21, మార్చి 2014, శుక్రవారం

"నో వర్రీ మేడం! మోడీ వచ్చే చాన్స్ లేదు"


(గుంటూరి నాగేశ్వరరావు గారు షేర్ చేసిన ఇంగ్లీష్ జోక్కి అనువాదం, వారికి కృతజ్ఞతలతో)
పాడు ప్రపంచాన్ని చూసి చూసి దేవుడికి వొళ్ళు మండిపోయింది. దీన్ని దేవుడు కూడా మార్చలేడు  అవటా అనుకుని ఏమైనా సరే ఈ  ప్రపంచానికి  భరత వాక్యం పలకాలని నిర్ణయించేశాడు. అయితే ఈ నిర్ణయాన్ని అమలుచేసేముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలా ఓ సమావేశం ఏర్పాటుచేసి తాను ముఖ్యులు అనుకున్న ఓ ముగ్గురు దేశాధినేతలను దానికి రమ్మని ఆహ్వానించాడు. పిలుపుల మేరకు అమెరికా అధ్యక్షుడు ఒబామా, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మన్మోహన్ సింగ్ వెళ్లారు. దేవుడు ఆట్టే సమయం వృధా చేయకుండా ప్రపంచాన్ని అంతం చేయబోతున్నట్టు ప్రకటించి 'పోయి మీ వాళ్లకు చెప్పుకోండ'ని ఆదేశించాడు.
ఒబామా వెంటనే టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటుచేసి తన దేశప్రజలతో చెప్పాడు.
'మీ అందరికీ ఓ శుభ వార్త. ఓ చెడు వార్త. మంచి వార్త ఏమిటంటే మనం అందరం విశ్వసిస్తున్న దేవుడు నిజంగానే వున్నాడు. దుర్వార్త  ఏమిటంటే ప్రపంచాన్ని అంతం చేయబోతున్నట్టు ఆయనే నాతొ స్వయంగా చెప్పాడు'
చైనా అధ్యక్షుడు తన దేశపౌరులను ఉద్దేశించి మాట్లాడాడు.
'ప్రియమైన కామ్రేడ్స్! ఒక దుర్వార్త ఏమిటంటే మనం దేవుడు లేడని ఇన్నాళ్ళు చెబుతూ వచ్చాం. అది నిజం కాదు. ఆయన్ని ఇప్పుడే కలుసుకున్నాను. దానికంటే మించిన చెడు వార్త ఒకటి వుంది. ఈ యావత్ ప్రపంచాన్ని కమ్యూనిస్ట్ ప్రపంచంగా మార్చాలనే మన ఆశయం నెరవేరేటట్టులేదు. ఎందుకంటే ఆ పాడు దేవుడు దీన్ని అంతం చేయాలని ఓ నియంతలా  ఆకస్మిక నిర్ణయం తీసుకున్నాడు"
మన్ మోహన్ సింగ్ దేశ ప్రజల జోలికి పోలేదు. ముందు మేడం సోనియాకు ఫోను చేసాడు.
'మేడం. ఓ శుభవార్త. దానికితోడు దాన్ని మించిన మరో మంచి వార్త. ఇన్నాళ్ళు నేనొక పనికి రానివాడినని పేపర్లలో కార్టూన్లు వేస్తుంటే నిజమే కాబోసు అని బాధపడేవాడిని. కాని మేడం ! ఆ దేవుడు నా ప్రతిభని గుర్తించాడు. అమెరికా, చైనా అధ్యక్షులతో పాటు నన్ను కూడా ఆహ్వానించాడు' అన్నాడు గడ్డం మాటున  ముసి ముసి నవ్వులు దాచుకుంటూ.
'మీ  సంగతి సరే! ఇంతకీ  ఆ మంచి వార్త ఏమిటో చెప్పండి'
'అదా మేడం. దేవుడు ఈ లోకానికి తక్షణం చరమగీతం పాడాలని నిర్ణయించేసాడు. మోడీ ప్రధాని అయిపోతాడేమోనన్న  భయం అక్కరలేదు మేడం'

