17, జనవరి 2017, మంగళవారం

ప్రచారాలు


ఈ రోజు ఉదయం ఊబెర్ లో వెడుతున్నాను. డ్రైవర్ పేరు పెండ్యాల సత్యనారాయణ. మా ఊళ్ళో కూడా పెండ్యాల ఇంటి పేరుకలవాళ్ళు వున్నారు. మాటల్లో చెప్పాడు. రెండేళ్ళ క్రితం ఈ కారు కొనుక్కున్నాడట. అంతకు పూర్వం తను డ్రైవరుగా పనిచేసిన యజమాని మాట సాయం వల్ల కారు లోన్ లభించిందనీ, ఆయన పేరు రామచంద్ర మూర్తిగారనీ చెప్పాడు. స్టీరింగు ముందు కూర్చోగానే  సాయం చేసిన  ఆయన్ని ప్రతిరోజూ  గుర్తు చేసుకుంటానని  చెప్పాడు. సంభాషణ కొనసాగిస్తే తేలింది ఏమిటంటే ఆ రామచంద్ర మూర్తిగారు, ఇప్పుడు సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్ర మూర్తి గారు ఒక్కరేనని. మూర్తిగారు హెచ్.ఎం.టీ.వీ. లో పనిచేసేటప్పుడు ఈ సత్యనారాయణ గారు  అయిదేళ్లపాటు ఆయన కారు డ్రైవరుగా వున్నాడట.
ఇది ఎందుకు చెబుతున్నాను అంటే, చేసిన పని గురించి గొప్పలు చెప్పుకునే ప్రచార యుగంలో ప్రస్తుతం  జీవిస్తున్నాము. అందుకే చిత్రంగా అనిపించింది. మంచి పని చేసి కూడా దాన్ని చెప్పుకోని కాలాన్ని చూసినవాడిగా కొన్ని విషయాలు రాయాలనిపించి రాస్తున్నాను.
మొన్నీ మధ్య ఒక పెద్దమనిషి చెప్పాడు, పెన్షనర్ల కోసం మోడీ జీవన్ ప్రమాణ్ అనే పేరుతొ ఒక మంచి పధకం ప్రవేశ పెట్టారని. నిజమే. నేనూ వెళ్లి నా పేరు నమోదు చేసుకున్నాను.



