6, ఆగస్టు 2021, శుక్రవారం

మరపున పడని రోజు

 2019 ఆగస్టు ఏడోతేదీ. ఆరోజు నా పుట్టిన రోజు. పొద్దున్నే టీవీ ఛానల్ డిబేట్ కి వెళ్లి వచ్చాను. తాను తయారుగా వుంది. జూబిలీ హిల్స్ లోని టీటీడీ బాలాజీ దేవాలయానికి వెడదాం అన్నది. నేనూ అంతవరకూ ఆ గుడి చూడలేదు. సరే పదమని బయలుదేరి వెళ్లాం. కొండ మీద గుడి. మంచి దర్శనం అయింది. అర్చన చేయించి, పులిహోర ప్రసాదం తీసుకుని తిరిగి కిందికి వస్తుంటే ఓ పూజారి గారు నన్ను గుర్తు పట్టి పక్కనే ఉన్న మరో గుడి, వినాయకుడి గుడికి తీసుకు వెళ్ళారు. ఈ గుడికీ, ఆ గుడికీ నడుమ ఓ ప్రహరీ గోడ వుండడం వల్ల కాస్త చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. పూజారి గారు ఏదో చెబుతున్నారు, ఒకరిది వైఖానస సాంప్రదాయం, మరొకరిది శ్రీ వైష్ణవ సాంప్రదాయం అనుకుంటా. ఒకదానికి మరొకటి చుక్కెదురుట. తమని వేరే శ్రీవైష్ణవుల నుండి విడిగా గుర్తించడానికి వైఖానసులు తిరుచూర్ణం స్థానంలో (నిలువు నామాలకు మధ్య వచ్చే నిలువు గీత) కేసరి రంగు మిశ్రమాన్ని వాడతారు. ఇతర వైష్ణవులు నామంలో ఎర్రని పొడిని వాడతారుట. ఇవన్నీ, నాకు అర్ధం కాని విషయాలే కాదు, అవసరం లేని విషయాలు కూడా. ఎప్పుడైనా గుడికి వెడితే దేముడికి దండం పెట్టి బయటకు రావడమే తప్ప మిగిలిన విషయాలు పట్టించుకోను.

గుడి మహా ద్వారం దగ్గర ఫోటో తీసుకుందామని అనిపించింది. సెల్ఫీ తీయడం రాదు, తీసేవాడు కనిపించలేదు. కనపడిన వాడిని అడగడానికి మొహమాటం. లేకపోతే ఆ ఫోటో మా జీవితంలో ఆఖరిసారి కలిసి దిగిన ఒక అపూర్వమైన జ్ఞాపకంగా మిగిలిపోయేది.
ఇంటికి వచ్చేముందు జూబిలీ హిల్స్ లోనే ఉంటున్న మా రెండో అన్నయ్య గారి ఇంటికి వెళ్ళాము, మా కుటుంబానికి పెద్దలు అయిన రామచంద్రరావు గారు, విమల వదినల ఆశీస్సులు తీసుకుందామని. భోజనం చేసిన తర్వాత ఏదో సినిమాకి వెళ్ళిన గుర్తు. ఆ తర్వాత పదంటే పది రోజులకే మాసివ్ హార్ట్ (ఫెయిల్యూర్) అటాక్ వచ్చి మా ఆవిడ మరణించడంతో ఆ జ్ఞాపకాలన్నీ అలికినట్టు గజిబిజిగా అయిపోయాయి.



కావాల్సింది అణ్వస్త్రాలా? అన్నవస్త్రాలా – భండారు శ్రీనివాసరావు

(Published in ANDHRAPRABHA on 08-08-2021, SUNDAY)

