4, ఆగస్టు 2021, బుధవారం

జర సోచో! – భండారు శ్రీనివాసరావు

 ఓ మూడేళ్ల క్రితం మా ఇంటికి చందా కట్టి తెప్పించుంటున్న ఒక  హిందూ ఆధ్యాత్మిక మాస పత్రికలో ఒక స్వామి వారు ప్రవచించిన శ్లోకం ఇది.

“అశ్వోనైవ, గజోనైవ, సింహో నైవచ నైవచ, అజాపుత్రం బలింధత్తే

దేవో దుర్బల ఘాతకా:"

గుర్రాన్ని, ఏనుగును బలి ఇవ్వరు. సింహాన్ని బలిచ్చే ఆలోచన కూడా చేయరు. కానీ మేకపిల్లను మాత్రమే బలిస్తారు. దేవతలు సైతం దుర్బలుల్నే వేధిస్తారని తాత్పర్యం.

ఇందులో కొందరికి జగన్ కనబడ్డాడు. మరి కొందరికి రాజకీయం కనబడింది. ఇంకొందరికి ఏకంగా మతమే కానవచ్చింది.

ఇలా మనం సంకుచితంగా ఆలోచిస్తూ పోతుంటే కొన్నాళ్ళకి ఒక మంచి మాట చెప్పలేము. ఒక మంచి శ్లోకాన్ని వినలేము. ఒక సుభాషితాన్ని పలకలేము.  

నేను రాస్తున్న వాటిపై కొందరుపెడుతున్న వ్యాఖ్యలు చదువుతుంటే వారి విజ్ఞానానికి జోహార్లు చెప్పాలని అనిపిస్తుంది. నా అజ్ఞానానికి సిగ్గుపడాల్సివస్తోంది. ఏదిఏమైనా ఈ వయస్సులో మరికొన్ని కొత్త అక్షరాలు దిద్దుకోవడానికి ఇది సరికొత్త "పలకాబలపం" అనిపిస్తోంది. అందరికీ ధన్యవాదాలు.

(04-08-2021)

జర్నలిష్టులతో జర జాగ్రత్త - భండారు శ్రీనివాసరావు

 

(సుప్రసిద్ధ పాత్రికేయులు, కీర్తిశేషులు ఆర్.జే. రాజేంద్రప్రసాద్ ' డేట్ లైన్ ఆంధ్ర', 'వీచిన ప్రాంతీయ పవనాలు' అనే పేరుతొ రాసిన రెండు పుస్తకాలు, కొన్ని దశాబ్దాల రాష్ట్ర రాజకీయాలను మన కళ్ళముందు వుంచుతాయి. హైదరాబాద్ హిందూ ఎడిషన్ రెసిడెంటు ఎడిటర్ గా, ఆ పత్రిక న్యూస్ బ్యూరో చీఫ్ గా గడించిన అనేక సంవత్సరాల అనుభవంతో రాసిన ఈ పుస్తకాల్లో ఒక నిబద్ధత కలిగిన పాత్రికేయ దృక్కోణం కానవస్తుంది. ఈ గ్రంధాలలోనుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు)

డాక్టర్ చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు (కాంగ్రెస్ పార్టీలో) అసమ్మతి కార్యకలాపాలు ఉధృతంగా ఉండేవి. తనను అభిమానించే అనుచరులతో తన గదిలో కూర్చుని వాళ్ళతో జోకులు వేస్తూ కాలాన్నే మరచిపోయేవారు. ఆయనను చూడడానికి వచ్చిన జనం బయట కిక్కిరిసి వుండేవారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉప కార్యదర్శి తనని చూడడానికి వస్తే ప్రధాన కార్యదర్శిని ఉడికించడానికా అన్నట్టు ఆయన్ని బయట వెయిట్ చేయించి ముందు ఆయన జూనియర్ అయిన ఉప కార్యదర్శిని లోపలకు రమ్మనేవారు.

