10, సెప్టెంబర్ 2018, సోమవారం

మాయమై పోతున్న మా ఇల్లు

కంభంపాడులో మా ఇల్లు
ఇప్పటికి ఎనభయ్ ఏళ్ళు దాటినవాళ్ళు కూడా కంభంపాడు ఇంట్లోనే పుట్టారు అంటే ఇక ఆ ఇంటి వయసు ఎంతో, ఎప్పుడు కట్టారో ఊహించుకుంటే దానికి నూరేళ్ళు నిండాయనే అనిపిస్తోంది. నిజంగానే ఆ ఇంటికి త్వరలో నూరేళ్ళు నిండబోతున్నాయి. పదేపదే మరమ్మతులు వస్తూ వుండడం, శిధిల ఛాయలు కానరావడం బహుశా ఆ ఇంటి కూల్చివేతకు కారణం అనుకుంటున్నాను.
ఏమైనా ఈ ఇంటికి ఓ ఘన చరిత్ర వుంది. పందిరి గుంజను ముట్టుకుంటే పిల్లలు పుడతారన్న నానుడి కలిగేంతగా ఈ ఇంట్లో అనేకమంది జన్మించారు. అందుకే ఈ ఇంటి గురించిన జ్ఞాపకాలు పంచుకోవాలనే ఈ ప్రయత్నం:


కంభంపాడులో మా ఇల్లు పెద్ద భవంతి ఏమీ కాదు. ఈ ఇల్లు కట్టడానికి ముందు ఉన్న ఇల్లు మాత్రం చాలా పెద్దది, మండువా లోగిలి అని చెబుతారు. మా తాతగారి కాలంలో ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురయింది. ఆ సంఘటనలో కాలిపోగా మిగిలిన కలపతో కొత్త ఇల్లు కట్టారని చెబుతారు. ఇప్పటికీ వసారాలో వేసిన పైకప్పులో కాలిన నల్లటి మచ్చలు కానవస్తాయి. ముందు వసారా. పక్కన దక్షిణాన ఒక పడక గది, మధ్యలో పెద్ద హాలు, దానికి ఆనుకుని ఒక పెద్ద గది, వెనుకవైపు మళ్ళీ ఓ వసారా, పక్కన వంటిల్లు. వెనుక వసారాలో పాలు కాచుకునే దాలి గుంట, పక్కనే మజ్జిగ చిలికే కవ్వం. అక్కడక్కడా గోడల్లోనే చిన్న చిన్న గూళ్ళు, వంటింట్లో రెండు ఇటుకల పొయ్యిలు, గోడకు రెండు చెక్క బీరువాలు, ఒకటి మడి బీరువా, ఆవకాయ కారాల జాడీలు పెట్టుకోవడానికి, రెండో బీరువాలో పెరుగు కుండలు, కాఫీ పొడి పంచదార మొదలయినవి దాచుకునే సీసాలు. వాటితో పాటే పిల్లలకోసం తయారు చేసిన చిరు తిళ్ళు. ఈ రెండు బీరువాలు తాకడానికి కూడా పిల్లలకు హక్కు వుండేది కాదు. మడి బీరువా మరీ అపురూపం. దానికి తాళం కూడా వుండేది కాదు, అందులోనే చిల్లర డబ్బులు దాచి పెట్టేవారు. పొరబాటున కూడా ఇంట్లో ఎవ్వరూ మైల బట్టలతో వాటిని తాకే సాహసం చేసే వాళ్ళు కాదు. వంటింటి వసారాలోనుంచి పెరట్లోకి గుమ్మం వుండేది. దానికింద వలయాకారంగా మెట్లు. కింద తులసి కోట. ఒక వైపు బాదం చెట్టు. అక్కడ అంతా నల్ల చీమలు. ఎర్రగా పండిన బాదం పండ్లు కొరుక్కు తింటే భలే బాగుండేవి. ఇక బాదం పప్పు రుచే వేరు. దానికి పక్కనే పున్నాగ చెట్టు. నేలరాలిన పూలు భలే మంచి వాసన వేసేవి. మా అక్కయ్యలు వాటిని సుతారంగా మడిచి మాలలు కట్టుకునే వాళ్ళు. మేము వాటితో బూరలు చేసి వూదేవాళ్ళం. దగ్గరలో ములగ చెట్టు. కొమ్మల నుంచి ములక్కాడలు వేలాడుతూ కనిపించేవి. అక్కడే రెండు బొప్పాయి చెట్లు కవల పిల్లల్లా ఉండేవి.
రెండో వైపు కొంచెం దూరంలో గిలక బావి. ఆ బావి చుట్టూ చప్టా. పక్కనే రెండు పెద్ద గాబులు (నీటి తొట్టెలు). ఒకటి స్నానాలకి, రెండోది బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి. స్నానాల గాబు పక్కనే వేడి నీళ్ళ కాగు. అక్కడే చెంబుతో వేడి నీళ్ళు, గాబు లోని చల్ల నీళ్ళు సరిపాట్లు చేసుకుంటూ పిల్లలు స్నానాలు చేసేవాళ్ళు. పెద్ద వాళ్ళు బావిదగ్గర నిలబడి, పనివాళ్ళు నీళ్ళు తోడి ఇస్తుంటే పిండితో వొళ్ళు రుద్దుకుంటూ స్నానాలు చేసేవాళ్ళు. నాకు బాగా బుద్ధి తెలిసే వరకు ‘సబ్బు’ గృహ ప్రవేశం చేయలేదు. బావి దగ్గర నుంచి వెనుక పెరట్లోకి చిన్న చిన్న కాలువలు ఉండేవి. ఇంట్లోకి అవసరం అయ్యే కాయగూరల్ని, ఆకు కూరల్ని అక్కడే పండించే వాళ్ళు. చుట్టూ కంచెగా వున్నా ముళ్ళ కంపకు కాకర పాదులు పాకించే వాళ్ళు. తేలిగ్గా ఓ పట్టాన తెంపుకు పోవడానికి వీల్లేకుండా. అక్కడే మాకు పెద్ద పెద్ద బూడిద గుమ్మడి కాయలు, మంచి గుమ్మడి కాయలు కనబడేవి. అంత పెద్దవి అక్కడికి ఎలా వచ్చాయో అని ఆశ్చర్యపడేవాళ్ళం. నాకు పొట్ల పందిరి ఇష్టం. పందిరి మీద అల్లుకున్న తీగె నుంచి పొట్ల కాయలు పాముల్లా వేలాడుతుండేవి. పొట్లకు పొరుగు గిట్టదు అనేది మా బామ్మ. పొరుగున మరో కూరగాయల పాదు వుండకూడదట.
బచ్చల పాదులు అంటే కూడా పిల్లలకు ఇష్టం. ఎందుకంటె వాటికి నల్ల రంగుతో చిన్న చిన్న పళ్ళు (విత్తనాలు) కాసేవి. వాటిని చిదిమితే చేతులు ఎర్రపడేవి. నెత్తురు కారుతున్నట్టు ఏడుస్తూ పెద్దవాళ్ళని భయపెట్టే వాళ్ళం. బెండ కాయలు, దొండ కాయలు దొడ్లోనే కాసేవి. దొండ పాదు మొండిది అనేవాళ్ళు. ఒకసారి వేస్తే చచ్చినా చావదట. ఇందులో యెంత నిజం వుందో తెలవదు. పాదుల గట్ల మీద ఆ పెరడు మధ్యలో రాణీ గారి మాదిరిగా కరివేపాకు చెట్టు వుండేది. నిజంగా చెట్టే. చాలా పెద్దగా, ఎత్తుగా వుండేది. ఊరి మొత్తానికి అదొక్కటే కరివేపాకు చెట్టు కావడం వల్లనేమో ఊరందరి దృష్టి దానిమీదనే. మా బామ్మగారిది నలుగురికీ పంచి పెట్టె ఉదార స్వభావమే కాని, మడి పట్టింపు జాస్తి. మైల గుడ్డలతో కరివేపాకు చెట్టును ముట్టుకోనిచ్చేది కాదు. దాంతో ఎవరూ చూడకుండా ఎవరెవరో దొంగతనంగా కరివేపాకు రెబ్బలు తెంపుకు పోయేవాళ్ళు.

