12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

9/11



ఈ రెండంకెలు అమెరికన్ ప్రజల మనస్సులో ఎంత బలంగా నాటుకు పోయాయంటే పదమూడేళ్ళు  గడిచిన తరువాత కూడా సెప్టెంబర్ 11 వ తేదీన జరిగిన ఘోర సంఘటనను వారెవ్వరూ మరచిపోలేకుండా వున్నారు. న్యూ యార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలు ఉగ్రవాదుల వైమానిక దాడికి గురయి పేకమేడల్లా కూలిపోతున్న దృశ్యాలు ప్రతి అమెరికన్ మదిలో కళ్ళకు కట్టినట్టు కదలాడుతూనే వుండి వుండాలి.



ఈ దాడి జరిగి నిన్నటికి పదమూడేళ్ళు గడిచాయి. ఇందులో ప్రాణాలు కోల్పోయిన దాదాపు మూడువేలమంది తాలూకు కుటుంబ సభ్యులు ఆ దుఖం నుంచి, ఆ దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకున్నట్టు కనబడదు. అలాగే, అమెరికన్ అగ్రరాజ్య అభిజాత్య అహంకార పూరిత చర్యల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక వేలమంది ఇన్నేళ్ళుగా ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. వారి కుటుంబాల పరిస్తితి ఇదే. ఇదంతా ఎందుకోసం, ఇంత మారణ హోమం ఎవరికోసం అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకదు. మానవ జాతిని పీడిస్తున్న పెను విషాదాల్లో ఇదొకటి.

తన అధికారానికీ, తన పెత్తనానికీ ఎదురులేదని విర్రవీగే అమెరికన్ పాలకులకు 2001 దాడితో తగిలిన తొలిదెబ్బతో తల బొప్పికట్టింది. ఇన్నాళ్ళుగా తన స్వార్ధ ప్రయోజనాలకోసం పెంచి పోషిస్తూ వచ్చిన ఉగ్రవాద భూతం కోరలు సాచి తననే కబళించడానికి వచ్చిన తరువాత కానీ అగ్రరాజ్యానికి కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. ఈ దారుణ అవమానం నుంచి బయటపడేందుకు 9/11 దాడి సృష్టికర్త ఒసామా బిన్ లాడెన్ ను, వెంటాడి, వేటాడి మట్టు పెట్టేంతవరకు అగ్ర రాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ప్రతీకారేచ్చలతో అట్టుడికి పోతున్న రెండు వైరి వర్గాల మధ్య పోరు నిరంతరంగా కొనసాగుతోంది. సిరియా కేంద్రంగా పనిచేస్తున్న 'ఇసిస్' ఉగ్రవాదాన్ని కూకటివేళ్ళతో పెకలించి వేస్తాం అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పినట్టు పత్రికల్లో వచ్చిన వార్తలు దీనికి అద్దం పడుతున్నాయి. 'అమెరికాకు హాని తలపెట్టేవాడి ప్రపంచంలో ఎక్కడా సురక్షిత ప్రాంతం వుండదు. ఇదే నా పాలన మూలసూత్రం' అని హెచ్చరిక చేయడం ఈ విషయంలో ఆయన యెంత పట్టుదలతో ఉన్నారో అన్న సంగతి తెలియచేస్తుంది. సెప్టెంబర్ పదకొండో తేదీనే ఒబామా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికాకు చెందినా ఇద్దరు జర్నలిష్టులను ఇస్లాం ఉగ్రవాదులు తలనరికి దారుణంగా చంపివేసిన సంఘటన నేపధ్యంలో ఈ ప్రకటన వెలువడింది. అయితే ఉగ్రవాదాన్ని మట్టుబెట్టే ప్రయత్నంలో అమెరికా, అమెరికాను ఉగ్రవాద చర్యలతోనే నిలువరించే దిశగా 'ఇసిస్' , వీటిమధ్య జరిగే పోరులో ఇతర ప్రపంచదేశాలకు నిష్కారణంగా జరుగుతున్న కీడు గురించి ఆలోచించే తీరిక ఎవరికీ వున్నట్టు లేదు.

సెప్టెంబర్ 11 దాడి గురించి మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. దీనికి కారణభూతుడయిన ఒక వ్యక్తి మాత్రం చరిత్ర పుటల్లో కనుమరుగయి పోయాడు. అతడి పేరు మహమ్మద్ అత్తా.

2001, సెప్టెంబర్, 11 వ తేదీన హైజాక్ చేసిన ఓ అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని నడుపుతూ, మన్ హటన్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లో ఒకటయిన ఆకాశ హర్మ్యాన్ని దానితోనే  డీకొట్టి కూల్చివేసి, నేలమట్టం చేసిన ఉగ్రవాది పేరే మహమ్మద్ అత్తా.

అత్తా పుట్టింది ఈజిప్టులో. తనకు ముప్పయ్యేళ్ళు పైబడ్డ తరువాత, ఒక సెప్టెంబర్ మాసంలోనే, అమెరికాకు చెందిన ఒక అద్భుత కట్టడాన్ని కూల్చబోతున్నానన్న సంగతి, బహుశా 1968 సెప్టెంబర్ లోనే పుట్టిన అత్తాకు తెలిసుండదు. 

అత్తా చిన్నప్పటినుంచి మితభాషి. వాళ్ల నాన్న మహమ్మద్ మాటల్లో చెప్పాలంటే జెంటిల్ మన్. తన పనేదో తనది తప్ప ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకునే తత్వం కాదు.

కెయిరో విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కోర్సు చేశాడు. తరువాత జర్మనీ వెళ్లి హాంబర్గ్ లో అర్బన్ ప్లానింగ్ లో డిగ్రీ తీసుకున్నాడు. హాంబర్గ్ జీవితం అతని జీవన గమనాన్నే మార్చివేసింది. అక్కడ అతడికి ఇస్లాం ఉగ్రవాదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి వల్ల ప్రభావితుడై, వారి ప్రోద్బలంతో ఆఫ్ఘనిస్తాన్ చేరుకొని అక్కడ అల్ ఖయిదా శిక్షణా శిబిరంలో చేరాడు. చివరకి, ఒసామా బిన్ లాడెన్ తనకు ఒప్పగించిన కర్తవ్యాన్ని జయప్రదంగా ముగించి ఆ క్రమంలోనే తన జీవితానికి కూడా ముగింపు వాక్యం పలికాడు.