ఒక చిన్న పిల్లాడు, మరో లావాటి మనిషి, వీరిద్దరూ ఒకానొక కాలంలో ప్రపంచానికి చుక్కలు చూపెట్టారు.
ఆ కధాకధన విశేషములు ఏమనిన!
యావత్ ప్రపంచంలో అవాంఛిత, అద్భుత సంఘటనల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది, అమెరికా మొట్టమొదటి సారి జరిపిన అణుబాంబు పరీక్ష. డెబ్బయ్ ఏళ్ళకు పూర్వం న్యూ మెక్సికోలోని సోకొర్రోకు ఆగ్నేయంగా 35 మైళ్ళ దూరంలో 1945 జులై 16 వ తేదీన 'ట్రినిటీ' అనేగుప్త నామంతో అమెరికా, ప్రప్రధమ అణు పరీక్షను జయప్రదంగా నిర్వహించింది. లోకంలో అణుశకం ప్రారంభానికి అది నాంది అనుకోవచ్చు.
అమెరికా ఈ పరీక్షకు పెట్టిన గుప్తసంకేత నామం ‘ట్రినిటీ'. అయితే, పరీక్షించిన అణుబాంబుకు నిర్దేశించిన పేరు 'ది గాడ్జెట్'. తొలి పరీక్ష విజయవంతమైన ఉత్సాహంతో అమెరికా ఆ తరువాత కొద్ది వ్యవధిలోనే రెండు అణుబాంబులను జపాన్ పై ప్రయోగించి, అణుబాంబు శక్తి సామర్ధ్యాలనే కాకుండా దాని వినాశన శక్తిని సైతం ప్రపంచానికి పరీక్షించి చూపింది.
1945 ఆగస్టు నెల ఆరోతేదీన మొట్టమొదటి అణుబాంబు ప్రయోగం హిరోషిమాపై జరిగింది. మరో మూడు రోజుల తరువాత అంటే తొమ్మిదో తేదీన రెండో అణుబాంబును జపాన్ లోని నాగసాకీపై ప్రయోగించింది. హిరోషిమాపై జారవిడిచిన అణుబాంబు గుప్త నామం 'లిటిల్ బాయ్'. కాగా, నాగసాకీని మట్టుబెట్టిన బాంబుకు పెట్టిన పేరు 'ఫ్యాట్ మాన్'.
నిజానికి హిరోషిమాపై ప్రయోగించిన తొలి బాంబు ముందుగా పరీక్షచేసి చూసినది కాదు. అయినా అది యెంత నష్టం చేయాలో అంతా చేసి చూపించింది. ఈ బాంబును ముందుగా పరీక్షించక పోవడానికి కూడా కారణం వుంది. ఒకేఒక్క బాంబుకు అవసరమయ్యే యురేనియం- 235 నిల్వలు మాత్రమే అప్పటికి అమెరికా దగ్గర వున్నాయి. దాంతో ఆ బాంబును ముందుగా పరీక్షించి చూడడానికి ఆ దేశానికి వీలులేకుండా పోయింది.
హిరోషిమా, నాగసాకీలపై అమెరికా ప్రయోగించిన ఈ రెండు అణుబాంబులు కలిసి సృష్టించిన మారణహోమం ఇంతా అంతా కాదు. ప్రయోగించిన ఒకటి రెండు క్షణాల వ్యవధిలోనే లక్షా నలభయ్ ఎనిమిది వేలమంది ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. వాటివల్ల ఉత్పన్నమైన అణు ధార్మిక ప్రభావం కారణంగా ఆ తరువాత అయిదేళ్ళ కాలంలో మరణించిన వారి సంఖ్య లక్షల్లో వుంది. క్షతగాత్రులు, వికలాంగులుగా మారి జీవచ్చవాలుగా తయారయిన వారి సంఖ్యకి అంతే లేదు. దీన్నిబట్టి అణ్వస్త్రాల వల్ల అవనికి పొంచి వున్న పెనుముప్పును అర్ధం చేసుకోవచ్చు.
ఇదంతా గతం. ఈ గతానికి కూడా ఒక ఆసక్తికరమైన మరో గతం వుంది. పనిలో పనిగా దాన్ని కూడా గుర్తు చేసుకోవడం ఈ వ్యాస ఉద్దేశ్యం.
అమెరికా తొలి అణుపరీక్షకు అంతా సిద్ధం చేసుకుంది. అయితే ముహూర్త సమయానికి అమెరికా శాస్త్రవేత్తలకు వర్షం రూపంలో తొలి అడ్డంకి ఎదురయింది. అణువిస్పోటన పరీక్షకు తెల్లవారు ఝామున నాలుగు గంటలకు ముహూర్తం నిర్ణయించారు.కానీ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో వాతావరణం అనుకూలించ లేదు. ఆ పరిస్తితుల్లో పరీక్ష నిర్వహిస్తే పరిణామాలు దారుణంగా వుండవచ్చని భయపడ్డ అధికారులు పరీక్షను కొద్దిసేపు వాయిదా వేసారు. ప్రెసిడెంట్ ట్రూమన్ తో సహా అందరూ ఎదురు చూస్తున్న వాతావరణ నివేదిక ఉదయం నాలుగు గంటల నలభయ్ అయిదు నిమిషాలకు శాస్త్రవేత్తలకు అందింది. పరీక్షకు అధికార్లు పచ్చ జెండా చూపారు. సరిగ్గా అయిదు గంటల పది నిమిషాలకల్లా ఇరవై నిమిషాల కౌంట్ డౌన్ మొదలయింది. అక్కడికి పదహారుమైళ్ళ దూరంలో నిర్మించిన ఎత్తయిన టవర్ పైనుంచి ఉన్నతాధికారులు ప్రయోగ ప్రక్రియని పరిశీలిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం అయిదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నలభయ్ అయిదు సెకన్లకు, మానవాళి భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తూ తొలి అణువిస్పోటనం లోక భీకరంగా ఆవిష్కృతమైంది. ఆ పేలుడుకు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. క్షణంలో వందో వంతులో ఇరవై కిలో టన్నుల టీ.