19, నవంబర్ 2019, మంగళవారం

రేడియో రోజులు - 19 - భండారు శ్రీనివాసరావు

(Published in SURYA daily on 19-11-2019, Tuesday, today)
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మాడపాటి సత్యవతి
సాయంత్రం ఆరుగంటల పదిహేను నిమిషాలకల్లా తెలుగునాట లోగిళ్ళలో ఈ మధుర స్వరం వినబడేది. మెల్లగా, సౌకుమార్యంగా వినవచ్చే ఆ కంఠస్వరం చాలామందికి సుపరిచితం.
‘శ్రీనివాసరావు గారు ఎలావున్నారు బాగున్నారా!’
పాతికేళ్ళ సుదీర్ఘ పరిచయ కాలంలో ఆవిడ నోటినుంచి నేను విన్న అతి పెద్దవాక్యం ఇదే.
మాడపాటి సత్యవతి గారు ఎంతో క్లుప్తంగా మాట్లాడుతారు. మాటలు తూచినట్టే వచ్చేవి ఆవిడ గారి నోటినుంచి. అంతటి మితభాషి. మరి పది నిమిషాలు విడవకుండా ఏకబిగిన వార్తలు యెలా చదివేవారో అనిపించేది. కానీ ఆవిడ స్వరాన్ని భగవంతుడు కేవలం రేడియో కోసమే తయారు చేసాడేమో అనిపిస్తుంది. ఒక రకమైన మార్ధవంతో, సంగీతం వినిపిస్తున్నట్టుగా మాడపాటి సత్యవతిగారు వార్తలు చదువుతుంటే మరీ మరీ వినాలనిపిస్తుందని చెప్పేవాళ్ళు బోలెడుమంది. ఒకరు అనువాదం చేసిన వార్తలు చదవడం కన్నా తాను సొంతంగా అనువదించి చదవడానికి ఆవిడ ఇష్టపడేవారు. నిజానికి ఆవిడ న్యూస్ రీడర్ కాదు. న్యూస్ ఎడిటర్. కానీ వారంలో కొన్ని రోజులు విధిగా వార్తలు చదివేవారు. వీటికి తోడు వారానికి ఒకమారో రెండుసార్లో వీలునుబట్టి ‘వార్తావాహిని’ కార్యక్రమాన్ని రూపొందించి సమర్పించేవారు.
ఆకాశవాణి వార్తావిభాగం పనితీరు గురించి ఇక్కడ ఒకమాట చెప్పుకోవాలి. హిందీలో చెప్పాలంటే (నిజానికి నాకూ ఆ భాషకు చుక్కెదురు) అక్కడ వాతావరణం ‘బహుత్ బహుత్ గంభీర్.’ 1975 నవంబరులో నేను అక్కడ కుడికాలు పెట్టేంత వరకు పరిస్తితి అదే. పని అయిపోయేంతవరకు అందరూ ముక్తసరిగా మాట్లాడుకునేవారు. అంతా రొటీన్ గా ‘స్క్రీన్ ప్లే’ పుస్తకంలో రాసివున్నట్టు జరిగిపోయేది. వార్తల్లో ఎలాటి తభావతు రాకుండా బులెటిన్ల తయారీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఒక వార్త ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎన్ని వాక్యాలు ఇవ్వాలి, యెంత ప్రాధాన్యం ఇవ్వాలి అని ఒకటికి రెండు సార్లు ఆలోచించేవాళ్లు. మరీ ముఖ్యంగా సత్యవతిగారికీ, డి. వెంకట్రామయ్య గారికీ ఈ విషయంలో పట్టింపులు మెండు. అన్నిటినీ చాలా తేలిగ్గా తీసుకునే నా తత్వం వారికి అంతగా రుచించకపోయినా ఇంట్లో చిన్నవాడిని ముద్దు చేసినట్టు నన్ను చూసీ చూడనట్టు వొదిలేసేవారు. దానితో నాది ఆడింది ఆట పాడింది పాట అయింది. అంతకు ముందు దినపత్రికలో పనిచేసిరావడం వల్ల కొంత స్వేచ్చను ప్రదర్శించే ప్రయత్నం చేసేవాడిని. బహుశా నాతో పడ్డన్ని తలనొప్పులు వాళ్లు ఎవరితోనూ పడివుండరేమో కూడా.
నేను చేరిన కొత్తల్లో అనుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జట్ గురించి వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలతో కూడిన ప్రత్యేక వార్తావాహిని తయారు చేస్తున్నారు. అభిప్రాయాలు రికార్డ్ చేసుకొచ్చే బాధ్యత నా మీద పడింది. అన్నీ తీసుకొచ్చి ఆ టేపులన్నీ సత్యవతిగారికి వొప్పచేప్పేసి చక్కాపోయాను. రాత్రి ఏడుగంటల నలభై అయిదు నిమిషాలకు ప్రసారం. లోపల డబ్బింగు స్టూడియోలో సత్యవతి గారు నానా అవస్థ పడుతున్నారు. గొంతులు వినబడుతున్నాయి. ఎవరి గొంతు ఎవరిదో తెలియచెప్పే ‘క్యూ షీట్’ సత్యవతి గారికి ఇవ్వడం మరచిపోయాను. ఓపక్క టైం దగ్గర పడుతోంది. ఆవిడకి నరాలు తెగిపోయే టెన్షన్. నేనెక్కడో ఎవరితోనో కబుర్లు చెబుతూ కూర్చున్నాను. ఇప్పట్లా సెల్ ఫోనులు లేని రోజులాయె. ఆవిడ అనుభవమే ఆవిడకు అక్కరకు వచ్చింది. కాని ఆరోజు, డబ్బింగు పని పూర్తిచేసి టేపు స్టూడియోలో వొప్పగించేసరికి ఆవిడ తల ప్రాణం తోకకు వచ్చివుంటుంది.
మరునాడు ఆఫీసుకు వెళ్ళిన తరువాత కాని నాకు విషయం తెలియలేదు. కనబడగానే బాగా కోప్పడాలి. కోపడ్డారు కూడా. యెలా అనుకున్నారు? నోరు తెరిచి ‘ఇదేంటి శ్రీనివాసరావు గారూ’ అన్నారు. అంతే! ఆ ఒక్క ముక్క చాలు. కర్రు కాల్చి వాత పెట్టినా దానికి సరిపోదు.
రేడియోలో పనిచేసేవారికి ముందుగా ఓ నీతి పాఠం బోధిస్తారు. యెంత క్లుప్తంగా (వార్త) చెబితే భావం అంత ఖచ్చితంగా అర్ధం అవుతుంది అని. (Brevity is sole of expression).
ఆ రోజు సత్యవతి గారి భావం నాకు చాలా బాగా అర్ధం అయింది. తీరు పూర్తిగా మార్చుకోకపోయినా కొంత గాడిలో పడ్డాను. (అని అనుకున్నాను)
(ఇంకావుంది)



