31, అక్టోబర్ 2015, శనివారం

అన్నీ చెప్పేస్తున్నా.....

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 01-11-2015, SUNDAY)

సూటిగా......సుతిమెత్తగా ......
ఒక సీనియర్ ఐ.పీ.ఎస్. అధికారి, పదవీవిరమణ అనంతరం ఒక రాజకీయ పార్టీలో చేరిన వ్యక్తి, ‘అన్నీ చెప్పేస్తున్నా...’ అంటూ ఓ పుస్తకం రాస్తే అందులో ఏముందో, ఏమేమి చెప్పారో అనే ఆసక్తి కలగడం సహజం. ఈ పుస్తక రచయిత శ్రీ రావులపాటి సీతారామారావు కేవలం, పోలీసు అధికారి, ఓ రాజకీయ పార్టీ నాయకుడు మాత్రమే కాదు. చదువుకునే రోజులనుంచీ చేయి తిరిగిన రచయిత అనే పేరు సంపాదించుకున్నారు. కలం పట్టిన చేత్తో లాఠీ పట్టుకున్నా కలాన్ని మాత్రం ఒదిలిపెట్టలేదు. ఈ పుస్తకం చివర్లో ఒక చమత్కార పూరితమైన ఒక వాక్యం వుంది. ఉద్యోగ పర్వంలో తన పేరును అంటిపెట్టుకుని వున్న ఐ.పీ.ఎస్. (ఇండియన్ పోలీసు సర్వీసు) అనే మూడు ఇంగ్లీష్ పొడి అక్షరాలు, రాజకీయ రంగ ప్రవేశం దరిమిలా ‘ఇండియన్ పొలిటికల్ సర్వీసు’గా  తనతోనే సహచర్యం చేస్తున్నాయని ఒక చమత్కార బాణం సంధించారు. అంతేకాదు ఈ రెండో ఉద్యోగానికి రిటైర్ మెంటు లేదని కూడా అంటూ, తన రాజకీయ ప్రయాణం సుదీర్ఘమైనదన్న సంకేతాన్ని కూడా ఇచ్చారు. ప్రభుత్వ సర్వీసులో ఉన్నత పదవులను నిర్వహించి తదనంతరం రాజకీయాల్లో చేరి రాణించిన వాళ్ళు ఎంతో మందివున్నారు. కాకపోతే అటు ఉద్యోగపర్వంలోను, అటు పిదప రాజకీయ రంగంలోనూ తమ ప్రస్థానం కొనసాగే రోజుల్లో వృత్తి ధర్మంగా పలువురు రాజకీయ ప్రముఖులతో అత్యంత సన్నిహితంగా మెలిగే సావకాశం బాగా వున్న రావులపాటి వంటివారు, ఏదైనా పుస్తకం రాస్తే, అందులోనూ, ‘అన్నీ చెప్పేస్తున్నా’ అనే పేరు పెట్టి పుస్తకం రాస్తే ఇక అందులో ఏం రాశారో, ఏం చెప్పారో అన్న ఆసక్తి సర్వత్రా కలగడంలో విడ్డూరం ఏమీ లేదు. పోలీసు ఇంటలిజెన్స్ విభాగంలో అనేక సంవత్సరాలు పనిచేసిన కాలంలో శ్రీ రావులపాటి సీతారామారావుకు తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కీర్తి శేషులు ఎన్టీ రామారావు తోనూ, అలాగే తరువాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన శ్రీ చంద్రబాబునాయుడుతోనూ ఆయనకు అతి సన్నిహితంగా మెలగగలిగే వీలూసాలూ  వృత్తిరీత్యా లభించింది. ఎన్నెన్నో ఆంతరంగిక విషయాలకు, బయటకు పొక్కని సందర్భాలకు, సన్నివేశాలకు ప్రత్యక్ష సాక్షిగా వుండే వెసులుబాటు శ్రీ రావులపాటికి కలిగింది. అంచేత వారిరువురికీ సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు ఈ పుస్తకంలో చోటుచేసుకోవడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. అయితే ఆ విషయాల్లో రచయిత పాటించిన సంయమనం ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. సంచలనం కోసం కూడా తనకు తెలిసిన నిజాలను, తనకు మాత్రమే తెలియగల వాస్తవాలను, ప్రత్యేకించి  కించపరిచే సంచలన అంశాలను ఒదిలిపెట్టి పుస్తకం రాసిన తీరు మెచ్చతగింది. ఈ పుస్తకంపైన తన అభిప్రాయం రాస్తూ ప్రసిద్ధ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ అదే అన్నారు.
“గతంలో ఆత్మకధలు అనేకం వచ్చాయి. అయితే ఈ పుస్తకంలో కనబడే విశిష్టత రచయిత నిజాయితీ. పుస్తకం కమ్మర్షియల్ గా సక్సెస్ అవడం కోసం పేరున్నవారిని తిట్టడం, వారి బలహీనతల్ని భూతద్దంలో చూపడం మొదలైనవి ఇందులో కనబడవు’ అంటూ, రావులపాటి వారు  ఎన్నో చెబుతారని కొందరు పెట్టుకునే ఆశలపై ముందస్తుగానే ఇన్ని నీళ్ళు చల్లేశారు.
