20, మార్చి 2021, శనివారం

శాసనసభలో పద్యం పాడిన వై.ఎస్.ఆర్. - భండారు శ్రీనివాసరావు

ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు శాసనసభలో ఏకంగా ఒక పద్యం మొత్తం చదివి వినిపించారు.

2001- 2002 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై జరిగిన చర్చను ప్రారంభిస్తూ చంద్రబాబు పరిపాలనలో వున్న రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలని, భారతంలో తిక్కన విరచిత పద్యం - 'సారపు ధర్మమున విమల సత్యము ....' అని మొదలెట్టి ఒక పద్యం పూర్తిగా చదివారు.
"ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు దక్షత కలిగిన భీష్మ, ద్రోణుల వంటి వారు కూడా మౌనంగా వుండిపోయారు. అలా ఉపేక్షిస్తే అది వారికే చేటవుతుంది. కానీ ఏదో ఒకరోజున భగవంతుడే కల్పించుకుని సత్యాన్ని, ధర్మాన్ని నిలబెడతాడు. ఈ రాష్ట్రాన్ని కూడా ఆ దేవుడే కాపాడాలి" అని ప్రసంగం ముగించారు రాజశేఖర రెడ్డి.
మరోసారి 2003 ఫిబ్రవరిలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో పాల్గొంటూ, దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన గేయభాగాన్ని వై.యస్.ఆర్. చదివి వినిపించారు.
'ఒక్క నిరుపేద ఉన్నంతవరకు, ఒక్క మలినాశ్రువు బిందువు ఒరిగినంతవరకు, ఒక్క శుష్క స్థన్య సన్నిధిని క్షుదార్తి ఏడ్చు పసిబాలిక ఉన్నంతవరకు, నాకు శాంతి కలుగదింక నేస్తం ..... ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనించగలదు, ఏ రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు' అంటూ 'పేదవాడి ఆర్తిని వినే ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రిగారు, చేయండి ముఖ్యమంత్రిగారు' అని తనదైన శైలిలో ప్రసంగం ముగించారు.

చంద్రబాబుకి కితాబు ఇచ్చిన కుల్ దీప్ నాయర్ – భండారు శ్రీనివాసరావు

 

చంద్రబాబు నాయుడు గారిది  విలక్షణమైన తరహా. శాసన సభలో ఆయన చేసే ప్రసంగాలలో పద్యాలు, గేయాలు వుండవు. కానీ ఆర్ధిక అభ్యున్నతి గురించి, సంస్కరణలు గురించి కొందరు ప్రముఖులు ఆయా సందర్భాలలో చేసిన కొటేషన్లు బాగా చోటుచేసుకుంటాయి. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తాను చేపట్టిన వివిధ అభివృద్ధి పధకాలు గురించి ప్రతిపక్ష నాయకుడిగా చేసే ఉపన్యాసాలలో వివరించే ప్రయత్నం చేస్తారు. అలాగే, ముఖ్యమంత్రిగా సభలో మాట్లాడేటప్పుడు కూడా ఈ పధకాల వివరాలు ఎక్కువగా ఉండే విధంగా జాగ్రత్త పడతారు.

1999 నవంబరు 16 వ తేదీన గవర్నర్ ప్రసంగంపై చర్చకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంలో కొన్ని భాగాలు ఇలా సాగాయి.

