8, డిసెంబర్ 2015, మంగళవారం

ఫిలియాస్ ఫాగ్ గుర్తున్నాడా?


జూల్స్ వెర్న్  రాసిన ‘ఎనభై రోజుల్లో భూప్రదక్షిణం’ (Around the World in Eighty days) నవల్లో కధానాయకుడు.
అలాటివాడు ఒకాయన  మా బంధువర్గంలోనే  వున్న సంగతి ఈరోజు తెలిసింది. ఆయన పేరు కూరపాటి సీతారామారావు. వయస్సు ఏడు పదులపైనే. దేవాదాయ శాఖలో అనేక ఉన్నత పదవులు నిర్వహించి ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఆయన స్వయంగా చెప్పిన ఆయన సొంత అనుభవం.
తెల్లవారితే హైదరాబాదులో అల్లుడి ఇంట్లో శుభకార్యం. జరూరుగా ఒక స్నేహితుడితో కలిసి శృంగేరి వెళ్ళాల్సిన సందర్భం. ముందు జాగ్రత్తగా మెంగుళూరునుంచి హైదరాబాదుకు విమానం టిక్కెట్టు కొనుక్కున్నారు. తీరా వెళ్ళిన సమయానికి విమానం చక్కా యెగిరి పోయింది. బస్  స్టాండుకు వెళ్లి కనుక్కుంటే హైదరాబాదు వెళ్ళే ఆఖరి  బస్సు అప్పుడే బయలు దేరి వెళ్లిపోయింది. ఆ స్థితిలో మామూలుగా ఉసూరుమంటూ నిట్టూర్చి ఏమి దారి అని వాపోయే పరిస్తితి. కానీ మన సీతారామారావు గారు ఫిలియాస్ ఫాగ్ వ్యవహారం కదా! వెళ్లి వాకబు చేసారు, వెళ్ళిపోయిన బస్సులో టిక్కెట్లు ఏమైనా మిగిలాయా, ఫుల్లుగా వెళ్ళిందా అని. పోయిన బస్సులో టిక్కెట్లు గురించి అడుగుతాడేమిటి ఈ పెద్దమనిషి అని కన్నడంలో ఆశ్చర్యపోతూ, ‘రెండు  సీట్లు ఖాళీ’ అని ఇంగ్లీష్ లో చెప్పాడు కౌంటర్ మనిషి.  ఈయన వెంటనే డబ్బు తీసి ఇచ్చి ‘నాకో టిక్కెట్టు ఇవ్వండి’ అన్నాడుట. ఈయనగారి వరుస చూసి అప్పటికే తల తిరిగి పోయి వున్నాడేమో కౌంటరు ఉద్యోగి మారుమాట్లాడకుండా  టిక్కెట్టు తీసి ఇచ్చాడు. ఈయన అంతకంటే మర్యాదగా అడిగారు. “ఒక్క సాయం చేయండి, నేను వచ్చిన టాక్సీలో వెళ్లి ఆ బస్సు పట్టుకుంటాను, కాస్త ఆ బస్సు డ్రైవర్ కు సెల్ ఫోనులో చెప్పండి కాస్త నెమ్మదిగా పోతుండమని”. అలా చెప్పడమేమిటి, టాక్సీ ఎక్కి రయ్యి రయ్యిమని వెళ్లి,  వెళ్లి పోతున్న ఆ బస్సును పట్టుకోవడం ఏమిటి, తెల్లారేసరికల్లా హైదరాబాదులో దిగి ఎంచక్కా  అల్లుడు గారి  ఇంట్లో వ్రతానికి హాజరు కావడం ఏమిటి అంతా జూల్స్ వెర్న్ నవల్లో మాదిరిగా చకచకా జరిగిపోయాయి (ట)   

5, డిసెంబర్ 2015, శనివారం

“కంట నిదుర రాకపోతే...... .....పడ్డావనుకొ ప్రేమలో ......”


అని ఓ తెలుగు సినిమా పాట వుంది.
అది ఇప్పుడు గుర్తుకు రావడానికి కారణం వుంది. రాజకీయ నాయకులు పార్టీలు ఎప్పుడు మారుతున్నారు అనేది తెలుసుకోవడానికి ఓ జర్నలిష్టు మిత్రుడు ఏకంగా ఓ ధర్మా మీటరు కనిపెట్టాడు. ఎవరయినా ఒక లీడరు తన సొంత పార్టీ అధినాయకుడ్ని మీడియాలో పనికట్టుకుని అదేపనిగా పొగుడుతున్నాడు అంటే అతగాడు అతిత్వరలోనే ఆ పార్టీని ఒదిలి వెడుతున్నాడని అర్ధం. అల్లాగే, ప్రతిపక్షాన్ని అదేపనిగా చీల్చి చెండాడుతున్నాడు అంటే రేపోమాపో ఆ పార్టీలోకే గోడ దూకుతున్నాడు అని అర్ధంట.
అంటే ఏమిటన్న మాట. రాజకీయ నాయకులు సొంత  పార్టీకి ఎప్పుడు గుడ్ బై  చెబుతున్నారు, ఇంకో పార్టీలోకి ఎప్పుడు దూకుతున్నారు  తెలుసుకోవాలంటే టీవీల్లో  చర్చలు చూస్తే సరిపోతుందని ఆ మితృడి కవి హృదయం.


NOTE: Courtesy Cartoonist 

సూటిగా....సుతిమెత్తగా ....... చెన్నై కంటి నీరు

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 06-12-2015, SUNDAY)

చెన్నై కంటి నీరు ధారగా కారుతోంది.
తెలుగు రాష్ట్రాలకు పొరుగు రాష్ట్రం తమిళనాడు రాజధాని చెన్నై వరుస వర్షాలకు కుదేలయిపోయింది. పక్కనే వున్న సముద్రంలోని నీళ్లన్నీ వాన రూపంలో నగరాన్ని యావత్తు ముంచెత్తి వేశాయా అన్నట్టు చెన్నపట్నం తల్లడిల్లి పోయింది. వందేళ్ళ కాలంలో ఇలాటి పెనువృష్టిని చూసి ఎరగమని లెక్కలు చెబుతున్నారు. టీవీ తెరలపై అక్కడి దృశ్యాలను చూస్తున్నవారికి నిజమే అనిపిస్తోంది.
ఈ భీకర వృష్టి, దాని భయంకర ఫలితం మానవ తప్పిదం కాదు. ఇవి ప్రకృతి ఉత్పాతాలు. ఇలాటివి జరిగినప్పుడు, వాటి ఉధృతిని గమనించినప్పుడు ప్రకృతి ప్రతాపం ముందు తను యెంత అల్పుడన్నది మనిషికి తెలిసి రావాలి. కానీ ఈ గుణపాఠం నేర్చుకున్న దాఖలా లేదు.
చెన్నై వర్ష బీభత్సం గురించి మీడియా వెయ్యి గొంతులతో వివరిస్తోంది. ఇంతటి విపరీత పరిణామాన్ని ముందెవ్వరూ ఊహించినట్టు లేదు. చెన్నై ప్రధాన వీధులు, రైల్వే ప్లాటుఫారాలు,  సందులు, గొందుల్లో వరద ప్రవాహాలను, నీట మునిగిన భవంతులను  చూసిన తరువాత కానీ జరిగిన ఉత్పాతం తాలూకు ఉధృతం అర్ధం కాలేదు. జనజీవనాన్ని ఏదో కొద్ది కాలం పాటు స్తంభింప చేసే షరా  మామూలు తుపాను తాకిడే అనుకున్నారు కానీ, అసాధారణ రీతిలో అతలాకుతలం చేసే ప్రకృతి వైపరీత్యంగా  అంచనా వేయలేకపోయారు.
తుపాను, భూకంపాల వంటివి సంభవించినప్పుడు జరిగిన నష్టం ఏపాటిదన్నది రోజులు గడిస్తే కానీ పూర్తిగా అవగతం కాదు. వాస్తవ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ముందు కంటికి కనిపించిన దానికంటే అధికంగా వుండే అవకాశాలే ఎక్కువ.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే వచ్చి పరిస్తితులను స్వయంగా చూసివెళ్ళారు. దాదాపు రెండువేల కోట్ల రూపాయల మేరకు ఆర్ధిక సాయం ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కనీసం ఐదువేల కోట్లయినా కావాలని ప్రధానిని అభ్యర్ధించారు. సరే ఇవన్నీ షరా మామూలుగా జరిగిపోయే విషయాలే. అయిదు వేలు కాదు, పదివేల కోట్లు సాయం అందినా భౌతిక నష్టాలు పూడ్చుకోవడానికి పనికి రావచ్చేమో కానీ చెన్నై ప్రజలు దాదాపు వారం రోజులుగా పడ్డ మానసిక వేదనను పూర్తిగా తొలగించవచ్చన్న పూచీ లేదు.