మాడపాటి సత్యవతి


18, నవంబర్ 2019, సోమవారం

బతికే వున్నాను – భండారు శ్రీనివాసరావు




దాదాపు యాభయ్ లక్షల మంది కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ప్రతి ఏడాది నవంబరులో తమ పెన్షన్ renewal కోసం ఈరోజువరకూ ‘బతికే ఉన్నాము’ అని తమకు తాము సర్టిఫై చేసుకుని దాన్ని సంబంధిత అధికారులకి సమర్పించుకోవాలి. వివిధ రాష్ట్రాల సిబ్బందిని కూడా లెక్కలోకి తీసుకుంటే ఈ లెక్క లక్షల నుంచి కోట్లలోకి చేరుతుంది.
ఈ ఇబ్బంది నుంచి కొంత వెసులుబాటు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం UMANG అనే App ని వాడుకలోకి తీసుకువచ్చింది. సంబంధిత కార్యాలయానికో, బ్యాంకుకో వెళ్ళే పని లేకుండా ఇంటి నుంచే ఈ తప్పనిసరి తంతు పూర్తి చేసుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ విషయం తెలుసు కానీ, ఆ యాప్ ఎలా వాడాలో తెలియక ఈ రోజు కోటీ లోని స్టేట్ బ్యాంకుకు వెళ్లాను. 1975 నుంచీ నా ఖాతా అందులోనే వుంది. లోగడ వెళ్ళినప్పుడు మురళి గారనే ఓ అధికారి పరిచయం అయ్యారు. నిజానికి ఆయనే నావద్దకు వచ్చి పరిచయం చేసుకున్నారు. టీవీ చర్చల్లో తటస్థంగా వుండే వైఖరి ఆయనకు బాగా నచ్చిందట. రండి మీ పని నేను దగ్గరుండి చేయిస్తాను అని నిమిషాల్లో ఆ పని పూర్తిచేసి పంపించారు.
ఈరోజు బ్యాంకుకు వెళ్లాను. ఇద్దరు ముగ్గురు తప్ప పెద్ద రద్దీగా లేదు. అంచేత మురళి గారికి ఫోన్ చేసి ఇలా వచ్చాననీ, పని అయిన తర్వాత వచ్చి కలుస్తాననీ చెప్పడానికి ఫోన్ చేసాను. ఆయన కాశీలో జరుగుతున్న మహారుద్రాభిషేకంలో వున్నారు. నా వంతు వచ్చేలోగా మరొకరు కలిసారు. పేరు కొండపల్లి రామమోహనరావు గారు. ఆయనే పరిచయం చేసుకుని వివరాలు చెప్పారు. ఈ మధ్య టీవీల్లో రావడం లేదేమిటని వాకబు చేసారు. విషయం తెలిసి బాధ పడ్డారు. ఆయన లోగడ స్టేట్ బ్యాంకులో పెన్షన్ సెక్షన్ లోనే పనిచేసారుట. ఆయన నన్ను ఒక చోట కూర్చోబెట్టి దగ్గరుండి ఫారం ఫిలప్ చేయించారు. వేలి ముద్రలు చెక్ చేయించారు. ఇదంతా జరుగుతుండగానే హుందాగా నడుచుకుంటూ, మంచి వర్చస్సు ఉన్న ఓ పెద్దమనిషి నాదగ్గరకు వచ్చి బాగున్నారా అని పలకరించారు. షరా మామూలుగానే నాకు ఆయన ఎవరన్నది చప్పున గుర్తు రాలేదు. నేనండీ అనంత కృష్ణని. మీ అన్నగారు రామచందర్రావు గారు నాకు బ్యాంకులో గురువు’ అని పరిచయం చేసుకున్నారు. ఆయన గతంలో స్టేట్ బ్యాంక్ స్పాన్సర్ చేసిన శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ గాను. ఆతర్వాత అయిదు గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి వరంగల్ ప్రదానకార్యాలయంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మొదటి చైర్మన్ గాను పనిచేసారు. రేడియోలో పనిచేసే రోజుల్లో వృత్తిరీత్యా అనేక సార్లు కలిసాను. ఏమిటో ఈ మతి మరపు అందర్నీ దూరం చేస్తోందనే భయం వేసింది. రామ్మోహన రావు గారు గాయత్రి అనే అమ్మాయి (అక్కడ ఉద్యోగి)తో నా ఫోన్లో యాప్ డౌన్ లోడ్ చేయించి అది ఎలా పనిచేయించాలో నాకు చెప్పించారు.
ఇంటికి తిరిగివస్తూ అనుకున్నాను. ఈ UMANG యాప్ నాకు అనవసరం అనిపించింది. ఏడాదికో మారు ఇలా బ్యాంకుకు వెళ్లి వస్తుంటే పాత పరిచయస్తులు కలుస్తూ వుంటారు. ఇప్పుడు ఈ వయసులో అంతకు మించింది ఏమి కావాలి.


