6, సెప్టెంబర్ 2014, శనివారం

నాటక రంగస్థలంగా బెజవాడ


అప్పటికి ఇప్పటికి పౌరాణిక నాటకం అంటే తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలే. వాస్తవానికి ఆయన ఈ  రెండూ విడివిడిగా రాశారు,  పాండవోద్యోగం, పాండవ విజయం అని.  ఈ రెండు కలిపి, మరికొన్ని నాటకాలలోని  పద్యాలు జోడించి కురుక్షేత్రంగా ప్రచారంలోకి తీసుకు వచ్చారు.  ఎన్ని వేలసార్లో,  వేలేమిటి లక్షసార్లు  అని కూడా చెప్పొచ్చు  ఈ నాటకాన్ని తెలుగునాట నాలుగు చెరగులా  వేసి వుంటారు. కొన్ని వేలమందికి ఈనాటకం ఉపాధి కల్పించింది.  పేరు తెచ్చి పెట్టింది.
బలిజేపల్లి వారి హరిశ్చంద్ర’,  చిలకమర్తి వారి గయోపాఖ్యనంకూడా ప్రసిద్ధి పొందినవే.
తర్వాత వచ్చినవి  కాళ్ళకూరి నారాయణ రావు గారి చింతామణి’,  తాండ్ర సుబ్రహ్మణ్యం గారి రామాంజనేయ యుద్ధం’. అడపా తడపా వల్లూరి వెంకట్రామయ్య చౌదరి గారి బాల నాగమ్మ’.  మిగతావన్నీ  చెదురుమదురగా ఆడేవి,  ‘పాదుక పట్టాభిషేకంవంటివన్న మాట.
బెజవాడ గాంధీ నగరంలో హనుమంతరాయ గ్రంధాలయం వుంది. పేరుకు గ్రంధలయంకానీ, అక్కడి రంగస్థలం నాటకాలకు ప్రసిద్ధి. అనేక నాటక సమాజాలకు అది ఆటపట్టు. జేవీడీఎస్ శాస్త్రి 'జంధ్యాల' కాకపూర్వం, ఎస్సారార్ కాలేజీ విద్యార్ధిగా వున్నప్పుడు రాసిన నాటకం ' సంధ్యారాగంలో శంఖారావం' ఇక్కడే ప్రదర్శనలు ఇచ్చింది.   
పౌరాణిక నాటకాలకు నిజానికి పెద్ద పెద్ద సెట్టింగులూ  అవీ వుండాలి.  కానీ,  పద్యం రాగం  ముఖ్యం కావడంతో హంగులను  ఎవరూ పట్టించుకొనేవారు కాదు. గుంటూరు అరండల్ పేటలో గుళ్ళపల్లి ఆదిశేషయ్య అని వొకాయన నాటకానికి కావాల్సిన డ్రెస్సులు, తెరలు సప్లయి  చేస్తూవుండేవాడు. అన్ని ప్రాంతాలకి, అన్ని నాటక సమాజాలకి ఈయనే దిక్కు. అలాగే బెజవాడ  గవర్నరుపేటలో జైహింద్ లాడ్జ్, జైహింద్ ప్రెస్ ఉండేవి. నాటకాల్లో వేషాలు వేసేవారందరికి ఇదే స్థావరం. ఇక్కడ నుంచే నాటకాలు, నటులను  బుక్ చేసుకొనేవారు. పోస్టర్లు, కరపత్రాలు, ఇక్కడే ప్రింట్ చేసేవారు. జైహింద్సుబ్బయ్యగారు వీటన్నిటికి కంట్రాక్టర్.
స్టేజి కూడా పెద్ద ప్రాముఖ్యం లేనిదే. కావాల్సిందల్లా  మంచి  మైకు సెట్టు.  మైకు  బాగా లేకపోతే  జనం గోల చేసేవారు. లైటింగ్ కూడా పట్టించుకునేవారుకాదు.  వెనక వైపు  ఓ  తెరా, ముందు మరో  తెరా వుంటే చాలు నాటకం వేయడానికి. ముందు తెరను  కప్పీ మీద  లాగడానికి వీలుగా కట్టేవారు. చూసిన  ఏ నాటకాలలోను అది సరిగా పని చెయ్యగా చూడలేదు. దాంతో నాటకం ట్రూపులో  ఒకడు స్టేజి ఎక్కి ఈ మూల నుంచి ఆ మూలకు చేత్తోనే తెరను లాగేవాడు. నాటకం మొదలు పెట్టడానికి  కొద్ది నిమిషాల ముందు హార్మొనీ వాయించే  ఆయన వచ్చేవాడు. తొక్కుడు హార్మొనీ. పెట్టెలోంచి  పీకి లేపి క్లిప్పులు పెడితే వాయించడానికి వీలుగా తయారయ్యేది.  ఆయన కూర్చోడానికి  ఓ మడత కుర్చీ. ఇక నాటకం ఏదయినా, ఎవరు వేసినా   ‘పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానందఅనే ప్రార్ధనతో మొదలు పెట్టేవారు. ఇది రాసిన మహాను భావుడెవడో  ఎవరికీ తెలియదు. ఎంతో మందిని అడిగినా లాభంలేక పోయింది.  ఆ మధ్యన ఓ  అష్టావధానం లో కూడా ఈ ప్రశ్నవేసారు.  సమాధానం ఏమి వచ్చిందో  గుర్తు లేదు. ఎవరికయినా తెలిస్తే  తెలిస్తే చెప్పండి.  రెండు మూడు నిమిషాల ప్రార్ధన తర్వాత,  ‘శ్రీకృష్ణ పరమాత్మకీ  జై!అంటూ నాటకం ఆడేవాళ్ళ సమాజం పేరు చెప్పుకుని దానికి కూడా జై కొట్టే వారు.  ప్రార్ధన సమయానికి కొందరు వేషాలు పూర్తి గా వేసుకుని,  మరికొందరు సగం వేషాలతోనో, లేదా లుంగీ పంచెలతోనొ  పాడేవారు. ఇంత ముద్ద హారతి కర్పూరం వెలిగించి. పాడడం అవగానే ఓ కొబ్బరికాయ స్టేజి మీద గట్టిగా కొట్టేవారు. అప్పడప్పుడు సగం చిప్ప యెగిరి  వెళ్లి  జనంలో పడేది. ఈ తెరవెనక భాగోతం అంతా మసగ మసగ్గా బయట ప్రేక్షకులకు  కనపడుతూనే వుండేది.  బెజవాడ ఏలూరు రోడ్ సెంటర్లో  రామకృష్ణ మైక్  సర్వీసుఅని వుండేది.  ఆయన దగ్గర మంచి మైకులు  ఉండేవి. వాటిని ష్యూర్ మైకులు అనేవాళ్ళు.  బాగా  లాగుతాయని చెప్పుకునేవాళ్ళు. అంటే ఎంతో దూరం వరకు వినబడతాయన్న మాట, ఇబ్బంది పెట్టకుండా.  కరపత్రాల్లో కూడా వేసుకొనే వారు, పలానా వారిదే మైక్ సెట్ల సప్లయి అని.


