8, సెప్టెంబర్ 2014, సోమవారం

హైదరాబాదు యాభయ్ ఏళ్ళక్రితం - ఓ డాక్టర్ గారి జ్ఞాపకాలు - 2


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావుగారిది ఖమ్మం జిల్లా వల్లభి గ్రామం. ఇంగ్లండ్ వెళ్లి పై చదువు చదివి అక్కడే సెటిల్ అయిపోకుండా స్వదేశానికి తిరిగివచ్చి హైదరాబాదు పోస్టింగు అడగకుండా ఎక్కడో ఖమ్మం జిల్లా కొనగట్టునవున్న బూర్గుంపాడుకు ఏరికోరివెళ్ళిన డాక్టర్ ఈయన. పదవీవిరమణ చేసినతరువాత, 108, 104  పధకాలకు రూపకల్పన చేసారు)  


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావు) 

"ఖమ్మంలో వున్న సర్కారు దవాఖానాలో ఒకే ఒక్క డాక్టర్ వుండేవాడు. వూరిమొత్తంలో మరో ఇద్దరు క్వాలిఫయిడ్ డాక్టర్లతో పాటు అయిదుగురు ఆర్ ఎం పీలు వుండేవారు. 
వస్తువులు కొనుక్కోవాలన్నా, కోర్టు పనులు పడ్డా, వైద్యం కోసమయినా చుట్టుపక్కల వూళ్లల్లో వుండే మా చుట్టాలు, తెలిసిన వాళ్ళు  ఖమ్మం వస్తుండేవారు. మా ఇల్లు పెద్దది కావడం వల్ల, అల్లా వచ్చినవాళ్ళు నేరుగా మా ఇంట్లో దిగేవాళ్ళు. ఒక్కోసారి రోజుల తరబడి వుండిపోయేవారు. దానికి తోడు  మా నాన్న రాజకీయాల్లో తిరుగుతూ వుండడం వల్ల ఆయన అనుయాయులు, అనుచరులు, నాయకులు ఇంటికి రావడం ఆనవాయితీగా మారింది. రోజూ పదిమందికి తక్కువ కాకుండా ఇంట్లో భోంచేసేవారు. ఇంట్లో పెద్ద పిల్ల వాడిని నేనే. దాంతో ఇంటికి వచ్చే వాళ్ళ పనులు కూడా నేనే చక్కపెట్టాల్సిన పరిస్తితి. అంటే మంచి నీళ్ళు అందించడం, సిగరెట్లు తెచ్చిపెట్టడం, బట్టలు ఇస్త్రీ చేయించడం, పక్కలు వేయించడంవంటి పనులన్నమాట. 
1949 లో నా చెల్లెలు  లలిత   పుట్టింది. కానీ ఎక్కువ కాలం బతక లేదు. మా తాతగారి వూరు కంభంపాడులో 1954 లో చనిపోయింది. జబ్బుతో వున్న మా తాతయ్య భండారు రాఘవరావు గారిని చూడడానికి మా అమ్మ పిల్లలను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళింది. నేను ఖమ్మంలోనే వుండిపోయాను. 
ఆ పల్లెటూళ్ళో ఎందుకో ఒక రోజు వున్నట్టుండి లలితకు వొళ్ళు పెట్లిపోయేలా  బాగా జ్వరం రావడం, కోమాలోకి వెళ్లడం, మరునాడే చనిపోవడం అంతా  గంటల్లో జరిగిపోయింది. మా నాన్న అప్పుడు హైదరాబాదులో వున్నారు. 
లలిత  చనిపోయింది రాత్రిపూట. కబురు అందించడానికి యే సౌకర్యం లేని వూళ్ళో. కొద్ది మైళ్ల దూరంలో వున్న రైలు స్టేషన్ కు మనిషిని పంపించి టెలిగ్రాం ఇప్పించారు. మరునాటి వుదయం అది ఖమ్మం చేరింది.  అది వచ్చినప్పుడు ఇంట్లో నేనొక్కడినే వున్నాను. టెలిగ్రాం ఇంగ్లిష్ లో వుంది. లలిత  ఎక్స్ ఫై ర్డ్  స్టార్ట్ ఇమ్మీడియట్ ట్లీ.  ఎక్స్ ఫైర్డ్ అనే పదానికి అర్ధం తెలియదు. పెద్దవాళ్ళని వాకబు చేస్తే విషయం తెలిసింది. మనసంతా గందరగోళంగావుంది. ఆలోచనలన్నీ లలిత గురించే. ఆ సాయంత్రం నాన్న ఖమ్మం వచ్చారు. ఇద్దరం కలసి  పాసింజరు రైల్లో బోనకల్లు వెళ్ళాము. కాంగ్రెస్ నాయకుడు బొమ్మకంటి సత్యనారాయణరావుగారి వూరు. మా బంధువు కూడా. విషయం తెలుసుకున్న ఆయన మమ్మల్ని చూడడానికి స్టేషనుకు వచ్చి పరామర్శించారు. పది మైళ్ల  దూరంలో వున్న వత్సవాయి వెళ్ళడానికి అప్పటికప్పుడు ఓ ప్రయివేటు బస్సు ఏర్పాటుచేశారు. వెంట తోడుగా ఒక మనిషిని ఇచ్చారు. తినడానికి భోజనం, చీకటి పడితే ఇబ్బంది అని టార్చ్ లైట్ పట్టుకొచ్చారు. భోజనం ముగించుకుని  బస్సులో వత్సవాయి చేరుకున్నాము. వాన పడుతోంది. చీకటిలోనే నడుచుకుంటూ బయలుదేరాము. బాట సరిగాలేదు. కీచురాళ్ళ చప్పుళ్ళ మధ్య ఆ బురద బాటలో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా అర్ధరాత్రి కంభంపాడు చేరుకున్నాము. ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం. మమ్మల్ని చూడగానే అంతా భోరుమన్నారు. చిన్నారి లలితను తలచుకుంటూ ఒకరి నొకరు సముదాయించుకుంటూ రాత్రి గడిపాము. మర్నాడు తెలతెలవారుతూనే లలితను పాతిపెట్టిన ప్రదేశానికి వెళ్ళాము. ఆమె జ్ఞాపకాలను వెంటబెట్టుకుని ఖమ్మం తిరిగివచ్చేసాము. 

