24, జనవరి 2020, శుక్రవారం

Political Analyst Bhandaru Srinivas Rao Analysis on Pawan Kalyan Words | ...





ముప్పయి వేలమంది చూశారని అంటూ మిత్రుడు ఒకరు ఈ పాత వీడియో క్లిప్పింగ్ పంపారు. వారికి నా ధన్యవాదాలు

3, జనవరి 2020, శుక్రవారం

నా గురించి నేను...... భండారు శ్రీనివాసరావు

2, జనవరి 2020, గురువారం

ఏపీ పాలిటిక్స్ టీడీపీ వర్సెస్ వైసీపీ

రేడియో విన్న రాష్ట్రపతి


కేశవాయనమః
పురుషులలో ఉత్తమ పురుషుల మాదిరిగా జర్నలిష్టులలో హిందూ విలేకరులను అలా పరిగణించే రోజులు నాకు తెలుసు.
అలాంటి ఒకానొక రోజుల్లో హిందూ కరస్పాండెంట్ (ముందు ముందు విలేకరి అంటాను, టైప్ చేయడం ఇబ్బందిగా వుంది) గా పనిచేస్తున్న దాసు కేశవరావు అనే చిన్నగా కనబడే ఈ పెద్దమనిషికి, కొన్ని రోజులపాటు నా చిలిపితనాన్ని భరించాల్సిన పరిస్తితి ఏర్పడింది.  దీనికి కారణం ఆ నాటి రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి.
సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి అయిన తర్వాత తొలిసారిగా అనంతపురం వచ్చారు. ఆ పట్టణానికి దగ్గరలోనే వారి స్వగ్రామం ఇల్లూరు వుంది. అనంతపురంలో ఉన్న వారి సొంత ఇల్లు తాత్కాలికంగా రాష్ట్రపతి నిలయం అయింది. అంతటి పెద్దాయన మొదటిసారి సొంతూరు వస్తుంటే పత్రికలు ఊరుకుంటాయా! హైదరాబాదు నుంచి విలేకరులను పంపించాయి. ఇక ఆకాశవాణి సంగతి చెప్పేదేముంది. నేనూ వాలిపోయాను.
అనంతపురంలో  మెయిన్ రోడ్డుపైనే ఉన్న హోటల్లో మా బస. చెప్పానుకదా నాకు చిలిపితనం ఓ పాలెక్కువ అని. దాసు కేశవరావు గంగిగోవు లాంటి జర్నలిష్టు. మేమిద్దరం చాలా ఏళ్ళుగా స్నేహితులం. అంచేత నా గోల ఆయన మౌనంగా భరించేవాడు.
ఇద్దరమూ బయటకు పోయేవాళ్ళం. కాసేపు అటూ ఇటూ తిరిగేవాళ్ళం. మధ్యలో ఓ పబ్లిక్ కాల్ ఆఫీసు నుంచి నేను హోటల్ రిసెప్షన్ కు ఫోను చేసేవాడిని.
‘ రాష్ట్రపతి క్యాంప్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాము. మీ హోటల్లో, కేశవరావు, శ్రీనివాసరావు, హైదరాబాదు జర్నలిష్టులు వుంటే ఒకసారి కనెక్ట్ చేస్తారా! అర్జంటుగా మాట్లాడాలి’ అనే వాడిని.