ఎం.టీ. శక్తికి సరిసమానమైన 'ఎనర్జీ' విడుదల అయింది. తెల్లవారుఝామున మసకచీకటి కమ్ముకున్న ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, కొండలు, ఒకటి రెండు క్షణాల పాటు కళ్ళు మిరుమిట్లు కొలిపేలా, 'వేయి సూర్యుల కాంతి'తో వెలిగిపోయాయి. బాంబు పేలిన చోట పది అడుగుల లోతు, వంద అడుగుల వెడల్పు కలిగిన గొయ్యి ఏర్పడింది. ఆ ప్రదేశం యావత్తూ నిప్పుల కొలిమిలా మారింది. నీలం నుంచి ఎరుపు, ఎరుపు నుంచి పచ్చ, పచ్చ నుంచి తెలుపు - ఇలా రకరకాలుగా రంగులు మారుతున్న దృశ్యాలు ఆకాశంలో దర్శనమిచ్చాయి. పెద్ద పుట్టగొడుగు మాదిరిగా నల్లటి నలుపు రంగుతో సమ్మిశ్రితమైన ఎర్రటి పొగ మేఘాలు గగన తలంలో ఏడున్నర మైళ్ళ ఎత్తు వరకు ఎగసి పడ్డాయి.
'ట్రినిటీ' పరీక్ష డైరెక్టర్ కెన్నెత్ బ్రెయిన్ బ్రిడ్జ్ అణుబాంబు ప్రయోగం సృష్టించిన ఉత్పాతానికి విభ్రమ చెందాడు. లోక వినాశనానికి దోహదం చేసే దారుణ ప్రక్రియలో పాలుపంచుకున్న నిర్వేదం ఆయన తొలి పలుకుల్లో ధ్వనించింది.
'ఛీ! ఛీ! జరగరానిది జరిగిపోయింది. మనం మనుష్యులమే కాదు' ఇదీ ఆయన వ్యాఖ్య.
పొతే, ట్రినిటీ పరీక్షకు సాక్షీభూతంగా నిలచిన మరో శాస్త్రవేత్త జే.రాబర్ట్ ఓపెన్ హీమర్ ఆనాటి దృశ్యాన్ని అభివర్ణిస్తూ 'వేయి సూర్యుల కాంతి' అనే పద ప్రయోగం చేసారు. కాకతాళీయం కావచ్చు, ఆ వర్ణన భగవద్గీత లోని 'దివి సూర్య సహస్రస్య' (భగవద్గీత పదకొండవ అధ్యాయం, పన్నెండవ శ్లోకం, ప్రధమ పాదం) అనే పదానికి దగ్గరగా వుంది. ఆ శాస్త్రవేత్తకు సంస్కృతంతో పరిచయం వుంది అనడానికి ఓ దాఖలా వుంది. ఆయనే చాలా ఏళ్ళ తరువాత అణు బాంబు పరీక్షను గురించి చెబుతూ మరో మాట చెప్పారు. ముందు అది ఎవరికీ అర్ధం కాలేదు. ఎందుకంటే అది సంస్కృతంలో వుంది. భగవద్గీత లోనిదే ఆ వాక్యం కూడా. 'కాలోస్మిలోక క్షయకృత్ ప్రవ్రుద్దో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః'
అంటే:
"నేనే మృత్యువును. లోకాలను నాశనం చేసే సర్వం సహా శక్తిని"
ఉపశ్రుతి:
ఒక పాత లెక్క ప్రకారం, ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అమెరికా (7700 ), రష్యా (8500 ), యూకే (225 ), ఫ్రాన్సు (300 ), చైనా (250 ), భారత్ (100 ), పాకిస్తాన్ (110 ) అన్నింటినీ కలుపుకుని మొత్తం 17185 అణ్వాయుధాలు వున్నాయి. 60 ఏళ్ళ క్రితం అమెరికా జపాన్ పై ప్రయోగించిన ఓ మోస్తరు ఆటం బాంబులు రెండింటికే రెండు మహానగరాలు అల్లడితల్లడి అయ్యాయి. లక్షల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే ఎక్కువమంది అణుధూళి సోకి జీవిత పర్యంతం జీవచ్చవాల మాదిరిగా జీవితాలు గడిపారు. ఆస్తి నష్టం సంగతి చెప్పక్కర లేదు. మరి ఇలా అన్ని దేశాలు తమ ఆయుధాగారాలను, ఆటంబాంబు, హైడ్రోజన్ బాంబుల వంటి సామూహిక హనన ఆయుధసంపత్తితో నింపుకుంటూ పొతే, మానవ జాతి మనుగడకు పూచీ ఎక్కడ? ఈ ప్రశ్న సరే!
“మానవాళికి ఈనాడు కావాల్సింది అణ్వస్త్రాలా? అన్నవస్త్రాలా?”
దీనికి జవాబు ఇచ్చేది ఎవ్వరు?