తాము ఇంకా బతికే వున్నామని, అందుకు  రుజువుగా పెన్షనర్లు ప్రతియేటా తమ బ్యాంకుకు వెళ్లి అక్కడి అధికారి ఎదుట హాజరయి ఒక సర్టిఫికేట్ సమర్పించుకోవాలి. పెద్దతనంలో ఎక్కడో ఏ ఊళ్లోనో పిల్లల  దగ్గర శేష జీవితం గడిపే పెన్షనర్లు ఇలా బ్యాంకుల చుట్టూ తిరగడం ప్రయాసే. ఈ జీవన్ ప్రమాణ్ వల్ల ఆ ఇబ్బంది వుండదు. ఉంటున్న ఊళ్లోనే ఏదైనా బ్యాంకుకు వెళ్లి బొటనవేలి ముద్ర ద్వారా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. దేశంలో ప్రస్తుతం పనిచేసే సిబ్బంది కంటే పదవీ విరమణ చేసి పించను పుచ్చుకుంటున్న వాళ్ళ సంఖ్యే ఎక్కువ. కాబట్టి అలాంటి వాళ్లకి ఇది వరప్రసాదమే. ప్రయోజనం పొందిన వాళ్ళే చెబుతారు, ఇది మోడీ పుణ్యం అని. కానీ అలా జరగడం లేదు, ఇది మోడీ ప్రవేశపెట్టిన పధకం అంటూ ప్రచారం చేయడం విడ్డూరం అనిపిస్తుంది. మోడీ చేస్తున్న పెద్దపెద్ద పనులు ఇంకా చాలా వుంటాయి. ఇలా ప్రతి పనిని ఆయన ఖాతాలో వేయడం వల్ల ఆయన వ్యక్తిత్వ శోభ ఇనుమడిస్తుందని నేనయితే అనుకోను. ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను. గతంలో ఒకసారి కొన్ని మందుల కోసం సీ.జీ.హెచ్. క్లినిక్ కి వెళ్లాను. కొన్ని మందులు ఇచ్చారు. మరి కొన్ని స్టాక్ లో లేవన్నారు. బయటకు వస్తుంటేనే సెల్ లో ఎస్సెమ్మెస్ వచ్చింది. ‘మీరు ఇన్ని మందులు  తీసుకున్నారు, మిగిలిన మందుల కోసం ఇండెంటు పెట్టారు, పలానా రోజున వచ్చి వాటిని పట్టుకెళ్ళమని’. నేను ఎంతో ఆశ్చర్య పోయాను. ఆ రోజుల్లో ప్రధాని మన్మోహన్ సింగ్. కానీ ఎవ్వరూ ఈ మంచి పని చేసింది ఆయన అని ప్రచారం చేయలేదు. జనత ప్రభుత్వ హయాములో రైల్వే మంత్రి మధు దండావతే  స్లీపరు కోచీల్లో చెక్క బల్లల స్థానంలో మెత్తగా వుండే పరుపుల బెర్తులు వేయించారు. సాధారణ రైల్వే ప్రయాణీకులకు అదొక పెద్ద ఊరట. కానీ ఆయన ఎప్పుడూ తను ఈ పనిచేశానని చెప్పుకోలేదు. ఆయన అనుయాయులూ చెప్పలేదు. అలాగే రైల్వేలలో రిజర్వేషన్లు కంప్యూటరైజ్ చేసిన తరువాత ఒనగూరిన ప్రయోజనాలు చెప్పక్కర లేదు. కానీ ఏ ప్రభుత్వం వాటికి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయలేదు. అలా ఒక్కొక్క ప్రభుత్వ హయాములో ఒక్కొక్క మంచి పని జరుగుతూనే వుంటుంది. అలా మంచి పనులు చేస్తూ పోవడం తమ బాధ్యతగా భావించాలి కానీ తామే అన్నీ చేస్తున్నాం అని పదేపదే చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవడం వల్ల ప్రజల దృష్టిలో పలచన పడే అవకాశం వుంటుంది.
కొన్ని ప్రధానమైన విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటికి సంబంధించి ప్రభుత్వాలు కానీ వాటి నేతలు కానీ, వారి అనుయాయులు, అభిమానులు కానీ  ప్రచారం చేసుకుంటే అభ్యంతర పెట్టాల్సింది ఏమీ వుండదు.
మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు ఒక గేయంలో రాశాడు ఇలా:

“ప్రచారాల తెరలుడుల్చి ప్రతిభ చూపనోపకు!”                              

16, జనవరి 2017, సోమవారం

ఒక పూట కోటీశ్వరుడు

దాదాపు నలభయ్ ఏళ్ళయింది కోటు వేసుకుని. అదీ మాస్కో చలికోసం.


మళ్ళీ ఇన్నాల్టికి ఓ టీవీ పుణ్యమా అని కోటు వేసుకోవాల్సిన పని పడింది. బ్లూ మాట్ నేపధ్యంలో బ్లూ కలర్ అక్కడ నిషిద్దం. మామూలుగా షూట్ చేసే స్టూడియో కాకుండా వేరే స్టూడియోలో చర్చ పెట్టడం వల్ల నేను వేసుకున్న బ్లూ కలర్ బుష్ షర్ట్ అక్కడి కెమెరా కంటికి బొత్తిగా  నచ్చలేదు. అంచేత అప్పటికప్పుడు వాళ్ళ వాడ్రోబ్ నుంచి ఒక కోటు తెచ్చి నాకు కప్పారు. చలికాలం బాగానే వుంది కానీ మాట్లాడింది రైతుల ఆత్మహత్యల మీద. ఆ చర్చాంశానికి ఈ కోటు అవతారం బొత్తిగా పొసగదని నాకనిపించింది. కానీ ఏం చేస్తాం విధికి తలవంచక తప్పలేదు.

అదృష్టం ఏమిటంటే మా ఆవిడ ఇటువంటి చర్చలు బొత్తిగా చూడదు. లేకపోతే ఈ చొక్కా మార్పిడి వ్యవహారం మా ఇంట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యేది. మనలో మాట. ఆవిడ ఈ ఫేస్ బుక్ వైపు కూడా కన్నెత్తి చూడదు. అదన్నమాట. 

లాభ శాతమెంత? నష్ట శాతమెంత?


“నాలుగు పెంచు, మూడు తగ్గించు, మరో రెండు తగ్గించి అయిదు పెంచు. అలానే ఒకటి తగ్గించి ఇంకోటి పెంచు. ఆరు తగ్గించి అయిదు పెంచు.”
“ఏవిటీ లెక్క అర్ధం లేకుండా!”

“అర్ధం చేసుకోవాలి నాయనా! ఈ లెక్కల్ని తెలుగులో పెట్రో ధరలు అంటారుష”   

15, జనవరి 2017, ఆదివారం

వార్తలు చదువుతున్నది దుగ్గిరాల పూర్ణయ్య


నా రేడియో సహోద్యోగి నాగసూరి వేణుగోపాల్ ఈరోజు ఒక ఫోటో పోస్ట్ చేశారు. అది చూడగానే సంతోషం, విచారం ఏకకాలంలో ముప్పిరిగొన్నాయి.
మాస్కో రేడియోలో పనిచేయడానికి వెళ్ళే ముందు దుగ్గిరాల పూర్ణయ్య గారిని ఢిల్లీలో కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నాను. గంభీరమైన స్వరం. వార్తలు విరిచినట్టు చదవడంలో ఒక ప్రత్యేకమైన బాణీ. రేడియో వార్తలు సగంలో విన్నా కూడా చప్పున చెప్పేయొచ్చు వార్తలు చదివేది పలానా అని. ఎందరో శ్రోతలు, ఎందరో అభిమానులు. అలా గడిచి పోయింది వారి రేడియో జీవితం.
ఇప్పుడు గుడివాడ దగ్గర అంగలూరులో శేష జీవితం గడుపుతున్నట్టు వేణుగోపాల్ వల్ల తెలుస్తోంది. వారి ఫోటో చూసినప్పుడే గుండె బరువెక్కింది.
కాలం తెచ్చే మార్పులు తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు.

(కింద ఫోటోలో: దుగ్గిరాల పూర్ణయ్య, కర్టెసీ: నాగసూరి వేణుగోపాల్, ఆలిండియా రేడియో)  

   


ఫేస్ బుక్కు కలిపింది ఇద్దరినీ...


ఆవిడ పేరు దుర్గ. బాండ్ జేమ్స్ బాండ్ మాదిరిగా దుర్గ, కనకదుర్గ.
ఆవిడ పేరు సీత.
ఓ యాభయ్ ఏళ్ళ క్రితం బెజవాడ గవర్నర్ పేట లో పాటిబండ అప్పారావు వారింట్లో అద్దెకు వుండేవాళ్ళు. మాంటిసొరీ స్కూల్లో ఆడుతూ పాడుతూ చడువుకుంటూ వుండేవాళ్ళు. ఆ ఇద్దరి స్నేహం  అంతా ఇంతా కాదు, చదువయినా, ఆటలయినా ఇద్దరూ కలిసే.
చదువు అయిపొయింది అని అనుకునే లోగా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవడం షరా మామూలు. అల్లాగే  పెరిగి పెద్దయిన తరువాత జరిగిన పెళ్ళిళ్ళు చిన్నప్పటి స్నేహితులను విడదీశాయి. అప్పటి నుంచీ ఎక్కడా కలిసింది లేదు, ఎదురుపడ్డదీ లేదు. అలా యాభయ్ ఏళ్ళు గడిచిపోయాయి.
ఫేస్ బుక్ లో నా రాతలు, పెట్టే మా ఆవిడ  ఫోటోలు చూసి సీతగారికి మనసు మూలల్లో అనుమానం, తన చిన్ననాటి స్నేహితురాలు కాదు కదా! అని. అనుకోవడం తడవు వారి భర్త  గౌరవరం సుబ్బారావు గారి సహకారంతో ఫేస్ బుక్ లో నా నెంబరు పట్టుకుని ఈ సాయంత్రం ఫోను చేశారు. అంతే! చిన్నప్పటి స్నేహితురాండ్రు ఫోనుకు అతుక్కుపోయారు.
చిన్నతనంలో పాటిబండ వారి మేడపై తొక్కుడు బిళ్ళల ఆటలు,  అప్పారావు గారి భార్య తన పిల్లల్ని, అద్దెకు ఉండేవారి పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించిన వైనాలు అన్నీ వారి ముచ్చట్ల నడుమ గిర్రున తిరిగాయి.
సుబ్బారావు గారితో నేనూ మాట్లాడాను. ఆయన ఎన్ ఎఫ్ సీ ఎల్ లో పని చేసి రిటైర్ అయ్యారు. భార్యాభర్తలు ఇద్దరూ సత్యసాయి భక్తులు. తరచుగా పుట్టపర్తి వెళ్లి సాయి ఆశ్రమంలో సేవలు చేస్తుంటారు.