హోటల్లో అడుగుపెడుతూ ఉండగానే మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ‘మీకోసం ప్రెసిడెంటు గారి ఆఫీసు వాళ్ళు ఫోన్ చేసారు’ అని చెప్పేవాళ్ళు ఆదుర్దాగా.
‘వాళ్ళు అలానే చేస్తారు. అవసరం వుంటే మళ్ళీ వాళ్ళే చేస్తారు, ఏం పర్వాలేదు’ అనేవాడిని నిర్లక్యంగా.
ఈ ట్రిక్కు బాగా పనిచేసింది. ఆ రోజు నుంచీ హోటల్లో మాకు మర్యాదలు పెరిగాయి. ఉదయం సాయంత్రం కనుక్కునేవారు. రూమ్ సర్వీసు బాగు పడింది.
‘ఇది అవసరమా’ అనేది కేశవరావుగారిలోని గంగిగోవు. ‘అవసరమే’ అనేది నాలోని పోట్లగిత్త.
ఒక రోజు ఇల్లూరు ప్రయాణం కట్టాము. ఎందుకంటే సంజీవరెడ్డి గారు ఆక్కడికి బయలుదేరారు.
ఇల్లూరులో నీలం వారిల్లు పెళ్లివారిల్లులా హడావిడిగా వుంది. తన ఈడువారిని ఆయన ఆప్యాయంగా ‘ఏమప్పా’ అంటూ పేరుపెట్టి పలకరిస్తున్నారు. చిన్నవారితో ఎప్పటి సంగతులో ముచ్చటిస్తున్నారు. వూరు ఊరంతా అక్కడే వుంది.
సాయంత్రం ఆరవుతోంది. నేను వారింటి నుంచే హైదరాబాదు ఫోన్ చేసి వార్త చెప్పాను. రాష్ట్రపతి మకాం చేస్తున్న సందర్భం కాబట్టి వెంటనే లైను కలిపారు.  అది మొదటి వార్తగా వస్తుందని నాకు తెలుసు. వెంటనే సంజీవరెడ్డి గారిని ( రాష్ట్రపతి కార్యదర్శి పేరు కూడా సంజీవ రెడ్డే. పీ.ఎల్. సంజీవ రెడ్డి. ఐ.ఏ.ఎస్. అధికారి)ని ఒక రేడియో తెప్పించమన్నాను. ఆయన నావైపు అదోలా చూస్తూ రేడియో తెప్పించారు. దాన్ని అక్కడ ఉన్న మైక్ సెట్టుకు కలిపారు.
వార్తలు మొదలయ్యాయి. అంతా నిశ్శబ్దం. రాష్ట్రపతి స్వగ్రామం వచ్చిన వార్తా విశేషాలతో బులెటిన్ మొదలయింది.
ఈ మారుమూల గ్రామంలో వార్త ,అంత త్వరగా రేడియోలో ఎలా వచ్చిందని జనం ఆశ్చర్యంగా గుసగుసలాడుకున్నారు.
నేను గర్వపడే మరో విషయం ఏమిటంటే,  ఆ నాటి శ్రోతల్లో నీలం సంజీవ రెడ్డి గారు కూడా ఒకరు.
ముందు కొంచెం రుసరుసలాడినట్టు కనిపించిన పీ.ఎల్. సంజీవరెడ్డి గారు కూడా ఖుషీ. భుజం తట్టారు, మెచ్చుకోలుగా.         

