1, అక్టోబర్ 2014, బుధవారం

రాజు గారికి కోపం వచ్చిందా!


రాజు గారికి కోపం రావచ్చు కాని, నాకు బాగా తెలిసిన ఈ రాజు గారికి కోపం వచ్చే అవకాశం బొత్తిగా లేదు.
ఈరోజు పత్రికల్లో ఈ రాజు గారికి అంటే నాకు తెలిసిన రాజుగారు, కేంద్ర మంత్రి శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి కోపం వచ్చినట్టు వార్తలు చదివి (గుంటూరు గోల) ఓ పట్టాన నమ్మలేకపోయాను.


కొన్ని దశాబ్దాలుగా ఆయన తెలుగుదేశం పార్టీలో  శిఖర సమానులు. అధికారాలు, హోదాలు ఆయనకు పుట్టుకతో అబ్బినవే కనుక వాటిని అడ్డం పెట్టుకుని విర్రవీగాల్సిన అవసరం లేని ఏకైక రాజకీయ నాయకుడు ఆయన. అందుకే, ముఖ్యమంత్రి తరువాత రెండో స్థానంగా అందరూ పరిగణించే ఆర్ధిక శాఖ, రెవెన్యూ మంత్రిత్వ శాఖలు రెండూ నిర్వహించిన సమయంలో కూడా  ఆయన తన తీరు మార్చుకోలేదు. హైదరాబాదులో వుంటే మాత్రం ఠంచనుగా సచివాలయానికి వచ్చి కూర్చునేవారు. ఎప్పుడన్నా సెక్రెటేరియేట్ బీట్లో తిరుగుతూ అటు తొంగి చూస్తె ఆయన చాంబర్ ఖాళీగా కనిపించేది.  చిన్న చిన్న శాఖలు చూసే మంత్రుల పేషీలు కూడా కూడా వచ్చిపోయే సందర్శకులతో కిటకిటలాడుతుండేవి. రూలు ప్రకారం తప్ప పైరవీలు చెల్లవు అనే పేరు పడడం వల్లనేమో  రాజుగారి ఆఫీసులో  జన సందోహం చాలా తక్కువ. ఆయన ప్రైవేట్ సెక్రెటరీ కమ్  ఓ.యస్.డీ,,  బీ ఎన్ కుమార్ గారు నన్ను  చూడగానే, చిరునవ్వుతో, 'లోపలకు వెళ్ళండి పరవాలేదు' అనేవారు. తలుపులు తీసేవాళ్ళు, చీటీలు పట్టుకుని ఇచ్చేవాళ్ళు లేని వ్యవహారం కనుక,  తలుపు తోసుకుని  లోపలకు వెళ్ళేవాడిని.  విశాలమైన మేజాబల్ల వెనుక కుర్చీలో కూర్చుని, సిగరెట్ తాగుతూ,  ఇంగ్లీష్ పుస్తకం ఏదో ఒకటి చదువుతూ, రాజుగారు దర్శనం ఇచ్చేవారు.  రేడియో విలేకరిని కాబట్టి, సంచలన వార్తల అవసరం ఏమాత్రం లేనివాడ్ని కాబట్టి ఆయన  నన్ను చూడగానే, హాయిగా ఇంగ్లీష్ లో పలకరిస్తూ, కూర్చోబెట్టి రకరకాల విషయాలు చర్చించేవారు. రాజకీయాలను మినహాయిస్తే మిగిలిన విషయాల్లో ఆయన పరిజ్ఞానం  అమోఘం. కాసేపు అవీ ఇవీ మాట్లాడి సెలవు తీసుకుని వచ్చేసేవాడిని. వార్త దొరకలేదన్న చింత లేని మనిషిని కదా!    
నా జర్నలిష్టు మిత్రుడు ఎం.యస్. శంకర్ ఆ రోజుల్లో బీబీసీ తెలుగు వార్తలకు తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేసాడు. అతడు రికార్డు చేసి బీబీసీకి పంపాల్సిన స్టూడియో రాజభవన్ రోడ్డులో వుండేది. రాజుగారి ఇంటర్వ్యూ అడిగితె ఆయన ఔనడం, మేము ఆర్చుకుని తీర్చుకుని మినిస్టర్స్ కాలనీలోని (ఇప్పటి సీ ఎం క్యాంప్ కార్యాలయం వున్నచోటుకు కూతవేటు దూరంలో) వున్న ఆయన ఇంటికి శంకర్ స్కూటర్ పై వెళ్ళాము. ఆయన్ని తీసుకుని స్టూడియోకి వెళ్ళాలనేది మా ప్లాను. కానీ, మంత్రిగారు సాయంత్రం ఇంటికి రాగానే డ్రైవర్ ని ఉంచుకోకుండా పంపించేస్తారు అన్న సంగతి మాకు తెలవదు. ఎలా వెళ్ళడం అని ఆలోచిస్తుండగానే రాజుగారు బయటకు వచ్చి కారు తీసి మమ్మల్ని ఎక్కమని చెప్పి 'ఎక్కడకు వెళ్ళాలి' అని అడిగేసరికి మాకు మతి పోయినంత పనయింది. ఆయనే స్వయంగా డ్రైవ్  చేసుకుంటూ తీసుకువెళ్ళడం, రికార్డింగు పని పూర్తిచేసుకోవడం అన్నీ  సక్రమంగా జరిగిపోయాయి. ఆరోజుల్లో మా ముగ్గురినీ కలిపి వుంచిన బంధం ఒకటి వుంది. అందరం ఒకే బ్రాండ్ సిగరెట్ తాగేవాళ్ళం. తరువాత నేను మానేసాను. శంకర్ మానేసినట్టు చెబుతున్నాడు. రాజు గారిని కలవక దశాబ్దం దాటింది. ఆయన సంగతి తెలవదు. మానేస్తారన్న నమ్మకం నాకయితే లేదు. ఎన్టీ రామారావు గారంతటి వారు కూడా ఈ విషయంలో రాజుగారికి కొంత మినహాయింపు ఇచ్చారని ఆరోజుల్లో చెప్పుకునేవారు.  

