13, జూన్ 2020, శనివారం

పోలీసులకు ‘నో ఎంట్రీ’ – భండారు శ్రీనివాసరావు


సాధారణంగా ఈ ‘నో ఎంట్రీ’ వ్యవహారం పోలీసుల చేతుల్లో వుంటుంది. వాళ్ళు బేరికేడ్లు కట్టి ప్రజల్ని వాటిని దాటి రావద్దని ‘నో ఎంట్రీ’ బోర్డులు పెడుతుంటారు. ఇప్పుడు అది తిరగబడింది. తమ ప్రాంతంలోకి పోలీసులకు ప్రవేశం లేదంటూ తమది పోలీస్ ఫ్రీ జోన్ అని పౌరులే ప్రకటించుకున్నారు.
ఈ చిత్రాతిచిత్రం అమెరికాలోని సియాటిల్ నగరంలో క్యాపిటల్ హిల్ అటానమస్ జోన్ లో చోటుచేసుకుంది.
ప్రతిరోజూ రాత్రి సియాటిల్ నుంచి మా పెద్ద కోడలు భావన క్షేమ సమాచారాలు కనుక్కోవడానికి ఫోన్ చేస్తూ వుంటుంది, ఎలా వున్నారు బాగున్నారా అంటూ. ‘మీ దగ్గర కరోనా పరిస్తితి ఏమిటనేది మామూలుగా నా ఆరా.
‘కరోనాని బ్లాక్ ఎపిసోడ్ ఏనాడో కప్పివేసింది. ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది ఈ సంగతే’ అన్నది కోడలు.
అమెరికాని ఆ దేశపు ఆర్ధిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్న కరోనా మొదట తన కుడి కాలు పెట్టింది సియాటిల్ లోనే. సియాటిల్ నగరం ఉన్న వాషింగ్టన్ రాష్ట్రం డెమొక్రాట్ల ఏలుబడిలో వుంది. అంటే ఆ రాష్ట్రపు గవర్నర్ డెమోక్రాటిక్ పార్టీ. నగర మేయర్ డెమొక్రాట్. దాంతో కరోనాను మించిన రాజకీయాలు నడుస్తున్నాయి. రిపబ్లికన్ అయిన ప్రెసిడెంట్ ట్రంప్ కీ వీళ్ళకీ చుక్కెదురు. ఒక నల్ల జాతీయుడు పోలీసుల చేతుల్లో మరణించిన దరిమిలా అమెరికా అట్టుడికి పోతున్న సంగతి తెలిసిందే. ఆ సంఘటనకు సంఘీభావం తెలిపేవారి సంఖ్య ఆ దేశంలో రోజురోజుకూ పెరుగుతోంది. “A day of action in solidarity” అనే పేరుతొ నిన్న సియాటిల్ నగరంలో బంద్ పాటించారు. శాంతియుత ప్రదర్శనలు నిర్వహించారు. కరోనా ప్రభావం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న దుకాణాలు ఈ బంద్ తో పూర్తిగా మూతపడ్డాయట. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
ఈ సంఘీభావ నిరసన కార్యక్రమంలో భాగంగానే కావచ్చు క్యాపిటల్ హిల్ అటానమస్ జోన్ లో పోలీసులకు ‘నో ఎంట్రీ’.
ఒక నల్ల జాతీయుడి హత్యకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో శ్వేత జాతీయులు ఎక్కువగా పాల్గొంటూ వుండడం అమెరికా ప్రజాస్వామ్య స్పూర్తికి అద్దం పడుతున్న మాట నిజమే అయినప్పటికీ, రాజకీయాల రంగూ రుచీ వాసనా ప్రపంచ వ్యాప్తంగా ఒకటే అనిపిస్తుంది ఈ ‘నో ఎంట్రీ’ వ్యవహారాలు గమనిస్తుంటే.