చుట్టూ నీళ్ళే! కానీ,  గుక్కెడు కూడా అవి తాగడానికి పనికి రావు. అరకొర విద్యుత్ సరఫరా అవుతుంటేనే సర్దుకుపోవడం కష్టం. అలాటిది రోజుల తరబడి అంధకారం. పక్కింటికి పోవాలంటేనే పదిసార్లు తాళాలు లాగిచూసుకుని, అనేక  జాగ్రత్తలు చూసుకుని అడుగు బయట పెట్టే రోజులు. అలాటిది, పొరుగు వారితో కూడా ఒక మాట చెప్పకుండా,  కట్టుబట్టలతో బయటపడి  ప్రాణాలు ఉగ్గబట్టుకుంటూ,  ఎక్కడికి వెడుతున్నామో తెలియకుండా నడుంలోతు నీళ్ళల్లో దాదాపు ఈదుకుంటూ వెళ్ళాల్సిన దుస్తితి. చంటి పిల్లలకు పాలు, పెద్దవారికి వేళకు తిండీ మందులు సరి చూసుకునే వ్యవధానం వుండదు. ఒక కష్టం కాదు, ఒక ఇబ్బంది కాదు, పగవారికి కూడా రాకూడదు అనుకునే రీతిలో, పక్కవాడికి కూడా చెప్పుకోవడానికి వీలులేని పరిస్తితిలో, ప్రాణాలు దక్కించుకోవడం ఎల్లా అని  రోజుల తరబడి దిక్కుతోచని స్తితిలో కాలం గడపడం అంటే యెంత దుర్భరమో చెన్నై ప్రజలకు అనుభవంలోకి వచ్చివుంటుంది. ఆ సమయంలో వారి  మానసిక స్తితి గురించి  ఊహించుకోవడం కూడా దుర్భరం. ప్రస్తుతం చెన్నై వాసుల పరిస్తితి ఎలావుందంటే వర్షం పేరు చెబితేనే  వారికి కంటి మీద కునుకు వుండడం లేదు. ఆకాశం వైపు చూస్తున్నారు, మళ్ళీ వాన కురుస్తుందేమో అన్న భయంతో. ఆకాశం వైపే  చూస్తున్నారు ఎవరయినా హెలికాప్టర్ లో వచ్చి ఆదుకుంటారేమో అనే ఆశతో. ఆశల సంగతేమో కానీ భయాలు మాత్రం నిజమవుతున్నాయి, కాస్త తెరిపి ఇచ్చినట్టే కానవచ్చి మళ్ళీ వాన ముసురు కమ్ముకుంటోంది అనే తాజా వార్తల నేపధ్యంలో. వాతావరణ శాఖ అంచనాలు కూడా వారి ఆందోళనలను  రెట్టింపు చేస్తున్నాయి.
కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ చెన్నై పరిస్తితి గురించి లోక సభలో ఒక ప్రకటన చేస్తూ, ‘ప్రస్తుతం చెన్నై మహా నగరం, చుట్టూ జలరాశి కమ్ముకున్న దీవిలా వుంద’ని పేర్కొనడం అక్కడి వాస్తవ పరిస్తితికి అద్దం పడుతోంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ స్పందించి కొన్ని సహాయక చర్యలకు నడుం బిగించాయి. చెన్నై నగరానికి వెళ్ళే అన్ని జాతీయ రహదారులపై టోల్ వసూలును డిసెంబర్ పదకొండువరకు నిలిపివేయడం జరిగింది. వర్షాల తాకిడికి ముందే చెన్నై వెళ్ళడానికి ఎయిర్ ఇండియా విమానాల టిక్కెట్లు కొనుక్కున్న ప్రయాణీకులు ఎటువంటి అదనపు రుసుం లేకుండా చెన్నై దగ్గరలో వున్న విమానాశ్రయాలకు వెళ్ళడానికి వెసులుబాటు కల్పించారు. వాన నీరు ముంచెత్తడం వల్ల చెన్నై ఎయిర్ పోర్ట్ లో చిక్కుకు పోయిన వందలాదిమంది ప్రయాణీకులను, ఆర్కోణం తీసుకువెళ్ళి అక్కడినుంచి భారత వైమానిక దళం విమానాల్లో  హైదరాబాదు తరలించారు. సైనిక దళాలు పడవలతో రంగప్రవేశం చేసి వరదలు చుట్టూ ముట్టిన ప్రాంతాలనుంచి ఆపన్నులను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో సహాయ శిబిరాలు  నిర్వహిస్తున్నారు. స్వచ్చంద సంస్థలు ఆహార పదార్ధాలు, ఇతర నిత్యావసర సామగ్రి చేతనయిన మేరకు  అందిస్తున్నాయి. వరద నీటిలో చిక్కుకు పోయిన వారికి హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు జారవిడుస్తున్నారు.   
ప్రభుత్వాలు కల్పించుకుని యెంత సాయం అందించినా ఇంతటి విపత్తులు వాటిల్లినపుడు అవి అరకొరగానే అనిపించడం సహజం. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినిపోయిన పరిస్తితుల్లో, ఇళ్ళ కప్పులపై నిలబడి ఆహార పొట్లాల కోసంఎదురు చూసే ప్రజల్ని టీవీల్లో చూసినప్పుడు కడుపు తరుక్కుపోవడం సహజం. మొలలోతు  నీళ్ళల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, పసిబిడ్డల్ని పొదివిపట్టుకుని వెడుతున్న భార్యాభర్తల్ని చూసినప్పుడు కూడా మనసు అలాగే చివుక్కుమంటుంది.
ఇలాటి ప్రకృతి వైపరీత్యాలు గురించి వింటున్నప్పుడు, చేస్తున్నది సరే, ఇంతకంటే మించి చేయలేమా అనిపిస్తోంది. నిజమే.  వరదలు, భూకంపాలు, తుపానులు, సునామీలు, కరవులు వీటన్నిటినీ సమర్ధవంతంగా ఎదుర్కోవడం మనిషి శక్తికి మించిన పని. ఉపశమన కార్యక్రమాలు మినహా వాటి పరిణామాలనుంచి, పర్యవసానాలనుంచి  పూర్తిగా బయట పడడం అసాధ్యం అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక విషయం మరిచి పోకూడదు. ఉత్పాతాలు, ఉపద్రవాలు ప్రకృతి ప్రసాదం కావచ్చు. కానీ వాటి పర్యవసానాలు, దుష్పరిణామాల స్థాయి, ఇంతటి ప్రమాదకర స్థాయికి చేరడం అన్నది మాత్రం మనిషి పుణ్యమే. అతగాడి స్వయంకృతాపరాధమే.  ఇక్కడ మనుషులంటే చెన్నై నగర పౌరులు కారు. అధికారగణం. వారిని శాసించే రాజకీయ శక్తుల సమూహం.