చక్కటి తెలివితేటలు, ఎంతో మంచి భవిష్యత్తు వున్న లలిత  ఎలాటి వైద్య సదుపాయం లభించకుండా అలా కన్ను మూయడం నా మనసును కలచివేసింది. నా చిట్టి చెల్లెలు లలిత  మాదిరిగా ఇంకా ఇలా  ఎంతమంది సరయిన వైద్యం సరయిన సమయంలో దొరక్క చనిపోతున్నారో అన్న దిశగా నాలో ఆలోచన మొదలయింది. ఇంగ్లాండ్ లో పై చదువులు ముగించుకుని తిరిగి వచ్చిన తరవాత గవర్నమెంటు డాక్టరుగా ఖమ్మంజిల్లాలోని ఓ గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి బహుశా ఈ ఆలోచనే ప్రేరణ అయిందేమో. (ఇంకా వుంది)

7, సెప్టెంబర్ 2014, ఆదివారం

హైదరాబాదు యాభయ్ ఏళ్ళక్రితం - ఓ డాక్టర్ గారి జ్ఞాపకాలు


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావు గారిది ఖమ్మం జిల్లా వల్లభి గ్రామం. ఇంగ్లండ్ వెళ్లి పై చదువు చదివి అక్కడే సెటిల్ అయిపోకుండా స్వదేశానికి తిరిగివచ్చి హైదరాబాదు పోస్టింగు అడగకుండా ఎక్కడో ఖమ్మం జిల్లా కొనగట్టునవున్న బూర్గుంపాడుకు ఏరికోరివెళ్ళిన డాక్టర్ ఈయన. పదవీవిరమణ చేసినతరువాత, 108, 104  పధకాలకు రూపకల్పన చేసారు. ప్రస్తుతం జాతీయ రహదారుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడే వారికి తక్షణ వైద్యసాయం అందించే పధకం అమల్లో చురుగ్గా పనిచేస్తున్నారు.