11, జూన్ 2020, గురువారం

కరోనా లేకపోతే కోటి వదిలేది (సరదా గల్పిక)

“ఈరోజు మా మనురాలి పెళ్లి. ఇంట్లో కూర్చుని చూస్తున్నాము”

ఆయనెప్పుడూ అంతే! చాలా సరదా మనిషి. దేన్నీ సమస్యగా తీసుకుని బాధపడరు, బాధ పెట్టరు. అది ఆయన నైజం. పైగా ప్రతిదాన్నీ చాలా తేలిగ్గా తీసుకుంటారు. అందుకే వయసు మీద పడ్డా కూడా ఆరోగ్యంగా, చలాకీగా ఉండగలుగుతున్నారు.

“కరోనాకు ముందు ఇదిగో ఇదే మనవరాలి ఎంగేజ్ మెంట్ ధూమ్ ధాంగా గోవాలో చేశారు. నేనూ మా ఆవిడా ఇంకా అనేకమంది బంధుమిత్రులం గోవా వెళ్లాం. చాలా సరదాగా గడిపాము. మా అల్లుడి చేయి పెద్దది. చాలా గ్రాండుగా చేసాడు. పెళ్లి ఇంకా ఘనంగా చేయాలని ప్లాన్ చేశారు.

“ఈలోగా ఇదిగో ఈ కరోనా పిలవని పేరంటంలా దిగబడింది. పెళ్ళికి యాభయ్ మంది కన్నా ఎక్కువమందిని పిలవకూడదు. అంచేత మగపెళ్ళివారికి ప్రిఫరెన్స్ ఇచ్చి మేము సర్దుకున్నాము. స్టార్ హోటల్లో పెళ్లి. అందరికీ లింకులు పంపారు. అవి పెట్టుకుని ఇంటి నుంచే వివాహ వేడుకలు చూస్తున్నాం.”

“ఇంకో మాట. ఈ కరోనా లేకపోతే ఈ పెళ్ళికి ఒక కోటి వదిలేది మా అల్లుడుకి” అన్నాడాయన నవ్వుతూ.

(June, 2020)  


10, జూన్ 2020, బుధవారం

భయం – భండారు శ్రీనివాసరావు


రోశయ్య గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కృష్ణానదికి బ్రహ్మాండమైన వరదలు వచ్చాయి. కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కర్నూలు పట్టణంలోకి వరద నీరు ప్రవేశించి పెద్ద పెద్ద భవంతులు కూడా మునిగిపోయాయి. కొన్ని అపార్ట్ మెంట్లలో రెండో అంతస్తులోకి కూడా నీళ్ళు వచ్చాయి. ఇళ్లన్నీ వరద బురదతో పేరుకుపోయాయి. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్తితులు చెప్పక్కర లేదు. హైదరాబాదు  నుంచి  చూడడానికి వెళ్లాము. ఒక అధికారి చెప్పాడు, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మా తల ప్రాణం తోకకు వచ్చింది. ఇళ్లు వదిలిపెట్టి సహాయక శిబిరాలకు రావడానికి వాళ్ళు ఓ పట్టాన ఒప్పుకోవడంలేదు
దీనికి సమాధానం ప్రజలదగ్గర నుంచే వచ్చింది. ఒకతను చెప్పాడు.
వున్నట్టుండి ఇల్లు వదిలిపెట్టి రమ్మంటారు. ఎలా వెడతామ్. టీవీలు ఫ్రిజ్ లు చాలా ఖరీదైన వస్తువులు. మా పెద్దవాళ్ళ టైమ్ లో అయితే గోచీపాత తప్పితే యేమీ వుండేవికావు. ప్రతిసారీ వరదలు వచ్చినప్పుడల్లా వచ్చి ఖాళీ చేయమంటారు. మళ్ళీ వరదలు వస్తే మళ్ళీ ఇదే తంతు. మా బతుకులు గంగమ్మ నీడలోనే గడిచిపోతాయి. నీళ్ళను చూస్తూ పెరిగాము. నీళ్లంటే మాకు భయం లేదు. చూస్తున్నారు కదా. ఇక్కడ ఎన్ని కొంపలు వున్నాయో. ఇలా ప్రతిసారీ బోలెడు ఖర్చు పెట్టి ఖాళీ చేయించే బదులు వరద భయం లేని మెట్ట ప్రాంతాలలో మాకు ఇళ్లు కట్టించి ఇస్తే ప్రతియేడూ ఇలా తరలించే ఖర్చు ప్రభుత్వానికి కలిసి వస్తుంది కదా!
బదులు చెప్పడానికి వీలులేని సమాధానం.
రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడు వుండదు అని సామెత. భయం కూడా అంతే! భయం అలవాటు అయినకొద్దీ భయం పట్ల భయం పోతుంది.
కరోనా సంగతి చూస్తున్నాం కదా!

9, జూన్ 2020, మంగళవారం

సుశ్రవణం – భండారు శ్రీనివాసరావు

సి.ఎస్.ఎన్.శర్మ గారు. ఫోనులో మాట్లాడే తీరును బట్టి నాకంటే వయసులో పెద్దవారయివుంటారని అనిపిస్తుంది. విశాఖ పోర్టు ట్రస్ట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. అనంతరం సత్యసాయి మీద వున్న భక్తి ప్రపత్తులతో పుట్టపర్తిలో భార్యతో కలిసి కొన్నాళ్లు నివాసం వున్నారు. పిల్లవాడు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అయ్యాడు. ఆయన ఉద్యోగరీత్యా శర్మగారి మకాం కూడా హైదరాబాదుకు మారింది. పుట్టపర్తిలో వుండగా సూర్య దినపత్రికలో నేను రాసే వ్యాసాలు చదివి ఒకరోజు ఫోన్ చేశారు. పుట్టపర్తి అనగానే నేను మా అన్నయ్య పర్వతాలరావు గారి గురించి చెప్పాను.

“ఆయన నాకు బాగా తెలుసు. బాబా గారి ప్రేయర్ కు వెళ్లినప్పుడు మేమిద్దరం చివరి వరసలో పక్కపక్కనే కూర్చునేవాళ్లం. వారికి అక్కడ పెద్దపెద్ద వాళ్ళందరూ బాగా తెలుసు. పోయి ముందు వరసలో కూర్చున్నా అభ్యంతర పెట్టేవాళ్లు యెవరూ వుండరు. అదే అడిగితే వారి సమాధానం ఏమిటో తెలుసాండి. చిరునవ్వు. అంతే. అలాంటి మనిషిని నేను నా జన్మలో చూడలేదు. తరవాత తరవాత వేరేవారి ద్వారా వారి గురించి సమాచారం తెలిసి ఇంకా ఆశ్చర్యపోయాను. ఆయనలా పెద్దపెద్ద ఉద్యోగాలు చేసినవాళ్లు స్వామి సేవలో వుండడం కొత్తేమీ కాదు. కానీ వారెవ్వరూ పర్వతాలరావుగారిలా నిరాడంబరంగా వుండలేరు. అది మాత్రం వాస్తవం”

శర్మగారికి బాగా చదివే అలవాటు వుంది. యెక్కడెక్కడి పుస్తకాలు సేకరించి శ్రద్ధగా చదువుతారు. చదివిన సంగతులు ఎవరితోనైనా  పంచుకోవాలని అనుకుంటారు. శర్మగారికి చాలా విషయాలు తేదీలు, పేర్లతో సహా గుర్తు. కానీ అవన్నీ చెబుతూనే వున్నట్టుండి, “మరచిపోయానండీ మళ్ళీ గుర్తు చేసుకుని ఫోన్ చేస్తాను” అని పెట్టేస్తారు.

అలా ఈరోజు ఓ విషయం చెప్పారు.

విశాఖ పోర్టు ట్రస్ట్ లో పనిచేస్తున్నప్పుడు శర్మగారికి చర్ల గణపతి శాస్త్రి గారు అనే పండితుడితో పరిచయం కలిగింది. శాస్త్రిగారికి వాల్తేర్ లో చిన్న ప్రింటింగ్ ప్రెస్ వుంది. ఆయన వయసు యెనభై ఆరు సంవత్సరాలు. ఒక లూనా బండిపై    వైజాగులో తిరుగుతూ వుండేవారు. ఆధ్యాత్మిక గ్రంధాలు అనేకం రాశారు. వారు రాసిన గణపతి రామాయణ సుధ అనే గ్రంధం గురించి హిందూలో రివ్యూ వచ్చింది. అదొక చెత్త అనే అర్ధం వచ్చేట్టు వుంది ఆ రెవ్యూ. శాస్త్రిగారు అది చదివి బాధ పడతారు అనుకున్నా. కానీ ఆయన చాలా తేలిగ్గా తీసుకున్నారు. తర్వాత అదే గ్రంధానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

“వారొకసారి విశాఖపట్నం రేడియోలో మాట్లాడారు. నేను కేసెట్ పై రికార్డు చేసుకున్నాను కూడా. ఇప్పుడు కేసెట్లు లేవుకదా! రికార్డర్లు లేవు.  ఎలా అని  గుంజాటన పడుతుంటే మా వాడు పదిహేను వందలు పెట్టి వాటిల్లో కొన్నిటిని సీడీలు గా మార్పించాడు”

శర్మగారు చెబుతూనే వున్నారు . ఇంతలో “ఏమిటో అండీ! మీకు చెప్పాలని చాలా విషయాలు గుర్తు పెట్టుకుంటాను. అదేమిటో సమయానికి మరిచిపోతుంటాను”

అంత పెద్దమనిషి పెద్ద మనసుతో ఏదో చెబుతుంటే వినడమే కదా నేను చేసేది. వాళ్ళు చెప్పేది అలా వింటుంటే ఆ వయసులో వారికి అదో తృప్తి. (నిజానికి వారి వయసెంతో నాకు తెలియదు)      


8, జూన్ 2020, సోమవారం

నారాయణ నారాయణ

“ఇంట్లో వుండు, బతికిపోతావ్! బయటకి రాకు ప్రాణాలతో వుంటావ్ అన్నారు. ప్రాణభయమో యేమో తెలవదు, చాలా రోజులు జనం ఈ మాట విన్నారు.

తర్వాత తర్వాత కొద్దికొద్దిగా నిబంధనలు సడలిస్తూ వచ్చారు. ఫలితాలు ఇదిగో ఇలా! పత్రికల్లో వచ్చిన ఫోటోలు చూశారుగా.

చేపలు తినక చాలా రోజులు అయివుండొచ్చు. లేదా మృగశిర కార్తే ఆరంభంలో వచ్చే చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది అనే ఆలోచన కావచ్చు. కానీ ఇలా మందలు మందలుగా బయటకు వస్తే ప్రాణాలకు కరోనా ముప్పు వుందనుకున్నప్పుడు  ఆరోగ్యానికి మంచి చేస్తే ఎంత? చేయకపోతే ఎంత?

చిన్నప్పుడు ఓ కధ చెప్పేవారు. ఒకడు అవసాన దశలో వున్నప్పుడు అతడిచేత నారాయణ నారాయణ అనిపించాలని కుటుంబ సభ్యులు ఆరాటపడ్డారు. నారాయణ నారాయణ అంటూ చనిపోతే  స్వర్గానికి పోతాడనే నమ్మకంతో ఎంతో చెప్పిచూశారు కానీ అతగాడిచేత నారాయణ అనిపించలేకపోయారు. చివరికి వాళ్ళల్లో ఒకడు ఒక చేతిలో నారపీచు, మరో చేతిలో అణా పట్టుకుని ఇవేమిటని సైగచేశాడు. అవి చూసి అయినా నారాయణ అని అనకపోతాడా అనే ఆశతో. మంచానపడి  చావు ముంచుకొచ్చిన ఆ శాల్తీకి చావు తెలివితేటలు ముంచుకొచ్చి  వాటిని చూస్తూనే పీచు, కాసు అంటూ కళ్ళు తేలేశాడు.

గతంలో మందుకోసం ఇలాగే వీధుల్లోకి బారులు  తీరారు. ఇప్పుడు చేపలకోసం గుంపులు కట్టారు. నాలుక చవిచచ్చిన వారికి చావు భయం కూడా చచ్చిపోతుందేమో మరి.

సరే! గతంలో మృగశిర అంటే గుర్తుకు వచ్చేది హైదరాబాదు చేపమందు. ఈసారి కరోనా కట్టడుల వల్ల చేపమందు ప్రసాద పంపిణీ వుండదని బత్తిన కుటుంబం వాళ్ళు ముందుగానే ప్రకటించారు. లేకపోతే ఈపాటికి హైదరాబాదు మీద మరో హైదారాబాదు వచ్చి పడేది.

లోగడ వున్నంత ఆదరణ ఈ చేపమందుకు ఇప్పుడు వుందని చెప్పలేము కానీ ఒకప్పుడు హైదరాబాదు చేపమందుకు చాలా గిరాకీ వుండేది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర  ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఈ చేపమందు పంపిణీకి అంతర్జాతీయ ఖ్యాతి వుండేది. ఆయనే స్వయంగా ఈ చేప ప్రసాదం యేటా స్వీకరిస్తూ దానికి ఓ బ్రాండు విలువ తెచ్చిపెట్టారు.

ఉత్తర భారతం వారికి ఈ చేపమందు పట్ల నమ్మకం ఎక్కువ. వాళ్ళ నమ్మకం యేమో కానీ రేడియోలో పనిచేసే మా బోంట్లకు లేని తలనొప్పులు తెచ్చిపెట్టేది. డిల్లీలోని ఆకాశవాణి డైరెక్టొరేట్ నుంచి మాకు యెన్నో అభ్యర్ధనలు వస్తుండేవి, మా బావమరది కుటుంబం వస్తోంది, మా మేనల్లుడి కుటుంబం వస్తోంది కాస్త సాయం చేయండంటూ. ఇక వాళ్ళకి వీఐపీ పాసులు, వసతికి ఏర్పాట్లు. ఇంతటితో అయితే పరవాలేదు, పోయేటప్పుడు రైలు రిజర్వేషన్లు. రైల్వే  రామ్మోహన్ కు పనిపెట్టే వాళ్ళం. ఆయన కిందా మీద పడి టిక్కెట్లు కన్ఫర్మ్ చేయించేవాడు. నిజానికి ఈ ఇబ్బందులు యెక్కువగా భరించింది మొహమాటం పాలు యెక్కువ వున్న మా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు గారే. నాది చిటికినవేలంత మాత్రమే.         


4, జూన్ 2020, గురువారం

దివ్యదృష్టి – భండారు శ్రీనివాసరావు


ఏకాంబరం హాల్లో పడక కుర్చీలో కూర్చుని, డిటెక్టివ్ వాలి మాదిరిగా కళ్ళు మూసుకుని టీవీ వింటున్నాడు’.
జర్మనీ నుంచి వచ్చి లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన ఏకాంబరం కొడుకు పీతాంబరం తండ్రి పక్కనే కూర్చుని టీవీ చూస్తూ రిమోట్ తో ఛానల్స్ అటూ ఇటూ మారుస్తున్నాడు.
కళ్ళు మూసుకుని వున్న ఏకాంబరం, ఛానల్ మారగానే అది పలానా ఛానల్ అని పైకి చెప్పడం పీతాంబరానికి ఆశ్చర్యం కలిగించింది. అలా సుమారు పది పదిహేను టీవీల పేర్లు ఏ తప్పు లేకుండా కళ్ళు తెరవకుండానే చెబుతూ వుండడం చూసి అతడు నివ్వెరపోయి తండ్రిని అడిగాడు, చూడకుండానే అలా ఎలా చెప్పగలుగుతున్నావని.
ఏకాంబరం ఇలా జవాబు చెప్పాడు.
ఇదేమి బ్రహ్మవిద్య కాదు. ఎలాగూ ఇంకొన్నాళ్లు ఇక్కడే వుంటావు కదా!  లాక్ డౌన్ ఎత్తేసేసరికి నీకూ ఈ దివ్య దృష్టి అలవడుతుంది. కార్యక్రమం వింటూనే అదే ఛానలో ఇట్టే చెప్పేస్తావు            

రాజకీయ నాయకుల వేషధారణ – భండారు శ్రీనివాసరావు


ఇది రాజకీయ నాయకుల గురించే కానీ, పొలిటికల్ పోస్టు మాత్రం కాదు.
నందమూరి తారక రామారావు అనగానే ఓ రూపం కళ్ల ముందు కదలాడుతుంది. రాజకీయ నాయకుడిగా ఆయన వేషధారణ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. కాషాయ వస్త్రాలు, పెద్ద పెద్ద కళ్లద్దాలూ, ఎడమచేయి గాల్లోకి లేపి, చిద్విలాసం చిందిస్తూ.. సోదర సోదరీమణులారాఅంటూ వేదికలపై తన వాక్‌చాతుర్యంతో హోరెత్తించిన తెలుగుదేశం పార్టీ అధినాయకుడి రూపాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేం. ఇక సినిమాల్లో అయితే రాముడు, కృష్ణుడు అనగానే గుర్తుకొచ్చేది, ఎన్టీఆర్ మాత్రమే.
అయితే సినీ నటుడు కావడం వల్ల కావచ్చు రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత కూడా ఆయన అనేక సార్లు తన వేష ధారణ మార్చారు. మొదట్లో తెలుగుదేశం పార్టీ పెట్టి చైతన్య రధంపై రాష్ట్రం నలుమూలలా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నప్పుడు ఖాకీ ప్యాంటు, ఖాకీ చొక్కాతో కనిపించారు. ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే తెల్లటి ధోవతి, లాల్చీని తన ఆహార్యంగా చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు వివేకానందుడి గెటప్ తో, కొన్నాళ్ళు కాషాయ వస్త్రాలతో విభిన్నంగా కనిపించారు. లక్ష్మీ పార్వతిని ద్వితీయ వివాహం చేసుకున్న తర్వాత కాషాయాన్ని వదిలేసి మళ్ళీ మల్లెపూవులాంటి ధవళ వస్త్రధారణ స్వీకరించారు. చనిపోయేవరకు అదే ఆహార్యం. మార్పులేదు.
చాలా మంది రాజకీయ నాయకులు జీవితాంతం ప్రజలకు ఒకే వస్త్ర ధారణతో గుర్తుండిపోయారు. ఉదాహరణకు మహాత్మాగాంధీ, (కొల్లాయి గుడ్డ, చేతిలో కర్ర) జవహర్ లాల్ నెహ్రూ, (ఎర్ర గులాబీ, తల మీద టోపీ లేకపోతే నెహ్రూను నెహ్రూగా గుర్తుపట్టడం కష్టం), సుభాష్ చంద్రబోస్ (మిలిటరీ దుస్తులు లేని సుభాష్ చంద్ర బోసును ఊహించడం అసాధ్యం). అలాగే, రాజగోపాలా చారి, కరుణానిధి ఈ ఇద్దరూ హమేషా పగలూ రాత్రీ తేడా లేకుండా నల్లకళ్ళ జోళ్ళతో కనిపించేవారు. నల్లద్దాల కంటి జోడు ధరించే అలవాటు ఎం.జీ. రామచంద్రన్ కు కూడా వుండేది. కాకపోతే, నెత్తిమీద ఫర్ టోపీ అదనం. జయలలిత కూడా భద్రతా పరమైన కారణాలో, ఆరోగ్యపరమైన కారణాలో తెలియదుకానీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒకేరకం ఆహార్యంతో కానవచ్చేవారు.  
రాష్ట్రపతి అయిన తర్వాత నీలం సంజీవరెడ్డి ఆహార్యం మారిపోయింది కానీ అప్పటివరకు ఏళ్ళతరబడి ఒకే రకం వస్త్రధారణ. పంచె, లాల్చీ, తలమీద గాంధి టోపీ. ఇక కాసు బ్రహ్మానందరెడ్డి. ఆయనా డిటో. తలమీద టోపీని చేత్తో కొంచెం సదురుకున్నట్టు కనిపించింది అంటే అయన ఏదో కొత్త రాజకీయ వ్యూహం పన్నుతున్నారని చెప్పుకునేవారు.
ఇక పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఒకటే ఆహార్యం, తెల్లటి  పంచె లాల్చీ. విదేశీ పర్యటనలు, కొన్ని అధికారిక కార్యక్రమాలలో మాత్రం సూటు ధరించేవారు, రాష్ట్రపతి సంజీవరెడ్డి మాదిరిగా.
నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యేంతవరకు, ఆఖరికి గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో కూడా వస్త్రధారణ పట్ల అంత శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు. ప్రధాని అయిన తర్వాత మాత్రం ఒకే రకం దుస్తులు ధరించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు వేషధారణ అనేక దశాబ్దాలుగా ఒకేరకంగా ఉంటూ వస్తోంది. తెల్లటి చొక్కా, తెల్లటి లుంగీ. ఏ పదవిలో వున్నా, ఏ హోదాలో వున్నా  ఇదే ఆహార్యం.
ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు దుస్తులు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేవి. వారగా భుజం మీద కప్పుకున్న శాలువా ఆయన ప్రత్యేకత. అదిలేని టంగుటూరిని గుర్తుపట్టడం కష్టం.
ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి ఆహార్యం విభిన్నమైన రీతిలో వుండేది. చేతిలో పొన్ను కర్ర ఓ స్పెషాలిటీ.
పొతే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఆహార్యం ఎప్పుడూ ఒకే రీతిలో ఉండేట్టు చూసుకున్నారు. ఒకరకమైన ఖాదీ వస్త్రంతో తయారుచేసిన ప్యాంటు చొక్కాను ధరించడం మొదలుపెట్టారు. కాళ్ళకు బూట్లు ధరించడం కూడా చాలాకాలం తర్వాతనే అలవాటు చేసుకున్నారు. అదీ, ముఖ్యమంత్రిగా మొదటి విదేశీ ప్రయాణం పెట్టుకున్నప్పుడు అనుకుంటాను.
వై.ఎస్ రాజశేఖర రెడ్డి సయితం ఒకే రకం వస్త్రధారణ పట్ల మక్కువ చూపేవారు. పదహారణాల తెలుగుతనం ఉట్టిపడేలా తెల్లటి పంచె, లాల్చీ ధరించి తనకంటూ ఒక శైలిని రూపొందించుకున్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు విషయానికి వస్తే  అనేక దశాబ్దాలుగా ఆయన వస్త్రధారణలో ఎలాంటి మార్పు లేదు. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు. ఢిల్లీ వంటి చలి ప్రదేశాలకు పోయినప్పుడు ఏమో కానీ, కాళ్లకు చెప్పులు. ఈ మధ్య మెడచుట్టూ మడిచిన ఉత్తరీయంతో కనిపిస్తున్నారు టీవీల్లో. ఆయన ఆహార్యంలో కానవస్తున్న మార్పు ఏదైనా ఉన్నదంటే ఇదొక్కటే.   
యువతరం రాజకీయ నాయకుల్లో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించిన తొలిరోజుల్లో రంగు రంగుల  చొక్కాలు వేసుకున్నా, ఆ తర్వాత మోచేతుల వరకు ముడిచిన తెల్లచొక్కా, తెల్ల ప్యాంటుకు మాత్రమే పరిమితం అయ్యారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో  అనేక రకాల దుస్తులు ధరించినప్పటికీ, సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పటి నుంచి, లాల్చీ పైజమా, గుబురుగా పెంచిన గడ్డం మీసాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు.