30, సెప్టెంబర్ 2014, మంగళవారం

విభజన పూర్తికాలేదా!


ఈ ఏడాది జూన్ రెండో తేదీన మునుపటి ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది. ఇది చారిత్రిక సత్యం.

నిన్నటికి నిన్న ఆసియా క్రీడల్లో టెన్నిస్ విభాగంలో జరిగిన మిక్సడ్ డబుల్స్ లో భారత జోడీ సానియా మీర్జా, సాకేత్ మైనేని కలిసి మన దేశం ఖాతాలో మరో స్వర్ణ పతకాన్ని చేర్చారు. సానియా మీర్జా తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్. సాకేత్ విశాఖ కుర్రవాడు. వీరిద్దరూ కలిసి సాధించిన విజయం పట్ల యావత్ దేశప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన నాయకులు మాత్రం వారిని ఆంద్ర, తెలంగాణాలకు చెందినవారిగా గుర్తించి విడివిడిగా అభినందనలు తెలియచేస్తున్నారు. నగదు బహుమతులు, వేరే పురస్కారాలు అంటే అర్ధం చేసుకోవచ్చు, ఆంద్ర తెలంగాణా తేడా లేకుండా వారిద్దరూ కలిసి శ్రమించి సాధించిన విజయాన్ని 'ప్రశంసించడం'లో అడ్డొచ్చిన అడ్డుగోడలు ఏమిటో అర్ధం కాదు. నిజంగా అయాం సారీ ఫర్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్! 

      

29, సెప్టెంబర్ 2014, సోమవారం

కాపీ జోకులు



'రాత్రి రైల్లో నిద్ర పట్టక చాలా అవస్థ  పడ్డాను' ఏకాంబరం చెప్పాడు.
'ఎందుకని'
'ఖర్మ! పై బర్త్ దొరికింది'
'కింద పడుకున్నవాళ్ళని అడక్కపోయావా?'
'ఆ మాత్రం నాకు తెలియదని అనుకున్నావా! అడగడానికి కింద బర్తుల్లో ఎవరయినా వుంటే కదా! రైలంతా ఖాళీ!'

'ఏకాంబరం! నీ భార్య చనిపోయింది'
ఆ కబురు విన్న అతడికి  మతి పోయింది. భార్య లేని జీవితం వృధా అనిపించింది. వెంటనే తనుంటున్న భవనం వందో అంతస్తుకి వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకాడు.
యాభయ్యో అంతస్తు దగ్గరికి రాగానే అతడికి తనకు పెళ్ళే కాలేదన్న సంగతి గుర్తుకు వచ్చింది.
పాతిక అంతస్తు దగ్గర మరో దారుణమైన విషయం గుర్తుకు వచ్చింది. తాను ఏకాంబరం కాదని, తనపేరు లంబోదరం అని. ఏం లాభం. అప్పటికే ఆలస్యం అయిపోయింది.  

హోటల్లో ఆర్డర్ చేస్తున్నప్పుడు ఏకాంబరం తలలో మెరుపు మెరిసింది. వెంటనే పరిగెత్తుకుంటూ లంబోదరం దగ్గరికి వెళ్ళాడు. అతడికి ఆరోజు గాలిలో తేలిపోతున్నట్టు వుంది. తన స్నేహితులెవరు  జవాబు చెప్పలేని ఓ చిక్కు ప్రశ్నకు సమాధానం తనకే ముందు తట్టింది.
'గుడ్డు ముందా చికెన్  ముందా అని అడుగుతుండేవాడివి కదా. ఇప్పుడు చెబుతాను చూడు. హోటల్ కు వెళ్లి ముందు ఏది ఆర్డర్ చేస్తే అది ముందు వస్తుంది'   

ఏకాంబరం భార్యను తీసుకుని హోటల్ కు వెళ్ళాడు. భార్య కాఫీ ఆర్డర్ చేసింది. తను కోల్డ్ కాఫీ తెప్పించుకున్నాడు. 'కాఫీ చల్లారి పోతుంది త్వరగా తాగమ'ని భార్యను తొందర చేసాడు. ఎందుకంటె ఆ హోటల్లో హాట్ కాఫీ అయిదు రూపాయలు. కోల్డ్ కాఫీ పది రూపాయలు. 