బావి పక్కనే కంచెను ఆనుకుని విశాలమైన ఖాళీ స్థలం వుండేది. వెనుక వైపు దక్షిణం కొసన బండ్లు వెళ్ళడానికి రాళ్ళు పరచిన ఏటవాలు దారి వుండేది. అక్కడే జుట్టు విరబోసుకున్న రాక్షసి లాగా పెద్ద చింత చెట్టు. పగలల్లా ఆ చెట్టు కిందనే ఆడుకునే వాళ్ళం కాని పొద్దుగూకేసరికి చిన్న పిల్లలం ఎవరం ఆ ఛాయలకు పోయేవాళ్ళం కాదు. చింత చెట్టుకు ఓ పక్కన ఎరువుల గుంత వుండేది. గొడ్ల సావిట్లో పోగుచేసుకు వచ్చిన చెత్తనూ, పేడను అందులో వేసేవాళ్ళు. సాలు చివర్లో వాటిని జల్ల బండ్లకు ఎత్తి పంట పొలాలకు ఎరువుగా వేసేవాళ్ళు. కనీసం యాభయ్, అరవై బండ్ల ఎరువు పోగు పడేది.


ఇప్పుడు అవన్నీ గతంలోకి వేగంగా జారిపోతున్న తీపి జ్ఞాపకాలు

అస్పష్ట స్పష్ట చిత్రం తెలంగాణా రాజకీయం


  
ఇప్పుడు అన్ని పార్టీలదీ కేసీఆర్ బాటే.
‘అవసరమైతే లక్ష్య సాధన కోసం గొంగళి పురుగును అయినా ముద్దాడతాను’
ఈమాట ఆయన అన్నది తెలంగాణా సాధించడం కోసం. కానీ ఇప్పుడు ఈ పద ప్రయోగం  చేస్తున్న వారి ధ్యేయం వేరే!
పేకాట ఆడేవారి విషయంలో ఒక జోకు ప్రచారంలో వుంది. ‘మనకు పడ్డ ఆట ఎలా వుందో మనం ఎప్పుడయినా చూసుకోవచ్చు, ముందు పక్కవాడికి ఎలాటి ఆట పడిందో చూద్దాం’
ప్రస్తుతం రాజకీయ క్రీడల్లో మునిగితేలుతున్న పార్టీల పరిస్తితి కూడా చూడబోతే అలాగే వుంది.
‘మన వ్యూహాలు మనకెలాగో వుంటాయి, ముందు ప్రత్యర్ధి పార్టీల ఆలోచనలు, కదలికలపై ఓ కన్నేసి వుంచడం మంచిదని అనుకుంటున్నట్టుగా వుంది.
ముందస్తు ఎన్నికలు తప్పవని తేలిపోయిన తెలంగాణలో రాజకీయ పరిస్తితులలో  కొంత వరకు స్పష్టత వచ్చింది.
తెలంగాణలో బీజేపీ బలపడడం కానీ, కేంద్రంలో మోడీ మళ్ళీ అధికారంలోకి రావడం కానీ  కాంగ్రెస్  పార్టీకి ఇష్టం వుండదు.
‘తెలంగాణలో కాని, ఆంధ్రప్రదేశ్ లో కానీ బీజేపీ బలపడకూడదు,   కేంద్రంలో ఎట్టి పరిస్తితుల్లోను మోడీ ప్రభుత్వం తిరిగి రాకూడద’ని టీడీపీ (అధిష్టానం) భావన.
‘కేంద్రంలో ఎవరు గద్దె ఎక్కుతారో అనేది తరువాతి మాట. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడకూడదు, అలాగే తమ పార్టీ మళ్ళీ ముందుగానే అధికారంలోకి వచ్చి తీరాలి’ ఇది టీఆర్ఎస్ అధినేత మనసులోని మాట.
‘తెలంగాణాలో కాంగ్రెస్, టీడీపీలు బలపడకూడదు’ అనేది బీజేపీ (అధిష్టానం) ఉద్దేశ్యం.     
ఇప్పటికి తెలంగాణలో రాజకీయ పరిస్తితి ఇది.
‘రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారానికి వచ్చే పరిస్తితి ఎలాగూ  లేదు. కేంద్రంలో బీజేపీని  రాకుండా చేయడానికి బద్ధ శత్రువు కాంగ్రెస్ తో చేయి కలపడానికి కూడా సిద్ధం’ అంటున్న టీడీపీ, తెలంగాణా విషయానికి వచ్చేసరికి డోలాయమానంలో పడుతోంది. స్థానిక నాయకత్వం కోరుకుంటున్నట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలుపుకుంటే టీఆర్ ఎస్ దూకుడును నిలవరించడం సాధ్యం కావచ్చు. కానీ తమ పార్టీకి యేవో కొన్ని సీట్లు తప్పిస్తే అధికారానికి వచ్చే చాన్స్ లేదు. వస్తే గిస్తే ఆ అవకాశం కొంత కాంగ్రెస్ పార్టీకు ఉండవచ్చు. అలాంటప్పుడు ఈ ‘తనకుమాలిన ధర్మం’ ఎందుకని పార్టీలోనూ, పార్టీ శ్రేయోభిలాషుల్లోను తలెత్తుతున్న ధర్మసందేహం. కేసీఆర్ తో లేని పోని  కీచులాట మినహా ఇందువల్ల సాధించేది పెద్దగా ఉండదని తెలంగాణాలో స్థిరపడిన ఆంధ్రప్రాంతపు శ్రీమంతుల (కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు) మన్ కీ బాత్.
బహుశా అందుకే కేసీఆర్ నరనరాన ద్వేషిస్తున్న కాంగ్రెస్ తో బాహాటంగా జట్టు కట్టడానికి అధినేత తటపటాయింపు అని కొందరి భాష్యం.
తెలంగాణలోనే పుట్టి, ఎన్టీఆర్ హయాములో బడుగు, బలహీన వర్గాల ఆదరణను చూరగొన్న తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలని, అందుకు అసెంబ్లీ ఎన్నికలను అవకాశంగా వాడుకోవాలని, కేడర్ బలమున్న తమ పార్టీ, లీడర్ బలమున్న కాంగ్రెస్ వంటి మరో పార్టీతో జత కడితే బాగుంటుందని  ఆ పార్టీ స్థానిక నేతలు భావించడంలో తప్పేమీలేదు. కానీ అసలు చిక్కల్లా, ఏదైనా అనుకోనిది జరిగితేనో,  లేదా అనుకున్నట్టుగా జరగని పక్షంలోనో  టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల నడుమ అది మరికొన్ని కొత్త చిక్కులకు కారణం అయ్యే  ప్రమాదం వుంది. అందుకే కాబోలు, ఏ విషయాన్ని అయినా సాకల్యంగా, ముందు వెనుకలు, సాధ్యాసాధ్యాలు అన్నీ పూర్తిగా  పరిశీలించుకుని కానీ అడుగు వేయడం అలవాటులేని చంద్రబాబునాయుడు, ఈ పొత్తుల అంశాన్ని ప్రస్తుతానికి స్థానిక నాయకులకు వదిలేసి, ఎన్నికల  ప్రచారానికి కూడా తాను  రాబోవడం లేదన్న సంకేతాలు ఇవ్వడం. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు కనీసం 50:50 అవకాశాలు వున్నాయని నిర్ధారణకు రానిదే చంద్రబాబు ఈ విషయంలో స్పష్టంగా ఏ నిర్ణయమూ ప్రకటించక పోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం టీడీపీతో పొత్తుపెట్టుకోవడానికే తహతహలాడుతున్నట్టుంది. ఒక్క టీఆర్ఎస్ తోనే కాదు, అటు బీజేపీని, ఇటు కేసీఆర్ ని వ్యతిరేకించే ఇతర రాజకీయ పార్టీలను కూడా కలుపుకుని మహా కూటమి ఏర్పాటు చేయాలనే యోచనతో ఆ పార్టీ ముందుకు సాగుతోంది.
పొతే కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు ఏ రూపంలో అంటే బహిరంగంగానా లేక లోపాయకారీగానా అనేది టీడీపీ అధినాయకుడి ఆలోచనకు అనుగుణంగా వుంటుంది.           

