6, ఆగస్టు 2019, మంగళవారం

కాశ్మీర్ : నమ్మలేని నిజాలు


పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి అంటూ  దశాబ్దాల తరబడి  నాన్చుతూ వస్తున్న ఓ మొండి  సమస్యకి ముగింపు పలుకుతూ  ప్రధాని మోడీ చివరికి ఆ గంట కట్టారు. అయితే ఇది ముగింపా లేక మరో సమస్య పురుడు పోసుకోవడానికి ప్రారంభమా అనేది కాలమే చెప్పాలి.  
నా చిన్నప్పుడు కాశ్మీర్ అంటే భూతల స్వర్గం అనేవారు. పెరిగి పెద్దయ్యే సరికి అది భూతాల స్వర్గం అవుతుందని ఆరోజుల్లో ఎవరూ అనుకోలేదు.  కాశ్మీర్ అంటే మంచు ముంచెత్తే లోయలు. కాశ్మీర్ అంటే అందమైన సరస్సులు.  కాశ్మీర్ అంటే కనువిందు చేసే ప్రకృతి. కాశ్మీర్ అంటే జీవితంలో ఏదో ఒక రోజు చూసితీరాలని అనిపించే ఇహలోక స్వర్గం. తీరని ఆ కోరిక తీర్చుకోవడం కోసమేమో తెలియదు,  కాశ్మీర్ అందచందాలను ఆరబోసే హిందీ చలన చిత్రాలను, ఆ భాష అర్ధం కానివాళ్ళు కూడా విరగబడి చూసేవాళ్ళు. ఒకప్పుడు కాశ్మీర్ అన్నా, దాన్నే  ఇప్పుడు కష్మీర్ అంటున్నా అది నిజంగా భూతల స్వర్గమే.
‘భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, కాశ్మీర్ ప్రధాన మంత్రి షేక్ అబ్దుల్లాతో భేటీ’ అనే వార్త చిన్నప్పుడు పత్రికల్లో  చదివినప్పుడు, ‘ఇదేమిటి కాశ్మీర్ భారత్ లో లేదా, దానికి వేరే ప్రధానమంత్రి ఏమిటి?’ అనే సందేహాలు పొటమరించేవి.
కాశ్మీర్ చరిత్రే కాదు, ఏ ప్రాంతపు చరిత్ర అయినా ఆయా కాలాల్లో నివసించిన లేదా వాటిని గురించి అధ్యయనం చేసిన చరిత్రకారులు రాసిన  పుస్తకాల ద్వారా మాత్రమే తెలుసుకోవడానికి వీలుంటుంది. అంతమాత్రాన అది నూటికి నూరుపాళ్ళు వాస్తవమైన చరిత్ర అని అనుకోలేము. రాసేవారి మనోభావాలుబట్టి, వారి వారి భావజాలాన్నిబట్టి కొంత వక్రీకరణ చోటుచేసుకునే వీలుంటుంది. అవి చదివేవాళ్ళు కూడా వారి వారి అభిప్రాయాలకు తగ్గట్టుగానే చరిత్ర గురించిన అభిప్రాయాలను ఏర్పరచుకునే అవకాశం వుంటుంది. భావితరాల వారు ఇదే  నిజమైన చరిత్ర అని అపోహపడే ప్రమాదం కూడా వుంటుంది. కానీ ఇంతకూ మించి మనం చరిత్రను అవగతం చేసుకునే  వీలు ప్రస్తుతానికి లేదు. ఈ విషయం గమనంలో ఉంచుకుని చరిత్రను అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే అపార్ధాలకు తావుండదు.
