11, ఏప్రిల్ 2015, శనివారం

తేడా!



ఏకాంబరం భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇల్లు సర్దుతుంటే భార్య స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఇచ్చిన ప్రోగ్రెస్ కార్డు కనబడింది. అది చూసి ఏకాంబరం మూర్చపోయాడు. కారణం భార్యకు వచ్చిన గొప్ప మార్కులు కాదు. ఆమె గురించి స్కూలు హెడ్ మాస్టర్ రాసిన రెండు వాక్యాలు: "చాలా మంచి అమ్మాయి. మృదుభాషి" 

సంపన్నులు, సబ్సిడీలు

  
(Published in 'SURYA' telugu daily in it's edit page on 12-04-2015, SUNDAY)

ఇప్పుడు దేశంలో ఒక విప్లవాత్మకమైన పరిణామం నిశ్శబ్దంగా చోటుచేసుకుంటోంది.


సంపన్నులు గ్యాస్ సబ్సిడీని  స్వచ్చందంగా ఒదులుకోవాలని ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన పిలుపుకు చక్కటి స్పందన కనబడుతోంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఈ సబ్సిడీని ఒదులుకోవాలంటూ తమ ఉద్యోగులకు విజ్ఞప్తి చేసాయి. ఉదాహరణకు టాటా గ్రూపుకు  దేశవిదేశాల్లో దాదాపు వంద కంపెనీలు వున్నాయి. వీటిల్లో అయిదు లక్షల ఎనభయ్ వేల పైచిలుకు సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలో అత్యధిక శాతం మన దేశంలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. టాటా గ్రూపులో ఉద్యోగి ఎవరయినా సరే, గ్యాస్ సబ్సిడీని నిక్షేపంగా త్యాగం చేయగల జీత భత్యాలు సంపాదిస్తుంటారనేది నిర్వివాదాంశం. యాజమాన్యం పిలుకు స్పందించి వారిలో అత్యధికులు సబ్సిడీ ఒదులుకుంటే ప్రభుత్వానికి ఒనగూడే ప్రయోజనం కూడా అదే  స్థాయిలో వుంటుంది. ఈ ప్రయోజనాన్ని  త్యాగం చేయాలని కోరుకునే వారి సౌలభ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 'గివ్ ఇట్ అప్' (www.giveitup.in)  అనే పేరుతొ ఒక పోర్టల్ రూపొందించింది. సంపన్నులయినవారు మాత్రమే కాకుండా స్వచ్చందంగా ఈ సబ్సిడీని ఒదులుకోవడానికి ముందుకు వచ్చేవారు కూడా  ఇందులో తమ వివరాలు నమోదు చేసుకుని ఈ  బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు. ఇంతవరకు ఈ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకున్నవారి సంఖ్య మూడు లక్షలు దాటిపోయింది కూడా. ప్తభుత్వరంగ పెట్రోలియం కంపెనీల్లో పనిచేసే అధికారులందరూ సబ్సిడీ  ఒదులుకోవడానికి సంసిద్ధతత తెలిపారు. దేశంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వాడుకుంటున్న పదిహేను కోట్ల ముప్పయి లక్షల మంది వినియోగదారుల్లో కనీసం కోటి  మంది అయినా సబ్సిడీ ఒదులుకుంటారని ప్రభుత్వం పూర్తి విశ్వాసంతో వుంది.
ఒక్క టాటా కంపెనీ మాత్రమే కాదు ప్రధానమంత్రి పిలుపుకు  దిగ్గనాధీరులయిన అనేకమంది పారిశ్రామికవేత్తలు స్పందించారు. ఆనంద్ మహీంద్రా, అనిల్ అగర్వాల్, గౌతమ్ అదాని, సజ్జన్ జిందాల్, ఉదయ్  కోటక్ మొదలయిన వారు తమ సిబ్బందికి టాటా  కంపెనీ తరహాలోనే వ్యక్తిగత విజ్ఞప్తులు పంపారు.
ఫలితంగా ఇంతవరకు ఈ ఖాతాలో వందకోట్ల రూపాయల  వరకు ప్రభుత్వం మీద భారం తగ్గిపోయింది.  
సరే! ఇదంతా ఘనంగా చెప్పుకోవాల్సిన ముచ్చటే.
ఇదిలా వుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్యక్షుడు అమిత్ షా సయితం తమ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులకు కూడా ఇదేవిధమైన విజ్ఞప్తి చేశారు. స్పందన ఎలా వుందనే వివరాలు తెలియరాలేదు.
ఈ సందర్భంగా సామాన్యుల్లో కలిగే సందేహం ఒక్కటే. సబ్సిడీ ఒదులుకోమని పిలుపు ఇచ్చింది సాక్షాత్తు ప్రధానమంత్రి. ఏ త్యాగమైనా ఇంటి నుంచి మొదలు కావాలంటారు.
దాన్ని ముందు పార్లమెంటు నుంచి మొదలుపెట్టాలి. పార్లమెంటు సభ్యులకు, మంత్రులకు వచ్చే జీతభత్యాల విషయం రహస్యమేమీ కాదు. 'దేశం మొత్తంలో అత్యంత చౌక ధరలకు అత్యంత నాణ్యమైన ఆహార పదార్ధాలు ఎక్కడ దొరుకుతాయి అంటే పార్లమెంటు క్యాంటీనులో మాత్రమె'   అని జవాబు వచ్చేలా అనేక కధనాలు నెట్లో నిత్యం సంచారం చేస్తున్నాయి. ఆ  క్యాంటీనులో  వాడుతున్న గ్యాస్ సిలిండర్లు సబ్సిడీవే అయినప్పుడు ఇతరులను సబ్సిడీ ఒదులుకోమని చెప్పడం అసంగతం అవుతుంది. ఒకవేళ సబ్సిడీ లేని సిలిండర్లు అయితే ఆవిషయానికి విస్తృత ప్రచారం కల్పించి వుంటే బాగుండేది.
అదీ కాక సబ్సిడీ భారంగా పరిణమిస్తోంది అని ప్రభుత్వం అనుకుంటున్నప్పుడు ఈ రకమైన విజ్ఞప్తులు, పిలుపుల పద్ధతికి స్వస్తి పలకాలి. దేశంలో సంపన్నుల జాబితా ప్రభుత్వం వద్దనే సిద్ధంగా వుంటుంది. 'పలానా తేదీ నుంచి అలాటివారందరికీ సబ్సిడీ ఎత్తి వేస్తున్నాం' అని ఒక ప్రకటన చేస్తే సరిపోయేది. గ్యాస్ సిలిందర్లపై ప్రభుత్వం నుంచి పొందుతున్న సబ్సిడీ మొత్తానికి కనీసం కొన్ని వందల రెట్లు తమ కుక్క పిల్లల ఆలనాపాలనాపై ఖర్చు పెట్టగలిగిన ఖామందుల సంఖ్య మన దేశంలో తక్కువేమీ కాదు. దుష్టాంగాన్ని తొలగించి శిష్టాంగాన్ని కాపాడమన్నట్టుగా అనర్హులయిన వారిని సబ్సిడీ జాబితా నుంచి తొలగించి అవసరమైన పక్షంలో సబ్సిడీ మొత్తాన్ని  మరింత పెంచి అర్హులైన పేదలకు అందిచగలిగితే అది నిజమైన సంక్షేమ ప్రభుత్వం అనిపించుకుంటుంది.     
అభివృద్ధి చెందుతున్న  దేశాల్లో సబ్సిడీలు తప్పనిసరి. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ విధానం అమల్లో వుంది. ఎందుకంటె పెరిగే సంపద సక్రమంగా అన్ని చోట్లా సమానంగా పెరగదు. సంపన్నత పెరిగే కొద్దీ సమాజంలో అసమానతలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తాయి. వృద్ధాప్యం, అనారోగ్యం మొదలయిన అంశాలు వ్యక్తిగత ఆదాయాలపై ప్రభావం చూపుతాయి. అంచేతే సిరి సంపదలు పుష్కలంగా వున్న దేశాల్లో కూడా ఆహార సబ్సిడీలు, ఆరోగ్య సబ్సిడీలు  ఘనంగానే ఉంటున్నాయి. కాకపోతే సబ్సిడీల విషయంలో ఆయా  దేశాల ప్రజలు స్వచ్చందంగా  పాటించే కొన్ని నియమ నిబద్ధతతల కారణంగా అవి దుర్వినియోగం కావడం లేదు. సంపన్నులయినవాళ్ళు సబ్సిడీలకోసం ఆరాటపడని మంచి  సమాజాలను వారు సృష్టించుకున్నారు. మన దేశంలో అలాటి ప్రయత్నం మొదటి నుంచీ  జరగలేదనే చెప్పాలి. సబ్సిడీల భారం అపరిమితంగా పెరిగిపోవడానికి దోహదం చేసిన అనేక కారణాల్లో ఇదొకటి. సబ్సిడీ బియ్యం నుంచి  ఆరోగ్యశ్రీ కార్డు వరకు ఇదే తంతు.