బెజవాడలో  ఇప్పటి నవరంగ్ థియేటర్ని   1960 – 1970 మధ్య షహెన్ షా మహల్ అనే వారు.  యాజమాన్యంలో ఏవో గొడవలవల్ల అప్పట్లో థియేటర్ ని మూసేశారు.  దానిని నాటకాలకు వుపయోగించుకునేవారు. అలాగే  గాంధీ  నగర్ లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం హాలు.  అప్పడప్పుడు రామ్మోహన్ గ్రంథాలయం  పైన వున్నచిన్న  హాలు. నాటకాలన్నీ శనివారం నాడే వేసేవారు. తెల్లవార్లు నడుస్తుంది కనుక  మర్నాడు ఆదివారం పడుకోవచ్చని  కాబోలు. 

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

బెజవాడపై దాసుగారి స్పందన అమెరికా నుంచి - మరోభాగం


     
ఇక  బెజవాడలో రెస్టారెంట్ల విషయానికి వస్తే-

వూళ్ళో దాదాపు అన్నీ శాకాహార భోజన హోటళ్ళే! బ్రాహ్మణ హోటళ్ళు.  చాలావరకు ఉడిపి అయ్యర్లవే. బాగా ప్రాచుర్యం పొందిన వెల్కం హోటల్, మోడరన్ కేఫ్ లాటి హోటళ్ళు కూడా ఉడిపి వారివే. ఒక్క అణా (రూపాయిలో పదహారో వంతు) పెడితే రెండు ఇడ్లీలు, వేడి వేడి సాంబారు, కారప్పొడి, కొబ్బరి చట్నీ, అల్లప్పచ్చడి అన్నీ లేదు అనకుండా వడ్డించే వాళ్లు.      

గవర్నర్ పేటలోని బీసెంటు రోడ్డు దగ్గర మొదలు పెడితే గాంధీనగరం వరకు అన్నీ హోటళ్ళే!  మాంసాహారం లభించే హోటళ్ళను మిలిటరీ భోజన హోటళ్ళు అనేవారు. వాటిని  ఎక్కువగా కేరళ వాళ్లు నడిపే వాళ్లు. అలాగే, బయట నుంచి  బెజవాడకు వచ్చిన వాళ్ల చేతుల్లో కొన్ని వృత్తులు వుండేవి. పాల వ్యాపారం చాలావరకు విజయనగరం నుంచి వచ్చిన వారు చూసుకునేవారు. ఒరిస్సా నుంచి వచ్చిన వారు - పాయిఖానాలు  శుభ్రం చేసే పని చూసేవారు. దర్జీ పని, జట్కాలు (గుర్రబ్బండ్లు) ముస్లింల  ఇలాకాలో వుండేవి. రాకపోకలకు రిక్షాలే గతి. సైకిల్  రిక్షాలు రాకపూర్వం వాటిని మనుషులు లాగేవారు. సిటీ బస్సులు వుండేవి కావు. కాకపొతే, బెజవాడ, ఏలూరు, బందరు, గుడివాడల మధ్య బస్సులు తిరిగేవి. ఆ బస్సులకు పై కప్పుమాత్రమే వుండేది. పక్కన ఏమాత్రం ఆచ్చాదన లేకపోవడంతో వర్షం వస్తే అంతే సంగతులు. ప్రయాణీకులు పూర్తిగా తడిసిపోయేవాళ్ళు. కృష్ణా నది మీద రోడ్డు వంతెన లేని కారణంగా బెజవాడ నుంఛి  గుంటూరుకూ, ,తెనాలికీ  బస్సు సర్వీసు వుండేది కాదు. 
అధికారుల పెత్తనం జోరుగా వుండేది. పోలీసు అధికారి కానీ రెవెన్యూ అధికారి కానీ బస్సు ఎక్కాల్సి వస్తే బస్సును ఏకంగా ఆయన ఇంటి దాకా తీసుకువెళ్ళేవాళ్ళు.


