కుర్రవానిలో గురుదర్శనం
(ఆదిశంకరాచార్యుల తరువాత అంతటి భగవదంశ కలిగిన
మహానుభావుడు కంచి కామకోటి పీఠానికి 68 వ ఆచార్యుడయిన శ్రీ చంద్రశేఖరేంద్ర
సరస్వతీ స్వామి. 'నడిచే దేవుడి'గా ప్రసిద్దులయిన వారి గురించి మా అన్నయ్య,
కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు 'పరమాచార్య
పావనగాధలు' పేరుతొ ఒక చిరు పొత్తం రచించారు. ఆ పుస్తకం ఆధారంగా అందిస్తున్న పావన
గాదాశతి ఇది)
"స్వామినాధన్ తమిళనాడులో దక్షిణ ఆర్కాట్
జిల్లాలోని విలుప్పురం గ్రామంలో 1894 మే 20న
జన్మించారు. తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి. తల్లి మహాలక్ష్మి. స్వామినాధన్ చిన్నతనంలో వారింటికి శాస్త్రి గారి
స్నేహితుడు వచ్చారు. వృత్తిరీత్యా న్యాయవాది అయినా ప్రవృత్తిరీత్యా జ్యోతిష్యుడు.
పిల్లవాడి జాతకాన్ని పరిశీలిస్తూ ఆయన, తల్లిని ఓ చెంబుతో నీళ్ళు తెమ్మని అడిగారు. తెచ్చిన
నీళ్ళతో ఆయన, స్వామినాధన్ కాళ్ళు కడిగి సాష్టాంగ నమస్కారం చేయడం చూసి
తలిదండ్రులు నిర్ఘాంతపోయారు. శాస్త్రి గారు ఆశ్చర్యం నుంచి తేరుకుని 'అదేం పని!
పెద్దవాడివి నువ్వు. పిల్లవాడిముందు సాగిలపడడం ఏమిటి?' అని మందలిస్తున్నట్టు అన్నారు.
అప్పుడా న్యాయవాది నవ్వుతూ, 'నేనెంత! ఈ ప్రపంచం అంతా ఈ చిన్నవాడి పాదాలకు ప్రణమిల్లే
రోజు రాబోతోంది. కానీ అప్పటికి నేనుంటానో, వుండనో తెలియదు కదా! అందుకని ఈ రోజే ఆ
పనిచేసి తరించా' అన్నాడు.
ఆయన జోస్యమే నిజమయింది.