స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ ప్రతిదానికీ ప్రభుత్వం మీద ఆధారపడే మనస్తత్వం పెరిగిపోతూ వచ్చింది. అంతా ఉచితంగా లభించాలనే భావన అందులోనుంచే పుట్టుకు వచ్చింది. అనేకానేక కారణాలతో ప్రభుత్వాలు కూడా ఈ ధోరణి పెరగడానికి తమ వంతు సాయం చేస్తూ వచ్చాయి. ఫలితం కొండలా పెరిగిపోతున్న సబ్సిడీల భారం. జీవితంలో ప్రతిదాన్నీ ఉచితంగానో, లేదా చాలా చౌకగానో పౌరులకు సమకూర్చిపెట్టిన సోవియట్ యూనియన్ లో ఏం జరిగిందో  గుర్తు పెట్టుకోవాలి. ఉత్పత్తి ఖర్చుకు మించి తక్కువ ధరకు సరఫరా చేయడం ఎల్లకాలమూ సాధ్యం కాదన్న సత్యాన్ని సోవియట్  అనుభవం గుర్తు చేస్తోంది.
మరో విచిత్రం అయిన విషయం ఏమిటంటే, ఉత్పత్తి ఖర్చుకంటే అనేక వందల రెట్లు అమ్మకం ధర వుండే వస్తు  సామాగ్రి కొనడానికి పరుగులు తీసే వారే సబ్సిడీ ధరలకు ప్రభుత్వం అన్నీ సరఫరా చేయాలని పట్టుబడుతుంటారు. సబ్సిడీ తగ్గించినప్పుడల్లా గోల  చేస్తుంటారు.
ప్రభుత్వ వ్యవస్థను గాడిన పెట్టడానికి కొన్ని  కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పుకాదు. అయితే అటువంటి నిర్ణయాల అమలు ప్రభుత్వాధినేతల నుంచే మొదలు కావాలి. పొదుపు చేయండని పిలుపు ఇచ్చేవాళ్ళు దాన్ని ఆడంబరంగా చేయకూడదు. సబ్సిడీ ఒదులుకోవాలని  పిలుపు ఇచ్చిన ప్రధాని మోడీ గారింట్లో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వాడడం లేదు అనే విషయం  తెలుసుకోగోరేవారుంటే అలాటి వారిని అనుమానంగా చూడాల్సిన అవసరం లేదు. పైగా అలాటి అనుమానాలను నివృత్తి చేయగలిగితే మరింత బాగుంటుంది.
గతంలో లాల్ బహదూర్ శాస్త్రి  ప్రధాన మంత్రిగా వున్నప్పుడు దేశంలో ఏర్పడ్డ తిండిగింజల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ ప్రతి సోమవారం ఒక పొద్దు మాత్రమే భోజనం చేయాలని ఇచ్చిన పిలుపుకు అపూర్వ స్పందన లభించింది. ఎందుకంటె ఆయన ఆ నియమాన్ని అయన  బతికున్నంతవరకు పాటించారు. ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి స్వల్పకాలమే మనగలగడం మన  జాతి చేసుకున్న దురదృష్టం.        
అధికారం ప్రదర్శించాల్సిన  తరుణం వచ్చినప్పుడు దృఢచిత్తంతో వ్యవహరించండి. అయితే అధికారం ఉందికదా అని అహంకారం చూపకండి. చేతిలో వున్న అధికారాన్ని సౌమ్యంగా, సాధ్యమైనంత మృదువుగా వాడండి. అదెలా వుండాలంటే,  మనస్సు ఏమాత్రం నొచ్చుకునేలా  వుండకూడదు. పువ్వు నుంచి భ్రమరం తేనె తాగుతున్నంత  సుకుమారంగా  వుండాలి.  
ఏ ప్రభుత్వానికయినా విజ్ఞులు ఇచ్చే సలహా ఇదే !