స్వతంత్ర భారత చరిత్రలో జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరికీ అత్యంత విలువైన స్థానం వుంది. స్వతంత్ర భారత రూపకల్పనలో ఎవరూ కాదనలేని స్థానం వారిద్దరిదీ. ఇరువురూ ఒకే రాజకీయ పార్టీకి చెందినా వారయినా వారి ఆలోచనా రీతులు విభిన్నం. ఆ నాటి పరిస్తితుల నేపధ్యంలో చరిత్రను అర్ధం చేసుకోకుండా, కేవలం వ్యక్తి ఆరాధన కారణంతో విశ్లేషించుకుంటే మిగిలేది చరిత్ర కాదు, కేవలం ఊహాగానభరితమైన కధాకధనం మాత్రమే. విచిత్రం ఏమిటంటే నెహ్రూను అభిమానించేవారు వారు పటేల్ పట్ల కూడా అదే విధమైన ఆరాధనభావంతో వుంటారు. అలాగే పటేల్ అభిమానులు కూడా నెహ్రూను ప్రేమిస్తారు. అయితే రాజకీయాల కోణం నుంచి చూస్తే వారికీ వీరికీ చుక్కెదురు. నెహ్రూ విధానాలను వ్యతిరేకించేవారు పటేల్ ను కారణం లేకుండానే అభిమానిస్తారు. ఒక రకంగా సినీ నటుల అభిమానులు ప్రదర్శించే గుడ్డి అభిమానం అనుకోవచ్చేమో!
ఈఇరువురు నాయకులను గురించి అనేక గ్రంధాలు వెలువడ్డాయి. కొన్ని వారి సమకాలీనులు రాసినవి. మరికొన్ని వారి తదనంతర కాలంలో అధ్యయనం చేసి రాసినవి. ముందే చెప్పినట్టు వారిపట్ల రచయితలకు ఉన్న సహజసిద్ధమైన అభిమానపు ఛాయలు వాటిల్లో తొంగిచూడడంలో ఆశ్చర్యం లేదు.
పాకిస్తాన్ కనుక  హైదరాబాద్ డెక్కన్ (నాటి నిజాం సంస్థానం) పేరెత్తకుండా వుంటే,  కాశ్మీర్ ను పాక్  కు వదిలేసేందుకు  పటేల్ సుముఖత వ్యక్తం చేసారని కాశ్మీర్ నేత సైఫుద్దీన్ సోజ్, ‘కాశ్మీర్, గ్లింప్స్ ఆఫ్ హిస్టరీ అండ్ ది స్టొరీ ఆఫ్ స్ట్రగుల్’ అనే  పుస్తకంలో రాసారు.
ఆ ప్రకారం పటేల్ చేసిన ప్రతిపాదనను పాకీస్తాన్ లో కాశ్మీర్ వ్యవహారాలు కనిపెట్టి చూసే హయత్ ఖాన్ కు బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్ అందించారు.  పాకీస్తాన్ హైదరాబాద్ డెక్కన్  పేరెత్తకుండా వుంటే  కాశ్మీర్ ను పాక్  కు ఇచ్చేందుకు సిద్ధమేనని పటేల్ షరతు పెట్టారన్నది ఆ ప్రతిపాదన.
హయత్ ఖాన్ దాన్ని అప్పటి పాక్ ప్రధాని లియాకత్ ఆలీఖాన్ కు చేరవేశారు.
‘కాశ్మీర్ కోసం, అక్కడి బండరాళ్ళ కోసం పంజాబ్ కంటే విశాలమైన హైదరాబాద్ డెక్కన్  వదులుకునేందుకు నేనేమీ పిచ్చివాడిని కాదు’ అన్నది  లియాఖత్ స్పందన.
కాశ్మీర్ ను వదులుకునేందుకు  తొలిరోజుల్లో పటేల్ సుముఖంగానే ఉండేవారని ఆయన దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా  పనిచేసిన వీపీ మీనన్ చెప్పారు.
భారత దేశం, పాకీస్తాన్ ఈ రెంటిలో దేనిలో చేరతారో  తేల్చుకోండని  వల్లభాయ్ పటేల్, 1947 జూన్  3వ తేదీన ఆనాడు దేశంలో లెక్కకు మిక్కిలిగా ఉన్న స్వదేశీ సంస్థానాధీసులకు రాసిన లేఖలో  ఓ అవకాశం ఇచ్చారని ‘ఇంటిగ్రేషన్  ఆఫ్ ఇండియన్ స్టేట్స్’ అనే పేరుతొ రాసిన ఓ పుస్తకంలో మీనన్  పేర్కొన్నారు.
