6, ఆగస్టు 2014, బుధవారం

మన జీవితమే మన గురువు


ఎక్కడో చదివినట్టు, ఏదో సినిమాలో చూసినట్టు  అనిపించే ఓ కధ ఇది.
అనగనగా ఓ అమ్మడు. పొద్దున్న బెంగళూరు వెళ్ళి ఆఫీసు పనిచూసుకుని  సాయంత్రానికల్లా   హైదరాబాదు తిరిగొద్దామని  శంషాబాదు  ఎయిర్ పోర్ట్ కు వెళ్ళింది. కాస్త వ్యవధానం వుండడంతో  ఓ ఇంగ్లీష్ నవలను,  దాంతో పాటే ఓ బిస్కెట్ ప్యాకెట్టును  కొనుక్కుని  వెయిటింగ్ హాలు కుర్చీలో తీరుబడిగా చేరగిలపడి పుస్తకం చదువుతూ ఒక్కో బిస్కెట్ తీసుకుని నోట్లో వేసుకుంటున్నతరుణంలో ఆ అమ్మడికి వున్నట్టుండి ఓ అనుమానం పొడసూపింది. పక్కన కూర్చున్న కుర్రాడు కూడా తాపీగా తన ప్యాకెట్ నుంచే ఒక్కో  బిస్కెట్టు  తీసుకుని తింటున్నట్టు అనిపించి అతడివైపు తేరిపార చూసింది. అతగాడు ఆమెను, ఆమె చూపుల్ని ఏమాత్రం  పట్టించుకోకుండా ప్యాకెట్ లోనుంచి బిస్కెట్లు తీసుకుని తింటూ చదువుతున్న పేపరులో మునిగిపోయాడు.  అలా ఇతరుల ప్యాకేట్ నుంచి  తింటూ కూడా ఏమీ తెలియని నంగనాచిలా పేపరు చదువుకుంటున్న అతడి తరహా చూసి ఆమెకు  చిరాకేసింది. మొహం మీదే కడిగేయాలన్నంత కోపం వచ్చినా  సభ్యతకోసం పైకి ఏమీ అనకుండా మిగిలిన ప్యాకెట్ ను  అక్కడే వొదిలేసి, చరచరా అడుగులు వేసుకుంటూ వెళ్ళి    బెంగుళూరు విమానం ఎక్కి తన సీట్లో సర్దుకుని కూర్చుంది.  రీడింగ్ గ్లాసులకోసం హ్యాండ్ బ్యాగు ఓపెన్ చేస్తే ఓపెన్ చెయ్యని బిస్కెట్ ప్యాకెట్ కనిపించింది. అప్పుడు కాని ఆమెకు జరిగిన పొరబాటు అర్ధం కాలేదు. నిజానికి తానే అతడి ప్యాకెట్ లోనుంచి బిస్కట్లు తీసుకున్న సంగతి తెలిసివచ్చి అయ్యో ఇంకా ఏదన్నా మాట తూలాను కాదుఅని మధనపడింది.
ప్రతికధకు ఏదో ఒక నీతి వున్నట్టే  ఈ కధనుంచి నేర్చుకోవాల్సిన నీతి కూడా వుంది.
జీవితంలో  వెనక్కు తీసుకోలేని విషయాలు  మూడు  వున్నాయి. అవేమిటంటే:
1. రాయి :  ఒకసారి విసిరితే దాన్ని మల్ళీ  వెనక్కు తీసుకోవడం కష్టం.
2. మాట : ఒక్కసారి నోరు జారితే అంతే సంగతులు.
3.  కాలం :  క్షణం గడిచిందంటే  అది శాశ్వితంగా  గతంలో కలసిపోయినట్టే.



ఇంకా ఇలాటివి మరికొన్ని వుండవచ్చు. నేర్చుకునే తీరిక వుండాలే కాని జీవితమే ఈ మాదిరి  నీతి పాఠాలను నేర్పుతుంది.