మా ఇల్లు గవర్నర్ పేటలో వుండేది. ఇంటి నుంచి కొత్తపేటలోని హిందూ హై స్కూలు వరకూ నడిచే వెళ్ళే వాళ్ళం. తరువాత మేము చేరిన ఎస్ ఆర్ ఆర్ అండ్ సీ వీ ఆర్ కాలేజీ మాచవరం లో వుండేది. అప్పుడు కూడా మాది నటరాజా సర్వీసే. స్కూల్లో టీచర్లు, కాలేజీలో లెక్చరర్లు అంతా కాలినడకనే వచ్చేవాళ్ళు. దుర్గాగ్రహారంలో వుండే విశ్వనాధ సత్యనారాయణ గారు, చతుర్వేదుల నరసింహం గారు కాలేజీకి నడిచే వచ్చేవాళ్ళు. మాకు వాళ్లు లెక్చరర్లు. దోవలో ఇంగ్లీష్ సాహిత్యం  గురించి చర్చించుకునే వారు. కొత్తగా విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమా మొదటి ఆట చూడడం కోసం ప్లాన్లు వేసుకునేవాళ్ళు. కాలేజీ ప్రిన్సిపాల్ పుట్టపర్తి శ్రీనివాసాచారి గారు మాత్రం జట్కా బండిలో వచ్చేవారు. కొందరు లెక్చరర్లు సైకిళ్ళపై చేరుకునే వారు. (వీలు దొరికితే మరి కొన్ని సంగతులు మరోసారి) 

దాసుగారి బెజవాడ ముచ్చట్లు రెండో భాగం



ఆ రోజుల్లో ఇలా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు తీసేవాళ్ళు కాదు. చిత్రానికి చిత్రానికీ నడుమ కనీసం పదిహేనురోజులో,నెల రోజులో వ్యవధానం వుండేట్టు చూసుకునేవారు. సినిమా విడుదలలు లేని ఖాళీ రోజుల్లో ఆ ధియేటర్లలో డ్రామాలు ఆడేవాళ్ళు.
        
నలభయ్యవ దశకంలో మరో ధోరణి కనబడింది. తెలుగు సినిమాలు దొరక్కపోతే అరవ చిత్రం వేసేవాళ్ళు. హాలు మధ్యలో అనువాదకుడు నిలబడి కొన్ని డైలాగులను తెలుగులో అనువదించి చెబుతుండేవాడు. ఇంటర్వెల్ సమయంలో సినిమా సాంగ్స్ పేరుతొ ఆ సినిమా పాటల పుస్తకాలను అమ్మేవాళ్ళు. వాటికి మంచి గిరాకీ వుండేది.

బుకింగ్ కౌంటర్ల దగ్గర ఒక వరుసలో నిలబడి టిక్కెట్లు తీసుకునే సంప్రదాయం వుండేది కాదు. కౌంటర్ తెరవగానే అంతా ఒక్కసారిగా మీదపడేవారు. సినిమా టిక్కెట్టు కొనడం అంటే దాదాపు ఒక యుద్ధం చేసినట్టు వుండేది. టిక్కెట్టు తీసుకుని బయటపడేసరికి చొక్కాలు చినిగి పోయేవి. వొళ్ళంతా చెమటలు  పట్టి బట్టలు తడిసిపోయేవి.

సినిమాహాళ్లలో పారిశుధ్యం పూజ్యం అనే చెప్పాలి. ఆ రోజుల్లో నేల క్లాసు అని ఒక  తరగతి వుండేది. ఆ క్లాసులో  పైన నేల మీద  కూర్చున్న వారిలో ఎవరి పిల్లవాడయినా మూత్రం చేస్తే అది కింద దాకా పారుతుండేది. కింది వైపు కూర్చున్న వారి లాగూలు తడిసేవి. మరుగు దొడ్ల సౌకర్యం వుండేది కాదు. ఇంటర్వెల్  కాగానే ప్రేక్షకులు ఒక్కమారుగా గుంపులు గుంపులుగా బయటకు వచ్చి సినిమా హాలు గోడల్ని ప్రక్షాళన చేసేవాళ్ళు.

1939 లో అనుకుంటా బెజవాడలో కొత్తగా రామా టాకీసు వచ్చింది. తరువాత వరుసగా గవర్నర్ పేటలో  లక్ష్మీ టాకీసు, వన్ టౌన్ లో  సరస్వతీ మహలు వచ్చాయనుకుంటాను"

(దాసుగారి బెజవాడ ముచ్చట్లు మరికొన్ని మరోసారి) 

బెజవాడ - ఒక స్పందన అమెరికా నుంచి


(బెజవాడ మీద రాసిన బ్లాగు చదివి ఎంతోమంది స్పందించారు. అందరికీ ధన్యవాదాలు. పోతే, ప్రత్యేకించి దాసు కృష్ణ మూర్తి గారు బెజవాడతో తన అనుబంధాన్ని, జ్ఞాపకాలను వివరంగా పేర్కొంటూ ఇంగ్లీష్ లో సుదీర్ఘంగా రాశారు. దాన్ని తెలుగులో అనువదించి అందరితో పంచుకోవాలని అనిపించింది.నాకు రాసిన లేఖలో  కృష్ణమూర్తి గారు తనని తాను పరిచయం చేసుకుంటూ - I live in the United States. I am a migratory bird with three migrations, first to Hyderabad, second to Delhi and the third to America. I stayed in Bezwada for 27 years, Hyderabad 29 years, Delhi 20 years and the U.S. 11 years.- అని రాశారు. దీనిబట్టి ఇక వారి వయస్సును, అనుభవాన్ని అర్ధం చేసుకోవచ్చు -  భండారు శ్రీనివాసరావు )
   
బెజవాడ నగర సందర్శనను సినిమా హాళ్ళు, హోటళ్ళతో మొదలు పెడదాము.
అప్పట్లో బెజవాడలో రెండంటే రెండే సినిమా హాళ్ళు వుండేవి. ఒకటి మారుతీ సినిమా, రెండోది నాగేశ్వరరావు హాలు.(బహుశా నాగేశ్వరరావు హాలంటే  కృష్ణ మూర్తి గారి ఉద్దేశ్యం దుర్గాకళా మందిరం కావచ్చేమో!) ఇది ముప్పయ్యవ దశకంలో మాట. ఈ సినిమా హాళ్ళకు ఆ రోజుల్లోనే సొంత జెనరేటర్లు వుండేవి.

సాయం సమయాల్లో ఈ సినిమా హాళ్లనుంచి ఎడ్లబండ్లు సినిమా ప్రచారానికి  బయలుదేరేవి. వాటిల్లో కొందరు కూర్చుని వాయిద్యాలు వాయిస్తూ వుండేవారు. నలుగురు చుట్టూ  చేరగానే సినిమాల తాలూకు కరపత్రాలు పంచుతూ వుండేవారు. ఆ బళ్ళు కనబడగానే వెంట పరిగెత్తుకెళ్ళి ఆ కరపత్రాలు వీలయినన్ని పోగేసుకోవడం మాకు సరదాగా వుండేది. ఎన్ని ఎక్కువ పాంప్లేట్లు పోగేస్తే అంత గొప్ప.

1937 లో పరిస్తితి కొంత మారింది. నాగేశ్వరరావు గారు ఎడ్లబండి స్తానంలో మోటారు వ్యాను ప్రవేశపెట్టారు. దాన్ని రంగురంగుల సినిమా పోస్టర్లతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించేవారు. లౌడ్ స్పీకర్ల ద్వారా సినిమా పాటలు వినిపించేవారు. టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డులను ప్రత్యేకంగా వేసేవారు. ఇలా సాగే సినిమా ప్రచారం కొన్నాళ్ళ తరువాత కొత్త పుంతలు తొక్కింది. సాలూరు రాజేశ్వరరావు, శ్రీరంజని, రామతిలకం నటించిన కృష్ణ లీలసినిమా విడుదల అయినప్పుడు ఆ సినిమా నిర్మాత -  కరపత్రాలను విమానం నుంచి వెదజల్లే ఏర్పాటు చేశారు. నిజంగా ఆ రోజుల్లో అదొక సంచలనం.    
సినిమా నిర్మాతల నడుమ పోటీలు పెరగడం నాకు బాగా గుర్తు. ఒకాయన ద్రౌపది వస్త్రాపహరణం నిర్మిస్తే మరొకరు పోటీగా ద్రౌపదీ మాన సంరక్షణ పేరుతొ మరో సినిమా తీసి విడుదల చేశారు. ఒకరు మాయాబజారు (పాతది) తీస్తే ఆయన ప్రత్యర్ధి శశిరేఖా పరిణయం పేరుతొ అదే కధను తెరకెక్కించారు. అలాగే సినిమాలు ఆడే ధియేటర్ల నడుమ కూడా పోటీ తత్వం వుండేది.

అప్పటిదాకా పౌరాణిక చిత్రాలదే హవా. రెండో ప్రపంచ యుద్ధానికి కొద్ది ముందు సాంఘిక చిత్రనిర్మాణానికి నిర్మాతలు చొరవ చూపడం మొదలయింది. ముందు భానుమతి, పుష్పవల్లి తో వరవిక్రయంవచ్చింది. తరువాత వైవీ రావు, రామబ్రహ్మం, హెచ్ ఎం రెడ్డి, బీఎన్ రెడ్డి వంటి హేమాహేమీలు  రంగ ప్రవేశం చేసి సాంఘిక చిత్ర నిర్మాణాన్ని ముమ్మరం చేశారు. రైతు బిడ్డ, మాలపల్లి,ఇల్లాలు, గృహలక్ష్మి.వందేమాతరం, దేవత వంటి పలు చిత్రాలు ఈ పరంపరలో రూపుదిద్దుకున్నవే. చలనచిత్రాలను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్లు  అందరికీ బెజవాడలోని గాంధీనగర్ రాజధాని. సినిమాలు మద్రాసులోనో, కొల్హాపూర్, కలకత్తాలలోనో  తయారయినా వాటిని విడుదల చేయడానికి అవసరమయిన అన్ని హంగులూ, ఏర్పాట్లు చేయాల్సింది మాత్రం  బెజవాడలోనే.

(దాసుగారి బెజవాడ ముచ్చట్లు మరికొన్ని మరోసారి)

ఆంద్ర ప్రదేశ్ నూతన రాజధాని బెజవాడ జ్ఞాపకాలు

(07-09-2014 తేదీ ఆదివారం 'సూర్య' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం) 

ఒక నూతన రాష్ట్రానికి రాజధానీ నగరం అవ్వాల్సిన అవకాశం విజయవాడకు మళ్ళీ అరవై ఏళ్ళ తరువాత లభించడం నిజంగా ఒక విశేషమే. రాష్ట్ర విభజన తరువాత పాత పేరుతొ కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానిగా విజయవాడ పేరుని  ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అసెంబ్లీలో అధికారికంగా  ప్రకటించడంతో ఒక్కసారిగా ఆంద్ర ప్రాంతంలోని ఈ నడిబొడ్డు పట్టణం వార్తల్లోకి ఎక్కింది. ఈ నిర్ణయంలోని మంచి చెడులను కాలపరీక్షకు వొదిలి ఒకనాటి బెజవాడ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ఈ వ్యాస ఉద్దేశ్యం.


