

తండ్రి పోతూ పోతూ ఇద్దరు మగపిల్లలకి ఆస్తిలో చెరిసగం రాసి పోయాడు. ఊరిమద్యలో ఇల్లూ, స్థలం పంచుకుంటే పెద్దవాడికి నాలుగు రోడ్ల కూడలిలో మూల స్థలం, చిన్నవాడికి దాని వెనుక స్థలం దక్కాయి. వూరు పెరుగుతూ ఉండడంతో పెద్దవాడి అదృష్టం పండింది. రెండు రోడ్లని కలిపే జాగా కావడంతో రోడ్డుకు ఆనుకుని మడిగీలు కట్టాడు. అదీ అద్దెకు తీసుకున్న వారి డబ్బులతోనే.  మంచి కిరాయిలు నెల నెలా చేతికి అందేవి. తమ్ముడికి కూడా అంత స్థలం ఉందన్న మాటే కానీ కాణీ ఆమ్దానీ లేదు. అతడిది నష్ట  జాతకం అన్నారు ఇంట్లోవాళ్ళు, బయట వాళ్ళు. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళయ్యేసరికి వూరు కూడా బస్తీ అయింది. రోడ్ల వెడల్పు కార్యక్రమంలో పెద్దవాడి మడిగీలు యెగిరి పోయాయి. వుండే ఇల్లు కూడా అరకొరగా తయారయింది. చిన్నవాడి పిల్లలు తమ చిన్న ఇంటి పెరట్లో కూరగాయలు పండించడం మొదలెట్టారు. వాటి అమ్మకాలతో ఆదాయం పెరిగింది. ఇద్దరు అన్నదమ్ముల పరిస్తితి అటుదిటుగా మారింది. ఈలోగా బస్తీ నగరంగా తయారయింది.

కొన్నాళ్ళకు ఆ దారిలో ఫ్లయ్ ఓవర్ నిర్మాణం అన్నారు, వస్తుందో లేదో తెలియదు కానీ పెద్దవాడి ఇల్లు పూర్తిగా ఎగిరిపోయింది. నష్ట పరిహారం భారీగానే ముట్టచెప్పారు, కాకపొతే కిస్తీల్లో చెల్లింపులు. చెట్టు కొట్టేస్తే పక్షులు ఎగిరిపోయినట్టు పెద్దవాడి కుటుంబం వలస పోవాల్సివచ్చింది.  వెనకవున్న తమ్ముడి  ఇల్లు ఆ వంతెన కాంట్రాక్టర్ ఆఫీసుకు అవసరమైంది. కళ్ళు చెదిరే కిరాయికి తీసుకున్నారు. ఆ స్థలంలోనే వాళ్ళ డబ్బులతోనే పెద్ద భవనం కట్టారు. పని పూర్తికాగానే అది మీదే అన్నారు. నివాసం  వుండగా కిరాయి డబ్బులు అదనం.  చిన్నవాడి జాతకం అంత గొప్పది అన్నారు అదే ఇంట్లో వాళ్ళు, అదే బయట వాళ్ళు.

తరాలు మారేసరికి ఇనుము  వెండయింది, వెండి ఇనుమయింది.

 

‘అదే జాతకం అంటే!’ అన్నాయి అదే నోళ్ళు.

(2017)