https://epaper.prabhanews.com/c/62330656

షర్మిల పొలిటికల్ టార్గెట్ ఎవరు..?


కొద్దిసేపటి క్రితం ఆధాన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో

ఆగస్టు జ్ఞాపకాలు


ప్రతి నెలా మొదటి వారంలో అలా నడుచుకుంటూ వెళ్లి రత్నదీప్ సూపర్ మార్కెట్లో నెల వారీ సరుకులు కొని, హోం డెలివరీ చేయమని చెప్పి మళ్ళీ నడుచుకుంటూ తిరిగి రావడం కొన్నేళ్లుగా మా ఇద్దరికీ ఓ అలవాటుగా మారింది. అలాగే రెండేళ్ల క్రితం ఆగస్టు మొదటివారంలో ఈ నెలవారీ నడక మొదలు పెట్టాం. ఎప్పుడూ లేనిది మా ఆవిడ ఓ సంచీ చేతబట్టుకుని వచ్చింది.
తిరిగి వస్తుంటే ఇదిగో ఈ పక్క సందులోనే మన అరుణ ఇల్లు ఒకసారి చూసిపోదాం అంది. అరుణ అంటే మా వలలి. మూడు నెలల నుంచి వంటకు రావడం లేదు. అరుణ వాళ్ళు వుండేది మూడో అంతస్తులో. మెట్లెక్కి వెళ్ళాలి. ఫోన్ చేసి కిందికి పిలవరాదా అన్నాను.
“లేదు పొద్దునే తనతో మాట్లాడాను. వాళ్లమ్మ గారి ఊరికి పోతోందిట. ఉత్తమనిషి కూడా కాదు, మెట్లు దిగి ఏమి వస్తుంది. మీరిక్కడే వుండండి, నేను కలిసి వస్తాను’ అన్నది స్థిరంగా. ఇక నేనూ ఆవిడతో పాటు వెళ్లక తప్పలేదు.
పైన ఒకటే గది. మమ్మల్ని చూడగానే అరుణ భారంగా లేవలేక లేచింది. వెలిగిపోతున్న మొహంతో మమ్మల్ని చూస్తూ మంచం మీద కూర్చోమంది.
మా ఆవిడ తాను తెచ్చిన సంచీలోనుంచి కుంకుమ భరిణ, చీరె, జాకెట్ పీస్ తీసి బొట్టుపెట్టి ఇచ్చింది. తీసుకువచ్చిన మిఠాయిలు, పూలు అందించింది.
‘పండంటి బిడ్డను కనడమే కాదు, రాగానే నాకు తీసుకువచ్చి చూపించాలి సుమా’ అని అరుణ దగ్గర మాట తీసుకుంది.
అరుణ మాట నిలబెట్టుకుంటూ మూడు నెలల తర్వాత పసిబిడ్డను తీసుకుని మా ఇంటికి వచ్చింది. కానీ ఆ బిడ్డను చూడడానికి తను లేదు.
అరుణ ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత ఆమె బతికి వుంది కేవలం పదిరోజులే.



