27, మే 2021, గురువారం
మహానాడు
జవహర్లాల్ నెహ్రూ, కొన్ని జ్ఞాపకాలు
ఈరోజు భారత ప్రధమ ప్రధాని నెహ్రూ వర్ధంతి. 1964 మే 27 న పండిత జవహర్ లాల్ నెహ్రూ పరమపదించారు. ఆ వార్త తెలిసిన దేశప్రజానీకం శోకాబ్దిలో మునిగిపోయింది.
26, మే 2021, బుధవారం
పోలేదు, వున్నారు
“కవికుల పరమేష్టి బిరుదాంకితులు, బహు గ్రంధ రచయిత, వివిధ సాహితీ ప్రక్రియలతో పాఠకులను ఎంతో కాలంగా అలరిస్తున్న సాహిత్య ద్రష్ట, సరికొత్త శైలితో మహిళా పాఠకురాళ్ళను అమితంగా ఆకట్టుకున్న ప్రతిభాశాలి అయిన శ్రీ ఏకాంబరం తన యాభయ్యో ఏట గత సాయంత్రం....”
ఇలా అనంతంగా సాగుతున్న వార్తాప్రసారాన్ని వింటూ ఒక శ్రోత పక్క శ్రోతను అడిగాడు., పోయాడా ఏమిటి అని. ఆయన జవాబు ఇచ్చేలోగా సమస్యాపూరణం పూర్తి చేశాడు ఆ న్యూస్ రీడర్.
“.....నగరంలో కన్నుల పండువగా జరిగిన ఓ కార్యక్రమంలో పలు సాహితీ సాంస్కృతిక సంస్థల
నుంచి ఘన సన్మానం పొందారు”
గతంలో రేడియో వార్తల మీద ఇలాంటి జోకులు
పేల్చేవాళ్ళు.
నీతి: పుట్టిన రోజయినా, మరోటి అయినా సూటిగా చెప్పడం మంచిది. ఈ కరోనా కాలంలో
మరీ అవసరం.
(26-05-2021)
గురు దక్షిణ
స్వాతంత్రానంతరం పంచవర్ష ప్రణాళికల ధర్మమా అని దేశంలో, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో కొత్త సర్కారు కొలువులు పుట్టుకొచ్చాయి. అప్పటి వరకు గ్రామీణులకు తెలిసిన ఉద్యోగాలు కొన్ని మాత్రమే. తహసీల్దారు, మునసబు, కరణం, పోస్టు మేష్టారు, బడి పంతులు వగైరా.
తరవాత్తరవాత బీడీవో, ఆయన కింద రకరకాల ఎక్స్ టెన్షన్ అధికారులు. పేరులో అధికారి అని
వున్నా నిజానికి అవి గుమాస్తా వంటి చిన్న ఉద్యోగాలే. వాటిని తెలుగులో
విస్తరణాధికారి అంటున్నారు. అలాంటి వాటిల్లో ఒక దాంట్లో మా రెండో అన్నయ్య కూడా ఖమ్మం జిల్లాలో చేరాడు.
తదనంతర కాలంలో ఆయన స్టేట్ బ్యాంక్ పీవోగా సెలక్ట్ అయి ఆ బ్యాంక్ చీఫ్ జనరల్ గా
రిటైర్ అయ్యారు.
గ్రాడ్యుయేషన్ కాగానే మా అన్నయ్య చేసిన
ఉద్యోగాల్లో బ్లాక్ ఎస్.ఈ.వొ., ఒకటి. ఆ రోజుల్లో పంచాయతి సమితిని బ్లాక్ అనేవారు.
