29, ఆగస్టు 2015, శనివారం

గుంటూరు ఆసుపత్రిలో సర్పమూషిక న్యాయం


సాధారణంగా న్యాయస్థానాలు భావోద్వేగాలకు అతీతంగా తామరాకుమీది నీటి బొట్టు మాదిరిగా వ్యవహరిస్తాయి. అయితే మానవ హక్కుల కమిషన్ ఒక కేసు విషయంలో వెలువరించిన అభిప్రాయాలు, వ్యక్తపరచిన విధానం ఆ కేసులోని తీవ్రతను తేటతెల్లం చేస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పసికందును ఎలుకలు కొరికి చంపిన దారుణ  సంఘటనను  చాలా  తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కమిషన్ జారీ చేసిన ఆదేశాల్లో ఉపయోగించిన పదజాలం తెలుపుతోంది.   మామూలుగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కమిషన్ స్పందించి, సంబంధిత అధికారులకు జారీ చేసే ఆదేశాలు, ఇంగ్లీష్ భాషలో, ఒక నిర్దిష్ట పద్దతిలో, ఒక రకంగా చెప్పాలంటే పడికట్టు పదాలతో,  ఒకే మూసలో వున్నట్టు కానవస్తాయి. కానీ గుంటూరు సంఘటన విషయంలో మానవ హక్కుల కమిషన్ స్పందించిన తీరు, ఈ సాంప్రదాయక  విధానానికి భిన్నంగా వుంది. ఈ సారి కమిషన్ ఆదేశాలు సరళమైన తెలుగులో, ఉద్వేగ పూరిత భావజాలంతో,  అదీ చేతిరాతతో వెలువడ్డాయి.
‘నిర్లక్ష్యం కమ్ముకున్న ఈ వ్యవస్థలో ..ఆ తల్లికి  బిడ్డను తెచ్చి ఇవ్వగలమా? దీనికి బాధ్యులు ఎవ్వరు ?’ అని  కమి షన్ ప్రశ్నించింది. వైద్యులను ప్రాణదాతలుగా కొలిచే సమాజంలో వాళ్ళు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటని చీవాట్లు వేసింది. అంతేకాదు, పసికందును ఎలుకలు పీక్కు తిన్నాయని తెలిసినప్పుడు నిర్ఘాంతపోయిన యావత్  సభ్య సమాజం మాదిరిగానే మానవ హక్కుల కమిషన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయిందన్న విషయం ఆదేశాల్లో పొందుపరచిన అతిలోతయిన భావాలు చదివితే అర్ధం అవుతుంది.
‘అమ్మా! నేను ప్రపంచంలోకి వస్తున్నా! నాకు భావి పౌరుడిగా ఎదగాలని వుంది. ఎందుకమ్మా నన్ను  ఈ ఆసుపత్రికి తీసుకువచ్చావ్?’ అని ఎలుకలు తన మీద దాడి  చేస్తున్నప్పుడు ఆ శిశువు యెంత మూగవేదన అనుభవించి వుంటుందో’ అంటూ కమిషన్ అచ్చ  తెలుగులో వ్యక్తపరచిన భావాలు సమస్య తీవ్రత పట్ల ఎంతగా కమిషన్ స్పందించి వుంటుందో అనే వాస్తవాన్ని బహిర్గతం చేస్తున్నాయి.
‘మనిషిని మనిషి కాటేసే సంఘంలో తామేమీ తీసిపోమని చాటిచెప్పేలా గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు ఆ పసి కందుపై దాడిచేశాయి. అవి కొరుకుతుంటే ఆ పసి ప్రాణం ఎంతగా విలవిలలాడిపోయిందో. ఈ ఘటన మన భాషకు, భావాలకు అందనంత హృదయ విదారకమైనది’ అంటూ కమిషన్  తన ఆదేశాల్లో పేర్కొన్నది.
‘దవాఖనాలు దెయ్యాల ఖానాల మాదిరిగా మారిపోయి పసివాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్కలు పసికందుల్ని పీక్కుతిన్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవస్థలోని లోపాలను ఎలా సరిదిద్దుతాం ?’ అన్నది కమిషన్ సంధించిన ప్రశ్న.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందును ఎలుకలు అత్యంత పాశవికంగా కొరుక్కు తినడం వల్ల ఆ శిశువు మరణించిన వార్తపై విచారణ జరపాలని మానవ హక్కుల కమిషన్  తనకు తానుగా సంకల్పించి సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.  
కమిషన్  స్వయంగా పేర్కొన్నట్టు ఆ పసికందు ప్రాణాలు తిరిగి తేవడం అసాధ్యం. కానీ ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సింది ఏమిటన్నది ప్రధాన ప్రశ్న.  
సరే! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. సంఘటనకు బాధ్యులయిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొందరు మంత్రులు, పాలక పక్షానికి చెందిన కొందరు  ఎంపీలు, ఎమ్మెల్యేలు హుటాహుటిన వెళ్లి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని  నలుమూలలా తనిఖీ చేసి, అక్కడి పరిస్తితులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే వాటిని చక్కదిద్దాలని ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగం  తమదయిన పద్దతిలో, షరా మామూలుగా కొన్ని చర్యలు తీసుకుంది. ప్రాధమిక దర్యాప్తు జరిపి, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను, శిశువులకు చికిత్స చేసే ఒక వైద్య నిపుణుడిని బదిలీ చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ  మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా చనిపోయిన శిశువు తాలూకు వారితో దురుసుగా ప్రవర్తించిన ఒక హెడ్ నర్సును, మరో స్టాఫ్ నర్సును సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు.
ఆసుపత్రిలో ఎలుకలు రేపిన కలకలంతో కంగారు పడిన అధికారులు ఎలుకలు పట్టే ఓ వ్యక్తిని వెతికి పట్టుకుని ఎలుకలను పట్టించారు. రెండు రోజుల్లోనే 87 ఎలుకలు దొరికాయని సమాచారం. దొరికినవే ఇన్ని వుంటే దొరక్కుండా కలుగుల్లో ఇంకా ఎన్ని దాగున్నాయో అన్నది జవాబు దొరకని ప్రశ్న.
ఈ ఎలుకలను పట్టడానికి ఓ మనిషి దొరికాడు. కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో  అమాయకులయిన పేద  రోగుల్ని, అక్కడి ఖరీదయిన వైద్య పరికరాల్ని, మందుల్నీ ఎవరి కన్ను పడకుండా కరకరా నమిలి మింగుతూ, ‘వాతాపి జీర్ణం జీర్ణం’ అనుకుంటూ, చట్టానికి దొరక్కుండా కూడగట్టుకున్న అక్రమ సంపాదనలతో పెంచుకున్న బొజ్జల్ని హాయిగా నిమురు కుంటున్న ‘అసలు ఎలకల్ని’ ఎవరు పట్టుకోవాలి? ఎవరు పట్టిస్తారు? పట్టించినా ఏదో ఒక రకంగా తప్పించుకోగల ‘వారి’ తెలివితేటలకి  ఎవరు అడ్డుకట్ట వేస్తారు?


ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఎందుకంటె సమాజాన్ని దోచుకునే సంఘ విద్రోహ, ఆరాచక శక్తుల్లో ఎక్కడా కానరాని  సమైక్యత వుంటుంది. ఒకరినొకరు కాపాడుకోవడం, ఆపదలో పడ్డప్పుడు ‘సర్ప మూషిక న్యాయాన్ని’ పాటించడం వాటికి వెన్నతో పెట్టిన విద్య.
ఒక పాము, ఒక ఎలుక సమయం కలిసిరాక ఒకే బుట్టలో ఇరుక్కుపోయాయి. పాముకు ఎలక ఆహారం. తినేస్తే ఒక పనయిపోతుంది. కానీ బుట్ట నుంచి బయట పడక పొతే అంతే సంగతులు. అంచేత ఆ పాము యుక్తిగా ఎలకకు ఓ సలహా చెబుతుంది. తన పొడ గమనించి  ప్రాణభయంతో గడగడలాడిపోతున్న ఎలకతో చెబుతుంది. ‘నావల్ల నీకు ఎలాటి ప్రమాదం వుండదు. ముందు నీ దంతాలతో ఈ బుట్టకు ఓ రంధ్రం చెయ్యి. ఇద్దరం తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుందాం’ 
ఎలక బతుకు జీవుడా అనుకుంటూ బుట్టకు రంధ్రం చేస్తుంది. వెంటనే పాము ఆ ఎలకని ఎంచక్కా నమిలిమింగేసి, తరువాత ఎలక చేసిన  ఆ రంధ్రం ద్వారా బయట పడుతుంది.
ఈ సర్ప మూషిక న్యాయం ప్రకారం పరస్పర ఆధారిత స్వార్ధపర శక్తులు ఒకమేరకు తమలో తాము సహకరించుకుంటాయి. ఒక స్థాయికి చేరిన తరువాత తమ స్వార్ధానికి, తమ ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. సామాన్యులు మాత్రం ఇందులో శలభాలుగా మారతారు.
గుంటూరు ఆసుపత్రి సంఘటనపై విచారణ జరుగుతుంది. దోషులకు శిక్ష పడుతుంది. వ్యవస్థలోని లొసుగులను అడ్డం పెట్టుకుని వాళ్ళు కొన్నాళ్ళ తరువాత బయటపడతారు. అప్పటికి జనం ఈ విషయం మరచిపోతారు.  ఎలకలు కొరుక్కు తిన్న ఆ పసిపాప చిట్ట చివరి దైన్యపు చూపు నేతల జ్ఞాపకాల్లో రూపుమాసిపోతుంది. కడుపుకోతతో విలవిలల్లాడే  ఆ మాతృమూర్తి  వేదన అరణ్య రోదనే అవుతుంది.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కావంటూ నాయకులు చెప్పే హామీలు మాత్రం పునరావృతం అవుతూనే వుంటాయి. ఇదొక విష చక్ర భ్రమణం. (29-08-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595         
NOTE : Courtesy Image Owner                    

