5, మార్చి 2015, గురువారం

'సూర్య' హరనాథ్ ఇక లేరు

  
ఈరోజు పొద్దున్న 10 టీవీ నుంచి ఇంటికి వస్తుంటే 'సూర్య' దినపత్రిక ఎడిటర్, మిత్రుడు సత్యమూర్తి నుంచి ఫోను.
'ఓ శాడ్ న్యూస్. హరనాథ్ చనిపోయారు. ఈ  తెల్లవారుఝామున. కార్డి యాక్ అరెస్ట్ ట.'
'అయ్యో!' అనిపించింది. హరనాథ్ వయస్సులో  నాకంటే ఏడెనిమిదేళ్లు  చిన్న.  కానీ,  అనుభవంలో పెద్దవాడు. అనేక  పత్రికల్లో పనిచేసారు.  ఐదారేళ్లుగా ప్రతి శనివారం ఆయన నుంచి ఫోన్ వచ్చేది. 'అయ్యా! ఈరోజు శనివారం. ఆదివారం ఆర్టికిల్ గుర్తు చేయడానికి చేస్తున్నాను' అనేవారు ఎంతో మర్యాదగా.  గత ఏడాది నుంచి కాబోలు,  వారానికి రెండు సార్లు, ప్రతి గురువారం, ఆదివారం రాజకీయ వ్యాసాలు 'సూర్య' పత్రిక్కి  క్రమం తప్పకుండా రాస్తూ వస్తున్నాను. ఈ రీత్యా హరనాథ్ గారి నుంచి  వారం వారం వచ్చే  ఫోను పిలుపు మరోటి పెరుగుతూ వచ్చింది. మొన్న సోమవారం నేనే ఫోను చేసాను. ఆయన  ఆఫీసులోనే వున్నారు. 'గురువారం (ఈరోజు,మార్చి అయిదు) ఆర్టికిల్ ఒక రోజు ముందే పంపుతున్నాను. ఇంట్లో కరెంటు సరిగ్గా వుండడం లేదు. నెట్ ప్రాబ్లం. అందుకని ముందే మెయిల్ చేస్తున్నాను. కాస్త చూసుకోండి'  అన్నాను. ఆయనే 'అల్లానే, అల్లానే' అన్నారు. ఆ 'రెండు పదాలే'  ఆయన నోటి నుంచి నేను వినే ఆఖరు మాటలు అని అప్పుడు  నాకు తెలియదు. ఈరోజు యధావిధిగా నా ఆర్టికిల్ 'సూర్య' పత్రికలో వచ్చింది. అది చూసిన కాసేపటికే ఆయన లేరనే వర్తమానం.
ఏదో ఒకరోజు అందరూ పోవాల్సిన వాళ్ళే. అయితే,  చిన్నవాళ్ళు పోతూ వుండడం అది పెద్దవాళ్ళు  చూస్తూ వుండడం - నిజానికి ఇది  చేయని నేరానికి పడే పెద్ద శిక్ష. కానీ చేయగలిగింది లేదు.
వచ్చే శనివారం హరనాథ్ గారినుంచి ఫోను రాదు. అది తలచుకుంటే బాధ మరింత పెరుగుతోంది.

హరనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి




4, మార్చి 2015, బుధవారం

గొప్పలు


'నాకెంత పొలం వుందో తెలుసా!  నేను పొద్దున్న కారేసుకుని  ఈ వైపు నుంచి బయలుదేరి వెడితే పొద్దుగూకినా కూడా  ఇంకా పొలం అటు చివరిదాకా చేరడం కష్టం'  ఒకడన్నాడు గొప్పలు పోతూ.
'ఛా! అంత చెత్త కారు ఇంకా యెందుకు వుంచుకున్నావు. నేనయితే ఎదురు డబ్బులు ఇచ్చి ఒదిలించుకునేవాడిని'


NOTE: Courtesy Image Owner 

అలవాటయితే కష్టం



ఏకాంబరం షాపు వాడిని అడిగాడు, 'చీమల కోసం పౌడర్' వుందా అని.
'వున్నా ఇవ్వను' అన్నాడు షాపు వాడు. 'ఎందుకని' అడిగాడు ఏకాంబరం.

'ఎందుకేమిటి? ఇవ్వాళ పౌడర్ అడిగిన చీమలు రేపు లిప్ స్టిక్ కావాలంటాయి. అలా అలవాటు చేయకూడదు' అన్నాడు దుకాణదారుడు.




(NOTE: Courtesy Image Owner)

3, మార్చి 2015, మంగళవారం

పిచ్చిమాలోకం


ఓ జర్నలిష్టు పిచ్చాసుపత్రికి వెళ్ళి అక్కడి డాక్టర్ని అడిగాడు, 'మీ దగ్గరకు వచ్చిన రోగికి పిచ్చి వుందని యెలా నిర్దారిస్తారని'
డాక్టర్ చెప్పాడు.
'వెరీ సింపుల్. ఒక బాత్ టబ్ నిండా నీళ్ళు నింపి వచ్చిన రోగికి ఒక బక్కెట్టు, ఒక చెంచా ఇచ్చి నీళ్ళు తోడమని చెబుతాం"
జర్నలిష్టు కల్పించుకుని అన్నాడు.  ' ఓ తెలిసింది. బక్కెట్టుతో తోడితే అతడికి పిచ్చి లేనట్టు. అంతే కదా!'
'కాదు, బాత్ టబ్ కింద నాబ్ వుంటుంది. అది తిప్పితే నీళ్ళు అవే పోతాయి. నర్స్, మూడో నెంబరు బెడ్డు ఖాళీ వుండాలి కదా! ఇతగాడిని ఎడ్మిట్ చేసి పరీక్షలు మొదలు పెట్టు, నేను తరవాత వచ్చి చూస్తాను'


(NOTE: Courtesy Image Owner)

కేంద్ర బడ్జెట్ సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపనలు


(Published by 'SURYA' telugu daily in it's edit page on 05-03-2015, THURSDAY)

శారీరక అస్వస్తత నుంచి కోలుకుంటున్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, నానారకాల రుగ్మతలతో కునారిల్లుతున్న 
దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకోసం బడ్జెట్ రూపకల్పనలో చాలా శ్రమ తీసుకున్నారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకోసం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో వుంచుకుని కేటాయింపులు చేయడం  నిజానికి ఆహ్వానించాల్సిన అంశమే.   అన్ని రకాల  వర్గాలను మెప్పించేందుకోసం కాకుండా  దేశ హితాన్ని దృష్టిలో వుంచుకుని, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తయారు చేసింది కావడం వల్ల ఫలితాలు అందుబాటులో రావడానికి కొంతకాలం వేచి వుండాలని బడ్జెట్ ను సమర్ధించే బీజేపీ నాయకులు అంటున్నారు. ఈ వాదనను ప్రతిపక్షాలు అంగీకరించే పరిస్తితి ఎలాగూ వుండదు. అందువల్ల షరా మామూలుగానే కేంద్ర బడ్జెట్ పై ఖండన ముండన పర్వాన్ని అధికార ప్రతిపక్షాలు  యధాప్రకారం యధావిధిగా కొనసాగిస్తున్నాయి.
ఆ విషయం పక్కనబెడితే, ఈసారి కేంద్ర బడ్జెట్,   కొత్తగా ఏర్పడ్డ ఓ  తెలుగు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. మీడియా చర్చల్లో అదే ఒక  ప్రధాన చర్చనీయాంశంగా మారుతోంది. ఇదే ఈసారి కేంద్ర బడ్జెట్ లో కానవస్తున్న నవ్యత్వం. గతంలో ఇలా జరిగిన దాఖలాలు లేవు. కేంద్రంలోను, ఆంధ్ర ప్రదేశ్  లోనూ  మిత్రపక్షాలుగానే కాకుండా ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలుగా  వున్న రెండు రాజకీయ పక్షాల్లో రాజుకుంటున్న విభేదాలకు ఈ బడ్జెట్ మరింత  ఆజ్యం పోసింది. గత రెండు మూడు రోజులుగా స్థానిక టీవీ ఛానళ్లలో ఈ అంశంపై జరుగుతున్న చర్చల్లో మిత్రపక్షాలయిన బీజేపీ, టీడీపీ ప్రతినిధుల నడుమ వాదోపవాదాలు  కొంచెం శ్రుతి మించుతున్నట్టే అనిపిస్తోంది. వీటి తీరుతెన్నులు నిశితంగా గమనిస్తే, రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణలు ప్రస్తుతం వున్నరీతిలో కొనసాగే అవకాశాలు సన్నగిల్లుతున్నట్టు కూడా  అనిపిస్తోంది. పై స్థాయి నాయకుల మద్దతు, ప్రోత్సహం లేకుండా మీడియాలో మాట్లాడే ఆ  పార్టీల  ప్రతినిధులు ఈ పద్దతిలో మాట్లాడడం సాధ్యపడడం కుదరదు. ఈ సంవాదాలు ముదిరి పాకాన పడతాయా, లేదా ఒక స్థాయికి చేరి ఆగిపోతాయా అనే విషయంలో ఇప్పటికిప్పుడే అంచనాలకు రావడం తొందరపడడమే అవుతుంది. ఎందుకంటే, 'కొట్టినట్టు కొడతాను, ఏడ్చినట్టు ఏడువు' అనే నాటకీయ సంవాద ధోరణులు  కూడా ఇటీవలి కాలంలో రాజకీయాల్లో పెచ్చరిల్లుతున్నాయి. ఏది నిజమో, ఏది నాటకమో తెలియనంత స్వాభావికంగా నటించడంలో రాజకీయ నాయకులు రాటు తేలిపోయారు.  అయితే, టీడీపీ, బీజేపీ లలోని ఒక స్థాయి నాయకులు మాత్రం 'ఇక వెనక్కి తగ్గేది లేద'న్నంత తీవ్రంగా మాటలు విసురుకుంటూ  సవాళ్లు ప్రతిసవాళ్లు  విసురుతూ , ముందుకు దూసుకుపోతున్నారు. ఈ దృశ్యాలు  చూసినప్పుడు   రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో  బీజేపీ, టీడీపీ మైత్రి ముందు మాదిరిగానే కొనసాగుతుందా అంటే 'అవున'ని చెప్పడం కష్టంగా మారుతోంది. 