Life certificate వ్యవహారం అంతా సజావుగా ముగిసిపోయింది.
బ్యాంకు వాళ్ళు ఇచ్చిన ఫారం ఫిలప్ చేసేటప్పుడు ఒకచోట చేయి వణికింది. నామినీ కాలంలో ఏపేరూ రాయకుండా - అలా వదిలేయాల్సివచ్చినప్పుడు ఎలాగో అనిపించింది.



17, నవంబర్ 2019, ఆదివారం

చట్టబద్ధం కాని విజ్ఞప్తి – భండారు శ్రీనివాసరావు



“భాషకు సంబంధించి ప్రస్తుతం సాగుతున్న వివాదాలకు దీనికీ సంబంధం లేదు”
ముక్కోటి దేవతలు పరమేష్టి వద్దకు కట్టగట్టుకుని వెళ్లి మొరబెట్టుకున్నారు.
“రాజకీయాల్లో హుందాతనం అనేది కలికానికి కూడా కానరావడం లేదు. అతల, సుతల, పాతాల లోకాల దిగువకు జారిపోయింది. ఇక దాన్ని కనుగొనడం బ్రహ్మతరం కాదు”
“నాకు చేతకాదని తెలిసీ నా వద్దకు ఎందుకు వచ్చారు?” అని ఘీంకరించబోయి, ప్రస్తుతాంశం హుందాతనం అన్నది గుర్తుకు వచ్చి తమాయించుకుని వినసాగాడు విధాత.
“మీరు సృష్టించిన మానవులే  అలా హుందాతనం కోల్పోయి  ప్రవర్తిస్తుంటే ఆ నామర్దా తమరికే కదా” అని అందుకున్నారు సురులు.
“తక్షణ కర్తవ్యమ్” అడిగాడు వాణీపతి.
“తిరిగి మరికొంత  హుందాతనాన్ని సృష్టించి, అలనాడు విష్అణువు  మోహినీ అవతారంలో అమృతాన్ని మాకు పంపిణీ చేసినట్టు  దాన్ని రాజకీయ రంగంలోని వారికి ప్రసాదించడమే” అన్నారు దేవతలు ఒక్క మాటగా.
“అది సాధ్యం కాని పని. హుందాతనం అనేది అంగడి సరుకు కాదు, అయిపోయినప్పుడల్లా కొనుగోలు చేయడానికి. వారు మానవులు. మీకంటే తెలివిపరులు. వారి సంగతి వాళ్ళు చూసుకుంటారు. మీకు రంభాదికాంతలు అందించే అమర సుఖాలను వాళ్ళు హుందాతనాన్ని కోల్పోవడం ద్వారా వెతుక్కుంటున్నారు. వాళ్ళ పాట్లు వాళ్ళని పడనివ్వండి. ఎటూ వాళ్ళు పోయేది రౌరవాది నరకాలకే కనుక, మీకొచ్చిన నష్టం ఏమీ లేదు.”
బ్రహ్మదేవుడితో ఇక పనికాదనుకుని వాళ్ళు వీణావాణి వైపు తిరిగారు. జరుగుతున్నదంతా క్రీగంట గమనిస్తున్న హాటకగర్భురాణి వారితో ఇలా అన్నది.
“భయం లేదు, వెళ్లి రండి. అందుకే నేను అనేక భాషలు సృష్టించాను. ఒక భాషలో కటువుగా, కర్ణకఠోరంగా వినిపించే పదాలు, మరో భాషలో కర్ణపేయంగా వుంటాయి. సొంత భాషలో మాదిరిగా పరాయి భాషా పదాలు సులభంగా అర్ధం కావు కనుక, ఆ పదాలలోని కరకుతనం వెంటనే ఆకళింపు చేసుకోవడం కష్టం. అదే మాతృభాష అయితే భావం ఇట్టే బోధపడుతుంది. ప్రస్తుతం భూలోకంలో జరుగుతోంది అదే” అంటూ వారి చేతిలో ఓ కాగితం పెట్టింది. అది ఆదివారం నాటి ఒక ఆంగ్ల పత్రిక. అందులో కొన్ని తెలుగు పదాలు, ఇంగ్లీష్ లో వాటికి సమానార్ధకాలు వున్నాయి.
“సన్నాసి” (Block Head, Dunce)
“వాడమ్మ మొగుడు” (His mother’s husband)
“పిచ్చవాగుడు” ( Stupid Rants)
“చెత్త నాకొడకా” ( Good for nothing yokel)
“దుర్మార్గుడు” ( Nefarious, Mendacious person)
కాబట్టి, కావున తిట్లు శాపనార్ధాలు పెట్టేటప్పుడు తెలుగు కంటే, ఇంగ్లీషే మేలు అని వాటిని విన్నవాళ్ళు అనుకుంటారు, అని చెప్పి  సాగనంపింది సరస్వతి.
(నోట్ : ఆ పత్రిక డెక్కన్ క్రానికల్. ఆ వార్తను ఇలా మొదలు పెట్టింది. దాన్నే దేవతలు కాపీ కొట్టి కొద్దిగా మార్చి చతుర్ముఖ బ్రహ్మతో చెప్పినట్టున్నారు)
No low  in Indian politics remains the lowest for long)

రేడియో రోజులు – 18 – భండారు శ్రీనివాసరావు



(Published in SURYA daily on 17-11-2019, SUNDAY, today)