బ్రిటిష్ వారి  కాలంనుంచి ప్రఖ్యాత నగరంగా విలసిల్లిన చెన్నపట్నం, అభివృద్ధి పేరుతొ విచ్చలవిడిగా సాగిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వార్ధపు ఆలోచనలకు బలయిపోయింది. ప్రణాళికా బద్ధంగా సాగాల్సిన భవననిర్మాణాలు, రాజకీయ పార్టీల వత్తాసుతో, అధికారుల కుమ్మక్కుతో నిబంధనలకు మంగళం పాడాయి. వరద నీరు, మురుగు నీరు సులభంగా పారాల్సిన  ప్రాంతాలన్నీ అక్రమార్కుల ఆక్రమణకు గురయ్యాయి. చెరువులు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి. కూమ్, అడయార్ వంటి నదులు ఆక్రమణల కారణంగా కుంచించుకు పోయి మురికి నీటి కాసారాలుగా తయారయ్యాయి. అనుకోని వరదలు వచ్చినప్పుడు పొంగి పొరలకుండా అడ్డుకునే కరకట్టలు కలికానికి కూడా కానరాకుండా పోయాయి. ఏతావాతా ఇదిగో మిగిలింది ఇదే. జరిగింది ఇదే. భారీ వర్షాలకు చెన్నపట్నం మునిగిపోయింది అని జనాలు వింతగా చెప్పుకునే విషమ పరిస్తితి.
ఇదొక అంకం. చెన్నైలోనే కాదు. అన్ని రాష్ట్రాలలోను, అన్ని నగరాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్తితి. రెండువేల సంవత్సరంలో హైదరాబాదులో పడ్డ వర్షాలకు ట్యాంక్ బండు పొంగిపొరలి వచ్చిన  మూసీ వరదలు సృష్టించిన భయంకర పరిస్తితులు పాలకులు మరచిపోయారేమో కానీ ఆ చేదు అనుభవాలు, అనుభవించిన  జనాలకు మాత్రం ఇంకా జ్ఞాపకం వున్నాయి.
ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ప్రభుత్వాలు నేర్చుకోవాల్సింది  మరోటి వుంది.
జలదిగ్బంధంలో చిక్కుకు పోయిన ప్రజలకు ఆహారం సరఫరా చేసే క్రమంలో వారికి హెలికాప్టర్ల ద్వారా పులిహోర పొట్లాలు జారవిడుస్తుంటారు. పులిహార అయితే కొన్ని రోజులు నిలవ ఉంటుందన్న అభిప్రాయం కావచ్చు. కానీ చుట్టూ నీళ్ళు వున్నా తాగడానికి వీల్లేని ఆపన్నులకు ప్రధమంగా కావాల్సింది శుభ్రమైన నీరు. లేనిపక్షంలో, కాలుష్యమైన నీళ్ళు తాగి లేనిపోని అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి వుంటుంది. రోజుల తరబడి నీళ్ళు నిలవ వుండే పరిసరాల్లో అంటువ్యాధులు ప్రబలితే వాటిని అరికట్టడం ఒక పట్టాన సాధ్యం కాదు. ప్రభుత్వ అధికార వర్గాలు సహాయక చర్యల విషయంలో ఇటువంటి కీలకమైన  అంశాలను గమనంలో పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గించి ఆహార పదార్ధాలను ఇతర నిత్యావసర సామాగ్రిని బాధితులకు అందించే ప్రయత్నం చేయగలిగితే ఉత్తరోత్తరా పర్యావరణానికి వాటిల్లే ముప్పును తగ్గించిన వారవుతారు.
కష్టాలు కలకాలం వుండవు. ఇటువంటి సందర్భాలలో ప్రభుత్వాలకంటే ప్రజలే నిబ్బరంగా వ్యవహరించిన దాఖలాలు అనేకం. నష్టం భారీ స్థాయిలో సంభవించినప్పుడు ప్రభుత్వాలు యెంత పెద్ద ఎత్తున సాయం అందించినా అది జరిగిన నష్టాన్ని పూడ్చలేదు.
ప్రకృతి ప్రకోపాలు జీవితాల్లో భాగం అయిపోయాయి. చెన్నై ప్రజలు కూడా గతంలో భారీ వరదలు వచ్చినప్పుడు ముంబై పౌరుల మాదిరిగానే అత్యంత నిబ్బరంగా వ్యవహరించినట్టు సాంఘిక మాధ్యమాల ద్వారా తెలుస్తోంది.
స్పందించడం మానవనైజం. సాంఘిక మాధ్యమాల్లో ఇది బాగా కానవస్తోంది. ఎక్కడెక్కడివాళ్ళు ‘హెల్ప్ చెన్నై’ అని నినదిస్తున్నారు. బాధితులకు చేరుతుందన్న నమ్మకం లేకపోయినా ‘ఈ కష్ట కాలంలో మీ వెంటే మేము’ అనే సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
‘మా ఇంటికి రండి, మా ఇంటి తలుపులు మీకోసం  తెరిచే ఉంచాము’ అంటూ చెన్నైలో  సురక్షిత ప్రాంతాల్లో వున్న ప్రజలు, ఆపదలో చిక్కుకున్న తమ తోటి ప్రజలకు భరోసా ఇస్తూ పోస్టింగులు పెట్టారు. నిజంగా ఇది ముదావహం.
వీటివల్ల బాధితులకు ఒరిగేదేమీ లేకపోవచ్చు. కానీ మానవత్వం ఇంకా బతికే వుంది అనే నిజం నలుగురికీ తెలుస్తుంది. (05-12-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
NOTE: Courtesy Image Owner 