(06-08-2021)

5, ఆగస్టు 2021, గురువారం

“కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం”

 

(Published in Andhra Prabha Daily)

సూటిగా.. సుతిమెత్తగా... భండారు శ్రీనివాసరావు

“కాశ్మీర్ భారత దేశంలో అంతర్భాగం” అంటూ గత కొన్ని దశాబ్దాలుగాఅంతర్జాతీయ వేదికలపై భారత దేశం చేస్తూ వస్తున్న ఈ వాదన రెండేళ్ల క్ర్తితం వాస్తవ రూపంలో మనముందు నిలిచింది. భారత రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దుకావడంతో ఇది సాధ్యపడింది.

మనదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఇద్దరు ప్రధాన మంత్రులు వుండేవారు అనే సంగతి బహుశా నేటి తరంలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అలాగే స్వతంత్ర భారతంలో స్వయంగా రూపొందించుకున్న రాజ్యాంగం అదే దేశంలో ఒక రాష్ట్రం అయిన జమ్మూ కాశ్మీర్ లో వర్తించదు అనే వింత పోకడ ఒకటి ఉండేదని ఆ రోజులు గురించి తెలిసిన వారికి బాగా జ్ఞాపకం.

ఈ విచిత్రమైన రాజకీయ పరిస్థితికి కారణం రాజ్యాంగంలో పొందుపరచిన 370వ అధికరణం. దీనిద్వారా సంక్రమించిన విశేషమైన అధికారాలతో జమ్మూ కాశ్మీర్, భారతదేశంలో అంతర్భాగంగా వుంటూనే కొన్ని ప్రత్యేక హక్కులను దశాబ్దాల తరబడి అనుభవిస్తూ వచ్చింది. ఈ కారణంగానే ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రధాన మంత్రి పదవి, ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పతాకం, ప్రత్యేక పౌరసత్వం,  దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోను లేనన్ని ప్రత్యేక హక్కులు.

370 వ అధికరణాన్ని తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏ రకంగా చూసినా చారిత్రాత్మక నిర్ణయమే. ఈ అధికరణం ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కలగచేస్తూవచ్చింది. ప్రసిద్ధ రచయిత జార్జ్ ఆర్వెల్ చెప్పినట్టు ‘అందరూ సమానమే, కాకపొతే వారిలో కొందరు ఎక్కువ సమానం” అనే పద్దతిలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కొన్ని రాజకీయ పరిస్థితులు, మరి కొన్ని రాజకీయ అవసరాలు, ఒత్తిడుల కారణంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే కొన్ని ప్రత్యేక హక్కులను, అపరిమితమైన  అధికారాలను అనుభవిస్తూ వచ్చింది. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దరిమిలా జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రం కూడా దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటిగా మారిపోయింది. రాష్ట్రాల నడుమ అసమానతలను తొలగించినట్టు అయింది.

370వ అధికరణం వున్న కాలంలో దేశంలో మరెక్కడా లేని విధంగా జమ్మూ కాశ్మీర్ పౌరులు రెండు విధాలైన పౌరసత్వాలను అనుభవిస్తూ వచ్చారు. ఒకటి కాశ్మీర్ పౌరసత్వం కాగా మరోటి భారత దేశ పౌరసత్వం. ఈ అధికరణం తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో నివసించే ప్రజలు సైతం ఇతర దేశ ప్రజల మాదిరిగా ఒకే ఒక పౌరసత్వం అదీ భారత పౌరసత్వం మాత్రమే కలిగివుంటారు.

ఈ అధికరణం కారణంగా విచిత్రంగా కానవచ్చే మరో విషయం  ఏమిటంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సొంత రాజ్యాంగాన్ని అనుమతించడం. అంతేకాదు, ఆ రాష్ట్రానికి విడిగా సర్వంసహా అధికారాలు దఖలు పరచడం. సొంత చట్టాలను చేసుకుని అమలుచేసే అవకాశం కల్పించడం. ఆ రాష్ట్రం శాసనసభ అనుమతిస్తే తప్ప కేంద్ర శాసనాలు సైతం అక్కడ అమలుకు నోచుకోని దుస్థితి.

ఒకే దేశంలో ఒక రాష్ట్రంగా వుంటూనే జమ్మూ కాశ్మీర్ ఇన్నేళ్ళుగా ఇన్ని ప్రత్యేక హక్కులు అనుభవిస్తూ వచ్చింది. మరి ఇన్ని ప్రత్యేకతలను రాజ్యాంగపరంగా ఆ రాష్ట్రానికి దఖలు పరచిన తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, భారతదేశంలో అంతర్భాగమని అంతర్జాతీయ వేదికలపై చేస్తున్న వాదనలలో డొల్లతనం వున్నట్టు అంగీకరించడమే అవుతుంది కదా! 