మరి ఇంత నిజాయితీతో, నిబద్ధతతో రాసే పుస్తకంలో చదివించే అంశాలు ఏమీ లేవా అంటే వున్నాయి. అందులో ముందుగా చెప్పాల్సింది రాసిన తీరు.  ఎంతో సరళంగా, గందరగోళాలు లేకుండా హాయిగా ఏకబిగువున చదువుకునే విధంగా వుంది  రచయిత శైలి. ఆయన స్వయానా రచయిత కావడం వల్ల, ఆత్మకధ అనండి, లేదా ఆయనే చెప్పుకున్నట్టు పోలీసు పొలిటీషియన్ స్వ’గతం’ అనండి – చదివించే గుణం ఈ పుస్తకంలో పుష్కలంగా వుంది. అనేక దశాబ్దాలపాటు ప్రభుత్వ సర్వీసులో వుండి తాను గమనించిన విషయాలను సమగ్రంగా, సందేహాలకు తావులేకుండా, రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా, ముందు వెనుకల సన్నివేశాలను ఒక క్రమపద్ధతిలో ఏర్చి కూర్చి, ఒక పుస్తకంగా రాయడం అనేది అంత సులభమైన విషయం కాదు. పైగా జీవించి వున్న వ్యక్తులను, వారి వ్యక్తిత్వాలను అంచనా వేస్తూ రచన చేయడం అనేది నిజంగా కత్తి మీద సామే. ఈ విషయంలో రావులపాటి పూర్తిగా కృతకృత్యులయ్యారు అనడానికి యండమూరివారి కితాబే సాక్షి.
వారం వారం సమకాలీన రాజకీయ అంశాలపై రాసే శీర్షికలో ఈ పుస్తక సమీక్ష ఏమిటన్న అనుమానం చదువరులకు కలగొచ్చు. నిజానికి ఈ పుస్తకం మొదటి నుంచి చివరి వరకు ఒక రాజకీయ గ్రంధమే. రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి ఉన్నవారికి ఒక పాఠ్యాంశంగా ఈ పుస్తకం నిలిచిపోతుందని యండమూరి వీరేంద్రనాథ్ అన్న మాట ఏదో మెచ్చుకోలు కోసం చెప్పింది కాదని పుస్తకం చదివిన వారికి ఇట్టే తెలిసిపోతుంది.
సుదీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసి అటు సమర్దుడయిన అధికారిగా, ఇటు ఆహ్లాద రచయితగా మంచి పేరు తెచ్చుకున్న రావులపాటి సీతారామారావు అనే వ్యక్తి, ఉద్యోగ విరమణ అనంతరం, అంత మంచి పేరు లేని  రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించడం ఇంటా బయటా ఎంతో ఉద్వేగాన్ని కలిగించింది. సరే! రాజకీయాల్లో చేరాలంటే ఏదో ఒక పార్టీలో చేరక తప్పదు. మరి ఆ పార్టీ ఏమిటి ? ఈ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన్ని బాగా తెలిసిన వారందరికీ మరింత ఆశ్చర్యం కలిగించింది. తెలుగు దేశంలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. అదేమీ అంటరాని పార్టీ కాదుకదా! పైగా ఆ రోజుల్లో ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలో వుంది. పైపెచ్చు టీడీపీ అధినేత కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్న రోజులాయే! మరి ఆశ్చర్యాలు, అభ్యంతరాలు ఎందుకోసం?
ఎందుకంటే, రావుల పాటి వారి ఇలాకా అంతా కాంగ్రెస్ మయం. వాళ్ళ స్వగ్రామాలు ఒకనాటి కమ్యూనిష్టుల కంచుకోట ఖమ్మం  జిల్లాలో వున్నప్పటికీ, వారి నరనరాన కాంగ్రెస్ సంస్కృతి జీర్ణించుకుని వుంది. సీతారామారావు గారి నాన్నగారు రావులపాటి సత్యనారాయణ రావుగారు ప్రముఖ కాంగ్రెస్ వాది. పాలేరు సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక బంధుగణం అంతా కాంగ్రెస్ పార్టీ మనుషులే. రక్తపరీక్ష చేస్తే కాంగ్రెస్ రక్తం కనబడుతుందని హాస్యోక్తిగా చెప్పుకునే వారు. అలాంటిది ఒక పోలీసు ఆఫీసరుగా పనిచేసి రాజకీయాల్లో చేరాలని అనుకోవడమే ఒక సంచలనం అయితే, చేరేది తెలుగుదేశం పార్టీ కావడం చుట్టపక్కాల్లో  పెనుసంచలనం అయింది. అయినా టీడీపీ పడవ ఎక్కాలనే నిర్ణయానికి రావులపాటి వారిని ప్రొద్బల పరచిన అంశం ఒక్కటే. చంద్రబాబునాయుడు అనే ఒకే ఒక వ్యక్తికి మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సమర్ధత వుందని ఆయన మనసా వాచా నమ్మడమే. అందుకే ఆ పార్టీ అధికారంలో వున్నప్పుడు అందులో చేరి, దరిమిలా ఒక దశాబ్దంపాటు ఆ పార్టీ అధికారానికి దూరంగా జరిగినా ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీని ఒదిలిపెట్టలేదు. ఆ పార్టీని, దాని నాయకుడిని నమ్ముకునే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. నడుమలో తమ వైపు రమ్మని వై.