16, సెప్టెంబర్ 2021, గురువారం

సెప్టెంబర్ 16

 

ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఈ తేదీకి ఓ ప్రాధాన్యత వుంది.
1984 సెప్టెంబర్ 16 మధ్యాహ్నం ఒంటి గంటా ఇరవై నిమిషాలకు విజయవాడ రేడియో కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు మొదలయ్యాయి. కొద్దిసేపు గడిచిందో లేదో వార్తలు చదివే వ్యక్తి "ఇప్పుడే అందిన వార్త" అంటూ ఒక సంచలన వార్తను వినిపించారు. "గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ ఎన్టీ రామారావును ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా ఆహ్వానించారు" ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం సాధించిన విజయ సమాచారం ఆనాటి రేడియో వార్త ద్వారా రాష్ట్రం నలుమూలలకు చేరిపోయింది. ఆరోజు ఆవార్త చదివిన వ్యక్తి, ఆరోజుల్లో బెజవాడ ఆంద్రజ్యోతిలో పనిచేస్తున్న శ్రీ గారపాటి నరసింహారావు (ఇప్పుడు లేరు). తాత్కాలిక ప్రాతిపదికన ఆరోజు న్యూస్ రీడర్ గా ఆవార్తను ప్రజలకు అందించే అదృష్టం తనకు కలిగిందని శ్రీ నరసింహారావు తరచూ గుర్తుచేసుకుంటూ వుండేవారు. ఆరోజు హైదరాబాదు రాజభవన్ సెంట్రీ రూములోని ఫోనుద్వారా బెజవాడ రేడియో కేంద్రానికి ఈ వార్తను అందించింది నేనే. ఆ రోజు నావెంట నేటి తెలంగాణా సిఎం సీపీఆర్వో శ్రీ జ్వాలా నరసింహారావు కూడా వున్నారు.


(శంకర్ దయాళ్ శర్మ)


(ఎన్టీ రామారావు)




సంగీత ధ్రువతార ఎమ్మెస్ సుబ్బులక్ష్మి

 

( సెప్టెంబర్ 16 సుబ్బులక్ష్మి గారి జయంతి)
"Who am I, a mere Prime Minister before a Queen, a Queen of Music" - Pandit Jawaharlal Nehru about MS Subbulakshmi.
ఈ వ్యాసానికి ప్రేరణ అయిన మితృలు ఆర్వీవీ కృష్ణారావు గారు, గతంలో ఒకసారి అమెరికా నుంచి వచ్చిన వారి అమ్మాయి కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్ళారు. కొండమీదకు కారులో వెడుతుంటే దారిలో పూర్ణకుంభం కూడలిలో వున్న ఓ విగ్రహాన్ని చూపించి అది ఎవరు తాతయ్యా అని అడిగాడు ఆయన మనుమడు. చేతిలో తంబుర ధరించి ఎంతో భక్తిప్రపత్తులతో కూడిన తన గానంతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తున్నారా అన్నట్టు జీవకళ ఉట్టిపడుతున్న ఆ కాంస్య విగ్రహాన్ని చూసి మనుమడికి జవాబు ఇవ్వబోయే లోపు అక్కడి టాక్సీ డ్రైవరే చెప్పాడు , దేశం గర్వించే ఒక గొప్ప గాయకురాలు ఎం ఎస్ సుబ్బులక్ష్మి అని.



అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ మహానుభావురాలికి ఒక స్మారక చిహ్నం ఏర్పాటుచేయడంలో తెలుగునేల వెనుకబడిలేదని, సంగీతం వంటి కళలు, కళాకారులను గౌరవించే విషయంలో ప్రాంతీయ, భాషా బేధాలకు తావులేదని నిరూపించారు.
(ఈ విగ్రహానికి సంబంధించి మరోప్రహసనం పత్రికల్లో వచ్చింది. ఓపదేళ్ళ తరువాత కాబోలు ప్రసిద్ధ గాయకుడు ఎస్.పీ. బాలసుబ్రమణ్యం దైవదర్శనం కోసం తిరుపతివెళ్ళారు. దారిలో ఆ కూడలిలోఆగి ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారికి శ్రద్ధాంజలి ఘటించారు. కళ వ్యాపారం కాకున్నా ప్రతిదీ వ్యాపారం అనుకునేవాళ్ళకు ఈసమాజంలో కొదవలేదు. ఆ ప్రసిద్ధ గాయకురాలి విగ్రహం చేతికివున్న తంబురకు టీవీ కేబుళ్ళు వేలాడుతున్నాయి. పదిమంది కంటపడుతుంది అనే భావనతో కాబోలు ఆ విగ్రహం కనబడకుండా హోర్డింగులు దాని చుట్టూ
గోడకట్టాయి.ఈ పరిస్తితి గమనించి ఎస్పీ కలత చెందారు. కన్నీరు పెట్టుకున్నారు. స్వామి దర్శనం చేసుకున్న వెంటనే ఆయనచేసిన మొదటిపని టీటీడీ అధికారులని కలిసి పిర్యాదుచేయడం. అప్పటి ఈవో సాంబశివరావుగారు వెంటనే స్పందించారు. సిబ్బందిని పంపి పరిస్తితిని చక్కదిద్దారు. ఎమ్మెస్ శత జయంతిని పురస్కరించుకుని విగ్రహంవున్న ఆ కూడలిని సుందరంగా తీర్చిదిద్దారు.)
ఇక విషయానికి వస్తే-
ఈరోజు సెప్టెంబర్ పదహారు సుబ్బులక్ష్మి శతజయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక సంగీతాభిమానిగా సుబ్బులక్ష్మి గారి గురించిన కొన్ని జ్ఞాపకాలని కృష్ణారావు గారు నెమరు వేసుకున్నారు.
కేంద్రప్రభుత్వంలో ఒక ఉన్నతాధికారిగా రిటైరయిన కృష్ణారావుగారితో ఒక సహోద్యోగిగానే కాకుండా ఒక శ్రేయోభిలాషిగా కూడా నాకు కొన్ని దశాబ్దాల పరిచయం. బెజవాడలో చదువుకుంటున్నరోజులనుంచి ఆయనకు మొదలయిన ఈ సంగీతాభిమానం ఆలిండియా రేడియోలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మరిన్ని మొగ్గలు తొడిగింది. సంగీతం పట్ల యెంత అభిరుచి అంటే సంగీత సభల కోసం ఎంతో ఖర్చు పెట్టుకుని, ఉద్యోగానికి సెలవు పెట్టుకుని అనేక దూర ప్రాంతాలకు వెళ్ళేవారు. కృష్ణారావు గారింట్లో ఒక హెచ్.ఎం.వీ. గ్రామఫోన్ వుంది. చాలామంది ఇళ్ళల్లో కూడా చూశాను, దాన్ని ఒక అలంకరణ వస్తువుగా. కానీ ఆర్వీవీ గారింట్లో వున్న ఆ పాత గ్రామఫోన్ ఇప్పటికీ పనిచేస్తూ వుంది. కొలంబియా వారు తయారు చేసిన గ్రామఫోన్ ప్లేట్లు అనేకం వున్నాయి. సుబ్బులక్ష్మి గారి రికార్డు కూడా వుంది. ఒక వైపు ఆవిడ కళ్యాణి రాగంలో పడిన 'నీదు చరణములే...' అనే కీర్తన, రెండో వైపు 'బృహు ముకుందే..' కీర్తన వున్నాయి.
ఆ రికార్డులని పదేపదే వినడంలో కూడా ఆయనదే ఒక రికార్డు. సంగీతం పట్ల అభినివేశం కలగడానికి సుబ్బులక్ష్మి గారు పాడిన ఆ కీర్తనలే కారణం అంటారు కృష్ణారావు గారు.
ఆయన బెజవాడ రేడియోలో పనిచేస్తున్నప్పుడు దగ్గరలో వున్న తెనాలికి సుబ్బులక్ష్మి గారు వస్తున్న కబురు అందింది.
తెనాలిలో నారుమంచి సుబ్బారావు గారనే మరో సంగీత అభిమాని వున్నారు. వాళ్ళ నాన్నగారి పేరు మీద సీతారామ గాన సభను నడుపుతుండే వారు.
బెజవాడలో కృష్ణారావు గారు కూడా త్యాగరాజ సంగీత కళాసమితి అనే పేరుతొ ఒక సంగీత సభ నిర్వహించేవారు. ఎలాగైనా బెజవాడలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి సంగీత కచేరీ పెట్టించాలన్నది ఆ సభవారి కోరిక.
ఆయనా, మోహన రావుగారనే మరో సంగీత అభిమాని కలిసి రెక్కలు కట్టుకుని తెనాలిలో వాలిపోయారు. కచేరీ మొదలు కావడానికి ముందే సుబ్బారావు గారిని కలుసుకుని తమ మనసులో మాట ఆయన చెవిన వేసారు. కనుక్కుని చెబుతా అని ఆయన మాట ఇచ్చారు. లోపల ఎమ్మెస్ సుబ్బులక్ష్మి తన బృందంతో కలిసి కచ్చేరీకి సిద్ధం అవుతున్నారు. ఏదో మొక్కుబడిగా కాకుండా కచేరీ చేయడంలో ఆవిడగారికి వున్న నిబద్దత అలాంటిది మరి. కచేరీ అయిన తరువాత ఎమ్మెస్ వారిని కలుసుకుని మాట్లాడారు. తనను ఇంతకు ముందే సౌందర రాజన్ అనే పెద్దమనిషి కలిసి బెజవాడ కచేరీ గురించి సంప్రదించారని, ఆయనకు మాట ఇవ్వడం వల్ల మీ మాట మన్నించలేక పోతున్నాననీ ఆవిడ ఎంతో నమ్రతగా, నొచ్చుకుంటూ చెప్పిన తీరు వారిని కదిలించింది. ఏ సభ వారు పిలిస్తే ఏమిటి, ఆవిడ బెజవాడలో కచేరీ చేయబోతున్నారు అదే పదివేలనుకుని వీళ్ళు బెజవాడ తిరిగి వెళ్ళారు.
బెజవాడలో కచేరీ చాలా గొప్పగా జరిగింది. గవర్నర్ పేట, రాజగోపాలచారి వీధిలో మా బావగారు, సీనియర్ వకీలు తుర్లపాటి హనుమంత రావు గారు చాలాకాలం నివసించిన ఇంటి ఎదురుగా ఒక పెద్ద శ్వేత సౌధం వుండేది. చక్రవర్తి అనే లాయరు గారిది. ఆ భవనంలోనే సుబ్బులక్ష్మి గారి విడిది చేసారని చెప్పారు కృష్ణారావు గారు. ( ఇప్పుడు ఆ వైట్ హౌస్ లేదు, పడగొట్టి ఏదో కాంప్లెక్స్ కట్టినట్టున్నారు)
తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదిక. హాలు కిటకిట లాడింది. బెజవాడలో సంగీత శ్రేష్ఠులు అయిన వారంతా మొదటి వరుసలో వున్నారు. అన్నవరపు రామస్వామి, దండమూడి రామ్మోహన్ రావు, ఓలేటి వెంకటేశ్వర్లు, ఎన్.సి. హెచ్. కృష్ణమాచార్యులు,మల్లిక్ మొదలయిన వాళ్ళు ఎమ్మెస్ వేదిక మీదకి రాగానే వారంతా లేచి గౌరవపురస్సరంగా నిలబడి అభివాదం చేశారు.
ఆవిడ చేతులు జోడించి వారందరికీ నమస్కారాలు చేసి కచేరీకి సిద్ధం అవుతూ వేదిక మీద నుంచే కనక దుర్గ గుడి దిశగా ఓ నమస్కారం పెట్టి కచేరీ మొదలు పెట్టారు. ప్రేక్షకుల్లో కృష్ణారావు గారు ఒడిలో టేప్ రికార్డర్ పెట్టుకుని సిద్ధంగా వున్నారు.దక్షిణామూర్తి శ్లోకంతో ప్రారంభించి, ఏకబిగిన మూడుగంటలు కూర్చున్న భంగిమ మార్చకుండా కచేరీ ఇచ్చారు. సభికులూ అంతే. పారవశ్యం తప్ప మరో కదలిక లేదు. ముందు కూర్చున్న సంగీతకారులను, వెనుక వరసల్లో వున్న సాధారణ సంగీత అభిమానులను ఆవిడ ఒకే స్థాయిలో అలరింప చేశారు.