అంతకు ముందే ఒక పెద్ద మనిషి మధిర ప్రాంతం నుంచి కొత్తగూడెం వెళ్లి అక్కడ పంచాయతీ
సమితిలో ఇలాంటి ఉద్యోగంలోనే చేరారు. ఆయనే ఈ పోస్టుకు కథానాయకుడు. పేరు చేకూరి
కాశయ్య. స్వయం కృషికి మారుపేరు. కొత్తగూడెం సమితిలో పనిచేసింది కొద్ది కాలమే
అయినా, అయన పనికట్టుకుని ఊరూరూ తిరిగారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా స్థానికులతో
చక్కటి పరిచయాలు పెంచుకున్నారు. స్వతహాగా నలుగురితో కలిసిమెలిసి తిరిగే మనస్తత్వం
కావడం వల్ల అతి త్వరగా అన్ని గ్రామాల్లో కాశయ్య గారి పేరు తెలవని వాళ్ళు అంటూ
లేకుండా పోయారు.
ఇంతలో పంచాయతీ సమితి ఎన్నికలు వచ్చాయి. వెంటనే
ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి సమితి ప్రెసిడెంట్ కాగలిగారు. ఇది
కేవలం ఆయన స్వయం కృషి.
ఆ రోజుల్లో విల్లీస్ జీపులు ఉండేవి. జిల్లా
మొత్తంలో కొద్ది మంది అధికారులకే వాహన యోగం. వారిలో ఒకరు డీ.పీ.ఆర్.వొ. కాకపొతే ఉద్యోగ అవసరాల దృష్ట్యా జీపు బదులు
పెద్ద వ్యాన్ వుండేది. (మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారి కెరీర్ ఈ ఉద్యోగంతోనే
మొదలయింది. తదనంతర కాలంలో అదే శాఖకు అంటే సమాచార, పౌర సంబంద శాఖకు డైరెక్టర్ అయ్యారు) మరొకరు బ్లాక్ డెవలప్ మెంటు ఆఫీసర్
(బీ.డి.వొ). ఆయన దౌరాకు బయలుదేరి జీపు ఎక్కగానే బిలబిల మంటూ కింది ఉద్యోగులు జీపు
వెనక సీట్లలో సర్దుకు కూర్చొనే వారు.
మొన్న మొన్నటిదాకా కాశయ్య గారు కూడా అలా ఎగబడి
తోసుకుని వెనక సీట్లో ఇరుక్కుని కూర్చుని ప్రయాణాలు చేసిన వారే. కానీ ఆయన ఇప్పుడు
సమితి ప్రెసిడెంటు. ఆ హోదాలో ఆయన సీటు ముందుకు మారింది. ఆయన ఎంత నిరాడంబరజీవి అంటే
ఇటువంటి విశేషాలన్నీ ఆయనే తన సహచరులతో పంచుకునేవారు.
ఇక తర్వాత జిల్లా మొత్తానికి జిల్లా పరిషద్
చైర్మన్ అయ్యారు. తర్వాత ఎమ్మెల్యే. ఇలా అనేక మెట్లు ఎక్కినా ఆయన తన మూలాలని
మరచిపోలేదు. తనతో కలిసి పనిచేసిన, లేదా తనకు పరిచయం వున్న ప్రతి ఒక్కరినీ గుర్తు
పెట్టుకునేవారు. మనిషి మొహం చూసి బాగున్నారా అని పలకరించడం కాకుండా పేరు పెట్టి
పిలిచి మరీ ఆత్మీయత చూపేవారు.
ఉద్యోగ పర్వంలో అనేక ప్రాంతాలు తిరుగుతూ చెన్నై
స్టేట్ బ్యాంక్ సీ జీ ఎం గా వెళ్ళిన మా అన్నయ్య ఒకసారి ఓ వివాహ
వేడుక కోసం ఖమ్మం వచ్చారు. ఆ సమయంలో
రైల్వే ప్లాటు ఫారం మీద కాశయ్య గారు కనబడ్డారు.
ఆయన గబగబా దగ్గరకు వచ్చి ఏం
రామచంద్ర రావు గారు, ఎలా
వున్నారు, ఇప్పుడు
మద్రాసులో ఉన్నారట కదా!’ అని పలకరించేసరికి మా అన్నయ్య ఆశ్చర్యం అంతా ఇంతా కాదు.