అత్తా మహమ్మద్ గురించిన మరో ఆసక్తికర కధనం అమెరికా మీడియాలో ప్రాచుర్యం పొందింది.

1986 లో అత్తా తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా ఇజ్రాయెల్ లో ఒక బస్సును పేల్చివేసి ఆ దేశపు పోలీసుల చేతికి చిక్కాడు. ఆ తరువాత, 1993 ఓస్లో ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన అధీనంలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టాల్సిన పరిస్తితి వచ్చింది. అయినా, ‘రక్తపు మరకలుఅంటిన ఉగ్రవాద ఖయిదీలను వొదిలిపెట్టడానికి ఆ దేశం ఓ పట్టాన ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు. వారెన్ క్రిష్టఫర్ విదేశాంగ మంత్రి (సెక్రెటరీ ఆఫ్ స్టేట్). ఖయిదీలనందరినీ విడుదలచేయాలని వారు ఇజ్రాయెల్ పై వొత్తిడి తెచ్చారు. దానితో ఇజ్రాయెల్ జైళ్లలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టారు. మహమ్మద్ అత్తా కూడా వారిలో ఒకడు.

చూసే కంటిని బట్టి ప్రపంచం కనబడుతుందంటారు. అందుకే, ఉగ్రవాదుల దృష్టిలో అత్తా ఆత్మ బలిదానం చేసిన అమర వీరుడు. అమెరికా దృష్టిలో కరడుగట్టిన ఉగ్రవాది.

2001 లో దశాబ్దం క్రితం ఈ సంఘటన చోటుచేసుకున్నప్పుడు అమెరికాతో పాటు ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. ఉగ్రవాదం ఎంత భయంకరమయినదో తెలియచెబుతూ, దాన్ని కూకటివేళ్ళతో పెకలించివేయాల్సిన ఆవశ్యకతను గురించి వివిధ దేశాల నాయకులందరూ నొక్కిచెప్పారు. ఈ కర్తవ్య దీక్షకు కట్టుబడివుంటామని వాగ్దానాలు చేశారు. కానీ, ఇన్నేళ్ళ కాలంలో జరిగిందేమిటి? ఉగ్రవాదం మరింతగా జడలు విరబోసుకుని చేస్తున్న కరాళ నృత్యం పదఘట్టనల కింద విశ్వవ్యాప్తంగా అసువులు బాస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే వుంది. ముఖ్యంగా మన దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉగ్రవాద నిర్మూలన అనేది భరించలేని భారంగా మారింది. ప్రజాసంక్షేమానికి ఖర్చుచేయాల్సిన విలువయిన వనరులను భద్రతా చర్యలకు మళ్ళించాల్సి వస్తోంది.

హైదరాబాదులో, ముంబైలో,  ఢిల్లీలో జరిగిన పేలుళ్లు జనంలో పెచ్చరిల్లుతున్న అభద్రతా భావానికి పునాది రాళ్ళుగా మారుతున్నాయి.

ఈ హింస ప్రతి హింసలను నిలుపుచేయడానికి కావాల్సింది కేవలం డంబాలతో కూడిన ప్రకటనలు కాదు. రాజకీయ దృఢ నిశ్చయం. కానీ, ఆధిపత్యపు పోరులో కత్తులు దూసుకునేటప్పుడు విచక్షణ పక్కకు తప్పుకుంటుంది. వివక్ష రెక్కలు తొడుక్కుంటుంది. రక్తం మరిగిన పులి రక్తాన్నే కోరుకుంటుంది. ప్రతీకారంతో రగిలిపోయేవారికి శాంతి వచనాలు చెవికెక్కవు.

చరిత్ర ప్రాముఖ్యం తెలిసిన వారు చరిత్ర నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటారు. చరిత్ర క్రమంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేసుకుని నెమరు వేసుకోవడంతో సరిపుచ్చుకోరు.

11, సెప్టెంబర్ 2014, గురువారం

345678


మూడు, నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది
మూడులక్షల, నలభయ్ ఐదువేల, ఆరువందల డెబ్బయ్ ఎనిమిది.
నేటికి నా బ్లాగు వీక్షకుల సంఖ్య. అంకెలు వరుసగా అమరాయని రాసాను. అంతే!

10, సెప్టెంబర్ 2014, బుధవారం

సిగరెట్లు మానడం యెలా?



‘ఇదేమన్నా బ్రహ్మ విద్యా! నేను చాలాసార్లు మానేశాను’ అనే జోకులు వింటూనే వుంటాము.
చాలా సంవత్సరాల క్రితం అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మ్యాగజైన్ సంపాదక బాధ్యతలు నిర్వహించిన కీర్తిశేషులు శ్రీ పీవీ రావు నాచేత ఈ అంశంపై ఒక వ్యాసం రాయించి పత్రికలో అచ్చు వేయించి ఓ నూటపదహార్లు అనుకుంటాను తాంబూలం కూడా ఇచ్చారు. ఏదయితేనేం అప్పుడా డబ్బులు ఓ వారం పదిరోజులు సిగరెట్ల ఖర్చుకు పనికొచ్చాయి.
సిగరెట్లను సిగరెట్టు మాదిరిగా తాగే మా స్నేహితులు నా గురించి చెప్పుకునేమాట వేరు. ‘శ్రీనివాసరావు సిగరెట్లు తాగడు, తగలేస్తాడు’ అన్నది వాళ్ల థియరీ, ‘హార్లిక్స్ తాగడు తింటాడు’ అనే వాణిజ్య ప్రకటన టైపులో.
సిగరెట్లు అలవాటు కావడానికి నేను చెప్పుకునే కారణం వేరే వుంది. ఇండియాలో వున్నప్పుడు కొని తాగే అలవాటు అలవడని నేను, మాస్కో వెళ్ళేక డబ్బులు తగలేసి మరీ సిగరెట్లు తగలేయడం మొదలు పెట్టాను. దానికి కారణాలు రెండు. ఒకటి మన దగ్గర అతి ఖరీదైన సిగరెట్లు కూడా మాస్కోలో అతి తక్కువ ధరకు దొరకడం. భాష ఎంతమాత్రం  తెలియని  ఆడామగా రష్యన్   సహోద్యోగులతో కాసేపు ‘మాటామంతీ’ లేని కాలక్షేపం చేయడానికి  ఈ సిగరెట్లు చక్కగా  అక్కరకు రావడం. దానాదీనా నా కొనుగోళ్ళు   సిగరెట్ ప్యాకెట్ల నుంచి  ఏకంగా  కార్టన్ల స్థాయికి పెరిగాయి. 2004లో అమెరికా వెళ్ళినప్పుడు  ఒక పెద్ద సూటుకేసు నిండా మా ఆవిడ వూరగాయ పచ్చళ్ళ ప్యాకెట్లతో, మరో పెద్ద సూటుకేసు నిండా సిగరెట్ల ప్యాకెట్లతో దిగబడ్డ మమ్మల్ని చూసి అమెరికా కష్టమ్స్ వాళ్లు నోళ్ళు వెళ్ళబెట్టారు. నా మీద కార్టూన్లు వేసే స్థాయికి నేను జీవితంలో ఎదిగివుంటే అంజయ్య గారి వేలుకు హెలికాఫ్టర్ బొమ్మ ముడివేసినట్టు నా బొమ్మకు చేతిలో సిగరెట్ తగిలించేవాళ్లేమో!


(అలనాటి మా మాస్కో అపార్ట్ మెంట్లో) 

“మరి ఇప్పుడేవిటి ఇలా అయిపోయారు? ‘ఏవి తండ్రీ నాడు విరిసిన  రింగు రింగుల  పొగల మేఘాలు” అని మా స్నేహితులు భారంగా నిట్టూర్పులు విడుస్తుంటారు. నా ఈ దుస్తితికి కారకులు ఎవరయ్యా అంటే నిమ్స్ డైరెక్టర్ గా పనిచేసిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు.
దీనికి ముందు ఓ పిట్ట కధ చెప్పాలి. దూరదర్శన్ విలేకరిగా పనిచేస్తున్న రోజుల్లో  ఓ రోజు తెల్లగా తెలవారక మునుపే, కప్పు కాఫీ కూడా కడుపులో పడకుండానే జూబిలీ హిల్స్ లోని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కెమెరామన్ తో సహా  చేరుకున్నాను. మిగిలిన జాతీయ చానళ్ళ బృందాలు కూడా బిలబిల మంటూ అక్కడికే చేరాయి.  మామూలుగా అయితే బాబుగారి ఇంట్లో  విలేకరులకు రాజభోగాలు. కానీ ఆ రోజు విలేకరులది పిలవని పేరంటం. బీజేపీతో టీడీపీకి ఎన్నికల పొత్తు విషయం గురించి తేల్చడానికి  ఆ రెండు పార్టీల నాయకుల నడుమ  ఎడతెగని చర్చలు లోలోపల సాగుతున్నాయి. బయట ఫుట్ పాత్ మీద నిలబడి కొందరం,  కూలబడి కొందరం పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నాం. ముందు జాగ్రత్త చర్యగా వెంట తెచ్చుకున్న సిగరెట్లను ఒకదాని వెంట మరోటి తగలేస్తూ, తెచ్చుకోని వాళ్లకు ఉదారంగా పంచిపెడుతూ నా మానాన నేను కాలక్షేపం చేస్తుండగా సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. కడుపులో ఎలుకలు. మరో పక్క సిగరెట్ల పొగతో కళ్ళ కలకలు. అలా నిలబడి సిగరెట్ తాగుతూ వున్నవాడ్ని వున్నట్టుండి  స్లో మోషన్ లో కిందకు వొరిగి పోతూ వుండడం వరకే గుర్తు.
కట్ చేస్తే నిమ్స్ ఆసుపత్రిలోని  ప్రత్యేక గదిలో డాక్టర్ల పర్యవేక్షణలో. ఆందోళనగా నా వైపే చూస్తున్న నా భార్య. ఆమెతో పాటు నా ఇద్దరు పిల్లలు. ముఖ్యమంత్రి గారా మజాకా. జరిగిన విషయం  విలేకరుల ద్వారా తెలుసుకుని హుటాహుటిన అంబులెన్స్ తెప్పించి నన్ను నిమ్స్ లో అడ్మిట్ చేయించారట. అందుకే కాబోలు  కాకర్ల వారు కూడా స్వయంగా వచ్చి చూసారు. రిపోర్టులన్నీ తిరగేశారు.  కళ్ళు తిరగడానికి, వొళ్ళు తూలడానికీ నా సిగరెట్లే కారణం అని ఆయన తన అనుభవంతో ఇట్టే కనుక్కున్నారు. ఆ విషయం మా ఆవిడతో చెప్పి, ‘నెమ్మదిగా ఈ అలవాటు మానిపించమ’ని సలహా ఇచ్చారు.  కళ్ళు తెరిచి  ఇదంతా చూస్తూ, చెవులు వొగ్గి ఇదంతా వింటున్న నేను హఠాత్తుగా   ముందుకు వొంగి,  ‘నేను సిగరెట్లు మానేశాను డాక్టర్ గారు’ అని ఒక బహిరంగ ప్రకటన చేసాను. ఆయన విలాసంగా మందహాసం చేసి,  నెత్తి మీది వెంట్రుకలు చేత్తో పట్టి చూపిస్తూ, ‘ఇలాటి వాళ్ళను నా సర్వీసులో  ఇంతమందిని చూసాను’ అంటూ,  ‘అదంత తేలిక కాద’ని ఆయనే చెబుతూ,  నేను తాగే బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్ ఒకటి అప్పటికప్పుడే తెప్పించి మా ఆవిడ చేతిలో పెట్టి,  ‘రాత్రి అందరూ  నిద్ర పోయిన తరువాత నీ మొగుడు  నీ మెదడు కొరుక్కు తింటాడు, ఎందుకయినా మంచి ఇది దగ్గర వుంచుకోమ్మా’ అని వెళ్ళిపోయారు.
అంతే! ఎంతయినా నేనూ పట్టుదల కలిగిన  మనిషిని కదా! ఇంటికి వెళ్ళినప్పటినుంచి ఆ ప్యాకెట్టూ ముట్టుకోలేదు. అప్పటినుంచి సిగరెట్టూ అంటించలేదు.
మరో వింత ఏమిటంటే, ఆనాటి నుంచి  సిగరెట్ తాగాలని కూడా అనిపించలేదు.          

  

9, సెప్టెంబర్ 2014, మంగళవారం

తెలంగాణా ప్రభుత్వ శతదినోత్సవం


వంద రోజుల పాలనకు వంద మార్కులు సాధించడం నిజానికి ఏ పాలకపక్షానికీ సాధ్యం కాదు. కాకపొతే రానున్న కాలంలో సర్కారు నడకతీరును స్థాలీపులాకన్యాయంగా అంచనా వేయడానికి నూర్రోజుల పనితీరు ఒక ప్రాతిపదికగా ఉపకరిస్తుంది.

మంగళవారంతో అంటే ఈనెల తొమ్మిదోతేదీతో ముఖ్యమంత్రి కేసీయార్ నాయకత్వంలో జూన్ రెండో తేదీన ఏర్పడిన నూతన  తెలంగాణా రాష్ట్రం తొలిప్రభుత్వం తన వంద రోజుల పాలన పూర్తిచేసుకుంది. వాస్తవానికి కొత్త రాష్ట్రం తెలంగాణాకు సయితం ఇది వంద రోజుల పండుగే.
కొత్త ప్రభుత్వం ఏర్పాటయిన తొలినాళ్ళనుంచే టీ.ఆర్.యస్.  ప్రత్యర్ధులు, ప్రత్యేకించి  తెలంగాణా టీడీపీ  నాయకులు తమ విమర్శలకు పదును పెడుతూ వచ్చారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీసుకున్నకొన్ని నిర్ణయాలు చర్చనీయాంశాలుగా మారడం వారికి కలిసివచ్చింది. కాంట్రాక్ట్  ఉద్యోగుల సర్వీసులను  ఖాయం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణా విద్యార్దులలోనే అలజడులు రేపింది. అలాగే, రెండు ప్రైవేటు టీవీ ఛానళ్ళ ప్రసారాలను నిలిపివేస్తూ తెలంగాణా కేబులు టీవీ ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయం విషయంలో ప్రభుత్వం కావాలని ఉదాసీన  వైఖరి అవలంబిస్తోందని కొన్ని జర్నలిష్టు సంఘాలు చేస్తున్న విమర్శలు జాతీయ స్థాయిలో  కూడా ప్రకంపనలకు దారితీయడం  కొత్త ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించే విషయమే. ఇక కేసీయార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తిచేసిన ఇంటింటి  సర్వే కూడా  ప్రతికూల పవనాలను సృష్టించింది. కాకపొతే ఈ సర్వే వల్ల సర్వత్రా కొంత ప్రతికూలత కనబడ్డప్పటికీ,  పరిపాలన విషయంలో సర్కారు తీసుకునే నిర్నయాలపట్ల సామాన్య జనాలకున్న భయం భక్తీ  తేటతెల్లం అయ్యాయి. ఈ సర్వే వల్ల సాధించింది ఏవిటన్నది తెలియడానికి కొంతకాలం పట్టవచ్చు. కానీ, రాజకీయ ప్రత్యర్దులపై బాణాలు ఎక్కుపెట్టడానికి కేసీయార్ ఎంతమాత్రం వెనుకాడరన్న అభిప్రాయం కలిగించడంలో ఆయన కృతకృత్యులు కాగలిగారనే చెప్పొచ్చు. కాకపోతే,  ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేకానేక అసాధ్య వాగ్దానాలు నెరవేర్చే విషయంలో కొత్త ప్రభుత్వం వేస్తున్న కప్పదాట్లు ముందు ముందు గుదిబండగా మారే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.    
అయితే, పుష్కర కాలానికి పైగా తెలంగాణా ఉద్యమాన్ని వేడి తగ్గకుండా నిభాయించుకుంటూ వచ్చిన చంద్రశేఖర రావుగారికి ఇలాటి విమర్శలను ఖాతరు చేయకపోవడం కొత్తేమీ కాదు. వీటిని ఆయన తన సహజసిద్ధ ధోరణిలోనే కొట్టిపారవేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. టీ.ఆర్.యస్.  అనే దీపానికి  తెలంగాణావాదం  చమురు లాటిది. ఈ విషయం కేసీయార్ కి పూర్తిగా తెలుసు. తెలంగాణా రావడంతోనే తెలంగాణా వాదానికి విలువ లేకుండా పోయిందనే వాదాన్ని ఆయన విశ్వసించరు. ఆ వాదం కొడిగట్టిపోకుండా  చూసుకోవడం యెంత అవసరమో ఆ ఉద్యమ నాయకుడిగా ఆయనకు మంచి అవగాహన  వుంది.  అందుకే ఆయన చేసే ప్రతి ఆలోచనలో, చేపట్టే ప్రతి కార్యక్రమంలో అది రగులుతూనే ఉండేట్టు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ నిర్ణయమైనా, ఏ పధకం అయినా దాని వెనుక తెలంగాణా స్పూర్తి ఉండేలా చూసుకోవడం కేసీయార్ కి వెన్నతో పెట్టిన విద్య,   
ఆయన తరచుగా మాట్లాడే మాటలను బట్టి ఒక విషయం నిర్ధారణగా అర్ధం అవుతోంది. తెలంగాణా ఏర్పాటు అన్న కల సాకారమైన తరువాత, ఆ కొత్త తెలంగాణాను ఏ రూపంలో ఆవిష్కరించుకోవాలి అనేదానిపై ఒక నిర్దిష్టమైన అవగాహనకు ఆయన వచ్చినట్టు కనబడుతోంది. 