ఏది ఏమైనా అరవై ఏళ్ళు దాటిన తరువాత మా ఆవిడకు ఒసేయ్, ఏమే అనే ఫ్రెండు దొరికింది. శుభం!    

14, జనవరి 2017, శనివారం

అమరుడు జంధ్యాల


ఈరోజు ఉదయం నుంచి వందల ఫోన్లు. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం కోసం కాదు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన  జంధ్యాలపై నా  వ్యాసం గురించి.
ఇంతటి అభిమాన ధనం కూడబెట్టుకున్న జంధ్యాల అమరుడు. కాబట్టే ఇంతటి స్పందన.  
పోతన పద్యం గుర్తుకు వచ్చింది, ‘కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ...’
జంధ్యాల గురించి రాయడం వల్లనే నా రచనకి ఇంతటి గుర్తింపు.
ఆంధ్రజ్యోతి సంపాదకవర్గానికి కృతజ్ఞతలు.

-భండారు శ్రీనివాసరావు      

9, జనవరి 2017, సోమవారం

జంధ్యాలకో నూలుపోగు


(PUBLISHED IN 'ANDHRA JYOTHY' TELUGU DAILY ON 14-01-2017, SATURDAY)
(జనవరి 14 జంధ్యాల జయంతి) 
జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ్రమణ్య శాస్త్రి. ఇంగ్లీష్ అక్షరాల్లో పొడి పొడిగా రాస్తే జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఇంకా పొడి చేసి  క్లుప్తంగా  చేస్తే జంధ్యాల. 
మొదటి పొడుగాటి  పేరు బారసాలనాడు బియ్యంలో రాసి పెట్టింది. రెండోది, కాస్త పొట్టిపేరు, స్కూలు, కాలేజీ రికార్డుల్లో రాసుకున్నది. ముచ్చటగా మూడోది ‘జంధ్యాల’ అనే ‘కలం పేరు’ చిరస్థాయిగా  వెండి తెరపై స్థిరపడిపోయిన పేరు. తెలుగు హాస్యానికే వన్నె తెచ్చిన పేరు. అందుకే,  తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకుని అలా  వుండిపోయింది.
ఈ భూమ్మీద పడ్డ ప్రతి బిడ్డా ఏడుస్తూనే కళ్ళు తెరుస్తుంది. 1951లో నరసాపురంలో  జంధ్యాల పుట్టినప్పుడు బొడ్డు కోసిన మంత్రసాని జాగ్రత్తగా గమనించి వుంటే, ఏడుస్తున్న ఆ పిల్లాడి పెదవుల నడుమ సన్నటి నవ్వుతెర కనిపించి వుండేదేమో.
జంధ్యాల  నాన్నగారు జంధ్యాల నారాయణమూర్తి బెజవాడలో పేరుమోసిన వ్యాపారి. అనేక జిల్లాలకు బుష్ రేడియో డీలరు. ఆ రోజుల్లో రేడియోలకి మంచి గిరాకి. అంచేత నారాయణ మూర్తిగారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోయింది.
పుటకల నాటికే జంధ్యాల బంగారు పిచిక. బీసెంటు రోడ్డులో ఏడంతస్తుల భవనం.
(ఏడంటే ఏడు అనికాదు, పెద్ద భవనం అని కవి హృదయం. నిజంగానే చాలా  పెద్ద ఇల్లు. ఎదురుగా వున్న మోడరన్ కేఫ్ కంటే ఎత్తుగా వుండాలని నారాయణమూర్తిగారు ముచ్చట పడి కట్టించుకున్నారని ఆరోజులనాటి ముచ్చట) అది కట్టుకున్నాక వాళ్ళ నివాసం, క్షీరసాగర్  కంటి ఆసుపత్రి దగ్గర నుంచి బీసెంటు రోడ్డుకి మారింది.
మాచవరం ఎస్సారార్ కాలేజీలో మేము, అంటే జంధ్యాల, నేను ఒకే బెంచిలో కూర్చుని బీకాం చదువుతున్నట్టు నటిస్తున్నరోజుల్లో  కాలేజీ   ప్రిన్సిపాల్ తో సహా అయ్యవార్లందరూ సైకిళ్ళమీద కాలేజీకి వస్తుండేవారు.  మన జేవీడీఎస్ శాస్త్రి  మాత్రం, అంబాసిడర్ కారులో వెనక సీట్లో కూర్చుని  దర్జాగా వచ్చేవాడు. డ్రైవరు డోరు తెరిచి నిలబడితే కారు దిగి కాలేజీలో కాలు పెట్టే జంధ్యాలకు  ‘కారున్న కుర్రకారు’ అని పేరు పెట్టింది కూడా నేనే.
చదువులోనే కాకుండా  శాస్త్రి, ఇతర విషయాల్లో కూడా  ముందుండేవాడు. కాలేజీ కల్చరల్ అసోసియేషన్ కు ఆయనే మకుటంలేని కార్యదర్శి. కవితలు, గేయాలు గిలికే అలవాటున్న నాకు కూడా  ఆ మకుటంమీద కన్నుపడింది. వెనకాముందూ చూసుకోకుండా ఏకంగా  ఆయనపైనే  పోటీ చేశాను. అయితే ఆయన మకుటం గట్టిది, నేను కొట్టిన దెబ్బ ఓటిది అని ఇట్టే తేలిపోయింది. ఓడిపోతే పోయాను కానీ, ఆయనతో నా స్నేహం  గట్టిపడింది. ఆయన మిత్ర బృందంలో నాకూ స్థానం దొరికింది. ఇక ఆ మూడేళ్ళూ కలిసే తిరిగాము చదువయినా, సంధ్యయినా.


(జంధ్యాల కాలేజి రోజుల్లో ఫోటో)

జంధ్యాల రాసిన ‘సంధ్యారాగంలో శంఖారావం’  నాటకం రిహార్సల్స్  హనుమంతరాయ గ్రంధాలయంలో వేస్తుంటే  వెంట నేనూ  వుండేవాడిని,  ఏ వేషమూ వేయకపోయినా. ఏదో కవితలు గిలకడం వచ్చనే పేరు నాకూ వుండేది. దాంతో మా స్నేహం మరింత చిక్కబడింది. డిగ్రీ తరువాత మా దారులు వేరయ్యాయి. నేను ఆంధ్రజ్యోతిలో చేరాను. ఆయన కధ సినిమా మలుపులు తిరుగుతూ  చెన్నై చేరింది.
కట్ చేస్తే...
మద్రాసులో చందమామ రామారావు గారింట్లో ఒక ముందు గదిలో జంధ్యాల  అఫీసు తెరిచాడు. నేనొకసారి వెళ్లాను. గది బయట ‘జంధ్యాల, స్క్రిప్ట్ రైటర్’  అనే నేమ్ ప్లేటు. గదిలో ఒక మేజా బల్ల. దాని వెనుక  కుర్చీలో కూర్చుని రాసుకుంటున్న  జంధ్యాల అనే  జేవీడీఎస్ శాస్త్రి. వెనుకటి రోజుల్లోల్లా లేడు. మామూలుగానే మంచి ఛాయ కలిగిన మనిషి. కాకపోతే   జుట్టు కాస్త పలచబడింది.  మోహంలో నవ్వు, ఆ నవ్వులో అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. హాయిగా పలకరించాడు. హాయిగా కబుర్లు చెప్పుకున్నాము. హాయిగా నవ్వించాడు. హాయిగా నవ్వుకున్నాను. ఆ హాయి మనసంతా నింపుకుని బెజవాడ తిరిగొచ్చాను.
మళ్ళీ కట్ చేస్తే...
నేను బెజవాడ ఆంధ్రజ్యోతిని ఒదిలి, హైదరాబాదు రేడియోలో చేరాను. జంధ్యాల మద్రాసులో సినిమాల్లో బిజీ అయిపోయాడు. పదేళ్ళలో రెండువందల సినిమాలకు మాటలు రాశాడంటే ఎంతపని రాక్షసుడిగా మారివుండాలి!
ఒకసారి హైదరాబాదు వచ్చాడు. రేడియో స్టేషన్ కు వచ్చాడు. తన దర్శకత్వంలో మొదటి సినిమా ‘ముద్దమందారం’ తీస్తున్నట్టు చెప్పాడు. ఒక గ్రామ ఫోను రికార్డు ఇచ్చి తన సినిమా పాటలు రేడియోలో వచ్చేలా చేయడం కుదురుతుందేమో చూడమన్నాడు. ఎలాగూ వచ్చాడు కదా అని రేడియోలో ఇంటర్వ్యూ రికార్డు చేసాము. స్టేజి నాటకానికీ, రేడియో నాటకానికీ వుండే తేడా ఆయన అందులో విడమరచి చెప్పిన తీరు నన్ను విస్మయపరిచింది. నాకు తెలిసిన జంధ్యాల, ఇప్పుడు చూస్తున్న జంధ్యాల ఒకరేనా అనిపించింది. ఒకటి రెండు హోటళ్ళలో ఆయనకు పర్మనెంటు గదులు ఉండేవి. ఇంకోసారి కట్ చేస్తే...
ఓసారి ఢిల్లీలో కలిశాడు. హైదరాబాదుకు చెందిన ఓ లాయర్ తో కలిసి, నేనూ జ్వాలా  ఫైవ్ స్టార్ హోటల్లోని పుస్తకాల షాపులో తిరుగుతుంటే, తెలుగులో మాట్లాడుతున్న మమ్మల్ని గుర్తుపట్టి అదే హోటల్ ల్లోని తన గదికి తీసుకుపోయాడు.
గదికి వెళ్ళగానే, మాతో వచ్చిన లాయరు గారు ఎలాటి మొహమాటం లేకుండా, కొత్త చోటనికానీ, కొత్త మనిషని కానీ  సందేహించకుండా ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చా అని అడుగుతూనే జవాబుకోసం ఎదురుచూడకుండా అందులో దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే ఆ గదిలో పరచిన తివాచీ పై తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపి లిప్త మాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా అందరికీ కళ్ళు తిరిగిపోయాయి. చిన్న తల, పెద్ద బొజ్జ, అంత భారీ కాయంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెర పోయారు.
తరువాత వారిరువురి నడుమ సాగిన కవి పండిత చర్చ విని తీరాలి. అప్పటికే  ‘శంకరాభరణం సినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాల, విశ్వనాద్ గారిదే మరో సినిమా సప్తపదికి మాటలు రాస్తున్నాడు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ జరిగిన సంభాషణ నిజానికి ఇద్దరు పండిత శ్రేష్ఠుల మధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం స్వరం పెంచకుండా, ఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకర్ని మించి మరొకరు అక్షర లక్షలు చేసే తర్కవిన్యాసాలు ప్రదర్శించారు. సప్తపది సినిమా క్లైమాక్స్ లో ధర్మాధర్మ విచక్షణకు సంబంధించిన ఈ అంశాలలో  కొన్నింటిని   జంధ్యాల పొందుపరచినట్టున్నారు కూడా.
ఈ చర్చ సాగిన తీరు గమనిస్తే, నాకు కాలేజీలో తెలిసిన శాస్త్రి, ఇప్పుడు చూస్తున్న  ఈ జంధ్యాల, ఈ ఇద్దరూ  ఒకరేనా అన్న సందేహం కలిగింది. అంతటి పరిణతి ఆయనలో కనబడింది.
మరోసారి కట్ చేస్తే....
నా మకాం మాస్కోకి మారింది. జంధ్యాల  మద్రాసుకి అతుక్కుపోయాడు. క్షణం తీరిక లేని జీవితచట్రంలో ఒదుగుతూ, ఎదుగుతూ   ఏళ్ళతరబడి ఉండిపోయాడు. కధా చర్చలు జరపడం కోసం, రాసుకోవడం కోసం ఒకటి రెండు పెద్ద పెద్ద హోటళ్ళలో ఆయనకు పర్మనెంటు గదులు ఉండేవి. మాస్కో నుంచి   విశ్వప్రయత్నం చేస్తే  మద్రాసులో ఏదో ఒక అయిదు నక్షత్రాల హోటల్లో దొరికేవాడు. అంత దూరం నుంచి ఫోను చేస్తున్నందువల్లనో ఏమో, కాసింత తీరిక చేసుకుని లైన్లోకి వచ్చి మాట్లాడేవాడు. అప్పటికే ఆయన బిజీ డైరెక్టర్ల కోవలోకి చేరిపోయాడు.  మాస్కో థియేటర్లో శంకరాభరణం చూశానని చెబితే ఎంతో సంబరపడ్డాడు.  మాస్కో రమ్మని, అక్కడి మంచు వాతావరణంలో ఒక తెలుగు సినిమా తీయమని అనేక మార్లు చెప్పాను. రెండేళ్ళదాకా కొత్త సినిమాలు గురించి ఆలోచించే తీరుబాటు లేదని చెప్పేవాడు.
