దుష్ట శక్తుల
పీడలు సోకకుండా వుండడానికి కొందరు తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు.
ఇప్పుడు రాజకీయం అలాటి
రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు
వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు.
ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు ప్రజలే కాదు ఇంట్లో, వొంట్లో పుష్కలంగా వున్న
ఖామందులు, శ్రీమంతులు, నటులు, కళాకారులు, చివరాఖరుకు జర్నలిస్టులు
అందరూ వున్నారు. వీరిలో కొందరికి వారి వారి తాహతునుబట్టి కొన్ని కొన్ని ప్రత్యేక సదుపాయాలూ, సామాజిక గౌరవాలూ
ఉన్నప్పటికీ, రాజకీయ నాయకులతో పోలిస్తే అవి తక్కువే.
లక్షల్లో అభిమానులూ, కోట్లల్లో డబ్బు
సంచులూ వున్న సినీనటులు కూడా రాజకీయ రంగు
పూసుకోవడం కోసం వెంపర్లాడేది అందుకే. కోట్లకు పడగెత్తిన
శ్రీమంతులు, వ్యాపార
సామ్రాజ్యాలు నిర్మించుకున్న బడాబాబులూ తాము సంపాదించుకున్నదాన్ని కాపాడుకోవాలంటే
రాజకీయం అనే రక్షరేకు తమకు వుండి తీరాలి అనే
నిర్ధారణకు వస్తున్నారు. రాజకీయం, ప్రజాసేవ అనే పదాలు పొసగని
వాళ్లు కూడా, డబ్బు వెదజల్లయినా ఏదో ఒక నామినేటేడ్ పదవిలోకి
దూరిపోవాలని
దూరాలోచనలు చేసేది అందుకే.
ఒక సినీ నటుడు వుంటాడు.
ఏవిధంగా చూసినా కొదవలేని జీవితం. సంఘంలో గౌరవం. ఎక్కడకు వెళ్ళినా పరపతి. ఒక్కసారి నోరారా పలకరించినా చాలు, ఊరూరా పులకరించిపోయే జనాలు. కానీ ఏం లాభం ? ఆదాయపుపన్ను శాఖకు చెందిన
చిరుద్యోగి ఇంటికివచ్చినా చిరుచెమటలు పట్టాల్సిందే.
ఒక వ్యాపారవేత్త వుంటాడు.
నేల నాలుగు చెరగులా విస్తరించిన వ్యాపారాలు. ఎక్జిక్యూటివ్ తరగతిలో విమాన
ప్రయాణాలు, స్టార్
హోటళ్ళలో బసలు, నెలకు
లక్షల్లో జీతాలు తీసుకుంటూ తనని కంటికి రెప్పలా కనిపెట్టుకునే సొంత
సిబ్బంది. ఏం సుఖం? పనిమీద
సచివాలయానికో, ప్రభుత్వ
కార్యాలయానికో వెడితే పదివేల ఉద్యోగికి కూడా తీసికట్టే.
ఒక స్మగ్లర్ వుంటాడు.
ప్రాణానికి వెరవని వందల మంది గూండాలు
వెంటనే వుంటారు. ఏ కుక్కని కొట్ట కుండానే డబ్బు
రాశులు రాసులుగా రాలిపడుతుంది.
ప్రపంచంలోని సుఖాలన్నీ కాళ్ల చెంత వుంటాయి. ఏం ప్రయోజనం? రోడ్డు మీద పోలీసు కనబడితే
భయపడే పరిస్తితి.
మరొకడు వుంటాడు. అతడు
కళాకారుడు కాదు. విద్యావంతుడు కాదు. డబ్బున్నవాడు కాదు. పేరున్నవాడు కాదు. కానీ, అన్ని ప్రభుత్వ
కార్యాలయాలకే కాదు, ముఖ్యమంత్రి ఆఫీసుకే కాదు, ఆఖరుకు
సాధారణ జనాలు గడప తొక్కడానికి సందేహించే పోలీసు ఠాణాలకు సైతం వేళాపాళా లేకుండా
వెళ్ళగలడు. కింది స్తాయినుంచి పై స్తాయి అధికారి వరకు తలుపులు తోసుకుని వెళ్ళగలడు.