కలత పెట్టే జ్ఞాపకం


అంజయ్య గారి లాగే చనువుగా మసలిన ముఖ్యమంత్రులు మరో ఇద్దరు వున్నారు. ఒకరు చంద్ర బాబు, మరొకరు రాజశేఖరరెడ్డి. వీరిద్దరూ అంజయ్య గారి మంత్రివర్గంలో సభ్యులు. ముందు వై ఎస్ ఆర్ చేరారు. ఆతరువాత విస్తరణలో చంద్రబాబుకు చోటు దొరికింది. వీరిద్దరూ మంచి మిత్రులు. దానికి నేనే సాక్ష్యం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత  రాజకీయంగా వీరి దారులు వేరయ్యాయి. బాబు ముఖ్యమంత్రి అయిన తరువాత అఘాధం మరింత పెరిగింది. ఆ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా చోటుచేకున్న వాదప్రతివాదాలు గమనించినప్పుడు - ఈ దూరం కేవలం రాజకీయం వల్లకాదు, వ్యక్తిగతం అనికూడా అనిపించింది. ఒకప్పుడు వీరిద్దరి నడుమ వున్న స్నేహాన్ని దగ్గరగా చూసిన వాడిగా 'ఆదూరం' నన్ను ఎంతో బాధ పెట్టింది. అయినా ఇద్దరితో నా పరిచయం అలాగే కొనసాగింది. ఒకరి సంగతులు మరొకరికి మోయడం అనే సద్గుణం లేకపోవడం వల్ల అని అనుకుంటున్నాను. ఒకసారి స్కూటరు నుంచి పడి కాలు విరిగి ఆసుపత్రిలో పడి వుంటే ఉధృతమైన ఎన్నికల ప్రచారంలో తలమునకలై వుండి కూడా వీరు తమ స్నేహ వాత్సల్యాన్ని నాపై ప్రదర్శించారు. ముఖ్యమంత్రిగా వుంటూ ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చి పరామర్శించాల్సిన అవసరం చంద్రబాబుకు వుందనుకోను. అలాగే ప్రతిపక్ష నేత వై ఎస్ ఆర్.


వెళ్ళి పిలవకపోయినా మా పిల్లవాడి పెళ్ళికి ఎస్ ఎం ఎస్ పిలుపుతో హాజరయిన గొప్పతనం వారిది. వారి దారులు వేరయి, వైరి పక్షాలుగా మారడం నన్ను ఎప్పుడూ కలత పెట్టే విషయం. వీరిలో ఒకరు లేకుండా పోయారు. మరొకరిని కలుసుకునే వీలు లేదు.



విలేకరులు ఏమీ సంపాదించుకోకపోయినా ఇలాటి అనుభవాలు వారికే సొంతం.               

20, మార్చి 2014, గురువారం

సోల్డ్ అవుట్


ఇంట్లో వొంట్లో బాగా బలిసిన ఓ అరబ్  షేక్ గారు విమానంలో ఎయిర్ హోస్టెస్  చూసి మనసు పారేసుకున్నారు. వెంటనే క్యాబిన్ లో కెప్టెన్ ని కలిసి ఆ ఆమ్మడ్ని కొనుక్కుంటాను ధర ఎంతో చెప్పమన్నాడు.
అక్కడినుంచి వారిద్దరి మధ్య సంభాషణ ఇలా నడిచింది.
"కుదరదు. ఎయిర్ హోస్టెస్ మా విమాన సిబ్బందిలో ఒకరు. అలా కొనేసుకుంటాను అంటే అసలు కుదరదు."
"ఐయితే విమానమే  కొంటాను దాని ధర  ఎంతో చెప్పండి"
"ఈ విమానం ఎయిర్ ఇండియాది.'
"అలా అయితే ఎయిర్ ఇండియాని కొంటాను."
"మీరిలా ఎయిర్ ఇండియాలు, ఇండియన్ ఎయిర్ లైన్స్ లూ కొంటానంటే మా దేశంలో వీలుండదు. అవి భారత ప్రభుత్వానివి."
"అలానా. అయితే ఆ ప్రభుత్వం ఎంతకు అమ్ముడవుతుందో చెప్పు. ఇప్పుడే చెక్కు రాసిస్తాను"
"మీరు చాలా ఆలస్యం చేశారు. మా ప్రభుత్వం అంబానీలకు అమ్ముడుపోయి చాలా కాలం అయ్యింది."
(నెట్లో సంచారం చేసే ఇంగ్లీష్ జోక్కి స్వేచ్చానువాదం)