9, సెప్టెంబర్ 2018, ఆదివారం

త్వరిత గతిన మారుతున్న తెలంగాణా రాజకీయ చిత్రం

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 09-09-18)
‘ఇలా జరగొచ్చని అనుకున్నవాళ్ళు వున్నారు కానీ ఇలానే జరుగుతుంద’ని
అన్నవాళ్లు తక్కువ.
అయితే కేసీఆర్ ఎలా జరగాలని అనుకున్నారో అక్షరాలా అలాగే జరిగింది.
తెలంగాణా ప్రభుత్వపు ఆఖరి మంత్రివర్గ సమావేశం నిమిషాల్లో ముగిసింది. శాసన
సభను రద్దు చేయాలనే ఏకవాక్య తీర్మానాన్ని క్షణాల్లో ఆమోదించింది. ఆ
తీర్మానాన్ని తీసుకుని ముఖ్యమంత్రి నేరుగా రాజ్ భవన్ కు వెళ్ళారు.
గవర్నర్ ని కలిసారు. తీర్మానం ప్రతిని అందచేశారు.
మంత్రివర్గ రాజీనామాను అక్కడికక్కడే గవర్నర్ నరసింహన్ ఆమోదించారు.
సాయంత్రం అయిదు గంటలకు టీబీజేపీ ప్రతినిధివర్గం తనను కలవడానికి వస్తున్న
దృష్ట్యా గవర్నర్ తన నిర్ణయాన్ని వెంటనే ప్రకటించక పోవచ్చని టీవీ
చర్చల్లో కొందరు మాట్లాడుతున్నప్పుడే వారిని నిబిడాశ్చర్యానికి
గురిచేస్తూ గవర్నర్ నరసింహన్ మంత్రివర్గ నిర్ణయాన్ని ఎలాంటి జాప్యం
చేయకుండా తక్షణం
ఆమోదించడం మాత్రమే కాకుండా, కే. చంద్రశేఖర రావును ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా
కొనసాగమని కోరినట్టు టీవీ తెరలపై స్క్రోలింగులు పరుగులు తీశాయి.
అక్కడినుంచి పరిణామాలు చకచకా సాగాయి.
తెలంగాణా తొలి అసెంబ్లీ రద్దయినట్టు శాసనసభ సచివాలయం గెజిట్ జారీ
చేసింది. గెజిట్ ప్రతిని శాసన సభ కార్యదర్శి నరసింహాచార్యులు రాష్ట్ర
ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి అందచేయడం, ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల
సంఘానికి తెలియచేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం హుటాహుటిన ఢిల్లీకి వర్తమానం
పంపడం వెనువెంటనే జరిగిపోయాయి.
ముందుగా రాసుకున్న సినిమా స్క్రిప్ట్ మాదిరిగా ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు,
అవాంతరాలు లేకుండా జరగాల్సిన విధి విదానాలన్నీ సాగిపోయాయి.
అప్పటివరకు ఈ విషయంలో అలముకున్న అనుమాన మేఘాలన్నీ పటాపంచలు అయ్యాయి.
నిన్నమొన్నటి వరకు కేసీఆర్ అనే పేరుకు ముందున్న ‘ముఖ్యమంత్రి’ అనే పదానికి
‘ఆపద్ధర్మ’ అనే పదం జోడు కలిసింది.
తాను కోరుకున్న విధంగానే కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తెలంగాణా రాష్ట్రంలో మొట్టమొదటి పర్యాయం అసెంబ్లీ
ఎన్నికలు జరగబోతున్నాయి.(2014లో అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణాకు విడిగా
జరిగినా ఆ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్టే లెక్క)

విశేషం ఏమిటంటే ఈ పరిణామాలన్నీ మెరుపువేగంతో జరిగిపోవడం.
అంతేనా! అంటే అంతటితో అయిపోలేదు.
శాసనసభ రద్దు నిర్ణయాన్ని వెల్లడించిన విలేకరుల సమావేశంలోనే, ఎవరూ
ఊహించని రీతిలో ఏకంగా రానున్న ఎన్నికల్లో పోటీచేసే నూట అయిదుమంది పార్టీ
అభ్యర్ధుల పేర్లను ప్రకటించి అందర్నీ మరింత విస్మయానికి గురిచేసారు
కేసీఆర్. ముందస్తు ఎన్నికల మాట
ఇదమిద్ధంగా తేలకముందే ఆయన మాత్రం చాలా ముందుగానే అభ్యర్ధుల తొలి జాబితా
విడుదల చేసి ఒక రికార్డు నెలకొల్పారు.
అంటే ఏమన్నమాట. ఈ విషయంపై ఆయన చాలా కాలంగా, చాలా లోతుగా కసరత్తు
చేస్తున్నారని అర్ధం చేసుకోవాలి.
సరే! నూట అయిదుమంది అభ్యర్ధులు ఎవరన్నది తేలిపోయింది. సంతోషం. వాళ్లకి
కూడా టికెట్ వస్తుందా రాదా అన్న అనుమాన, భయాలు ‘ప్రస్తుతానికి’ లేకుండా పోయాయి.
మరి తరువాత ఏమిటి? మళ్ళీ ఈ ప్రశ్న సహజంగానే ముందుకువస్తుంది. దానితో
పాటుగా మరికొన్ని ఉప ప్రశ్నలు.
‘కేసీఆర్ భావిస్తున్నట్టు డిసెంబరులోగా తెలంగాణా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయా?
‘ఏదైనా కారణంతో జరక్కపోతే ఏం జరుగుతుంది?
‘కొత్త రాష్ట్రంగా తెలంగాణా ఏర్పడ్డ తర్వాత తొట్టతొలిసారి రాష్ట్రపతి
పాలన వస్తుందా?’

ఇలా అన్నమాట.
అయితే, ఈలోగా మరో పరిణామం చోటుచేసుకుంది. లేకపోతె ఇది జవాబు దొరకని
ప్రశ్నలాగా మిగిలిపోయేది, ఎవరో అన్నట్టు ‘డౌటింగ్ థామస్’ లకు
చేతినిండా పని పెడుతూ.
ఈరకం ప్రశ్నలపై టీవీల్లో చర్చలు మొదలవుతుండగానే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పిలుపు వచ్చింది, ఖుద్దున ఢిల్లీ
బయలుదేరి రావాల్సిందని.
మరో నాలుగు రాష్ట్రాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, చత్తీస్
ఘడ్ లకు ఎన్నికల ఘడియ దగ్గర పడింది. వాటి విషయం చూడడానికి కేంద్ర ఎన్నికల
కమీషన్ వారానికి రెండుమార్లు, మంగళవారం. శుక్రవారం సమావేశం అవుతూ
వస్తోంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులతో పాటు తెలంగాణా
అధికారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు అంటే తెలంగాణాలో ముందస్తు
ఎన్నికలు గురించి కేంద్ర కమీషన్ లో కూడా కొంత కదలిక కనబడుతోందని కొందరు భాష్యం
చెబుతున్నారు.
అదీ నిజమనే అనిపిస్తోంది, ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం చూస్తే.