"నేను రాష్ట్రం అభివృద్ధిని కోరుకుంటున్నాను. నా పట్ల ప్రజలకున్న అభిమానాన్నే నమ్ముకున్నాను. అందువల్లే ఎన్నికల్లో మీ అంచనాలు తారుమారయ్యాయి. ప్రజల ఆశీర్వాదం నాకుంటుంది అని మొదటినుంచీ చెబుతున్నాను. అదే ఈనాడు నిజమైంది. కుల్ దీప్ నాయర్ మాట్లాడుతూ, 'నేను ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని అభినందించడం లేదు, ఆంద్ర ప్రదేశ్ ఓటర్లని అభినందిస్తున్నాను. ఒక విజ్ డమ్ ని వాళ్ళు వ్యక్తం చేసారు. చాలా మెచ్యూరిటీ ప్రదర్శించారు. కర్నాటక, మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఆంద్ర ప్రదేశ్ మాకు ఆదర్శం అంటున్నారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా గట్టిగా చెప్పారు. 'దేనికయినా ఆంద్ర ప్రదేశ్ కొలమానం' అని. 'అభివృద్ధి విషయంలో అన్ని రాష్ట్రాలు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అనుసరించాలి' అని. ఇంటర్నేషనల్ మీడియా కూడా అదే చెబుతోంది. దేశంలో బెస్ట్ విజన్ వున్న వ్యక్తి ఎవరంటే ఆంద్రప్రదేశ్ సీ.ఎం. అని విద్యార్ధులు కూడా చెప్పే పరిస్తితి వుంది.

'ఈ నడుమ ఒక ఎకానమిస్టు చెప్పాడు. ఆంద్రప్రదేశ్ లో నాయుడు కోరుకుంటున్న విప్లవం ఊహల్లో ఊహించుకునేది కాదు, చేసి చూపించగలిగేది, అని. ఇప్పుడు దేశానికి కావాల్సిన సరయిన నాయకుడు చంద్రబాబే అని కూడా ఆయనే చెప్పారు.

'ఆంద్ర ప్రదేశ్ ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాము. స్మార్ట్ స్టేట్ అంటే అర్ధం దక్షతతో కూడిన నైపుణ్యం ఆ స్టేట్ కి దిశానిర్దేశం చేస్తుంది. పరిజ్ఞానం దానికి ఇంధనం మాదిరిగా ఉపయోగపడుతుంది. ఇక విజ్ డమ్ దాన్ని ముందుకు నడిపిస్తుంది. అదీ మా ధ్యేయం.

'మహాత్మా గాంధీ అన్నారు. ఒకరికి ఆదర్శం బోధించాలి అంటే ఆ ఆదర్శాన్ని మనమూ పాటించాలి అని. అప్పుడే ఒకళ్ళకు చెప్పినా వాళ్ళు వినే పరిస్తితి వుంటుంది. మా ప్రభుత్వం ఆ దరిద్రాన్ని రూపుమాపడానికి కంకణం కట్టుకుంది'

'ప్రతిపక్ష నాయకులు (వై.యస్.ఆర్.) చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే తప్పకుండా సహకరిస్తామని. వారిని మనః స్పూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళు సభలో వన్ తర్డ్ వున్నారు. అందుకే అందర్నీ కలుపుకుని ముందుకు పోవాలని అనుకుంటున్నాను.'

19, మార్చి 2021, శుక్రవారం

డాక్టర్ ఊట్ల బాలాజీ

 దూరదర్సన్ లో రిటైర్ అయిన తర్వాత హెచ్.ఎం.ఆర్.ఐ. (104) అనే ఒక Not for  Profit Organization తో కలిసి పనిచేశాను. దానికి సీఈఓ ఈ బాలాజీ. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా,  సత్యం వంటి సంస్థల్లో సీనియర్  మేనేజ్ మెంట్ పదవుల్లో పనిచేసిన డాక్టర్ బాలాజీ, కేవలం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతారని అనుకునేవాడిని. కానీ ఆయనకు ఆంగ్లంలో ఎంత పట్టు వుందో తెలుగులో అంతకంటే చక్కటి ప్రావీణ్యం వుంది.  అంతేకాదు, సందర్భానికి తగ్గట్టు ఆశువుగా  అనేక సంస్కృత శ్లోకాలను అనర్ఘలంగా ఉటంకిస్తూ వుండేవారు.

వారితో నాకు మరో రెండు బాదరాయణ సంబంధాలు వున్నాయి. ఒకటి వారి నాన్నగారు. నాకంటే చాలా చాలా ముందు రేడియోలో పనిచేశారు. మరోటి మా ఆవిడ బాలాజీ గారి భార్యకు అభిమాని. లోగడ జెమినీలో అనేక సీరియళ్లు వచ్చేవి. ఇప్పుడూ వస్తున్నాయి కానీ మా ఇంట్లో వాటిని చూసే మనిషి లేదు. నాకు పేర్లు సరిగా తెలియదు కానీ చక్రవాకం, మొగలిరేకులు  మొదలైన సీరియళ్ళకు బాలాజీగారి  భార్య శ్రీమతి బిందు నాయుడు  కధ, మాటలు రాసేవారు. ఆ విధంగా బిందు నాయుడు గారు, మా ఆవిడ నడుమ  మంచి అన్యోన్యం ఏర్పడింది.

సరే! ఓ పదేళ్లపాటు నిత్య సాయంకాల సమావేశాల తరువాత ఈ మధ్య కోవిడ్ పుణ్యమా అని పరస్పరం కలుసుకోవడం తగ్గింది. ఈరోజు ఉదయం ఫోన్ చేసి ‘ఈ సాయంత్రం మీ ఇంటికి వస్తున్నాము, మా అమ్మాయి పెళ్లి కుదిరింది’ అంటూ ఓ శుభవార్త చెప్పారు. పెళ్లి బెంగళూరులో. ఎల్లుండే  ప్రయాణం. అంత హడావిడిలోనూ వచ్చారు. కాసేపు కూర్చుని వెళ్ళారు.

వెళ్ళే సమయంలో నిలబడి బూట్లు వేసుకుంటూ వుంటే ఆ సోఫా మీద కూర్చుని వేసుకోండి అన్నాను.

వెంటనే ఆయన తనదైన శైలిలో ఓ డాక్టరు గారన్న మాట గుర్తు చేశారు. ఆ డాక్టరు గారు చాలా పెద్ద సర్జన్.

‘ఎప్పుడైతే నేను ఒంటి కాలు మీద నిలబడి షూస్ వేసుకోలేనో ఆనాటి నుంచి నేను సర్జరీలు చేయడం మానేస్తాను అనేవారుట  ఆ డాక్టరు గారు.

నిజమే అనిపించింది.



(19-03-2021)          

మార్పు మంచిదే కాదు, అవసరం కూడా – భండారు శ్రీనివాసరావు

రోజులు మారుతున్నాయి. మార్పులకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి.
స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో దేశంలో జనాభాతో పోలిస్తే ఓనమాలు వచ్చిన వారి సంఖ్య నామమాత్రం. ఇక పట్టభద్రుల సంగతి చెప్పాల్సిన పనేమి వుంది.
చట్ట సభల్లో చదువుకున్నవారికి ప్రవేశం కల్పించడం కోసం ఆ రోజుల్లో పట్టభద్రుల నియోజక వర్గాలు ఏర్పాటు చేశారు.
మరి ఇప్ప్డుడో! పరిస్థితి పూర్తిగా మారింది. పట్టా పుచ్చుకున్నవారి సంఖ్య వేల నుంచి లక్షల్లోకి చేరుతోంది. అంటే ఒక్కో పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్లు ఒక పార్లమెంటు నియోజకవర్గం ఓటర్లని మించి పోయినా ఆశ్చర్యం లేదు. దీనికి తోడు పోటీకి దిగేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొన్నేళ్ళ తర్వాత ప్రచారానికి ఇచ్చిన గడువుకంటే, ఓట్ల లెక్కింపుకు ఎక్కువ వ్యవధానం పట్టే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. రెండు మూడు రోజుల పాటు ప్రభుత్వ సిబ్బంది నిద్రాహారాలు, అసలు విధులు వదిలి ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమాల్లో పాల్గొంటున్న వార్తలు వింటుంటే మన ప్రజాస్వామ్యం ఇంత ఖరీదయిందా అనిపిస్తుంది.
కాబట్టి ఈ పట్టభద్రుల నియోజకవర్గాలను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయికో, ఇంకా పై చదువులకో పెంచాలి. లేదా దేశంలో అక్షరాస్యత పెరిగిన దృష్ట్యా వీటిని రద్దు చేయాలి.
(19-03-2021)

నిదురపోరా తమ్ముడా! – భండారు శ్రీనివాసరావు

 

'కంట నిదుర రాకపోతే పడ్డావనుకో ప్రేమలో' అని ఓ సినీ కవి సూత్రీకరించారు. కాకపొతే ఈ సూత్రం ఒక వయస్సులో ఉన్నవారికి మినహా అన్ని వయస్సులవారికీ వర్తించదనుకోండి. ఈ సంగతి అలా ఉంచితే -

నిదురించే తోటలోకి తీపి కబురు వచ్చింది.