సంస్కారం


సంస్కారం అనేది జన్మతః రావాలని అంటారు. కానీ, చూసి నేర్చుకోవడం, నేర్పించడం ద్వారా కూడా సంస్కారం అలవడుతుంది అనడానికి అనేక దృష్టాంతాలు వున్నాయి.
సంస్కారం మన పొరుగున వున్న కన్నడిగుల్లో ఎక్కువేమో అనే అభిప్రాయం కూడా వుంది. కన్నడ సాహిత్యానికి చక్కటి గుర్తింపు తెచ్చిన యు.ఆర్. అనంతమూర్తి ఏకంగా 'సంస్కార' పేరుతొ ఒక నవల రాశారు కూడా.
సంస్కారం గురించిన ముచ్చట పాత్రికేయ మిత్రుడు సత్యమూర్తి దగ్గర వచ్చింది.
వాళ్ళబ్బాయి కన్నడ దేశంలోని ఒకానొక వైద్య కళాశాలలో చదువు పూర్తిచేసుకుని డాక్టర్ పట్టా పుచ్చుకున్నాడు. ఓ జర్నలిస్టు కొడుకు చదువులో ఇలా ఎదిగిరావడమే  అదృష్టం అనుకుంటే సత్యమూర్తి డబల్ ధమాకా కొట్టాడు. వాళ్ల అమ్మాయి కూడా రేపోమాపో డాక్టర్ కాబోతోంది.
అది సరే. సంస్కారం గురించికదా చెప్పుకుంటున్నాం.


(పుత్రోత్సాహము)

కాన్వొకేషన్ కు రమ్మని ఆ వైద్య కళాశాల నుంచి సత్యమూర్తి దంపతులకు ఆహ్వానం అందింది. భార్యను, డాక్టర్ తనయుడినీ, కాబోయే దాక్టరమ్మను  అందర్నీ వెంటబెట్టుకుని 'చిత్ర  దుర్గం' కాబోలు వెళ్లారు. అక్కడి ఏర్పాట్లు వారికి దిగ్భ్రాంతిని కలిగించాయి. పట్టా పుచ్చుకునే పట్టభద్రుల తలిదండ్రులందరికీ ముందు వరసల్లో వాళ్ల పేర్లు రాసి  మరీ సీట్లు రిజర్వ్ చేశారు. పట్టా ప్రదానం సమయంలో పలానా వారి తలితండ్రులని అందరికీ పరిచయం చేశారు. పట్టాలపై కూడా 'పలానా వారి అబ్బాయి' అని తండ్రి పేరుతో బాటు తల్లిపేరు కూడా ముద్రించారు. 'ఈ తలిదండ్రుల కడుపున  పుట్టడం వల్లనే మీరు ఇలా సమాజంలో నలుగురికీ సేవ చేసే భాగ్యం పొందగలిగార'ని పిల్లలకు  చెప్పారు. తలిదండ్రుల గొప్పతనం గురించి తెలియచేసే రెండు షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శించారు.ఇక సంస్కారం అలవాడక ఏం చేస్తుంది చెప్పండి.అందుకే చెప్పింది. సంస్కారం జన్మతః అబ్బుతుంది. అలాగే నేర్పడం ద్వారా అలవడుతుంది.
ఆవిధంగా సత్యమూర్తి దంపతులది 'ట్రిపిల్ ధమాకా!'

19, మార్చి 2014, బుధవారం

ఇప్పుడు - అప్పుడు


చూశారా! ఇటీవల రాష్ట్రపతి హైదరాబాదు వచ్చినప్పుడు స్థానిక జర్నలిస్టులను బొలారం లోని రాష్ట్రపతి నిలయంలో కలిశారు. జర్నలిస్టులకు వారికీ మధ్యవున్న 'వేరు బంధం' గమనించారా?



గతంలో నేను రేడియోలో పనిచేస్తున్నప్పుడు నాటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ అదే భవనంలో విలేకరులను కలుసుకున్నారు. మేమందరం హాయిగా ఆయనతో కరచాలనం చేయగలిగాము.



అప్పటికీ ఇప్పటికీ ఇదీ తేడా!