పూర్వం ఈ పట్టణాన్ని బెజవాడ అనేవారు. ఈ పేరు రావడానికి కూడా ఒక స్థల పురాణాన్ని పేర్కొంటూ వుంటారు. సముద్రుడిని త్వరగా చేరుకోవడానికి వీలుగా తనకొక దారి చూపాల్సిందని కృష్ణానదీమతల్లి పాండవ మధ్యముడయిన ఆర్జునుడిని కోరడంతో విజయుడు, నదీ మార్గానికి అవరోధంగా నిలచిన కొండలకు తన అస్త్ర శస్త్రాలతో బెజ్జం పెడతాడు. ఆ విధంగా ఆ పట్టణానికి బెజ్జంవాడ అనే పేరు వచ్చి కాలక్రమంలో అది బెజవాడగా స్థిర పడిందని చెబుతారు.
అలాగే విజయవాడ అనే పేరుకు కూడా పురాణ ప్రాశస్త్యం వుంది. దుర్గామాత రాక్షస సంహారం తరువాత కొన్నాళ్ళు ఇంద్రకీలాద్రిపై విశ్రాంతి తీసుకుంటుంది.  విజయం లభించిన ప్రదేశం (వాడ) కావడంవల్ల,  ఆ పట్టణానికి విజయవాడ అనే నామం వచ్చిందని స్థల పురాణం. అలాగే,  మహాభారతంలో శివునికీ, అర్జునికీ నడుమ ఇంద్రకీలాద్రి కొండపైనే సంగ్రామం జరిగిందని ఐతిహ్యం. అర్జునుడి శక్తికి మెచ్చి శంకరుడు అతడికి పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు. అర్జునుడి నామాలలో ఒకటయిన విజయుడి పేరు మీద విజయవాడగా ప్రసిద్ధి పొందిందని కొందరి నమ్మకం.    
ఉత్తర దక్షిణ భారత ప్రాంతాలను కలిపే రైలు మార్గం ఈ పట్టణం మీదుగా వెళ్ళడం మూలాన విజయవాడ పేరు దేశం నలుమూలల్లో ప్రసిద్ధం. మెకెన్సీ క్వార్టర్లీ అనే అంతర్జాతీయ ఆర్ధిక వ్యవహారాల మేగజైన్ విజయవాడను 'భవిష్యత్ భౌగోళిక నగరం' గా అభివర్ణించింది. దేశంలో బౌద్ధమతం వెల్లివిరిసిన కాలంలో, అంటే క్రీస్తు మరణానంతరం  639 లో భారత దేశానికి వచ్చిన చైనా యాత్రీకుడు హ్యూన్ సాంగ్  బెజవాడను కూడా సందర్శించినట్టు రాసుకున్నాడు.
భౌగోళిక, చారిత్రిక ప్రాధాన్యం కలిగిన విజయవాడకు ఇప్పుడు రాజకీయపరమైన  ప్రాముఖ్యం  లభించబోతున్న ప్రస్తుత తరుణంలో ఒకనాటి బెజవాడ గురించిన జ్ఞాపకాల దొంతర ఇది.
చంద్రబాబు పుణ్యమా అని విజయవాడ అనే బెజవాడ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది.
కనుక ఆ బెజవాడ పాత ముచ్చట్లు కొన్ని.
నాకు తెలిసిన  బెజవాడ హుందాతో కూడిన రాజకీయాలకు నెలవు. సంగీత సాహిత్యాలకి కాణాచి. చైతన్యానికి, దాతృత్వానికి, సేవాభావాలకు మారు  పేరు.
 “అయ్యదేవర కాళేశ్వరరావు, అచ్చమాంబ, కే.ఎల్.రావు, టి.వి.ఎస్. చలపతి రావు,
డాక్టర్ జంధ్యాల దక్షిణా మూర్తి, మరుపిళ్ళచిట్టి, కాకాని వెంకట రత్నం, కాకరపర్తి భావన్నారాయణ, ఖుద్దూస్, ఇటు సేవారంగంలో అటు రాజకీయ రంగంలో ఆణి ముత్యాలు.. బెజవాడ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే మరికొన్ని  పేర్లు.
సంగీతంలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, చిలకలపూడి వెంకటేశ్వర శర్మ,  మద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలాంత్రపు రజనీ కాంత రావు, వోలేటి వెంకటేశ్వర్లు, మహాదేవ రాధాకృష్ణం రాజు, కంభంపాటి అక్కాజీ రావు,  శ్రీరంగం గోపాల రత్నం"
సాహిత్యంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, పేరాల భారత శర్మ, చెరుకుపల్లి జమదగ్ని శర్మ  వంటి కవి పండిత శ్రేష్ఠులు,  పరిశ్రమలతో పాటు  ధార్మిక సంస్థలు నెలకొల్పిన  చుండూరు  వెంకటరెడ్డి, కౌతా పూర్ణానందం, మాగంటి సూర్యనారాయణ, జీ.ఎస్. రాజు, సినీ  రంగం ప్రముఖులు పోతిన శ్రీనివాసరావు, పూర్ణ మంగరాజు
కామరాజు, విజయ పిక్చర్స్ చెరుకూరి పూర్ణచంద్రరావు, నవయుగ శ్రీనివాసరావు,
కాట్రగడ్డ నరసయ్య, తెలుగు సినిమా హాస్యానికి కొత్త భాష్యం చెప్పిన జంధ్యాల -   బెజవాడ అనగానే చటుక్కున గుర్తుకు రావాల్సిన వాళ్లు వీళ్ళు.
ఉన్నదంతా దానధర్మాలు చేసిన తుమ్మలపల్లి వారు, తంగిరాల వీరరాఘవయ్య , చోడవరపు దేవల్రాజు, జనాలకు చదువు నేర్పడం కోసం ఊరూరా లైబ్రరీలు పెట్టిన అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, మూఢనమ్మకాలను ఎదిరించిన గోరా, నాటకాల్లో ఎప్పటికీ మరుపురాని   అద్దంకి
శ్రీరామమూర్తి, విన్నకోట రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప,  బి.వి. రంగారావు, సూరవరపు వెంకటేశ్వర్లు, సూరిబాబు- రాజేశ్వరి,
కర్నాటి లక్ష్మినరసయ్య,  సీడీ  కృష్ణమూర్తి  నాటకాలు ఆడించిన జైహింద్ సుబ్బయ్య, వస్తాదులకే వస్తాదు దండమూడి రామ్మోహన్ రావు,  ప్లీడర్లు కొండపల్లి రామచంద్ర రావు, చింతలపాటి
శివరామకృష్ణ, ముసునూరి వెంకటరామ శాస్త్రి,  చక్రవర్తి, పాటిబండ సుందరరావు, ఇటీవలే తన 94 ఏట కన్నుమూసిన తుర్లపాటి హనుమంత రావు, పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు, నీలంరాజు వెంకట శేషయ్య, పండితారాధ్యుల
నాగేశ్వర రావు, కే.ఎల్.ఎన్. ప్రసాద్, నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రమణ్య శర్మ, కాట్రగడ్డ రాజగోపాలరావు, బొమ్మారెడ్డిఏబీకె ప్రసాద్,   పీ.ఎస్. ప్రకాశరావు, అయిదుగురు ముఖ్యమంత్రులకు పీ.ఆర్.వో. గా పనిచేసిన భండారు పర్వతాలరావు -  వీరిదీ  బెజవాడ. బెజవాడ అంటే ఇలాటి వాళ్ళే!
ప్రభాకర ఉమామహేశ్వర పండితుల  ధార్మికోపన్యాసాలు, వేలాదిమందికి వారు నేర్పిన సూర్య నమస్కారాలు, లబ్ధ ప్రతిష్టులయిన రచయితలు తెన్నేటి  లత, కొమ్మూరి వేణుగోపాలరావు, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, గొల్లపూడి మారుతీ రావు,  నవోదయ బుక్ హౌసులో సాహిత్య సమావేశాలు, నిమ్మగడ్డ వారి  ఎంవీకేఆర్ పబ్లిసిటీస్, దక్షిణ భారత దేశంలో సినిమాలకన్నింటికీ వాల్ పోస్టర్లు సప్లయి చేసే  నేషనల్ లితో ప్రింటర్స్ బెజవాడకు లాండ్ మార్కులు.