15, సెప్టెంబర్ 2021, బుధవారం

సృష్టికి శుభాశీస్సులు

 


ముందు లేడి పిల్లలా పరుగులు పెడుతున్నది సృష్టి. వెనక వెంట వస్తున్నది సృష్టి తండ్రి సందీప్. ఇది రాస్తున్న నేను, ఆ తండ్రికి తండ్రిని.

అమెరికాలో ఉంటున్న మనుమరాలు సృష్టికి భారత కాలమానం ప్రకారం ఈరోజు పుట్టినరోజు.
చిరంజీవికి శుభాకాంక్షలు, శుభాశీస్సులు

ఇంజినీర్స్ డే

 ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి

1908 లో మూసీ నదికి వరదలు వచ్చాయి. అవి కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. అప్పటి నిజాం నవాబు హైదరాబాదును ఇలా వొదిలేస్తే ప్రమాదం అని భావించి నగరాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయాలని సంకల్పించాడు. మైసూరు నుంచి ప్రముఖ ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ప్రభుత్వం తరపున ఆహ్వానించి వరదలు రాకుండా అరికట్టడానికి, నగరాన్ని సుందరంగా అభివృద్ధి చేయడానికి తన సలహాదారుగా నియమించుకున్నారు. విశ్వేశ్వరయ్యగారి దూరదృష్టి పుణ్యమా అని నగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనే రెండు మంచి నీటి జలాశయాలు ఏర్పడ్డాయి. మూసీ వరదలకు కూడా ముకుతాడు వేసినట్టూ అయింది. అలాగే 1912 లోనే నిజాం నగరాభివృద్ధి మండలిని ఏర్పాటు చేసారు. ఈ మండలి ముందు చూపు ఫలితంగా హైదరాబాదు నగరానికి అప్పట్లోనే చక్కని రహదారులు, మార్కెట్లు, దుకాణ సముదాయాలు ఏర్పాటయ్యాయి.



(15th September)

14, సెప్టెంబర్ 2021, మంగళవారం

పుస్తక దాతా! సుఖీభవ!

 

సాయంత్రం ఎవరో ఫోన్ చేసి అమెజాన్ డెలివరీ బాయ్ ని, ఇంట్లో వున్నారా అని అడిగాడు. వున్నానని చెబితే కిందనే వున్నాను, మీకు ఒక పార్సెల్ ఇవ్వాలి అన్నాడు.

అమెజాన్ కు కాదు కదా అసలు ఈ ఆన్ లైన్ లో నేను ఏదీ కొనను. అతడు వచ్చి పార్సెల్ ఇచ్చిన తరువాత చూస్తే నాపేరు, అడ్రసు స్పష్టంగా కనిపించాయి. ఓపెన్ చేస్తే ఒక ఇంగ్లీష్ పుస్తకం వుంది. ప్రచురించింది రూపా పబ్లికేషన్స్, ఢిల్లీ. పంపింది చిత్రప్రసాద్ బహదూర్, భువనేశ్వర్. రాసింది అత్యుత సామంత. (సామంత అనాలో సమంత అనాలో తెలియని పరిస్థితి. పుస్తకం పేరు My Mother My Hero.

వెనుక అట్టమీద ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ఈ పుస్తకం గురించి రాసిన మాటలు వున్నాయి.

When I was going through the pages of the book, I could not but feel enormous respect and reverence for a mother who fought every odd to single-handedly raise her seven children. Despite abject poverty and lack of resources, she ensured that all her children got good education and became responsible citizens. I was moved by the account of Dr. Achyuta Samanta’s father’s death.

“We read biographies of entrepreneurs, explorers, and scientists, but writing the biography of a mother is something different and unique. Very inspiring.”

అని రాశారు ఆయన.

రెండువందల పేజీల ఈ పుస్తకం ఖరీదు Rs.295/- అని అమెజాన్ Invoice లో వుంది.

నా ముక్కూ మొహం తెలియక పోయినా పుస్తకాన్ని నా చిరునామాకు భద్రంగా పంపిన చిత్ర ప్రసాద్ బహదూర్ వారికి నమోవాకాలు.






(14-09-2021)       

నిమజ్జన గణపతి సందేశం

 రాజకీయ నాయకులకు నిమజ్జన వినాయకుడి ఉచిత సలహా:

“చుట్టూ చేరి భజనలు చేసేవారిని నమ్మకండి. ఎప్పుడో ఒకనాడు ఇలాగే నిర్దాక్షిణ్యంగా ముంచేస్తారు”
Image courtesy: Charlie Darwin



IS STILL STATE BANK, OUR BANK ?

 1975 నవంబరులో నేను హైదరాబాదు ఆలిండియా రేడియో, న్యూస్ యూనిట్ లో చేరినప్పుడు మొదటి నెల జీతం నగదు రూపంలో ఇస్తూ క్యాషియర్ సలహా ఇచ్చాడు, ఏదైనా బ్యాంకులో ఖాతా తెరిచి ఆ వివరాలు ఇమ్మని. రేడియో అక్కౌంట్ కోటీ, బ్యాంక్ స్ట్రీట్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్ హెడ్ ఆఫీసులో వుంది. అక్కడికి వెళ్లి పలానా చోట పనిచేస్తున్నాను అని చెప్పాను. బ్యాంకు మేనేజరే నాకు రిఫరెన్స్ సంతకం చేయడంతో వెంటనే అక్కౌంట్ ఓపెన్ చేయగలిగాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే నలభయ్ ఆరేళ్లుగా నా అక్కౌంట్ ఆ బ్రాంచిలోనే వుంది. ఎన్నో ఇళ్లు మారాను కానీ బ్యాంకు అక్కౌంట్ వేరే బ్రాంచికి మార్చలేదు. ఈ క్రమంలో అక్కడ పనిచేసేవాళ్ళు సిబ్బంది, అధికారులు  పరిచయం అయ్యారు. రిటైర్ అయిన తర్వాత కూడా అదే బ్యాంకు. అదే బ్రాంచి. ఆ బ్యాంకు యాడ్స్ లో పేర్కొన్నట్టు “STATE BANK MY BANK.

కొద్దిసేపటి క్రితం ఒకతను ఫోన్ చేశాడు, ‘కోటీ ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నాను, మీ వివరాలు చెప్పండ’ని.

నేను అన్నాను. ‘ప్రతి పది రోజులకి  బ్యాంకు నుంచి ఓ మెసేజ్ వస్తుంటుంది, వేరేవారికి మీ వివరాలు చెప్పొద్దు, బ్యాంకు ఎన్నడూ అలాంటివి అడగదు అని. మరి మీరేమిటి, పేరు డిజిగ్నేషన్ కూడా చెప్పకుండా! నా మెయిల్ ఐ డి మీ దగ్గర వుంది, ఏదైనా కావాలి అంటే మెయిల్ చేయొచ్చు కదా’ అని.

అతగాడు అన్నాడు, ‘మీరు నేను చెప్పేది వింటారా, మీరు చెప్పేదే నేను వినాలా’ అని.

‘చాలాకాలం నుంచి మీ కష్టమర్ గా ఉంటున్నాను, కనీసం ఆ అవకాశం నాకెందుకు ఇవ్వరు’ అని అడిగాను.

‘మీరు చెబుతారా కాల్ కట్ చేయమంటారా’ అని కాస్త గద్దింపుగా అన్నాడు. ‘ఫోన్ చేసింది మీరు నన్ను అడుగుతారేమిటి’ అనేది నా జవాబు.

వెంటనే కాల్ కట్ చేశాడు.

అతడు నిజమైన బ్యాంకు ఉద్యోగే అయి ఉండవచ్చు. కానీ ఫోన్ చేసి తన పేరు, హోదా ప్రవర చెప్పుకుని పలానా శ్రీనివాసరావుతోనే మాట్లాడుతున్నాను అనేది వెరిఫై చేసుకుని సంభాషణ సాగించి వుంటే ఈ తకరారు వచ్చేదే కాదు. (అతడు ఫోన్  చేసిన  నెంబరు ల్యాండ్ లైన్ నుంచి. 04023466703)

పైగా ఎంతో కాలం క్రితమే నేను నా బ్యాంకు ఖాతాను అటు ఆధార్ తో, ఇటు నా మొబైల్ తో లింక్ చేశాను కూడా.

అయినా ఇప్పుడీ  ఈ వివరాల ఆరాలు ఎందుకో ఏమిటో మరి.