పేరు గుర్తు ఉండడమే కాదు, తాను
ప్రస్తుతం ఏ వూళ్ళో వున్నది తెలిసింది అంటే తన పరిచయస్తులను గురించి ఆయన
కనుక్కుంటూ ఉంటారని ఆయనకు అర్ధం అయింది. ఉన్నత స్థానాలకు ఎదిగిన మనుషుల్లో ఇది చాలా అరుదనేది మా అన్నయ్య
అభిప్రాయం.
కొన్నేళ్ళ క్రితం ఖమ్మం వెళ్ళాను,
డాక్టర్ ఏ.పీ. రంగారావు గారితో కలిసి 104
పని మీద. ఖమ్మం వచ్చాము కదా అని ఫోన్ చేస్తే కాశయ్య గారు
వెంటనే మేమున్న గెస్ట్ హౌస్ కు వచ్చారు. మమ్మల్ని వెంటబెట్టుకుని వెళ్లి, ఖమ్మం ఔటర్ రింగ్ రోడ్డు అంటారేమో, దాన్ని దాటి వెళ్లి,
నిర్మాణంలో వున్న గురు దక్షిణ ప్రాంగణాన్ని చూపించారు. చాలా విశాలంగా చాలా
బాగా నిర్మిస్తున్నారు. అక్షరం ముక్క నేర్పి సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చి
దిద్దిన గురువులకు దక్షిణగా వారి శేష జీవితం సుఖ ప్రదంగా వుండడం కోసం కాశయ్య గారు తలపెట్టిన
బృహత్ పధకం అది.
ఆ వయసులో కూడా ఆయన పడుతున్న తపన, శ్రద్ధ చూస్తే ముచ్చటేసింది.
స్వయం కృషితో తాను అనుకున్నది సాధించి, ఎన్నో ఎత్తులకు ఎదిగి కూడా పాదాలను ఆన్చిన తల్లి నేలను మాత్రం మరచిపోని కాశయ్య గారికి నా అశ్రు నివాళి
(25-05-2021)
‘నా బలమా! నీ నామ బలమా!’
నాకు గంధర్వుల శాపం వుంది. అదేదో సినిమాలోలా
విన్నది వెంటనే నోట్ చేసుకుంటే తప్ప ఆ తర్వాత గుర్తుండదు.
నాకు అప్పుడప్పుడు మితృలు పాశం యాదగిరి,
ఆర్వీవీ కృష్ణారావు,
అమెరకా నుంచి వీవీ శాస్త్రి గారు, తరచుగా మా అన్నగారు రామచంద్రరావు ఫోన్లు చేస్తుంటారు. ఆ మాటల్లో
ఎన్నెన్నో పాత ముచ్చట్లు దొర్లుతుంటాయి. చాలా మంచి సంగతులు. వాళ్లకు రాయాలని తోచదు.
నాకు రాయకపోతే తోచదు. కానీ చెప్పాను కదా! పాడు మతిమరపు. వెంటనే రాసుకుంటే సరి.
లేకపోతె ఇంతే సంగతులు.
మొన్న రామజోగి మందు గురించి చెప్పిన కృష్ణారావు
గారు రాత్రి మళ్ళీ ఫోన్ చేశారు.
ఈసారి ఇదిగో ఈ నామ బలం గురించి చెప్పారు.
ఓసారి, అంటే అప్పుడెప్పుడో దశాబ్దాల కిందట మంగళంపల్లి బాల
మురళీ కృష్ణ గారు బెజవాడ వచ్చారు. యథావిధిగా ఇండియన్ మెడిసిన్ హౌస్ డి.ఎల్. నారాయణ
గారింట్లో మధ్యాన్న భోజనం. ఆ సాయంత్రం కచేరీ.
నారాయణ గారెకి ఆయుర్వేద వైద్యశాల వారసత్వంగా
వచ్చింది. వారి హయాములో మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లింది.
భోజనాల సమయంలో కృష్ణారావు గారు బాల మురళి గారెతో అన్నారు.
‘నారాయణ గారి చవులూరించే విందు, మరి వీనుల విందుగా మీ విందు మాత్రమే మిగిలింది’
ఈ మాటలు గుర్తుపెట్టుకున్నట్టుగా ఆ సాయంత్రం
కచేరీలో బాల మురళి గారు ఆనంద భైరవి రాగంలో ‘ నా బలమా! నీ నామ బలమా’ అనే త్యాగరాయ
విరచిత కీర్తన సుమధురంగా పాడారు. ఆయుర్వేద వైద్యంలో డి.ఎల్. నారాయణ గారి ఆనంద
భైరవి అనే ఔషధం వుంది. అలాగే కృష్ణారావు గారు అడిగిన వీనుల విందు లాంటి ఆనంద భైరవి
రాగం వుంది.
సరే ఇదలా ఉంచితే ..
ఒకానొక కాలంలో ఆయుర్వేద వైద్యం తెలుగునాట
విలసిల్లింది. చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయానికి ఆ రోజుల్లో వెయ్యి కోట్ల
టర్నోవర్ ఉండేదని చెప్పుకునేవారు. దాదాపు
ప్రతి గ్రామంలో ఆయుర్వేద వైద్యులు వుండే వాళ్ళు. మిస్సమ్మ సినిమాలో అల్లు
రామలింగయ్య పాత్ర అటు స్కూలు టీచరు, ఇటు ఆయుర్వేద వైద్యం. పిల్లల చేత మందులు అరగదీయించడం
గుర్తుండే వుంటుంది.
ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి గారెకి భవిష్యత్
వాణి తెలుసల్లె వుంది. ఆయుర్వేదానికి ముందు ముందు కాలం చెల్లిపోతుందన్న అనుమానం
కలిగిందేమో తెలియదు. దొంగ రాముడు సినిమాలో ఒక సన్నివేశం పెట్టారు.
చిన్న నాగేశ్వర రావు తల్లికి జబ్బు చేసి ప్రాణం
మీదకు వస్తే, ఆయుర్వేద వైద్యుడుగా వేసిన వంగర వెంకట సుబ్బయ్య రోగి నాడి పట్టి చూసి
ఒక మందు చీటీ రాసిచ్చి పట్రంమంటాడు. చిల్లి
కాణీ జేబులో లేకపోయినా చిన్న నాగేశ్వర రావు పరిగెత్తుకుంటూ ఆయుర్వేదం మందులు అమ్మే
షాపుకి పరిగెడతాడు. షాపు వాడు చీటీ చూసి
మందుల అలమరా తెరిచి, ఓ
సీసా తీసి దానిపై వున్న దుమ్ము ఉఫ్ అని ఊది పిల్లాడి చేతికి ఇస్తాడు. అంటే
ఆయుర్వేద మందులకు భవిష్యత్తులో గిరాకీ తగ్గి దుమ్ము కొట్టుకు పోతాయనే సంకేతం అందులో
ఉందంటారు కృష్ణారావు గారు.
పూర్వం పాసింజర్ రైళ్ళలో ఆయుర్వేదం మందులు అమ్మేవాళ్లు.
కస్తూరి మాత్రలు, సువర్ణ శూర్యావతి, పైత్యాంతక
రసం, కాశీ దారాలు, ఇత్తడి
పిన్నీసులు, పేల దువ్వెనలు వగైరా వగైరా.
ఒక పొడవాటి కర్రకు వీటిని వేలాడగట్టి అటూ ఇటూ ఊపుతూ రైల్లో తిరిగి అమ్మేవాడు.
వెనకటి రోజుల్లో వైద్యుడు అనేవాడు ముందు నాడి
పట్టి చూసేవాడు. వున్న ఊళ్ళో వైద్యం కనుక రోగుల శరీర తత్వం వాళ్లకి బాగా తెలుసు.