పొరబాట్లు జరిగాయి, దిద్దుకోవాలి. – భండారు శ్రీనివాసరావు


మళ్ళీ చెబుతున్నాను. జరిగినవి పొరబాట్లు మాత్రమే. తప్పులు కావు. అంచేతే సరి చేసుకోవడానికి అవకాశం వుంది.
మా స్వగ్రామం కంభంపాడు ఓ కుగ్రామం. నా వయసు డెబ్బయి అయిదు అంటే నేను పుట్టేనాటికే మా ఊళ్ళో ఓ మిషనరీ పాఠశాల వుండేది. అది పూరిపాకలో కాదు. మంచి భవంతిలో. నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించే విషయం.
నేను చదువుకున్న బడి నడి ఊళ్ళో వుంది. పూరిల్లు. వర్షం వస్తే సెలవు. అలా వుండేది.
మా తాతగారు భండారు సుబ్బారావు గారు కాశీ యాత్ర చేసివచ్చిన ఓ స్వామీజీకి తనకున్న భూమిలో ఇరవై ఎకరాలు దానం చేసి ఆయనకు ఓ ఆశ్రమం కట్టించి ఇచ్చారు. ఊళ్ళోని రైతులు కూడా, మరో ఇరవై ఎకరాల దాకా సాయం చేశారు. కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని స్వామీజీ ఆ ఆశ్రమంలో ప్రతిష్టించి ఓ చిన్న గుడి కట్టించారు. కొన్నాళ్ళు వైభవంగానే రోజులు గడిచాయి.
కాలక్రమంలో స్వామీజీ కాలం చేశారు. ఆశ్రమం పాడు పడింది. మా తాతగారు చనిపోయారు. గుళ్ళో దీపం పెట్టేవాళ్ళు కరువయ్యారు. ఆశ్రమానికి సాయం చేసిన మా కుటుంబంలోని వాళ్ళు కూడా పై చదువులకు, ఉద్యోగాలకు నగరాలకు తరలిపోవడంతో పరిస్థితి మరింత అధ్వాన్నం అయింది. మా తాతగారు దత్తు తీసుకున్న మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు ఓ ఇరవై ఎకరాలు గుడి పేరున వుంచి, దాన్ని ఆ పూజారికే వదిలివేశారు. దానిపై వచ్చిన ఆదాయం (కౌలు డబ్బులు) తో జీవనం గడుపుతూ, గుడి బాగోగులు చూడమని అప్పగించారు. ఆ భూములపై ఇప్పుడు మాకు ఎటువంటి హక్కులు లేవు.
మిగిలిన ఇరవై ఎకరాలను ప్రభుత్వానికి అప్పగిస్తూ అక్కడ ఓ ఎస్సీ కాలనీ నిర్మిస్తే బాగుంటుందని నాటి జిల్లా కలెక్టర్ కు ఓ లేఖ రాసారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయిన జంధ్యాల హరినారాయణ గారు అప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్.
ఆ ఉత్తరం చూసి ముందు ఆయన నమ్మలేదు. ఎస్సీ కాలనీల కోసం భూముల సేకరణకు తమ సిబ్బంది కాళ్ళకు బలపం కట్టుకుని తిరుగుతుంటే ఒక్కళ్ళూ భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఎవరీయన ఏకంగా ఇరవై ఎకరాలు దఖలు పరుస్తూ ఉత్తరం రాశారని ఆశ్చర్యపోతూ మా ఊరు వచ్చి స్వయంగా పరిశీలించి వెళ్ళారు. బహుశా ఆయన హయాములోనే అనుకుంటా జిల్లా మొత్తంలో ఓ పెద్ద ఎస్సీ కాలనీ మా ఊళ్ళో వెలిసింది.
ఇదంతా ఎందుకు అంటే..
పొరబాట్లు ఎక్కడ ఎలా జరిగాయో తెలిపేందుకు. అప్పటికే మూడు గుళ్ళు వున్న మా ఊళ్ళో మరో గుడి కట్టడానికి భూములు ఇచ్చిన రైతులు తర్వాత ఆ గుడిలో దేవుడిని పట్టించుకోలేదు. ఊళ్ళో బడి దిక్కూ మొక్కూ లేకుండా వుంటే దాని సంగతి పట్టించుకోలేదు.
అదే సమయంలో మిషనరీ వారు ఎక్కడో విసిరేసినట్టున్న మా ఊరువంటి ఓ మారు మూల గ్రామంలో ఓ మంచి పాఠశాల కట్టించారు. అక్కడ చదువుకున్న పిల్లలు జీవితంలో ఎంతో ఎదిగి వచ్చారు.
గుడి ప్రాధాన్యతను నేను తక్కువ చేసి చెప్పడం లేదు. కానీ సమాజానికి కావాల్సిన వాటిని అందించడంలో మన ధార్మిక సంస్థలు తగినంత కృషి చేయడం లేదు. కోట్ల కోట్ల ఆస్తులు కలిగిన సంస్థలు కూడా చదువుకూ, ఆరోగ్యానికీ ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. ఏదైనా అంటే అది ప్రభుత్వాల బాధ్యత అంటారు.
కంచిపీఠం, రామకృష్ణ మఠం వంటివాళ్ళు చక్కని విద్యాలయాలు, వైద్యాలయాలు నిర్వహిస్తున్న సంగతి వాస్తవమే. కానీ విస్తృత హిందూ సమాజపు విద్య, వైద్య అవసరాలని అవి తీర్చగలిగే స్థాయిలో లేని మాట కూడా నిజమే. ఎందుకంటే హిందూ ధర్మ పరిరక్షణ అనేది మొదటి ప్రాధాన్యంగా అవి కార్య కలాపాలు నిర్వహిస్తున్నాయి.
విద్య, వైద్య రంగాల ప్రాధాన్యత గుర్తించిన మిషనరీ సంస్థలను నమ్ముకుని పైకి వచ్చిన వాళ్ళు మతం మారితే మనం తప్పుపడుతున్నాము. వాళ్ళని దూరం చేసుకుని, వాళ్ళే దూరం జరిగారని అనుకుంటే లాభం ఏమిటి?
అయితే, మతం మార్చుకుని కూడా ప్రభుత్వ సదుపాయాలను, సౌకర్యాలను అనుభవించడం అనేది పూర్తిగా ఖండించాల్సిన విషయం. ఇందులో భేదాభిప్రాయం లేదు. ఉండరాదు.
(22-09-2021)

నేనూ హిందువునే - భండారు శ్రీనివాసరావు

 (హిందూ అనగానే మనువును గుర్తు చేసుకోవద్దు. మనువు పుట్టక ముందే హిందూ మతం వుంది. నిజానికి ఇది ఒక మతం కాదు, జీవన విధానం)

నేను ఆచరించి, పాటించే హిందూ మతం గురించి నాకు మా పెద్దవాళ్ళు చెప్పింది వేరు. నేనిప్పుడు చూస్తున్నది వేరు.

ఎందరు గజనీలు దండెత్తి వచ్చినా, ఎందరు ఘోరీలు యుద్ధాలు చేసినా హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేయగలిగారు కానీ హిందూ మత ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు. వందల వేల సంవత్సరాలు విదేశీయుల ఏలుబడిలో వున్నా హిందూ మతం చెక్కుచెదరలేదు. అదీ ఈ మతం గొప్పతనం. అంచేత ఎవరో ఏదో చేస్తారనీ, చేస్తున్నారనీ అనుకోవడంలో సహేతుకత వుందని నేననుకోను.

సాధారణంగా నేను మతపరమైన, కుల పరమైన విషయాలపై వ్యాఖ్యానాలు చేయను. కానీ ఈ నడుమ సాంఘిక మాధ్యమాల్లో ఒకరకమైన మొండి ధోరణి కనబడుతోంది. ఇది మన మత విధానాలకే వ్యతిరేకం. హిందూ మతాన్ని మొండిగా సమర్ధించే వాళ్ళలో కనీసం కొందరు కూడా మతం చెప్పిన దాన్ని పాటించడం లేదు.

సహనావతు అనేది వేదవాక్యం. ఆ సహనం ఇవ్వాళ కనబడడం లేదు. ఇతర మతాల వాళ్ళు ఏం చేస్తున్నారనే దానితో నిమిత్తం లేదు. ఏమి చేసినా ఏమీ కాదు. చరిత్రే ఇందుకు సజీవ సాక్ష్యం.

నా దృష్టిలో హిందూ మతం బలమైన పునాదులపై ఉద్భవించింది. తనని తాను కాపాడుకోగల సామర్ధ్యం, సత్తా ఈ మతానికి ఈనాటికీ పుష్కలంగా వుంది. అందుకు సందేహం లేదు.