“ 1978 లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కేంద్రంలో ఇందిరాగాంధి అధికారంలో లేరు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఐ) తన ఆర్ధిక అవసరాలకోసం ఆంధ్రప్రదేశ్, కర్నాటకల్లోని కాంగ్రెస్(ఐ) ప్రభుత్వాలపై ఆధారపడింది. చెన్నారెడ్డి క్రమం తప్పకుండా ఢిల్లీకి డబ్బు పంపేవారు. దీనివల్ల ఆయనకూ చెడ్డపేరు వచ్చింది. (చెడు వార్తలు రాకుండా) పత్రికలను మేనేజ్ చేసేందుకు అనేకులు రంగంలోకి దిగారు. మంత్రి సరోజినీ పుల్లారెడ్డి సచివాలయంలోని ప్రెస్ రూముకు వచ్చి’విలేకరులు క్యాంటీన్ లో డబ్బు పెట్టి కాఫీ తాగడం ఏమిటి’ అంటూ ‘విలేకరులకు రోజూ అతిధిమర్యాదలు జరగాల’ని ఆదేశించారు. (పనిచేసే) విలేకరులు సంబరపడిపోలేదు కాని, గుర్తింపు పత్రాలు వుండి యే పత్రికకు వార్తలు రాయని జర్నలిస్టులు మాత్రం మంత్రి ఔదార్యాన్ని వాడుకున్నారు.

ఇలా వుండగా ఢిల్లీ నుంచి సండే మ్యాగజైన్ విలేకరి చెన్నారెడ్డి గారిపై వ్యాసం రాయడానికి హైదరాబాదు వచ్చారు. అతిధి గృహంలో బస, తిరగడానికి కారు, తోడుగా ఒక అధికారి ఇలా నాలుగు రోజులపాటు రాష్ట్రంలో విలాసవంతంగా తిరిగి, ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసి ఆయన గారు ఢిల్లీ వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తే వార్త ఆదివారం నాడు ఆ పత్రికలో వస్తుందని అంతా అనుకున్నారు. అన్నట్టుగానే ఆ పత్రికలో వార్త వచ్చింది. కానీ అనుకున్నట్టుగా రాలేదు. ముఖచిత్రంపై చెన్నారెడ్డి ఫోటో వేసి ‘చెన్నారెడ్డి! మోస్ట్ కరప్ట్ సీఎం!’ అని శీర్షిక పెట్టారు. వ్యాసరచయిత తాను హైదరాబాదులో విమానాశ్రయం నుంచి ఆటోరిక్షాలో ఓ మధ్యతరగతి హోటల్ కు వెళ్లానని, డ్రైవర్ మీటర్ పై అయిదు రూపాయలు అదనంగా డిమాండ్ చేసాడని, అదేమిటని అడిగితె ముఖ్యమంత్రికి తాను కమీషన్ ఇవ్వాలని చెప్పాడని పత్రికలో రాసాడు.”

 

2, ఆగస్టు 2021, సోమవారం

జల జగడం.. తేలేనా..?


https://youtu.be/-j8RRIdCjro

కలుసుకుంటే అదో సుఖము

 ఆదివారం తర్వాత ఈ రోజంతా  స్తబ్దుగా వుండిపోయాను.

నిన్న మధ్యాన్నం పరకాల సుధీర్  గారింటి లోపలకు  అడుగుపెడుతున్నప్పుడు ఎలాగో అనిపించింది. దాదాపు మూడేళ్లు కావస్తోంది నేను వేరేవారి ఇంటికి  అలా ఒంటరిగా వెళ్లి.  

ఆ సాయంత్రం పరకాల గారింటి నుంచి బయటకు వస్తుంటే మనసు ఖాళీగా అనిపించింది. అదేమిటో చిత్రం, మనసు తేలిక పడ్డట్టుగా కూడా అనిపించింది. నా మనసు ఖాళీగా అనిపించడానికి కారణం, పాత స్నేహితులం అందరం ఒక్కచోట ఇలా కలిసి అలా విడిపోవడం. మనసు తేలిక కావడానికి కారణం, ఇన్నేళ్ళ తర్వాత అందరం ఇలా కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం.

మనుషులు మనుషులు కలవడం కూడా ఒక అపూర్వంగా చెప్పుకునే రోజులు వస్తాయని ఏనాడూ అనుకోలేదు.

ముప్పయ్యేళ్ల క్రితం నేను రేడియో మాస్కోలో పనిచేసే రోజుల్లో మాస్కోలోని ఇండియన్ ఎంబసీలో పనిచేసిన  నేవల్ కమాండర్లు సుధీర్ పరకాల, ఆయన భార్య  రమా పరకాల, దాసరి రాము, ఆయన భార్య అమ్మాజీ రాము, స్టీల్ అధారిటీ తరపున పనిచేసిన ఇంజినీర్ కే.వీ. రమణ, భార్య  త్రిలోచన రమణ, హిందూస్తాన్ ఏరో నాటిక్స్ తరపున పనిచేసిన  శ్రీధర్ కుమార్, ఆయన భార్య  విశాల శ్రీధర్ కుమార్ నిన్న స్నేహితుల దినోత్సవం రోజున సికిందరాబాదు ఆర్మీ ఏరియా దాటిన తర్వాత ఒక సివిలియన్ కాలనీలో నివాసం ఉంటున్న  పరకాల సుధీర్, రమ దంపతుల ఇంట్లో కలుసుకున్నాం. ఓ నాలుగ్గంటల పాటు సాగిన కాలక్షేప సహిత భోజన కార్యక్రమంలో పాత కబుర్లు అనేకం  కలబోసుకున్నాం.

దాదాపు రెండేళ్లుగా తెలిసిన వారితో, తెలియని వారితో ఫోన్లో మాట్లాడడం తప్ప ముఖతః మాట్లాడుకున్నది చాలా చాలా తక్కువ.

కరోనా కాలానికి ముందు, మా ఆవిడ జీవించివున్న రోజుల్లో మాస్కో మిత్రుల కలయికలు చాలా తరచుగా జరుగుతూ ఉండేవి. ఎందుకంటే వీరందరికీ, మాస్కోలో, ఇక్కడా కూడా దండలో దారంగా వుండేది  నా శ్రీమతి నిర్మల.  




(02-08-2021)

1, ఆగస్టు 2021, ఆదివారం

"మన రేడియో, మా రేడియో, నా రేడియో"

 

ఒక ఏడాది రేడియో దినోత్సవం రోజున :

అయిదేళ్ళ క్రితం కాబోలు నా మితృడు జర్నలిస్ట్ డైరీ సతీష్ రూపొందించిన వీడియోలో నేను.
'రేడియో కార్మికుడు' అని నన్ను పరిచయం చేసిన సతీష్ సహృదయతకు నా ధన్యవాదాలు.


(28) Journalist Diary Nov 12th 2013 Part 1 - YouTube

సూటిగా .... సుతిమెత్తగా...

 బుడుగును 'బుడుగూ' అని పిలుస్తారు బాపూరమణలు

'బుడ్గూ' అంటాడు గోపాళం

'హారి బుడుగు కన్నా' అంటుంది వాళ్ళమ్మ

'బుడుగా ఏంటి అసహ్యంగా మడుగూ బుడుగూ. పేరు లేదా ఆయ్' అంటాడు అగ్నిహోత్రావధాన్లు

'బుడుగు అసలు పేరు చాలా పొడుగు. అందుకే బుడుగూ అంటాం వాయ్' అంటాడు రమణగారి జోకుకి కాపీరైట్ తీసుకుంటూ గిరీశం 

'ఏంది గురూ ఈ పేర్ల గోల' అంటుంది సీగానపెసూనాంబ

శాల్తీ ఒక్కడే. పేర్లు అనేకం. బుడుగన్నా, కన్నా అన్నా, ఏం గురూ అన్నా, ఏ పేరు పెట్టి పిలిచినా, అసలు ఏపేరు పెట్టకుండా అరేయ్ ఒరేయ్ అని పిలిచినా ఎంచక్కా పలుకుతాడు బాపూరమణల బుడుగు.

అలానే దేవుడు! 

దేవుడికి కావాల్సింది నమ్మకం. దేవుడున్నాడనే నమ్మకం. నిజం చెప్పాలంటే నమ్మకానికి మరో పేరే దేవుడు. అందుకే అంటారు 'తొక్కితే రాయి, మొక్కితే సాయి'

దేవుడి పేరుపెట్టి మనుషులు ఘోరాలు చేయకుండా కనిపెట్టి చూసుకుంటే మిగిలినవన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు.

దేవుడు పేరు చెప్పి సొమ్ములు పోగేసుకుంటున్నారని నాస్తికులు ఆరోపిస్తుంటే, దేవుడు లేడని చెబుతూ డబ్బులు దండుకుంటున్నారని వారి ప్రత్యర్ధులు అంటుంటారు.

'దేవుడున్నాడా వుంటే చూపించు' అనే మాటలన్నీ పనికిమాలిన పలుకులు. 'దేవుడే అన్నీ చూసుకుంటాడు' అని, అన్నీ ఆయనకే ఒదిలి చాప చుట్టేయడం ఇంకా పనికిమాలిన పని.

దేవుడు లేడని ఆయన్ని నమ్మనివాళ్ళంటారు.

వున్నాడని నమ్మేవాళ్ళంటారు.

దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నట్టే, దేవుడ్ని నమ్ముతున్నా నమ్మనట్టు బూకరించడం వల్ల కూడా కొన్ని లాభాలు వున్నాయి. ఈ రెండు తరగతులవారు నిత్యం అందరికీ తారసపడుతూనే వుంటారు కాబట్టి వీరు కనబడడం కోసం ప్రత్యేకంగా తపస్సులు చేయనక్కరలేదు. ఏదో ఒక అంశంపై టీవీ తెరలపై అనునిత్యం దర్శనం ఇస్తూనే వుంటారు.

వీరుకాక మరో రెండు తరగతులవారు వున్నారు. దేవుడే సాక్షాత్తు దిగివచ్చినా దేవుడ్ని నమ్మని వారు ఒక బాపతు. కానీ ఆ విషయం పైకి టముకు వేసుకోరు. మనసా వాచా కర్మణా పూర్తిగా  దేవుడిని నమ్మేవారు రెండో రకం. వీరు కూడా తాము నమ్మే భగవంతుడిని బజారుకు లాగరు. గుండెల్లోనే గుడికట్టుకుని వుంచుకుంటారు. టీవీ ఛానళ్ల వారికి కూడా వీరి అయిపూ ఆజా పట్టదు. ఎందుకంటే వారి రేటింగులకు కావాల్సినట్టు దేవుడు గురించి ఎద్దేవాగా మాట్లాడడం, దేవుడికోసం పోట్లాడడం వీరికి, వారికి బొత్తిగా తెలియదు కాబట్టి.

దేవుడున్నాడో లేదో కానీ దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న మాత్రం అనాదినుంచి వుంటున్నదే. ఆస్తికులు, నాస్తికుల మధ్య దేవుడిని గురించిన చర్చ కూడా అనాదినుంచి సాగుతున్నదే. ఈ ఎడతెగని చర్చకు దేవుడి మాదిరిగానే అంతం అంటూ లేదు.

వ్యర్దవాదాలు మాని ఎవరి పని వారు చూసుకుంటే అందరి పని ఆ దేవుడే చూసుకుంటాడు. ఆ మాటకూడా ఆయనే చెప్పాడు గీతలో. ‘మీ పని మీరు చేయండి, ఫలితాన్ని నాకు వదిలేయండి’ అని.

నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు మరొకడు వున్నాడని ఒప్పుకోవడానికి నామోషీ పడనక్కరలేదు. ఇతరులలోని గొప్పదనం గుర్తించేవారు, వారు నాస్తికులయినా సరే, సర్వశక్తి కలిగిన ఓ అగోచర శక్తి ఒకటి  వుండేవుంటుందని  అనుకుంటే పేచీ లేదు. అలాగే దేవుళ్ళని నమ్మేవాళ్ళు కూడా. భగవంతుడు వున్నాడని పూర్తిగా విశ్వసించే గజేంద్రుడే మొసలినోట చిక్కి విలవిలలాడుతున్నప్పుడు, ‘కలడు కలండనెడివాడు కలడో లేడో?’ అని అనుమానపడతాడు. పరీక్ష పెట్టికానీ మార్కులు వేసే అలవాటులేని ఆ దేవదేవుడు పందొమ్మిదో రీలు తరువాత కానీ ఏనుగు రక్షణకు రాడు.

ఒక్కోసారి దేవుళ్ళను చూస్తే జాలి వేస్తుంది. వాళ్లు చెప్పిన మాట వాళ్ల భక్తులు కూడా వినరు. బుద్దుడు విగ్రహారాధన వద్దంటే శిష్యులు ఆ మాట వింటేనా. బహుశా అంతంత పెద్ద విగ్రహాలు ప్రపంచంలో మరే దేవుడుకి లేవేమో. (బుద్దుడు దేవుడా అంటే అది మరో చర్చ)

‘నేను సర్వవ్యాపితుడిని. ఎందెందు వెదకి చూసిన అందందే వుంటాన’ని ఎంత మొత్తుకున్నా వినేదెవరు?

‘చెట్టులో, పుట్టలో అంతటా నేనే’ అన్నా చెవినపెట్టే దెవరు? చిన్నదో పెద్దదో ఓ గుడికట్టి అక్కడే కట్టిపడేశారు.

గుడిలో  ఆయన్నికొలువుంచినంతమాత్రాన ఆయన అక్కడే వుండిపోడు. ‘ఇక్కడ వుండే పాండురంగడు అక్కడ వున్నాడు’ అన్నట్టు దేవుడు మందిరంలో ఉంటాడు, నమ్మిన వారి మనోమందిరంలోను ఉంటాడు. మరి ప్రత్యేకంగా ఆయనకు ఓ గుడి ఎందుకు అనే ప్రశ్న వస్తుంది తప్పదు.

దేవుడిమీద గురి కుదరడం కోసం గుడి. ప్రశాంత, ఆధ్యాత్మిక  వాతావరణంలో దేవుడి మీద ఏకాగ్రత నిలుపుకోవడం కోసం. ఆయన అక్కడ వున్నాడు అనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు వెళ్లి ఓ దండం పెట్టుకుంటాం.

అసలు గుడి రహస్యం వేరే వుంది అనేవారి  వాదన వేరు.  

మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే పరమ పాతరోజుల్లో పులిహారో, పాయసమో చేసి గుడికి వచ్చిన జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం.

ఆ పాతకాలపు రోజుల్లో పల్లెల్లోని వయోవృద్దులకు, అభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం. ఈ రోజుల్లో ప్రభుత్వాలు అలాటి పేద వృద్ధులకు నెలకు ఇంత అని డబ్బు చెల్లించి తమ బాధ్యత దులుపుకుంటున్నాయి. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని, వంటావార్పూ సొంతంగా చేసుకోలేని ఆ అభాగ్యులకు పైకం చేతిలో పెడితే ఏం ప్రయోజనం. వండి వార్చేవాళ్ళు లేని నిస్సహాయులకు గుడిలో ప్రసాదంగా లభించే పులిహారో, దద్దోజనమో, దాన్నిమించింది ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి. మరి ఇప్పుడో! ఓ పక్క పేదలకు ఉచితంగా పంచాల్సిన ప్రసాదాలను అమ్ముకుంటూ, మరో పక్క వీ.ఐ.పీ.ల సేవలో తరిస్తున్నాయి.

ఈరోజుల్లో చదువుకునే పిల్లలకు ప్రభుత్వాలు ఎంతో డబ్బు ఖర్చు చేసి మధ్యాహ్న భోజన పధకాలు అమలు చేస్తున్నాయి. పూర్వపు రోజుల్లో ప్రభుత్వాలపై భారం లేకుండా దేవాలయాలే ఈ పని చూసుకునేవి. నిలవవుండే పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన మధ్యాహ్న భోజనం ఏముంటుంది.

అలాగే గుడి అనేది తెలియని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చే బడి కూడా. వూరి జనం నలుగురూ అరమరికలు లేకుండా ఒకచోట కలుసుకోవడానికి గుడిని మించిన సామాజిక వేదిక  వేరేమివుంటుంది. పంచాంగ శ్రవణం పేరుతొ  వానలు ఎలా పడతాయి, ఏ పంటలు వేసుకుంటే గిరాకీ వుంటుంది అనే వివరాలు తెలిసేవి. వాటిని నమ్మొచ్చా అంటే మరి ఆ రోజుల్లో పంచాంగమే వారికి గూగులమ్మ. గుడి పూజారే చిన్నాచితకా రోగాలను నిదానం  చేసే వైద్యుడు. వాళ్లకు వైద్యం ఏమి తెలుసు ఇది పూర్తిగా అనాగరికం అంటే మరి  ఆ పల్లె జనం ఏం చేయాలి? ఎక్కడకు పోవాలి? చదువుకున్న డాక్టర్లు పల్లెటూళ్ళకు పోరు. ఊరిజనం పట్నాలకు పోలేరు, అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అనే నానుడి లాగా. 

    

గుడి అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గుడిలో ఏముందీ అని వ్యంగ్యంగా పాటలు పాడుకునే అవసరం వుండదు.

అయితే, ప్రతిదీ రాజకీయమయమయిపోతున్న ఈ రోజుల్లో ఇది సాధ్యమా అంటే అనుమానమే. 

ఇక్కడ గుడి అంటే దేవాలయం మాత్రమే కాదు, అది ఒక మసీదు కావచ్చు, ఒక చర్చి కావచ్చు, ఒక గురుద్వారా కావచ్చు. మరో మతానికి చెందిన దైవ మందిరం కావచ్చు.

అవి ఏవైనా, నెరవేర్చే సామాజిక బాధ్యత మాత్రం ఒక్కటే.

కాబట్టి దేవుడ్ని గుడికి పరిమితం చేయవద్దు. గుడిని పెత్తందార్లకు వదిలేయవద్దు.

(ఈరోజు ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)


Clipping of Andhra Prabha Telugu Daily - Hyderabad Main (prabhanews.com)