ఇదీ భారత్!



అయినా 'మేరా భారత్ మహాన్'


ఇక్కడి రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం జనాలను విడతీయాలని చూస్తారు. టెర్రరిస్టులు మాత్రం తమ ఉగ్రవాద చర్యలతో  ప్రజలను సంఘటితం చేస్తారు.
వన్ వే (ఒకే వైపు వాహనాలు వెళ్ళడానికి అనుమతి వున్నదారి) దాటడానికి జనాలు రెండు వైపులా చూసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్తితి ఈ దేశంలోనే కనిపిస్తుంది.
ఎవర్ని చూసినా ఏదో హడావిడిలో వున్నట్టు కనిపిస్తారు. కానీ చాలా తక్కువమందే ఆఫీసులకు సకాలంలో చేరుకుంటారు.
వచ్చీరాని ఇంగ్లీష్ లో మాట్లాడండి. అంతా గౌరవంగా చూస్తారు. మాతృభాషలో అనర్ఘలంగా మాట్లాడండి. ఎవ్వరూ పట్టించుకోరు.
ఈ దేశంలో ఎక్కువ మంది భగవద్గీత గురించీ, ఖురాన్ గురించీ చాలా తెలివైన వ్యాఖ్యానాలు చేస్తుంటారు. కానీ వారిలో చాలామంది ఆ రెండింటినీ ఏనాడు చదివిన పాపానపోయుండరు.
ఆడపిల్లల చదువుల మీద కంటే వారి పెళ్ళిళ్ళపై ఎక్కువ ఖర్చు చేసే తలితండ్రులు ఇక్కడే ఎక్కువ కానవస్తారు.
ఆడపిల్ల ఇంటికి దీపం అనే తియ్యటి మాటలు,  గుండెల మీద కుంపటి అనే శాపనార్ధాలు  ఒకే ఇంట్లో వినవచ్చే విచిత్రమైన సంస్కృతి ఇక్కడే కనిపిస్తుంది.
మనం వేసుకునే చెప్పుల్ని ఎయిర్ కండిషన్ షో రూముల్లో కొంటాం. తినే కూరగాయల్ని రోడ్డు పక్కన కొంటాం.
ఆఫీసులో బంట్రోతు ఉద్యోగం చేయడానికి కనీసం ఎనిమిదో తరగతి పాసయి వుండాలి.
దేశాన్ని పాలించే మంత్రులకు మాత్రం ఎలాటి విద్యార్హతలు అవసరం లేదు.
అయినా కానీ, ఇలాటి  అవలక్షణాలు ఎన్నివున్నాకానీ -
మేరా భారత్ మహాన్!


(ఇంగ్లీష్ మెయిల్ కు తెలుగు అనువాదం)
NOTE: Photo Courtesy Image Owner 

30, సెప్టెంబర్ 2014, మంగళవారం

పిలుపుల పరిణామక్రమం



"నాన్నగారండీ!...... నాన్నారూ! ......నాన్నా!..... ఒరేయ్ నాన్నా!..... ఏరా నాన్నా!...... ఏం గురూ ఏంటి సంగతి మీ ఆవిడ అదేరా మా అమ్మ ఎలావుంది ? "

విభజన పూర్తికాలేదా!


ఈ ఏడాది జూన్ రెండో తేదీన మునుపటి ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది. ఇది చారిత్రిక సత్యం.

నిన్నటికి నిన్న ఆసియా క్రీడల్లో టెన్నిస్ విభాగంలో జరిగిన మిక్సడ్ డబుల్స్ లో భారత జోడీ సానియా మీర్జా, సాకేత్ మైనేని కలిసి మన దేశం ఖాతాలో మరో స్వర్ణ పతకాన్ని చేర్చారు. సానియా మీర్జా తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్. సాకేత్ విశాఖ కుర్రవాడు. వీరిద్దరూ కలిసి సాధించిన విజయం పట్ల యావత్ దేశప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన నాయకులు మాత్రం వారిని ఆంద్ర, తెలంగాణాలకు చెందినవారిగా గుర్తించి విడివిడిగా అభినందనలు తెలియచేస్తున్నారు. నగదు బహుమతులు, వేరే పురస్కారాలు అంటే అర్ధం చేసుకోవచ్చు, ఆంద్ర తెలంగాణా తేడా లేకుండా వారిద్దరూ కలిసి శ్రమించి సాధించిన విజయాన్ని 'ప్రశంసించడం'లో అడ్డొచ్చిన అడ్డుగోడలు ఏమిటో అర్ధం కాదు. నిజంగా అయాం సారీ ఫర్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్! 

      

29, సెప్టెంబర్ 2014, సోమవారం

కాపీ జోకులు



'రాత్రి రైల్లో నిద్ర పట్టక చాలా అవస్థ  పడ్డాను' ఏకాంబరం చెప్పాడు.
'ఎందుకని'
'ఖర్మ! పై బర్త్ దొరికింది'
'కింద పడుకున్నవాళ్ళని అడక్కపోయావా?'
'ఆ మాత్రం నాకు తెలియదని అనుకున్నావా! అడగడానికి కింద బర్తుల్లో ఎవరయినా వుంటే కదా! రైలంతా ఖాళీ!'

'ఏకాంబరం! నీ భార్య చనిపోయింది'
ఆ కబురు విన్న అతడికి  మతి పోయింది. భార్య లేని జీవితం వృధా అనిపించింది. వెంటనే తనుంటున్న భవనం వందో అంతస్తుకి వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకాడు.
యాభయ్యో అంతస్తు దగ్గరికి రాగానే అతడికి తనకు పెళ్ళే కాలేదన్న సంగతి గుర్తుకు వచ్చింది.
పాతిక అంతస్తు దగ్గర మరో దారుణమైన విషయం గుర్తుకు వచ్చింది. తాను ఏకాంబరం కాదని, తనపేరు లంబోదరం అని. ఏం లాభం. అప్పటికే ఆలస్యం అయిపోయింది.  

హోటల్లో ఆర్డర్ చేస్తున్నప్పుడు ఏకాంబరం తలలో మెరుపు మెరిసింది. వెంటనే పరిగెత్తుకుంటూ లంబోదరం దగ్గరికి వెళ్ళాడు. అతడికి ఆరోజు గాలిలో తేలిపోతున్నట్టు వుంది. తన స్నేహితులెవరు  జవాబు చెప్పలేని ఓ చిక్కు ప్రశ్నకు సమాధానం తనకే ముందు తట్టింది.
'గుడ్డు ముందా చికెన్  ముందా అని అడుగుతుండేవాడివి కదా. ఇప్పుడు చెబుతాను చూడు. హోటల్ కు వెళ్లి ముందు ఏది ఆర్డర్ చేస్తే అది ముందు వస్తుంది'   

ఏకాంబరం భార్యను తీసుకుని హోటల్ కు వెళ్ళాడు. భార్య కాఫీ ఆర్డర్ చేసింది. తను కోల్డ్ కాఫీ తెప్పించుకున్నాడు. 'కాఫీ చల్లారి పోతుంది త్వరగా తాగమ'ని భార్యను తొందర చేసాడు. ఎందుకంటె ఆ హోటల్లో హాట్ కాఫీ అయిదు రూపాయలు. కోల్డ్ కాఫీ పది రూపాయలు. 


ఏకాంబరం ఆర్ట్ గ్యాలరీ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఓ బొమ్మ అతడికి యెంత మాత్రం నచ్చలేదు. 'ఇలాటి దరిద్రపు బొమ్మ పెట్టి,  పైగా మోడరన్ ఆర్ట్ అంటూ పబ్లిసిటీ ఒకటీ...'
అంటూ చిందులు తొక్కాడు.
'అయ్యా అది బొమ్మకాదు. ముందు, ఆ అద్దం ఎదట నుంచి బయటకు రండి' ఎవరో అన్నారు.


(స్వేచ్చానువాదం ఒక్కటే సొంతం) 

NOTE:COURTESY IMAGE OWNER


26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

పిపీలికం


అధికారం, హోదా, చదువు, డబ్బు, బ్యాంక్ బాలన్సులు ఇవి వ్యక్తుల స్తితిగతులకు కొలమానాలు కావచ్చు. కానీ అవేవీ వారిని ఈ ప్రపంచంలో పెద్దవారిని చేయలేవు. నిజానికి మనం యెంత చిన్నవాళ్ళమో, ఒకరకంగా చెప్పాలంటే పిపీలికాలమో తెలుసుకోవడానికి ఓ చిన్న చిట్కా వుంది. ఆకాశం నిర్మలంగా వున్న రాత్రి డాబా మీద వెల్లకిలా పండుకుని పైకి చూడండి. వేల కోట్ల మైళ్ళ దూరంలో వున్న నక్షత్రాలు మిణుకుమిణుకు మంటూ కానవస్తాయి. వాస్తవానికి అవి యెంత పెద్దవో ఈరోజుల్లో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధికి కూడా తెలుసు. 


గగనాంతర రోదసిలో, అనంత  నక్షత్ర రాశుల నడుమ,  మనం వున్న ఈ సమస్త భూ మండలమే ఓ పిపీలికం. ఆ భూమండలంలోని ఒక దేశంలో, ఆ దేశంలోని ఓ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలోని ఓ నగరంలో, ఆ నగరంలోని ఓ ప్రాంతంలో, ఆ ప్రాంతంలోని ఓ నివాసంలో, ఆ నివాసంలోని డాబాపై పడుకుని పైకి చూస్తున్న మనం  పిపీలికాలమా, లేక అంత కంటే చిన్నవాళ్ళమా?

NOTE: COURTESY IMAGE OWNER

25, సెప్టెంబర్ 2014, గురువారం

అచ్చంగా మగవారికి మాత్రమె!


(ఇంకో 'మాత్రమే' ఏమిటంటే 'ఇది' కేవలం అనువాదం మాత్రమే!)
భార్య: ఏవిటి ఆఫీసు నుంచి పెందలాడే దిగడ్డారు?
భర్త: మా బాసుకి నా మీద కోపం వచ్చింది. గో టు హెల్ అన్నాడు. అంతే! ఇంటికొచ్చేసా!
డాక్టర్: మీ తలనొప్పి ఏమైంది ?
పేషెంటు: నిన్ననే పుట్టింటికి వెళ్ళింది.