రాజ్ మోహన్ గాంధి ‘పటేల్ ఏ లైఫ్’ అనే పేరుతొ పుస్తకం రాసారు. అందులో పటేల్ గురించి పేర్కొన్న కొన్ని విషయాలు:
1947 అక్టోబర్  26 న నెహ్రూ నివాసంలో ఒక  సమావేశం జరిగింది. మహరాజా హరిసింగ్ దూతగా వచ్చిన  మెహర్ చాంద్ మహాజన్ కాశ్మీర్ రాజు తరపున  భారత్ సైనిక సాయాన్ని అర్ధించారు. ఇందుకు  భారత్ అంగీకరించని పక్షంలో పాకీస్తాన్ సాయం కోరాల్సివస్తుందని కూడా మెహర్ చాంద్ చెప్పారు.  ఆ మాట నెహ్రూకు విపరీతమైన కోపం తెప్పించింది. ‘అలా అయితే తక్షణం వెళ్ళిపొమ్మని ఆ దూతని ఆదేశించారు. సర్దార్ పటేల్ ఆ సమయలో కలగచేసుకుని ‘మహాజన్! మీరు పాకిస్తాన్ తో కలవడం లేదు’ అని హామీ ఇచ్చారు. (అంటే భారత్ మీరు అడిగిన సాయం చేయడానికి సిద్ధంగా వుంది  అనే అర్ధం అందులో వుందని రాజ్ మోహన్ గాంధి అభిప్రాయం)
కాశ్మీర్ పట్ల పటేల్ కు పెద్ద ఆసక్తి లేదని తెలిపే మరో ఉదంతాన్ని గుజరాతీ చరిత్రకారుడు, రచయిత అయిన ఊర్విష్ కొఠారి బీబీసీ ప్రతినిధికి వెల్లడించారు. ‘సచో మానస్ సాచి వాట్’ అనే పేరుతొ గుజరాతీలో ఊర్విష్ కొఠారి ఒక పుస్తకం రాసారు. అందులో పేర్కొన్న కొన్ని విషయాలను ఆ రచయిత బీబీసీతో పంచుకున్నారు.
“కాశ్మీర్ లో ముస్లిం జనాభా ఎక్కువ. భౌగోళికంగా చూసినా ఆ ప్రాంతం  పాకిస్తాన్ కు దాపులో వుంది. అంచేత భారత్ లో  కాశ్మీర్ విలీనం పట్ల  పటేల్ కు పెద్దగా  ఆసక్తి లేదు. అయితే స్వయానా కాశ్మీరీ అయిన నెహ్రూకు మాత్రం కాశ్మీర్ ను  భారత్ లో కలపాలనే కోరిక బలంగా  వుండేది. పైగా మహారాజా హరి సింగ్ , షేక్ అబ్దుల్లా ఇద్దరూ నెహ్రూకు మంచి స్నేహితులు. కాశ్మీర్ విషయంలో అవసరానికి మించి నెహ్రూ సున్నితంగా, ఉదారంగా వ్యవహరించడానికి అదో కారణం  అంటారు ఊర్విష్.
ముందే చెప్పినట్టు ఈ పుస్తకాల్లో రాసినవన్నీ అక్షర సత్యాలని భావించలేము. ఆ రోజుల్లో అంటే నెహ్రూ శకంలో వల్లభాయ్ పటేల్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు జరిగాయన్నది కొందరి వాదన.
భారత్ లో కాశ్మీర్ విలీనం జరిగి ఏండ్లూ పూ౦డ్లూ గడిచిపోయాయి. ఇందుకు సంబంధించిన వివరాలు, పత్రాలు భారత పార్లమెంటు గ్రంధాలయంలో దొరికే అవకాశం వుంది.
అయితే ఈనాటి వేగయుగంలో అంతటి ఓపికా తీరికా ఉన్నవారు తక్కువ. కాబట్టి నమ్మినా నమ్మకపోయినా కొన్ని పుస్తకాల్లో రాసిన విషయాలనే ప్రామాణికంగా తీసుకోవాల్సి వస్తోంది. 