టూ టౌన్ లో శిష్ట్లా లక్ష్మీపతి శాస్త్రి  లక్ష్మీ జనరల్ స్టోర్స్వన్ టౌన్ లో మాజేటి రామమోహనరావు బట్టల కొట్టు  శ్రీ రామనవమి  పందిళ్ళు, రామకోటి సప్తాహాలు, నవరాత్రుళ్ళు ఇలాటివి గుర్తుకు వస్తే అదీ బెజవాడ.

 తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ హాస్టల్, తంగిరాల వీరరాఘవయ్య కళ్యాణ మండపం, డీ.ఎల్. నారాయణ ఇండియన్ మెడిసిన్ హౌస్, కోగంటి గోపాల కృష్ణయ్య ప్రజా నాట్యమండలి, సామారంగం చౌక్, చల్లపల్లి బంగ్లా,  బోడెమ్మ హోటల్,  న్యూ ఇండియా హోటల్ సెంటర్, ఆ సెంటర్ లో జరిగే పబ్లిక్ మీటింగులు, అన్నపూర్ణమ్మ హాస్టల్, సత్యనారాయణపురం శివాజీ కేఫ్,  అలంకార్  సెంటర్,  మొగల్రాజపురం గాంధీ బొమ్మ సెంటర్, బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు, వీధి రాజయ్య మేడ, బందర్ రోడ్డు, పాత శివాలయం, కొత్త గుళ్ళు,  జెండా పంజా బస్ స్టాఫ్, అక్కడ గుమిగూడే  జనం ఇవీ బెజవాడ  అంటే.
లీలా  మహల్ పక్కన పిడత కింద పప్పు, ప్రొద్దుటే బాబాయి హోటల్ ఇడ్లీలు, ఏలూరు  రోడ్డు  సెంటర్ అజంతా హోటల్ లో ఇడ్లీ, సాంబార్, మోడర్న్ కేఫ్ లో మినప దోసె,  దుర్గ కాఫీ హౌసులో మైసూరు బజ్జీ, రవీంద్రా కూల్ డ్రింక్స్ లో ఐస్ క్రీం,  పుష్పాల రంగయ్య షాపులో నిమ్మకాయ సోడా, ఏలూరు కాలువ పక్కన బందరు మిఠాయి దుకాణంలో దొరికే నల్ల  హల్వా,  రామచంద్రరావు హోటల్లో  అరటి ఆకు భోజనం. మాచవరం పేరయ్య హోటల్ లో అన్నంతో వడ్డించే గడ్డ పెరుగు,  కౌతావారి శివాలయం పక్కన పాణీ కిల్లీ కొట్ట్లులో పచ్చకర్పూరం, జాజిపత్రితో చేసిన తాంబూలం,  సీ.వీ.ఆర్. స్కూలు దగ్గర పళని విబూది, వొడికిన జంధ్యాలు అమ్మే షాపు, క్షీరసాగర్ కంటి ఆసుపత్రి, రామమోహన ఆయుర్వేద వైద్య శాల, నందివాడ హనుమత్ సీతాపతి రావు హోమియో వైద్య శాల, సినిమా హాలా లేక  శిల్ప కళా క్షేత్రమా అనిపించే దుర్గా కళా మందిరం , మారుతి సినిమాజైహింద్ టాకీసు, లక్ష్మీ టాకీసు,  ఎప్పుడూ  హిందీ సినిమాలు ఆడే శేష్ మహల్, ఇంగ్లీష్ సినిమాలు మాత్రమె చూపించే లీలా మహల్, పాత సినిమాలు ఆడే ఈశ్వర మహల్- ఇవీ మాకు తెలిసిన బెజవాడ అంటే.
రాఘవయ్య పార్క్, రామ్మోహన్ గ్రంథాలయం, వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం దివ్యజ్ఞాన  సమాజం, అన్నదాన సమాజం, కాళేశ్వర రావు మార్కెట్, గాంధీ కొండ, పప్పుల మిల్లు, శరభయ్య గుళ్ళు, అరండల్ సత్రం, చెట్ల బజారు, గోరీల దొడ్డి, కృష్ణలంక పక్కన బిరబిరా పారే కృష్ణమ్మ,  ప్రకాశం బరాజు, అందర్నీ చల్లగా చూసే దుర్గమ్మ, దుర్గ గుడిలో  గోపికలతో  సయ్యాటలాడే కృష్ణుడి బొమ్మలు, అద్దాల మేడ, గుణదల కొండమీద మేరీ మాత, పున్నమ్మతోట, రేడియో స్టేషన్, నక్కలరోడ్డు, అచ్చమాంబ ఆసుపత్రి, అనంతం హాస్పిటల్, ముగ్గురన్నదమ్ముల ఆసుపత్రి, అమెరికన్ ఆసుపత్రి, మాంటిసోరి స్కూలు, బిషప్ అజరయ్య స్కూలు, మాచవరం కొండ, మొగల్రాజపురం గుహలు, ఎస్.ఆర్.ఆర్. కాలేజి, లయోలా  కాలేజి, శాతవాహన కాలేజి, గాంధీజీ  మునిసిపల్ హైస్కూల్,  సి.వి.ఆర్. స్కూలు, ఇవిగో ఇవీ గుర్తుకు రావాలి బెజవాడ పేరు చెప్పగానే.


 “బెజవాడ చాలా గొప్పది. అరవ వాళ్లకి  మద్రాస్ ఎంతో అంతకంటే తెలుగు వాడికి బెజవాడ గొప్పది.
NOTE: Courtesy Image Owner 

నాతో జాగ్రత్త!


ఈ మధ్య ఒక ఛానల్ యాంఖరమ్మాయి నా మొహాన ఓ కాంప్లిమెంటు పారేసింది.
'మీరిలా ప్రశాంతంగా ఎలా వుంటున్నారు. మా నాన్నగారు ఎప్పుడూ రుసరుసలాడుతూ ఉంటారు.'
పాపం ఆ అమ్మాయికి తెలియదు నేనూ ఇంట్లో అంతకంటే ఎక్కువ భుగభుగల మనిషినని. ఆ అమ్మాయి పుణ్యమా అని నాకొక విషయం తెలిసొచ్చింది. ప్రతిమనిషిలో ఓ అపరిచితుడు దాగుంటాడని. అందరికీ మంచిమనిషిగా కనిపించే శాల్తీలు నిజానికి అంత నిఖార్సయిన మంచి సరుకు కాకపోవచ్చని. సకల సద్గుణ రాముడని బయటవారు కీర్తించే  లక్షణాలు వారిలో ఆట్టే లేకపోవచ్చని.
ఈ రూలు నాకే కాదు మనం అందరం అభిమానించే సినీ తారలు, రాజకీయ నాయకులు, రచయితలు, జర్నలిష్టులకు  సైతం వర్తిస్తుంది. వాళ్ళ అందచందాలు, మాటల గారడీలు, రచనలు ఇవన్నీ చూసీ, వినీ, చదివీ పరమవీర అభిమానులం అయిపోతుంటాం. అక్కడే బోల్తాపడిపోతుంటాం. నిజానికి, పైకి కనిపించేవాటికీ, వారికీ ఆమడ దూరం వుంటుందన్న వాస్తవం మరచిపోతుంటాం.
అన్నింటికీ మినహాయింపు వున్నట్టే  ఈ  సూత్రం నుంచి వేరు చేసి చూడాల్సిన మహానుభావులు లేకపోలేదు.
వారు పుణ్య పురుషులు. మిగిలినవారు కాపురుషులు.