                  
గత ఎన్నికలకు ముందు ఏర్పడ్డ బీజేపీ, తెలుగుదేశం మైత్రీబంధం ఒకరకంగా ఉభయుల అవసరార్ధం కుదురుకున్నదే కాని, సిద్దాంత ప్రాతిపదికమీద ముడిపడింది కాదు. ఎన్నికల అనంతరం ఒకరి మీద మరొకరు ఆధారపడే అవసరం లేని సంఖ్యాబలం ఇరువురికీ లభ్యం కావడంతో ఈ పార్టీల పొత్తు కేవలం నామమాత్రంగానే తయారయింది. కాకపోతే, కొన్ని విషయాల్లో బీజేపీది పైచేయి అనే ఒప్పుకోవాలి. రాష్ట్రాలకు స్వతంత్ర ప్రతిపత్తి అనే మాటలు పైకి ఎన్ని చెప్పినా చివరికి ఏ రాష్ట్రం  అయినా కేంద్రం మీద ఆధారపడే పరిస్తితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది నిర్వివాదాంశం. అందులోనూ కొత్తగా పురుడుపోసుకుని, బాలారిష్టాలతో కునారిల్లుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి,  ప్రతిదానికీ కేంద్రం మీద ఆధారపడడం తప్పనిసరి. రాష్ట్ర విభజన సమయంలోనూ, ఆ తరువాత ఎన్నికల  తరుణంలోనూ బీజేపీ అగ్రనాయకులు చెప్పిన ఉపశమన వాక్యాలతో కడుపు నిండిన ఆంధ్ర ప్రాంతం ఓటర్లు, చేయీ చేయీ కలిపిన బీజేపీ, టీడీపీ నాయకులని నమ్మి, 'చెయ్యి గుర్తు' పార్టీని మట్టి కరిపించి, అంతవరకూ అన్ని ఉపఎన్నికల్లో తాము బ్రహ్మరధం పట్టిన వై.యస్.ఆర్.సీ. పార్టీని పక్కన బెట్టి, ఈ రెండు పార్టీలనే అక్కున చేర్చుకున్నారు. అధికారంలోకి వచ్చి నెలలు గడిచిపోతున్నా ఇచ్చిన హామీలకు అతీగతీ లేకుండా పోవడం చూస్తూ  సీమాంధ్ర ప్రజానీకం లోలోపలే కుతకుతలాడి పోతున్న విషయం రహస్యమేమీ కాదు. హామీలను నూటికి నూరు  శాతం నిలబెట్టుకుని తీరతామని రెండు పార్టీల నాయకులు మరో కొత్త హామీ పదేపదే ఇవ్వడం తప్ప, ఇన్ని నెలలుగా కార్యాచరణ దిక్కుగా అడుగు పడింది లేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, బడ్జెట్ లోటు తగ్గింపుకు చేతనయిన సాయం,  నూతన రాజధాని నిర్మాణానికి కేంద్రనిధులు,  పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదాకు తగ్గ కేటాయింపులు, ప్రత్యేక రైల్వే మండలం అన్నీ మాటల్లోనే మిగిలిపోయాయి. రైల్వే బడ్జెట్ లో ఆంధ్రాకు మొండి చేయి చూపిస్తే,  కేంద్ర బడ్జెట్లో ఏకంగా తొండి చేయి మిగిల్చారు. వీటిని సమర్ధించుకోవడానికి రాష్ట్రానికి చెందిన బీజేపే నాయకులు నానా అవస్థ పడాల్సి వస్తోంది. 'దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇదొక రాష్ట్రం, అందరితో  పాటే వడ్డన' అనే మోడీ మార్గం వారికి ఓ పట్టాన కొరుకున పడడం లేదు. ముందే చెప్పినట్టు 'అత్యల్ప రాజకీయ ప్రయోజనాలకంటే అనల్ప జాతీయ లక్ష్యాలు ప్రధానం. ఇది మా విధానం' అని మోడీ గద్దె ఎక్కిన మొదటి రోజునుంచీ చెబుతూనే వస్తున్నారు. ఇక ఆయన్ని తప్పుపట్టడం యెట్లా అనేది రాష్ట్ర బీజేపీ నాయకుల మనోగతం. కానీ పైకి చెప్పుకోలేరు. సాక్షాత్తూ  వెంకయ్య నాయుడు వంటి కాకలు తీరిన సీనియర్ నాయకుడే విలేకరుల ప్రశ్నలకు జవాబు చెప్పలేక తడబడిన స్తితి. 'అవును, నేను అసమర్దుడినే, మీకు జవాబులు చెప్పలేకపోతున్నా' అని అయన విలేకరులతో అన్నట్టు పత్రికల్లో వచ్చిన వార్తలు ఈ పరిస్తితికి అద్దం పడుతున్నాయి. వెంకయ్యనాయుడు బీజేపీలో ఆషామాషీ మనిషి కాదు. నరేంద్ర మోడీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నరోజుల్లోనే   ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు వుంది. కాకపొతే, ఆ పార్టీ నాయకులకు వున్న ఒక వూరట ఏమిటంటే,  బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో తెలుగు రాష్ట్రానికి చెందిన హామీలను పొందుపరచలేదు. ఎన్నికల ప్రసంగాలకు మాత్రమే వాటిని పరిమితం చేశారు. 'ఢిల్లీ చిన్నబోయేలా సీమాంధ్ర రాజధాని నిర్మించుకుందాం' అని మోడీ అలనాడు తిరుపతి సభలో అన్నా, 'కాంగ్రెస్ మిమ్మల్ని అనాధలుగా మార్చింది, అధికారంలోకి రాగానే మీకు అండగా వుంటా' అని ఎన్నికల వేళ  గుంటూరులో సీమాంధ్ర ప్రజలకు  మాటిచ్చినా అవన్నీ మానిఫెస్టోలో లేవని తప్పుకునే వెసులుబాటు బీజేపీ నాయకులకి వుంది. 'ఎన్నికల ప్రణాళికలో పొందుపరచిన అంశాలు మీరెంతవరకు అమలు చేసార'ని ఆ పార్టీ నేతలు టీడీపి పై ఎదురు  ప్రశ్నలు సంధించడం టీవీల్లో చూస్తున్నాం. రామాంజనేయ యుద్ధం అనే పౌరాణిక నాటకంలో యుద్ధరంగంలో తటస్థ పడిన శ్రీరాముడు, ఆంజనేయుడు ఒకరికొకరు తగిన మర్యాదలు ఇచ్చుకుంటూనే 'ఎత్తి పొడుపు' పద్యాలు ఎత్తుకున్న సందర్భం గుర్తుకు వస్తోంది.
ఇక తెలుగు దేశం పరిస్తితి చెప్పనక్కరలేదు. మిత్రపక్షాన్ని నిలదీయలేరు, అలా అని  సమాధాన పడలేరు. అయితే. రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ల తరువాత వారి స్వరాల్లో కొంత మార్పు కనబడుతోంది. చంద్రబాబు బావమరది, హిందూపూర్  ఎం.ఎల్.ఏ.,  బడ్జెట్ పై వెలిబుచ్చిన స్పందనలో ఈ మార్పు కొట్టవచ్చినట్టు కనబడింది. ఇక తిరుపతి టీడీపీ ఎంపీ ఒక అడుగు ముందుకు వేసి, జమ్మిచెట్టు మీద దాచిన ఆయుధాలను దించాల్సినసమయం ఆసన్నమైనదన్నట్టు మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పట్ల తన అసహనాన్ని దాచుకోలేదు.  'ఎంతో నమ్మకంతో బీజేపీ, టీడీపీలను గెలిపించిన 'ఏపీ' ప్రజల ఆశలను కేంద్రం వమ్ము చేసింది' అని చంద్రబాబు  విలేకరుల సమావేశంలోనే చెప్పారు. ఇక సహచరులతో జరిపిన అంతరంగిక సంభాషణల్లో  'కొంతకాలం వేచి చూద్దాం, మార్పు లేకుంటే కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పుకుందాం' అన్నట్టుగా పత్రికల్లో  వచ్చింది. అదే వైఖరి టీవీ చర్చల్లో పాల్గొంటున్న టీడీపీ నాయకుల వాదనల్లో ప్రతిధ్వనిస్తోంది.
వీటన్నిటికీ 'కొసమెరుపు' అన్నట్టు 'ప్రశ్నించే హక్కు ప్రజలది' అనే నినాదంతో పుట్టిన జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో చేసిన ఒక ట్వీట్ వీటన్నిటినీ మించిన దుమారం రేపింది.  రాజధాని భూముల సేకరణ  విషయంలో ఇటు టీడీపీని, ప్రత్యేక హోదా విషయంలో అటు  మోడీ ప్రభుత్వాన్ని ఒకే త్వీట్ లో ఇరుకున బెట్టారు.  మోడీ అభిమానం చూరగొన్న ప్రాంతీయ నాయకుడిగా ముద్రపడ్డ  పవన్ కళ్యాణ్ చంద్రబాబును అయన నివాసంలో కలుసుకుని, చర్చలు జరిపి 'రాజధాని' ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించారు. అనువైన తరుణానికి బాగా ముందుగానో, లేదా చాలా ఆలస్యంగానో  స్పందిస్తారని ఆయనకు ఇప్పటికే పేరుంది. రాజధాని భూముల  సమీకరణ గడువు 'ముగిసిన' తరువాత జరిపే ఈ పర్యటన వల్ల సాధించేది ఏముంటుంది? అనే ప్రశ్నలు మొదలయ్యాయి కూడా. కాకపొతే, ఢిల్లీ వెళ్ళి మోడీని కూడా కలుసుకుంటానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో చేసేది ఏమీ లేదంటున్నారు కనుక, కనీసం 'తగినన్ని' నిధులు కేంద్రం నుంచి రాబట్టడంలో సఫలం అయితే కొంత మేలు జరిగినట్టు అనుకోవచ్చు. చంద్రబాబు అయన పరివారం విఫలం అయిన చోట పవన్ 'విజయం' సాధిస్తే ఆ పరిణామం మరికొన్ని రాజకీయ సమీకరణాలకు దారితీసే అవకాశం  లేకపోనూ లేదు.                 
ఇదే వాతావరణం కొనసాగితే రాష్ట్రంలో 'రాజకీయ సమీకరణాలు' మారిపోయే ప్రమాదం వుంటుంది. ఆగ్రహించిన ప్రజానీకం యెలా స్పందిస్తారన్నది  సీమంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అవగతమైంది. వారి అనుభవంతో తెలుగుదేశం నాయకులకు కూడా  పరిస్తితి క్రమక్రమంగా అర్ధం అవుతున్నట్టుంది. అందుకే ఆ పార్టీలో నిరసనలు   'గుసగుసలు'గా  మొదలయి 'రుసరుసల' రూపం సంతరించుకుని క్రమేపీ  రణగొణ ధ్వనులుగా మారుతున్నాయి. 'ఇల్లా అయితే ఎల్లా' అనే ప్రశ్న, 'అవసరం అయితే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి తప్పుకుందాం' అనే వరకు రూపాంతరం చెందుతోంది. బడ్జెట్ సృష్టించిన, సృష్టిస్తున్న  రాజకీయ ప్రకంపనలు రానున్న కాలంలో వూహాతీత పరిణామాలకు దారితీస్తాయా, లేదా బలహీనపడ్డ అల్పపీడనం మాదిరిగా సద్దుమణుగుతాయా అన్నది రానున్న రోజుల్లో 'కాలమే' నిర్ణయిస్తుంది. (bhandarusr@gmail.com)