1, జనవరి 2020, బుధవారం

అధికారాంతం - భండారు శ్రీనివాసరావు


ప్రతి దానికీ ముగింపు వున్నట్టే అధికారానికి కూడా ఏదో ఒకనాడు తెర పడుతుంది. కానీ అధికారం చలాయించేవారు ఈ చేదు నిజాన్ని నమ్మరు, అది అనుభవంలోకి వచ్చేదాకా.
ఒక డైరెక్టర్ గారి కధ చెప్పుకుందాం. ప్రతి రోజూ వారి ఆఫీసులో ఒక దృశ్యం కనబడేది. దాన్ని ఫ్రీజ్ చేస్తే ఇలా వుంటుంది.
పోర్టికో. బయలు దేరడానికి సిద్ధంగా వున్న కారు. డ్రైవర్ తలుపు తెరిచి  ఒక కాలు లోపలే వుంచి, అధికారి వచ్చి కూర్చుని,  కదలమని ఆర్డర్ వేయగానే బయలుదేరదీయడానికి తయారుగా కారు పక్కనే నిలబడి ఉంటాడు. మరో నాలుగో తరగతి ఉద్యోగి కారు వెనుక తలుపు తెరిచి పట్టుకుని, డైరెక్టర్ రాకకోసం ఎదురు చూస్తుంటాడు. మరో ప్యూను  బ్రీఫ్ కేసు పట్టుకుని వెంట నడవగా ఆ ఆఫీసరు, తన కార్యాలయం నుంచి నాలుగు అడుగులు నడిచి  కారు వద్దకు వస్తాడు. అక్కడ అటూ ఇటూ తిరిగే అక్కడి సిబ్బంది ఆ కారు కదిలేవరకు కాసేపు శిలావిగ్రహాల్లా ఎక్కడి వాళ్ళక్కడ  నిలబడి వుంటారు. ఈ దృశ్యం అలా ప్రతి రోజూ సాయంత్రం ఆ అధికారి పదవీవిరమణ చేసేవరకు కనబడుతూనే వచ్చింది.
ఇంకో అధికారి కధ చెప్పుకుందాం. అంతకు చాలా ఏళ్ళ క్రితం అదే హోదాలో మరో అధికారి అదే ఆఫీసులో  పనిచేశారు. ఆయన ఆఫీసు టైముకల్లా ఇంట్లో బయలుదేరి, ఏదో సిటీ బస్సు పట్టుకుని ఆఫీసుకు వచ్చేవారు. ఆయన వచ్చిందీ, పోయిందీ ఎవరికీ తెలిసేది కాదు.
తమిళనాట ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సంస్థాపకుడు అన్నాదొరై మహాశయులు చాలా నాటకాలు రాశారు. అనేక సినిమాలకు రచనలు చేశారు. ఆయన రాసిన నాటకంలో ఒక అంకం ఇలా మొదలవుతుంది.
హాల్లో ఓ మోతుబరి కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని విలాసంగా కాలక్షేపం చేస్తుంటాడు. దగ్గరలో ఆ ఇంటి నౌకరు ఏదో పనిచేసుకుంటుంటాడు. అలా కూర్చుని కూర్చుని  ఆ మోతుబరి దొరవారికి విసుగనిపిస్తుంది. నౌకరు పిలిచి చెబుతాడు. ‘ఇదిగో ఇలా వచ్చి నా కాలు తీసి కిందపెట్టు.’
ఆకాశవాణి మాజీ సంచాలకులు డాక్టర్ పి.ఎస్. గోపాలకృష్ణ ఈ నాటకం  సంగతి నాకు మాటల మధ్యలో చెబితే నాకు ఆ ఇద్దరు డైరెక్టర్ల ఉదంతం జ్ఞాపకం వచ్చింది.
అన్నట్టు గోపాలకృష్ణ ఇప్పుడు మాజీ డైరెక్టర్ కాదు, అయన చెబితేనే  తెలిసింది. కొన్నేళ్ళ క్రితమే, అంటే రిటైర్ అయిన తర్వాత,  ఆయనకు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా ప్రమోట్ చేస్తూ సర్కారు వారు ఓ కాగితపు ఉత్తర్వు పంపారట. ఆయన ఓ పదం వాడితే అందులో ఏదో అర్ధం వుండితీరాలి. నిజంగా అది కాగితపు ఉత్తర్వే. కానీ  ఉత్తుత్తి ఆర్డరు కాదు. ఇదేమి మతలబు అంటారా. అక్కడే వుంది.  ప్రమోషన్ అయితే  ఇచ్చారు కానీ ఆర్ధికపరమైన ప్రయోజనాలు ఏవీ దానివల్ల ఒనగూరవు. ‘పలానా అధికారి పలానా హోదాలో కాకుండా పలానా పై హోదాలో రిటైర్ అయినారు కావున తెలియ పరచడమైనది’ అంటూ ఇచ్చిన ఆర్డరు. అలా అందరికీ చెప్పుకున్నా, ఎక్కడైనా  రాసుకున్నా  ఏలినవారికి ఏమీ అభ్యంతరం వుండదు.
“ఈ మాత్రం దానికి డీడీజీ అనే ఎందుకు? ఏకంగా  డీజీ అనే ప్రమోషన్ ఇవ్వొచ్చు కదా!” అనేది  నా ముక్తాయింపు. ఎప్పటిమాదిరిగానే ఓ చిరునవ్వే ఆయన సమాధానం.
ఆయన ఇంకో సంగతి కూడా చెప్పారు. ఎప్పుడో నూట యాభయ్ ఏళ్ళ క్రితం సీపీ బ్రౌన్ అనే ఇంగ్లీష్ దొరవారు ఒక మాట అన్నారట.
“ప్రభుత్వ ఉద్యోగం చేసేటప్పుడు పై అధికారి అనేవాడు, జీఓడీ-  ‘GOD’. రిటైర్ అయిన తర్వాత డీఓజీ - ‘DOG’.”          