ఏమిటా మొద్దు నిద్దర మూడు ఝాములు పొద్దెక్కేదాకా’ దాకా అని పెద్దలు సణుగుతున్నా దుప్పట్లో మునగ దీసుకుని పండుకునే వారికోసం ఏడాదిలో ఒక రోజును అంతర్జాతీయ నిద్రా దినోత్సవానికి కేటాయించారు. ప్రతి ఏటా మార్చి నెల మూడో శుక్రవారం నిద్రాప్రేమికుల దినోత్సవం అన్నమాట. నిద్రతో కొన్ని రోగాలు నయం చేయొచ్చన్న ఓ వైద్య ప్రక్రియను ప్రచారం చేసే ఉద్దేశ్యంతో మొదటిసారి 2008 మార్చి 18 వ తేదీన ఈ అంతర్జాతీయ నిద్రా దినోత్సవాన్ని(వరల్డ్ స్లీప్ డే) నిర్వహించారు. ‘మంచి ఆరోగ్యంతో మర్నాడు మేలుకోవడం కోసం ఈ రాత్రి బాగా నిద్ర పొండి!’ అన్నది నిర్వాహకుల నినాదం. ఇంకా మనవైపు జనంలోకి రాలేదు కానీ నిద్రతో రోగాలు నయం చేసే ప్రక్రియ కొన్ని దేశాల్లో బాగానే ప్రాచుర్యంలో వుందన్నది వారి ఉవాచ..

అన్ని వయస్సుల్లోని వారికి నిద్ర అవసరం గురించి ప్రచారం చేయాలన్నది నిర్వాహకుల అభిప్రాయం. అప్పుడే పుట్టిన శిశువులు, స్కూలు పిల్లలు, ఈడొచ్చిన పిల్లలు, యువతీ యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు ఇలా అన్ని వయసులవారు నిద్రకు తగినంత సమయం కేటాయిస్తే రోగాలబారిన పడకుండా ఎంచక్కా గుండెలమీద చేయివేసుకుని గుర్రుపెట్టి నిద్రపోవచ్చని వీరు బల్ల గుద్ది చెబుతున్నారు. వీళ్ళంతా విదేశీయులు కనుకా, మన రామాయణాది పురాణాల అవగాహన అంతగా లేని వారు కనుకా – నిద్రకు నిలువెత్తు నిదర్శనం లాటి కుంభకర్ణుడు మొదలయిన పురాణ పాత్రల ప్రస్తావన తీసుకురాలేకపోతున్నారు. లేకపోతె, ఎంత నిద్రపోతే అంత బలం అన్నటాగ్ లైన్ తో ఏకంగా కుంభకర్ణుడి బొమ్మనే వారి 'లోగో' గా పెట్టుకునివుండేవారు. రాక్షసుడి చిత్రం ప్రచారానికి పనికిరాదని ఎవరయినా అభ్యంతరం చెబితే మన వేంకటేశ్వర స్వామి వారి అనుంగు సోదరులు వరద రాజస్వామివారు వుండనే వున్నారు. తమ్ములుంవారికి ఆయన భక్త కోటి భక్తి పారవశ్యంతో సమర్పించిన మొక్కుబళ్ల ద్రవ్యాన్ని లెక్కిస్తూ లెక్కిస్తూ అలసిపోయి కొలమానికను తలగడగా పెట్టుకుని నిద్రలోకి జారిపోయిన వరదరాజస్వామిని మించిన 'నిద్రాదేవత' మరొకరు దొరకడం దుర్లభం కూడా. ఇక్కడా మగపెత్తనమేనా అని గునిసేవారికి లక్ష్మణులవారి  అర్ధాంగి ఊర్మిళాదేవి ఉండనే వుంది. 