(04-03-2015)

NOTE:Courtesy Image Owner 

2, మార్చి 2015, సోమవారం

మేకు జోకు - జోకు మేకు


కొన్ని సందర్భాలలో జోకు మేకయ్యే ప్రమాదం ఉంది.  ముఖ్యంగా కొన్ని జోకులు ఆడవారి మీద పేలిస్తే అవి రివర్స్ లో తగిలే ప్రమాదం వుంది.


కాకపోతే ఇలాటి జోకులన్నీ స్త్రీ స్వాతంత్రం ఎక్కువగా వున్న దేశాల్లోనే ఎక్కువగా పుట్టి మన దగ్గరికి  దిగుమతి అయ్యాయి. ఆ పరాయి జోకుల్ని సొంత భాషలోకి అనువదించాలనే ఉత్సాహపరులకి  కొండొకచో కొన్ని (కామెంట్లు) పాట్లు తప్పవు. అయినా తగుదునమ్మా అని అనువాదం చేస్తే ఇదిగో ఇల్లా వుంటాయి.  
అమెరికా తండ్రికి కూతురు ఫోను చేసి చెప్పింది.'సారీ డాడ్. నిన్న అనుకోకుండా నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నీకు ఫోన్ చేసి చెప్పే టైం లేకపోయింది'
తండ్రి: పర్వాలేదులే.  మళ్ళీ ఇలాటి సందర్భం రాకపోదులే. అప్పుడు మాత్రం గుర్తుంచుకుని కబురు చెయ్యి'
ఇండియా పిల్లాడు తన అమెరికన్ స్నేహితుడితో  చెప్పాడు, ' నాకు నలుగురు అక్కయ్యలు, ముగ్గురు తమ్ముళ్ళు మరి  నీ సంగతేమిటి?'
'నాకా! నాకు అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. కాకపోతే నా మొదటి అమ్మద్వారా నలుగురు నాన్నలు, మొదటి నాన్న ద్వారా ముగ్గురు అమ్మలు'
"ఆడవాళ్ళు  ముగ్గురి  మాటే చెవిపెట్టి వింటారు. అంతే కాదు,  వారు చెప్పిన మాటలు అక్షరాలా ఆచరిస్తారు. అని  ఓ మగ పిశాచి ఉవాచ.

ఆ ముగ్గురు ఎవ్వరంటే ఒకడు టైలర్, రెండోవాడు ఫోటోగ్రాఫర్,  మూడో వ్యక్తి బ్యుటీషియన్. వీళ్ళు ముగ్గురు కాకుండా తలకిందుగా తపస్సు చేసినా సరే, ఆడంగులు ఈ భూప్రపంచంలో ఎవ్వరి మాట వినరుగాక వినరు.  కాకపోతే కొందరు  విన్నట్టు నటిస్తారుట"

NOTE: Courtesy Image Owner 

28, ఫిబ్రవరి 2015, శనివారం

కాపీ జోకులు


కాపీ కొట్టే రైట్లే కాని కాపీ రైట్లు లేనివాటిని జోకులంటారని ఓ జోకారావు చెప్పాడు. అలాంటివే ఇవి.
పీతాంబరం భర్త ఏకాంబరాన్ని ఒంటరిగా దొరకబుచ్చుకుని అడిగింది. 'మీరు నన్ను ప్రేమిస్తున్నారా?  ప్రేమిస్తే ఎంతగా ప్రేమిస్తున్నారు?' అని. అతగాడికి ఓ పట్టాన ఆ ప్రశ్నే అర్ధం కాలేదు. అర్ధం కాగానే అందులో  ఏదో మతలబు వుందని పసిగట్టి, 'నిన్ను బోలెడు బొచ్చెడు  ప్రేమిస్తున్నాను, తాగుతున్న ఈ మందు మీద ఒట్టు' అనేసాడు ధైర్యంగా. అలా చెబితే కుదరదు, ఇదిగో ఇంత అని చెప్పాలి' అంది గారాలు పోతూ. ఏకాంబరం క్షణం ఆలోచించి చెప్పాడు. మాటవరసకు  నేను ఒక సెల్ ఫోన్ అనుకో. నువ్వు సిమ్  కార్డులాంటిదానివి. సిమ్ కార్డు లేకపోతే ఫోను ఉట్టిదేగా! అలా అన్న మాట' అన్నాడు. 'ఓహో! అలాగా' అని  పీతాంబరం బోలెడు సంతోషపడి యింది. ఏకాంబరం మనస్సులో అనుకున్నాడు 'అమ్మయ్య బతికిపొయానురా బాబూ ఈ పూటకు. పిచ్చిది, చెప్పగానే  నమ్మేసింది, కానీ దానికేం తెలుసు, నేను చైనా ఫోను లాంటివాడిననీ, నాలుగు సిమ్ కార్డులు వుంటాయని'   




NOTE: Courtesy Image Owner