(డాక్టర్ అయితరాజు పాండు రంగారావు)
తీరికసమయాల్లో ఇంగ్లీష్ లో రాసుకున్న జ్ఞాపకాల్లో  కొన్నింటిని ఏరి పోస్ట్ చేస్తున్నాను. అలనాటి జీవన విధానాలు ఎలా వుండేవో నేటి తరానికి తెలపడం ఉద్దేశ్యం)    
ఖమ్మంలోని , మామిళ్ళగూడెంలో కట్టుకున్న మా కొత్త ఇంటి గృహప్రవేశం 1950 లో జరిగింది. పూజా పునస్కారాలు రోజల్లా సాగాయి. అసలు గృహ ప్రవేశం అర్ధరాత్రో తెల్లవారు ఝామునో జరిగింది. మేము అప్పటివరకు వుంటున్న అద్దె ఇంటినుంచి మేళ తాళాలతో  వూరేగింపుగా బయలుదేరి కొత్త ఇంటికి వెళ్ళాము. వెంట తీసుకు వెళ్ళిన కపిల ఆవుని ఇల్లంతా తిప్పి, అది  పేడ వేసేవరకు లోపలే వుంచారు. కొత్త ఇంటిలో ఆవు పేడ  వేస్తె శుభప్రదమని ఓ నమ్మకం. ఇంటి వాకిలిపై బూడిద గుమ్మడి కాయను వేళ్ళాడదీశారు. పూజ బాగా జరిగింది. చుట్టపక్కాలతో కొత్త ఇల్లు పెళ్ళిల్లు  మాదిరిగా కళ కళ లాడింది. వూరబంతి పెట్టిన గుర్తు. అంటే వూరిలో తెలిసినవారినీ, బీదాబిక్కీని పిలిచి భోజనాలు పెట్టడం అన్నమాట. కొత్త గడపలో ఎన్ని విస్తళ్ళు లేస్తే అంత మంచిదనేవాళ్ళు. 
1950  వ సంవత్సరంలో ఖమ్మంలోని గవర్న్ మెంట్   హై స్కూల్ లో చేరాను. నన్ను ఐదో క్లాసులో చేర్చుకున్నారు.  కాకపొతే, మాది బ్రాంచ్ స్కూలు. మెయిన్ స్కూలుకు కొంత ఎడంగా వుండేది. ఆ రోజుల్లో తాలూకా మొత్తానికి ఒకే ఒక  హై స్కూలు, అదీ ఖమ్మంలో వున్న మా స్కూలే. మిగిలినవన్నీ మిడిల్ స్కూళ్ళు.
మేముండే మామిళ్ళ గూడెంలో హై స్కూలుకు వెళ్ళేవాళ్ళం  మొత్తం పదిమందిమి. పొద్దున్న తొమ్మిదికల్లా టంచనుగా నడుచుకుంటూ స్కూలుకు వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి మళ్ళీ స్కూలుకు వెళ్లి సాయంత్రం అయిదుకు ఇళ్లకు చేరేవాళ్ళం. 
మా ఇల్లు వూరికి దూరంగా పొలిమేరల్లో వుండేది.(ఇప్పుడది ఖమ్మంలో పెద్ద సెంటరు) అగ్గిపెట్టె కావాలన్నా కిలోమీటరు నడిచి వెళ్ళాలి. సరయిన రోడ్డు కాదుకదా దారిమధ్యలో చిన్న చిన్న రాతి గుట్టలు ఉండేవి.  వీధిలో అక్కడక్కడా కర్ర గుంజలు పాతి వాటికి వీధి దీపాలు తగిలించేవాళ్ళు.  ఇంట్లో పెద్దపిల్లాడిని కావడంతో చిన్నా చితకా పనులన్నీ నాపైనే పడేవి. ఆరోజుల్లో మా చుట్టపక్కాలు  అందరికంటే మామిళ్ళగూడెంలో ముందు కట్టింది మా ఇల్లే. 
ఖమ్మానికి ఇరుగుపొరుగు గ్రామాలనుంచి బస్సులు నడిచేవి. రైలు సౌకర్యం ఎప్పటినుంచో వుంది.

(ఇంకావుంది)

6, సెప్టెంబర్ 2014, శనివారం

అలనాటి బెజవాడ - 3


బెజవాడ అంటేనే బ్లేజ్ వాడ. అంటే మండే నగరం. ఇక్కడ ఎండలు అలా మండిపోతుంటాయి. ఎండల్ని గురించి చెప్పాల్సి వస్తే ఇప్పటికీ బెజవాడ ఎండలతో పోల్చి చెప్పడం కద్దు. ఎండల కారణంగా బెజవాడకు రావాల్సిన  ఆంధ్ర విశ్వ విద్యాలయం రాకుండా పోయిందనే ఒక వాదన ప్రచారంలో వుంది. కట్టమంచి రామలింగారెడ్డి గారు బెజవాడ ఎండలకు భయపడే వాల్తేర్ ను ప్రత్యామ్నాయంగా సూచించారని అంటారు. ఈ ఒక్క కారణంగా బెజవాడ వాసులు ఇప్పటికీ ఆయన్ని క్షమించరని అనే వాళ్లు కూడా వున్నారు. (ఏమైతేనేం, అరవై ఏళ్ళ తరువాత బెజవాడకు రాజధాని యోగం సిద్దించింది)

నిద్రపోని నగరంగా బెజవాడ గురించి చెప్పుకుంటారు. ఉత్తర దక్షిణ భారతాలను కలిపే రైళ్ళు అన్నిటికీ కూడలి కావడం వల్ల అర్ధరాత్రీ  అపరాత్రీ అని లేకుండా ప్రయాణీకుల రాకపోకలు నిరంతరం సాగుతూనే వుంటాయి. అలాగే అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు. సినిమాలకు వెళ్ళే జనం కూడా ఎక్కువే. వీటికి తోడు ప్రధానమయిన తెలుగు దినపత్రికలన్నింటికీ బెజవాడే ప్రచురణ కేంద్రం. పత్రికల్లో పనిచేసి అర్ధరాత్రో, తెల్లవారుఝామునో ఇళ్లకు చేరుకునే మా బోంట్లకు హోటళ్ళలో తాజాగా వేడి వేడిగా దొరికే కాఫీ పలహారాలే దిక్కు. ఈ విషయంలో  ప్రధానంగా చెప్పుకోవాల్సింది గాంధీ నగరంలోని బాబాయి హోటలు. సినిమా తారలతో సహా పెద్ద పెద్ద  వాళ్లు అనేకమంది ఈ హోటలుకు  వస్తుంటారు. అలాగే కౌతా సెంటరులో వున్న రాములు కిల్లీ కొట్టు కూడా అంతే  ప్రసిద్ధం. అక్కడ దొరికే కిళ్ళీల కోసం జనం బారులు తీరేవారు. (సమాప్తం)
( అమెరికాలో వుంటున్న శ్రీ దాసు కృష్ణ మూర్తిగారి ఇంగ్లీష్ జ్ఞాపకాలకు తెలుగు అక్షర రూపం)  

అలనాటి బెజవాడ -2


దుర్గ గుడిలో ఈ రోజుల్లో కనబడుతున్న భక్తుల రద్దీ అప్పట్లో లేదు. నలభయ్యవ  దశకంలో ఎప్పుడు చూసినా, ఒక్క నవరాత్రులను మినహాయిస్తే, గుళ్ళో  పది పన్నెండు మంది కంటే ఎక్కువ కానవచ్చేవారు కారు. బెజవాడకు లాండ్ మార్క్ లాటి దుర్గ గుడి వల్లే విజయవాడ అనే పేరు వచ్చిందని చెబుతారు. కాళి మాత  రాక్షసుల మీద సాగించిన పోరులో విజయం సాధించిన కారణంగా ఆ విజయానికి సంకేతంగా విజయవాడ అన్న పేరు వచ్చిందని స్తల పురాణం  చెబుతుంది.  అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసింది  దుర్గ గుడి  కొలువైవున్న ఇంద్రకీలాద్రి అనే పర్వతంపైనే అనే మరో ఐతిహాసం వుంది. బంగాళాఖాతంలో సంగమించడానికి ఉరుకులు పరుగులు పెడుతూ కృష్ణమ్మ ఈ కొండ పక్కగా  బిరా బిరా పారుతూ వుంటుంది.
వేసవి కాలంలో బందరు కాలువ, రైవస్ కాలువ, ఏలూరు కాలువల లాకులు కట్టేసేవారు. నీళ్ళు లేకపోవడంతో ఆ కాలువలన్నీ ఇసుక మేటలుగా కానవచ్చేవి. మళ్ళీ సీజనులో కాలువలకు నీళ్ళు  వొదిలేటప్పుడు చూడాలి, వందలాదిమంది ఆ కాలువల  వంతెనల మీద చేరేవారు. సుళ్ళు తిరుగుతూ కృష్ణ నీళ్ళు కాలువల్లోకి ఒక్కమారుగా నురుగులు కక్కుతూ  జారిపోయే దృశ్యం చూస్తూ పరవశించి పోయేవారు. ఇలాటివి మరపురాని దృశ్యాలయితే,  మరచిపోవాలనుకునేవి  మరికొన్ని లేకపోలేదు. ఆ రోజుల్లో చాలామంది కాలవ గట్లనే కాలకృత్యాలకు వాడేవారు. పరిస్తితి  ఇప్పుడెలావుందో తెలవదు.
గవర్నర్ పేటలో వున్నప్పుడు ఇంద్రకీలాద్రి ఎక్కే ప్రయత్నం చేయలేదు కాని, ఏడెనిమిదేళ్ళ వయస్సులో వర్జిన్ మేరీ హిల్ అనే కొండ ఎక్కుతూ వుండేవాళ్ళం. అలా ఎక్కేటప్పుడు కాలు జారితే ఇంతే సంగతులు. పడిపోకుండా పట్టుకోవడానికి చిన్న చిన్న పొదలు తప్ప వేరే ఏ ఆధారం వుండేది కాదు.
ఒక జీవ నది, మూడు కాలువలు, అనేక కొండలు ఇవన్నీ బెజవాడకు సహజ సిద్ధంగా వున్న అలంకారాలు. సక్రమంగా అభివృద్ధి చేసివుంటే,  జార్జియాలోని అందమయిన  తిబ్లిసీ నగరానికి ఏమాత్రం తీసిపోయేది కాదన్నది వాస్తవం. (సశేషం)