తాను వచ్చిన చెప్పి, అప్పటికప్పుడే ఆ పనిచేసి తీరాలని పట్టుపట్టగలడు. ఒక్క మనిషికి
కూడా
అధికారిక ప్రవేశం లేని చోట్లకు పదిమందిని వెంటేసుకు వెళ్ళగలడు. అతడే రాజకీయ
నాయకుడు.
చట్టం తనపని తాను
చేసుకుపోతుందనేది పడికట్టుమాట. చట్టం ఎవరిపట్ల యెలా తన పని చేయాలో నిర్దేశించే మీట
మాత్రం రాజకీయనాయకుల చేతిలో వుంటుంది. అతడు బిగువు వొదిలితే
చట్టం పనిచేసే వేగం కుందేలు పరుగులా పెరుగుతుంది. పగ్గం బిగిస్తే చట్టం తాబేలు
నడకలా మందగిస్తుంది. అదీ రాజకీయానికి వున్న పవర్. ఎందుకని అడిగేవాడు లేడు.
చట్టం చేతులు చాలా పొడుగు
అనే పొడుగాటి డైలాగులు రాజకీయ నాయకులకు వర్తించవు. వారిజోలికి వెళ్ళడానికి
పోలీసులు జంకుతారు. మామూలుమనిషిని అరెస్టు చేయడానికి, పోలీసు స్టేషనుకు రప్పించడానికి
వుండే నియమాలు, నిబంధనలు
రాజకీయ నాయకుల విషయంలో హాం ఫట్,
హుష్ కాకీ. అధవా గత్యంతరం లేక అరెస్టు చేయాల్సిన పరిస్తితే వస్తే
వారికి ఆకస్మిక అనారోగ్యం ఎక్కడినుంచో వూడిపడుతుంది. మామూలు మనిషినయితే, ‘ఒంట్లో
బాగాలేదా నాయనా, బాగు చేయిస్తాం రా’ అని పోలీసు
స్టేషనుకు లాక్కెళ్లి మక్కెలు విరగబొడిచే
పోలీసులు, రాజకీయ నాయకుల విషయం
వచ్చేసరికి వారి నిబంధనలూ, ఖాకీ
దర్పాలూ అన్నీ కట్టగట్టుకుని గాలికి
ఎగిరిపోతాయి.
రాజకీయం అనే రక్షరేకు వల్ల
ఇన్ని లాభాలు వుండడం వల్లనే సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు పొలోమని ఆ దారులవెంట
పరుగులు తీస్తున్నారు. ఏదో ఒక పార్టీ గొడుగు కింద వుంటే
చాలు ఏవీ లేకపోయినా అన్నీ వున్నట్టే లెక్క.
ఉపశృతి: ప్రసిద్ధ సంపాదకులు
శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు, ‘అప్పుడు - ఇప్పుడు’ అనే పేరుతొ,
కీర్తిశేషులు, ప్రముఖ పత్రికా రచయిత శ్రీ జీ. కృష్ణ రచించిన గ్రంధానికి ముందుమాట
రాస్తూ, ఒకానొక సందర్భంలో కృష్ణ గారు
నుడివిన వ్యాఖ్యను ఇలా ప్రస్తావించారు.
“ స్వాతంత్ర్యానంతరం మన
రాజకీయ నాయకులు నేర్చుకున్నదేమిటి? కృష్ణగారు అంటారు – ‘రెండే రెండు విద్యలు. ఒకటి
గుడ్డిగా పొగడడం, రెండు గుడ్డిగా వ్యతిరేకించడం’.
(19-09-2015)
రచయిత ఈ మెయిల్:
bhandarusr@gmail.com మొబైల్: 98491 30595