అయితే,  'నిద్ర తెరపీ' అని పిలుచుకుంటున్న ఈ వైద్య విధానంలో అదేపనిగా నిద్ర పోవాలని మాత్రమే వైద్యులు చెబుతారని అనుకోవడం పొరబాటు. శరీరాన్ని ఆరోగ్యవంతంగా వుంచుకోవాలని అనుకునేవారు ఎలా నిద్ర పోవాలి, ఎంత నిద్ర పోవాలి, ఎంతసేపు నిద్రపోవాలి  అని మాత్రమే  వీరు సలహాలు ఇస్తారు. 'నిద్ర పట్టడం లేదు బాబోయ్' అని గాభరా పడిపోయే వారికి నిద్ర మాత్రలతో అవసరం లేకుండా నిద్రపట్టే పద్ధతులు చెప్పి వారిని నిద్రకు దగ్గర చేస్తారు. నిద్దట్లో లేచి ఆ తరవాత మళ్ళీ నిద్రపట్టక జాగారం చేసేవారు, రాత్రంతా నైట్ డ్యూటీలు చేసి మరునాడు నిద్రపట్టక పక్కవారిని నిద్రపోనీకుండా వేధించే వారూ, రాత్రివేళ అంతా నిద్ర పోతున్న సమయంలో నిద్దట్లోనే లేచి నడకలు సాగించే వారూ – ఇదిగో ఈ అమాంబాపతు జనమంతా ఈ తెరపీ వైద్యులను ఆశ్రయిస్తుంటారు. ‘నిద్ర పట్టకపోవడమేమిటండీ మరీ విడ్డూరం కాకపొతే!’ అని దవళ్ళు నొక్కుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. ‘మా మూడోవాడు వున్నాడు చూడండీ! పక్కమీద అలా వాలిపోయాడా ఇక అంతే! ఏనుగులతో తొక్కించినా లేస్తే వొట్టు!’ అని వాపోయేవాళ్ళూ వున్నారు. ఇలాటి వారికోసమే, ఓ సినిమాలో శ్రీకృష్ణులవారి చేత ‘మత్తు వదలరా! నిద్దుర మత్తు వదలరా!!’ అనే పాట పాడించారు. ఆ పాట వింటూ మరింత నిద్రలోకి జారిపోయినవాళ్ళు కూడా వున్నారని చెప్పుకునేవారు. ఘంటసాల వారి గాత్ర మాధుర్యం అలాటిది మరి.

నవ్వడం ఓ భోగం! నవ్వలేకపోవడం ఓ రోగం!” అన్నారు జంధ్యాల. అలాగే, ‘నిద్రపట్టడం ఓ భోగం. నిద్ర పట్టకపోవడం ఓ రోగం’ అని దీనికి అన్వయించి చెప్పుకోవచ్చు. వెనుకటి రోజుల్లో మనుషులమీదా, మనసుల మీదా ఇన్ని రకాల వొత్తిళ్ళు లేనప్పుడు వున్నవాడూ, లేనివాడూ హాయిగా ఆరుబయట పండుకుని మరింత హాయిగా నిద్రపోయేవాళ్ళు. కడుపునిండా తిండి తిననివాళ్ళు ఉంటారని  వాళ్లకు తెలుసుకానీ కంటినిండా నిద్రపోని జనం వుంటారన్నది వాళ్లకు బొత్తిగా తెలియని విషయం. ఈ నాడు ఇన్ని సౌకర్యాలు వుండికూడా కాసింత నిద్రకు నోచుకోని కోటీశ్వరులు కోట్లలో వున్నారు. నిద్రకోసం 'మందే మందు' అనుకునే మందుబాబులు, నిద్ర మాత్రలు, మత్తు ఇంజెక్షన్లతో నిద్రకు దగ్గర కావాలని ఆరాటపడే గమ్మత్తు బాబులు  ఈనాడు కోకొల్లలుగా కానవస్తారు. అందుకే బ్యాంకు బాలెన్సు వున్న కుబేరులకన్నా కంటి నిండా నిద్రపోగలిగిన పేదవాడే అధిక సంపన్నుడని చెబుతారు.