నా గురించి నలుగురూ ...........3


"మ్యాపు చూస్తున్న రాజీవ్ గాంధీ గభాలున ఆ జీపులో ఎక్కి కూర్చున్నారు. దాంతో రామారావుగారు, వెంగళరావుగారు, సెక్యూరిటీ వాళ్లు జీపు వెనుక ఎక్కారు. నేనూ, సురేందర్ పరిగెత్తుకువెళ్ళి జీపు వెనుక డోరు కడ్డీపై చతికిలపడ్డాము. భద్రాచలం సమీపంలోని అడవుల్లో ప్రయాణం షురూ. ఆ ప్రయాణం యెలా సాగింది, యెలా ముగిసిందీ అన్న ఆసక్తికరమైన సొంత అనుభవాన్ని రేడియోలో సుదీర్ఘకాలం పనిచేసిన భండారు శ్రీనివాసరావు అందిస్తారని 'వార్తల వెనుక కధ' సంపుటం సంపాదకులు, ప్రస్తుతం నమస్తే తెలంగాణా ఎడిటర్ అయిన శ్రీ కట్టా శేఖరరెడ్డి తన ప్రస్తావనలో రాశారు.



శ్రీ శేఖరరెడ్డి నా గురించి రాసిన పరిచయ వాక్యాలు:
1971 లో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో సబ్ ఎడిటర్ గా పత్రికా జీవితం ప్రారంభం. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగంలో మూడు దశాబ్దాల అనుభవం. నాలుగున్నర ఏళ్ళ పాటు (1987 - 1991 మధ్య) ఆనాటి  సోవియట్ రాజధాని మాస్కోలో,  'రేడియో మాస్కోలో ఉద్యోగం. సోవియట్ కుప్పకూలడానికి దారితీసిన పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి. ఆ అనుభవాలను పొందుపరుస్తూ 'మార్పుచూసిన చూసిన కళ్ళు' పుస్తక రచన.  2005 డిసెంబరులో దూరదర్శన్ నుంచి ఉద్యోగ విరమణ. రేడియోలో వారం వారం నిర్వహిచిన జీవన స్రవంతి కార్యక్రమం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆంధ్రజ్యోతిలో అనుదినం రాసిన 'వాక్టూన్లు' కూడా మంచి గుర్తింపు తెచ్చాయి."   

(సుప్రసిద్ధ జర్నలిస్ట్ , హెచ్ .ఎం.టీ.వీ. మాజీ సీ...,  శ్రీ కె. రామచంద్రమూర్తి, నమస్తే తెలంగాణా ఎడిటర్ శ్రీ కట్టా శేఖర్ రెడ్డి  సంపాదకత్వంలో  45 మంది జర్నలిష్టులు రాసిన  అనుభవాలను ఒక సంకలనంగా 'వార్తల వెనుక కధ' అనే పేరుతొ New Media Communications  వారు 2007 లో వెలువరించారు.)

5, ఆగస్టు 2014, మంగళవారం

నా గురించి నలుగురూ.....2


1988 లో ఆంధ్ర జ్యోతి మాజీ ఎడిటర్, మహా టీవీ చీఫ్ ఎడిటర్ శ్రీ ఐ. వెంకట్రావ్, నాటి సోవియట్ ప్రభుత్వ వార్తా సంస్థ 'నోవొస్తీ' ఆహ్వానంపై  రెండు వారాలపాటు సోవియట్ యూనియన్ ని సందర్శించారు. అందులో భాగంగా మాస్కో వచ్చారు. 'ఫ్లాష్ బ్యాక్' అనే పేరుతొ రచించిన పుస్తకంలో శ్రీ వెంకట్రావ్ నా గురించి ప్రస్తావించారు.
"మాస్కోలో వున్నప్పుడు మిత్రుడు భండారు శ్రీనివాసరావు ఇంటికి వెళ్లాను. ఆకాశవాణిలో పనిచేసే శ్రీనివాసరావు రేడియో మాస్కోలో డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారు. శ్రీనివాసరావు, నేనూ ఒకప్పుడు ఆంధ్రజ్యోతిలో సహచరులం. శ్రీనివాసరావు సరదా మనిషి. ఒకటే జోకులు. తెగ నవ్విస్తుంటారు. ఆయన కుటుంబం అంతా నాకు తెలుసు. అందువల్ల నన్ను డిన్నర్ కు ఇంటికి ఆహ్వానించారు. నాతొపాటు ఇండియా నుంచి వచ్చిన మరో ఇద్దరు జర్నలిష్టులను కూడా. ఆయన ఇంటిలోనే ప్రముఖ కూచిపూడి నర్తకి శోభానాయుడి గారిని కలిసాను. ఆవిడా, ఆవిడ బృందం ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా సోవియట్ నగరాల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. మాలాగే, ఆవిడా, ఆవిడ సహచర బృందం కూడా శ్రీనివాసరావుకి గెస్టులు. అర్ధరాత్రివరకు కబుర్లు, తిండి తినడాలతో కాలం ఇట్టే గడిచిపోయింది. హోటల్ కు తిరిగి రావడానికి ఇంటి బయటకు వస్తే వీధులన్నీ నిర్మానుష్యం. లైట్లు  దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. కానీ జనసంచారం నిల్. శ్రీనివాసరావుని అడిగాను - 'భయం వుండదా?'అని. మిగతా సమస్యలు యెలా వున్నా మాస్కోలో భయం అన్నది మాత్రం లేదని ఆయన భరోసా ఇచ్చారు. అర్ధరాత్రి వొంటరిగా ఆడమనిషి బయటకు వెళ్ళినా నిక్షేపంగా ఇంటికి చేరగలదని ఆయన చెప్పారు. దగ్గర్లో  వున్న మెట్రో స్టేషన్ వరకు మా వెంట వచ్చి రైలు ఎక్కించి వెళ్లారు."