సోవియట్ యూనియన్ పతనానంతరం నేను హైదరాబాదు తిరిగి వచ్చిరేడియోలో చేరాను. జంధ్యాల మకాం కూడా చెన్నై నుంచి భాగ్యనగరానికే  మారింది. సినిమాల హడావిడి కొంత తగ్గినట్టు వుంది. ఎప్పుడయినా వెళ్లి కలిసినా తీరిగ్గానే కనిపించేవాడు.
తరువాత చాలా సార్లు కలుసుకున్నాము. భక్త రామదాసు ప్రాజెక్టు కోసం తరచూ ఖమ్మం వెడుతుండేవాడు. ఆయన కారులోనే అప్పుడప్పుడు ఖమ్మం వెళ్లి వస్తుండేవాణ్ని. దోవలో ఎన్నో జోకులు చెప్పేవాడు. చెప్పే సంగతులు మారేవి కానీ చెప్పే తీరులో మాత్రం తేడాలేదు.   
ఇరవైనాలుగు గంటలు బిజీ బిజీగా అనేక సంవత్సరాలు గడిపిన మనిషి ఖాళీగా వుండడం ఎంత బాధాకరంగా  వుంటుందో ఎప్పుడూ నవ్వుతుండే ఆయన మోహంలో అప్పుడప్పుడూ లీలగా కానవచ్చేది.
నిండు నూరేళ్ళ జీవితం అనుకుంటే జంధ్యాల బతికింది యాభయ్ యేళ్ళే. కానయితేనేమి నూరేళ్ళకు సరిపడా  నవ్వులు నలుగురికీ పంచి పెట్టిపోయాడు.
ఆరోజు నాకు బాగా జ్ఞాపకం వుంది. నేను రేడియోలో వుంటే, రాంపా ఫోను చేసి జంధ్యాల పోయాడని చెప్పాడు. నేను వెంటనే వార్త రాసి ఇచ్చేసి రాజభవన్ రోడ్డులోని వాళ్ల ఇంటికి వెళ్లాను. అప్పుడే కబురు  తెలిసి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఓ కుర్చీలో జంధ్యాల నాన్నగారు నారాయణమూర్తి గారు కూర్చుని వున్నారు. కానీ ఆయనకు ఏదీ తెలియని పరిస్తితి. జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది. ఏమి జరిగిందన్నది, ఒక్కగానొక్క కొడుకు పోయాడన్నది  అర్ధం చేసుకునే స్తితి కాదు. ఏమిటో ఈ జీవితం అనిపించింది.
జంధ్యాల చనిపోయిన రెండేళ్లకు వేటూరి సుందరరామమూర్తి ఇలా గుర్తుచేసుకున్నారు.
హాస్యం,సంగీతం కలిసి ఒకే జన్మ ఎత్తిన హాసంనిన్నటి దరహాసం జంధ్యాల ఇతిహాసంలో చేరిపోయి రెండేళ్ళు గడిచాయి.ఎన్నేళ్ళు  గడిచినా ఆయన మధుర స్మృతికి మరణం లేదు. ఎంత కాదనుకున్నా కన్నీళ్ళు  కళ్ళతోనే మింగటం కన్నా శరణ్యం లేదు”.
తెలుగుజాతి ‘చిరునవ్వు’, జంధ్యాల అన్నారు వేటూరి.
ఆ వేటూరిగారు కూడా ఇప్పుడు లేరు.  జంధ్యాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.
కాని, ఆయన అన్నట్టు జంధ్యాల మార్కు  నవ్వుకు మాత్రం   మరణం లేదు.
తోక టపా :
" నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినాకూడా, వంట చేస్తున్న మా అమ్మగారు. పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు  అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని. 
ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే !”
అమ్మ ప్రేమ గురించి ఇంత గొప్పగా చెప్పడం ఆ జంధ్యాలకే సాధ్యం!


(09-01-2017)