26, ఆగస్టు 2015, బుధవారం

ఆ ఒక్కటీ తప్ప........ భండారు శ్రీనివాసరావు


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 27-08-2015, THURSDAY)
‘అటులయిన సావిత్రీ మరొక్క వరమ్ము కోరుకొమ్ము, అదియును నీ పతి ప్రాణమ్ము దక్క’ అనే యమధర్మరాజు డైలాగు ఒకటుంది ఒక తెలుగు సినిమాలో. ఆ మాదిరి సమాధానమే దొరికినట్టు అర్ధం అవుతోంది మొన్న ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుమ జరిగిన భేటీలో. అలనాటి పురాణ కధలో సతీ సావిత్రి యముడ్ని తన కోరికల చిట్టాలతో తికమక పెట్టి, చివరికి పోయిన తన పతి ప్రాణాలతో సహా అన్నింటినీ సాధించుకుంటుంది. సరే! అది కధో, పురాణమో కాబట్టి సావిత్రి పట్టిన పట్టు విడవక తన పంతం నెగ్గించుకుని ఉండవచ్చు. కానీ ఈ కలికాలంలో ఇలాటి కధ ఇలానే సాగే వీలులేదు.  కాబట్టే, ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యెక హోదా అనేది ప్రధానాంశంగా ఎజెండాలో పెట్టుకుని,   ప్రధాని  మోడీతో భేటీ ముగిసిన తరువాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘హోదా అనేది ఏవన్నా సంజీవనా ?’ అంటూ సమావేశం ఫలితాన్ని ఒక్క ముక్కలో తేల్చేశారు.