నా గురించి నలుగురూ .....


నా గురించి నేను నలుగురికీ చెప్పుకోవడం ఓ సంగతి. నలుగురూ  నా గురించి ఏం చెప్పుకుంటున్నారో అన్నది మరో సంగతి. ఆ చెప్పేవాళ్ళు పెద్దవాళ్లయితే ఇక ఆ విషయం చెప్పుకోవడానికి అడ్డం ఏముంటుంది.
ముందుగా రేడియోలో నా సహచరులు, ప్రసిద్ధ కధారచయిత శ్రీ డి. వెంకట్రామయ్య ఉవాచ:


 “ నాకిప్పటికీ బాగా గుర్తుంది. సందర్భం ఏమిటో జ్ఞాపకం లేదు. ఒకనాటి సాయంత్రం డ్యూటీ ముగించుకుని నేనూ భండారు శ్రీనివాసరావు గారూ (ఇలా రాయడం ఆయన మర్యాద కానీ, ఇకనుంచి ఈ గౌరవ వాచకం తీసివేసి రాస్తాను) న్యూస్ రూమ్ నుంచి బయటకు నడుస్తుండగా ఆయనో మాట అన్నారు.
మీరు కుండలు బద్దలు కొట్టండి.  కాని కుండలు కొనుక్కొచ్చి మరీ బద్దలు కొడతానంటే యెలా అని. అంతకుముందు ఆఫీసులో ఏదో జరిగింది. ...ఎవరితోనో నేను ఘర్షణకు దిగడమో, తీవ్రస్థాయిలో వాదించడమో జరిగింది.  అలాటి సందర్భాలలో అవసరానికి మించి ఆవేశపడడం, అవతలి వ్యక్తి ఎవరయినా సరే, ఏమాత్రం సంకోచించకుండా వున్న మాట మొహాన  అనేయడంవంటి నా సహజ స్వభావం గురించి , శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్య ఇది. కుండలు కొనుక్కొచ్చి మరీ బద్దలు కొట్టడంఅన్న ఆయన చమత్కారానికి నేనూ నవ్వుకున్నాను. ఆ చమత్కారపు మాటల వెనక నా బోటివారు ఆలోచించవలసిన, చేతనయితే అనుసరించవలసిన మంచి సలహా వున్నట్టు నాకనిపించింది.
 అప్పుడే కాదు,  అంతకి ముందు ఆ తరువాతా కూడా ఎన్నో సందర్భాలలో, తన చమత్కారాలు, చతురోక్తులు  జోడించి  ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ  నాకెన్నో సలహాలు అందించేవారాయన. కాని నేను వింటేగా. రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్టు నా మొండితనం నాదే. ఎన్నిమార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆయన నన్నెంత మాత్రం మార్చలేకపోయారు, ముఖ్యంగా ఆఫీసు విషయాల్లో. శ్రీనివాసరావులాటి మిత్రుల  సుదీర్ఘ సహవాసంవల్ల ఆఫీసునుంచి బయటకు వచ్చిన తరువాతైనా  కాస్త నవ్వడం నేర్చుకున్నాను. నలుగురిలో మసలడం నేర్చుకున్నాను. నాలుగు మాటలు నేర్చుకున్నాను. అయినా ఆఫీసులో కూర్చున్నంతసేపు నా పని నాదే, నా పద్ధతులు నావే. నా నియమాలు నావే. సక్రమం, సమజసం  అనుకున్న మార్గాన్ని ఏమాత్రం విడవలేదు”  
(ఆకాశవాణిలో నా అనుభవాలు శ్రీ డి వెంకట్రామయ్య, ‘రచనఅక్టోబర్, 2013 సంచిక నుంచి రచన సంపాదకులు శాయి గారికి కృతజ్ఞతలు)