KSR Live Show | మోడీ సర్కార్ సంచలన నిర్ణయం...370 అధికరనం రద్దు - 6th Aug...





ప్రతి మంగళవారం మాదిరిగానే  ఈరోజు ఉదయం సాక్షి టీవీ  KSR LIVE SHOW చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ  జనక్ ప్రసాద్  (కాంగ్రెస్),  శ్రీమతి మాధవి కొల్లి  (బీజేపీ),  డాక్టర్  సుధాకర్  (సీపీఐ)

5, ఆగస్టు 2019, సోమవారం

Debate on AP Speaker Tammineni Sensational Comments on VP Venkaiah Naidu...





ప్రతి సోమవారం  మాదిరిగానే  ఈరోజు  ఉదయం   Ap 24 X 7   న్యూస్  ఛానల్ లో Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ కుటుంబరావు (టీడీపీ), శ్రీ కరణం ధర్మశ్రీ (వైసీపీ), శ్రీ సత్యమూర్తి (బీజేపీ), శ్రీ  సుందర రామ శర్మ (కాంగ్రెస్)

జమ్మూ కాశ్మీర్ ను మూడు ముక్కలు గా విడగొడతారా ...? | The Debate with VK |...





ప్రతి సోమవారం  మాదిరిగానే  ఈరోజు  ఉదయం   Ap 24 X 7   న్యూస్  ఛానల్ లో Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ కుటుంబరావు (టీడీపీ), శ్రీ కరణం ధర్మశ్రీ (వైసీపీ), శ్రీ సత్యమూర్తి (బీజేపీ), శ్రీ  సుందర రామ శర్మ (కాంగ్రెస్)

Debate on BJP Leader Warns AP Govt Over Polavaram Re Tendering Row | The...





ప్రతి సోమవారం  మాదిరిగానే  ఈరోజు  ఉదయం   Ap 24 X 7   న్యూస్  ఛానల్ లో Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ కుటుంబరావు (టీడీపీ), శ్రీ కరణం ధర్మశ్రీ (వైసీపీ), శ్రీ సత్యమూర్తి (బీజేపీ), శ్రీ  సుందర రామ శర్మ (కాంగ్రెస్)

4, ఆగస్టు 2019, ఆదివారం

Live : కశ్మీరంలో ఏం జరుగుతోంది..? | News Scan LIVE Debate With Vijay | 4...





ప్రతి  ఆదివారం  మాదిరిగానే  ఈరోజు  ఉదయం   TV 5 ఎక్జిక్యూటివ్  ఎడిటర్  శ్రీ  విజయ్  నారాయణ్  నిర్వహించిన  News Scan చర్చాకార్యక్రమంలో  నాతోపాటు  పాల్గొన్నవాళ్ళు : శ్రీ బెల్లయ్య  నాయక  (కాంగ్రెస్), శ్రీ ప్రకాష్ రెడ్డి (బీజేపీ). శ్రీ  పద్మనాభయ్య  (కేంద్ర ప్రభుత్వ మాజీ హోం శాఖ కార్యదర్శి, కాశ్మీర్ వ్యవహారాల ఇంచార్జ్, ముంబై నుంచి ఫోన్ లైన్లో)

3, ఆగస్టు 2019, శనివారం

మరో వివాదంలో పోలవరం - భండారు శ్రీనివాసరావు


దిన దిన గండం నూరేళ్ళ ఆయుస్సు మాదిరిగా నడుస్తోంది పోలవరం కధ. పేరులో మాత్రమె వరం వుండి శాపగ్రస్త ప్రాజెక్టుగా మారిన ఈ పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం కంచికి చేరని కధలా సాగిపోతోంది. బాలారిష్టాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. వార్తల్లో మాత్రమే  కనిపించే ఈ ప్రాజెక్ట్  వాస్తవరూపం దాల్చి, ఫలాలు అందించడానికి ఏండ్లూ పూండ్లూ పట్టేట్టు వుంది.  
అనేక శంకుస్థాపన ఫలకాలు మెడలో హారంలా మిగిలాయి కానీ ప్రాజెక్టు మాత్రం ప్రారంభోత్సవ ఫలకం కోసం ఇంకా ఎదురుచూపులు చూస్తూనే వుంది.
ఎప్పుడో ఎనభయ్యవ దశకంలో ఆ నాటి ముఖ్యమంత్రి టీ. అంజయ్య గారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం పునాదిరాయి వేసినప్పటినుంచి ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు మారాయి. ముఖ్యమంత్రులు మారారు. అసలు రాష్ట్ర స్వరూపమే మారిపోయింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయింది.
విభజన అనంతరం ప్రాజెక్టులో కదలిక మొదలయింది. కొత్తగా ఏర్పడ్డ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి సారధిగా చంద్రబాబు నాయుడు, దేశ సారధిగా నరేంద్ర మోడీ పగ్గాలు చెప్పడంతో కొత్త ఆశలు చిగురించాయి. అప్పట్లో వాళ్ళిద్దరూ మంచి మిత్రులు కావడం, వారు ప్రాతినిధ్యం వహించే టీడీపీ, బీజేపీలు రెండూ మిత్ర పక్షాలు కావడం, నిధుల కొరత ఉండదనే ధీమా ప్రబలడం ఇవన్నీ మంచి శకునాలే అనుకున్నారు. పోలవరం అనుకున్న వ్యవధిలో పూర్తి కాగలదని ఆ రెండు పార్టీల నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా నమ్మారు.
కాలం ఎప్పుడూ ఒకే రీతిన సాగిపోతే ఇక ఆ కాలానికి మహిమ ఏముంటుంది?
ఆ కాలమహిమ కారణంగా మిత్రుల నడుమ పొరపొచ్చాలు వచ్చాయి. ఆ మిత్రత్వం కూడా కడుపులో వుండి కాదు, కావిలించుకుంటే వచ్చింది కాబట్టి ఆ స్నేహ బంధానికి కాలయాపన లేకుండానే కాలం  చెల్లింది. ఆ రెండు పార్టీల నడుమ ఏర్పడ్డ బంధం రాజకీయ కారణాల వల్ల కాబట్టి ఆ రాజకీయ కారణాలే ఆ బంధాన్ని తెగగొట్టాయి. రెండు రాజకీయ పార్టీలు విడిపోతే దేశానికి వచ్చే నష్టం ఏమీ వుండదు. కాకపోతే ఆ ప్రభావం పోలవరం వంటి ప్రాజెక్టుపై పడింది.
ఇచ్చిన నిధులకు లెక్కలు అడిగారు ఢిల్లీ ఏలికలు. రాష్ట్రం పంపిన లెక్కలు కేంద్రం వారికి రుచించలేదు. కొత్తగా నిధులు రాకపోగా రావాల్సిన నిధులు కూడా ఆపేశారు, కేంద్రం ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంపై కక్ష కట్టింది అని ఆక్రోశించారు తెలుగు దేశం నాయకులు. నిధుల దుర్వినియోగం జరుగుతోందని బీజేపీ శ్రేణుల ముక్తాయింపు.
ఈ లోగా కాంట్రాక్టర్ మారారు. కొత్త కాంట్రాక్టర్ రంగంలోకి వచ్చారు. వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రాజెక్టును నామినేషన్ పద్దతిపై తోచిన వారికి కట్టబెడతారా అని ప్రతిపక్ష వైసీపీ నేత హుంకరింపు.
ఇక్కడ కొంత నేపధ్యాన్ని మననం చేసుకోవాలి.
రాష్ట్రం రెండుగా విడిపోక ముందు అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి హయాములో పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును ట్రాన్స్ ట్రాయ్ సంస్థ దక్కించుకుంది. విభజన అనంతర పరిణామాలు ప్రాజెక్టు నిర్మాణంపై దుష్ప్రభావాన్ని చూపాయి.  కాంట్రాక్టర్ చేతులు ఎత్తేయడంతో తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రముఖ నిర్మాణ సంస్థ నవయుగ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి పనుల వేగం పెరిగింది. వారం వారం ప్రతి సోమవారాన్ని ‘పోలవరం’గా ప్రకటించి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించే వినూత్న కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ పురోగతిని  ఆనాటి ప్రభుత్వం రాజకీయంగా వాడుకోవాలని చూసింది. రాష్ట్రం  నలుమూల నుంచి ప్రత్యేక బస్సులు వేసి ప్రజలను తీసుకు వెళ్లి ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని కళ్ళకు కట్టినట్టు చూపే ప్రచార కార్యక్రమానికి తెర లేపింది. ఇది సహజంగానే ప్రతిపక్ష వైసీపీకి మింగుడు పడలేదు. ఆ రోజుల్లోనే వైసీపీ నాయకుడు వై.ఎస్. జగన్ మోహన రెడ్డి తన పాదయాత్రలో అనేక సందర్భాలలో పోలవరం అవినీతి గురించి పెక్కు సార్లు ప్రస్తావించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే  విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
కధ ఇలా సాగుతూ ఉండగానే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అప్పటివరకు పోలవరం ప్రాజెక్టును కొంతవరకు పూర్తిచేసిన తెలుగు దేశం ప్రభుత్వం ప్రతిపక్ష పాత్రలోకి మారిపోయింది. పోలవరంలో టీడీపీ పెద్దఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపణలు చేస్తూ వచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చింది. అదీ ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీతో.
కధ మొదటికి వచ్చింది. వైసీపీ అధినాయకుడు, కొత్త ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన రెడ్డి రెండు మాసాలు కూడా గడవక ముందే పోలవరం ప్రాజెక్టు వ్యవహారాలు గురించి నిపుణుల కమిటీ వేయడం, అది నివేదిక ఇవ్వడం, దాని ఆధారంగా ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న కాంట్రాక్టర్ ను ఆ పని నుంచి తప్పుకోవాలని ఆదేశించడం ఆఘమేఘాల మీద జరిగిపోయింది.
నవయుగతో చేసుకున్న ఒప్పందం ప్రధాన  నిర్మాణ సంస్థ ట్రాన్స్ ట్రాయ్ తో కుదుర్చుకున్న ఒప్పందానికి విరుద్ధమని వైసీపీ భావించింది. కాంట్రాక్టర్ మార్పిడిలో తెలుగుదేశం ప్రభుత్వం భారీ ముడుపులకు తెర తీసిందని ఆ పార్టీ  గట్టిగా నమ్ముతోంది. ట్రాన్స్ ట్రాయ్ మాత్రమే చేపట్టాల్సిన పనులను ఈపీసీ విధానానికి వ్యతిరేకంగా నవయుగ సంస్థకు అప్పగించారని నిపుణుల కమిటీ కూడా అభిప్రాయ పడింది.
‘పనులను ఈపీసీ కింద అప్పగించాక అంచనాలు పెంచడం, 60 - సి కింద నోటీసులు జారీ చేయడం మార్గదర్శకాలకు  విరుద్ధం అని పేర్కొన్నది. అంచేత ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలని నిపుణుల కమిటీ  రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