ఎస్.ఆర్. వైపు  నుంచి పరోక్ష సంకేతాలు వచ్చినప్పటికీ ఆయన మాత్రం టీడీపీ ని వదలలేదు. రాజకీయాల్లో విలువలు వుండి తీరాలని, లేకపోతే వాటికి ఏమాత్రం విలువ వుండదన్నది  తన నమ్మకం అని ఆయన రాసుకున్నారు. “పార్టీ మారాలనే ఆలోచన చేయకపోవడానికి కారణం బహుశా నేను ఏ అధికార పదవిని అంతవరకూ చవిచూడకపోవడం కూడా ఒక బలమైన కారణం కావచ్చు. ఆ రుచి నాకు తెలియకపోవడం వల్లనే నేను ఈ నడవడికకు కట్టుబడి వుండొచ్చు” అని రాసుకోవడంలో వున్న నిజాయితీయే యండమూరిని ఆకర్షించిందేమో! 
1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ  పరాజయం తరువాత,  కాంగ్రెస్ విజయ యాత్రలో పాల్గొన్న వారిలో కొందరు అతి ఉత్సాహానికి పోయి ఆబిడ్స్ లోని రామారావు నివాసం వెలుపల ‘ముఖ్యమంత్రి’ అని రాసి వున్న నేమ్ ప్లేటును తీసి కింద పారేశారు. అప్పుడు ఆ  ఏరియా పోలీసు అధికారి సీతారామారావు. ఒక జూనియర్ అధికారి  నేమ్ ప్లేట్ విషయాన్ని  ఎన్టీఆర్ కి నొచ్చుకుంటూ చెప్పబోతే,  ‘నేమ్ ప్లేట్ దేముంది బ్రదర్, పదవే పోయిన తరువాత’ అని ఆయనే సర్దిచెప్పిన తీరు తనని కదిలించి వేసిందని రాసుకున్నారు.
పోలీసు అధికారిగా రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించారని మంచి పేరు తెచ్చుకున్న సీతారామారావు, చంద్రబాబు విషయంలో భావోద్వేగాన్ని దాచుకోలేకపోయారు. అది ఆయన మాటల్లోనే: 
మే, 2014.
“పోటాపోటీగా ఆంద్ర ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం అంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆ క్రితం రాత్రి సరిగా నిద్రపట్టలేదు. ఫోన్లలో వచ్చే రకరకాల మెసేజ్ లు చాలా చీకాకు పెట్టాయి. కొందరు ఫారిన్ నుంచి కూడా ఫోను చేసారు. ‘ఏమవుతుంది? జగన్ గెలుస్తాడా? ఏదో సర్వే చెప్పిందట కదా!’ మరికొందరు భయం భయంగా చంద్రబాబు రావాలి సార్, రాకపోతే యెట్లా?’ ఇలాటి పలకరింపులు ఆందోళనను మరింత పెంచాయి. అర్ధరాత్రి దాటిన  తరువాత మరో ఫోను. ఇంటలిజెన్స్ లో పనిచేసిన ఓ అధికారి. ‘ఇంత రాత్రివేళా’ అన్నాను. ‘ఇప్పుడే చాలా నమ్మకంగా తెలిసింది. తెలంగాణాలో భారీ మెజారిటీతో టీఆర్ ఎస్, ఆంధ్రాలో కొద్ది తేడాతో జగన్ గెలుస్తారని”
“అయినా మనసు మూలల్లో ఏదో నమ్మకం, అలా జరగదనీ, చంద్రబాబు గెలుస్తారనీ.
“ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు ఇంట్లో వున్నాం. ఫలితాలు వస్తున్నాయి. ఒక్కో సీటు గెలుస్తుంటే ఉత్సాహం, కేకలు. తొంభయ్ సీట్లు రాగానే చంద్రబాబునాయుడు దగ్గరకు వెళ్లి అభినందనలు చెప్పబోయాం. ‘వంద రానివ్వండి అప్పుడు చెబుదురు కాని’ అన్నారు ఆయన నిబ్బరంగా. రాత్రంతా పడ్డ ఆందోళన దూదిపింజలా యెగిరి పోయింది.”
తెలంగాణ ప్రాంతానికి చెందిన శ్రీ రావులపాటి సీతారామరావు, ఈ పుస్తకంలో రాసిన ఓ ఆసక్తికర విషయంతో దీన్ని ముగిస్తాను.
“ మా నాన్న తొంభయ్ సంవత్సరాల వృద్ధుడు. తెలంగాణా రాష్ట్రాన్ని డిక్లేర్ చేసిన సందర్భంగా హైదరాబాదు అంతా పండుగ వాతావరణంలో మునిగి తేలుతోంది. మా తమ్ముడి కూతురు ‘జై తెలంగాణా’ అంటూ ఆయన మంచం దగ్గరికి వెళ్లి, ‘తాతయ్యా! తెలంగాణా వచ్చింది. జై తెలంగాణా అను’ అని ఆయన చేయి అతికష్టం మీద పైకెత్తింది. అప్పటికే ఆయన చాలా అస్వతతతో వున్నారు. అయినా అయన తన చేతిని బలవంతంగా ఎత్తి పెట్టుకుని ‘జై విశాలాంధ్ర’ అని కళ్ళు మూసుకున్నారు. ఈ చిన్న పిల్లకు అర్ధం కాలేదు. ఆ మాట కొత్తగా విన్నది. విశాలాంధ్ర కోసం శ్రమించిన వ్యక్తి ఆయన. విలువలను మార్చుకోలేని ఆశక్తుడు’.