( అమెరికాలో వుంటున్న శ్రీ దాసు కృష్ణమూర్తిగారి ఇంగ్లీష్ జ్ఞాపకాలకు తెలుగు అక్షర రూపం)

అలనాటి బెజవాడ



(బెజవాడ మీద రాసిన బ్లాగు చదివి ఎంతోమంది స్పందించారు. అందరికీ ధన్యవాదాలు. పోతేప్రత్యేకించి దాసు కృష్ణ మూర్తి గారు బెజవాడతో తన అనుబంధాన్నిజ్ఞాపకాలను వివరంగా పేర్కొంటూ ఇంగ్లీష్ లో సుదీర్ఘంగా రాశారు. దాన్ని తెలుగులో అనువదించి అందరితో పంచుకోవాలని అనిపించింది.నాకు రాసిన లేఖలో  కృష్ణమూర్తి గారు తనని తాను పరిచయం చేసుకుంటూ - I live in the United States. I am a migratory bird with three migrations, first to Hyderabad, second to Delhi and the third to America. I stayed in Bezwada for 27 years, Hyderabad 29 years, Delhi 20 years and the U.S. 11 years.- అని రాశారు. దీనిబట్టి ఇక వారి వయస్సునుఅనుభవాన్ని అర్ధం చేసుకోవచ్చు -  భండారు శ్రీనివాసరావు )
బెజవాడ గురించి చెప్పుకునే ముందు ముందుగా ప్రస్తావించుకోవాల్సింది బెజవాడ రైల్వే స్టేషన్ గురించి. ఎందుకంటె అనేక విషయాల్లో దీనికదే సాటి. దక్షిణ భారతానికి ముఖద్వారం లాటి బెజవాడ రైల్వే స్టేషన్ లో కాలి వంతెన మీద నిలబడి అప్పుడే స్టేషను లోకి ప్రవేశించే  గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ రైలును చూడడం అదో అనుభూతి.
జీటీ ఎక్స్ ప్రెస్ ఇంజను ఆవిర్లు చిమ్ముతూ, బిగ్గరగా  కూతపెడుతూ ప్లాటుఫారం మీదకు వేగంగా వస్తుంటే ఆ దృశ్యాన్ని కళ్ళారా చూడడానికి వందలమంది  స్టేషను ఫుట్ బ్రిడ్జ్  మీద గుమికూడేవారని చెబితే ఈనాటి వారు నమ్మడం కష్టమే. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ పేరుకు తగ్గట్టే దాని కూత కూడా ప్రత్యేకంగా వుండేది. దూరం నుంచి కూడా కూత విని ఆ రైలును గుర్తుపట్టేవారు.
ఇక స్టేషను విషయానికి వస్తే అది యెంత పెద్దదంటే బెర్లిన్ గోడ మాదిరిగా బెజవాడ పట్టణాన్ని తూర్పు, పడమర దిక్కులుగా విభజిస్తూ వుంటుంది. రెండు పక్కలా రెండు విభిన్న సంస్కృతులు పరిఢవిల్లుతుండేవి. 1941 లో కాబోలు గానన్  డంకర్లీ అండ్ కంపెనీ,  రైలు పట్టాల కిందుగా అండర్ పాస్ వంతెన నిర్మించేంతవరకు బెజవాడ రెండు  భాగాలుగా వుండేది. ఇక ఆ స్టేషనులో రద్దీ గురించి చెప్పాల్సిన పని లేదు.  ఆ రోజుల్లోనే పది నిమిషాలకు ఒక రైలు రావడమో, పోవడమో జరిగేది. రైలు గేటు  వేసినప్పుడల్లా అటునుంచి ఇటు రాకపోకలు సాగించేందుకు జనం నానా ఇబ్బందులు పడేవాళ్ళు. అండర్ పాస్ అందుబాటులోకి రావడంతో ఈ చిక్కులు తొలగిపోయాయి.  
ఆ రోజుల్లో  నిజాం పాలనలో వున్న హైదరాబాదు స్టేట్ నుంచి రైళ్ళు బెజవాడ వచ్చేవి. నిజాం రైళ్ళను గురించి జనం గొప్పగా చెప్పుకునే వారు. సమయపాలనకు అవి పెట్టింది పేరు. అలాగే శుభ్రత. మూడో తరగతి బోగీల్లో కూడా పంకాలు, స్టెయిన్ లెస్ స్టీల్ టాయిలెట్లు వుండేవి.
బెజవాడ రైల్వే స్టేషన్ చూస్తే ఏకత్వంలో భిన్నత్వం అంటే ఏమిటో బోధ పడుతుంది. దేశం నలుమూలలకు  చెందిన  విభిన్న భాషలవాళ్ళు బెజవాడ ప్లాటుఫారం పై కానవస్తారు. కొత్తవాళ్ళకు కృష్ణా పుష్కరం మాదిరిగా గుంపులు గుంపులుగా వున్న ఆ జనసందోహం కనబడేది. (ఇంకా వుంది)

( అమెరికాలో వుంటున్న శ్రీ దాసు కృష్ణ మూర్తిగారి ఇంగ్లీష్ జ్ఞాపకాలకు తెలుగు అక్షర రూపం)

నాటక రంగస్థలంగా బెజవాడ


అప్పటికి ఇప్పటికి పౌరాణిక నాటకం అంటే తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలే. వాస్తవానికి ఆయన ఈ  రెండూ విడివిడిగా రాశారు,  పాండవోద్యోగం, పాండవ విజయం అని.  ఈ రెండు కలిపి, మరికొన్ని నాటకాలలోని  పద్యాలు జోడించి కురుక్షేత్రంగా ప్రచారంలోకి తీసుకు వచ్చారు.  ఎన్ని వేలసార్లో,  వేలేమిటి లక్షసార్లు  అని కూడా చెప్పొచ్చు  ఈ నాటకాన్ని తెలుగునాట నాలుగు చెరగులా  వేసి వుంటారు. కొన్ని వేలమందికి ఈనాటకం ఉపాధి కల్పించింది.  పేరు తెచ్చి పెట్టింది.
బలిజేపల్లి వారి హరిశ్చంద్ర’,  చిలకమర్తి వారి గయోపాఖ్యనంకూడా ప్రసిద్ధి పొందినవే.
తర్వాత వచ్చినవి  కాళ్ళకూరి నారాయణ రావు గారి చింతామణి’,  తాండ్ర సుబ్రహ్మణ్యం గారి రామాంజనేయ యుద్ధం’. అడపా తడపా వల్లూరి వెంకట్రామయ్య చౌదరి గారి బాల నాగమ్మ’.  మిగతావన్నీ  చెదురుమదురగా ఆడేవి,  ‘పాదుక పట్టాభిషేకంవంటివన్న మాట.
బెజవాడ గాంధీ నగరంలో హనుమంతరాయ గ్రంధాలయం వుంది. పేరుకు గ్రంధలయంకానీ, అక్కడి రంగస్థలం నాటకాలకు ప్రసిద్ధి. అనేక నాటక సమాజాలకు అది ఆటపట్టు. జేవీడీఎస్ శాస్త్రి 'జంధ్యాల' కాకపూర్వం, ఎస్సారార్ కాలేజీ విద్యార్ధిగా వున్నప్పుడు రాసిన నాటకం ' సంధ్యారాగంలో శంఖారావం' ఇక్కడే ప్రదర్శనలు ఇచ్చింది.   
పౌరాణిక నాటకాలకు నిజానికి పెద్ద పెద్ద సెట్టింగులూ  అవీ వుండాలి.  కానీ,  పద్యం రాగం  ముఖ్యం కావడంతో హంగులను  ఎవరూ పట్టించుకొనేవారు కాదు. గుంటూరు అరండల్ పేటలో గుళ్ళపల్లి ఆదిశేషయ్య అని వొకాయన నాటకానికి కావాల్సిన డ్రెస్సులు, తెరలు సప్లయి  చేస్తూవుండేవాడు. అన్ని ప్రాంతాలకి, అన్ని నాటక సమాజాలకి ఈయనే దిక్కు. అలాగే బెజవాడ  గవర్నరుపేటలో జైహింద్ లాడ్జ్, జైహింద్ ప్రెస్ ఉండేవి. నాటకాల్లో వేషాలు వేసేవారందరికి ఇదే స్థావరం. ఇక్కడ నుంచే నాటకాలు, నటులను  బుక్ చేసుకొనేవారు. పోస్టర్లు, కరపత్రాలు, ఇక్కడే ప్రింట్ చేసేవారు. జైహింద్సుబ్బయ్యగారు వీటన్నిటికి కంట్రాక్టర్.
స్టేజి కూడా పెద్ద ప్రాముఖ్యం లేనిదే. కావాల్సిందల్లా  మంచి  మైకు సెట్టు.  మైకు  బాగా లేకపోతే  జనం గోల చేసేవారు. లైటింగ్ కూడా పట్టించుకునేవారుకాదు.  వెనక వైపు  ఓ  తెరా, ముందు మరో  తెరా వుంటే చాలు నాటకం వేయడానికి. ముందు తెరను  కప్పీ మీద  లాగడానికి వీలుగా కట్టేవారు. చూసిన  ఏ నాటకాలలోను అది సరిగా పని చెయ్యగా చూడలేదు. దాంతో నాటకం ట్రూపులో  ఒకడు స్టేజి ఎక్కి ఈ మూల నుంచి ఆ మూలకు చేత్తోనే తెరను లాగేవాడు. నాటకం మొదలు పెట్టడానికి  కొద్ది నిమిషాల ముందు హార్మొనీ వాయించే  ఆయన వచ్చేవాడు. తొక్కుడు హార్మొనీ. పెట్టెలోంచి  పీకి లేపి క్లిప్పులు పెడితే వాయించడానికి వీలుగా తయారయ్యేది.  ఆయన కూర్చోడానికి  ఓ మడత కుర్చీ. ఇక నాటకం ఏదయినా, ఎవరు వేసినా   ‘పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానందఅనే ప్రార్ధనతో మొదలు పెట్టేవారు. ఇది రాసిన మహాను భావుడెవడో  ఎవరికీ తెలియదు. ఎంతో మందిని అడిగినా లాభంలేక పోయింది.  ఆ మధ్యన ఓ  అష్టావధానం లో కూడా ఈ ప్రశ్నవేసారు.  సమాధానం ఏమి వచ్చిందో  గుర్తు లేదు. ఎవరికయినా తెలిస్తే  తెలిస్తే చెప్పండి.  రెండు మూడు నిమిషాల ప్రార్ధన తర్వాత,  ‘శ్రీకృష్ణ పరమాత్మకీ  జై!అంటూ నాటకం ఆడేవాళ్ళ సమాజం పేరు చెప్పుకుని దానికి కూడా జై కొట్టే వారు.  ప్రార్ధన సమయానికి కొందరు వేషాలు పూర్తి గా వేసుకుని,  మరికొందరు సగం వేషాలతోనో, లేదా లుంగీ పంచెలతోనొ  పాడేవారు. ఇంత ముద్ద హారతి కర్పూరం వెలిగించి. పాడడం అవగానే ఓ కొబ్బరికాయ స్టేజి మీద గట్టిగా కొట్టేవారు. అప్పడప్పుడు సగం చిప్ప యెగిరి  వెళ్లి  జనంలో పడేది. ఈ తెరవెనక భాగోతం అంతా మసగ మసగ్గా బయట ప్రేక్షకులకు  కనపడుతూనే వుండేది.  బెజవాడ ఏలూరు రోడ్ సెంటర్లో  రామకృష్ణ మైక్  సర్వీసుఅని వుండేది.  ఆయన దగ్గర మంచి మైకులు  ఉండేవి. వాటిని ష్యూర్ మైకులు అనేవాళ్ళు.  బాగా  లాగుతాయని చెప్పుకునేవాళ్ళు. అంటే ఎంతో దూరం వరకు వినబడతాయన్న మాట, ఇబ్బంది పెట్టకుండా.  కరపత్రాల్లో కూడా వేసుకొనే వారు, పలానా వారిదే మైక్ సెట్ల సప్లయి అని.


బెజవాడలో  ఇప్పటి నవరంగ్ థియేటర్ని   1960 – 1970 మధ్య షహెన్ షా మహల్ అనే వారు.  యాజమాన్యంలో ఏవో గొడవలవల్ల అప్పట్లో థియేటర్ ని మూసేశారు.  దానిని నాటకాలకు వుపయోగించుకునేవారు. అలాగే  గాంధీ  నగర్ లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం హాలు.  అప్పడప్పుడు రామ్మోహన్ గ్రంథాలయం  పైన వున్నచిన్న  హాలు. నాటకాలన్నీ శనివారం నాడే వేసేవారు. తెల్లవార్లు నడుస్తుంది కనుక  మర్నాడు ఆదివారం పడుకోవచ్చని  కాబోలు. 

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

బెజవాడపై దాసుగారి స్పందన అమెరికా నుంచి - మరోభాగం


     
ఇక  బెజవాడలో రెస్టారెంట్ల విషయానికి వస్తే-

వూళ్ళో దాదాపు అన్నీ శాకాహార భోజన హోటళ్ళే! బ్రాహ్మణ హోటళ్ళు.  చాలావరకు ఉడిపి అయ్యర్లవే. బాగా ప్రాచుర్యం పొందిన వెల్కం హోటల్, మోడరన్ కేఫ్ లాటి హోటళ్ళు కూడా ఉడిపి వారివే. ఒక్క అణా (రూపాయిలో పదహారో వంతు) పెడితే రెండు ఇడ్లీలు, వేడి వేడి సాంబారు, కారప్పొడి, కొబ్బరి చట్నీ, అల్లప్పచ్చడి అన్నీ లేదు అనకుండా వడ్డించే వాళ్లు.      

గవర్నర్ పేటలోని బీసెంటు రోడ్డు దగ్గర మొదలు పెడితే గాంధీనగరం వరకు అన్నీ హోటళ్ళే!  మాంసాహారం లభించే హోటళ్ళను మిలిటరీ భోజన హోటళ్ళు అనేవారు. వాటిని  ఎక్కువగా కేరళ వాళ్లు నడిపే వాళ్లు. అలాగే, బయట నుంచి  బెజవాడకు వచ్చిన వాళ్ల చేతుల్లో కొన్ని వృత్తులు వుండేవి. పాల వ్యాపారం చాలావరకు విజయనగరం నుంచి వచ్చిన వారు చూసుకునేవారు. ఒరిస్సా నుంచి వచ్చిన వారు - పాయిఖానాలు  శుభ్రం చేసే పని చూసేవారు. దర్జీ పని, జట్కాలు (గుర్రబ్బండ్లు) ముస్లింల  ఇలాకాలో వుండేవి. రాకపోకలకు రిక్షాలే గతి. సైకిల్  రిక్షాలు రాకపూర్వం వాటిని మనుషులు లాగేవారు. సిటీ బస్సులు వుండేవి కావు. కాకపొతే, బెజవాడ, ఏలూరు, బందరు, గుడివాడల మధ్య బస్సులు తిరిగేవి. ఆ బస్సులకు పై కప్పుమాత్రమే వుండేది. పక్కన ఏమాత్రం ఆచ్చాదన లేకపోవడంతో వర్షం వస్తే అంతే సంగతులు. ప్రయాణీకులు పూర్తిగా తడిసిపోయేవాళ్ళు. కృష్ణా నది మీద రోడ్డు వంతెన లేని కారణంగా బెజవాడ నుంఛి  గుంటూరుకూ, ,తెనాలికీ  బస్సు సర్వీసు వుండేది కాదు. 
అధికారుల పెత్తనం జోరుగా వుండేది. పోలీసు అధికారి కానీ రెవెన్యూ అధికారి కానీ బస్సు ఎక్కాల్సి వస్తే బస్సును ఏకంగా ఆయన ఇంటి దాకా తీసుకువెళ్ళేవాళ్ళు.


మా ఇల్లు గవర్నర్ పేటలో వుండేది. ఇంటి నుంచి కొత్తపేటలోని హిందూ హై స్కూలు వరకూ నడిచే వెళ్ళే వాళ్ళం. తరువాత మేము చేరిన ఎస్ ఆర్ ఆర్ అండ్ సీ వీ ఆర్ కాలేజీ మాచవరం లో వుండేది. అప్పుడు కూడా మాది నటరాజా సర్వీసే. స్కూల్లో టీచర్లు, కాలేజీలో లెక్చరర్లు అంతా కాలినడకనే వచ్చేవాళ్ళు. దుర్గాగ్రహారంలో వుండే విశ్వనాధ సత్యనారాయణ గారు, చతుర్వేదుల నరసింహం గారు కాలేజీకి నడిచే వచ్చేవాళ్ళు. మాకు వాళ్లు లెక్చరర్లు. దోవలో ఇంగ్లీష్ సాహిత్యం  గురించి చర్చించుకునే వారు. కొత్తగా విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమా మొదటి ఆట చూడడం కోసం ప్లాన్లు వేసుకునేవాళ్ళు. కాలేజీ ప్రిన్సిపాల్ పుట్టపర్తి శ్రీనివాసాచారి గారు మాత్రం జట్కా బండిలో వచ్చేవారు. కొందరు లెక్చరర్లు సైకిళ్ళపై చేరుకునే వారు. (వీలు దొరికితే మరి కొన్ని సంగతులు మరోసారి)