అందుకు తగ్గ మందులు కుప్పెల్లో అరగదీసి, కల్వంలో నూరి అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేవాళ్ళు.
ఇప్పుడు ఆయుర్వేదం వంటి దేశీయ వైద్య ప్రక్రియల్లో కూడా కార్పొరేట్ శక్తులు అడుగు పెట్టడంతో ఆకర్షణీయమైన
ప్యాకెట్లలో అవి కూడా ఇంగ్లీష్ అలోపతి మందుల్లాగా మార్కెట్లో విరివిగా దొరుకుతున్న
మాట వాస్తవమే అయినా,
అందులో భారతీయ ఆత్మ లోపిస్తోంది. రోగికీ, వైద్యుడికీ నడుమ ఉండాల్సిన సున్నితమైన అనుబంధం
చెరిగిపోతోంది. నాడి పట్టి చూడకుండానే చేసే వైద్యంలో డబ్బు ఉండవచ్చు కాని, జబ్బు
నయం చేసే శక్తి క్రమంగా లోపిస్తోంది.
(26-05-2021)
ఏఎన్నారా! ఎన్టీఆరా !
25, మే 2021, మంగళవారం
రామజోగి మందు
కొద్దిసేపటి క్రితం ఆలిండియా రేడియోలో నా సీనియర్ సహచరుడు ఆర్వీవీ కృష్ణారావు గారు ఫోన్ చేశారు. ఆయన మాట్లాడినప్పుడల్లా నాకు రాసుకోవడానికి ముడి సరుకు లభిస్తుంది. ఆయన ఫేస్ బుక్ లో లేరు. అమెరికాలో వున్న వారి పెద్దమ్మాయి శారద అప్పుడప్పుడూ ఫోన్ చేసి నా పోస్టుల ప్రస్తావన కూడా తెస్తుంటుంది. ఆవిధంగా కృష్ణారావు గారెకి జ్వాలా దంపతులు కరోనాకు గురై రామనామంతో క్షేమంగా బయట పడడం తెలిసింది.
ఆయనే ఈ రామజోగి మందు గురించి చెప్పారు. భక్త రామదాసు
కీర్తనలలో ఇదొకటి.
రామజోగి మందు కొనరే ఓ జనులారా అంటూ రామదాసు పాడిన
ఓ కీర్తనలో రామనామం ఓ మంచి ఔషధం అని
పేర్కొన్నట్టు తెలిపారు.
ఫోన్లో మాట్లాడుతూ రాసుకోవడం వల్ల కొన్ని పదాలు
తప్పిపోయాయేమో తెలియదు కానీ మొత్తం మీద భావం బోధపడేలా రాసుకున్న రామదాసు కీర్తన
ఇది:
“రామజోగి మందు కొనరే! ఓ జనులారా! రామజోగి మందు
కొనరే!
రామజోగి మందు మీరు ప్రేమతో పూజించరయ్య
కామక్రోధముల నెల్ల కడకు పారద్రోలు మందు
రామజోగి మందు కొనరే! ఓ జనులారా!
కాముక కర్మములనెల్ల ఎడబాపే మందు
సాటిలేని జగమునందు స్వామిదాస యోగి మందు
రామజోగి మందు కొనరే!
భద్రాద్రి యందు తుదకు ముక్తిని పొందించే మందు
రామదాసు సద్భక్తితో కొలిచే మందు
రామజోగి మందు కొనరే! ఓ జనులారా!”
ఇదీ కొంచెం అటూఇటుగా రామదాసు గారు పాడిన కీర్తన
రామదాసుగారు చెప్పిన రామజోగి మందు (కరోనా చికిత్స
సమయంలో సతతం రామ రామ అని భజించడం)
జ్వాలాకు కరోనా నుండి రక్షణ కవచం మాదిరిగా పనిచేసిందని కృష్ణారావు గారు ఉవాచ.
(25-05-2021)