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుమలశెట్టి శ్రీరాములు
– ఢిల్లీ నుంచి ప్రసారం అవుతున్న ఈ వార్తల్ని మద్రాసు, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలు రిలే చేస్తున్నాయి”
ఉదయం ఏడుగంటల సమయంలోనో, లేదా రాత్రి ఏడు కొడుతున్నప్పుడో ఈ కంఠస్వరం తెలుగు లోగిళ్లను పలకరిస్తూ వుండేది. వార్తల్లో విషయం కన్నా ఆయన వార్తలు చదివే పధ్ధతి, వాక్యాలను విరుస్తూ, అక్కడక్కడ నొక్కుతూ ఉచ్చరించే తీరుకోసమే వింటున్నామనే వాళ్లు నాకు చిన్నతనంనుంచీ తెలుసు. అయితే, రేడియోలో వినబడే ఆ స్వరం తప్ప శ్రీరాములు గారు యెలా వుంటారో తెలియని వాళ్ళే కాని ఆయన్ని తెలియని తెలుగు వాళ్లు అంటూ ఎవ్వరు వుండరు. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, ఆసేతుహిమాచలం హై పవర్ రేడియో ట్రాన్స్ మీటర్లు వున్న ప్రతిచోటా ఆయన గొంతు వినబడేది.
ఆ రోజుల్లో ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదివే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క బాణీ. ఎవరి స్టైల్ వారిదే. దుగ్గిరాల పూర్ణయ్య, కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, జోలిపాళ్యం మంగమ్మ, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి ఇలా ఎందరో మహానుభావులు. ఎవరికి ఎవరు తీసిపోరు. వార్తలు మధ్యనుంచి విన్నా చదువుతున్నది పలానా అని చెప్పగలిగేలా తమదయిన తరహాలో వార్తలు చదివేవాళ్ళు. (సందర్భాన్నిబట్టి కొన్ని పేర్లు మాత్రమే ప్రస్తావించడం జరిగింది. మిగిలిన వారిని కూడా వీలువెంట గుర్తుచేయడం జరుగుతుంది. దురదృష్టం ఏమిటంటే రేడియో అభిమాని అనే బ్లాగులో, మాగంటి వారు నిర్వహించే బ్లాగులో తప్ప వీరిలో కొందరి ఫోటోలు సంపాదించడం అనేది గగన కుసుమంగా మారింది)
శ్రీరాములు గారి గురించి చెప్పుకుంటున్నాం కదా! ఆయన ఢిల్లీ నుంచి కొన్నాళ్ళు మాస్కో వెళ్ళి ఆ తరువాత తిరిగి ఢిల్లీ వెళ్ళకుండా హైదరాబాదు బదిలీపై వచ్చారు. వార్తలు చదివే పద్దతే కాదు ఆయన ఆహార్యం కూడా ప్రత్యేకమే. ఎప్పుడు ఫుల్ సూటులో కనబడేవారు. ఆరోజుల్లో ప్రాంతీయ వార్తా విభాగం ప్రస్తుతం క్యాంటీన్ వున్న షెడ్లలో వుండేది. అందులో రెండు విశాలమైన గదులు – ఒకదానిలో న్యూస్ బులెటిన్లు తయారుచేసే సిబ్బంది, అంటే న్యూస్ ఎడిటర్లు, రిపోర్టర్లు, బులెటిన్ టైప్ చేసే వాళ్లు, రెండో గదిలో తెలుగు, ఉర్దూ న్యూస్ రీడర్లు ఆఫీసు అసిస్టెంట్లు కూర్చునే వారు.
నేను చేరినప్పుడు న్యూస్ ఎడిటర్ పన్యాల రంగనాధ రావు గారు, కరస్పాండెంట్ ఎం ఎస్ ఆర్ కృష్ణా రావు గారు అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ మాడపాటి సత్యవతి గారు, న్యూస్ రీడర్ గా వుంటూనే బులెటిన్లు తయారు చేసే బాధ్యతను ఐచ్చికంగా భుజాలకు ఎత్తుకున్న డి. వెంకట్రామయ్యగారు, సరే, ఆ వరసలో నేనూ. చివర్లో ‘ఈ నేను’ ఎందుకంటే అసలు నేను ఆఫీసుకు వచ్చి పోయేదే చాలా తక్కువ. రిపోర్టింగ్ పని మీద రోజులో ఎక్కువ భాగం బయటే తిరిగేవాడిని.
మరో గదిలో తిరుమలశెట్టి శ్రీరాములు గారు, ఉర్దూ న్యూస్ రీడర్ వసీం అక్తర్ కూర్చునే వారు. శ్రీరాములు గారు వార్తల టైము కాగానే ఒక చేతిలో వెలిగించిన సిగరెట్, మరో చేతిలో న్యూస్ బులెటిన్ పట్టుకుని స్టూడియోకు బయలుదేరేవారు. మేమున్న చోటునుంచి స్టూడియోకి కొంతదూరం నడిచి వెళ్ళాలి. శ్రీరాములు గారు అడుగులో అడుగువేసుకుంటూ స్టుడియో దగ్గరికి వెళ్లేసరికి సిగరెట్ అయిపోయేది. వార్తలు చదవడానికి స్టూడియోకి వెళ్లేటప్పుడు యెంత టైం పట్టేదో తిరిగివచ్చేటప్పుడు కూడా సరిగ్గా అంతే సమయం పట్టేదని చెప్పుకునేవారు. వేసే అడుగులు కూడా లెక్కబెట్టినట్టు వుండేవి. ఒక్కోసారి ఏదయినా తాజా సమాచారం అందివ్వడానికి నేను స్టూడియో వైపు పరిగెత్తుకుంటూ వెడుతుంటే శ్రీరాములు గారు మాత్రం నింపాదిగా నడుస్తూ మధ్యలోనే కనిపించేవారు. ఆ కాగితం ఆయన చేతిలో పెడితే దాన్ని చదువుకుంటూ అలాగే అంతే తాపీగా నడుస్తూ వెళ్ళేవారు కాని ఆయనలో ఏమాత్రం ఆందోళన కాని, కంగారు కాని ఏనాడు చూడలేదు. అలాగే ఒక్కోసారి చివరి నిమిషంలో మొత్తం వార్తని తిప్పిరాసి ఇచ్చినా ఏమాత్రం అసహనం ప్రదర్శించకుండా దాన్ని అనువాదం చేసేపనిలో నిమగ్నం అయ్యేవారు. అన్నట్టు చెప్పడం మరిచాను. ప్రాంతీయ వార్తా విభాగంలో మాస్టర్ బులెటిన్ ను ఇంగ్లీష్ లో తయారుచేసి ఇచ్చేవాళ్ళం. దాన్ని కాపీలు తీసి ఇస్తే తెలుగు న్యూస్ రీడర్, ఉర్దూ న్యూస్ రీడర్ తమ భాషల్లోకి అనువదించుకునేవారు.
పొతే, తిరుమలశెట్టి శ్రీరాముల గారికి సంబంధించిన మరో జ్ఞాపకం మనసులో పదిలంగావుంది. ఆయన రేడియోలో చేరి వార్తలు చదవడం మొదలు పెట్టి పాతికేళ్ళు అప్పటికి పూర్తయ్యాయి. శ్రీరాములు గారి రేడియో కంఠస్వర రజితోత్సవం జరిపితే ఎలావుంటుందని నర్రావుల సుబ్బారావు గారికి ఆలోచన వచ్చింది. ఆహ్వాన సంఘం చైర్మన్ గా నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారిని ఒప్పించే బాధ్యతను నాపై పెట్టారు. నేను వెళ్లి అందుకు సంబంధించిన లేఖను ముఖ్యమంత్రికి అందచేసాను. ఆయన ఒకసారి పైనుంచి కింది వరకు చదివి ఆ కాగితాన్ని మడిచి లాల్చీ జేబులో పెట్టుకున్నారు. తర్వాత పెద్దగా నవ్వి “ఇందులో గొప్పేమిటో నువ్వే చెప్పు. ఎవడయినా ఒకడు ఈరోజు సర్కారు నౌకరీలో చేరాడనుకో. పాతికేళ్ళ తర్వాత అతడి సర్వీసుకూడా పాతికేళ్ళు పూర్తవుతుంది”.
ఆ మాటతో నేను వచ్చిన పని ఇంతే సంగతులు అనుకున్నా. కానీ కొన్నాళ్ళ తర్వాత, మా విజ్ఞప్తిని చెన్నారెడ్డి గారు అంగీకరించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాకు జాబు అందింది.
(ఇంకా వుంది)
కింది ఫోటో : కీర్తిశేషులు తిరుమల శెట్టి శ్రీరాములు గారు.