చంద్రబాబు నాయుడు గారు నవ్వుతారా?


ఇదేమీ టీవీల్లో ఎస్ఎంఎస్ ప్రశ్న కాదు. అందుకు సందేహం అక్కరలేదు. ఆయన నవ్వుతారు. కాకపొతే నవ్వించాలి.
ఆయన ముఖ్యమంత్రిగా వున్న తొమ్మిదేళ్ళ పైచిలుకు కాలంలో 'నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వన'ని ఉద్యోగులని వెంటబడి తరుముతూ పనిచేయిస్తున్న కాలంలో, నవ్వుతూ వుంటే ఆ మాటలకు సీరియస్ నెస్ రాదని మానేసారేమో కాని ఆయనా నవ్వుతారు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే!


(చంద్రబాబునాయుడు ఆర్ధికమంత్రిగా వున్నప్పుడు మా వూరునుంచి మా అన్నయ్య కీర్తిశేషులు భండారు వేంకటేశ్వర రావు వచ్చి బాబుగారిని చూడాలంటే సచివాలయానికి తీసుకువెళ్ళాను. ఆ సమయంలో అక్కడ వున్న విలేకరులతో కలిపి తీసిన  ఫోటో. ఇందులో నేను లేకపోవడానికి కారణం ఫోటో తీసింది నేను కావడమే) 

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో జూబిలీ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పనిలో పనిగా 'డిన్నర్ ఫాలోస్' అని దానికో టాగ్ లైన్. ఆరోజు ప్రాంతీయ వార్తలు సమాప్తం అనగానే నడుచుకుంటూ రేడియో స్టేషన్ కు ఎదురుగా వున్న జూబిలీ  హాలుకు బయలుదేరాను. పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గర  పోలీసుల హడావిడి కనిపించింది. లోపలకు వెడితే సీఎం పేషీ అధికారులు కొందరు కనిపించారు. విలేకరుల సంఖ్య చాలా పలుచగా వుంది. నేనంటే ఎదురుగా వున్నాకనుక వెంటనే వచ్చాను మిగిలిన వాళ్లు నెమ్మదిగా వస్తారులే అనుకున్నా. ఈలోపల సీపీఆర్వో విజయ్ కుమార్ వచ్చాడు. విలేకరుల  సంఖ్య చూసి ఆయనా నిరుత్సాహపడ్డట్టున్నాడు. కొందరికి ఫోన్లు చేసి గుర్తుచేసే పనిలో పడ్డాడు. ఈలోగా సచివాలయం నుంచి ఫోన్లు, సీఎం బయలుదేరి రావచ్చా అని. మొత్తం మీద కొంత కోరం పూర్తయింది. చంద్రబాబు వచ్చేశారు. విలేకరులు పలుచగా వుండడం ఆయన కూడా గమనించారు.
'దీనికి మూడు కారణాలు వున్నాయి' అన్నాను ఆయన పక్కనే కూర్చుని.
అవేమిటో చెప్పమని అడిగారు.
'నెంబర్ వన్. ఈరోజు వాతావరణం చల్లగా వుంది. చినుకులు పడతాయా అన్నట్టుగా వుంది'
'అయితే...'
'నెంబర్ టూ. ఈరోజు టీవీలో ఇండియా పాకిస్తాన్, డే అండ్ నైట్  వన్ డే మ్యాచ్ వస్తోంది'
'వూ..'
'లాస్ట్ వన్. ఇది జూబిలీ హాలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్. ఇక్కడేమి  వుంటుంది. మా ఆఫీసు దగ్గర్లో లేకపోతే నేను కూడా డుమ్మా కొట్టేవాడినే'
ఆయనకు అర్ధం అయింది. అర్ధం కాగానే హాయిగా నవ్వేసి నా భుజం తట్టారు.