నిజమేనేమో!


'పుట్టుకతో కాదు కాని నేను మాంసాహారినే' అంటుంది మా ఆవిడ.

ఎందుకంటే  తీరికూర్చుని  ఇతర్ల మెదళ్ళు తింటుంటానుట.  


4, ఆగస్టు 2014, సోమవారం

టీవీ చూస్తున్నా. ఏమిటా గోల?


(నెల్లుట్ల వెంకట రమణారావు గారు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ కధనానికి అనువాదం)
ఏకాంబరం టీవీలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే భార్య చేతులు తుడుచుకుంటూ వచ్చి అడిగింది.
"ఏమిటి చూస్తున్నారు"
"ఐ పీఎల్. నువ్వూ కూర్చుని  చూడు"
"బ్యాట్ చేస్తున్నది బ్రిట్ లీ కదా"
"కాదు అతడు బౌలర్. ఇతడు క్రిస్ గేల్"
"ఓహో! అలా అనిపించింది. భలే! భలే! మళ్ళీ వికెట్ పడింది"
"అది రీప్లే. ఇందాకటిదే మళ్ళీ చూపిస్తున్నారు"
"అలాగా! నేనూ అదే అనుకున్నాను. చూస్తుండండి ఈసారి ఈ మ్యాచ్ ఇండియా గెలిచి  తీరుతుంది"
"ఐపీఎల్ ఇండియా ఆడే మ్యాచ్ కాదు. ఇప్పుడు జరుగుతున్న  మ్యాచ్ బెంగుళూరు ముంబై మధ్య"
"నేనూ అదే అనుకున్నాను. ఈ జట్టు గెలవాలంటే ఇంకా ఎన్ని రన్స్ చేయాలి"
"36 బంతుల్లో 72 పరుగులు చేయాలి"
"తేలిగ్గా చేయొచ్చు. ఒక్క బంతికి రెండు పరుగులు"
"ఈ గోలంతా యెందుకు. నీకు టీవీ కావాలి. సీరియల్ చూడాలి. అంతే కదా!"
ఏకాంబరం భార్యకు రిమోట్ ఇచ్చేసాడు. ఆమె ఛానల్ మార్చి సీరియల్లో మునిగిపోయింది.
"నిన్న ఎపిసోడ్ లో కనిపించలేదు. ఎవరావిడ?" ఏకాంబరం చిన్నగా అడిగాడు.
భార్య గయ్యిమని లేచింది.
"నన్ను చూడనివ్వరా? కాసేపు ఆగలేరా? సీరియల్ పూర్తయ్యేదాకా వూరికే పక్కన కూర్చుని ఇలా ప్రశ్నలతో చంపకండి."




NOTE: Courtesy Image Owner 

అబ్రకదబ్ర


నాటి మాటలు  
"ముఖ్యమంత్రి కాగానే చరిత్రను మార్చే సంతకాలు చేస్తా!" - వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి
"ముఖ్యమంత్రి అవగానే సీమాంధ్రను సింగపూర్ చేసేస్తా!" - చంద్రబాబు నాయుడు
"తెలంగాణా రాష్ట్రంలో హెలికాఫ్టర్ అంబులెన్సులు ఏర్పాటుచేస్తా! ఆదిలాబాదును బంగారు తునకగా మారుస్తా!" " - కేసీఆర్
"సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తాం" - కేంద్ర మంత్రి జై రామ్ రమేష్



(మాంధాతల కాలంనాటి మాటలు కాదు - ఈ ఏడాది మార్చిలో చెప్పినవి - పాత పేపర్లలో కనబడ్డవి)