16, నవంబర్ 2019, శనివారం

రేడియో రోజులు - 17 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 16-11-2019, Saturday)

స్కూళ్లకు సెలవిచ్చారని రేడియో వార్తల్లో విని మారుమూల వూళ్ళల్లో బళ్లను మూసివేసిన రోజులున్నాయి. రేడియో వార్తల్లో అంతర్లీనంగా వుండే నిబద్ధతతకు ఈ ఉదంతాలు నిదర్శనాలు. అయినాసరే  రేడియోలో వచ్చే ప్రాంతీయ వార్తల్ని ప్రాచీన వార్తలు అంటూ ఎద్దేవా చేయడం కద్దు.
సుమారు  మూడు దశాబ్దాలు హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేసిన అనుభవం నాకుంది. ఇన్నేళ్ళ ఉద్యోగ పర్వంలో ఏనాడు పై అధికారులెవ్వరూ - ఆ మాటకు వస్తే కేంద్ర ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రులుగా పనిచేసిన తెలుగువారు కూడా  'ఈ వార్త ఇలా ఇవ్వండి, ఆ వార్త అలా యెందుకు ఇచ్చారు' అని అడిగిన జ్ఞాపకం లేదు. ఆ పాటి ఫంక్షనల్ అటానమీ (విధి నిర్వహణా స్వేచ్ఛ) ని నాతోపాటు పత్రికల్లో పనిచేసిన సాటి జర్నలిష్టు మిత్రులు కూడా అనుభవించారని అనుకోవడం లేదు. అయినా కానీ, సర్కారీ వార్తలు రాసే సర్కారీ జర్నలిష్ట్ అనే ముద్ర నుంచి తప్పించుకోలేకపోవడం విచిత్రం. బహుశా, పాలక పక్షాలకు ఎలాటి రాతలు, ఎలాటి వార్తలు రుచిస్తాయో అవగతం చేసుకుని అందుకు తగ్గట్టుగానే వార్తలు వండి వడ్డించి వుంటామని అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు.
ఇక రేడియోలో వార్తలు గురించి చెప్పాల్సివస్తే -
నలభైయ్యేళ్ళ క్రితం రేడియో విలేకరిగా చేరినప్పుడు - ప్రభుత్వ మాధ్యమంలో పనిచేసే మాకు పోటీ ఏమీ లేదు. ఆ మాటకు వస్తే రేడియో వరకు ఈనాటికీ ఎలాటి పోటీ లేదు.
పోటీ లేకపోవడంవల్లా. పోటాపోటీగా సంచలన వార్తలు ప్రసారం చేసి శ్రోతల సంఖ్యని పెంచుకోవాల్సిన అవసరం లేకపోవడంవల్లా, రేడియో వార్తల సేకరణ, కూర్పు ఇత్యాది కార్యక్రమం అంతా ఒక పద్ద్దతి ప్రకారం జరిగిపోతూ వుండేది. ఏదయినా సమాచారాన్ని ఉన్నతస్థాయి ప్రభుత్వ, పోలీసు వర్గాలనుంచి ద్రువపరచుకోవడానికి, పత్రికలవారితో పోలిస్తే రేడియో విలేకరికి కొంత వెసులుబాటు ఎక్కువనే చెప్పాలి. 'అవసరాన్ని మించి రేడియోలో అనవసరంగా ఏమీ చెప్పరు' అని రేడియోవారిమీద వున్న ముద్ర ఇలాటి సందర్భాల్లో చాలా ఉపకరించేది. మంత్రులు, సీనియర్ అధికార్లతో తీరిక సమయాన్ని ఖర్చుచేసే సందర్భాల్లో దొర్లే ప్రైవేట్ సంభాషణల్లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు మా దృష్టికి వచ్చేవి. అయినా వాటిని సంచలనాత్మకం చేయాలనే ఆలోచన కూడా వుండేది కాదు. అందుకే, అధికారులు కూడా మాకు అవసరమైన సందర్భాలలో సరైన సమాచారం అందించేందుకు వెనుకాడేవారు కారు. ఉభయతారకమైన  ఈ సంబంధాలు, రేడియో విలేకరిగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడంలో నాకెంతో సాయపడ్డాయి.               
సంచలనం జోలికి పోకుండా వుంటే రేడియో వార్తల పరిధి చాలా తక్కువ. తెలిసిన లేదా తెలియవచ్చిన వార్తకు ఎలాటి నగిషీలు చెక్కకుండా ప్రసారం చేయడం వల్ల - రేడియో వార్తల్ని మెచ్చుకుని అభిమానించే నిత్య శ్రోతల్ని పెద్ద సంఖ్యలో  సంపాదించుకోగలిగాము. అలాగే పోటీ లేదని చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు శ్రోతలకు అందించడంలో ఎప్పుడూ ముందే వుంటూ వచ్చాము. రేడియో బులెటిన్ లో ఎప్పుడయినా 'ఇప్పుడే అందిన వార్త' అని వినబడితే ఇంటిల్లిపాదీ చెవులు రిక్కించుకుని వినే ఆకర్షణ రేడియో వార్తలకే  చెల్లింది అని చెప్పడం అతిశయోక్తి కాదు.