చంద్రబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడిన కేంద్ర ఆర్ధిక మంత్రి కూడా తనదయిన రీతిలో ఇదే భావం వ్యక్తం అయ్యేలా మాట్లాడి, మళ్ళీ ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గేది లేదన్నట్టు సన్నాయి నొక్కులు నొక్కారు.  
నిజమే! చంద్రబాబు  అన్నట్టు కొత్త రాష్ట్రం ఎదుర్కుంటున్న సమస్యలు అన్నింటినీ కట్టగట్టి రాత్రికి రాత్రే పరిష్కరించే  దివ్యశక్తులు ఏవీ,  ‘ప్రత్యేక హోదా’కు లేని మాట వాస్తవమే. అందుకే హోదాతో పాటు పత్యేక ప్యాకేజీ కూడా కేంద్రం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ప్రత్యేక హోదా అయినా, ప్రత్యేక ప్యాకేజీ అయినా  ఏ రూపంలో అయినా,  వాటి  అవసరం రాజకీయంగా వున్నది ప్రధానంగా తెలుగు దేశం పార్టీకే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకే. రాష్ట్రాన్ని తాను  అనుకున్న రీతిలో తీర్చిదిద్దాలన్నా, ప్రజలకు  ఇచ్చిన మరి కొన్ని హామీలు మళ్ళీ ఎన్నికలనాటికన్నా నెరవేర్చాలన్నా ప్రత్యేక హోదాలు, ప్రత్యేక రాయితీలు, ప్రత్యేక   ప్యాకేజీలు వంటి ఉపశమనాలు అత్యంత ఆవశ్యకం. ఈ వాస్తవం తెలిసిన మనిషి కనుకనే ఈ కోరికల నన్నింటినీ గుదిగుచ్చి ఓ చిట్టా తయారు చేసి మరీ ప్రధానమంత్రికి సమర్పించారు. ఆంద్ర ముఖ్యమంత్రి రాకలోని ఆంతర్యం తెలిసిన బీజేపీ నాయకత్వం కూడా ఆంద్రప్రదేశ్ విషయంలో తమకు ప్రత్యేక శ్రద్ధ వున్నట్టు కనిపించడానికి ఈ భేటీకి సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. చంద్రబాబు చెప్పింది ప్రధానమంత్రి సావధానంగా విన్నారని ఆ తరువాత చంద్రబాబే స్వయంగా చెప్పారు. చెప్పింది వింటే  ఎవరికయినా  సగం సంతృప్తి ఇస్తుందన్నట్టు ఆయన మొహంలో ఆ తృప్తి కనిపించింది. అయితే దీనితో అందరూ సంతృప్తి చెందుతారా ?  మరి ఈ ‘హోదా’ విషయాన్ని మొట్టమొదట తెర మీదకు తీసుకు వచ్చి అదొక్కటే కొత్త రాష్ట్రపు ఇక్కట్ల నన్నింటినీ పరిహరింపగల ‘మంత్రదండం’  అని జనాల్లో లేనిపోని ఆశలు రేకెత్తించినదెవరు ? ఈ ప్రశ్నకు జవాబు తామే అని ఏ రాజకీయ పార్టీ ఎలాగూ అంగీకరించదు. అలా అని ఏడాది క్రితం జరిగిన విషయాలు జనం అంత త్వరగా మరిచిపోయే వీలు కూడా లేదు.
సరే! షరా మామూలుగానే అంశంతో సంబంధం వున్న రాజకీయ పార్టీలన్నీ ఎదుటివారిపై నెపం మోపే ప్రయత్నం చేస్తున్నాయి  తప్ప ఏ ఒక్క పార్టీ కూడా తమకూ ఇందులో కొద్దో గొప్పో పాత్ర  ఉన్నదన్న వాస్తవాన్ని నిజాయితీగా  ఒప్పుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ అంశం ఒక జటిల సమస్యగా రూపాంతరం చెందడానికి దోహదం చేసిన కారణాల్లో ఇది ప్రధానమైనది.
నూతన రాష్ట్రం ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యెక హోదా దక్కకకుండా పోవడంలో పాత్ర అలావుంచి అసలు సీమాంధ్ర ప్రాంతంలో మెజారిటీ ప్రజల   అభీష్టానికి విరుద్ధంగా ఆ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న సందర్భంలో, అప్పుడే ఈ అంశాన్ని విభజన చట్టంలో చేర్చి వుంటే ఈ పరిస్తితి ఉత్పన్నం అయ్యేది కాదు అనే వాదన వుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీని ఎక్కడ పెట్టాలో అక్కడ కూర్చోబెట్టి ప్రజలు తమ తీర్పు చెప్పేశారు.  చేసిన తప్పుకు ఆ పార్టీ శిక్ష కూడా అనుభవిస్తోంది. కాబట్టి,  ఇక దాన్ని తప్పుపట్టి ప్రయోజనం లేదు.         
పొతే, వై.ఎస్.ఆర్.సీ.పీ. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆశలు వమ్ముకావడానికి దోహదం చేసిన కారణాల్లో విభజన అంశం కూడా ఒకటి. మిగిలివున్న మూడున్నర సంవత్సరాల కాలం నిజానికి ఆ పార్టీకి పోరాట కాలమే. ఏ చిన్న అంశం దొరికినా, దొరకకున్నా దొరకబుచ్చుకుని వీధుల్లోకి రావాల్సిన రాజకీయ ఆవశ్యకత ఆ పార్టీకి వుంది. ఉనికి కాపాడుకోవడానికి ఆ స్థానంలో ఏ పార్టీ వున్నా అదే పని చేస్తుంది. ఈ ప్రత్యెక హోదా అనేది ఆ పార్టీకి అలా అందివచ్చిన అవకాశం. ‘ఆ పార్టీ చేసే ధర్నాలవల్ల ప్రత్యెక హోదా వస్తుందా? కేవలం ప్రజలకు అసౌకర్యం తప్ప’ అని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. అదీ. నిజమే. ధర్నాలవల్ల, ఆందోళనల వల్ల, నిరసనల వల్ల రాజకీయ నిర్ణయాలు ప్రభావితం కావు. నిర్ణయం తీసుకునే అవకాశం వున్న  ఏ రాజకీయ పార్టీ అయినా దానివల్ల కొద్దో గొప్పో లబ్ది వుంటుంది అనే నమ్మకం చిక్కిన తరువాతనే అటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ధర్నాలు, ఆందోళనలు ఒక భాగం.  అవి సహజం’  అని ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రబోధించే పార్టీలే అధికార పీఠం ఎక్కగానే, తగవు తగవంటూ  ఇటువంటి నీతి పాఠాలు వల్లె వేస్తూ వుండడం వల్ల జనసామాన్యంలో వాటికి విలువ తగ్గిపోతూ వుంది. 
ఇక బీజేపీ. బీజేపీ అంటే ఇప్పుడు మోడీ. మోడీ అంటే బీజేపీ అనే తరహాలో ఆ పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయి. మొత్తం వ్యవస్థను మారుస్తాను అనే నమ్మకాన్ని కలిగించి గద్దె ఎక్కిన రాజకీయ నాయకుడు ఆయన.  ఎన్నికలకు ముందు కొంతకాలం వరకు ప్రధాని అభ్యర్ధిగా తన పేరు ప్రతిపాదించడానికి కూడా సొంత పార్టీలోని కొన్ని శక్తులు అడ్డం పడ్డ సంగతి తెలియని వాడేమీ కాదు. వరుసగా పదేళ్ళు పాలించి స్కాముల ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నిర్వాకమో తెలియదు, ప్రజలు మార్పు కోరుకున్నారో తెలవదు, హరి యను రెండక్షరములు హరియించును పాతకములు అన్న చందంగా  మోడీ అనే రెండక్షరాలు, భారత రాజకీయ చరిత్రలో కనీ వినీ ఎరుగని అద్భుత విజయాన్ని ప్రజలు మోడీ నాయకత్వంలోని ఎండీయే కూటమికి కట్టబెట్టాయి.  సహజంగా ఎన్నికల్లో గెలుపోటములు దైవాధీనాలు. అందుకే ఎన్నికలకు ముందు మోడీ వ్యవహార శైలిని ఎన్నికల్లో అపూర్వ విజయం తరువాత ఆయన వ్యవహరిస్తున్న తీరుతో ముడిపెట్టడం కూడా పద్దతి కాదు.
అధికారంలోకి రావడానికి చెప్పే మాటలకి, అధికారం చేజిక్కించుకున్న తరువాత చేష్టలకి హస్తిమశకాంతరం తేడా ఉంటుందన్నది సర్వజన విదితమే. తిరుపతి వెంకన్న సాక్షిగా మాట ఇచ్చేటప్పుడు మోడీ కేవలం నరేంద్ర మోడీ. తరువాత దేశం యావత్తు పట్టం కట్టిన ప్రధానమంత్రి. తేడా ఉండదా అంటే వుండి తీరుతుంది. ఎందుకంత తేడా అని తప్పు పట్టలేము. ఆరోజు అవసరానికి ఎన్నో చెబుతారు. అవన్నీ చేసి తీరాలని రూలేమీ లేదు. దేశ ప్రధాని పీఠం ఎక్కేంతవరకు ఆంధ్రప్రదేశ్  అనేది ఒక ముఖ్యమైన  రాష్ట్రం. ఆ పీఠం అధిష్టించిన తరువాత దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అది కూడా ఒకటి. ఈ సూత్రం ఒక్క మోడీకే కాదు  రాజకీయ నాయకులందరికీ వర్తిస్తుంది.
అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ  రాజకీయ పార్టీలు చెప్పినవన్నీ చేసి వుంటే ఇప్పటికి మన భారత దేశం మొత్తం ప్రపంచంలో అగ్రగామిగా వుండేది. అలా అని మాట నిలబెట్టుకోలేకపోతే ఎల్లా అనే ప్రశ్న మిగిలే వుంటుంది. దానికి సరయిన జవాబు ఓటు రూపంలో సిద్ధంగా వుంటుంది. నిజానికి స్వతంత్రం వచ్చిన దాదిగా ఇన్నేళ్ళ కాలంలో మనదేశ  ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతోంది రాజకీయ పార్టీలు కాదు, కేవలం ప్రజలే. ఆ భరోసా ఉన్నంతవరకు రాజకీయ పార్టీల హవా కేవలం మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకే.         
పొతే ఆంద్ర ప్రదేశ్ కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం, లేదా ప్రత్యెక ప్యాకేజీ ఇవ్వడం కేంద్రం చేతిలోని వ్యవహారం. ఇవ్వడం వల్ల అధ్బుతాలు జరక్క పోవచ్చు. కానీ ప్రత్యెక హోదా అనేది ఒక భావోద్వేగ అంశంగా మారితే జరిగే పరిణామాలు  వేరుగా వుంటాయి. తెలంగాణా విషయంలో జరిగింది అదే. లక్షల కోట్ల ప్యాకేజీలు కూడా త్రాసులో వేసి తూస్తే తెలంగాణా అనే భావోద్వేగపు తులసి దళం పడగానే తేలిపోయాయి. ఇలాటి వాస్తవాలను రాజకీయ పార్టీలు అహరహం గుర్తుంచుకోవాలి.
అదీ వాటి బాగు కోసం కాదు, ప్రజల బాగోగుల కోసం. (26-08-2015)

రచయిత ఈ మెయిల్ :  bhandarusr@gmail.com   మొబైల్: 98491 30595                     

25, ఆగస్టు 2015, మంగళవారం

జీవితం


ఒకరై
ఒకరిద్దరై
ఇద్దరొకరై
ఒకరికొకరై
ఒకరు తోడై
ఒకరు నీడై
దరి ఎండమావై  
చివరికి ఎవరికివారై
తిరిగి ఒంటరై
బతుకు చిందరై

ఇదేనా జీవితం!  

24, ఆగస్టు 2015, సోమవారం

కరెంటు కష్టాలు


డిగ్రీ మొదటి సంవత్సరం చదివే నాటికి మా వూళ్ళో కరెంటు లేదు. కిరోసిన్ దీపాలతోనే  కాలక్షేపం. పిల్లలకు అన్నాలూ అవీ పెట్టడం సాయంత్రం కనుచూపు వెలుతురు ఉండగానే పూర్తిచేసేవాళ్ళు. వూరికి కరెంటు వచ్చిందన్న సంతోషం మొదట్లో వుండేది. వసారాలో స్విచ్చి వేయగానే దొడ్లో  బల్బు వెలగడం అంతా ఆశ్చర్యంగా చూసేవాళ్ళు.  అయితే కరెంటు లేని ఆ రోజులే బాగుండేవని ఇప్పుడు అనిపిస్తోంది. కరెంటు పోయిందనీ, మళ్ళీ వచ్చిందనీ గోల వుండేది కాదు. కరెంటు కాలం వచ్చాక ఈ ఇబ్బందులులన్నీ మొదలయ్యాయి. ఎప్పటికప్పుడు సర్కారు వాళ్ళు  వచ్చే ఏడాది కల్లా కరెంటు మిగులు అంటూ చేసే ప్రకటనలు చదవడం, సంతోషించడం ఇలా జరిగిపోతూవచ్చింది కానీ కరెంటులో మిగులన్నది ఎప్పటికీ తీరని కల లాగానే  మిగిలిపోతూ వచ్చింది. గత నలభయ్యేళ్ళకు పైగా హైదరాబాదులో ఉంటున్న మాకు కరెంటు కష్టాలు సేతమ్మ కష్టాలు మాదిరిగా అలవాటయి పోయాయి. ఇప్పుడు పరిస్తితి ఏమైనా మారిందా అనవచ్చు. మారిందని పూర్తిగా చెప్పలేను కానీ కరెంటు అధికారుల ప్రవర్తనలో కొంత మార్పు కనిపిస్తోందని మాత్రం అనుభవపూర్వకంగా చెప్పగలను. ఒక విలేకరిగా నాపట్ల వాళ్ళు ఇలా అభిమానం చూపుతున్నారని అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు అనడానికి ఇవ్వాల్టి నా అనుభవమే సాక్ష్యం.

మూడు వారాల సెలవుపై హైదరాబాదు వచ్చిన మా పెద్ద కుమారుడు, కోడలు, మనుమరాళ్ళు ఈ రాత్రి తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నారు. ఎనిమిది పెద్ద పెద్ద సూటుకేసుల్లో సామాను సర్దుతుంటే కరెంటు పోయింది. ఎప్పుడు వస్తుందో తెలవదు. ఏమి చెయ్యాలో తెలవదు. మేముండేది మా ఫ్లాటులో ఆఖరి అంతస్తులో. లిఫ్ట్ లేకుండా అన్ని సూటుకేసులు కిందకి తీసుకురావడం ఒక సమస్య. టెలిఫోను డైరెక్టరీ తీసి మా ఏరియా కరెంటు ఆఫీసరు  నెంబరు సంపాదించి ‘మా ఇంట్లో కరెంటు పోయింది, ఏమైనా సాయం చేయగలరా’ అని అభ్యర్ధిస్తూ ఇంగ్లీష్ లో ఒక ఎస్ ఎం ఎస్ పంపాను. అందులో నా నెంబరు తప్ప పేరు అదీ రాయలేదు.  అయిదు నిమిషాల్లో మౌలాలీ అనే అతను ఫోను చేసి ఇంటి వివరాలు వాకబు చేశాడు. మరో అయిదు నిమిషాల్లో అతను మా ఇంటి ముందు వున్నాడు. ఏం మంత్రం వేశాడో తెలియదు వాడ మొత్తానికీ కరెంటు వచ్చింది. బరువయిన సూటుకేసులు మెట్ల మీదుగా కిందకు దింపే భారం మాకు  తప్పింది.

అందరికీ ఇలాటి సేవలు అందుతున్నాయా అంటే ఆ విషయం తెలవదు. కాకతాళీయంగా జరిగినా నాకు మాత్రం ఎంతో తృప్తి అనిపించింది. నేనెవరో తెలియకుండానే రాత్రి వేళ వచ్చి సాయపడ్డ కరెంటు సిబ్బందికి వేల వేల కృతజ్ఞతలు చెప్పాలని అనిపించింది.  అమెరికా నుంచి వచ్చిన మా వాడు మాత్రం దీన్ని తేలిగ్గా తీసుకున్నాడు. అది వాళ్ళ డ్యూటీ అన్నట్టు మాట్లాడాడు. మనకిలా అలవాటయిపోయింది. డ్యూటీ చేసినా సాయం చేసారని అనుకోవడం’ అంటూ.  నిజమే అది వాళ్ళ డ్యూటీ. కానీ ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తుంటే ఇలా రాసుకోవాల్సిన పనేముంటుంది. మావాడు చెప్పింది కరెక్టే కావచ్చు. కానీ మన దగ్గర ఇలా జరగడం మనకు కొత్తే. ఆ సమయంలో సాయం చేసినట్టే అనిపించింది. ఎందుకంటె ఈ దేశంలో పుట్టి పెరుగుతున్నాము కాబట్టి. (24-08-2015)                

23, ఆగస్టు 2015, ఆదివారం

నవ్వాలని రూలేమీ లేదు


తరాల మధ్య అంతరం
తండ్రి ఇరవై రూపాయలు ఆదా చేయడానికి అయిదు కిలోమీటర్లు నడిచి వెడతాడు. అతడి కుమారుడు అయిదు కిలోమీటర్లు నడిచి వెళ్ళే సమయం అదా చేయడానికి ఇరవై రూపాయలు ఖర్చు చేస్తాడు. తండ్రి హయాములో ఆయన చేసింది రైటు. కొడుకు తరంలో అతడు చేసింది రైటు. తరం మారిందని గుర్తించేవారిది మరీ మరీ రైటు.
ఎవరు?
ఏకాంబరం లైబ్రేరియన్ ని అడిగాడు, ‘ఆత్మహత్య చేసుకోవడం ఎలా?’ అనే పుస్తకం ఉందా అని.
అతగాడు ఏకాంబరాన్ని ఎగాదిగా చూస్తూ అన్నాడు.
‘వుంది సరే కానీ పుస్తకాన్ని వాపసు ఇచ్చేది ఎవరు?’
నువ్వే దాక్కో
‘ఒరేయ్ బుడుగూ ఇవ్వాళ నువ్వు స్కూలు ఎగ్గొట్టావట! మీ టీచరు నిన్ను వెతుక్కుంటూ మన ఇంటికి వస్తున్నాడు. చప్పున ఎక్కడయినా దాక్కో!’
‘నువ్వే దాక్కో తాతా ! ఎందుకంటె నువ్వు చనిపోయావని స్కూల్లో చెప్పాను’
పనికిరాని ప్రెజెంటు
సీగాన పెసూనాంబ : ఒర్రేయ్ బుడుగూ! మొన్న పక్కింటి బామ్మ గారి పుట్టిన రోజుకు ఫుట్ బాల్ ప్రెజెంటు  చేశావట! ఇదేమైనా బాగుందా!
బుడుగు: ‘ఎందుకు బాగుండదు. నిరుడు నా హ్యాపీ బర్త్ డే అని దణ్ణం పెడితే ఓ భగవద్గీత పుస్తకం నా చేతిలో పెట్టింది. అదేమన్నా బాగుందా నువ్వే చెప్పు’  


(ఇంగ్లీష్ జోకులకు చేతయిన రీతిలో  స్వేచ్చానువాదాలు)        

22, ఆగస్టు 2015, శనివారం

ప్రైవేటు స్కూళ్ళు – సర్కారీ బళ్ళు

(Published in 'SURYA' telugu daily on 23-08-2015, SUNDAY)

పతాక శీర్షికలకు ఎక్కే సంచలన వార్తలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఏనాడూ కొదవ లేదు. కారణం తెలియదు కాని ప్రజానీకానికి సంబంధించి, అదీ సర్కారు స్కూళ్ళకు సంబంధించి అలహాబాదు హైకోర్టు గత మంగళ వారం వెలువరించిన ఒక తీర్పు తెలుగు పాఠకులకు చేరాల్సిన విధంగా చేరలేదేమో అనిపిస్తోంది. సర్కారు పాఠశాలల దుస్తితి గురించి తెలుగు పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా కధనాలు వెలువడుతున్న సమయంలోనే ఈ తీర్పు రావడం కాకతాళీయం  కూడా కావచ్చు.
ప్రజల నుంచి పన్నుల  రూపంలో వసూలు చేసే ధనం నుంచి,  నెల నెలా జీతాలు తీసుకుంటున్న వాళ్ళెవ్వరయినా సరే  వాళ్ళు  తమ పిల్లల్ని సర్కారు బడుల్లోనే చేర్పించి తీరాలన్నది  అలహాబాదు హైకోర్టు తీర్పు సారాంశం. అంటే ఎన్నికయిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, చివరాఖరికి న్యాయ స్థానాల్లో పనిచేసే సిబ్బందితో సహా అందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళల్లోనే చదివించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని  ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం వల్ల ఆ విద్యా సంస్థల స్తితిగతులు మెరుగుపడవచ్చన్నది ఈ తీర్పు వెలువరించిన న్యాయమూర్తి ఉద్దేశ్యం. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో, మాధ్యమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఎంపికలో అనుసరిస్తున్న విధానాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వు జారీ చేసింది. ఎక్కడో కొడితే మరెక్కడో తగిలినట్టు కోర్టు గడప తొక్కిన కారణం ఏదైనా, న్యాయమూర్తి  మాత్రం సర్కారు బళ్ళకు ప్రాణం పోసే సంజీవని మూలిక లాంటి తీర్పు ఇచ్చిన మాట వాస్తవం. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వుందనీ,  మొత్తం మీద లెక్కలు తీస్తే దాదాపు మూడు లక్షల మంది టీచర్లు తక్కువగా వున్నారనీ ఈ విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చిన వివరాలు.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్తితి కొంత భిన్నం. టీచర్లకు ఎంతో కొంత కొరత వుండి వుండవచ్చు కానీ ప్రభుత్వ బడుల్లో పిల్లల్ని చేర్పించే తలితండ్రుల సంఖ్య మాత్రం నానాటికి తీసికట్టు అన్న సామెత చందంగా తగ్గిపోతూవస్తోంది.  ‘చదువొక్కటే పిల్లలకు తామిచ్చే ఆస్తి’ అన్న స్పృహ వారిలో పెరగడం వల్ల కావచ్చు, లేదా చదువుకోక పోవడం వల్లనే తామిలా కూలీ నాలీ చేసుకుంటూ బతకాల్సివస్తోందని, ఈ దుస్తితి తమ పిల్లలకు పట్టకూడదన్న ముందు చూపు కావచ్చు  బీదా బిక్కీ కూడా తమ పిల్లల్ని సర్కారు బళ్ళకు కాకుండా కాస్త డబ్బు ఖర్చుతో కూడిన వ్యవహారం అయినా, కాన్వెంటు స్కూళ్ళకు పంపాలనే ధ్యాస పెంచుకుంటున్నారు. సరే! ఇక కలిగిన వాళ్ళు సరేసరి. వారు చూస్తూ చూస్తూ ఎటువంటి పరిస్తితిలో ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించరు. ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేసే టీచర్లు కూడా తమ పిల్లల్ని ఆ సూళ్ళల్లో చదివించడానికి ఇష్టపడరు. ప్రజల్లో వస్తున్న ఈ మార్పుతో, అసలే  చిన్నచూపుతో కునారిల్లుతున్న సర్కారు బళ్ళు,   చదివించే టీచర్లు వున్నా చదువుకునే విద్యార్ధులు లేక క్రమంగా తమ  అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. నెలకు రెండువందల నుంచి రెండు లక్షల రూపాయల దాకా వసూలు చేసే ప్రైవేటు పాఠశాలలు దేశంలో లెక్కకు మిక్కిలి వెలుస్తున్నాయంటే, విద్య అనేది ఏ స్థాయిలో అంగడి సరుకుగా మారిపోయిందన్న నగ్న సత్యం ఇట్టే బోధపడుతుంది.
అలా అని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా పూజ్యం అనుకోవడానికి కూడా వీల్లేదు. ఇప్పటికీ పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మంచి  ఫలితాలు సాధిస్తున్న గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్ళు,  కేంద్రీయ విద్యాలయాలు ఎన్నో వున్నాయి. అయినా ప్రభుత్వ బళ్ళు అనగానే ప్రజల్లో ఒకరకమైన చిన్నచూపు నానాటికీ పెద్దది అవుతోంది కాని తగ్గడం లేదు.
విద్యారంగం పూర్తిగా వాణిజ్య పోకడలు సంతరించుకుంటోంది కాబట్టి అలహాబాదు హైకోర్టు తీర్పు అమలు అవుతుందన్న ఆశలు పెట్టుకోనక్కర లేదు. ఎందుకంటె దాన్ని పై కోర్టులో సవాలు చేయడానికి విద్యా సంస్థల వాళ్ళు ఎలాగు సిద్ధంగానే వుంటారు. కాకపొతే ఆ తీర్పు సర్కారు బళ్ళకు పూర్వ వైభవం కోరుకునే వారిలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే విద్యాసంస్థల దుస్తితికి కూడా  ఆ తీర్పు అద్దం పడుతోంది. ‘ఎందుకు సర్కారు బళ్ళు ఇలాటి దుస్తితిని ఎదుర్కుంటున్నాయి’ అన్న ప్రశ్నను మనముందు వుంచుతోంది. ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటున్న ప్రతి ఒక్క ఉద్యోగి తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపితీరాలన్న నిబంధన విధించడం ద్వారా ఆ న్యాయమూర్తి, ఈ ప్రశ్నకు సరయిన జవాబు కూడా ఇచ్చినట్టయింది. ‘సర్కారు పాఠశాలలు సరిగా నడవడం లేదు. ఎందుకంటె వాటిని నడుపుతున్నది ఎవరి పిల్లలకోసమో కాని,  తమ పిల్లలకోసం అయితే కాదు’ అన్నదే ఆ సమాధానం.
పవిత్రమైన విద్యాబోధనను డబ్బు సంపాదనకు అతి  సులభ మార్గంగా ఎంచుకున్న మార్కెట్ శక్తులు ఈ తీర్పు అమలుకాకుండా తాత్కాలికంగా అడ్డుకోవచ్చు. కానీ, అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తి తీర్పులోని స్పూర్తిని అంత సులభంగా ప్రజల మనసుల్లో నుంచి తొలగించడం సాధ్యం కాకపోవచ్చు. నేటి బాలలే రేపటి పౌరులని మనందరం ఘనంగా చెప్పుకునే ఈనాటి బాలబాలికల చదువుసంధ్యల పట్ల పాలకులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు అనుసరిస్తున్న దుర్మార్గపు  విధానాలను ఈనాడు కాకున్నా ఏదోఒక రోజు ప్రజలు ఎండగట్టే రోజు రాకమానదు. (22-08-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 9849130595

21, ఆగస్టు 2015, శుక్రవారం

చంద్రబాబుతో అభిమాని



ఈ ఫోటోలో కనిపిస్తున్న  వ్యక్తి ఎవరన్నది చిన్న పిల్లవాడు కూడా చెబుతాడు ‘ఈ మాత్రం తెలియదా ఆయన చంద్రబాబునాయుడు నాయుడు’ అని. ఇక రెండో ఆయన పేరు భక్తి భూషణ్ శ్రీవాస్తవ. పేరును బట్టే చెప్పేయొచ్చు ఆయనగారిది ఈ ఊరూ కాదు, మన భాషా కాదని. చాలా ఏళ్ళక్రితం శ్రీవాస్తవ గారు హైదరాబాదు వచ్చారు. అలా బయట నుంచి వచ్చేవాళ్ళు సాధారణంగా చార్మినార్ దగ్గరో, గోల్కొండ కోట దగ్గరో ఫోటోలు దిగాలని కోరుకుంటారు. కానీ శ్రీ వాస్తవ గారికి ఒక్కటే కోరిక. అది చంద్రబాబుతో ఒక ఫోటో దిగాలని. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు రెండో పర్యాయం కూడా ఎన్నికల్లో ఓడిపోయి, అధికారానికి మళ్ళీ దూరం అయి ప్రతిపక్ష నాయకుడి హోదాలో కొనసాగుతున్నారు. నేను అప్పటికి ‘మాజీ’ ని కాలేదు కాబట్టి మాజీ ముఖ్యమంత్రిని కలిపించడం ఆయనతో ఫోటో తీయించడం నాకంత కష్టం కాలేదు. శ్రీవాస్తవ గారు ఎంతో ఇష్టపడి తీయించుకున్న ఆ ఫోటోని తనవెంట తన వూరికి తీసుకువెళ్ళారు. ఇంతవరకు షరా మామూలు కధే. ఇది జరిగి కూడా అయిదారేళ్ళు అవుతుందేమో. గత వారం నేను శ్రీవాస్తవ గారి వూరు రాంచీ వెళ్లాను. చిత్రంగా ఆయన డ్రాయింగు రూములో ఈ ఫోటో కనిపించింది. బాబు గారిపై ఆయన అభిమానం అధికారాన్ని బట్టి, అవసరాన్ని బట్టి పెంచుకుంది కాదు కాబట్టి ఆయన ఆ ఫోటోను అంత భద్రంగా దాచుకున్నారని అనిపించింది.
దేశ విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో బాబుగారి అభిమానులకి కొదవ లేదు. ఎన్నారైలకి ఓటు హక్కు ఇస్తే ఆంద్ర ప్రదేశ్ కి ఆయనే శాస్విత ముఖ్యమంత్రి అని ఆరోజుల్లో చెప్పుకునేవారు కూడా.

మరి ఆంద్ర ప్రదేశ్ లో కూడా ఈ మాదిరి అభిమానులు ఆయనకు అలా వున్నారా అంటే లేరని చెప్పలేము కానీ వున్నారని కూడా గట్టిగా అనలేని పరిస్తితి. దీన్ని మార్చుకోవడం ఆయన ఒక్కరి చేతుల్లోనే వుంది.