మనిషికి నాలుగింటితో అసలు  తృప్తి అనేదే  వుండదు ఒకటి సెల్ ఫోన్, రెండోది కారు, మూడోది టీవీ, నాలుగోది భార్య
ఎందుకంటె -
ఎప్పటికప్పుడు వాటిని మించిన బెటర్ మోడళ్ళు మార్కెట్లోకి వస్తుంటాయి కాబట్టి.
విస్కీ కనుక్కున్నవాడు ఎవడో కానీ దానిలో ఒక సుగుణం వుంది. ఒక 'డబుల్' కడుపులో పడగానే సింగిల్ గా వున్న భావన కలుగుతుంది.
ఆడది కళ్ళు  మూసుకుంటే ఆమె మనసుపడే మనిషి కళ్ళల్లో మెదులుతాడు. అదే మగవాడు కళ్ళు మూసుకుంటే అతగాడు కోరుకునేవారి మొహాలతో ఏకంగా ఒక  స్లైడ్ షో మొదలవుతుంది.
ఒక మగవాడి టీ షర్ట్ మీద ఇలా రాసుంది:
ఆడవాళ్ళందరూ రాక్షసులు. కానీ మా  ఆవిడ మాత్రం రాణి (చిన్న అక్షరాలలో) ఆ రాక్షసులందరికీ.
'ఆడవాళ్లకి చెప్పులు అంటే ఎందుకంత మోజు ?
ఎందుకంటె, వాళ్ళు  ఎంతగా లావెక్కినా చెప్పులు మాత్రం సైజు మార్చక్కరలేకుండా కరెక్టుగా సరిపోతాయి'
'ఆడవాళ్ళు సరిగా కారు నడపలేరు అనే అపప్రధ వుంది.  నిజమేనా?
'వాళ్ళు మాత్రం ఏంచేస్తారు. కార్లలో ఎటూ చూసినా అద్దాలేనాయే! ఇక వారికి  డ్రైవింగ్ మీద ధ్యాస నిలబడాలంటే కష్టం  కదా!'  
'ఆత్మహత్య చేసుకోవాలని నదిలో దూకబోతున్న ఆడమనిషిని కాపాడడం ఎలా?
'దగ్గరలో వున్న చీరెల షాపులో తొంభయ్  శాతం సేల్ నడుస్తోందని గట్టిగా అరిచి చెప్పాలి'
'మగవాళ్ళందరూ ఒకే మోస్తరు. ఏం తేడా లేదు' అనే స్త్రీ ఎవరయి వుంటుంది?'
'మగవాళ్ళ గుంపులో తప్పిపోయిన మొగుడ్ని వెతుక్కునే చైనా అమ్మడు అయివుంటుంది'
కొందరు మగవాళ్ళు బ్రహ్మచారులుగా వుండిపోయి ప్రపంచంలో  జరిగే వింతలన్నింటినీ గమనిస్తుంటారు.  మరి కొందరు మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఇంట్లో జరిగేవాటిని వింతగా చూస్తుంటారు.
'ఏమో అనుకుంటాము కానీ గురూ గారూ ఈ ఆడాళ్ళున్నారే, మహా జాదూలు గురూ గారు?'
'ఎందుకలా అనిపించింది'
'మా ఆవిడతో ఏదైనా మాటలు మొదలు పెడతానా! విషయం ఏదైనా కానీండి. నాకు తెలీకుండానే దాన్ని వాదులాటలోకి మార్చేస్తుంది'

'మగవారితో పోలిస్తే ఆడవాళ్ళు మంచి, చక్కటి, ఆహ్లాదకరమైన, జీవితాన్ని చాలాకాలం అనుభవించగలరు ఎందుకంటారు.?'
'ఎందుకేమిటి మీ మొహం నా శ్రాద్ధం - వారికి 'భార్యలు' వుండరు కాబట్టి'


  (రవి జీడిగుంట వారి సౌజన్యంతో)