నాటి విషయాలు ముచ్చటించుకునేటప్పుడు ఒక విషయం ప్రస్తావించుకోవాలి. ఇన్నిన్ని ప్రైవేట్ టెలివిజన్ ఛానళ్ళు లేని ఆ రోజుల్లో రేడియో వార్తలకు ఎంతో ప్రాముఖ్యం వుండేది. రేడియో విలేకరి వచ్చేవరకు ముఖ్యమైన పత్రికా సమావేశాలు మొదలయ్యేవి కావంటే ఆ ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు. వివిధ రకాల టీవీ నెట్ వర్కులు, బ్రేకింగ్ న్యూస్ ప్రక్రియలు లేకపోవడం వల్ల రేడియో వార్తల్లో కదాచిత్ గా వచ్చే 'ఇప్పుడే అందిన వార్త' కోసం  శ్రోతలు ఆసక్తిగా ఎదురుచూసేవారు. విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం,  అంజయ్య గారి భారీ మంత్రివర్గం రాజీనామా, తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు నాయుడు ఎన్నిక, నెల రోజుల ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానంతరం ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేయాల్సిందని గవర్నర్ ఎన్ టీ రామారావును ఆహ్వానించడం వంటి అతి ముఖ్యమైన సమాచారాన్ని మొట్టమొదట తెలుగునాట నలుదిక్కులకూ తెలియచెప్పిన ఘనత ఆకాశవాణిదే.
ఇక ఆ కోవలో చెప్పుకోదగిన వార్త ఎన్టీఆర్  మరణం. ఆయన మృతి చెందిన వార్త కొద్ది గంటల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి ఉదయం వెలువడే మొట్టమొదటి ఇంగ్లీష్ బులెటిన్ లో ప్రసారమైంది. తద్వారా యావత్ ప్రపంచానికి తెలిసింది.
నర్రావుల సుబ్బారావు గారని ఒక న్యూస్ ఎడిటర్ వుండేవారు. మోచేతుల కిందకి చొక్కా, పంచెకట్టుతో అచ్చం ఒక రైతు మాదిరిగా కనిపించేవారు. నిజానికి ఆయన రైతు పక్షపాతి. ఆయన నైజం వార్తల్లో కూడా ప్రతిఫలించేది. వర్షాలు కురవక పలానా జిల్లాలో పైర్లు ఎండిపోతున్నాయని వార్తల్లో వివరాలతో సహా ప్రసారం చేసేవారు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు. ఆయన మాటకు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎదురులేదు. అయినా సుబ్బారావు గారు తరువాత అనేక సంవత్సరాలు రేడియోలో కొనసాగారు.  రేడియోమీద కానీ, రేడియో వార్తలమీద కానీ సర్కారువారికి పట్టో, పెత్తనమో వుంటుందని ఓ అభిప్రాయం ప్రచారంలో వుంది. ఇలాటి ఉదంతాలు విన్నప్పుడు వాటికి సరైన ప్రాతిపదిక లేదన్న వాస్తవం బోధపడుతుంది.
నా ముప్పయి సంవత్సరాల రేడియో ఉద్యోగం అనుభవంలో గమనించిన అంశాలు కొన్ని వున్నాయి. ఈ కాలంలో విభిన్న రాజకీయ పార్టీలు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కాలంలో గద్దె ఎక్కడంతో - వాటిని వ్యక్తిగతంగా సమర్ధించే శక్తులు, అన్ని వ్యవస్థల్లో మాదిరిగానే రేడియోలో కూడా ప్రవేశించాయి. రాజకీయ నాయకుల ప్రత్యక్ష జోక్యం లేకున్నా, ఈ వ్యక్తి ఆరాధకుల వికృత పోకడల ప్రభావం రేడియో వార్తలపై పడిందనడంలో సందేహం లేదు. అయితే ఎలాటి రాజకీయ ముద్రాంకితాలు లేని ఉద్యోగులు కూడా అదే సమయంలో పూర్తి స్వేచ్చతో, తమ బాధ్యతలు నిర్వర్తించుకోగలుగుతున్నారు. అదే ఈ వ్యవస్థలో నేను గమనించిన విలక్షణ లక్షణం. 
(ఇంకా వుంది)