ఏకాంబరం ఆర్ట్ గ్యాలరీ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఓ బొమ్మ అతడికి యెంత మాత్రం నచ్చలేదు. 'ఇలాటి దరిద్రపు బొమ్మ పెట్టి,  పైగా మోడరన్ ఆర్ట్ అంటూ పబ్లిసిటీ ఒకటీ...'
అంటూ చిందులు తొక్కాడు.
'అయ్యా అది బొమ్మకాదు. ముందు, ఆ అద్దం ఎదట నుంచి బయటకు రండి' ఎవరో అన్నారు.


(స్వేచ్చానువాదం ఒక్కటే సొంతం) 

NOTE:COURTESY IMAGE OWNER


26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

పిపీలికం


అధికారం, హోదా, చదువు, డబ్బు, బ్యాంక్ బాలన్సులు ఇవి వ్యక్తుల స్తితిగతులకు కొలమానాలు కావచ్చు. కానీ అవేవీ వారిని ఈ ప్రపంచంలో పెద్దవారిని చేయలేవు. నిజానికి మనం యెంత చిన్నవాళ్ళమో, ఒకరకంగా చెప్పాలంటే పిపీలికాలమో తెలుసుకోవడానికి ఓ చిన్న చిట్కా వుంది. ఆకాశం నిర్మలంగా వున్న రాత్రి డాబా మీద వెల్లకిలా పండుకుని పైకి చూడండి. వేల కోట్ల మైళ్ళ దూరంలో వున్న నక్షత్రాలు మిణుకుమిణుకు మంటూ కానవస్తాయి. వాస్తవానికి అవి యెంత పెద్దవో ఈరోజుల్లో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధికి కూడా తెలుసు. 


గగనాంతర రోదసిలో, అనంత  నక్షత్ర రాశుల నడుమ,  మనం వున్న ఈ సమస్త భూ మండలమే ఓ పిపీలికం. ఆ భూమండలంలోని ఒక దేశంలో, ఆ దేశంలోని ఓ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలోని ఓ నగరంలో, ఆ నగరంలోని ఓ ప్రాంతంలో, ఆ ప్రాంతంలోని ఓ నివాసంలో, ఆ నివాసంలోని డాబాపై పడుకుని పైకి చూస్తున్న మనం  పిపీలికాలమా, లేక అంత కంటే చిన్నవాళ్ళమా?

NOTE: COURTESY IMAGE OWNER

25, సెప్టెంబర్ 2014, గురువారం

అచ్చంగా మగవారికి మాత్రమె!


(ఇంకో 'మాత్రమే' ఏమిటంటే 'ఇది' కేవలం అనువాదం మాత్రమే!)
భార్య: ఏవిటి ఆఫీసు నుంచి పెందలాడే దిగడ్డారు?
భర్త: మా బాసుకి నా మీద కోపం వచ్చింది. గో టు హెల్ అన్నాడు. అంతే! ఇంటికొచ్చేసా!
డాక్టర్: మీ తలనొప్పి ఏమైంది ?
పేషెంటు: నిన్ననే పుట్టింటికి వెళ్ళింది.

మనిషికి నాలుగింటితో అసలు  తృప్తి అనేదే  వుండదు ఒకటి సెల్ ఫోన్, రెండోది కారు, మూడోది టీవీ, నాలుగోది భార్య
ఎందుకంటె -
ఎప్పటికప్పుడు వాటిని మించిన బెటర్ మోడళ్ళు మార్కెట్లోకి వస్తుంటాయి కాబట్టి.
విస్కీ కనుక్కున్నవాడు ఎవడో కానీ దానిలో ఒక సుగుణం వుంది. ఒక 'డబుల్' కడుపులో పడగానే సింగిల్ గా వున్న భావన కలుగుతుంది.
ఆడది కళ్ళు  మూసుకుంటే ఆమె మనసుపడే మనిషి కళ్ళల్లో మెదులుతాడు. అదే మగవాడు కళ్ళు మూసుకుంటే అతగాడు కోరుకునేవారి మొహాలతో ఏకంగా ఒక  స్లైడ్ షో మొదలవుతుంది.
ఒక మగవాడి టీ షర్ట్ మీద ఇలా రాసుంది:
ఆడవాళ్ళందరూ రాక్షసులు. కానీ మా  ఆవిడ మాత్రం రాణి (చిన్న అక్షరాలలో) ఆ రాక్షసులందరికీ.
'ఆడవాళ్లకి చెప్పులు అంటే ఎందుకంత మోజు ?
ఎందుకంటె, వాళ్ళు  ఎంతగా లావెక్కినా చెప్పులు మాత్రం సైజు మార్చక్కరలేకుండా కరెక్టుగా సరిపోతాయి'
'ఆడవాళ్ళు సరిగా కారు నడపలేరు అనే అపప్రధ వుంది.  నిజమేనా?
'వాళ్ళు మాత్రం ఏంచేస్తారు. కార్లలో ఎటూ చూసినా అద్దాలేనాయే! ఇక వారికి  డ్రైవింగ్ మీద ధ్యాస నిలబడాలంటే కష్టం  కదా!'  
'ఆత్మహత్య చేసుకోవాలని నదిలో దూకబోతున్న ఆడమనిషిని కాపాడడం ఎలా?
'దగ్గరలో వున్న చీరెల షాపులో తొంభయ్  శాతం సేల్ నడుస్తోందని గట్టిగా అరిచి చెప్పాలి'
'మగవాళ్ళందరూ ఒకే మోస్తరు. ఏం తేడా లేదు' అనే స్త్రీ ఎవరయి వుంటుంది?'
'మగవాళ్ళ గుంపులో తప్పిపోయిన మొగుడ్ని వెతుక్కునే చైనా అమ్మడు అయివుంటుంది'
కొందరు మగవాళ్ళు బ్రహ్మచారులుగా వుండిపోయి ప్రపంచంలో  జరిగే వింతలన్నింటినీ గమనిస్తుంటారు.  మరి కొందరు మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఇంట్లో జరిగేవాటిని వింతగా చూస్తుంటారు.
'ఏమో అనుకుంటాము కానీ గురూ గారూ ఈ ఆడాళ్ళున్నారే, మహా జాదూలు గురూ గారు?'
'ఎందుకలా అనిపించింది'
'మా ఆవిడతో ఏదైనా మాటలు మొదలు పెడతానా! విషయం ఏదైనా కానీండి. నాకు తెలీకుండానే దాన్ని వాదులాటలోకి మార్చేస్తుంది'

'మగవారితో పోలిస్తే ఆడవాళ్ళు మంచి, చక్కటి, ఆహ్లాదకరమైన, జీవితాన్ని చాలాకాలం అనుభవించగలరు ఎందుకంటారు.?'
'ఎందుకేమిటి మీ మొహం నా శ్రాద్ధం - వారికి 'భార్యలు' వుండరు కాబట్టి'


  (రవి జీడిగుంట వారి సౌజన్యంతో)