26, డిసెంబర్ 2019, గురువారం

శిక్షలు లేని నేరాలు


ఘోరమైన తప్పులు చేసి కూడా శిక్షలు పడకుండా తిరిగే ఘరానా నేరగాళ్ళు కొందరు మన మధ్యనే దర్జాగా తిరుగుతుంటారు. అలాంటి వారి జాబితా తీస్తే మొదటి పేరు నాదే.
కొంచెం అటూ ఇటూగా ముప్పయ్ ఆరేళ్ళ కిందటి మాట. అప్పుడూ సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. మా ఆవిడ కడుపుతో వుంది. చీకటి గదిలో కదలకుండా పడుకోమని పెద్దవాళ్ళ మాట. అలా చేయకపోతే పుట్టే బిడ్డ అవకరంగా పుడుతుందని హెచ్చరిక లాంటి సలహా.  ఇంటి మొత్తంలో చిన్నవాడ్ని నేనే అయినా నా మాటే చెల్లితీరాలనే మొండి వాళ్ళలో నేనే పెద్దవాడిని. ఎలా వింటాను? కానీ ఈ పంతాలు, పట్టింపుల్లో మానసికంగా నలిగిపోయేది మా ఆవిడే అనే సంగతి నేను పట్టించుకోలేదు. గదిలో పడుకోవద్దు అనే దగ్గర ఆగిపోతే నేను నేనెలా అవుతాను. పట్టుబట్టి గోధుమ పిండి కలిపించాను. రొట్టెలు చేయించాను. ఆ రోజల్లా అవసరం లేని చాకిరీ చేయించాను. అంటే బట్టలు ఉతకడం, పిండి ఆరేయడం ఇలా అన్నమాట. నిజానికి ఈ పనులు చేయడానికి ఇంట్లో పని పిల్ల వుంది. కానీ నా యుద్ధం మూఢనమ్మకాలపైన. మా ఆవిడకు అది తొలి చూలు. సొంత బిడ్డపై ప్రయోగాలను ఏ ఆడది అయినా సహిస్తుందా! కానీ ప్రేమించి పెళ్ళాడినందుకు నేను పెట్టేఈ రకమైన క్షోభను అంతా పంటి బిగువన ఓర్చుకుంది. నేను చెప్పినట్టే నడుచుకుంది. చుట్టపక్కాలు నా దాష్టీకాన్ని తప్పుపట్టారు. కానీ నా దారి నాదే. ఆరోజు అలా గడిచిపోయింది. మొదటి పిల్లాడు పుట్టాడు ఎలాంటి శారీరక వైకల్యం లేకుండా. సూర్య గ్రహణం ఎలాటి ప్రభావం చూపనందుకు పెద్దవాళ్ళు సంతోషపడ్డారు. కానీ నా మానసిక వైకల్యం మాటేమిటి?
పెళ్లి అనే ఒక బంధంతో ఆడదానిపై మగవాడికి సర్వహక్కులు వచ్చేస్తాయా! ఆమెకు ఒక మనసు ఉంటుందని గ్రహించలేని మగాడు మూఢాచారాలపై పోరాటం చేస్తున్నానని గొప్పలకు పోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ రకమైన మానసిక చిత్ర హింసలకు శిక్షలు ఉండవా?
వుండవు. నేనే సజీవ సాక్ష్యం.      

20, డిసెంబర్ 2019, శుక్రవారం

రేడియో రోజులు -48- భండారు శ్రీనివాసరావు


నేటి తెలుగు ప్రసార మాధ్యమాలు అన్నింటికీ ఆకాశవాణి మూలపుటమ్మఅనవచ్చు. 
1954 దాకా మద్రాసు కేంద్రంలో లలిత సంగీత విభాగం ప్రత్యేకంగా ఏర్పడకపోయినా ప్రధానమైన నాలుగు దక్షిణ భారతీయ భాషల్లో లలిత  గీతాల ప్రసారం 1939 నుంచీ తరచుగానే సాగుతుండేది. బిల్హణీయంవిశేషమైన ఆదరణ పొందడంతో ప్రముఖులైన కవులతో రాయించిన సంగీత నాటకాలు ఎన్నింటినో  మద్రాసు కేంద్రం ప్రసారం చేసింది. వాటిలో కొన్ని:  కృష్ణ శాస్త్రి రాసిన శర్మిష్ట’, ‘వూర్వశి’,  ‘శబరి’, ‘గుహుడు’, ‘అతిధిశాల’, ‘దక్ష యజ్ఞం’, ‘కృష్ణాష్టమి’, విశ్వనాధ సత్యనారాయణ రాసిన కిన్నెరసాని’, ‘కోకిలమ్మపెళ్లి’, ‘సుమిత్ర’, ‘ఊర్మిళ’, ‘’మారీచుడు’, ‘గోదావరి’. అలాగే రజని (బాలాంత్రపు రజనీకాంతారావు రాసిన మధురానగర గాధ’, ‘చండీ దాసు’, ‘మేఘ సందేశం’, శివశంకర శాస్త్రి (స్వామి) రాసిన  ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’,  శ్రీ శ్రీ రాసిన  ‘వ్రేపల్లె’.
ఉమర్ ఖయ్యాం జీవితాన్ని, అతని తత్వాన్ని ఆవిష్కరించినది  ‘అతిధి శాల’.  ఉర్దూ, అరబ్బీ, పారశీక పదాలతో కృష్ణశాస్త్రి  సృష్టించిన మధ్య ప్రాచ్య వాతావరణాన్ని, అందుకు తగిన సంగీతాన్ని సమకూర్చి శ్రావ్యకావ్యంగా తీర్చిదిద్దినవారు రజని’. అలాగే కృష్ణ శాస్త్రి విరచిత దక్ష యజ్ఞం’ -  సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో రూపుదిద్దుకున్న మరో అద్భుతం.
టేప్ రికార్డింగ్ సదుపాయాలు  లేని  ఆ రోజుల్లో రేడియో  కార్యక్రమాలన్నీ అప్పటికప్పుడు  ప్రసారం అయ్యేవి. (LIVE BROADCASTS). అందువల్ల ఎన్నో గొప్ప కార్యక్రమాలు రేడియో పరిభాషలో చెప్పాలంటే- ఇప్పుడు లభ్యం కాకుండా గాలిలో కలిసిపోయాయి.
శ్రీ శ్రీ రాసిన బలి’, ‘గ్రామఫోను రికార్డులా తిరుగుతాడుఅనే రేడియో నాటికలు  1939-40 లలో ప్రసారమయ్యాయి. రేడియో నాటక రచనలు యెలా చేయాలో తెలిసిన రచయితలు కొందరే. అటువంటివారిలో శ్రీ శ్రీ ఒకరు. మనకు లభిస్తున్న ఆధారాలనుబట్టి1939 నుంచి 1984 దాకా శ్రీ శ్రీ రేడియో కోసం  14 నాటికలు రాశారు. వీటిల్లో మరో ప్రపంచంఒకటి. అందులో ప్రధాన పాత్ర పేరు కనుపాప’. ఇరవై  ఒకటో శతాబ్దానికి చెందినవాడు. ఇరవై  ఐదో శతాబ్దంలోకి వెళ్ళబోయి యాంత్రికలోపంతో ఇరవయ్యవ శతాబ్దిలోకి వస్తాడు. ఆ పాత్ర చేత శ్రీ శ్రీ ఒకచోట ఇలా పలికిస్తాడు.  ‘భాష చాలా అసమగ్రమైన పనిముట్టు. ఏ వూహనీ అది విస్పష్టంగా, అసందిగ్ధంగా తెలియచెయ్యలేదు’.