(రచయితే మొబైల్ నెంబరు : 98491 30595  మెయిల్: bhandarusr@gmail.com)

10, ఏప్రిల్ 2015, శుక్రవారం

కూర్చో! ఇప్పుడే వస్తా....!


తిరుపతయ్య గ్రామ రెవెన్యూ  అధికారి దగ్గరికి వెళ్ళాడు చిన్న పని మీద.
'ఇదిగో ఇప్పుడే వస్తా! ఎమ్మార్వో గారు వెంటనే రమ్మనమని ఫోను. గంటలో తిరిగొస్తా, ఇక్కడే కూర్చో' అంటూ వీఆర్వో  మోటారు సైకిల్ ఎక్కి తుర్రుమన్నాడు.  
వీఆర్వో ఆఘమేఘాల మీద వెళ్లేసరికి ఎమ్మార్వో  అతడికోసమే ఎదురుచూస్తున్నట్టు మొహం పెట్టి, వచ్చావా! మొన్న చెప్పాను చూడు...' అంటూ ఉండగానే ఆయన చేతిలో సెల్లు ఘల్లున మోగింది. కంగారుగా వింటూనే  అంతకంటే కంగారుగా 'ఇదిగో ఇప్పుడే  జేసీ గారు వున్నాఫలాన రమ్మంటున్నారు, మాట్లాడి ఇప్పుడే వస్తా కూచో' అంటూ అంతకంటే  కంగారుగా వెళ్ళిపోయాడు ఎమ్మార్వో జీపెక్కి.  జేసే గారి ఆఫీసుకు చేరి కనుక్కుంటే ఆయన పియ్యే చావు కబురు చల్లగా చెప్పాడు, 'మిమ్మల్ని రమ్మనమని ఫోను చేసారా, అలా రమ్మనమని కలెక్టరు దొరగారి ఫోను. పని చూసుకుని వస్తారు కూర్చోండి అన్నాడు జేసీ గారి పియ్యే తాపీగా.
అక్కడ జేసీ గారికి కలెక్టర్ ఆఫీసులో ఇదే సీను. 'మంత్రి గారు కబురు పెడితే వెళ్ళారు, వస్తారు కూర్చోండి అంటూ క్యాంప్ క్లర్కు మర్యాద.
కలెక్టర్ గారి  కారు మంత్రి గారి బంగ్లాలో ప్రవేశిస్తూ ఉండగానే గేటు దగ్గరే ఎదురొచ్చింది మంత్రి గారి వాహనం. 'ఇదేమిటి  రమ్మనమనిచెప్పి  ఎటూ వెడుతున్నట్టు' అని  అనుకుంటూ ఉండగానే సెల్లు మోగింది. అవతల మంత్రి గారు. 'చూడండి కలెక్టర్ గారు అర్జెంటు పనిమీద రమ్మన్నాను. కానీ ఈలోగా సీఎం గారి నుంచి కబురు వెంటనే రమ్మనమని. వెళ్లి వస్తా  కాసేపు వెయిట్ చేయండి, ఏమనుకోవద్దు'
మంత్రిగారు సీఎమ్ ఇంటికి వెళ్లేసరికి ఆయన ఢిల్లీ ఫోనులో వున్నారు. అది తెమిలేసరికి రాత్రి ఎనిమిదయింది. మంత్రిగారిని చూస్తూనే ఆయన అన్నారు 'అయ్యో ఇంతసేపు వెయిట్ చేస్తున్నారా. ఏదో చిన్న విషయం మాట్లాడదామనుకున్నాను. మళ్ళీ చూద్దాం లెండి' అన్నారు 'మళ్ళీ రండి' అన్న భావం కళ్ళల్లో ప్రదర్శిస్తూ.
అక్కడ వూళ్ళో వీఆర్వో గారింట్లో తిరుపతయ్య, ఎమ్మార్వో ఆఫీసులో వీఆర్వో, జేసీ కార్యాలయంలో ఎమ్మార్వో, కలెక్టర్  క్యాంప్ ఆఫీసులో జేసీ, మంత్రిగారింట్లో కలెక్టర్, ముఖ్యమంత్రి నివాసంలో మంత్రిగారు - అందరూ ఉదయం నుంచి సాయంత్రం దాకా గడ్డాలు, మీసాలు పెంచుకుంటూ ఎదురుచూపులు.


ఏదో బట్టల సబ్బు ప్రకటనలో మాదిరిగా ఇది 'ఆఖరిసారి' కాదు, మళ్ళీ మళ్ళీ జరిగే తంతే!

NOTE: Courtesy Image Owner 

8, ఏప్రిల్ 2015, బుధవారం

పేలుతున్న తుపాకులు - పోతున్న ప్రాణాలు

(Published by 'SURYA' telugu daily in it's edit page on 09-04-2015, THURSDAY)

గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో తుపాకులు టపటపా పేలుతున్నాయి. నిండు ప్రాణాలు గాలిలో కలిసి  పోతున్నాయి. సిమి ఉగ్రవాదులు జరిపిన కాల్పులు  నలుగురు  పోలీసు అధికారులను  బలితీసుకోగా,  ఇద్దరు ఉగ్రవాదులు పోలీసుల ఎదురు  కాల్పుల్లో నేలకొరిగారు. ఈ సంఘటనలో పోలీసులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు బహుధా ప్రసంశనీయం. శిక్షణ పొందిన కరడుగట్టిన ఉగ్రవాదులతో వారు తలపడ్డ విధానం  అపూర్వం. వారి బలిదానాలను  ప్రజలు కలకాలం గుర్తుపెట్టుకుంటారు.  ఈ సంఘటనలతో రేకెత్తిన  సంచలనం సద్దుమణక్క ముందే వరంగల్ జిల్లా కేంద్ర కారాగారం నుంచి  విచారణ నిమిత్తం హైదరాబాదు తరలిస్తున్న ఆరుగురు ఉగ్రవాద నేరస్తులు  పోలీసులమీద దాడి జరిపి  తప్పించుకునేందుకు విఫల ప్రయత్నం చేసి  పోలీసులుల చేతుల్లోనే  కన్నుమూసారు. ఈ అంశంపై మీడియాలో చర్చలు సాగుతుండగానే మరో కాల్పుల సంఘటన చోటుచేసుకుంది. ఆంద్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం చెట్లు నరికి అక్రమంగా తరలిస్తున్న రెండు ముఠాలపై  పోలీసులు కాల్పులు జరపడంతో ఏకంగా ఇరవై మంది కూలీలు అక్కడికక్కడే మరణించారు.
దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైన ఈ సంఘటనలు కొన్ని ప్రశ్నల్ని, మరికొన్ని అనుమానాలని జనం ముందు వుంచుతున్నాయి.

సాధారణంగా ఇటువంటి సంఘటనలను  'ఎన్ కౌంటర్లు' అని పిలుస్తుంటారు. ఈ పదానికి దగ్గరి  అనువాదం 'ఎదురు కాల్పులు'. అంటే ఏమిటి? ఎవరయినా కాల్పులు జరిపితే ప్రతిగా ఎదురు కాల్పులు జరపడం అన్నమాట. సూర్యాపేట, జానకీపురం సంఘటనలను  ఎన్ కౌంటర్లుగా భావించడానికి ఆస్కారం వుంది. మిగిలిన రెండు సంఘటనలు జరిగిన తీరు వేరే విధంగా వుంది. ఇరవై ఆరుమంది ప్రాణాలు కోల్పోయిన ఈ రెండు సందర్భాలలోనూ రక్షక సిబ్బంది 'ఆత్మరక్షణ' కోసమే కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇస్తున్నారు. ఎన్ కౌంటర్ అనే పదం వీటికి వర్తించదు. ఎందుకంటె కాల్పులే తప్ప ప్రతికాల్పులు లేవు. ఉభయ పక్షాల్లో ఆయుధాలు వున్నది పోలీసుల దగ్గరే. అందువల్లే 'ఆత్మరక్షణ' పల్లవి ఎత్తుకున్నారు. ఇది మరీ విడ్డూరంగా వుంది. వరంగల్ జిల్లా ఆలేరు  సంఘటనలో మరణించిన ఆరుగురు ఉగ్రవాదుల చేతులకు బేడీలు తప్ప వారి చేతుల్లో ఆయుధాలు లేవు. తమ మీద దాడిచేసి, తమ ఆయుధాలను లాక్కుని తమపైనే ప్రయోగించాలని చూసారనీ, అంచేతే 'ఆత్మ రక్షణ'కోసం కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. ఈ కారణం యెంత మాత్రం హేతుబద్ధంగా లేదు. పైగా తమ అసమర్ధతని తామే బయట పెట్టుకుంటున్నట్టుగా వుంది. ఏదో ఒక హేతువు చూపాలి కాబట్టి ఒక కారణం చెప్పినట్టు వుంది. అంతేకాని సందర్భానికి అతికే విధంగా ఎంతమాత్రం లేదు. అలాగే శేషాచలం అడవుల్లో జరిగిన సంఘటనలు. ఈ సందర్భంగా కూడా పోలీసులు మళ్ళీ 'ఆత్మరక్షణ' సాకునే ఎంచుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లర చేత నియోగించబడిన 'కూలీలు' తమపై రాళ్ళతో దాడి జరిపారని, ప్రాణాలు కాపాడుకునేందుకు కాల్పులు జరిపామని షరా మామూలు వివరణే ఇచ్చారు. అయితే మీడియాలో కానవచ్చిన దృశ్యాలు ఈ వాదనకు యెంత మాత్రం బలం ఇచ్చేవిగా కనబడడం లేదు.


ఉగ్రవాదులను మట్టుబెట్టడం, స్మగ్లర్ల ఆట కట్టించడం తప్పని ఎవ్వరూ అనరు. కానీ అందుకు ఎంచుకున్న విధానమే ప్రశ్నార్ధకమవుతోంది. ప్రతి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకునే పోలీసు యంత్రాంగం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు సమర్ధించుకోవడానికి ఇచ్చే ఈ విధమైన వివరణలే వారి చర్యల  విశ్వసనీయత పట్ల సందేహాలను పెంచుతున్నాయి. ఉదాహరణకు వరంగల్ సంఘటన తీసుకుంటే, కాలకృత్యం నెపంతో  సెక్యూరిటీ వాహనం దిగిన ఉగ్రవాదులు పారిపోవడానికి ప్రయత్నించారని, దాన్ని నిరోధించే క్రమంలో కాల్పులు జరిపామని చెప్పివుంటే మరో విధంగా వుండేదేమో. అలాగే శేషాచలం సంఘటన. ఆయుధాలు వున్నది పోలీసుల దగ్గర. కూలీలు దాడి చేసింది రాళ్ళతో. వాస్తవంగా ఆలోచిస్తే 'ఆత్మ రక్షణ' లో పడింది కూలీలా లేక పోలీసులా? ఇదంతా ఏదో హక్కుల సంఘాలు చెప్పినట్టు చెప్పడం కాదు. పోలీసులు చెప్పే వివరణ వాస్తవ ప్రాతిపదికపై వుండాలని మాత్రమే. పోలీసుల నిర్వాకంపై  హక్కుల సంఘాలకు ఎలాగూ అపనమ్మకమే. వారి వ్యవహారంపై  పోలీసుల విశ్వాసమూ అంతంత మాత్రమే. అయితే వీరిద్దరే కాదు. మధ్యలో జనం కూడా వున్నారు. హక్కుల పేరుతొ ఒకరూ, అధికారం పేరుతొ మరొకరూ వాదవివాదాలు పెంచుకుంటూ పోతుంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేది మధ్యలో సంఘ విద్రోహశక్తులే అనే విషయం మరవకూడదు.
వరంగల్ సంఘటనలో చనిపోయిన ప్రధాన ముద్దాయి వికారుద్దీన్ కు ఉగ్రవాద సంస్థలతో అనుబంధం మాట అటుంచి నేర ప్రవృత్తి కూడా వుంది. జానకీపురం సంఘటనలో మరణించిన ఉగ్రవాదులు శిక్షణ పొందినవారు. వారు తాము నమ్మిన సిద్ధాంతం -  అది మంచిదా, కాదా అనేదానితో నిమిత్తం లేకుండా ముందుకు  సాగుతున్నవారు. వికారుద్దీన్ వ్యవహారం కొంత భిన్నమైనది. ఉగ్రవాదం ముసుగులో దందాలు చేసి పబ్బంగడుపుకోవాలని చూడడం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతోంది. ఇటువంటివారివల్ల ప్రయోజనం పొందేవారు కూడా అధికంగానే వుంటారు. అందుకే వికారుద్దేన్ ఎన్ కౌంటర్ (?) రాజకీయ రంగు పులుముకుంటోంది.
ఉగ్రవాద భూతం యావత్ ప్రపంచాన్ని వొణికిస్తోంది. దీన్ని ఎదుర్కోవడానికి ఒంటరి ప్రయత్నాలు సరిపోవు. సంఘటిత కృషి అవసరం.
ఇక ఎర్ర చందనం స్మగ్లింగ్ సంగతి. కూలీల మరణం రాష్ట్ర సరిహద్దులు దాటి ప్రకంపనలు సృష్టిస్తోంది. సొంత రాష్ట్రం రాజకీయాలే కాదు, పొరుగు రాష్ట్రం రాజకీయాలు సయితం ఇందులో  జొరబడ్డాయి. ఇక అది ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.
కాకపోతే, సందర్భం ఎలాగు తటస్థ పడింది కాబట్టి ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని మరో కోణంలో చూడాలి. స్మగ్లర్లు, వారి సంపాదనలు, వారి రాజకీయాలు పక్కనబెట్టి, ఒక్క ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే హక్కుభుక్తంగా వున్న ఎర్ర చందనం సంపదను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న దిశగా ఆలోచించాలి. అక్రమ రవాణాను నిరోధించడానికి వృధా ప్రయత్నాలు చేసే బదులు ఆ సంపదను సక్రమ మార్గంలో ఎగుమతి చేయగలిగితే ఉభయతారకంగా వుంటుంది. ఎర్ర చందనం అక్రమ తరలింపుల వల్ల అనేకమంది కోట్లకు పడగలెత్తివుండవచ్చు. అలాటి వారిలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు లేరంటే నమ్మశక్యంగా వుండదు. కొందరు అధికారులు, నాయకుల ప్రమేయం లేకుండా కోట్లాది రూపాయల ఎర్ర చందనం దేశపు  ఎల్లలు దాటిపోవాలంటే, పోతున్నదంటే అది జేబులో పెట్టుకుని తీసుకువెళ్ళే బంగారం బిస్కెట్టు కాదు. ఎర్ర చందనం దుంగల్ని శేషాచలం అడవులనుంచి బయటి దేశాలకు తరలించాలంటే మధ్యలో అవరోధాలు, అవాంతరాల సంగతి అటుంచి ఎంతో మంది కూలీలు, మేస్త్రీలు, ఎన్నో వాహనాలు అవసరమవుతాయి. వీటన్నిటినీ మించి వాటిని అక్రమంగా తరలించేది పొరుగు ప్రదేశాలకు కాదు, ఓడల్లో విదేశాలకి. ఇన్ని దాటుకుని ఎర్ర చందనం జపాన్, చైనా వంటి దేశాలకు అలవోకగా చేరిపోతున్నదంటే, ఎన్ని చేతులు కలిస్తే ఇది సాధ్యం అవుతున్నదో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించాలి. చెట్లను నరికే కూలీలకు కూడా ఈ నేరంలో భాగస్వామ్యం వుంటుంది. నిజమే. కానీ, వారిని మట్టుబెట్టి భయపెట్టడం ఒక్కటే పరిష్కారం కాబోదు. స్మగ్లర్లు  చేస్తున్న వ్యాపారాన్ని ప్రభుత్వమే తన చేతుల్లోకి తీసుకోవాలి. అప్పుడే అన్ని ఆగడాలకు, అరాచకాలకు కళ్ళెం పడుతుంది.
ఎర్ర చందనం సమస్యకు కావాల్సింది తాత్కాలిక ఉపశమనం కాదు. శాశ్విత పరిష్కారం. (08-04-2015)

(రచయిత మొబైల్: 98491 30595 ఈ మయిల్:  bhandarusr@gmail.com)          

6, ఏప్రిల్ 2015, సోమవారం

సొరకాయ


'మీ ఇంట్లో కరెంటు ఉందా శంకరం?'
ముగ్గురు స్నేహితుల్ని కాన్ఫరెన్సు కాల్ లో పెట్టి అడిగాడు ఏకాంబరం.
'లేదు. పోయి రెండు గంటలు అవుతోంది' చెప్పాడు శంకరం.
' కామేశం మీ ఇంట్లో?'
'డిటో'
'మరి నీ సంగతి ప్రభాకరం'
'నేను మాత్రం సింగపూర్లో వున్నానా, హైదరాబాదులోనే కదా! అదే పరిస్తితి'
'అది సరే కానీ మీ ఇంట్లో కరెంటు ఉందా?'  ఏకాంబరాన్ని అడిగారు ముగ్గురూ ఒకేసారి.
'వుంది. కాకపొతే ఇన్వర్టర్ కరెంటు'
'అలాటప్పుడు ఈ ఆరాలన్నీ ఎందుకు?'



'ఎందుకా! అందుకే. ఇన్వర్టర్ కరెంటు వుంది. ఎదురుగా 'ఈనాడు' పేపరు  వుంది. అందులో   'వచ్చే  ఏడాది  కూడా విద్యుత్  కోతలుండవ్' అంటూ  ట్రాన్స్ కొ సీ.ఎం.డీ. ఇచ్చిన ఇంటర్వ్యూ తాటికాయంత అక్షరాల్లో కనబడుతూ వుంది. ఇప్పుడు అర్ధమయిందా నా బాధ'  చెప్పాడు ఏకాంబరం. (05-04-2015 , 9 PM)

నమ్మితే నమ్మండి


ఈ చిత్రంలో కనపడే బోన్సాయ్ (మరుగుజ్జు వృక్షం) వయస్సు కేవలం నాలుగు వందల సంవత్సరాలు మాత్రమే. ఇదొక్కటే దీని ప్రత్యేకత అనుకునేరు. 1945 లో అమెరికా, జపాన్ పై  ప్రయోగించిన అణుబాంబు సృష్టించిన భయానక విస్పోటాన్ని కూడా ఈ పొట్టి చెట్టు గట్టిగా తట్టుకుని నిలబడింది. ఈ జపాన్ మరుగుజ్జు వృక్షాన్ని చూడాలనుకునే వాళ్ళు వాషింగ్టన్ డీసీ లోని జాతీయ బోన్సాయ్ మ్యూజియం సందర్సించాలి. ఎందుకంటె దీన్ని అక్కడే భద్రపరచి పదిలంగా కాపాడుతున్నారు


.   
(Courtesy Shri PVVG Swami, USA)

బ్రహ్మాస్త్రం


అమ్మాయిలూ ఇలా చేసి చూడండి !

ఆ భవనంలో మీరు వెళ్ళాల్సింది ఆఖరు అంతస్తులోకి. బాగా పొద్దుపోయింది. లిఫ్ట్ లోకి మీతో పాటు  పరిచయం లేని ఓ మగవాడు కూడా  ఎక్కాడు. అతడి చూపులు, ప్రవర్తన మీకు అనుమానం కలిగించాయి.   అప్పుడు ఏం చెయ్యాలంటే, మీరు వెళ్ళాల్సిన అంతస్తు పన్నెండు అనుకోండి. పన్నెండు లిఫ్ట్ బటన్లు ఒకేసారి వరసగా ప్రెస్ చేయండి. దాంతో లిఫ్ట్ ప్రతి అంతస్తులో ఆగుతూ వెడుతుంది. అలా ఆగుతూ వెళ్ళే లిఫ్ట్ లో ఎలాటి అఘాయిత్యం చేయడానికీ ఏ మగవాడు సాహసించడు.

ఇంట్లో మీరు ఒంటరిగా వున్నారు. ఎవడో ముక్కూ  మొహం తెలియని మనిషి లోపల ప్రవేశించి  మీ మీద దౌర్జన్యం చేయబోయాడు. వెంటనే వంట గదిలోకి వెళ్ళిపొండి. కారపు పొడి డబ్బా ఎక్కడ వుంటుందో మీకు మాత్రమే తెలుసు. కత్తులూ, ప్లేట్లు ఎక్కడ ఉంటాయో తెలిసిందీ మీకే. వాటిని మీ రక్షణ కవచాలుగా మార్చుకోండి. స్టెయిన్ లెస్ స్టీల్ ప్లేట్లు, చెంచాలు  గదంతా విసరడం మొదలు పెట్టండి. ఆ చప్పుడుకు ఇరుగూపొరుగూ రావడం ఏమో కాని ఆ  ఆగంతకుడి గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం ఖాయం. కాలికి బుద్ది చెప్పడం అంతకంటే ఖాయం.

రాత్రి వేళ వొంటరిగా ఆటోలోనొ,  టాక్సీలోనొ  వెళ్ళాల్సిన అవసరం పడింది. ఆటో ఎక్కే ముందే దాని నెంబరు రాసుకోండి. ఎక్కగానే మొబైల్ ఫోనులో ఇంటి వారికి వివరాలు ఆటో డ్రైవర్  వినేటట్టు పెద్దగా చెప్పండి. అవతల లైను కలవకపోయినా సరే,  ఆటో  వివరాలు ఎవరికో చెబుతున్నట్టు కాసేపు నటించండి. ఇక అంతే! అప్పటిదాకా వాడి మనసులో వేరే చెడు ఉద్దేశ్యాలు వున్నా  ఆ ఫోను కాలుతో అన్నీ సున్నా. తన వివరాలు మీకు తెలుసనీ, మీకే కాకుండా మీ వాళ్లకు కూడా తెలిసిపోయాయని  తెలుసుకుని  భయపడి పోతాడు. మీరు వెళ్ళాల్సిన చోటుకు భద్రంగా తీసుకువెళ్ళి దింపుతాడు. ఎందుకంటె మీకేదైనా జరిగిందంటే ముందు చుట్టుకునేది వాడి మెడకే అని వాడికి అప్పటికే  అర్ధం అయి వుంటుంది.  

మీరు ఎక్కిన ఆటోవాడు హఠాత్తుగా వేరే సందులోకి మళ్ళాడనుకోండి. గాభరా పడకండి. అదును చూసి మీ చున్నీతో వాడి మెడ గట్టిగా వెనక్కి లాగండి. ఊపిరాడక వాడే గిజగిజలాడుతాడు. అపాయం నుంచి తప్పించుకోవడానికి ఆ మాత్రం వ్యవధానం చాలు.

ఇంతకీ  చెప్పేదేమిటంటే...


'మృగాళ్ళ' నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వేరే ఆయుధాలు అక్కరలేదు. మానసికంగా చురుగ్గా, సంసిద్ధంగా వుంటే చాలు, అదే మీ చేతిలో కనబడకుండా వుండే 'బ్రహ్మాస్త్రం'.

ఏమంటారు?