అంగారక విజయం


"గ్రహరాశులనధిగమించి
ఘనతారల పథము నుంచి
గగనాంతర రోదసిలో...
గంధర్వగోళ తతుల దాటి
చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా ............"
చాలాకాలం క్రితం వచ్చిన బాల భారతం సినిమాకోసం ఆరుద్ర రచించిన గీతం - 'మానవుడు తలచుకుంటే ఆకాశానికి కూడా నిచ్చెన వేయగలడు' అనే రీతిలో సాగిపోయే పాట  మళ్ళీ ఈనాడు స్పురణకు వస్తోంది.
దీనికి నేపధ్యం అంతరిక్ష పరిశోధనారంగంలో భారత్ తాజాగా సాధించిన అపూర్వ విజయం.
2014 సెప్టెంబర్ 24. ఉదయం ఏడుగంటలు. బెంగుళూరులో భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ 'ఇస్రో' కు చెందిన మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ భవనం.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా అంతా ఎంతో ఆసక్తిగా, అంతకుమించి ఆదుర్దాగా ఎదురు చూస్తున్న సమయం.
'అనుకున్నది అనుకున్నట్టు జరిగితే బాగుంటుంది' అందరి మదిలో మెదులుతున్న ఆకాంక్ష.
'అలా జరుగుతుందా?' ఎక్కడో ఓ మూల కదలాడుతున్న సందేహం.
సరిగ్గా ఏడుగంటల యాభయ్ తొమ్మిది నిమిషాలకు వీటన్నిటికీ  తెర పడింది. అంగారక గ్రహం  పరిశోధనల నిమిత్తం ఇస్రో  పది మాసాల క్రితం ప్రయోగించిన ఉపగ్రహం - మార్స్ ఆర్బిటర్ మిషన్' (మామ్), కొన్ని కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేసి, అత్యంత క్లిష్టమైన సమస్యలను అధిగమించి, ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో మొదటి ప్రయత్నంలోనే  అంగారక కక్ష్యలోకి ప్రవేశించచడంతో అక్కడ ఉన్నవారందరూ సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఇస్రో డైరెక్టర్ రాధాకృష్ణన్ ని, ప్రధాని ఆలింగనం చేసుకుని మనసారా అభినందించారు. 'ఇస్రో సాధించిన ఈ విజయం అసామాన్యమైనది. ఈ రంగంలో మన దేశం సత్తాను, శక్తి సామర్ధ్యాలను ఇస్రో ప్రపంచానికి చాటి చెప్పింది' అని ప్రధాని ప్రసంశల జల్లు కురిపించారు. అమెరికాకు కూడా తొలి ప్రయత్నంలో అలవికాని ఈ  బృహత్తర కార్యాన్ని సాధించి - ప్రధాని హోదాలో తొలిసారి అమెరికా గడ్డపై అడుగిడుతున్న మోడీకి, ఒకరోజు ముందుగా ఇస్రో అందించిన కానుకగా ఆయన భావించారేమో తెలియదు. కాని ప్రధాని ఈ విజయం పట్ల ఎంతగానో పులకరించిపోయినట్టుగా ఆయన మాటలే తెలియచేస్తున్నాయి. 'అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగారు మన శాస్త్రవేత్తలు. వారందరికీ వందనాలు' అంటూ ధన్యవాదాలు తెలిపారు. 'ఈరోజు దేశంలోని ప్రతి పాఠశాలలో విద్యార్ధులను సమావేశ పరచి మన దేశం సాధించిన ఈ ఘన విజయాన్ని వారి చప్పట్ల నడుమ ప్రకటించాలి' అని అన్నారంటే ఇస్రో సాధించిన విజయం పట్ల ఆయన ఎంతగా పులకితులయిందీ అర్ధం చేసుకోవచ్చు. 

  
ఈ విజయానికి ఇంతటి ప్రాముఖ్యత రావడానికి కారణం లేకపోలేదు. రోదసీ పరిశోధనల్లో దూసుకు పోతున్న ఏ దేశం కూడా  మొదటి ప్రయత్నంలో అంగారకుడి కక్ష్యలో ప్రవేశించలేదు. అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్ సయితం అనేక విఫలయత్నాల తరువాతనే అరుణ గ్రహం కక్ష్యలోకి తమ ఉపగ్రహాలను ప్రవేశ పెట్టగలిగాయి. ఇక, చైనా, జపాన్ లకు ఇంతవరకు ఇది సాధ్యపడనే లేదు. తీరని కలగానే మిగిలిపోయింది.
ఈ అనంత కాల విశ్వంలో సెకనుకు కొన్ని వేల మైళ్ళ వేగంతో ముందుకు దూసుకుపోయే ఉపగ్రహాన్ని, కొన్ని మాసాల అనంతరం, నిర్దేశించిన మార్గంలో దారి మళ్లించడమే గగనం. అంతేటే కాదు, ఈ సుదీర్ఘ ప్రయాణం ముగియవచ్చే సమయంలో ఒక విషమ పరీక్షను తట్టుకోవాల్సి వుంటుంది. చైనా, జపాన్ దేశాలు ఈ తుది పరీక్షలోనే నెగ్గలేక బొక్కబోర్లా పడ్డాయి. దాదాపు అరవై కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం సాగాక, ఇంకా అక్కడికి కొన్ని వేల మైళ్ళ దూరంలో వున్న అంగారకుని కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టడానికి దాని వేగాన్ని అత్యంత తక్కువ స్థాయికి తగ్గించాల్సివుంటుంది. ఇందుకోసం 'మామ్' లో పదిమాసాలుగా నిద్రాణంగా భద్రపరచిన ఇంధనాన్ని తగుస్థాయిలో మండించాల్సిన  ప్రక్రియ బహు సంక్లిష్టమైనది. ఇందు  నిమిత్తం ఒక రోజు ముందుగానే ప్రయోగాత్మకంగా  ఆ ఇంధనాన్ని కొన్ని సెకన్ల పాటు మండించి చూసిన  ఇస్రో  శాస్త్రవేత్తలు సెమీ ఫైనల్స్ దాటగలిగారు. అయితే  అసలు ముహూర్తం వేళకు ఆ  ఇంధనాన్ని దాదాపు ఇరవై మూడు నిమిషాల కొన్ని సెకన్ల పాటు అటు  ఎక్కువా ఇటు తక్కువా కాకుండా మండించగలిగితేనే, అంగారకుడి కక్ష్యలో ఖచ్చితంగా ప్రవేశించగలిగే వేగనియంత్రణ వీలుపడుతుంది. అంటే అప్పటి వరకు  సెకనుకు 22.1 కిలో మీటర్ల (గంటకు అక్షరాలా డెబ్బయ్ తొమ్మిదివేల అయిదువందల అరవై కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తున్న 'మామ్' ఉపగ్రహ వేగాన్ని  సెకనుకు  4.4 కిలోమీటర్లకు తగ్గించగలగాలి. లేని పక్షంలో మొత్తం వ్యవహారం  బూడిదలో పోసిన పన్నీరు చందమే. బుధవారం ఉదయం ఇస్రో సాదించిన విజయం అదే. దాటిన మైలురాయి అదే. అందుకే అన్ని జయ జయ ధ్వానాలు.  హర్షధ్వానాల జల్లులు, అభినందనల వెల్లువలు.
భారత్ సాధించిన ఈ ఘన విజయంలో మరికొన్ని పార్శాలు వున్నాయి. ఈ ప్రయోగం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో సాధించింది. పెట్టిన ఖర్చు కూడా మిగిలిన దేశాలతో పోలిస్తే బహు తక్కువ. ప్రధానమంత్రి మోడీ స్వయంగా చెప్పినట్టు,  రోదసీ పరిశోధనల నేపధ్యంలో తీసిన హాలీవుడ్ చిత్రం -  'గ్రావిటీ'  నిర్మాణ వ్యయం ఆరు వందల  కోట్లు కాగా 'మామ్' ప్రయోగ వ్యయం కేవలం నాలుగు వందల యాభయ్ కోట్లే. పోతే, అమెరికా ప్రయోగించిన అంగారక పరిశోధన ఉపగ్రహం, 'మావెన్' పై పెట్టిన ఖర్చులో పదో వంతు  కూడా లేదు. భారత్ ప్రయోగించిన 'మామ్' ఉపగ్రహం ప్రయాణించిన కోట్లాది కిలోమీటర్ల దూరాన్ని గమనంలో వుంచుకుంటే, ప్రతి కిలోమీటరుకు వెచ్చించిన డబ్బు,  హైదరాబాదులో మీటరు మీద వచ్చే ఆటో రేటుకంటే తక్కువ పడుతుందని సోషల్ మీడియాలో  కొందరు లెక్కలు కడుతున్నారు.                         
పోతే, దేశాలన్నీ ముక్తకంఠంతో భారత్ సాధించిన విజయానికి జేజేలు పలికాయి. చైనా కూడా ఈ విజయం ఆసియాఖండపు  విజయంగా అభివర్ణించింది.
'విజయం సరే. అభినందనలు సరే. పేద దేశం అయిన భారత దేశానికి అంగారక గ్రహం గురించిన  పరిశోధనలుల వల్ల వొనగూడే ప్రయోజనం ఏమిటి?' అని మెటికలు విరిచేవాళ్ళు లేకపోలేదు.
వారికి సమాధానం ఒక్కటే.
శాస్త్రీయ పరిశోధనలను మిగిలిన పరిశోధనల సరసన చేర్చి మదింపు చేయడం సరికాదు. అన్నింటినీ   అణాపైసల లెక్కన  చూడకూడదు. మొదటిసారి అమెరికా వ్యోమగామి ఆర్మ్ స్ట్రాంగ్  చంద్రుడిపై కాలుమోపిన  ఏడాదే మనదేశంలో ఇస్రో తన కార్యకలాపాలను ఓ మోస్తరు స్థాయిలో మొదలుపెట్టింది. అంచెలంచెలుగా ఎదుగుతూ, ఇతర దేశాల ఉపగ్రహాలను వాణిజ్య ప్రాతిపదికపై రోదసిలో ప్రవేశ పెట్టగల స్థాయికి చేరుకుంది. ఇదంతా ఎవరిమీదా ఆధారపడకుండా, కేవలం స్వదేశీ పరిజ్ఞానంతో సాధించుకున్న ఆస్తి. బుధవారం నాటి విజయంతో భారత దేశం,  ఈ రంగంలో ముందున్న అన్ని అగ్ర దేశాలను దాటుకుని ఒక అడుగు ముందుకు వెళ్ళగలిగింది. ఇదొక రికార్డు అయితే,
దశాబ్దాల క్రితం, ఇస్రో జరిపిన మొదటి ప్రయోగం గురించి  ప్రజలు మరునాడు మాత్రమె పత్రికల్లో  చదివి తెలుసుకోగలిగారు. అదే, ఈనాడు 'అంగారక విజయయాత్ర'ను ఇళ్ళల్లో కూర్చుని టీవీల్లో  కళ్ళారా వీక్షించగలిగారు. సెల్ ఫోన్ల ద్వారా తమ ఆనందాన్ని తమవారితో పంచుకోగలిగారు. వీటన్నిటి వెనుకా 'ఇస్రో' పాత్ర ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే.
అందుకే 'ఇస్రో' సాధించిన ఇలాటి విజయాలను జనం తమ సొంతం చేసుకుంటున్నారు.
ఇస్రో తలపెట్టిన  'మంగళయాన్' మనదేశానికి మంగళప్రదం కావాలనీ, భవిష్యత్తులో ప్రపంచం గర్వించే మరికొన్ని విజయాలను మూటగట్టుకోవాలనీ  మనసారా కోరుకుందాం. (25-09-2014)

24, సెప్టెంబర్ 2014, బుధవారం

చుక్కల్ని దాటుకు వెళ్ళిన భారత రోదసీ ప్రతిభ


"గ్రహరాశులనధిగమించి
ఘనతారల పథము నుంచి
గగనాంతర రోదసిలో...
గంధర్వగోళ తతుల దాటి
చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా ............"
చాలాకాలం క్రితం వచ్చిన బాల భారతం సినిమాకోసం ఆరుద్ర రచించిన గీతం మళ్ళీ స్పురణకు వస్తోంది.
'మానవుడు తలచుకుంటే ఆకాశానికి కూడా నిచ్చెన వేయగలడు' అనే రీతిలో సాగిపోయే పాట ఇది.



సరిగ్గా ఇదే చేసిచూపారు భారత రోదసీ సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు. ఇంతవరకు ఏ దేశానికీ సాధ్యం కాని పనిచేసి చూపెట్టారు. పది నెలలుగా రోదసిలో ప్రయాణిస్తున్న  భారతీయ ఉపగ్రహాన్ని, కోట్ల కిలోమీటర్ల దూరంలో  అంగారకుడి కక్ష్యలో మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా ప్రవేశపెట్టి, సంక్లిష్ట రోదసీ పరిశోధనల్లో మనదేశం  ఎవరికీ తీసికట్టు కాదని సగర్వంగా నిరూపించారు.

భారతీయులందరూ  మనః పూర్వకంగా సగౌరవంగా ఇస్రో శాస్త్రవేత్తలకు 'సాల్యూట్' చేయాల్సిన  శుభ సందర్భం ఇది.

NOTE: COURTESY IMAGE OWNER 

23, సెప్టెంబర్ 2014, మంగళవారం

జెట్ లాగ్ కోడి


మా వాచ్ మన్ కొండల రావుకి ఇద్దరు పిల్లలు. పండక్కి వాళ్ళ వూరు వెళ్లినప్పుడు వస్తూ వస్తూ ఇంకో 'పిల్లాడిని' వెంటబెట్టుకొచ్చాడు. పల్లెటూళ్ళో వేళపట్టున కూతబెట్టే ఆ కోడి పుంజు  నిద్ర ఎరుగని నగరంలో ఓ వేళాపాళా లేకుండా కూతపెడుతూ వుంటుంది. బహుశా జెట్ లాగ్ అయివుండవచ్చు. నాకు మాత్రం అది ఎన్నిసార్లు కూసినా మళ్ళీ ఓమారు కూస్తే బాగుండు అనిపిస్తుంది.