ఈ పరిణామాల నేపధ్యంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తధ్యం అనే మాటలు
ఎల్లెడలా వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగానే టీఆర్ఎస్ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి తెలంగాణా కాంగ్రెస్
పార్టీ కూడా ముందస్తు ప్రకటనలు చేస్తూ తానూ రేసులో ఉన్నాననే సంకేతాలు
బలంగా పంపిస్తోంది. సాధారణంగా ప్రతి విషయానికీ ఢిల్లీ వైపు చూస్తూ,
నిర్ణయాలు తీసుకుకోవడంలో జాప్యం చేస్తారనే అపప్రధను మోస్తున్న కాంగ్రెస్ పార్టీ
ఈ పర్యాయం చాలా ముందుగానే ఎన్నికల ప్రణాళిక వెల్లడిచేసింది. ఆకాశమే
హద్దుగా చేసిన ఎన్నికల వాగ్దానాలు, ఓటర్లకు ఇవ్వచూపిన తాయిలాలు,
కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఆలోచనను మరింత ముందుకు నెట్టాయని కూడా
కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. త్వరితగతిన స్పందించడంలో ఏమాత్రం
వెనుకబడిలేమనే సంకేతం ఇవ్వడానికి కాబోలు ఎంతమాత్రం కాలయాపన చేయకుండా విలేకరుల
సమావేశాలు వెనువెంటనే పెట్టి కేసీఆర్ ఏ నిర్ణయం ప్రకటించినా దాన్ని
ఖండించే కొత్త పద్దతికి కాంగ్రెస్ స్వీకారం చుట్టడం ఆ పార్టీలో వచ్చిన
కొత్త మార్పు. ‘ప్రజలను మంచి చేసుకుని అధికారంలోకి తిరిగిరావడం కన్నా
వ్యవస్తలని మేనేజ్ చేసుకుని అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కేసీఆర్ కి
వెన్నతో పెట్టిన విద్య’ అని కాంగ్రెస్ నాయకులు ఘాటయిన విమర్శలకు
దిగుతున్నారు.
రాజకీయాలను, ముఖ్యంగా ఎన్నికలను, అవి ఏ ఎన్నికలయినా సరే, అత్యంత
ప్రతిష్టాత్మకంగా, ఎంతో పట్టుదలగా తీసుకుని చావోరేవో తేల్చుకునే విధంగా
వ్యవహరించే రాజకీయ నాయకుడని కేసీఆర్ కు పేరుంది. దాన్ని నిజం చేస్తూ యాభై రోజుల్లో
వంద ప్రజాశీర్వాద సభలను నిర్వహించి తమ పరిపాలనపై ప్రజల తీర్పును కోరాలని నిర్ణయం
తీసుకోవడం, వేయబోయే ఆ అడుగును తనకు గతంలో కలిసొచ్చిన హుస్నాబాదు నుంచే ఆ
మరునాడే మొదలు పెట్టడం కూడా జరిగింది.
‘ఔర్ ఏక్ బార్ కేసీఆర్’, ‘కంటి ముందే అభివృద్ధి, ఇంటి ముందే అభ్యర్ధి’
అనే ఎన్నికల నినాదాలను బలంగా జనంలోకి తీసుకు వెళ్లేందుకు టీఆర్ఎస్
శ్రేణులు ఫేస్ బుక్, వాట్సప్ వంటి సాంఘిక మాధ్యమాల్లో
ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి కూడా. కాంగ్రెస్ పార్టీకి కూడా
ఇటువంటి హైటెక్ ప్రచారాన్ని సమన్వయం చేసే గట్టి యంత్రాంగం లేకపోలేదు. ఆ
మాటకువస్తే, మిగిలిన రాజకీయ
పార్టీలు కూడా ఈ విషయంలో ఎవరికీ తీసిపోలేదనే చెప్పాలి. అయితే ఆయా పార్టీల
అభిమానులు, కార్యకర్తలు తమ పార్టీలని సమర్ధించడానికి, ప్రత్యర్ధి
పార్టీలను బద్నాం చేయడానికి ఈమాధ్యమాలను వాడుకుంటున్న తీరు కొన్ని
విమర్శలకు గురవుతున్న మాట కూడా యదార్ధమే.
‘ఏది మాట్లాడాలి ఏది కూడదు’ అనే విషయంలో నాయకులే స్పష్టత లేక
నోటికివచ్చినట్టు మాట్లాడుతుండడం చూస్తుంటే ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున
మేస్తుందా’ అనే సామెత గుర్తు రాకమానదు.
రానున్న ఎన్నికల్లో ఎన్ని పార్టీలు పోటీకి దిగినా ప్రధాన పోరాటం
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమే అన్నది బహిరంగ రహస్యం.

కాంగ్రెస్ లో బహునాయకత్వం. ఇది ఒక రకంగా ఆ పార్టీకి బలమూ, బలహీనత. పార్టీ
గుర్తు తోడయితే తమ సొంత బలంతో సునాయాసంగా గెలవగలిగిన వాళ్ళు ఆ పార్టీలో
చాలామంది వున్నారు. అయితే అంతర్గత కలహాల కారణంగా అనేక సందర్భాలలో ఈ బలం
నిర్వీర్యం అయిపోతోంది.
టీఆర్ఎస్ పరిస్తితి వేరు. ప్రాంతీయ పార్టీలకు అధినాయకుడే అసలు బలం. అతడి
శక్తిసామర్ధ్యాలను బట్టే జయాపజయాలు చాలావరకు నిర్ధారణ అవుతాయి. కేసీఆర్
నాయకత్వపటిమే ఆ పార్టీకి శ్రీరామరక్ష. అయినా ఏదోవిధంగా బలమయిన
అభ్యర్ధులను వేరే పార్టీల నుంచి ఆకర్షించే ప్రయత్నం కేసీఆర్
చేస్తున్నారంటే, ఎన్నికల వంటి అతిముఖ్యమైన విషయాల్లో ఆయన ఏమాత్రం చాన్స్
తీసుకునే వ్యక్తి కాదని అర్ధం చేసుకోవచ్చు.