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com,  మొబైల్: 98491 30595                                          


29, అక్టోబర్ 2015, గురువారం

పిన్ డ్రాప్ సైలెన్స్


సూది పడ్డా వినబడేంత నిశ్శబ్దం అంటుంటారు. దానికి ఓ చిన్న ఉదాహరణ.
జరిగి చాలా దశాబ్దాలు గడిచాయి.  బాగా వయస్సు మళ్ళిన రాబర్ట్ వైటింగ్ అనే  అమెరికన్ పారిస్ వెళ్ళాడు. అక్కడ విమానాశ్రయంలో దిగగానే ఓ ఫ్రెంచ్ కస్టమ్స్ అధికారి నమ్రతగా పలకరించి పాస్ పోర్ట్ చూపించమని అడిగాడు. ఆయన పాస్ పోర్ట్ కోసం చేతిసంచీ తీసి వెతుకుతుంటే ఆ అధికారి చీకాకు పడ్డాడు.
‘ఫ్రాన్స్ రావడం ఇది మొదటిసారా?’ అని అడిగాడు. కాదన్నాడు వైటింగ్.
‘విమానం దిగగానే పాస్ పోర్ట్ తీసి సిద్ధంగా వుంచుకోవాలి. ఆ మాత్రం తెలియదా?’ అని వ్యంగ్యంగా అన్నాడు.
అమెరికన్ తొణకకుండా జవాబు చెప్పాడు.
‘గతంలో ఒక సారి నేను ఫ్రాన్స్ వచ్చాను, కానీ అపుడెక్కవ్వరూ నన్నిలా అడగలేదు’
‘నేను నమ్మను’ గట్టిగా స్వరం పెంచి చెప్పాడు, ఫ్రెంచ్ కష్టమ్స్ అధికారి.
‘ఎవ్వరయినా సరే, ఆఖరికి అమెరికన్లు అయినా మా దేశం రాగానే పాస్ పోర్ట్ చూపించి తీరాలి. అదిక్కడ రూలు’
‘అలాగా, 1944లో ఓ తెల్లవారుఝామున   4:40 గంటలకు నేను మీ దేశంలోని ఒమాహా బీచికి చేరుకున్నాను. అప్పుడెవ్వరూ పాస్ పోర్ట్ చూపించమని నన్నిలా నిలదీయలేదు. అయితే అప్పుడు నేను వచ్చిన పని వేరు, మీ దేశాన్ని శత్రు సైన్యాల నుంచి విడిపించడానికి అమెరికన్ సైన్యం తరపున వచ్చాను. బహుశా అప్పటికి నువ్వు పుట్టావో లేదో!’ అన్నాడా అమెరికన్. 

అంతే! అక్కడ కొన్ని క్షణాల పాటు ‘పిన్ డ్రాప్ సైలెన్స్!’     


“కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే?.........”

  
“............... గర్వోన్నతిన్‌ బొందరే? వా
రేరీ? సిరి మూటన్ కట్టుకొని పోవంజాలిరే?...........................”
ఇది పోతన గారి పద్యం. వామనావతార ఘట్టంలోది. వామనుడు నిజానికి విష్ణువని, బలిని నాశనం చెయ్యటానికే వచ్చాడని గ్రహించిన శుక్రుడు వామనుడికి దానం ఇవ్వొద్దని బలిని హెచ్చరించినప్పుడు ఈ  లోకంలో ఏదీ శాశ్వితం కాదన్న భావాన్ని బలి వ్యక్తం చేసే సందర్భం.
పోతనగారి కవితా భావావేశాన్ని ఇక్కడికి వొదిలి చికాగో లోని ఎడ్జ్ వాటర్ బీచ్ హోటల్లో జరిగిన ఒక సమావేశం గురించి చెప్పుకుందాం. ఆ రోజు  ఆ హోటల్లో ఏడుగురు అతిరధ మహారధులు సమావేశం అయ్యారు. వారిలో ఎవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ఎందుకంటే ఇదంతా  తొంభయ్ ఏళ్ళ కిందటి ముచ్చట. 1923లో జరిగిన ఈ సమావేశానికి హాజరయిన గొప్పగొప్ప వాళ్ళందరూ కేవలం పాతికేళ్ళ కాలం గడిచేసరికి  ఏమయ్యారో చెప్పడానికే పోతనగారి పద్యం జ్ఞాపకం చేసుకోవాల్సివచ్చింది.
వారిలో ఒకరు  అతిపెద్ద ఉక్కు కర్మాగారం – బెత్లేహం స్టీల్ కార్పోరేషన్ అధిపతి చార్లెస్ ఎం. స్కెవాబ్. కంపెనీ అప్పుల్లో కూరుకుపోయి   దివాళా తీసి దీన స్తితిలో  చనిపోయాడు.
అప్పట్లో అతిపెద్ద పెట్రోలు కంపెనీ అధినేత హోవార్డ్ హబ్ సన్. పాపం మతిచెడిన స్తితిలో ఈ అపర కుబేరుడు కన్ను మూసాడు.
గోధుమ వ్యాపారంలో కోట్లు గడించిన సంపన్నుడు ఆర్ధర్ క్యుతెన్ సర్వస్వం కోల్పోయి అతి పేదరికంలో అంతిమ శ్వాస విడిచాడు.
ఆరోజుల్లో న్యూ యార్క్ స్టాక్ ఎక్చేంజ్ చైర్మన్ రిచర్డ్ విట్నీ జైలు పాలయ్యాడు.
ప్రెసిడెంట్ హార్డింగ్ మంత్రివర్గంలో పనిచేసిన మంత్రి ఆల్బర్ట్ ఫాల్  కొంతకాలం జైలు వూచలు లెక్కబెట్టాడు. క్షమాబిక్ష పొంది ఇంటికి వెళ్ళిన కొద్దికాలానికే మరణించాడు.
వాల్ స్ట్రీట్  షేర్ల వ్యాపారంలో చేయితిరిగిన జెస్సీ లివర్ మోర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
అలనాడు వ్యాపార సామ్రాజ్యాన్ని కంటి చూపుతో శాసించిన ఇవార్ క్రుగర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంటర్ నేషనల్ సెటిల్ మెంట్ బ్యాంక్  ప్రెసిడెంట్ లియోన్ ఫ్రేజర్ సైతం ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
అతి పెద్ద యుటిలిటీ కంపెనీ అధినేత అయిన సామ్యూల్ ఇన్సల్ చేతిలో చిల్లి గవ్వ లేకుండా అసువులుబాసాడు.
వీరంతా డబ్బు యెలా సంపాదించాలి అన్న యావలోనే జీవితాల్ని గడిపారు కానీ యెలా జీవించాలి అన్న విషయాన్ని ఏనాడు పట్టించుకోలేదు.
డబ్బు చెడ్డది కాదు. మనిషికి అత్యవసరమైన  కూడూ గుడ్డా ఏర్పాటు చేసుకోవడానికి ధనం అవసరమే. కానీ అదే సర్వస్వం కాదు. అది శాశ్వితం కూడా కాదు. అలనాడు బలి చక్రవర్తి చెప్పింది అదే.


(నెట్లో సంచారం చేస్తున్న ఒక ఆంగ్ల వ్యాసానికి సంక్షిప్తంగా స్వేచ్చగా చేసిన అనువాదం) 

NOTE: Courtesy Image Owner


28, అక్టోబర్ 2015, బుధవారం

రాజకీయం ఒక రక్షరేఖ

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 29-10-2015, THURSDAY)

సూటిగా .....సుతిమెత్తగా .....

దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు  తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు.
ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు, సాధారణ  ప్రజలనే కాదు, ఇంట్లో, వొంట్లో పుష్కలంగా వున్న ఖామందులు, శ్రీమంతులు, నటులు, కళాకారులు, చివరాఖరుకు జర్నలిస్టులు అందరూ వున్నారు. వీరిలో కొందరికి వారి వారి తాహతునుబట్టి కొన్ని కొన్ని ప్రత్యేక  సదుపాయాలూ, సామాజిక గౌరవాలూ లభిస్తూ వున్నప్పటికీ,  రాజకీయ నాయకులతో పోలిస్తే తక్కువే.
లక్షల్లో అభిమానులూ, కోట్లల్లో డబ్బులూ వున్న సినీ నటులు కూడా రాజకీయ రంగు పూసుకోవడం  కోసం  వెంపర్లాడేది అందుకే. కోట్లకు పడగెత్తిన శ్రీమంతులు, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న బడాబాబులూ తాము సంపాదించుకున్నదాన్ని కాపాడుకోవాలంటే రాజకీయం అనే రక్షరేకు తమకు  వుండి తీరాలి అనే నిర్ధారణకు వస్తున్నారు.  రాజకీయం, ప్రజాసేవ అనేవి అసలు పొసగని వాళ్లు కూడా డబ్బు వెదజల్లయినా  ఏదో ఒక నామినేటేడ్ పదవిలోకి  దూరిపోవాలని దూరాలోచనలు చేసేది అందుకే.
ఒక సినీ నటుడు వుంటాడు. ఏవిధంగా చూసినా కొదవలేని జీవితం. సంఘంలో గౌరవం, ఎక్కడకు వెళ్ళినా పరపతి, ఒక్కసారి పలకరించినా చాలు పులకరించిపోయే జనాలు. కానీ ఏం లాభం ? ఆదాయపుపన్ను శాఖకు చెందిన చిరుద్యోగి ఇంటికి వచ్చాడంటే చాలు, ఎన్ని ఎయిర్ కండిషన్లు  వున్నా కూడా చిరుచెమటలు పట్టాల్సిందే.
ఒక వ్యాపారవేత్త వుంటాడు. నేల నాలుగు చెరగులా విస్తరించిన వ్యాపారాలు. ఎక్జిక్యూటివ్ తరగతిలో విమాన ప్రయాణాలు, స్టార్ హోటళ్ళలో బసలు, నెలకు లక్షల్లో జీతాలు తీసుకునే సిబ్బంది. ఏం సుఖం?  పనిమీద సచివాలయానికో, ప్రభుత్వ కార్యాలయానికో వెడితే పదివేల ఉద్యోగికి కూడా తీసికట్టే.
ఒక స్మగ్లర్ వుంటాడు. ప్రాణానికి వెరవని వందల గూండాలు వెంట వుంటారు. కుక్కని కొట్ట కుండానే  డబ్బు రాశులు రాసులుగా  రాలిపడుతుంది. ప్రపంచంలోని సుఖాలన్నీ కాళ్ల చెంత వుంటాయి. ఏం ప్రయోజనం? రోడ్డు మీద పోలీసు కనబడితే భయపడే పరిస్తితి.
మరొకడు వుంటాడు. అతడు కళాకారుడు కాదు. విద్యావంతుడు కాదు. డబ్బున్నవాడు కాదు. పేరున్నవాడు కాదు. కానీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకే కాదు ముఖ్యమంత్రి ఆఫీసుకే కాదు ఆఖరుకు సాధారణ జనాలు గడప తొక్కడానికి సందేహించే పోలీసు ఠాణాలకు సైతం వేళాపాళా లేకుండా వెళ్ళగలడు. కింది స్తాయి  నుంచి పై స్తాయి అధికారివరకు తలుపులు తోసుకుని వెళ్ళగలడు. పనిచేసి తీరాలని పట్టుపట్టగలడు. ఒక్క మనిషికి  కూడా అధికారిక ప్రవేశం లేని చోట్లకు పదిమందిని వెంటేసుకు వెళ్ళగలడు. అతడే రాజకీయ నాయకుడు.
చట్టం తనపని తాను చేసుకుపోతుందనేది పడికట్టుమాట. చట్టం ఎవరిపట్ల యెలా తన పని చేయాలో నిర్దేశించే మీట మాత్రం  రాజకీయనాయకుల చేతిలో వుంటుంది. అతడు బిగువు  వొదిలితే చట్టం పనిచేసే వేగం కుందేలు పరుగులా పెరుగుతుంది. పగ్గం బిగిస్తే చట్టం వడి తాబేలు నడకలా మందగిస్తుంది. అదీ రాజకీయానికి వున్న పవర్. ఎందుకని అడిగేవాడు లేడు.
చట్టం చేతులు చాలా పొడుగు అనే పొడుగాటి డైలాగులు రాజకీయ నాయకులకు వర్తించవు. వారి జోలికి వెళ్ళడానికి పోలీసులు జంకుతారు. మామూలుమనిషిని అరెస్టు చేయడానికి, పోలీసు స్టేషనుకు రప్పించడానికి వుండే నియమాలు, నిబంధనలు, ఖాకీ దర్పం  రాజకీయ నాయకుల విషయంలో హాం ఫట్, హుష్ కాకీ. అధవా గత్యంతరం లేక అరెస్టు చేయాల్సిన పరిస్తితే  వస్తే వారికి ఆకస్మిక అనారోగ్యం ఎక్కడినుంచో వూడిపడుతుంది. మామూలు మనిషయితే ‘బాగు చేయిస్తాం రా’ అని స్టేషనుకు లాక్కెళ్లి మక్కెలు విరగబొడుస్తారు. నాయకుల విషయం వచ్చేసరికి  నిబంధనలన్నీ కట్టగట్టుకుని  గాలికి ఎగిరిపోతాయి.
రాజకీయం అనే రక్షరేకు వల్ల ఇన్ని లాభాలు వుండడం వల్లనే సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు పొలోమని ఆ దారులవెంట పరుగులు తీస్తున్నారు. ఏదో ఒక పార్టీ గొడుగు కింద  వుంటే చాలు ఏవీ లేకపోయినా అన్నీ వున్నట్టే లెక్క. అలా అని హోల్ మొత్తంగా రాజకీయ నాయకులందరూ ఇలాగే ఉంటారా, వాళ్ళల్లో మంచివాళ్ళు లేరా అంటే ఎందుకు లేరు? గతంలో వున్నారు. ఇప్పుడూ వున్నారు. ఇకముందూ  వుంటారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అలాటి వారి సంఖ్య క్రమంగా పలచపడిపోతోంది.
అన్ని రంగాల్లో మాదిరిగానే, ఇప్పుడు రాజకీయాల్లోకి యువరక్తం చేరుతోంది. రిజర్వేషన్ల పుణ్యమా అని శాసన సభల్లో బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం పెరుగుతోంది. చదువుకున్న వారు, మంచి విద్యార్హతలు వుండి కూడా వేరే ఉద్యోగ వ్యాపకాల్లో చేరకుండా రాజకీయ రంగం పట్ల ఆసక్తి పెంచుకునే విద్యాధికుల సంఖ్య గణనీయంగానే ఉంటోంది. నిజానికివన్నీ ఆహ్వానించ తగ్గ పరిణామాలు. అసలు ఈనేపధ్యంలోనే ముందు పేర్కొన్న రాజకీయ అవలక్షణాలను అంతగా ఉదహరించింది. ఎందుకంటే ఈ విపరీత ధోరణులను కొత్తగా రాజకీయ రంగప్రవేశం చేస్తున్న యువకులు, విద్యాధికులు, మహిళలు గుర్తించి వాటికి దూరంగా మసలుకోవడం అలవరచుకోవాలి. లేని పక్షంలో ఇటువంటి నిందలను వాళ్ళు కూడా మోయాల్సివస్తుంది.
దేశంలో  స్వార్ధ రాజకీయ శక్తులకు కొదవలేదు. అయినా కానీ, మన  ప్రజాస్వామ్య వ్యవస్థ చెక్కుచెదరకుండా వుంది. పడ్డ పునాదులు అంత బలిష్టంగా, పటిష్టంగా ఉన్నాయనుకోవాలి. అది ప్రజలు చేసుకున్న అదృష్టం.
రాజకీయ వ్యవస్థకు చెదలు పట్టనంత కాలం ప్రజల భద్రతకు ధోకా వుండదు. ఆ వ్యవస్థను కాపాడుకోవడం అందరి బాధ్యత. అయితే ఇందులో సింహ భాగం రాజకీయులదే అనడంలో సందేహం లేదు.
రాజకీయం అనేది దేశానికి రక్షరేఖగా వుండాలి కాని, ఎవ్వరో కొందరు రాజకీయ నాయకులకి కాదు.  (28-10-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595        


రేడియో రోజులు




ఇప్పటి సంగతి కాదు. ఆరోజుల్లో రేడియో స్టేషన్ మొత్తంలో డైరెక్ట్ టెలిఫోన్ వుండేది డైరెక్టర్ తరవాత మా న్యూస్ రూంలోనే. మిగిలిన వాళ్ళను కాంటాక్ట్ చేయాలంటే ఎక్స్ టెన్షన్ నంబర్ డయల్ చేయాల్సి వచ్చేది. అందువల్ల ఎవరెవరి ఫోన్లో మాకు వస్తుండేవి.