 

 

అంచేతనే, ఈ అసమానతలకు భరతవాక్యం పలుకుతూ మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం రెండేళ్ల క్రితం ఈ అధికరణాన్ని రద్దు చేసింది. తద్వారా, రాష్ట్రాల నడుమ అసమానతలకు స్వస్తి పలికింది.

 

దీనికి పూర్వం అక్కడి ప్రజలకు వున్న ప్రత్యేక హక్కులు ఇన్నీ అన్నీ కావు. ఆ రాష్ట్రంలో భూమి కొనాలన్నా, అమ్మాలన్నా ఆ రాష్ట్ర ప్రజలకే వీలు. బయటివారు జమ్మూ కాశ్మీర్ లో భూముల అమ్మకం, కొనుగోళ్లు చేయడానికి పూర్తిగా అనర్హులు. ఇప్పుడు ఈ వివక్షకు తెర పడింది.

 

మరో విడ్డూరమైన సంగతి ఏమిటంటే ఆ రాష్ట్రానికి విడిగా ఒక అధికారిక పతాకం వుంది. ఇప్పుడు ఆ రాష్ట్రానికి కూడా మిగిలిన దేశంతోపాటుగా ఒకే ఒక జాతీయ జండా. అది, త్రివర్ణ పతాకం.

లోగడ జమ్మూ కాశ్మీర్ శాసనసభ పదవీ కాలం ఆరేళ్లు. ఈ అధికరణం తొలగింపు తర్వాత అక్కడ కూడా అయిదేళ్లకు పరిమితం అయింది.

దేశం మొత్తంలో ముస్లిం జనాభా అల్పసంఖ్యాక వర్గానికి చెందినది అయితే, జమ్మూ కాశ్మీర్ లో మాత్రం వీరు జనాభాపరంగా అధిక సంఖ్యాకులు. అక్కడ హిందువులు, సిక్కులు అల్ప సంఖ్యాకులు. అధికరణం తొలగించిన తర్వాత  ఈ అల్ప సంఖ్యాకులకు పదహారు శాతం రిజర్వేషన్లకు అవకాశం లభించింది.

సమాచార హక్కు చట్టం దేశం మొత్తంలో వర్తించే శాసనం అయినప్పటికీ జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఇది వర్తించేది కాదు. ఇప్పుడు ఆ చట్టం కూడా జమ్మూ కాశ్మీర్ లో వర్తించే చట్టంగా మారిపోయింది.

ఇంతకు  ముందు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో లధాక్ అనే ప్రాంతం ఒక భాగంగా వుండేది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాన్ని జమ్మూ కాశ్మీర్ నుంచి విడదీసి, విడిగా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అలాగే జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా తీసేసి దాన్ని కూడా కేంద్రపాలిత ప్రాంతంగా మార్పు చేశారు. కాకపొతే జమ్మూ కాశ్మీర్ కు శాసన సభ వుంటుంది, లదాక్ విషయంలో శాసన సభ అంటూ వుండదు. అంతే తేడా!

 

తోకటపా:

ఎటూ కాశ్మీర్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఒక జోక్ తో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి ప్రసంగిస్తున్నాడు.

కాశ్మీర్ అంశంపై మాట్లాడడానికి ముందు భారత పౌరాణిక ఇతిహాసంలోని ఒక ఘట్టాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. పూర్వకాలంలో కశ్యప మహర్షి అనే దేవముని వుండేవాడు. ఆయన పేరు మీదనే కాశ్మీర్ కు ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఆయన కాశ్మీర్ లో సంచారం చేస్తుండగా ఒకచోట ఆయన పాదం ఓ బండ రాతికి తగిలింది. వెంటనే ఆ రాతినుంచి జలధార వెలువడి అక్కడ ఒక నీటి కొలను ఏర్పడింది. ఆ తటాకంలో స్నానం చేసి అనుష్టానాలు తీర్చుకోవాలనుకున్న కశ్యప ముని తన వొంటిపై వున్న నార వస్త్రాలను గట్టున పెట్టి నీటిలోకి దిగాడు. స్నానం ముగించుకుని వొడ్డుకు చేరేసరికి, అక్కడ వొదిలి వెళ్ళిన వస్త్రాలు కనిపించలేదు. ఒక పాకీస్తానీ జాతీయుడు కశ్యప ముని వస్త్రాలను అపహరించుకు పోయాడు....”

భారత ప్రతినిధి ప్రసంగానికి పాక్ ప్రతినిధి అడ్డుతగిలాడు.