ఈ కమిటీ సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం తరపున నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు తక్షణం పనులు నిలిపి వేయాలని నిర్మాణ సంస్థ నవయుగ ను కోరారు. గత అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో అతి ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుని, నవనాడులు కుంగిపోయిన స్తితిలో ఉన్న తెలుగు దేశం పార్టీ నాయకులకు ఈ పరిణామం కొంత ఉపశమనం కలిగించింది. రాష్ట్రానికి వరప్రసాదిని వంటి పోలవరాన్ని పాలక పక్షం వైసీపీ అడుగడుగునా అడ్డుకుంటోందని, సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను ఫణంగా పెడుతోందని ఒంటి కాలిపై నిలబడి ఆరోపణాస్త్రాలు సంధించడం మొదలు పెట్టారు.
రివర్స్ టెండరింగ్ పేరుతొ పోలవరం ప్రాజెక్టు ను ఆలస్యం చేస్తే వ్యయం అంచనాలు బాగా పెరిగిపోవడమే కాకుండా అనుకున్న వ్యవధిలో ప్రాజెక్టు పూర్తి చేయడం కష్టమని వారి వాదన.
పోలవరం వంటి భారీ సేద్యపు నీటి ప్రాజెక్టులను ఎలాంటి అంతరాయాలు, అవరోధాలు లేకుండా పూర్తి చేయడం ఎంత గొప్ప కాంట్రాక్టర్ కైనా సాధ్యం కాదు. సుదీర్ఘ కాలం సాగే నిర్మాణంలో అనేక ప్రకృతి పరమైన అవరోధాలు ఏర్పడడం కద్దు. వర్షాకాలంలో నదీ ప్రవాహం బాగా పెరుగుతుంది. తప్పనిసరిగా కొంత కాలంపాటు నిర్మాణ పనులను ఆపి వేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రాజెక్టు నిర్మాణం కుంటుపడుతుందని చెప్పే వాదనలో పస లేదు. పైగా పోలవరం పూర్తయ్యే వరకు రైతులకు సేద్యపు నీటి ఇబ్బందులు లేకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు పట్టుబట్టి నిర్మించిన పట్టిసీమ ఎలాగూ వుంది.
కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రాజెక్టు పనులను యేవో కొన్ని సాంకేతిక కారణాలు చూపించి నామినేషన్ పద్దతిపై కాంట్రాక్టర్లకు అప్పగించే విధానం మంచిది కాదు. అనుకున్న వ్యవధిలో ప్రాజెక్టు పూర్తి చేయాలనే తపనను ఎవరూ అపార్ధం చేసుకోరు. పైగా హర్షిస్తారు కూడా. అయితే అదే సమయంలో ప్రభుత్వం అనుసరించిన పద్దతులుఏమిటి అనే విషయాన్ని కూడా గమనంలోకి తీసుకోక తప్పదు. నియమాలను, నిబంధనలను పాటించండి అని కోరే ప్రభుత్వాలు వాటిని ఏర్పరచింది తామే అని మరవకూడదు.
ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన నిబంధనలు ఒక్కోసారి వింతగా అనిపించవచ్చు.
‘ఇచ్చిన అప్పు, దానిపై పేరుకు పోయిన వడ్డీల వసూలుకోసం  అంతకంటే ఎక్కువ మొత్తాలలో న్యాయవాదులకు ఫీజులు చెల్లించడంలో ఔచిత్యం ఏమిటని ఓసారి ఓ బ్యాంకు ఉన్నతాధికారిని అడిగాను.
ఆయన ఇలా జవాబు చెప్పారు.
“అప్పిచ్చిన మొత్తం చిన్నదే కావచ్చు. దాన్ని వసూలు చేయడానికి పెట్టే ఖర్చు ఎక్కువే కావచ్చు. ఒక పైసా ప్రభుత్వధనం కూడా  దుర్వినియోగం కాకుండా చూడాలనే మహత్తర లక్ష్యం అందులో దాగుంది. ఆ విషయాన్ని గమనంలో వుంచుకుంటే ఈ అనుమానాలు రావు”