చదువుకున్న వోటర్లకు ఓ విజ్ఞప్తి


సగటు భారతీయ వోటరు అంటే నాకు తగని గౌరవం. దీనికి కారణం వుంది.
అనేక దశాబ్దాల నుంచి ఎన్నికలు చూస్తూ వస్తున్నాను. కాడిజోడెడ్లు (కాంగ్రెస్) కంకీ కొడవలి (కమ్యూనిస్ట్) ప్రమిదె (జనసంఘం) ఇలా పోలింగు కేంద్రంలో గుర్తులు అతికించిన బ్యాలెట్ డబ్బాలు (నిజంగానే డబ్బాలు, ఖాళీ కిరసనాయిలు డబ్బాలు అనుకుంటాను) పెట్టేవాళ్ళు. ఏపార్టీకి వచ్చిన వోట్లు విడిగా లెక్కబెట్టి ఫలితాలు ప్రకటించేవాళ్ళు. తరువాత కాలంలో కాంగ్రెస్ గుర్తు ఆవూ దూడా, ఆ పిదప హస్తం ఇలా మారిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీలు రెండుగా విడిపోయాయి. జనసంఘం భారతీయ జనతా పార్తీగా పేరుతో బాటు, గుర్తును కమలంగా మార్చుకుంది. అభ్యర్ధుల పేర్లు లేకుండా గుర్తులతో బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. ఎలక్ట్రానిక్ వోటింగి యంత్రాలు రంగ ప్రవేశం చేసాయి. చదువుకున్న పోలింగు సిబ్బంది కొంత గందరగోళపడ్డారు కాని నిరక్షరాస్యుడయిన సగటు వోటరు మార్పుకు తేలిగ్గా అలవాటుపడ్డాడు. మనతోబాటే స్వతంత్రం తెచ్చుకున్న ఇరుగుపొరుగు దేశాలు ఎప్పుడో ఒకప్పుడు సైనిక పాలనలోకి జారిపోయాయి కాని మనదగ్గర మాత్రం ప్రభుత్వాలు కేవలం వోటుతోనే మారుతూ వచ్చాయి.


(దయచేసి ఇలా సగటు వోటర్ని అవమానించవద్దు. ఈ వొట్టినీతులు కట్టిపెట్టి,  చేతనయితే పోలింగు రోజు టీవీలకు, కంప్యూటర్లకు అతుక్కుపోకుండా వెళ్ళి వోటు వేసి అందరికీ ఆదర్శంగా నిలవండి.)

అలాటి చరిత్ర కలిగిన సగటు వోటర్ని డబ్బుకు మద్యానికి అమ్ముడుపోవద్దని నీతులు చెబుతున్నప్పుడు చాలా బాధ వేస్తుంది. నిజానికి వాళ్ళే ప్రతిఎన్నికలో చురుగ్గా పాల్గొని వోటు హక్కు వినియోగించుకునే వాళ్లు. ఎండయినా వానయినా పోలింగు కేంద్రాల వద్ద క్యూలల్లో వేచి  నిలబడి వోటు వేసేవాళ్ళు. చదువుకున్నవాళ్ళలో ఇలాటి చొరవ కనబడదు. పైపెచ్చు వాళ్లు డబ్బుకు గడ్డి తిని వోటేస్తున్నారని ఎద్దేవా చేస్తుంటారు. ఇది వాళ్లని అవమానించడమే. నిజానికి అధికారానికి భయపడి  వోటేస్తే ఎమర్జెన్సీ తరువాత ఇందిరాగాంధి వోడిపోయేదా ? డబ్బుకు కక్కుర్తి పడి  వోటేస్తే   డబ్బున్నఖామందులందరూ గెలుస్తూ వుండేవారు కదా!
రాజకీయ పార్టీలు డబ్బున్నవాళ్లకు టిక్కెట్లు ఇస్తే వాళ్లు ప్రచారానికి ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేస్తారు. నామినేషన్ వేయడానికి వాళ్లు చేసే హడావిడి చూసి ఎవ్వరు మాట్లాడరు. ప్రత్యేక విమానాల్లో, హెలికాఫ్టర్లలో నాయకులు తిరుగుతుంటే ఆ డబ్బెక్కడిది అని అడిగేవాళ్ళు వుండరు. వోటరు దగ్గరకు వచ్చేసరికి అందరూ నీతులు చెప్పేవాళ్ళే!
ఎన్నికల్లో అభ్యర్ధులు ముట్టచెప్పే డబ్బు తీసుకుంటున్నారేమో కాని ఖచ్చితంగా వోటు మాత్రం వాళ్లు అమ్ముకోవడం లేదు. ఇది నిష్టూరంగా ధ్వనించే సత్యం.