15, నవంబర్ 2019, శుక్రవారం

రేడియో రోజులు - 16 భండారు శ్రీనివాసరావు




(Published in SURYA daily on 15-11-2019, Friday)


ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో చెన్నారెడ్డిది చెరపలేని ముద్ర. మనసులో ఏదైనా పడితే ఇక ఇంతే సంగతులు. అంత ఉడుం పట్టుతో ప్రత్యర్ధిని తొక్కేయాలని విశ్వ ప్రయత్నం చేయడంలో ఆరితేరిన మనిషి.
రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అయినప్పటికీ, ఆయన తన  సొంత పార్టీ మనిషి  వై.ఎస్. రాజశేఖరరెడ్డినే ప్రధాన ప్రత్యర్ధిగా భావించేవారు. అవకాశం దొరికినప్పుడల్లా వై ఎస్  ని బద్నాం  చేయడం ఆయన వ్యూహాల్లో ఒకటిగా వుండేది. ఆ రోజుల్లో ఢిల్లీ నుంచి ఒక సమాచారం అందింది. ఆయన  పార్టీ వాళ్ళే దాన్ని చెన్నారెడ్డికి మోశారు. ఆంధ్రాభవన్ గేటు దగ్గర సెక్యూరిటీతో వై ఎస్ గొడవ పడ్డాడన్నది దాని సారాంశం. ఆ విషయం స్థానిక పత్రికల్లో, ప్రత్యేకించి ఇంగ్లీష్ పత్రికల్లో ప్రముఖంగా వచ్చేట్టు చూడాలని పీ ఆర్ వో ఆదేశించారు. అ అధికారి ఆ వార్తను పట్టుకుని ప్రధాన పత్రికల ఎడిటర్లను కలుసుకుని స్వయంగా విన్నవింపులు చేసుకోవడం జరిగింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్ ఆయన్ని  హెచ్చరించారు, ఈ విషయం వై.ఎస్. కి తెలిస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోమని. మొత్తం మీద ఆ వార్త ముఖ్యమంత్రి అనుకున్నంత ప్రముఖంగా కాకపోయినా మర్నాడు పత్రికల్లో వచ్చింది. వై ఎస్ సామాన్యుడు కాదుకదా! ఆంధ్రా భవన్ లోకి అడుగు పెట్టేది లేదని భీషణ ప్రతిన పూనారు. ముఖ్యమంత్రి అయిన తరువాతనే అందులో కాలు పెట్టారు. మరో విచిత్రం ఏమిటంటే, తాను  ముఖ్యమంత్రి కాగానే,  తన గురించిన వార్త పత్రికల్లో చెడ్డగా  రావడానికి కారణం అయిన  వ్యక్తినే పీఆర్వో గా తీసుకోవాలని ఆలోచన చేశారు కూడా. అలా వుండేది వై. ఎస్. తరహా.     
చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనతో సహా ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తిరుపతిలో సమావేశం అయ్యారు. నదీ జలాల పంపిణీ ప్రధాన ఎజెండా. బొంబాయి నుంచి వచ్చిన బ్లిట్జ్ కరస్పాండెంటుకు  మర్నాడు హైదరాబాదులో ముఖ్యమంత్రి  ఇంటర్వ్యూ ఇచ్చారు. కొద్ది రోజుల తరువాత అది ఆ పత్రికలో వచ్చింది. అయితే ఆ వార్త నదీజలాలకు సంబంధించింది కాదు. ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేతులు కలుపుతున్నారన్నది అందులోని సమాచారం. అది చూసి ఆయన పీ ఆర్వో కంగారు పడుతుంటే, ‘ఏమవుతుంది ఆ వార్త వస్తే. కాస్త మనమంటే ఏమిటో ఆవిడకూ తెలియాలి కదా, ఆ మాత్రం బెదురు వుండాల్సిందే’  అన్నారాయన తాపీగా.

(ఇంకా వుంది)

రేడియో రోజులు – 15 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 14-11-2019, Thursday)

రెండున్నర అణాల కోసం నానా హైరానా
రాష్ట్ర ప్రభుత్వాల సంగతి తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడడానికి అనేక నిబంధనలు వుంటాయి. అయితే దుర్వినియోగం అసలు ఏమాత్రం జరగదు అని చెప్పడానికి కూడా వీలు లేదు. నిబంధనలను అతిక్రమించేవారికి భారీ జరిమానాలు వుంటాయి. కానీ నిబంధనలకు విరుగుళ్ళు కనిపెట్టి ప్రభుత్వ బొక్కసానికి చిల్లులు పెట్టే ఘనులు కూడా వుంటారు. ఖచ్చితమైన ఆడిటింగ్ వుంటుంది. ఖర్చుపెట్టే ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సివుంటుంది. లెక్క అంటే మరేమీలేదు, ప్రతి ఖర్చుకూ ఒక రసీదు సమర్పించాలి. వాటి చాటు మాటున గుట్టుముట్లు ఏమిటన్నది జవాబు లేని ప్రశ్న.
ఒక సంగతి చెప్పుకునేవారు. ఎంత నిజమో తెలియదు. కలకత్తా ఆలిండియా రేడియో డైరెక్టర్ ఒక కార్యక్రమ రూపకల్పనలో రెండున్నర అణాలు (ఆనాటి ద్రవ్యమానం ప్రకారం రూపాయికి పదహారణాలు) నిబందనలను ఖాతరు చేయకుండా ఖర్చు చేశాడని  ఆరోపణ.
రేడియో స్టేషన్ వాళ్ళు జంతు ప్రదర్శనశాలలో పిల్లల కోసం ఒక కార్యక్రమాన్ని రికార్డు చేశారు. వివిధ రకాల  జంతువులు, పక్షుల అరుపులు ఎలా వుంటాయనే విషయంపై  చిన్నపిల్లలకు అవగాహన కల్పించడం దీని ఉద్దేశ్యం.  ఇక్కడే అనుకోని అవాంతరం ఎదురయింది.
పిల్లల్ని జూలో ఉన్న  పులి బోను దగ్గరికి తీసుకువెళ్ళారు. ఎంత ప్రయత్నించినా బోనులోని  పులి మూగనోము పట్టింది. పులి గాండ్రించే విధానం రికార్డు చేయడం ఆ కార్యక్రమంలో ముఖ్యమైన అంకం.
జూ కాపలాదారు ఒక తరుణోపాయం చెప్పాడు. ఒక చికెన్ ముక్క పడేస్తే అది మనం చెప్పిన మాట వింటుంది అన్నాడు. రేడియో అధికారులు రెండున్నర అణాలు అతడి చేతిలో పెట్టి మాంసం తెప్పించి పులి నోటికి అందించారు. చిత్రంగా అతగాడు చెప్పినట్టే ఆ పులి గట్టిగా ఘా౦డ్రి౦చింది. ఆ విధంగా మొత్తం మీద  ఆ రికార్డింగు కార్యక్రమం జయప్రదంగా పూర్తిచేసుకుని వెళ్ళారు.
ఆ తర్వాత పెద్ద చిక్కొచ్చి పడింది. ఆడిట్ వాళ్ళు పులికోసం మాంసం కొనడం నిబంధనలకు విరుద్ధం అని కొర్రీ వేసారు. ఇలా ప్రజాధనాన్ని ఖర్చు చేసే అధికారం స్టేషన్ డైరెక్టర్ కి లేదు పొమ్మన్నారు. వెంటనే ఆ రెండున్నర అణాలు ప్రభుత్వ ఖజానాకు జమ చేయకపొతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రేడియో  రికార్డింగుల నిమిత్తం   కళాకారులను ఆహ్వానించినప్పుడు వారికి కాఫీ గట్రా ఇచ్చి  మర్యాదలు చేసేందుకు కొంత సొమ్ము ఖర్చు చేసే అవకాశం వుందని రేడియో కేంద్రం వారు బదులు చెప్పారు.
ఆడిట్ వాళ్ళు తక్కువ తినలేదు. కళాకారులతో రికార్డింగు చేసేటప్పుడు వారితో కాంట్రాక్ట్ మీద సంతకం చేయించాలనే నిబంధనని వాళ్ళు బయటకు తీసారు. పులితో సంతకం చేయించుకున్నట్టు కాంట్రాక్ట్ వుండాలి. ఠాట్! అది లేకుండా బిల్లును ఆమోదించేది  లేదని మంకుపట్టు పట్టారు.
రేడియో స్టేషన్ కు వచ్చే పెద్దవాళ్ళకు మర్యాదలు చేసేందుకు స్టేషన్ డైరెక్టర్ గా తనకు అధికారాలు వున్నాయని, ఆ పులి రాయల్ బెంగాల్ టైగర్ కాబట్టి ఆ మర్యాదలకు, గౌరవాలకు ఆ పులికి కూడా  అర్హత వున్నదని పాయింటు లేవదీసి మరో లేఖ రాసారు. ఆ పులి రాయల్ బంగాల్ టైగర్ అంటూ జంతు ప్రదర్శనశాల వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ను దానికి జత పరిచారు. తన అరుపు రికార్డింగు చేసుకోవడానికి పులి ఎటువంటి రుసుము అడగనందున కాంట్రాక్ట్ వుండి తీరాలనే నిబంధన ఇక్కడ వర్తించదని,  అందుకే తనకున్న విచక్షణాధికారాతో దాన్ని మినహాయించానని డైరెక్టర్ తన చర్యని సమర్ధించుకున్నారు.
ఆ వివరణతో సంతుష్టి పడిన ఆడిట్ అధికారులు తదుపరి చర్యలను విరమించుకున్నారు.
రెండున్నర అణాల కోసం ఇంత తతంగం, లేఖాయణం నడిచింది. పులిరాజు ఆహారానికి ఖర్చు పెట్టిన దానికంటే పోస్టల్ చార్జీలు ఎక్కువై వుంటాయి.
ఇందులో ఒక నీతితో కూడిన హెచ్చరిక దాగుంది. అదేమిటంటే ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం కుదరదు, ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి గమనించే కనిపించని కన్ను ఒకటుందని చెప్పడం. అయితే ముందే చెప్పినట్టు ప్రతి నిబంధనకు ఓ విరుగుడు కనిపెట్టడం అనేది ఈనాటి తరానికి వెన్నతో పెట్టిన విద్య.
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని వూరికే అనలేదు.
(ఇంకా వుంది)