'బంగారు తెలంగాణా' అని పదే పదే చెప్పడంలో కొంత రాజకీయ వ్యూహం, ప్రయోజనం ఉన్నప్పటికీ, కొత్త విధానాలు, కొత్త వ్యవస్తతోనే తెలంగాణా భవిష్యత్ చిత్రపఠం తయారుచేయాలన్న తాపత్రయంతోనే కేసీయార్ అడుగులు వేస్తున్నట్టు స్పష్టం అవుతోంది. పాత పద్దతులను అనుసరిస్తూపొతే,  తాను  అనుకున్న అడుగులు అనుకున్నట్టు వేయలేనన్న ఉద్దేశ్యంతోనే, కొంత  ఆలస్యం అయినా కొత్త బాట పట్టడానికే ఆయన కృతనిశ్చయంతో వున్నట్టు ఆయన చేతలు తెలుపుతున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా తోసిరాజని ఇంటింటి సర్వే నిర్వహించిన తీరు, గవర్నర్ ను కలిసి బడ్జెట్ సమావేశాలను అక్టోబర్ వరకు వాయిదా వేయించిన విధానం ఇందుకు అద్దం పడుతున్నాయి. కొంత మొండిగా అనిపించినా ఈ ఆలోచనల్లో హేతుబద్ధత లేకపోలేదు. సవాలక్ష  సమస్యల నేపధ్యంలో తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించింది. కొత్త ఇల్లు సదురుకోవడం ఒక ఎత్తయితే, పాత కాపురం కొనసాగింపుగా మిగిలిన సమస్యలు మరికొన్ని. రాజకీయంగా అస్తిర పరిస్తితులు లేకున్నా, పొంచి వున్న రాజకీయ ప్రత్యర్ధుల ఎత్తుగడల నడుమ,  అత్తెసరు మెజారిటీ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం కత్తి మీద సాము అన్న ఎరుక కలిగిన రాజకీయ దురంధరుడు కేసీయార్. ముందు ముందు ఎలాటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందు చూపుతో, నైతికం అనైతికం  అన్న వాదనలను లెక్కపెట్టకుండా, అన్ని పార్టీలనుంచి స్థానికంగా బలంగా వుండే రాజకీయ నాయకులను టీఆర్ యస్ లోకి రప్పించే అంశానికి ముందు ఆయన పెద్దపీట వేసినట్టు కనబడుతుంది. ఇతర పార్టీలకు చెందిన  అయిదుగురు  ఎమ్మెల్యేలు, పది మంది ఎమ్మెల్సీలు టీఆర్ యస్ తీర్ధం పుచ్చుకునేలా చేయడమే ఇందుకు ఉదాహరణ. అధికారం వుంటే కాని ప్రజాసేవ చేయడం కష్టం అనే అభిప్రాయం పెంచుకుంటున్న రాజకీయ నాయకుల సంఖ్య అన్ని పార్టీల్లో పెరుగుతున్నప్పుడు 'ఆకర్ష్' పధకం అమలుచేయడానికి పెద్ద కష్టపడనక్కరలేదన్న విషయం ఆకళింపు చేసుకున్న రాజకీయవేత్త  కేసీయార్. అందుకే, అధికార పగ్గాలు చేపట్టిన వంద రోజుల్లోనే ఈ జంప్ జిలానీల సంఖ్య ఈ విధంగా పెరుగుతోంది. తమ పార్టీని బలపరచుకోవడం అనేది ఏ పార్టీ అయినా చేస్తుంది. అయితే అవతల పార్టీలను బలహీన పరచడం లేదా నిశ్సేషం  చేయడం ద్వారా తాము బలపడే కొత్త రాజకీయ సంస్కృతి ఇటీవలి కాలంలో బలంగా వేళ్ళూనుకుంటోంది. 'కాంగ్రెస్ రహిత భారతం' అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన నినాదంలో దాగున్న నిజం ఇదే. కాబట్టి, అందరూ చేస్తున్నది అదే అయినప్పుడు, 'పదుగురాడుమాట పాడియై ధరజెల్లు'  అన్న వేమన  సూక్తికి తగ్గట్టే ఈ పార్టీ మార్పిళ్లు నిస్సిగ్గుగా జరిగిపోతున్నాయి.                                
ఇక వంద రోజుల పాలనలో మంచి చెడులను బేరీజు వేయాల్సివస్తే -
నిజానికి ఏ కోణంలోనుంచి చూసినా,  ఏ కొలమానంతో  ఆలోచించినా,  ఇలా వందరోజుల పాలనపై అంచనాలకు రావడం అంత మంచిపద్ధతి కాదు. అయిదేళ్ళు పరిపాలించమని ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు,  నూరు రోజుల్లో ఏమి సాధించారో చెప్పాలని  ఆయా  ప్రభుత్వాలను నిలదీయడంలో హేతువు  కనిపించదు. సాధారణ పరిస్తితుల్లో ఈ బేరీజు వ్యవహారాన్ని  కొంత అర్ధం చేసుకోవచ్చు. కానీ ఈ సారి అలాకాదు. రాష్ట్రం రెండుగా విడిపోయింది. విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. అధికారులు ఎవ్వరో తెలియదు. ఏది మిగులు, ఏది తరుగు  అన్న విషయాల్లో సరయిన అంచనాలు లేవు. వాటిని గురించి చెప్పేవారు లేరు. ఈ నేపధ్యంలో కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికి మామూలుగా పట్టే సమయం కంటే మరికొంత వ్యవధానం అవసరమవుతుంది. అయినా వంద రోజుల్లో నూటొక్క నిర్ణయాలు తీసుకున్నట్టు తెలంగాణా సర్కారు చెబుతోంది.  తెలంగాణా సంస్కృతీ పరిరక్షణే ధ్యేయంగా చేపట్టిన గోల్కొండ కోటపై పంద్రాగష్టు పండుగ వంటి అనేక నూతన  కార్యక్రమాలను ఉదహరించింది.   చేయాల్సినవి ఇంకా చాలా వున్నాయంటోంది.  అందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని చెబుతోంది. పిండిని బట్టి రొట్టె కాకుండా,  ఎన్ని రొట్టెలు అవసరమో ముందు  లెక్క తేల్చుకుని ఆ తరువాత యెంత పిండిని  సమీకరించుకోవాలో లెక్కవేసుకుంటామని అంటోంది. సరే సర్కారును ఆ పనిలో ఉండనివ్వండి. కానీ,  ఈ లెక్కలు డొక్కలు తేల్చుకునే క్రమంలో, పాలన కుదురుకోలేదనే నెపంతో  రోజులు వెళ్ళదీసే  ఆలోచన చేయకూడదనే అందరూ కోరుకునేది.

కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కొంత వ్యవధానం ఇవ్వడం  అవసరం.  కానీ విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా చూసుకోవడం కూడా ప్రభుత్వాలకు అంతే అవసరం.   (09--9-2014)

8, సెప్టెంబర్ 2014, సోమవారం

యాభయ్ ఏళ్ళక్రితం హైదరాబాదు - ఓ డాక్టరుగారి జ్ఞాపకాలు - 3


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావు గారిది ఖమ్మం జిల్లా వల్లభి గ్రామం. ఇంగ్లండ్ వెళ్లి పై చదువు చదివి అక్కడే సెటిల్ అయిపోకుండా స్వదేశానికి తిరిగివచ్చి హైదరాబాదు పోస్టింగు అడగకుండా ఎక్కడో ఖమ్మం జిల్లా కొనగట్టునవున్న బూర్గుంపాడుకు ఏరికోరివెళ్ళిన డాక్టర్ ఈయన. పదవీవిరమణ చేసినతరువాత, 108, 104  పధకాలకు రూపకల్పన చేసారు. అలనాటి జీవన విధానాలు ఎలా వుండేవో నేటి తరానికి తెలపడం ఈ వ్యాస పరంపర ఉద్దేశ్యం) 

"మెడిసిన్ చదవడానికి ఖమ్మం నుంచి హైదరాబాదు వచ్చాను. గాంధీ మెడికల్ కాలేజీ.
అనంత్ లాల్  నన్నూ గోపాలరెడ్డిని తన ఇంట్లో వుండమన్నాడు. అనంత్ లాల్, గోపాల్ రెడ్డిది ఇద్దరిదీ ఒకేవూరు. మానుకోటలో చిన్నప్పటినుంచీ కలిసి చదువుకున్నారు. అనంత్ లాల్ చుట్టాలకి బేగంబజారులో ఓ ఇల్లువుంది. మూడో అంతస్తులో  ఆస్బెస్టాస్ రేకులగదిలో ముగ్గురం సర్దుకునేవాళ్ళం. ఒకే ఒక టేబుల్ ఫాన్ వుండేది. కాకపొతే ఆ గది వెలుపల అంతా ఆరుబయలు స్తలం.
ఆ ఏరియా మొత్తం దుకాణాలమయం. ఇరుకిరుకు గొందులు. నానా చెత్తతో రొచ్చురొచ్చుగా వుండేవి. అనంత్ లాల్ రెండో ఏడు పాసయి క్లినికల్ మొదలు పెట్టాడు. మేము వెళ్ళాల్సిన గాంధీ హాస్పిటల్ సికిందరాబాద్ లో వుండేది. బేగంబజారు నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్లు. పొద్దున్నే లేచి సికిందరాబాద్ వెళ్లి మళ్ళీ మధ్యాహ్నానికల్లా థియరీ క్లాసులకోసం హైదరాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీ చేరుకునేవాళ్ళం. మేము రిఫరల్ స్టూడెంట్స్  కావడం వల్ల గదిలోవుండే  చదువుకునేవాళ్ళం. అప్పుడప్పుడూ మాత్రం కాలేజీకి వెళ్లి ప్రాక్టికల్ క్లాసులకు, లెక్చర్స్ కు హాజరవుతూ వుండేవాళ్ళం. ఆబిడ్స్ లో వసంత విహార్ లో భోంచేసేవాళ్ళం. మా తిరుగుడంతా సైకిళ్ళ మీదే. అనంత్ లాల్ ఒక్కడికే ఓ మోటార్ సైకిల్ వుండేది. ఒకరోజు  కింద పెట్టిన నా సైకిల్ ను ఎవరో ఎత్తుకుపోయారు.
అనంత్ లాల్ చుట్టాలు ఎంతో మంచివాళ్ళు. పండగలు పబ్బాలప్పుడు మాకు స్వీట్లు పూరీలు పెడు తుండే వారు.
ఆ ఇంటికింద భాగంలో చాలా దుకాణాలు, లెట్రిన్లు, బాత్ రూములు వుండేవి. పాయిఖానాల లో బొగ్గుపొడి డబ్బాలు పెట్టేవాళ్ళు.  చేతులు కడుక్కోవడానికి ఆ పొడి వాడేవారు. పాత్రలు కడగడానికి కూడా ఆ బొగ్గుపొడే వుపయోగించేవారు. విచిత్రమయిన విషయం  ఏమిటంటే నీళ్ళు లేకుండా కేవలం బొగ్గుపొడే వాడేవాళ్ళు.
సాయంత్రాలప్పుడు, అనంత్ లాల్ మూడ్ కనిపెట్టి గోపాలరెడ్డి అతడి బైక్ అడిగి తీసుకునేవాడు. దానిపై హోటల్ కు వెళ్లి భోంచేసి వచ్చేవాళ్ళం. అనంత్ లాల్ కి సినిమాల పిచ్చి. పాటలంటే చెవికోసుకునేవాడు. అతడి దగ్గర ట్రాన్సిస్టర్ రేడియో వుండేది. అది పెట్టుకుని పాటలు వింటుండేవాళ్ళం. అనంత్ లాల్ కి చిన్నతనంలోనే పెళ్లయింది. అతడూ, సుభాష్ రెడ్డి కలసి కాంతారావు సినిమాలు ఎక్కువగా చూస్తుండే వాళ్ళు.
ఆ రోజుల్లోనే ఒకరోజు అంతా కలసి గండిపేటకు పిక్నిక్ వెళ్ళాం. సరదాగా ఆ రోజంతా గడిపాము. హైదరాబాదుకు గండిపేట నీళ్ళే మంచి నీళ్ళు.
సెకండ్ షో సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఒకసారి టివోలీ టాకీసులో రెండో ఆట చూసి నడిచి బేగం బజారు వచ్చాము. బస్సులూ, రిక్షాలు కాకుండా ఎక్కువగా కాలినడకన తిరగడమే అలవాటు. ఆ రోజుల్లో ఆటోలు బహు తక్కువ" (ఇంకా వుంది)

హైదరాబాదు యాభయ్ ఏళ్ళక్రితం - ఓ డాక్టర్ గారి జ్ఞాపకాలు - 2


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావుగారిది ఖమ్మం జిల్లా వల్లభి గ్రామం. ఇంగ్లండ్ వెళ్లి పై చదువు చదివి అక్కడే సెటిల్ అయిపోకుండా స్వదేశానికి తిరిగివచ్చి హైదరాబాదు పోస్టింగు అడగకుండా ఎక్కడో ఖమ్మం జిల్లా కొనగట్టునవున్న బూర్గుంపాడుకు ఏరికోరివెళ్ళిన డాక్టర్ ఈయన. పదవీవిరమణ చేసినతరువాత, 108, 104  పధకాలకు రూపకల్పన చేసారు)  


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావు) 

"ఖమ్మంలో వున్న సర్కారు దవాఖానాలో ఒకే ఒక్క డాక్టర్ వుండేవాడు. వూరిమొత్తంలో మరో ఇద్దరు క్వాలిఫయిడ్ డాక్టర్లతో పాటు అయిదుగురు ఆర్ ఎం పీలు వుండేవారు. 
వస్తువులు కొనుక్కోవాలన్నా, కోర్టు పనులు పడ్డా, వైద్యం కోసమయినా చుట్టుపక్కల వూళ్లల్లో వుండే మా చుట్టాలు, తెలిసిన వాళ్ళు  ఖమ్మం వస్తుండేవారు. మా ఇల్లు పెద్దది కావడం వల్ల, అల్లా వచ్చినవాళ్ళు నేరుగా మా ఇంట్లో దిగేవాళ్ళు. ఒక్కోసారి రోజుల తరబడి వుండిపోయేవారు. దానికి తోడు  మా నాన్న రాజకీయాల్లో తిరుగుతూ వుండడం వల్ల ఆయన అనుయాయులు, అనుచరులు, నాయకులు ఇంటికి రావడం ఆనవాయితీగా మారింది. రోజూ పదిమందికి తక్కువ కాకుండా ఇంట్లో భోంచేసేవారు. ఇంట్లో పెద్ద పిల్ల వాడిని నేనే. దాంతో ఇంటికి వచ్చే వాళ్ళ పనులు కూడా నేనే చక్కపెట్టాల్సిన పరిస్తితి. అంటే మంచి నీళ్ళు అందించడం, సిగరెట్లు తెచ్చిపెట్టడం, బట్టలు ఇస్త్రీ చేయించడం, పక్కలు వేయించడంవంటి పనులన్నమాట. 
1949 లో నా చెల్లెలు  లలిత   పుట్టింది. కానీ ఎక్కువ కాలం బతక లేదు. మా తాతగారి వూరు కంభంపాడులో 1954 లో చనిపోయింది. జబ్బుతో వున్న మా తాతయ్య భండారు రాఘవరావు గారిని చూడడానికి మా అమ్మ పిల్లలను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళింది. నేను ఖమ్మంలోనే వుండిపోయాను. 
ఆ పల్లెటూళ్ళో ఎందుకో ఒక రోజు వున్నట్టుండి లలితకు వొళ్ళు పెట్లిపోయేలా  బాగా జ్వరం రావడం, కోమాలోకి వెళ్లడం, మరునాడే చనిపోవడం అంతా  గంటల్లో జరిగిపోయింది. మా నాన్న అప్పుడు హైదరాబాదులో వున్నారు. 
లలిత  చనిపోయింది రాత్రిపూట. కబురు అందించడానికి యే సౌకర్యం లేని వూళ్ళో. కొద్ది మైళ్ల దూరంలో వున్న రైలు స్టేషన్ కు మనిషిని పంపించి టెలిగ్రాం ఇప్పించారు. మరునాటి వుదయం అది ఖమ్మం చేరింది.  అది వచ్చినప్పుడు ఇంట్లో నేనొక్కడినే వున్నాను. టెలిగ్రాం ఇంగ్లిష్ లో వుంది. లలిత  ఎక్స్ ఫై ర్డ్  స్టార్ట్ ఇమ్మీడియట్ ట్లీ.  ఎక్స్ ఫైర్డ్ అనే పదానికి అర్ధం తెలియదు. పెద్దవాళ్ళని వాకబు చేస్తే విషయం తెలిసింది. మనసంతా గందరగోళంగావుంది. ఆలోచనలన్నీ లలిత గురించే. ఆ సాయంత్రం నాన్న ఖమ్మం వచ్చారు. ఇద్దరం కలసి  పాసింజరు రైల్లో బోనకల్లు వెళ్ళాము. కాంగ్రెస్ నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణరావుగారి వూరు. మా బంధువు కూడా. విషయం తెలుసుకున్న ఆయన మమ్మల్ని చూడడానికి స్టేషనుకు వచ్చి పరామర్శించారు. పది మైళ్ల  దూరంలో వున్న వత్సవాయి వెళ్ళడానికి అప్పటికప్పుడు ఓ ప్రయివేటు బస్సు ఏర్పాటుచేశారు. వెంట తోడుగా ఒక మనిషిని ఇచ్చారు. తినడానికి భోజనం, చీకటి పడితే ఇబ్బంది అని టార్చ్ లైట్ పట్టుకొచ్చారు. భోజనం ముగించుకుని  బస్సులో వత్సవాయి చేరుకున్నాము. వాన పడుతోంది. చీకటిలోనే నడుచుకుంటూ బయలుదేరాము. బాట సరిగాలేదు. కీచురాళ్ళ చప్పుళ్ళ మధ్య ఆ బురద బాటలో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా అర్ధరాత్రి కంభంపాడు చేరుకున్నాము. ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం. మమ్మల్ని చూడగానే అంతా భోరుమన్నారు. చిన్నారి లలితను తలచుకుంటూ ఒకరి నొకరు సముదాయించుకుంటూ రాత్రి గడిపాము. మర్నాడు తెలతెలవారుతూనే లలితను పాతిపెట్టిన ప్రదేశానికి వెళ్ళాము. ఆమె జ్ఞాపకాలను వెంటబెట్టుకుని ఖమ్మం తిరిగివచ్చేసాము. 

చక్కటి తెలివితేటలు, ఎంతో మంచి భవిష్యత్తు వున్న లలిత  ఎలాటి వైద్య సదుపాయం లభించకుండా అలా కన్ను మూయడం నా మనసును కలచివేసింది. నా చిట్టి చెల్లెలు లలిత  మాదిరిగా ఇంకా ఇలా  ఎంతమంది సరయిన వైద్యం సరయిన సమయంలో దొరక్క చనిపోతున్నారో అన్న దిశగా నాలో ఆలోచన మొదలయింది. ఇంగ్లాండ్ లో పై చదువులు ముగించుకుని తిరిగి వచ్చిన తరవాత గవర్నమెంటు డాక్టరుగా ఖమ్మంజిల్లాలోని ఓ గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి బహుశా ఈ ఆలోచనే ప్రేరణ అయిందేమో. (ఇంకా వుంది)

7, సెప్టెంబర్ 2014, ఆదివారం

హైదరాబాదు యాభయ్ ఏళ్ళక్రితం - ఓ డాక్టర్ గారి జ్ఞాపకాలు


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావు గారిది ఖమ్మం జిల్లా వల్లభి గ్రామం. ఇంగ్లండ్ వెళ్లి పై చదువు చదివి అక్కడే సెటిల్ అయిపోకుండా స్వదేశానికి తిరిగివచ్చి హైదరాబాదు పోస్టింగు అడగకుండా ఎక్కడో ఖమ్మం జిల్లా కొనగట్టునవున్న బూర్గుంపాడుకు ఏరికోరివెళ్ళిన డాక్టర్ ఈయన. పదవీవిరమణ చేసినతరువాత, 108, 104  పధకాలకు రూపకల్పన చేసారు. ప్రస్తుతం జాతీయ రహదారుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడే వారికి తక్షణ వైద్యసాయం అందించే పధకం అమల్లో చురుగ్గా పనిచేస్తున్నారు.


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావు)
తీరికసమయాల్లో ఇంగ్లీష్ లో రాసుకున్న జ్ఞాపకాల్లో  కొన్నింటిని ఏరి పోస్ట్ చేస్తున్నాను. అలనాటి జీవన విధానాలు ఎలా వుండేవో నేటి తరానికి తెలపడం ఉద్దేశ్యం)    
ఖమ్మంలోని , మామిళ్ళగూడెంలో కట్టుకున్న మా కొత్త ఇంటి గృహప్రవేశం 1950 లో జరిగింది. పూజా పునస్కారాలు రోజల్లా సాగాయి. అసలు గృహ ప్రవేశం అర్ధరాత్రో తెల్లవారు ఝామునో జరిగింది. మేము అప్పటివరకు వుంటున్న అద్దె ఇంటినుంచి మేళ తాళాలతో  వూరేగింపుగా బయలుదేరి కొత్త ఇంటికి వెళ్ళాము. వెంట తీసుకు వెళ్ళిన కపిల ఆవుని ఇల్లంతా తిప్పి, అది  పేడ వేసేవరకు లోపలే వుంచారు. కొత్త ఇంటిలో ఆవు పేడ  వేస్తె శుభప్రదమని ఓ నమ్మకం. ఇంటి వాకిలిపై బూడిద గుమ్మడి కాయను వేళ్ళాడదీశారు. పూజ బాగా జరిగింది. చుట్టపక్కాలతో కొత్త ఇల్లు పెళ్ళిల్లు  మాదిరిగా కళ కళ లాడింది. వూరబంతి పెట్టిన గుర్తు. అంటే వూరిలో తెలిసినవారినీ, బీదాబిక్కీని పిలిచి భోజనాలు పెట్టడం అన్నమాట. కొత్త గడపలో ఎన్ని విస్తళ్ళు లేస్తే అంత మంచిదనేవాళ్ళు. 
1950  వ సంవత్సరంలో ఖమ్మంలోని గవర్న్ మెంట్   హై స్కూల్ లో చేరాను. నన్ను ఐదో క్లాసులో చేర్చుకున్నారు.  కాకపొతే, మాది బ్రాంచ్ స్కూలు. మెయిన్ స్కూలుకు కొంత ఎడంగా వుండేది. ఆ రోజుల్లో తాలూకా మొత్తానికి ఒకే ఒక  హై స్కూలు, అదీ ఖమ్మంలో వున్న మా స్కూలే. మిగిలినవన్నీ మిడిల్ స్కూళ్ళు.
మేముండే మామిళ్ళ గూడెంలో హై స్కూలుకు వెళ్ళేవాళ్ళం  మొత్తం పదిమందిమి. పొద్దున్న తొమ్మిదికల్లా టంచనుగా నడుచుకుంటూ స్కూలుకు వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి మళ్ళీ స్కూలుకు వెళ్లి సాయంత్రం అయిదుకు ఇళ్లకు చేరేవాళ్ళం. 
మా ఇల్లు వూరికి దూరంగా పొలిమేరల్లో వుండేది.(ఇప్పుడది ఖమ్మంలో పెద్ద సెంటరు) అగ్గిపెట్టె కావాలన్నా కిలోమీటరు నడిచి వెళ్ళాలి. సరయిన రోడ్డు కాదుకదా దారిమధ్యలో చిన్న చిన్న రాతి గుట్టలు ఉండేవి.  వీధిలో అక్కడక్కడా కర్ర గుంజలు పాతి వాటికి వీధి దీపాలు తగిలించేవాళ్ళు.  ఇంట్లో పెద్దపిల్లాడిని కావడంతో చిన్నా చితకా పనులన్నీ నాపైనే పడేవి. ఆరోజుల్లో మా చుట్టపక్కాలు  అందరికంటే మామిళ్ళగూడెంలో ముందు కట్టింది మా ఇల్లే. 
ఖమ్మానికి ఇరుగుపొరుగు గ్రామాలనుంచి బస్సులు నడిచేవి. రైలు సౌకర్యం ఎప్పటినుంచో వుంది.

(ఇంకావుంది)