ప్రత్యర్ధి శిబిరాలు కూడా ఈసారి ఛాన్స్ తీసుకోకూడదనే ఆలోచనల్లో వున్నాయి.
కేసేఆర్ అనే ఉమ్మడి రాజకీయ ప్రత్యర్ధిని నిలువరించేందుకు ఆగర్భ రాజకీయ
ప్రత్యర్దులయిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపే ప్రయత్నాలను
ముమ్మరం చేశాయి. ఈ దిశలో సంప్రదింపులను మరింత ముందుకు తీసుకుపోవడానికి
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హైదరాబాదు వచ్చారు. పొత్తులపై
చర్చలు జరపడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధి కూడా ఒక
కమిటీని ఏర్పాటు చేసారు. మరికొన్ని పార్టీలను కలుపుకుని ఒక మహా కూటమి
ఏర్పాటు చేయాలన్నధ్యేయంతో ముందుకు సాగుతున్నట్టు తోస్తోంది. మరి కొద్ది
రోజుల్లో ఈ పొత్తులపై ఒక స్పష్టత వచ్చే అవకాశం వుంది. ఈ సందర్భాలలో పైకి
భావసారూప్యం అనే పడికట్టు పదాలు వినబడుతుంటాయి.కానీ ఇలాంటి కూటములది ఒకే
ధ్యేయం, అధికారంలో ఉన్న ప్రత్యర్ధి పార్టీని గద్దె దింపడం. తమ రాజకీయ
ప్రయోజనాలను తాత్కాలికంగా అయినా కాపాడుకోవడం. గతం చెబుతున్న సత్యం ఇది.

మన ప్రజాస్వామ్యంలో ఉన్న చమత్కారం ఏమిటంటే, అన్ని పార్టీలు ప్రజాస్వామ్య
పరిరక్షణే తమ ఆశయం అంటూనే, మరో పక్క అవకాశం దొరికినప్పుడల్లా ఆ
స్పూర్తికి తూట్లు పొడవడం.

నిజానికి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షకులు ఎవరయ్యా అంటే వాళ్ళు మన సాధారణ
ఓటర్లు. రాజకీయ పార్టీలు కాదు.

పార్టీలు ఎరచూపే ప్రలోభాలకు గురవుతున్నారన్న అపప్రధను మోస్తూ కూడా కేవలం
‘ఓటు’ అనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగలుగుతున్నది మాత్రం ఆ ఓటర్లే.



రచయిత ఈమెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595

ఎంతెంత కాలం? ఇంకెంత కాలం??




ఏకఛత్రాదిపత్యంగా పాలించిన మహా మహా చక్రవర్తులు సయితం ఒక వయసు రాగానే కొడుకులకు రాజ్యభారం అప్పగించి వానప్రస్తాశ్రమానికి వెడతారని పురాణ కధలు చెబుతాయి.
మరి భారత ప్రజాస్వామ్యంలో అలాంటి వీలు ఎందుకు లేదని కొందరి ఘోష.
ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికెవ్వరికీ రిటైర్ మెంటు లేదు. కొన్ని నియంతృత్వ దేశాలు, కమ్యూనిష్ట్ దేశాలను మినహాయిస్తే గొప్ప గొప్ప ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా ఒకే వ్యక్తి సుదీర్ఘ కాలం అధికారపీఠంపై కొనసాగిన దాఖలాలు లేవు. అమెరికా విషయమే తీసుకుందాం. ఆ దేశ అధ్యక్షుడిగా ఎవరయినా సరే రెండు దఫాలు, అంటే ఎనిమిదేళ్ళకు మించి ఏ ఒక్కరూ వైట్ హౌస్ ను అంటిపెట్టుకుని ఉండరు. ఒక పార్టీ అధికారంలో దీర్ఘ కాలం అధికారంలో ఉండవచ్చు కానీ, ఒకే వ్యక్తి, అతడు ఎంతటి ప్రజ్ఞాధురీణుడైనా సరే అధ్యక్షుడిగా నియమిత కాలాన్ని మించి పదవిలో వుండడం కుదరదు. అమెరికా అధ్యక్షుడిగా గతంలో పనిచేసి ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్న వాళ్ళు అయిదుగురు వున్నారు. ఎవరికి వారు తమ ప్రవృత్తికి తగిన వ్యాపకాన్ని ఎంచుకుని శేష జీవితం గడుపుతున్నారు. అధ్యక్షుడిగా ఉన్నకాలంలో వారందరూ తమ తమ తెలివితేటలకు తగినట్టుగా పాలనా వ్యవహారాలను చక్కదిద్దారు. ప్రపంచ రాజకీయాలను శాసించారు. అయితే ప్రతిదానికీ ఒక ముగింపు వుంటుంది. వైట్ హౌస్ లో వుండగా దుర్నిరీక్షంగా పాలించిన వారందరూ ఇప్పుడు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఈ అయిదుగురు మాజీ అధ్యక్షులు, బారక్ ఒబామా, (డెమోక్రాటిక్ పార్టీ- 2009), జార్జ్ డబ్ల్యూ. బుష్, జూనియర్, (రిపబ్లికన్ పార్టీ-2001) బిల్ క్లింటన్,(డెమోక్రాటిక్ పార్టీ- 1993), జార్జ్ హెచ్. డబ్ల్యూ. బుష్ సీనియర్, (1981-89),రిపబ్లికన్ పార్టీ, జిమ్మీ కార్టర్ (1977-81) డెమోక్రాటిక్ పార్టీ. వేర్వేరు పార్టీలకు చెందినవారు అయినప్పటికీ అప్పుడప్పుడూ కలిసి అరమరికలు లేకుండా మాట్లాడుకుంటారు.
జిమ్మీ కార్టర్ వయసు ఇప్పుడు 94 సంవత్సరాలు. కొన్ని వందల గదులతో అలరారే శ్వేత భవనం (వైట్ హౌస్) లో అధ్యక్షుడిగా సకల సదుపాయాలతో జీవించిన ఈ వృద్ధ రాజకీయ నాయకుడు ఎప్పుడో 1961లో కట్టుకున్న ఒక సాదా సీదా రెండు పడక గదుల ఇంట్లో తన భార్యతో కలిసి శేష జీవితం గడుపుతున్నారు. వారాంతపు రోజుల్లో ఇరుగు పొరుగు వారితో కలిసి పేపర్ ప్లేట్లలో భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటారు. ఈ విందుల కోసం వృద్ధురాలయిన కార్టర్ భార్య స్వయంగా యోగర్త్ తయారుచేసి వడ్డిస్తుంది. అప్పుడప్పుడూ బయటకు వెళ్లి చౌకగా వస్తువులు దొరికే డాలర్ స్టోర్ లో షాపింగ్ చేస్తుంటారు. ఒకప్పుడు ఎయిర్ ఫోర్స్ వన్ వంటి ప్రెసిడెంట్ ప్రత్యేక విమానంలో దర్జాగా తిరిగిన కార్టర్ దంపతులు ఇప్పుడు అవసరం పడ్డప్పుడు సాధారణ కమ్మర్షియల్ విమానాల్లో ప్రయాణిస్తుంటారు అంటే ఒక పట్టాన నమ్మలేం.
జార్జ్ హెచ్. డబ్ల్యూ. బుష్.
జీవించి వున్న అమెరికన్ అధ్యక్షులు అందరిలోకి పెద్దవాడు. శ్వేత సౌధంలో అధ్యక్షుడిగా వున్నది నాలుగేళ్లయినా దాన్ని వదిలి పెట్టి వెళ్ళే నాటికి సొంత నివాసం అంటూ లేదు. పదవీ విరమణ చేసి వైట్ హౌస్ నుంచి బయటకు రాగానే బుష్ తాత్కాలికంగా కొంతకాలం తన స్నేహితుడి ఇంట్లో వున్నారు. తరువాత ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోయారు. విచిత్రం ఏమిటంటే ఈ సీనియర్ బుష్ కుమారుడు జార్జ్ బుష్ కూడా తదనంతర కాలంలో అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. ఇలా తండ్రీ కొడుకులు అమెరికా అధ్యక్షులు కావడం అన్నది ఇది రెండో సారి. గతంలో జాన్ ఆడమ్స్, ఆయన కుమారుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ కూడా అధ్యక్షులుగా శ్వేత సౌధంలో పనిచేసారు.
ఏళ్ళు మీద పడ్డా సీనియర్ బుష్ మానసికంగా చాలా చురుకు. తన తొంభయ్యవ జన్మదినం నాడు హెలికాప్టర్ లో ఆకాశం లోకి వెళ్లి, అక్కడనుంచి పేరాచ్యూట్ సాయంతో స్కై డైవింగ్ చేశారంటే బుష్ మహాశయుల ధైర్యసాహసాలు ఎలాంటివో అర్ధం చేసుకోవచ్చు.