4, డిసెంబర్ 2015, శుక్రవారం

యక్ష ప్రశ్న


“ధర్మరాజా! నీ తమ్ములను బతికించుకునే ఉద్దేశ్యంతో నా ప్రశ్నలు అన్నింటికీ జవాబులు చెప్పిన తీరు దేవతలు సైతం మెచ్చదగిన రీతిలో వుంది. సందేహం లేదు. చివరాఖరుగా నా ఈ చివరి ప్రశ్నకు సమాధానం చెప్పగలవేమో ప్రయత్నించు.
“ఫలానా పార్టీ నాయకుడు ఈ నిమిషంలో ఏ పార్టీలో వున్నాడు?”

“..................” 

(NOTE: Courtesy Image Owner)

2, డిసెంబర్ 2015, బుధవారం

గర్వపడే ఆ ఘడియ ఎప్పుడో ......


ఇందాక ఏబీఎన్ ఆంద్ర జ్యోతిలో చెన్నై వరద పరిస్తితి గురించి ప్రత్యేక కధనం చూసాను. పరిస్తితి దారుణంగా వుంటే ఆ నగర వాసుల స్తితిగతులు మరింత దారుణం అనిపించాయి.


కేరళ నుంచి చెన్నై వచ్చి నగరంలో చిక్కుకు పోయిన ఓ అమ్మాయి చెబుతోంది ఇలా,...”మా రాష్ట్రంలో ఇంతకంటే పెద్ద వానలే కురుస్తాయి. అయితే డ్రైనేజి వ్యవస్థ పటిష్టంగా వుండడం వల్ల ఈ ఇబ్బందులు మాకు తెలవవు”

రాష్ట్రాలు గురించి ఇలా గర్వంగా చెప్పుకోగలిగిన ఘడియ ఎప్పుడు వస్తుందో అప్పుడే ఆ రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు.

మీడియాపై గవర్నర్ ధర్మాగ్రహం

సూటిగా ..........సుతిమెత్తగా .......


(హైదరాబాదు ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలలో ప్రసంగిస్తున్న గవర్నర్ నరసింహన్)

గవర్నర్ నరసింహన్ గారికి కోపం వచ్చింది అనుకున్నారు ఆ  సాయంత్రం ఆయన సభకు వచ్చిన సభికుల్లో చాలామంది. కానీ ఆయనకు వచ్చింది ‘ధర్మాగ్రహం’ అనడమే సబబుగా వుంటుంది.
గతవారం హైదరాబాదు ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. గవర్నర్ నరసింహన్ ఆనాటి ముఖ్య అతిధి. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాల్లో గవర్నర్ ప్రసంగం సాంప్రదాయబద్ధంగా సాగడం రివాజు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రసంగపాఠాన్ని చదవడం ఆనవాయితీ. ఎందుకో ఏమో కానీ నరసింహన్ గారు ఆ రోజు ఆ పద్ధతికి స్వస్తి చెప్పి తటాలున అప్పటికప్పుడు ఆశువుగా  చేసిన ఉపన్యాసంలో, ఆయన  మనసులోని మాటలు బయటకు వచ్చాయి. తన సహజ సిద్ధ మైన మృదు భాషణతోనే ఆయన ఉపన్యాసం ప్రారంభించి చెప్పాలనుకున్న లేదా  చెప్పాల్సిన నాలుగు విషయాలు చల్లగా చెప్పేశారు. ధాటీగా సాగిన గవర్నర్ ప్రసంగం నుంచి ఈనాటి మీడియా నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో వున్నాయి. నిజానికి ఈనాడు చాలామంది సాధారణ టీవీ వీక్షకుల్లో వున్న భావాలే అనర్ఘలంగా సాగిన గవర్నర్ ప్రసంగంలో చోటుచేసుకున్నాయి.
మీడియా హద్దులు దాటి వ్యవహరిస్తోంది అన్న సాకుతో నియంత్రణకు  పూనుకోవడం హేతుబద్ధం కాదు. అలాగని స్వేచ్చకు సొంత భాష్యాలు చెప్పుకుంటూ ప్రతి అంశాన్ని సమర్ధించుకుంటూ పోవడం కూడా సమంజసం కాదు. ఈ రెంటికీ నడుమ కనీ కనబడకుండా వున్న సన్నటి విభజన రేఖను గమనించి నడుచుకుంటే మీడియా పాఠాలు చెప్పించుకోవాల్సిన దుస్తితిలో పడేది కాదేమో!
నరసింహన్ గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి అయిదేళ్ళు దాటిపోయింది. మొదట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చిన నరసింహన్, దరిమిలా రాష్ట్ర విభజన అనంతరం పురుడు పోసుకున్న రెండు నవజాత రాష్ట్రాలయిన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లు రెంటికీ కూడా ఉమ్మడి గవర్నర్ గా పనిచేసే అవకాశం రావడం ఆయన దక్షతకు అద్దం పడుతుంది. రాష్ట్ర విభజనకు ముందూ, ఆ తరువాతా కూడా గవర్నర్ పాత్ర పోషించడంలో పలుమార్లు అనేక విమర్సలకు గురయ్యారు. విభజనకు పూర్వం కొన్ని రాజకీయ పార్టీలు ఆయన వ్యవహార శైలిని అపార్ధం చేసుకుంటే, వేర్పాటు తరువాత మరికొన్ని పార్టీలకు ఆయన పోకడలతో పొసక్కపోవడం అన్నది బహిరంగ రహస్యమే. ఆ క్రమంలో అనేక సందర్భాలలో గవర్నర్ పాత్ర గురించీ, ఆయన వ్యక్తిగత నమ్మకాలు గురించీ అనేక కధనాలు మీడియాలో వచ్చాయి. ప్రెస్  క్లబ్ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం గమనించిన వారిని,  ఇన్నేళ్ళుగా నరసింహన్ తనను మానసికంగా బాధపెట్టిన అటువంటి అనేక అంశాలను మనసుకు పట్టించుకోవడమే కాకుండా గుర్తు పెట్టుకుని వాటినన్నింటినీ సోదాహరణంగా ప్రస్తావించిన తీరు మరింత అబ్బురపరచింది. తన మనస్సులో ఇంతకాలంగా సుళ్ళు తిరుగుతున్న భావోద్రేకాలను వెలువరించి, తన మనస్సును చల్లబరచుకునే ఉద్దేశ్యంతో నాటి వేదికను ఆయన అనువుగా ఎంచుకున్నారేమో అని కూడా అనిపించింది.
పత్రికా స్వేచ్చను గురించి  చర్చించడం వ్యాసకర్త ఉద్దేశ్యం కాదు. గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు ఆత్మశోధనకు ఉపకరించేలా వున్నాయన్న అభిప్రాయంతోనే ఈ వారం ఈ అంశాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది.
చేయి బార్లా చాపుకునే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ వుంటుంది. అయితే ఆ చేతి కొన పక్కవాడి ముక్కును తాకనంతవరకే ఆ స్వేచ్చ  అనేది ఓ ఇంగ్లీష్ నానుడి.
బహుశా గవర్నర్ విషయంలో మీడియా స్వేచ్ఛ ఆ హద్దును దాటివుంటుంది.  ఆయన  తన ప్రసంగంలో అనేక వ్యక్తిగత అనుభవాలను  ప్రస్తావించడానికి అదే కారణం అయివుంటుంది.
నరసింహన్ గారి సోదరుడు ఓ ఐ.ఏ.యస్. అధికారి. అసోం రాష్ట్రంలో పనిచేస్తూ ఉల్ఫా ఉగ్రవాద దాడులకు గురై మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని తీసుకురావడానికి నరసింహన్ విమానాశ్రయానికి వెళ్ళారు. అదో విషాద సందర్భం. ఆ సమయంలో ఒక విలేకరి ఆయన్ని అడిగిన ప్రశ్న- ’కైసా లగ్తా హై’ (ఎలా అనిపిస్తోంది?).
‘ఓ పక్క సోదరుడి నిర్జీవ శరీరం.  నిండు విషాదంలో వున్న నన్ను, సమయం సందర్భం చూసుకోకుండా అడగాల్సిన ప్రశ్నా అది?’ అనేది నరసింహన్ గారు పాత్రికేయ లోకానికి సంధించిన ప్రశ్న.
గవర్నర్ ఉదహరించిన మరో ఉదంతం. ఒక పత్రికా విలేకరి గవర్నర్ ని కలిసి ఇంటర్వ్యూ చేసి తన పత్రికలో ఓ చక్కటి వ్యాసం రాసాడు. అంతా బాగానే రాసి ‘గవర్నర్ భార్య శ్రీమతి విమలా నరసింహన్ బయట ఊళ్లకు వెళ్లి తిరిగి వచ్చే ప్రతి సందర్భంలో గవర్నర్ విమానాశ్రయానికి వెళ్లి తీసుకు రావడం అంత అవసరమా’ అన్న రీతిలో ఓ వ్యంగ బాణం ఒదిలాడు. ఇది నరసింహన్ గారి మనస్సును యెంత బాధ పెట్టిందంటే, ‘నేను వెళ్ళేది ‘నా’ భార్యకోసమే కదా!’ అనేశారు. ‘ఇతరులకోసం కాదుకదా ‘ అనే వ్యంగం అందులో దాగుంది. సుతిమెత్తగా అంటించడం అంటే ఇదే! భార్యా భర్తల నడుమ అనురాగం అర్ధం అయిన విలేకరి అయితే పరిహాసానికి కూడా ఇలాటి ప్రస్తావన చేయడని నాటి సమావేశానికి హాజరయిన ఓ సీనియర్ విలేకరి వ్యాఖ్యానించాడు.
కలం బలం గురించి నెపోలియన్, మహాత్మా గాంధి సూక్తులను కూడా గవర్నర్ ఉదహరించారు. ‘పత్రికలకు వున్నబలం తక్కువ కాదు. మీడియాను ఫోర్త్ ఎస్టేట్ అన్నారు. ప్రజాస్వామ్య సౌధంలోని మిగిలిన స్తంభాలు స్థిరంగా ఉండేలా మీడియా కాపు కాస్తుండాలి’ అనే రీతిలో గవర్నర్ హిత బోధ సాగింది.   
ఇటీవల మీడియాలో పెచ్చరిల్లుతున్న ‘బ్రేకింగ్ న్యూస్’ ధోరణిని కూడా గవర్నర్ తప్పుపట్టారు. ప్రతి అంశాన్ని సంచలనం చేసి రేటింగులు పెంచుకునే సంస్కృతికి స్వస్తి చెప్పాలని కూడా ఆయన సూచించారు. ‘ఉరి వేసుకుంటున్న వ్యక్తి ఏ చేత్తో ఉరితాడు తగిలించుకుంటున్నాడు’ అని విజువల్స్ తో వర్ణించడం కాకుండా అతడిని కాపాడడానికి చేతనయిన సాయం చేయడం  ధర్మమని అన్నారు.
‘ప్రమాదంలో గాయపడి ఓ వ్యక్తి నెత్తురోడుతూ చావుబతుకుల నడుమ కొట్లాడుతుంటాడు. అతడ్ని కాపాడడం యెట్లా అన్నది ఆలోచించకుండా ఆ సన్నివేశాన్ని యధాతధంగా చిత్రించి వీక్షకులకు యెంత త్వరగా చూపగలమనే ధోరణిలో మీడియా ఆలోచించడం దురదృష్టకరం. ఇలా బాధ్యతా రహితంగా వ్యవహరించే మీడియా వారిని కూడా నేరంలో భాగస్వాములను చేయాలి అనేంత తీవ్రంగా గవర్నర్ స్పందించారంటే మీడియా యాజమాన్యాలు తక్షణం  ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అగత్యం కనబడుతోంది.
సంచలన వార్తలు కొన్ని క్షణాలే బాగుంటాయి. నిస్సహాయులను కాపాడగలిగితే ఆ సంతృప్తి చిరకాలం వుంటుందని హితవు పలికారు. ఈ సందర్భంలో నరసింహన్ మృదువుగానే చాలా కటువైన సూచన చేసారు. మీడియాను కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలన్నది ఆ సూచన.
‘ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసి వచ్చినప్పుడల్లా ‘ప్రధానికి ఇచ్చిన ముప్పయి అయిదు పేజీల నివేదికలో ఏముందో చెప్పమంటారు’ అన్నారు గవర్నర్.
పేజీల సంఖ్య సయితం  తెలిసిన వారికి అందులో ఏముందో తెలవదా అన్నది నరసింహన్ గారి శ్లేష.
ఇక చివరాఖరుకు గవర్నర్, తన దేవాలయ సందర్సనలను  వివాదాస్పదం చేయడానికి మీడియా ప్రయత్నిస్తోందని అభియోగం మోపారు.
‘గవర్నర్ దేవాలయాలకు వెళ్ళడం తప్పుకాదు. నిజానికది వార్తా కాదు’ అంటూ నరసింహన్ ఘంటాపధంగా చెప్పారు.
‘ఒక అధికారిగా, ఒక గవర్నర్ గా నేను చేసిన సేవలకు గౌరవం ఇవ్వకపోయినా పరవాలేదు, కనీసం నా వయస్సును అయినా గౌరవించండి’ అనేది చివర్లో నరసింహన్ మీడియాకు చేసిన విజ్ఞప్తి.
తోక టపా: గవర్నర్ ప్రసంగం అనంతరం ఆ కార్యక్రమానికి హాజరయిన సీనియర్ జర్నలిష్టులు అనేకమంది గవర్నర్ లేవనెత్తిన పలు అంశాలతో ఏకీవభించినట్టే వారి మాటల్లో అర్ధం అయింది. పలు తెలుగు, ఆంగ్ల పత్రికల్లో సుదీర్ఘ కాలం పాటు పనిచేస్తూ వస్తున్న వీ.జే.ఎం. దివాకర్ ఇలా చెప్పారు.
“నేనొక రోజు ప్రెస్ క్లబ్ సమీపంలో వున్న హనుమంతుడి గుడికి వెళ్లాను. ఆ సమయంలో గవర్నర్ నరసింహన్ గుడిలో వున్నారు. లోపలకు వెళ్ళడానికి సంకోచిస్తుంటే, బయట నిలబడి వున్న గవర్నర్ సెక్యూరిటీ సిబ్బంది ‘పరవాలేదు, లోపలకు వెళ్ళండి’ అన్నారు. సందేహిస్తూనే వెళ్లాను. ప్రదక్షిణం చేస్తుంటే నా ముందున్న వ్యక్తిని చూసి నివ్వెర పోయాను. గవర్నర్ మామూలుగా అందరు  భక్తుల మాదిరిగా ప్రదక్షిణాలు చేస్తున్నారు.”
(02-12-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 09491 30595
NOTE: Courtsey Image Owner                     

1, డిసెంబర్ 2015, మంగళవారం

ప్రెస్ క్లబ్ తో నలభయ్ ఏళ్ళ అనుబంధం

హైదరాబాదు ప్రెస్ క్లబ్ స్థాపించి యాభయ్ ఏళ్ళు గడిచాయి. ఇందులో నలభయ్ ఏళ్ళకు పైగా ఆ క్లబ్ సభ్యుడిగా వుంటూ వచ్చాను. క్లబ్ కార్యవర్గ సభ్యుడిగా, క్లబ్ కార్యదర్శిగా, క్లబ్ ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో ప్రెస్ క్లబ్ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాలుపంచుకునే అవకాశం లభించడం నా అదృష్టం.

మొన్నీ మధ్య ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉత్సవానికి ముందు రోజు క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి తెలంగాణా ఉప ముఖ్యమంత్రి  మహమూద్ ఆలీ,  హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి హాజరై సీనియర్ సభ్యులను సత్కరించారు. మరుసటి రోజు రవీంద్రభారతిలో నిర్వహించిన  స్వర్ణోత్సవంలో గవర్నర్ శ్రీ నరసింహన్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణా ఐ.టీ. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతులమీదుగా మరోమారు ఈ సత్కారం స్వీకరించే అవకాశం మా బోంట్లకు కలిగించిన క్లబ్ కార్యవర్గానికి కృతజ్ఞతలు.