ఒకరోజు ఆర్టీసీ ఆఫీసునుంచి ఫోన్.  చైర్మన్ లైన్లోకి వచ్చారు.  ఆదివారం మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించారు. ఆయనతో వున్న పరిచయంతో – ‘ఇంకా ఎవరెవరు వస్తున్నార’ని మాటవరసకు అడిగాను. “ఎవరూ లేరు, మీరూ, మీతో పాటు మీ దగ్గర రైతుల ప్రోగ్రాములు అవీ చూస్తూవుంటారే అదే – నిర్మలా వసంత్, విజయకుమార్ – వాళ్ళల్లో ఎవరినయినా ఒక్కసారి ఫోను దగ్గరికి పిలిస్తే వాళ్ళకు కూడా చెబుతాను.” అన్నారాయన. అప్పుడు లైటు  వెలిగింది. ఆయన ఫోను చేసింది వాళ్ళకోసం. భోజనానికి పిలుద్దామని అనుకుంది కూడా వాళ్లనే. ముందు ఫోన్ రిసీవ్ చేసుకున్నాను కనుక, విలేకరిగా తెలిసినవాడిని కనుక - మర్యాదకోసం నన్ను కూడా పిలిచివుంటారు.

ఆయన ఎవరో కాదు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఇందిరాగాంధీ హయాంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎం. సత్యనారాయణరావు గారు. 



(ఎం. సత్యనారాయణ రావు  గారు)

ఈ ప్రస్తావన అంతా ఎందుకంటే - రేడియోలో పనిచేసే కళాకారులు ఎవరో బయటకు తెలియకపోయినా , వారి స్వరాలే వారిని నలుగురికీ సుపరిచితుల్ని చేస్తాయని చెప్పడానికి. ఆ తరవాత కాలంలో సత్యనారాయణరావుగారిని నేను కలిసిన ప్రతి సందర్భంలోనూ, వాళ్ళిద్దరినీ మెచ్చుకుంటూ మాట్లాడేవారు. ఒకసారి ఢిల్లీలో సత్యనారాయణ రావు గారిని వారి ఇంట్లోనే కలిసాను. ఆయన పక్కనే చిన్న ట్రాన్సిస్టర్  రేడియో తన దారిన తాను ప్రోగ్రాములు వినిపిస్తోంది. అది చూసి ఒక రేడియో మనిషిగా ఎంతో సంతోషం అనిపించింది. ‘రేడియో పెడితే చాలు, పాలూ పేడా తప్ప ఇంకేముంటాయి’ అని హేళనగా మాట్లాడుకునే రోజుల్లో – ఇలాటి వారుచెప్పే మాటలే ఆ కళాకారులకు నూతన జవసత్వాలను ఇచ్చేవని అనుకుంటాను.


ప్రతిరోజూ మధ్యాహ్నం హైదరాబాదు కేంద్రం నుంచి వెలువడే ప్రాంతీయవార్తలు ముగియగానే వ్యవసాయదారుల కార్యక్రమం మొదలయ్యేది. రైతులకు సంబంధించిన అనేక అంశాలను వారికి పరిచితమయిన యాసలో వారిద్దరూ వివరించే తీరు జనరంజకంగా వుండేది. ఏదో సర్కారు ఉద్యోగమేకదా అనుకుంటే వారలా ఆ కార్యక్రమానికి అంతగా కష్టపడి జీవం పోయాల్సిన అవసరం వుండేదికాదు. సత్యనారాయణరావుగారి వంటి వారే కాదు, వారి కార్యక్రమం అంటే చెవికోసుకుని వినేవారెందరో వుండేవారు.

ఇప్పుడే అందిన వార్త


1984 సెప్టెంబర్ 16 మధ్యాహ్నం ఒంటి గంటా ఇరవై నిమిషాలకు విజయవాడ రేడియో కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు మొదలయ్యాయి. కొద్దిసేపు గడిచిందో లేదో వార్తలు చదివే వ్యక్తి "ఇప్పుడే అందిన వార్త" అంటూ ఒక సంచలన వార్తను వినిపించారు.



"గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ ఎన్టీ రామారావును ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా ఆహ్వానించారు" ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం సాధించిన విజయ సమాచారం ఆనాటి రేడియో వార్త ద్వారా రాష్ట్రం నలుమూలలకు చేరిపోయింది. ఆరోజు ఆవార్త చదివిన వ్యక్తి, ఆరోజుల్లో బెజవాడ ఆంద్రజ్యోతిలో పనిచేస్తున్న శ్రీ గారపాటి నరసింహారావు. తాత్కాలిక ప్రాతిపదికన ఆరోజు న్యూస్ రీడర్ గా ఆవార్తను ప్రజలకు అందించే అదృష్టం తనకు కలిగిందని శ్రీ నరసింహారావు తరచూ గుర్తుచేసుకుంటూ వుండేవారు. (ఆయన ఈ మధ్యనే అనారోగ్యంతో కన్నుమూసారు.)  ఆరోజు హైదరాబాదు రాజభవన్ సెంట్రీ రూములోని ఫోనుద్వారా బెజవాడ రేడియో కేంద్రానికి ఈ వార్తను అందించింది నేనే. ఆ రోజు నావెంట నేటి తెలంగాణా సిఎం, సీపీఆర్వో శ్రీ జ్వాలా నరసింహారావు కూడా వున్నారు.
అలాగే మరో జ్ఞాపకం.

గండిపేటలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. నేను గోడకు ఆనుకుని  నిలబడి వున్నాను. మరి కొద్ది నిమిషాల్లో సాయంత్రం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. నాకు టెన్షన్ పెరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ప్రసంగం అనర్ఘలంగా సాగుతోంది. పార్టీ  ప్రధాన కార్యదర్శి ఎవరన్నది  ఆరోజు  ప్రకటిస్తారు. సాయంత్రం వార్తల సమయం అయిపోయిందంటే ఇక  మరునాడు  ఉదయం విజయవాడ నుంచి వెలువడే వార్తల వరకు వేచి వుండాలి. పత్రికలు కూడా తెల్లవారినదాకా రావు. అందుకే రేడియో వార్తలకు, ముఖ్యంగా ‘ఇప్పుడే అందిన వార్తలకు’ అంత గిరాకీ.   ఆ రోజుల్లో గండిపేట నుంచి హైదరాబాదుకు డైరెక్టు టెలిఫోను సదుపాయం లేదు. ట్రంకాల్ బుక్ చేయాలి. అంత  వ్యవధానం లేదు. నేను నిలబడ్డ కాంపౌండ్ వాల్ వెనుక ఎన్టీఆర్ కుటీరం వుంది. ముఖ్యమంత్రి కాబట్టి  అందులో ఎస్టీడీ  సౌకర్యం వున్న ఫోను ఏర్పాటు చేసారు. అది ముందుగానే తెలుసుకుని, విలేకరుల వరుసలో కాకుండా ఆ గోడ దగ్గర కాచుకుని వున్నాను. ఇంతలో ఎన్టీఆర్ నోటినుంచి ‘మన పార్టీ ప్రధాన కార్యదర్శిగా చం.....’  అనే మాట వినబడింది.  అంతే! నేను ఒక్క క్షణం వృధా చేయకుండా ఆ గోడ దూకేసాను. సెంట్రీ ఎవరు ఎవరని వెంటపడ్డాడు. లెక్కచేయకుండా లోపలకు దూరి వెళ్లి ఫోను తీసుకుని రేడియోకు ఫోను చేసాను. అవతల మా న్యూస్ ఎడిటర్ ఆకిరి రామకృష్ణా రావు, నా గొంతు విని ‘ఎవరు?’ అని క్లుప్తంగా అడిగారు. నేను ‘చంద్రబాబు’ అని అంతే క్లుప్తంగా వగరుస్తూ చెప్పాను. మరునిమిషంలో టీడీపీ నూతన  ప్రధాన కార్యదర్శిగా శ్రీ చంద్రబాబునాయుడ్ని నియమించిన సమాచారం, ‘ఇప్పుడే అందిన వార్తగా’ రాష్ట్రం నలుచెరగులకూ రేడియో ద్వారా చేరిపోయింది.         

27, అక్టోబర్ 2015, మంగళవారం

రేడియో రోజులు



రేడియోలో పనిచేసేవారు ఉద్యోగ రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలలో పనిచేయాల్సి వస్తుంది. హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన  వీ.వీ. శాస్త్రి (వేమూరి విశ్వనాధ శాస్త్రి) చెప్పిన ఆసక్తికర ఉదంతం ఇది.
ఆయన భోపాల్ లో పనిచేసేటప్పుడు  జవహర్ లాల్ నెహ్రూ దగ్గర కార్యదర్శిగా పనిచేసిన  సీనియర్ ఐ.సీ.ఎస్. అధికారి  కె.పీ.ఎస్. మీనన్ ఏదో కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఆ నగరానికి రావడం జరిగింది. ఆయన వద్ద గతంలో పనిచేసిన సంగ్లూ అనే అధికారి అప్పుడు భోపాల్ రేడియో కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆయన పూనికపై  వీ.వీ. శాస్త్రి వెళ్లి   మీనన్ ను కలుసుకుని  రేడియో కేంద్రానికి ఆహ్వానించారు. నిజానికి ఆయన మరునాడు విదేశీ ప్రయాణం పెట్టుకున్నారు. అయినా, రేడియో మీది గౌరవంతో, సంగ్లూ మీది అభిమానంతో తన ప్రయాణం వాయిదా వేసుకున్నారు. ఆరోజు  రేడియో స్టేషన్ కు వచ్చిన మీనన్, మాటల సందర్భంలో తన అనుభవాలు కొన్ని చెప్పారు.
మీనన్ గారు  ఆరోజు చెప్పిన విషయాల్లో  ఒకటి మన రాష్ట్రానికి సంబంధించింది  కావడం వల్ల శాస్త్రి గారికి బాగా  గుర్తుండిపోయింది.

(కీర్తిశేషులు పండిట్ జవహర్  లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్)

“ భారత దేశానికి  స్వాతంత్ర్యం వచ్చిన తరువాత  అనేక సంస్థానాలను  ఇండియన్ యూనియన్ లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నిజాం నవాబు ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎలాటి చర్య తీసుకోవాలనే విషయంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్న ఆ సమావేశం గంటల తరబడి కొనసాగింది. అర్ధరాత్రి కావొస్తోంది. సర్దార్ పటేల్ మగత నిద్రలోకి జారిపోయినట్టు కళ్ళు మూసుకుని వున్నారు. భారత సైన్యాలను  హైదరాబాదు పంపే విషయంలో  సుదీర్ఘంగా చర్చ సాగుతోంది. కళ్ళు మూసుకుని అంతా వింటున్న సర్దార్ పటేల్ లేచి ఒక్కసారిగా  ఇలా అన్నారట.
‘ ఇండియన్  ఆర్మీ  ఇప్పటికే హైదరాబాదు చేరిపోయింది. మేజర్ జనరల్ చౌదరి అక్కడే వున్నాడు.’
పటేల్ మాటలు విని అక్కడివారంతా మ్రాన్పడిపోయారు.

నెహ్రూ సంగతి చెప్పక్కర లేదు.