20, ఏప్రిల్ 2017, గురువారం

బాబోయ్ ఇన్ని కాల్సా!


కింది అంకెలు అన్నీ ఏదో కార్పొరేట్ కాలేజీ ప్రకటన తాలూకు అనుకోకండి. నిన్న ఆంధ్రజ్యోతిలో నేను రాసిన ‘ఆ నాటి చంద్రబాబు’ అనే నా వ్యాసం చదివి నాకు ఫోను చేసిన వాళ్ళలో కొందరి మొబైల్ నెంబర్లు ఇవి. మొదట చేసిన వారిలో కొందరి నెంబర్లు డిలిట్ చేయడం వల్ల ఇవే మిగిలాయి. దీపావళి నాడు కాల్చి పడేసిన టపాసుల్లో కొన్ని మరునాడు పేలినట్టు బుధవారం ఆంద్ర ప్రాంతం జ్యోతిలో వస్తే ఫోన్లు మాత్రం మరునాడు కూడా కొనసాగాయి. ఇది రాస్తున్నప్పుడు విశాఖ నుంచి శివప్రసాద్ అనే ఆడిటర్ గారు ఫోను చేశారు. వీరిలో చాలామంది చంద్రబాబు మీద పెంచుకున్న అవ్యాజానురాగంతో ఫోన్లు చేస్తే కొందరు దురభిమానంతో, మరి కొందరు పిచ్చి అభిమానంతో ఫోన్లు చేసి మాట్లాడారు. వాటన్నిటినీ వడబోస్తే, చంద్రబాబు నాయుడు పరిపాలనపై ఒక మినీ అభిప్రాయ సేకరణ అని నాకు అనిపించింది.(ఉదయం పూట టీవీ ఛానల్ లైవ్ లో వుండడం వల్ల కొన్ని Missed Calls లో ఉండిపోయాయి.)
RECEIVED:
96764....., 94405....., +1 905-266-...., 79954....., 98481....., 88866....., 98412....., 96764....., 83417....., 94414....., 98660....., 90109....., 83309....., 99494....., 94402....., 95506....., 99084....., 94411....., 95535....., 99124....., 94406....., 99632....., 77023....., 77802....., 944078....., 97049....., 99632....., 81799....., 98664....., 99082....., 95507....., 99121....., 70938....., 99121....., 70938....., 99121....., 89777....., 90805....., 94417....., 88852....., 98484....., 70751....., 98483....., 94402....., 92474....., 79891....., 9963949090, 82472....., 79954....., 94946....., 98669....., 99893....., 91772....., 93910....., 84639....., 86394....., 80961....., 94404....., 94917....., 72078....., 99493....., 77027....., 94917....., 94945....., 79950....., 93470....., 9890....., 93470....., 83309....., 94402....., 99084....., 89853....., 944069....., 88617....., 95507....., 83318....., 94417....., 88866....., 94417....., 88852....., 95506....., 94942....., 99632......
MISSED:
94402....., 95506....., 91770....., 77802....., 94404....., 72071....., 94404....., 72071....., 94404....., 94945......
REFUSED (May be when I was in TV studio)    



19, ఏప్రిల్ 2017, బుధవారం

ఆనాటి చంద్రబాబు


https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEjU6fc0zI5gJ9sIQSGi_oV7t68kgisz-A9K7eGKZo-Uj7x8Pdd1z505tB3gg5HK8tXWf3H4lP7dvJPUbq1UfuOmNrG2qeN2a8g_4aA_yXitpf43Of7Lw11pVaGVkAmvAzHsN5T08fjrSkrR1c_clRl1Vnmik4NHCwx-p9nF=s0-d-e1-ft