నిద్ర సరిగా పట్టకపోయినా, నిద్ర లేమితో బాధపడుతున్నా దాన్ని అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటె, పర్యవసానాలు మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశం వుంది. 'ఉత్తిష్టత జాగ్రత - మేలుకోండి. మంచిగా నిద్రపట్టే మార్గాన్ని మేలుకునివున్నప్పుడే వెతుక్కోండి. మంచి నిద్రతో చక్కటి ఆరోగ్యాన్ని ఉచితంగా సంపాదించుకోండి. సంపాదన యావలో పడి బంగారం లాటి నిద్రకు దూరం కాకండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు.

చక్కటి కవిత్వం రాయడానికి ఇంటినిండా తాటాకులూ, చేతిలో ఘంటం వుంటే చాలదూ - “నిరుపహతీ స్తలంబు, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడెంబు, బంగరు టూగుటుయ్యెల” ఎట్సెట్రా ఎట్సెట్రా వుండాలని కవి పెద్దన గారు ఏనాడో ఓ పెద్ద జాబితా కవిత్వరూపంలో చెప్పారు. అలాగే మంచి నిద్ర పట్టడానికి కూడా కొన్ని చిట్కాలున్నాయిట. పడకవేయడానికి ముందు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి, వేడి వేడి అన్నం తినాలట. నచ్చిన పుస్తకం కాసేపు తిరగేయాలట. పడకా, పడక గదీ ఆహ్లాదకరంగా వుండేట్టు చూసుకోవాలట. రాత్రిపూట గదిలో వెలుతురూ కూడా కంటికి ఇంపుగా వుండాలిట. అందుకే కాబోలు ఈ మధ్య మినుకు మినుకు మని మెరిసే తారలతో కూడిన వినీలాకాశాన్ని నేరుగా పడక గదిలోకి తీసుకువచ్చి గది  పైభాగంలో కృత్రిమంగా తీర్చిదిద్దుకునే ఆధునిక పద్ధతులను అనేకమంది ఆశ్రయిస్తున్నారు. పోతే, మత్తు పదార్దాలకూ, మాదక ద్రవ్యాలకూ దూరంగా వుంటే నిద్ర భేషుగ్గా పడుతుందట. కానీ 'మందు కొడితేనే కానీ నిద్రపట్టదు' అని అనుకునేవాళ్లకు ఈ సలహా రుచించకపోవచ్చు.అయితే,  వైద్యులు మాత్రం మత్తు పానీయాలవల్ల నిద్ర పట్టదనీ, పట్టినా సరిగా పట్టదనీ వాళ్ల లెక్కలు వాళ్ళు చెబుతున్నారు. నిద్రకు మొహం వాచిన వాళ్లకు వాళ్ల మాట వింటే పోయేదేమీ లేదు, మందు తప్ప.

ముందే చెప్పినట్టు – పొద్దున్నేఆరోగ్యంగా లేవడం కోసం రాత్రంతా హాయిగా నిద్దుర పోండి.

ప్రమాణ స్వీకార సమయంలో పొరబాట్లు

 The oath of office

I, do swear in the name of God/solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister for the State of and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favour, affection or ill-will.
‘SOLEMNLY’ ‘ ‘ALLEGIANCE’ ‘SOVEREIGNTY’ ‘INTEGRITY’ ‘CONSCIENTIOUSLY’
ప్రమాణ పత్రంలో పైన పేర్కొన్న పదాలను సరిగా ఉచ్చరించిన మహానాయకులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.
అందుకే కాలానుగుణంగా ఈ ప్రమాణ పత్రాలను అతి తేలికయిన పదాలతో మార్పుచేయాల్సిన అవసరం వుంది. వాటిని సరిగా ఉచ్చరించలేదని ఎద్దేవా చేయడం సరికాదు.
మన దేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు మన నాయకుల ఆంగ్ల ఉచ్చారణ చూసి ఇంగ్లిష్ వాళ్ళు కూడా ఇలాగే నవ్వుకుని వుంటారేమో!

Senior Journalist Bhandaru Srinivasa Rao Analysis on Tadipatri Municipal...