అంత పురాతన కాలంలో పాకిస్తాన్ అన్నదే లేదు. ఇక మా జాతీయుడొకరు ముని వస్త్రాలను దొంగిలించాడని చెప్పడం భారత వాదనలోని డొల్లతనాన్ని సూచిస్తోంది.”

అదే నేను కూడా చెబుతున్నాను. కాశ్మీర్ భారత దేశంలో ఎప్పటినుంచో అంతర్భాగం అన్న విషయాన్ని పాక్ ప్రతినిధి కూడా తెలిసో తెలియకో ఇప్పుడు అంగీకరించారు.”

ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఈ చర్చను ఆలకిస్తున్న మిగిలిన దేశాలవాళ్ళు భారత ప్రతినిధి చేసిన ముగింపు వ్యాఖ్యకు ఒక్కసారిగా గొల్లుమన్నారని వేరే చెప్పనక్కరలేదు. (05-08-2021)

4, ఆగస్టు 2021, బుధవారం

పోట్లాడే పురోహితుడు – భండారు శ్రీనివాసరావు

 

‘‘ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి’ అన్నారు. అంటే ఒక బ్రాహ్మణుడు శాపం ద్వారా కానీ, శరం ద్వారా కానీ యుద్ధం చేయగలుగుతాడు.

అయితే ఈనాటి ఈ వ్యాస ప్రేరకుడు అయిన బ్రాహ్మణుడు యుద్ధాలు చేసేవాడు కాదు, శాపాలు పెట్టేవాడూ కాదు. కేవలం సంభావనల దగ్గర పోట్లాటకు దిగేవాడు. అదీ ఆయన అడిగినంత సంభావన ఇవ్వకపోవడం వల్ల కాదు, మనం ఇచ్చే సంభావన ఆయనకు నచ్చకపోవడం వల్ల.

ఇందులో విశేషం ఏముంది?

చాలా సందర్భాలలో విన్నదే కదా అనుకోవచ్చు. కానీ ఈ పురోహితులవారి తరహానే వేరు. అందుకే ఆయన గురించి రాయాలని అనిపించింది.

వీరి పేరు ఇంగువ వెంకయ్య గారు. మా స్వగ్రామంలో మా ఇంటి పురోహితులు. శుభాశుభ కార్యక్రమాలన్నింటికీ ఆయనే బ్రహ్మ. మా అక్కయ్యల పెళ్ళిళ్ళు, మా పెద్దన్నయ్య పెళ్లి, ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు, మా రెండో అన్నయ్య పెళ్లి ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు, మా మూడో అన్నయ్య పెళ్లి ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు ఆయనే దగ్గరుండి శాస్త్రోక్తంగా జరిపించారు. నా పెళ్లి నేనే చేసుకున్నా కాబట్టి ఆయన గారికి ఛాన్స్ దొరకలేదు. మా ఇంట్లో ఇన్ని పెళ్ళిళ్ళు చేయిస్తూ ఆయన తన పెళ్లి మాట మరచిపోయారేమో అలాగే చివరి వరకు ఘోటక బ్రహ్మచారిగానే వుండిపోయారు.

మనిషి మంచివాడే కానీ ఈయనతో రెండు సమస్యలు. అది వ్రతం కానీ, వడుగు కానీ, ఆబ్దీకం కానీ మొత్తం క్రతువు శాస్త్ర ప్రకారం జరిపించాల్సిందే. తూతూ మంత్రం వ్యవహారం కాదు. పూర్తిగా అంతా పద్దతి ప్రకారం చేయాల్సిందే. గంటలు గంటలు సాగే ఈ తంతు చూస్తూ బీపీలు, సుగర్లు వున్నవాళ్ళకు కళ్ళు తిరిగిపోయేవి. ‘అయ్యా వెంకయ్య గారూ, అందరూ పెద్దవాళ్లు, భోజనానికి ఆగలేరు, కాస్త త్వరగా లాగించండి’ అని మొత్తుకున్నా ఆయన వినిపించుకునే రకం కాదు.

మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి కొడుకు పెళ్ళి హైదరాబాదులో జరిగితే ఆయనే వచ్చి చేయించారు. వడుగు ముందు ఇంట్లో చేసుకుని తర్వాత కళ్యాణ మంటపానికి వెళ్ళాలి. వెంకయ్య గారు తెల్లవారుఝామునే వడుగు కార్యక్రమం మొదలెట్టారు. బారెడు పొద్దెక్కినా వడుగు తంతు సాగుతూనే వుంది. అవతల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. కానీ వడుగు ఓ పట్టాన తెమిలేలా లేదు. సాధారణంగా సంయమనం కోల్పోని మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు ఇక ఉండబట్టలేకవెంకయ్యగారు మీరు ఇక్కడ వడుగు చేస్తూనే వుండండి, ఈలోపల మేము వెళ్లి ఆ పెళ్లి పని ముగించుకుని వస్తాం’ అనేసారు.