( ఏప్రిల్ 20 చంద్రబాబు జన్మదినం)
(Published in AP Edition of ANDHRAJYOTHY daily today, Wednesday, 19-04-2017)
సుమారు 40 సంవత్సరాల క్రితం, స్థానికులకు ఏమాత్రం పరిచయం లేని ఓ యువకుడు కాణిపాకం నుంచి నడక ప్రారంభించాడు. గడప గడప తొక్కాడు. ఇళ్ళలోని పెద్దలకు చేతులు జోడించి నమస్కరించాడు. యువకుల భుజం మీద చేతులేసి పలుకరించాడు. ఊరి సమస్యలను అడిగి తెలుసుకున్నాడు.
రచ్చబండ్లమీద ఇళ్ళ అరుగుల మీద  సేద తీరాడు. స్తానిక రాజకీయాల కారణంగా చాలా ఊళ్ళల్లో గ్రామపొలిమేరల  వద్దే అడ్డంకులు ఎదురయినా  మడమ తిప్పలేదు.ఓ జత దుస్తులు, కాలికి చెప్పులుతోడుగా కొందరు యువకులు. ఇంతకు  మించి ఎలాటి హంగూ ఆర్భాటాలు లేకుండా  కాణిపాకం నుంచి మొదలుపెట్టి చంద్రగిరి నియోజకవర్గం అంతా కాలినడకన కలియ దిరిగాడు.రాజకీయాల్లో తలపండిన ఉద్ధండులను ఢీకొని ఎన్నికల్లో గెలిచాడు. గెలిచి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టాడు.
ఆయన ఎవ్వరో కాదు, ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా వున్న నారా చంద్రబాబునాయుడు.
నేను రేడియో విలేకరిని కనుక, అందులోను పనిచేసేది హైదరాబాదులో కనుక అప్పటి మీడియా వాతావరణంలో రాజకీయ నాయకులతో మరీ దూరం, దగ్గర కానీ సత్సంబంధాలు ఉండేవి.  మంచి సంబంధాలు అని ఎందుకు అంటున్నాను అంటే ఏవిషయం పైన అయినా, రాజకీయ నాయకులు తమ  మనసులోని మాటల్ని ఎలాంటి భేషజాలు, సంకోచాలు లేకుండా పంచుకోవడానికి వీలున్న విలేకరిని కదా!  ఊహాగానాలకు, సంచలనాలకు రేడియో వార్తల్లో తావుండదు. అదీ వాళ్లకు  నాతొ వున్న భరోసా! ఈ ఒక్క కారణంతో కాబోలు చంద్రబాబునాయుడు మాత్రమే కాదు1975 నుంచి  2005 వరకు అనేకమంది ముఖ్యమంత్రులతో పరిచయాలు ఓ పరిమితి మించి బాగానే ఉండేవి. ఆ చనువుతో నేను కొన్నిసార్లు చంద్రబాబును  కోరిన కోరికలు,  ముఖ్యమంత్రి సిబ్బందిని ఇబ్బందుల్లో పడేసేవి. ఒకాయన నేరుగానే తన మనసులోని మాటను నా మొహం మీదే చెప్పేశారు కూడా.      
ముఖ్యమంత్రితో వ్యవహరించాల్సిన పద్దతి ఇది కాదు, శ్రీనివాసరావు గారు..అన్నాడా అధికారి మనసులోని అసహనాన్ని సాధ్యమైనంత మృదువైన మాటల్లో వ్యక్తపరుస్తూ.
చంద్రబాబునాయుడు సమైక్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ఆయన దగ్గర పనిచేసే ఈ ఐ.ఏ.ఎస్. అధికారి చాలా చాలా సౌమ్యుడు. పేషీలో పనిచేసే అధికారులను బట్టి ముఖ్యమంత్రి పనితీరు అంచనాలు  ఆధారపడివుంటాయంటారు. ఆ రోజుల్లో సమర్దుడయిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవడంలో ఆయన పేషీ అధికారుల పాత్రకూడా వుంది.
ఆ అధికారితో నాకు చాలా సన్నిహిత పరిచయం. ఐ.ఏ.ఎస్. అనే డాంబికత్వం ఏకోశానా కానవచ్చెది కాదు. అయినా ఆయన సహనాన్ని పరీక్షించేలా నేను కొన్ని సార్లు ప్రవర్తించేవాడిని. అందుకే ఆయన అలా నిష్టూరంగా మాట్లాడారు. అయినా, అది నాకు కొత్తేమీ కాదన్నట్టు మరోమారు ముఖ్యమంత్రి అపాయింట్ మెంటు కోరేవాడిని. అపాయింట్ మెంటు అంటే ఆయన్ని కలుసుకోవడం కాదు. సీఎం ని కలవడానికి ఆరోజుల్లో పెద్దగా  ప్రయాసపడాల్సిన  అగత్యం విలేకరులుకు ఉండేదికాదు. కాకపొతే, వేరే తెలిసినవారి కార్యక్రమాలకు సీఎం ను తీసుకుపోవాలనే నా అభ్యర్ధనలను మన్నించడానికి అధికారులు  చాలా ఇబ్బంది పడేవారు.
ఇది మరీ అన్యాయం. ఆయన ముఖ్యమంత్రి. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. ఇలా పెళ్ళిళ్ళకూ, వేడుకలకూ పిలుస్తూ పొతే ఏం బాగుంటుంది. మీ ఇంట్లో పెళ్లి అంటే అర్ధం వుంది, ఇలా మీకు తెలిసిన వాళ్ళ పెళ్లిళ్లకు కూడా ముఖ్యమంత్రి రావాలంటే ఎలా!అనేది సౌమ్యుడయిన ఆ అధికారి వాదన.
ఎమోనండీ! అది నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా పిలిచే వాళ్ళు ఆయన వీరాభిమానులు. పెళ్ళికి వస్తే మహాదానందపడిపోయేవాళ్ళు. వున్న వూళ్ళో హైదరాబాదులోనే పెళ్లి. ఒక్కసారి వీలు చేసుకుని వస్తే సరిపోతుంది. అందుకే నేను అడగగానే ఆయన ఒప్పుకుని వస్తామని మాట ఇచ్చారు. ఇక మీ ఇష్టం
తరవాత కధ చెప్పాల్సిన పనిలేదు. ఏ పెళ్ళికి ముఖ్యమంత్రిని పిలిచినా ఆయన వీలు చేసుకుని ఏదో ఒక సమయంలో వచ్చి వధూవరులను ఆశీర్వదించి, పూల బొకే ఇచ్చి వెళ్ళేవాళ్ళు.  కొన్ని చోట్ల భద్రతాపరమయిన ఇబ్బందులు అడ్డు వచ్చేవి. ముఖ్యమంత్రి వెళ్ళే చోట కనీసం రెండు లిఫ్టులు వుండాలి. రెండు ద్వారాలు వుండాలి. సెక్యూరిటీ వాళ్ళు ఇలాంటివి ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకున్న తరువాతనే క్లియరెన్సు ఇచ్చేవాళ్ళు. కానీ, నా విషయంలో వాళ్ళు అనేకసార్లు రాజీ పడాల్సిన పరిస్తితి ఎదురయ్యేది.  పెళ్ళిళ్ళకే  కాదు, చిన్న చిన్న స్కూళ్ళ వార్షికోత్సవాలు, ఆటలపోటీలు ఇలా దేనికీ పిలిచినా చంద్రబాబునాయుడు మారుమాట లేకుండా వచ్చిపోయేవారు. ముఖ్యమంత్రితో వ్యవహరించే తీరు ఇది కాదని పేషీ అధికారి కినుక వహించడం వెనుక కధ ఇదే.
ఆరోజుల్లో ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటనలు ఒక ఆకర్షణ. పొద్దున్నే విలేకరులు వెంటరాగా ఒక ప్రత్యేక బస్సులో బయలుదేరేవారు. ఒకరోజు వెంగళరావు పార్కు దగ్గర చెత్త పోగు ఆయన కంట పడింది.  వెంటనే సంబంధిత మునిసిపల్ అధికారికి ఫోను చేశారు. అధికారి అప్పటికి నిద్ర లేచి వుండడు. భార్య ఫోను తీసిందేమో!
నేనమ్మా! చంద్రబాబునాయుడిని మాట్లాడుతున్నాను. మీ వారిని ఫోను దగ్గరకు పిలవమ్మా’ అని ఆయన అనడం పక్కనే వున్న మా అందరికీ వినబడుతూనే వుంది. నిద్రనుంచి  లేచి ఫోనులో ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత ఆ అధికారికి మళ్ళీ నిద్రపట్టి వుండదు.  
నేను నిద్ర పోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అనే ఈ తరహా ప్రవృత్తిఒకే ఒక్కడురా’ మన ముఖ్యమంత్రి అనే సంతృప్తిని జనంలో కలిగిస్తే, కింద పనిచేసే  ఉద్యోగుల్లో అసంతృప్తిని రగిలించింది. బాస్ అనేవాడు తనకు ఏం కావాలో చెప్పి ఆ విధంగా చేయించుకోవాలి కానీ ఆయనే అన్నింట్లో తలదూరిస్తే యెట్లా?’ అనేది సిబ్బంది వాదన.
ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఐ.ఏ.ఎస్. అధికారి వుండేవారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా చాలాకాలం పనిచేసారు. ఆఫీసులో ఆయన్ని కలవడానికి ఎవరు వచ్చినా, ఎందరు వచ్చినా కాదనకుండా అందర్నీ కలిసి మాట్లాడే వారు. వారు చెప్పింది సావధానంగా  వినేవారు. కలవడానికి వెళ్ళిన వాళ్ళు ఆయన  గదిలో ప్రవేశించగానే కుర్చీ దగ్గర నిలబడి మాట్లాడే వారు. వచ్చిన వారిని  కూర్చోమని తాను  నిలబడే  మర్యాద చేసేవారు. అంత పెద్ద అధికారి నిలబడి వున్నప్పుడు, తాము కూర్చోవడం బాగుండదేమో అనుకుని వచ్చిన వాళ్ళు కూడా ముక్తసరిగా వచ్చిన పని క్లుప్తంగా చెప్పుకుని  బయటపడేవాళ్ళు.  దొరికిందే తడవుగా కుర్చీల్లో సెటిలయిపోయే బాతాఖానీరాయుళ్ళను ఆ అధికారి అలా కట్టడి చేసేవారన్న మాట.
కాలికి బలపం కట్టుకుని చంద్రబాబు చేసే నిరంతర పర్యటనల్లో కూడా ఇదే  ఉద్దేశ్యం వుందేమో అనిపిస్తుంది. అలా అలుపెరుగకుండా తిరిగే మనిషిని ఓ పట్టాన పట్టుకోవడం కష్టం. పట్టుకున్నా ఆయన సమయాన్ని వృధాచేయడం అంతకన్నా కష్టం. అలా సీరియస్  గా పనిచేసుకుపోయే చంద్రబాబు నవ్వుకు దూరం అయ్యారా అని అప్పట్లో విలేకరులకు అనిపించేది. ఉమ్మడి రాష్ట్రానికి  ఆయన ముఖ్యమంత్రిగా వున్న తొమ్మిదేళ్ళ పైచిలుకు కాలంలో 'నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వన'ని ఉద్యోగులని వెంటబడి తరుముతూ పనిచేయిస్తున్న కాలంలో, నవ్వుతూ వుంటే ఆ మాటలకు సీరియస్ నెస్ రాదని మానేసారేమో తెలియదు.  కాని ఆయనా నవ్వుతారు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే!
అరుదుగానే కావచ్చు కానీ చంద్రబాబు నవ్వుతారు.
అందుకు సందేహం అక్కరలేదు. కాకపొతే నవ్వించాలి.
1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో జూబిలీ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆహ్వానాలు పంపారు. 'డిన్నర్ ఫాలోస్' అని దానికో టాగ్ లైన్. ఆరోజు ప్రాంతీయ వార్తలు సమాప్తం అనగానే నడుచుకుంటూ రేడియో స్టేషన్ కు ఎదురుగానే  వున్న  జూబిలీ హాలుకు బయలుదేరాను. పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గరే పోలీసుల హడావిడి కనిపించింది. లోపలకు వెడితే సీఎం పేషీ అధికారులు కొందరు కనిపించారు. విలేకరుల సంఖ్య చాలా పలుచగా వుంది. నేనంటే ఎదురుగా వున్నాకనుక వెంటనే వచ్చాను మిగిలిన వాళ్లు నెమ్మదిగా వస్తారులే అనుకున్నా. ఈ లోపల సీపీఆర్వో విజయ్ కుమార్ వచ్చాడు. విలేకరుల  సంఖ్య చూసి ఆయనా నిరుత్సాహపడ్డట్టున్నాడు. కొందరికి ఫోన్లు చేసి గుర్తుచేసే పనిలో పడ్డాడు. ఈలోగా సచివాలయం నుంచి ఫోన్లు, ‘సీఎం బయలుదేరి రావచ్చాఅని. మొత్తం మీద కొంత కోరం పూర్తయింది. చంద్రబాబు వచ్చేసారు. విలేకరులు పలుచగా వుండడాన్ని ఆయన కూడా గమనించారు.
'దీనికి మూడు కారణాలు వున్నాయి' అన్నాను, నేను కల్పించుకుంటూ. అవేమిటో చెప్పమని అడిగారు  చంద్రబాబు.
'నెంబర్ వన్. ఈరోజు వాతావరణం చల్లగా వుంది. చినుకులు పడే అవకాశం వుంది'
'అయితే...'
'నెంబర్ టూ. ఈరోజు టీవీలో ఇండియా పాకిస్తాన్, డే అండ్ నైట్  వన్ డే మ్యాచ్ వస్తోంది'
'వూ..'
'లాస్ట్ వన్. ఇది జూబిలీ హాలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్. ఇక్కడేమి  వుంటుంది. మా ఆఫీసు దగ్గర్లో లేకపోతే నేను కూడా డుమ్మా కొట్టేవాడినే'
ఆయనకు అర్ధం అయింది. అర్ధం కాగానే హాయిగా నవ్వేసి నా భుజం తట్టారు.
ఇప్పుడాయన అమరావతి వెళ్లి పోయారు. నేను హైదరాబాదులో విశ్రాంత జర్నలిష్టుగా  వుండిపోయాను.
ఒకప్పుడు రోజూ కలిసిన మనిషిని ఈరోజు కలిసే అవకాశం లేదు. నాకా కోరికా లేదు, ఒకవేళ వున్నా ఆయనకీ అంతటి తీరిక ఉండకపోవచ్చు. గతంలో చంద్రబాబు పుట్టిన రోజంటే నేనే అనేకమందిని వెంట తీసుకువెళ్ళి కలిపించేవాడిని. ఇప్పుడా వీలుసాలు లేదు. అందుకే ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈ విధంగా తెలుపుకుంటున్నాను. (EOM)  


(ANDHRAJYOTHY - 19-04-2017)

https://blogger.googleusercontent.com/img/proxy/AVvXsEjU6fc0zI5gJ9sIQSGi_oV7t68kgisz-A9K7eGKZo-Uj7x8Pdd1z505tB3gg5HK8tXWf3H4lP7dvJPUbq1UfuOmNrG2qeN2a8g_4aA_yXitpf43Of7Lw11pVaGVkAmvAzHsN5T08fjrSkrR1c_clRl1Vnmik4NHCwx-p9nF=s0-d-e1-ft

18, ఏప్రిల్ 2017, మంగళవారం

బహుకాల దర్శనం


గుండు చేయించుకున్న వాళ్లకు  తమ నెత్తి మీద జుట్టు లేదు అన్న స్పృహ ఎన్నడూ కలగదు. కానీ ఎదుటివారు ఆ తేడాను ఇట్టే పట్టేస్తారు. తేడా అయితే పడతారు కానీ మనిషిని అయితే గుర్తుపట్టలేరు. ఈ కారణంగానే  గుండూ రావులు ఎదుటి వారిని కనబడగానే  ‘హలో సుబ్బారావు బాగున్నావా’ అనేస్తుంటారు. గుండూరావును ఆ గుండుతో  పోల్చుకోలేని సుబ్బారావులు జుట్టు పీక్కుంటూ వుంటారు.
ఈరోజు పార్కులో పెళ్లి నడకలు నడుస్తున్న సమయంలో దూరంగా ఎదుటి నుంచి పరుగు లాంటి నడకతో వస్తున్న ఓ పెద్దమనిషి కనిపించాడు. ఎక్కడో చూసినట్టు వుందే అనుకుంటూ ఉండగానే బుర్రలో లైటు వెలిగి ‘మన ఏబీసీడీ ప్రసాద్ కదూ’ అనిపించింది. వెంటనే ఎదురెళ్ళి ‘ఏం ప్రసాద్ గారు ఎలా వున్నారు, మీరు అమరావతిలో వున్నారనుకుంటున్నాను’ అనేశాను. కానీ ఆయన మోహంలో నన్ను గుర్తుపట్టిన ఛాయలు కనిపించలేదు. అప్పుడు గుండు గుర్తొచ్చి దాన్నొకసారి గోక్కుంటూ ‘ తిరుపతి’ అన్నాను. అయన తేరిపార చూసి, మరు క్షణంలో నన్ను గట్టిగా పట్టుకుని ‘ఎన్నాల్టికెన్నాళ్ళకు మిమ్మల్ని  చూసాను చాలా సంతోషం, నిజంగా ఈరోజు చాలా మంచి రోజు’ అన్నాడు.  నిజానికి అయన ఇంటి పేరు ఏబీసీడీ కాదు.  
అయితే కొందరి పేర్లను, వారి ఇంటి పేర్లను  వాళ్ళతో నిమిత్తం లేకుండానే ఇతరులు అందరూ కలిసి మార్చేస్తుంటారు.
వారిలో ఏబీసీడీ ప్రసాద్ ఒకరు. ఆయన అసలు పేరు ఎల్.వీ.ఎస్.ఆర్.కే. ప్రసాద్. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పార్టీ కార్యాలయంలో పత్రికా సంబంధాలు వగయిరా చూస్తుండేవారు. అంచేత హైదరాబాదులోని పత్రికల వాళ్ళందరికీ ఆయన చిరపరిచితుడు. ప్రెస్ వాళ్ళే పెట్టారు ఏబీసీడీ ప్రసాద్ అని ఆయన ఇంటిపేరుకో మారుపేరు. ఇప్పుడాయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ కూడా. రాష్ట్రం విడిపోయిన తరువాత చూసి చాలా కాలం అయింది.
పరవాలేదు, అప్పుడప్పుడన్నా ఇలా పార్కుల్లో మార్నింగు వాకులు చేస్తుంటే, ఎప్పుడో విడిపోయిన వాళ్ళు తెలుగు సినిమాల్లో ఇంటర్వెల్ తరువాత కలుసుకున్నట్టు, పాత స్నేహితులు పార్కుల్లో   తారసపడే అవకాశాలు ఉన్నాయన్న మాట.   

అంచేత ఏమన్నమాట! అంతయు మన మేలునకే! 

జీవన యానంలో ఓ చిన్ని పాదయాత్ర


“పార్కుకు వెడదామా?” అంది మా ఆవిడ.
“నలభయ్ ఏళ్ళు ఆలస్యం అయిందేమో!” అనబోయి తెలివి తెచ్చుకుని, ఆ మాట బయటకు అనకుండా నాలుక కిందే నొక్కిపట్టి  యాభయ్ ఏళ్ళ కాపురాన్ని కాపాడుకునే ప్రయత్నంలో పడ్డాను.   
మొత్తం మీద మా జీవన యానంలో ‘తొలి నడక’, నా డెబ్బయ్యవ ఏట  బ్రహ్మానందరెడ్డి పార్కులో మొదలయింది.
‘మా నడక మా కాళ్ళ మీద మేము నడవడానికి తల ఒక్కింటికి పాతిక రూపాయల టిక్కెట్టా! ఔరా’ అనబోయి మళ్ళీ మా ఆవిడ తొలిసారి కోరిన కోరిక గుర్తొచ్చి గమ్మున ఉండిపోయాను.
అదే మొదటిసారి ఆ పార్కులో నా కుడి కాలు పెట్టడం. ఇంత కాలం బ్రహ్మానందరెడ్డి పార్కు గురించి ఏదో బ్రహ్మాండంగా ఊహించుకుంటూ వచ్చిన నేను అక్కడి వాతావరణం చూసి కాస్త నిరాశ పడ్డాను. నడక దారి చుట్టూ చెట్లు వున్నాయి కానీ వాటిలో చాలావరకు ఎండిన మోడులే. పచ్చగా ఉండాల్సిన పొదలు కూడా గోధుమ వర్ణంలోకి మారిపోయివున్నాయి. ఎండాకాలం కదా మనుషులమే మోడులుగా తయారవుతున్నప్పుడు చెట్లు అనగా యెంత అని సరిపుచ్చుకున్నాను. నాకెందుకో అక్కడ పచ్చటి వృక్షాలకంటే నడిచే మనుషులే ఎక్కువ అన్న భావన కలిగింది. అది ఎల్లా వుంటే ఏమిటి మళ్ళీ మళ్ళీ వచ్చేదా నా పిచ్చికాని.

ఈ ఉరుకుల పరుగుల హైదరాబాదు నగరంలో ఇంతమంది నడిచేవాళ్ళు వున్నారా అనిపించింది. వారంలో ఒక్కరోజయినా అందరూ వాహనాలు షెడ్లో పెట్టి నటరాజా సర్వీసు మొదలు పెడితే నగర ఆరోగ్యం చక్కబడుతుంది కదా అని కూడా  అనిపించింది. కానీ అది అత్యాశ. పార్కులో నడవడానికి కార్లు వేసుకు వచ్చేవాళ్ళు ఆఫీసులకు కూడా అలా నడిచి  వెడతారా! ఊహాతీతం.      

16, ఏప్రిల్ 2017, ఆదివారం

శ్రోతలు కోరిన పాటలు


పూర్వం రేడియో సిలోన్ లో మీనాక్షి పొన్నుదొరై ఘంటసాల వోం, సుశీలా వోం అని తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడుతుంటుంటే  మా బామ్మగారు ఆమె తెలుగును  ఆటపట్టించేది. కానీ ఆమె వేసే తెలుగు పాటల్ని కోరుతూ వందల సంఖ్యలో శ్రోతలు ఉత్తరాలు రాసేవాళ్ళు.
ఆ తరువాత చాలా ఏళ్ళకు నేను హైదరాబాదు రేడియోలో చేరిన తరువాత శ్రోతలు రాసే కార్డుల్ని బట్వాడా చేయడానికి తపాలా బంట్రోతులు (అనవచ్చా) కిందామీదా పడడం కళ్ళారా చూసాను.
“అమలాపురం నుంచి అరుంధతి ఆమె కుటుంబసభ్యులు, ఆదిలాబాదు నుంచి యాదగిరి ఆయన కుటుంబ సభ్యులు, అనంతపురం నుంచి వీరారెడ్డి, రంగారెడ్డి, వెంకటరెడ్డి వారి కుటుంబ సభ్యులు, శ్రీకాకుళం నుంచి అప్పల నాయుడు ఘంటసాల సుశీల పాడిన యుగళగీతం ప్రసారం చేయమని కోరుతున్నారు.”
ఇలా వచ్చిపడ్డ  వందలాది ఉత్తరాల గుట్టలోనుంచి శ్రోతలు కోరిన పాటల్ని ఎంపిక చేసుకోవడానికి అనౌన్సర్లు చాలా ప్రయాస పడేవాళ్ళు.  
అలాగే, స్కూలు అడ్మిషన్ సీజను వచ్చింది అంటే తెలిసిన వాళ్ళు తమ పిల్లలకోసం విలేకరుల వెంట పడడం ఒక విలేకరిగా నాకు తెలుసు. రిటైర్ అయి పుష్కర కాలం దాటిన తరువాత కూడా వస్తున్న ఎస్సెమ్మెస్ అభ్యర్ధనలు చూస్తుంటే ఏం చేయాలో అర్ధం కావడం లేదు.
అలాంటిది, తలచుకుంటే ఏదైనా చేయగలిగిన అధికారాలు కలిగిన ముఖ్యమంత్రికి రోజూ ఎన్ని విజ్ఞప్తులు వస్తుంటాయో అర్ధం చేసుకోవడానికి కష్టపడనక్కర లేదు.
మరి ఏపీ సీఎమ్ కనెక్ట్ యాప్ అంటున్నారు.
ఆయన్ని ఉడ్డుకుడుచుకోనిస్తారా! అనుమానమే!
ఉపశృతి: లోగడ ఆంధ్రప్రదేశ్ అనే ఉమ్మడి రాష్ట్రం వున్న కాలంలో ఒక ముఖ్యమంత్రి ప్రజారంజక పాలన అందివ్వడానికి అహరహం శ్రమించేవారు. ఒక కార్డు ముక్క తనకు రాస్తే చాలు సమస్యలను చిటికెలో పరిష్కరిస్తానని ఓ ప్రకటన చేసారు. అంతే! పోస్టాఫీసుల్లో కార్డులు దొరకని పరిస్తితి ఏర్పడింది. ప్రజల సమస్యలు కనిపించకుండా పోయాయి, కొత్త సమస్యల మరుగున పడి.   

15, ఏప్రిల్ 2017, శనివారం

అన్నం పెట్టే రైతుకు యెంత చేసినా తక్కువే


(రైతులకు వచ్చే ఏడాది నుంచి ఎరువులు ఉచితంగా అందివ్వాలని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని మనసారా అభినందిస్తూ, ఈ అంశంపై రెండేళ్ళ నాడు రాసిన ఈ చిన్ని వ్యాసాన్ని మరోమారు పాఠకుల దృష్టికి తీసుకువస్తున్నాను)
వారి వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఈనాడు ప్రతి రాజకీయ పార్టీ రైతుల గురించే మాట్లాడుతున్నది. వాళ్ళు విడిగా అయినా కలివిడిగా అయినా ఆలోచించుకోవాల్సింది ఒక్కటే. ఇంతవరకు ఏం చేసాము, ఏం చేయలేదు అన్నది కాదు ప్రశ్న. ఎవరి హయాములో ఎందరు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నది కాదు సమస్య. వందలు, వేలూ కాదు ఇకనుంచి ఒక్కరంటే ఒక్క రైతు కూడా వ్యవసాయంలో నష్టాలు వచ్చి ప్రాణాలు తీసుకోకుండా ఏం చెయ్యాలి అన్నదే ప్రధానం అన్న ధోరణిలో ఆలోచించాలి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు అన్నం పెట్టె రైతుకు కూడు పెట్టవు.
ఒకటి మాత్రం నిర్వివాదాంశం. ఇన్నాళ్ళ అనుభవం తెలియచెప్పేది ఒక్కటే. ఏ పార్టీ అయిన అధికారంలోకి వచ్చేంతవరకు రైతు జపం చేస్తాయి. ఒక్కసారి గద్దె ఎక్కగానే, దుష్యంతుడికి శకుంతల మరపున పడ్డట్టు రైతులనే వాళ్ళు వారికి చివరి ప్రాధాన్యతగా మిగులుతారు. అప్పటివరకు రైతులు, రుణాలు, గిట్టుబాటు ధరలంటూ మాట్లాడిన వాళ్ళు, అవే నాలుకలతో కార్పొరేట్లు, ఉద్యోగాలు, భూసేకరణలు, భూమి పందారాలు, మిషన్లు, గ్రోత్ కారిడార్లు అంటూ సామాన్యులకు అర్ధం కాని పద ప్రయోగాలు చేస్తుంటారు. ఈ విషయంలో కాస్త పేరున్న ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. అధికారం, అధికారం లేకపోవడం అన్న రెండు విషయాలే ఈ రెండు నాలుకల ధోరణికి కారణం. దీన్ని అర్ధం చేసుకోవడానికి చరిత్రలోని కొన్ని తాజా పుటలు తిరగేస్తే చాలు.
ఆరుగాలం కష్టపడే రైతుకు, ఆ మాటకు వస్తే జనాలకు మొదటి ముద్ద పెట్టి, తాను చివరి ముద్ద తినే రైతుకు కావాల్సినవి యేవో కనుక్కుని ప్రభుత్వాలు సకాలంలో వాళ్లకు అందిస్తే, అంతకు రెట్టింపు ప్రతిఫలం రైతు ఈ సమాజానికి అందిస్తాడు. అతడికి అవసరమైంది మన్ను పదును చెడకముందే అదునులో దున్ని పైరు వేసుకోవడానికి మంచి విత్తనాలు, ఎరువులు. పంట చేతికి వచ్చిన తరువాత కాసింత గిట్టుబాటు ధర. ఇంతకు మించి ఏ రైతూ ఆశించడు. ఈ మాత్రం సాయం కూడా సకాలంలో చేయలేక పోవడం వల్లనే రైతులు నిండు ప్రాణాలు నిలువునా తీసుకుంటున్నారు. అలాటి కుటుంబాలను ఓదార్చడం తప్పుకాకపోవచ్చు. కానీ అసలు ఆత్మహత్య చేసుకోకుండా ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయన్నదే సమాధానం లేని ప్రశ్న.
ఉపశ్రుతి : ఆధునిక జాతక కధలో బుద్దుడు ఓ గ్రామానికి వెడతాడు. చనిపోయిన తన పిల్లవాడికి ప్రాణదానం చేయమని ఓ తల్లి గౌతముడ్ని వేడుకుంటుంది. ఆయన సరే అని చెప్పి, 'పరిశ్రమలకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తీర్చలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్న వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం పట్రా మీ అబ్బాయిని బతికిస్తా' అంటాడు. ఆ తల్లి ఆశతో ఎన్ని వూళ్ళో తిరుగుతుంది. యెంత తిరిగినా అటువంటి వారి జాడ కనబడక నిరాశగా తిరిగొస్తుంది. ఇందులో నీతి ఏమిటన్నది వేరుగా చెప్పక్కరలేదేమో!
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
(16-05-2015)

9, ఏప్రిల్ 2017, ఆదివారం

దుర్బలస్య బలం రాజ....

సాధారణంగా టీవీ చర్చల్లో వ్యక్తుల పేర్లు రాకుండా చూసుకోవడం నాకు అలవాటు. ఈరోజు టీవీ- 5, చర్చలో చాణక్యుడు, కృష్ణ దేవరాయల ప్రసక్తి వస్తే, అచ్చం ఇలాగే కాదు కాని మొత్తం మీద నేను చెప్పిన మాటలు ఇవి. పొద్దుటి కార్యక్రమం గురించి ఇప్పుడే ఒక పెద్ద మనిషి విజయనగరం జిల్లానుంచి ఫోను చేసి బాగుందని అన్నప్పుడు ఆ విషయాలు నలుగురితో పంచుకోవాలని ఈ పోస్టు. అంతే!
‘దుర్బలస్య బలం రాజ’ అంటాడు కౌటిల్యుడు తాను సూత్రీకరించిన ‘మత్య్స న్యాయం’లో.
చిన్న చేపలను పెద్ద చేపలు తినడం అందరూ ఎరిగిందే. సమాజంలోని బలహీనులను బలవంతులు దోచుకోకుండా రాజులు కాపాడాలి అన్నది కౌటిల్యుడు బోధించిన సూక్తి. కానీ, నేటి సమాజంలో పాలకులు ఆ విధంగా బలహీనుల కాపు కాస్తున్నారా అంటే ఔనని చప్పున చెప్పడం కష్టం. కాకపొతే దారిద్ర్య రేఖకు దిగువన వున్న దరిద్ర నారాయణుల సంక్షేమం కోసం కొన్ని కొన్ని పధకాలు ప్రవేశ పెడుతుంటారు. ప్రచార ఆర్భాటం తప్పిస్తే అవి అర్హులకు అందుతున్నాయని, దుర్వినియోగం కావడం లేదని గుండె మీద చేయి వేసుకుని చెప్పలేని పరిస్తితి. కాకపొతే, ఈ సంక్షేమ పధకాల పుణ్యమా అని కొందరు దళారులు కోటికి పడగలెత్తుతున్నారనేది కాదనలేని వాస్తవం. పూటకో పధకం తెచ్చాం అని ప్రకటించుకోగానే పాలన బాగున్నట్టు కాదు. అమలు కాని పధకాల వల్ల లాభపడేది కేవలం ప్రకటన కర్తలు మాత్రమే. రోజుకో కొత్త చొక్కా తొడుక్కున్నంత మాత్రాన పండగ కాదు కదా!
‘ఎవరి పాలనలో అయితే పాలకుల ప్రమేయం లేకుండా పాలితులు తమ దినవారీ జీవితాలను నిశ్చింతగా గడపగలుగుతారో ఆ ప్రభుత్వం ఉత్తమ ప్రభుత్వం’ అని రాజనీతి శాస్త్రం చెబుతుంది.
ఇప్పటి ప్రభుత్వాలు పాలితులకు అలాంటి పాలన ఇవ్వగలుతున్నాయని చెప్పగలిగిన స్తితి వుందా అంటే సందేహమే.
రాజులు ఎలా పాలించాలి అనే విషయంలో శుక్రుడు, విదురుడు, చాణక్యుడు మొదలయిన వారు ప్రవచించినవి రాజనీతి శాస్త్రాలుగా ప్రసిద్ధి పొందాయి. భర్తృహరి ‘నృప నీతి అనేక రీతి’ అంటూ సూత్రీకరించాడు. ప్రజల పట్ల రాజులు ఎలా వ్యవహరించాలి అన్నదే ఈ శాస్త్రాలు అన్నింటిలో కీలకాంశం.
శ్రీకృష్ణ దేవరాయలు ఓ చెంప రాజ్య పాలన చేస్తూనే, మరో వంక సాహితీ సేద్యం చేసేవారట. అలా ఆయన సాహిత్య క్షేత్రంలో పుట్టుకొచ్చినదే ‘ఆముక్తమాల్యద’ కావ్యం. అందులో యమునాచార్యుల చేత రాయలవారే తన మనసులోని మాట చెప్పిస్తారు.’ రాజ్యాంతే నరకం ధృవం’ అని. రాజు తన పాలనలో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తాడు. కారణాలు అనేకం వుండొచ్చు కానీ తప్పనిసరై కొన్ని హింసలకు పాల్పడతాడు. మరిక నరక ప్రాప్తి తప్పదు కదా!
ఈ పాపపరిహార్ధం రాజులు యాగాలు, యజ్ఞాలూ చేసేవాళ్ళు. మరి వాళ్లకు పుణ్యలోకాలు సిద్ధించాయో, నరకలోకమే ప్రాప్తించిందో వెంటబోయి, వెనక్కి వచ్చి చెప్పినవాళ్ళు ఎవరూ లేరు. కానీ వారి పరిపాలన వల్ల జనాలు సుఖపడ్డారా లేక కష్టపడ్డారా అన్నది ఒక్కటే మంచిచెడ్డల ఎంపికకు సరయిన గీటురాయి.