పీవీ రాజమన్నార్, కొడవటిగంటి కుటుంబరావు, గోరాశాస్త్రి మొదలయిన వారు ఆ రోజుల్లో రేడియో కోసం నాటకాలు రాసేవారు.  1939 నాటికే మద్రాసు కేంద్రం స్త్రీలకోసం పిల్లల కోసం కార్యక్రమాలు మొదలుపెట్టింది. బాలల  కార్యక్రమాలను ఒక వారం దుర్గాబాయమ్మ (దుర్గాభాయి దేశముఖ్) నిర్వహిస్తే  మరో వారం న్యాయపతి కామేశ్వరి నడిపేవారు. కొన్నాళ్ళకు దుర్గాబాయమ్మ తమకున్న ఇతర పనుల తొందర వల్ల రేడియోకి రాలేకపోయేవారు. అప్పుడు కామేశ్వరితో పాటు ఆమె భర్త న్యాయపతి రాఘవరావు రేడియోలో బాలల  కార్యక్రమాల నిర్వహణకు పూనుకున్నారు. ఆ దంపతులు  ‘రేడియో అన్నయ్య’,  ‘రేడియో అక్కయ్యఅనే  పేర్లతో ప్రసిద్ధులయ్యారు. తెలుగులో బాల సాహిత్యం వర్దిల్లడానికి  వారిద్దరూ  చేసిన సేవ చిరస్మరణీయం. బాలలకోసం పాటలు, నాటికలు రాయడంతోపాటు వాటిని బాలలతోనే నిర్వహించడం ఆటవిడుపుఅనే ఆదివారం కార్యక్రమం సాధించిన విజయం అపూర్వం. ఆ తరువాత బాలానందం పేర శనివారాలలోను పిల్లల  కార్యక్రమాలు ప్రసారం చేసేవారు.
రెండు రోజులకోసారి ‘మహిళామండలి’ కార్యక్రమాలు మధ్యాహ్న సమయంలో ప్రసారం అయ్యేవి. ఆ కార్యక్రమాల చివర వినిపించే ‘మంగళ హారతి’ ని  ఆ రోజుల్లో చాలా ఇళ్ళల్లో శుభకార్యాల్లో పాడుతూ వుండేవారు. స్త్రీల పట్ల వివక్ష ఎక్కువగా వున్న ఆ కాలంలో ‘మహిళా మండలి’ ఎందరో స్త్రీలకు ‘వాణి’ కాగలిగింది.
అప్పటి ఉమ్మడి  మద్రాసు రాష్ట్రంలో వున్న తెలుగు జిల్లాలలో వున్న సంగీత కళాకారులెందరో మద్రాసు రేడియో కేంద్రం నుంచి తమ సంగీతాన్ని వినిపించినవారే. తెలుగు పాట విలువను, ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ప్రముఖ గాయకుల   తొలి కార్యక్రమాలు మద్రాసు రేడియో కేంద్రం నుంచే  ప్రసారం అయ్యాయి. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ  పదకొండేళ్ళ వయస్సులో 1941  జులై రెండో తేదీన తమ మొదటి రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత కొన్నేళ్లకు ఆయన  విజయవాడ, మద్రాసు, హైదరాబాదు రేడియో స్టేషన్లలో ఉద్యోగం చేశారు. రేడియో సంగీత చరిత్రలో ఇదో గొప్ప అధ్యాయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఘంటసాల వేంకటేశ్వర రావు 1944  సెప్టెంబర్ ఇరవైన మొదటిసారి రేడియోలో పాడారు. ఆ తరువాత అనేక సార్లు ఆయన లలితసంగీత కార్యక్రమాల్లో, సంగీత నాటకాల్లో పాల్గొంటూ వచ్చారు. దీపావళి పండుగ కోసం సముద్రాల రాఘవాచార్యులు రాసిన ‘వెలుగు వెల్లువ’ అనే సంగీత నాటకంలో ఘంటసాల, భానుమతి ప్రధాన పాత్రధారులు. విశ్వనాధ రాసిన ‘కిన్నెరసాని’ సంగీత నాటకానికి ఘంటసాల సంగీతం సమకూర్చారు. ‘లైలా మజ్నూ’ నాటకంలో ఘంటసాల మజ్నూ పాత్ర పోషించారు. అందులో ఆయన పాడిన ‘గుడారమెత్తివేశారు’‘ఎందు చూచినగాని లైలా...’ అనే పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.(రచన: యండమూరి సత్యనారాయణ, సంగీతం : రజని). 1945 లో ఘంటసాల పాడిన రజని గేయం ‘ఘనాఘనా గర్జింపవొ..’ అనే పాట  ఢిల్లీ నుంచి జాతీయ కార్యక్రమంలో ప్రసారమయింది.
రెండో ప్రపంచ యుద్ధం రోజుల్లో మద్రాసు నగరం నుంచి షార్ట్ వేవ్ ట్రాన్స్ మిటర్ (ప్రసారిణి) ను ఢిల్లీ తరలించారు. 1942 నుంచి1945 దాకా తెలుగు, తమిళ కార్యక్రమాలు ఢిల్లీ నుంచి కూడా ప్రసారం అయ్యాయి. మద్రాసు నుంచి కొంత బలహీనపడిన ప్రసార వ్యవస్థ ద్వారా తెలుగు, తమిళ ప్రసారాలు కొనసాగినా, శ్రోతలు ఢిల్లీ నుంచి వెలువడే కార్యక్రమాలపట్ల ఎక్కువ ఆకర్షితులయ్యేవారు.
1947లో దేశం స్వాతంత్రం సాధించేనాటికి -  ఆలిండియా రేడియో  వ్యవస్థలో ఢిల్లీ, కలకత్తా (కోల్ కతా), బొంబాయి(ముంబై), మద్రాసు(చెన్నై), లక్నో, తిరుచిరాప్పళ్లి రేడియో కేంద్రాలు మాత్రమే వుండేవి. మద్రాసు నుంచే కాక డెక్కన్ రేడియో నుంచి, మైసూరు నుంచి(చాలా అరుదుగా) తెలుగు ప్రసారాలు జరిగేవి. స్వాతంత్రం వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సమాచార, ప్రసార శాఖల మంత్రి అయ్యారు. ఆయన పర్యవేక్షణలో దేశంలో రేడియో వ్యాప్తికి కృషి మొదలయింది.  
1948 అక్టోబర్ 12 నాడు విజయవాడలో రేడియో కేంద్రం మొదలయింది. దీనితో మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
(ఇంకా వుంది)
(సమాచార సేకరణలో తోడ్పడిన డాక్టర్ పి.ఎస్. గోపాల కృష్ణ గారికి కైమోడ్పులు)