Image may contain: 4 people, people smiling, people standing and suit

Photo Courtesy: Image Owner

8, సెప్టెంబర్ 2018, శనివారం

తప్పు చేయనివాడు లేడు, తప్పని చెప్పేవాడు లేడు

పూర్వం రాజులు శత్రురాజ్యంపై దండెత్తాలనుకున్నప్పుడు ముందుగానే చతురంగ
బలాలను సమాయత్తం చేసుకునే వారు. యుద్ధ భేరీ మోగించడానికి మునుపే సమస్త
సంభారాలను సమకూర్చుకునే వారు. కోట ముట్టడికి గురైతే కొన్ని నెలలపాటు
అవసరం అయ్యే నిత్యావసర వస్తువులను సిద్ధం చేసి పెట్టుకునే వారు. ఏదైనా
అనుకోనిది జరిగి రాణీ వాసంతో సహా శత్రువుల చేతికి చిక్కకుండా బయటపడి
ప్రాణాలు దక్కించు కోవడానికి రహస్య సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకునే
వారు. యుద్ధ రంగంలో పోరాడే సైనికుల కుటుంబాల ఆలనా పాలనా చూసేవారు.
యుద్ధంలో లభించేది విజయమో, వీర స్వర్గమో అనే ఫలితంతో నిమిత్తం లేకుండా
యుద్ధసన్నద్ధత ప్రదర్శించేవారు. అవసరమైతే మిత్ర రాజ్యాల సాయం
అర్ధించేవారు. విజయ లక్ష్మిని వరించడానికి అవసరం అనుకుంటే కొన్ని కుటిల
ప్రయత్నాలు చేసేవాళ్ళు. శత్రు శిబిరంలో చీలికలు కల్పించడం, వాళ్ళు
ఏమరుపాటున వున్నప్పుడు మెరుపుదాడి చేసి వారిని వధించి సింహాసనం స్వాధీనం
చేసుకోవడం ఇలా సాగేవి వారి ఆలోచనలు.
ఇదంతా పురాతన కాలం నాటి ముచ్చట్లు.
ఇప్పుడు ప్రజాస్వామ్య యుగంలో జరిగే ఎన్నికల సమరాల్లో రాజకీయ పార్టీలు
సయితం అలనాటి రాజులు, చక్రవర్తుల మాదిరిగానే రకరకాల యుద్ధ తంత్రాలను
ప్రయోగిస్తున్నారు. విజయమే ప్రధానం అనుకున్నప్పుడు విలువల విషయం ఎవరికీ
పట్టదు. పదవే ప్రధానం, పవరే ముఖ్యం అనుకునే రోజుల్లో ఏ రాజకీయ పార్టీ
మాత్రం విలువలు, సిద్ధాంతాలు, సూత్రాలు వల్లె వేసుకుంటూ బతికి బట్టకట్ట
కలుగుతుంది?
అందుకే ఆనాటి యుద్ధతంత్రాలే ఈనాడు రూపం మార్చుకుని, ఎత్తులు, పొత్తులు, జిత్తులుగా రకరకాల అనైతిక రాజకీయ
విన్యాసాలు చేస్తున్నాయి.ఇది తప్పు అని చెప్పగలవాడు లేడు, ఎందుకంటే అందరూ
అదే తప్పు చేస్తున్నారు కనుక.

31, ఆగస్టు 2018, శుక్రవారం

నాన్నకి ప్రేమతో....



క్యాబ్ డ్రైవర్లలో కొందరు హుషారు మనుషులు వుంటారు. కార్లో ప్రయాణం చేస్తున్నంత సేపూ ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటారు. రాత్రి వచ్చిన టీవీ ఛానల్ కారు డ్రైవర్ ఈ మాదిరే. కారు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం గురించి చెబుతూ ఆయన వెనక్కి తిరిగి నీళ్ళ బాటిల్ అందుకోబోయే సమయంలో రెప్పపాటులో ప్రమాదం జరిగిందని అంటూ ఆ సీను రిప్లే చేసే ప్రయత్నం చేస్తుంటే ఆపి, ‘అసలు మీ కుటుంబం ఏమిటి, సంపాదన సరిపోతుందా’ అనే ప్రశ్నలు వేస్తూ సంభాషణను జయప్రదంగా దారి మళ్ళించాను. కానీ అతడు చెప్పిన సంగతులు వింటే ఏ తండ్రికి అయినా ఇలాంటి కొడుకు వుంటే బాగుంటుందనిపించింది.
పేద కుటుంబంలో పుట్టాడు. ఒక్కడే కొడుకు. చదువు సరిగా అబ్బక పోవడంతో సంసారం నడపడానికి స్టీరింగ్ చేతబట్టాడు. తండ్రికి వేరే సంపాదన లేదు. టాక్సీ నడిపిన రోజుల్లో బాగానే గిట్టుబాటయ్యేది. ఒక్కోసారి రోజువారీ ఆదాయం వేలల్లో వుండేదిట. సంసారం కాస్త తెరిపిన పడింది. దేశంలో తిరగని ఊళ్ళు లేవు.
రోజులు ఎప్పుడూ ఒకలా వుండవు. తండ్రికి జబ్బు చేసింది. ఏ క్షణాన ఆసుపత్రికి తీసుకువెళ్ళాలో తెలవదు. దేశం పట్టుకుని తిరుగుతూవుంటే సంపాదన బాగా ఉండొచ్చు కానీ, ఇంట్లో ఏదైనా అవసరం పడితే చప్పున రావడం కష్టం. అందుకని రాబడి తగ్గినా పరవాలేదనుకుని హైదరాబాదులోనే ఉండేలా ట్రావెల్స్ లో చేరాడుట.
‘నాకు మా నాన్న ఆరోగ్యం ముఖ్యం. సంపాదన కానీ, ఏదైనా కానీ దాని తర్వాతే’ అన్నాడు నెమ్మదిగా.
వెనక సీట్లో కూర్చోవడం వల్ల అతడి మొహం నాకూ, నా మొహం అతడికీ కనబడే వీలు లేదు.


కానీ నాకు మల్లేనే అతడి కళ్ళు చెమ్మగిల్లి వుంటాయి.

నిజం లాంటి అబద్ధం – భండారు శ్రీనివాసరావు



‘ఓ నిజం చెప్పనా?’ అంది నిజం.
నిజమే స్వయంగా ఓ నిజం చెబుతున్నప్పుడు దాన్ని నమ్మనివాళ్ళు ఎవరుంటారు.
‘నన్నూ ఓ నిజం చెప్పమంటారా?, నేనూ, నిజమూ మా చిన్నప్పటి నుంచీ దోస్తులం”
అంది పక్కనే వున్న అబద్ధం, అది శుద్ధ అబద్ధమని తెలిసికూడా.
కానీ అబద్ధం చెప్పిన మాట నిజమని నమ్మేసింది, నిజం  అమాయకంగా.
అప్పట్నించి నిజం అబద్ధంతో స్నేహం చేయడం మొదలెట్టింది.
అలా కొన్నాళ్ళు గడిచాయి.
నిజం తనను నిజంగా నమ్ముతోందని ధ్రువపరచుకున్న తర్వాత  అబద్ధం ఓరోజు నిజాన్ని అడిగింది ‘అలా సరదాగా అడవిలో   షికారుకు  వెళ్లివద్దామా’ అని.
సరే అని నిజం అబద్ధం వెంట అడవికి వెళ్ళింది.  చాలా దూరం వెళ్ళిన తర్వాత వారికి ఓ సరస్సు కనిపించింది. అందులోకి దిగితే తిరిగి ప్రాణాలతో బయటకి రాలేరు. ఈ నిజం అబద్ధానికి తెలుసు. అయినా ఆ విషయం నిజానికి చెప్పకుండా దాచింది.
ఇద్దరూ స్నానం చెయ్యడానికి దుస్తులు విప్పి ఒడ్డున పెట్టారు. నిజం ముందుగా నీళ్ళల్లోకి దిగింది.
అబద్ధం తెలివిగా ఒడ్డున వదిలేసిన నిజం దుస్తులు తాను ధరించి సరస్సులోకి దిగకుండా వెనక్కి  వచ్చేసింది. నిజం ఆసరస్సులోనే వుండిపోయింది.
అప్పటినుంచి అబద్ధం తాను  వేసుకున్న నిజం దుస్తులతో తానే నిజాన్నని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం మొదలు పెట్టింది. ఆ విధంగా కొన్నాళ్ళకు  అబద్ధమే నిజంగా చెలామణిలోకి వచ్చింది.
అంటే ఈ రోజు మనకు కనిపించే, వినిపించే నిజం, నిజానికి  నిజం కాదు, అబద్ధం చెప్పే నిజం మాత్రమే.  
(ఒక ఇంగ్లీష్ కధనానికి స్వేచ్చానువాదం )