ఇక సంభావన దగ్గరికి వచ్చేసరికి వస్తుంది అసలు తంటా. ఇక్ష్వాకుల కాలం నాటి రేట్ల ప్రకారం పదో పరకో చాలనే తత్వం ఆయనది. (ఈ కధాకాలం ముప్పయ్యేళ్ళ నాటిది) తమతమ విభవానికి తగ్గట్టు ఎవరైనా వేయి నూట పదహార్లు ఇవ్వబోయినా ఆయన తీసుకోరు. తను తీసుకునే నూట పదహారు రూపాయలు లెక్కకట్టి తీసుకుని మిగిలిన డబ్బు గృహస్తుకు ఇచ్చేసి వెడతారు. కాదుకూడదు అంటే వస్తుంది తంటా. చూసేవారికి ఆయన అడిగినంత వీళ్ళు ఇవ్వడం లేదేమో, అందుకే పొట్టు పొట్టవుతున్నారు అని అపోహ పడే ప్రమాదం కూడా వుంది.

వెంకయ్య గారికి సంభావన ఇచ్చే వేళయింది. అందరూ లేచి అడ్డంగా నిలబడండి, ఆయనగారు సంభావన తీసుకోకుండా వెళ్ళిపోతారేమో” అని మా మూడో అన్నయ్య వెంకటేశ్వర రావు గారు అంటుండేవారు హాస్యోక్తిగా.

మా రెండో అన్నయ్య కుమారుడి పెళ్ళిలో సంభావన కింద మా అన్నగారు ఐదువేల నూట పదహార్లు ఇద్దామనుకుని కూడా వెంకయ్య గారితో తంటా ఎందుకని వేయి నూటపదహార్లు తాంబూలంలో పెట్టి ఇచ్చారు. ఆయన అది చూసి నాకు నూట పదహార్లు చాలు అని మిగిలిన డబ్బు తిరిగి ఇవ్వబోయారు. ‘మా తృప్తి కొద్దీ ఇస్తున్నాం. కాదనకండి’ అని మా అన్నయ్య ఆయనకు నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తే వెంకయ్య గారు ఇలా అన్నారు. ‘లడ్డూలు రుచిగా వున్నాయని ఐదో ఆరో తినం కదా! సంభావన కూడా అంతే. నేనెంత తీసుకోవాలో అంతే తీసుకుంటాను’ ఇదీ ఆయన వరస.

గోదానాల వల్ల లభించిన ఆవులతో వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ వుండేది మా చిన్నప్పుడు. వాటిని మేపే శక్తిలేని వెంకయ్య గారి ఇంట ఆ కళకళలు ఎన్నాళ్ళు వుంటాయి. వాటిని అమ్మేయడానికి శాస్త్రం ఒప్పుకోదు. వాటిని పుష్టిగా మేపడానికి ఆదాయం సరిపోదు. అయినా సరే వెంకయ్య గారు తను నమ్మిన సిద్దాంతానికే జీవితాంతం కట్టుబడే వున్నారు. తన సంపాదనలో కొంత ఆవుల మేతకు ఖర్చు చేసేవారు. నోట్ల రూపంలో వచ్చే సంభావనలు మినహాయిస్తే నాణాలుగా వచ్చిన వాటిని ఖర్చుచేయడం వారి ఇంటా వంటా లేదు. చిల్లర డబ్బుల రూపంలో వచ్చిన సంభావనలు అన్నీ ఓ రేకు డబ్బాలో పడేసేవారు. వేయి రూపాయలుకు సరిపడా చిల్లర పైసలు ఆయన దగ్గర దొరుకుతాయని వూళ్ళో చెప్పుకుకుని నవ్వుకునేవారు.

(కింది ఫోటో: 1985లో మా పెద్దన్నయ్య పెద్ద కుమారుడు రఘు వివాహం, తర్వాత వ్రతం చేయిస్తున్న వెంకయ్య గారు)



ఢిల్లీలో ఉక్కు పిడికిలి.. కేంద్రం కదిలేనా


https://youtu.be/7NxiDn5NGiI