NOTE: Courtesy Image Owner 

4, సెప్టెంబర్ 2014, గురువారం

ఇద్దరు గురువులు



సంతః సదాభిగంతవ్యా యది నోపదిశం త్యపి
యాస్తు స్వైర కధాస్తేషాం ఉపదేశా భవంతి తాః

మనకు పాఠాలు బోధించే గురువులు వుంటారు. చెప్పని గురుదేవులూ వుంటారు. ఇటువంటివారు ప్రత్యేకించి ఏవిధమయిన ఉపదేశాలు ఇవ్వకపోయినా వాళ్లు ఏం చెబితే అదే ఉపదేశం అవుతుందని ఈ శ్లోక తాత్పర్యం.
గురు శిష్యుల గురించి  చెప్పుకునేటప్పుడు ఆకాశవాణి మాజీ డైరెక్టర్ డాక్టర్  పీ.ఎస్. గోపాలకృష్ణ చెప్పిన ఒక చిన్న కధ (?) గుర్తుకువస్తోంది.
ఆయన ఆ అబ్బాయికి పాఠాలు చెప్పాడు. కొన్నాళ్ళకు ఆ అబ్బాయి ఢిల్లీ సింహాసనం అధిష్టించి చక్రవర్తి అయ్యాడు. ఢిల్లీకి పాదుషా అయినా అయ్యవారికి  విద్యార్థే కదా అని ఆ అబ్బాయికి ఒక ఉత్తరం రాశారు. అందులో తాము శ్రీవారికి చిన్నతనంలో చదువు  చెప్పిన వివరాలు రాశారు. ఆ అబ్బాయి నుంచి అయ్యవారికి సమాధానం వచ్చింది.
తమరు నాకు పనికి వచ్చే చదువు  చెప్పలేదు. అక్కరలేనివన్నీ నా తలకెక్కించారు
ఆ అయ్యవారి పేరు ఇక్కడ అప్రస్తుతం. కానీ ఆ అబ్బాయి పేరు ఔరంగజేబు.
మరో అయ్యవారిని గురించి చెప్పుకుందాం.
1921 వ  సంవత్సరం. అంటే దాదాపు తొంభయ్ ఏళ్ళ పైమాట. మైసూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక అయ్యవారికి కలకత్తాకు బదిలీ అయింది. ఆయనగారు మైసూరు నుంచి బయలుదేరుతుంటే ఆయన ఇంటినుంచి రైల్వే స్టేషన్ కు పెద్ద వూరేగింపు బయలుదేరింది. ఆయన ఎక్కిన బండికి గుర్రాన్ని కట్టకుండా విద్యార్ధులే రధాన్ని లాగినట్టు స్టేషను దాకా లాక్కువెళ్ళారట. ఆయన గారు ఎక్కిన రైలు బోగీని విద్యార్ధులు ఒక అందమయిన దేవాలయం మాదిరి పూలతో అలంకరించారు.
పంతుళ్ళ చెవులకు శిష్యులు  తాటాకులు కట్టే ఈ రోజుల్లో అటువంటి సంఘటన విడ్డూరమే.
ఇంతకీ ఆ అయ్యవారు ఎవరనుకున్నారు? తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.
సెప్టెంబర్ ఐదో తేదీ. ఆ మహానుభావుడి పేరుతొ గురువులను సంస్మరించుకునే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునే రోజు.
అక్షర బిక్ష పెట్టి జీవితంలో ఈ స్తాయికి చేర్చిన తొలి గురువులను గుర్తుచేసుకునే రోజు.
నాకు మా వూరిలో అక్షరాభ్యాసం చేసినదెవరో తెలియదు. తెలిసినదల్లా మాష్టారంటే అప్పయ్య పంతులు గారు.

ఎనభై తొమ్మిది నిండి తొంభయ్యో పడి,  ఏ రోగం రొష్టు బారినపడకుండా అనాయాస మరణానికి నోచుకున్నారు. నలుగురికి విద్యాదానం చేసిన పుణ్యం ఆయనకు ఆవిధంగా అక్కరకు వచ్చింది.  మాకు ఇంత అక్షర బిక్ష పెట్టిన మహానుభావుడు దాటిపోయాడు. నిజంగా మహానుభావులకు మాత్రమే లభించే సునాయాస మరణం ఆయనకు దక్కింది.
మరో యాదృచ్చికం. అప్పయ్యగారి మరణ వార్త గురించిన ఫోను వచ్చినప్పుడు నేను రేడియో రోజులుమరో భాగం మొదలు పెడుతున్నాను. ఇందులో కాకతాళీయం ఏమిటంటే అప్పయ్య గారు నాకు తెలిసిన మొట్టమొదటి న్యూస్ రీడర్.  అదేమిటంటారా!
మాచిన్నప్పుడు గూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారనే పంచాంగ రచయిత ఒక్కరే చందా కట్టి ఆంద్రపత్రిక దినపత్రికను  పోస్టులో తెప్పించేవారు. ఆ పేపరు  మరునాడు సాయంత్రానికి కాని మా వూరు చేరేది కాదు. అప్పయ్య మాస్టారు వూరి నడిబొడ్డున నిలబడి ఆ పత్రికలోని వార్తలను అన్నింటినీ తన కంచు కంఠంతో చదివి వినిపించేవారు. వినే మా బోంట్లకు అచ్చు రేడియోలో వార్తలు విన్నట్టే వుండేది.
ఈ గురుపూర్ణిమ నాడు ఆయన్ని సంస్మరించుకుంటూ - 



శివరాజు అప్పయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను.