8, మార్చి 2014, శనివారం

కలకంఠి కన్నీరు

 

(అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని)

గోపాలానిది అటూ ఇటూ కాని వయసు. ప్రతిదీ అర్ధం చేసుకోవాలనిపిస్తుంది. ఏదీ సరిగా అర్ధం కాదు.

అమ్మ వొంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకోవడం చూశాడు కానీ ఎందుకో అర్ధం కాలేదు. అదే అడిగాడు.

“ఇలా ఏడిస్తేకానీ నా గుండెల్లో భారం తగ్గదు” అంది భారంగా.

“అర్ధం కాలేదు. భారం అంటే?”

“నీకర్ధం కాదులే! ఇప్పడే కాదు ఎప్పటికీ అర్ధం కాదు” కొడుకును దగ్గరికి తీసుకుంటూ అంది తల్లి.

గోపాలం తండ్రి దగ్గరకు వెళ్లి అమ్మ ఏడుస్తున్న సంగతి చెప్పి కారణం అడిగాడు.

“మీ అమ్మే కాదు ఆడాళ్లందరూ కారణం లేకుండానే ఏడుస్తుంటారు” తేలిగ్గా తీసేశాడు తండ్రి.

కానీ ఆడవాళ్ళు ఎందుకు ఏడుస్తారు అన్న అనుమానం తీరలేదు చిన్న గోపాలానికి.

స్కూలుకు వెళ్ళినప్పుడు టీచరు వొంటరిగా వున్నప్పుడు చూసి తన అనుమానం బయట పెట్టాడు.

ఆ టీచరు బాగా చదువుకున్నది. లోకజ్ఞానం బాగా వున్నది.

ఆమె ఇలా చెప్పింది.

“బ్రహ్మ దేవుడు సృష్టి కార్యం నిర్వర్తిస్తూ ఒక స్త్రీ మూర్తిని తయారు చేశాడు. ఆ బొమ్మకు ప్రాణం పోసేముందు స్త్రీ జాతికి కొన్ని ప్రత్యేకతలు కల్పించాలనుకున్నాడు.

“సంసార భారాన్ని తేలిగ్గా మోయగల శక్తిని ఆమె చేతులకు ఇచ్చాడు. అదే సమయంలో కుటుంబ సభ్యులకు ఎలాటి ఇబ్బంది లేకుండా చూడగల మానసిక మృదుత్వాన్ని ప్రసాదించాడు.

“నవమాసాలు మోసి, ప్రాణాలనే పణంగా పెట్టి మరో జీవిని ఈ లోకంలోకి తీసుకురాగల ఆత్మ స్తైర్యాన్ని అనుగ్రహించాడు.

“అంతేకాదు, అంత కష్టపడి కన్న, కన్న పిల్లలే పెరిగి పెద్దయిన తరువాత వారి నుంచి ఎదురయ్యే దూషణ భూషణ తిరస్కారాలను భరించగల హృదయ వైశాల్యాన్ని వరంగా ఇచ్చాడు.

“కుటుంబంలో సమస్యలు ఎదురయినప్పుడు అందరూ పట్టనట్టు వొదిలేసి వెడుతున్నా అన్నీ తన నెత్తిన వేసుకుని సంసార నావను ఓ దరిచేర్చగల నిగ్రహాన్ని అనుగ్రహించాడు.

“ఇంట్లో ఏఒక్కరికి వొంట్లో బాగా లేకపోయినా ఏమాత్రం విసుక్కోకుండా రేయింబవళ్ళు సేవ చేసే మంచి మనసును ఆమె పరం చేసాడు.

“పిల్లలు విసుక్కున్నా, మాటలతో చేతలతో మనసును గాయపరచినా వారిని ప్రేమించి లాలించే హృదయాన్ని ఇచ్చాడు.

“కట్టుకున్నవాడు ఎన్ని తప్పులు చేసినా ఉదారంగా మన్నించి మరచిపోగల మనసును ఇచ్చాడు.

“సంసారంలో ఎన్ని వొడిదుడుకులు ఎదురయినా ఎదుర్కుంటూ భర్త వెంట నడవగల ధీమంతాన్ని ఆమె సొంతం చేశాడు.

“ఇన్ని ఇచ్చిన ఆ భగవంతుడు, ‘కన్నీరు’ ను కూడా వరంగా అనుగ్రహించాడు.

“కన్నీరు ఆడవారి సొంతం. తమకు అవసరమయినప్పుడల్లా కన్నీరు పెట్టుకుని తమ మనసులోని భారాన్ని దింపుకుంటారు. కష్టాలతో, క్లేశాలతో కల్మషమయిన మనసును శుభ్రం చేసుకోవడానికి వారికి ఉపయోగపడే నీరే ఈ కన్నీరు. కన్నీరు పెట్టుకోవడానికి కారణాలు చెప్పాల్సిన అవసరం కానీ హేతువులు చూపించాల్సిన అగత్యం కానీ ఆడవారికి లేదు.

“చూడు గోపాలం. ప్రేమను నింపుకున్న వారి హృదయానికి ప్రధాన కవాటాలు వారి కంటిలోని ఈ కన్నీటి చుక్కలే.”

టీచరు చెప్పింది గోపాలానికి కొంత అర్ధం అయింది. కొంత కాలేదు.

కానీ, ప్రపంచంలోని మగవాళ్లకు మాత్రం ఎప్పటికీ అర్ధం కాదు. ఆ అవసరం కూడా వారికి లేదు.

7, మార్చి 2014, శుక్రవారం

వార్త - వ్యాఖ్య


'ప్రత్యర్ధుల విమర్శలపై నేను వ్యాఖ్యానించను. అది వారి విజ్ఞతకే వొదిలిపెడుతున్నాను. కాకపొతే ఒకటి సుష్పష్టం. ఆ విమర్శలు వారి  అజ్ఞానానికి, అవగాహనారాహిత్యానికి  నిదర్శనం" - షరా మామూలు రాజకీయుల షరా మామూలు స్పందన.   
'ఇతరులని పన్నెత్తు మాట అనడం మా ఇంటావంటా లేదనిచెబుతుంటే వినిపించుకోవేమిట్రా నెల తక్కువ వెధవా!' - వ్యాఖ్య


పాతికేళ్ళ నాటి మాస్కో - 18






మా ఇంటికి పెద్ద దూరం కాదు కానీ, ఒక మోస్తరు దూరంలో 'రష్యన్ సర్కస్' వుంది. కానీ టికెట్స్ దొరకడం చాలా కష్టం. దాన్ని చూడాలంటే కనీసం మూడు నెలలముందు నుంచే ప్రయత్నం ప్రారంభించాలి. అయితే మాస్కో రేడియోలో పనిచేస్తున్న విదేశీయులకోసం ఒక సౌలభ్యం వుంది. ఎన్ని టిక్కెట్లు కావాలో తెలియచేస్తే వాళ్లే తెప్పించి పెడతారు. అల్లా ఒకరోజు రష్యన్ సర్కస్ చూసే అవకాశం లభించింది.

రష్యన్ సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయిన రష్యన్ సర్కస్ -కేధరిన్ ది గ్రేట్ - కాలం నుంచే వుంది. ఇంగ్లీష్ భాష తెలియని రష్యాలో - రష్యన్ సర్కస్ ఆవిర్భావానికి  ఒక ఇంగ్లీష్ పౌరుడే కొంత మేరకు దోహద పడడం ఒక విశేషం. చార్లెస్ హగెస్ అనే ఆంగ్లేయుడు - కేధరిన్ ది గ్రేట్ క్వీన్  రాణి గారి సమక్షంలో ఒక చక్కని ప్రదర్సన ఇచ్చాడట. దాంతో ముచ్చట పడిపోయిన రాణి గారు- అతగాడికోసం రెండు సర్కస్ డేరాలు నిర్మించి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారట. రాణి తలచుకుంటే డేరాలకు కొదవేముంది. అతడికోసం సెంట్ పీటర్స్ బర్గ్ - కమ్యూనిస్టుల ఏలుబడిలో 'లెనిన్ గ్రాడ్' గా పేరుమార్చుకుని - మళ్ళీ తదనంతర కాలంలో తిరిగి సెంట్ పీటర్స్ బర్గ్ అన్న పాత పేరుకు మారిన నగరంలో - సర్కస్ డేరాలు నిర్మించి పెట్టారు. కొన్నేళ్ళ తరవాత ఆ ఇంగ్లీష్ దొరవారు ఇంగ్లాండ్ కు వెళ్ళిపోయాడు కానీ అతడి బృందంలోని సభ్యులు మాత్రం రష్యన్ల ఆదరాభిమానాలకు కట్టుబడిపోయి ఆ దేశంలోనే వుండిపోయారు. అలా చిగురించిన రష్యన్ సర్కస్ వట వృక్షం మాదిరిగా విస్తరించి సోవియట్ల కాలంలో ఖండాంతర ఖ్యాతిని సముపార్జించుకుంది. తొంభయ్యవ దశకం దాకా ఒక వెలుగు వెలిగి - ఇటీవలనే తన నూట యిరయవ్వవ వార్షికోత్సవం కూడా జరుపుకుంది.



గ్రేట్ మాస్కో స్టేట్ సర్కస్ ని 1971  లో మాస్కోలోని వేర్నాద్ స్కీ ప్రాస్పెక్ట్ లో ప్రారంభించారు. 3400 మంది వసతిగా కూర్చుని తిలకించగల విశాలమయిన ఎయిర్ కండిషన్ డేరాను నిర్మించారు. దీని ఎత్తు 36 మీటర్లు. ఇందులో అయిదు ఎరీనాలు వున్నాయి. సర్కస్ జరిగే ప్రధాన వేదికకు 18 మీటర్లు దిగువన వీటిని ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి - ఈ ఎరీనాలు ఒక దాని వెంట మరొకటి పైకి వస్తాయి. అందువల్ల అట్టే వ్యవధానం లేకుండా - రంగ స్తలాల రూపురేఖలు వాటంతట అవే మారిపోతుంటాయి. మన వైపు సురభి కంపెని నాటక ప్రదర్శనల మాదిరిగా.


రష్యన్ సర్కస్ చూడకుండానే ఇండియాకు తిరిగివచ్చేస్తామేమో అన్న బెంగ ఆవిధంగా తీరిపోయింది. సర్కస్ నుంచి తిరిగివస్తుంటే దోవలో ఒక సినిమా హాలు కనబడింది. టికెట్ లు కొనుక్కుని లోపలకు వెళ్లి చూద్దుము కదా - అది మన శంకరాభరణం.


 పాటలన్నిటినీ యధాతధంగా తెలుగులో ఉంచేసి, సంభాషణలను మాత్రం రష్యన్ లోకి డబ్ చేశారు. 'ఆకలేసిన బిడ్డ అమ్మా అని ఒకరకంగా అంటుంది ...' అంటూ శంకరాభరణం శంకర శాస్త్రి (సోమయాజులు గారి) నోట రష్యన్ పలుకులు వినబడుతుంటే చెప్పరాని ఆనందం వేసింది. రష్యాలో డబ్బింగ్ పట్ల యెంత శ్రద్ధ తీసుకుంటారో ఈ సినిమా చూస్తె తెలుస్తుంది. తెలుగు శంకరాభరణం సినిమా లో నటించిన నటీ నటుల గాత్రానికి తగిన స్వరం కలిగిన డబ్బింగ్ కళాకారులనే ఎంపిక చేయడం వల్ల- సోమయాజులు గారు, ఆ సినిమా లో నటించిన తదితరులు అచ్చు రష్యన్ లో మాట్లాడుతున్నారా అన్న అనుభూతి కలిగింది.

 సినిమా చూసి ఇంటికి రాగానే మద్రాసులో వున్న నా క్లాసుమేటు, ఆ చిత్రానికి సంభాషణలు రాసిన జంధ్యాలకు ఫోన్ చేసి చెప్పేవరకు ఉగ్గబట్టుకోలేక పోయాను.ఒకే రోజున అయాచితంగా లభించిన ఈ రెండు అవకాశాలు మా మాస్కో జీవితంలో మరచిపోలేని మధుర అనుభవాలు.

(రాజీవ్ గాంధీని తలచుకుంటూ కంట తడిపెట్టిన రష్యన్ వృద్ధ మహిళ గురించి ఇంకోసారి)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

సంసారం నడిపే స్త్రీలు కారు నడపలేరా!

సంసారం నడిపే స్త్రీలు కారు నడపలేరా!
(మార్చి ఎనిమిదో తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం)
తేదీ: 2011, జూన్ 17 దేశం సౌదీ అరేబియా


ఆ రోజు వందలాదిమంది జనం  కార్లలో బయలుదేరారు. ఇందులో విచిత్రం ఏమిటి అనుకుంటున్నారా.  ఆ కార్లు నడుపుతున్నవారందరూ స్తీలే. అయితే ఏమిటంటారా! వారందరికీ కార్లు వున్నాయి కాని వాటిని నడపడానికి లైసెన్సులు మాత్రం  లేవు. మరి లైసెన్సులు లేకుండా వారంతా కార్లలో బయటకు ఎందుకు వచ్చినట్టు? లైసెన్సుల కోసమే అంటే నమ్ముతారా? నమ్మక తప్పదు. లైసెన్సుల కోసమే వారందరూ అలా రోడ్డెక్కాల్సి వచ్చింది. లైసెన్స్ లేకుండా కారు నడిపితే ఏం జరుగుతుందో వారికి తెలుసు. దానికి సిద్ధపడే వాళ్లు కార్లతో రోడ్డున పడ్డారు.
మూకుమ్మడి నిరసన కావడం వల్ల పోలీసులు అందర్నీ అరెస్ట్ చేయలేకపోయారు. కొందరికి చలాన్లు రాశారు. కొందర్ని హెచ్చరించి వొదిలేశారు. అరెస్ట్ అయిన కొద్దిమంది కూడా అందుకు బాధ పడలేదు. ఎందుకంటె తమ బాధల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే వారు ఈ ఆందోళనకు నడుం కట్టారు.
ఇంతకీ విషయం ఏమిటంటే ఆ దేశంలో స్త్రీలకు కార్లు నడిపే హక్కు లేదు. ప్రపంచంలోవున్న లగ్జరీ కార్లన్నీ సౌదీలో దర్శనమిస్తాయి. పెట్రోలు కూడా చాలా చవుక. కార్లు కొనుక్కోగల ఆర్ధిక స్తోమత ఆ దేశంలో చాలామందికి వుంది. మహిళలు కూడా  ఉద్యోగాలు చేస్తారు. కారు కొనుక్కోవడం వారికి ఓ లెక్కలోనిది కాదు. పైగా వృత్తి రీత్యా వాహనం అవసరం కూడా. ఆఫీసులకు వెళ్లడానికీ, పిల్లల్ని స్కూళ్ళలో దింపడానికీ ఉద్యోగినులకి సొంత వాహనం యెంత అవసరమో ఈ నాడు అందరికీ తెలిసిన విషయమే. ఆడా  మగా తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అందరూ  కారు నడపడం సర్వసాధారణంగా మారిపోయింది. అయినా సౌదీ అరేబియాలో ఆడవారికి ఈ హక్కు ఇంకా హక్కుభుక్తం కాలేదు. దీనికోసం వాళ్లు చాలాకాలంగా ఆందోళన  చేస్తూ వున్నారు. బహుశా, ఆడవారిని మోటారు కారులో డ్రైవింగ్ సీటులో చూడలేనిది మొత్తం ప్రపంచంలో ఈ ఒక్క దేశంలోనే కాబోలు. ఆ దేశంలో వుంటున్న తెలుగువారెవరయినా అనుమాన నివృత్తి చేస్తే బాగుంటుంది.

(ఇంటర్నెట్ లో సంచారం చేస్తున్న ఒక ఆంగ్లవ్యాసానికి స్వేచ్చానువాదం)

NOTE: Courtesy Image Owner

6, మార్చి 2014, గురువారం

ఓటర్ల మేనిఫెస్టో


‘రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలను అన్నింటినీ తుచ తప్పకుండా అమలు చేసిన పక్షంలో జనం స్వర్గానికి వెళ్లాలనే కోరికను సైతం చంపుకుంటారు.’ – విల్ రోగర్స్
ఎన్నికలకు ముందు ప్రతి రాజకీయ పార్టీ ఒక మేనిఫెస్టో ను విడుదల చేస్తుంది. ప్రజలు తమ పవిత్రమయిన వోటు వేసి తమను మాత్రమే ఎందుకు గెలిపించాలో, తమను గెలిపిస్తే ఆ పవిత్రమయిన వోటు వేసినందుకు (గెలిస్తేనే సుమా) బదులుగా వోటర్ల రుణం తీర్చుకునేందుకు తమ పార్టీ ఏమేమి చేయబోతున్నదో అనే అనేకానేక ఉచిత వరాలతో కూడిన ఎన్నో వివరాలు ఈ మేనిఫెస్టోలో వుంటాయి. దీన్ని తయారు చేయడం కోసం ప్రతి పార్టీ ఎంతో పెద్ద కసరత్తు చేస్తుంది. ఇందునిమిత్తం పార్టీ ఏర్పాటు చేసిన మేనిఫెస్టో కమిటీ పలు మార్లు సమావేశాలు జరిపి – ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలను గురించి లోతుగా అధ్యయనం చేసి వాటిని సవివరంగా చర్చిస్తుంది. అర చేతిలో వైకుంఠం చూపించే తరహాలో రూపొందించే ఈ మేనిఫెస్టో తయారీకి పెద్ద పెద్ద పార్టీల నుంచి చిన్నా చితకా పార్టీల వరకు ఎంతో శ్రద్ధ తీసుకుంటాయి. ఇక మేనిఫెస్టో విడుదల అనేది మరో పెద్ద తంతు. వోటర్ల మనసులకు గాలం వేసి పట్టే విధంగా ఆ యా పార్టీలకు చెందిన మేధావులు అంతా కలసి మేధో మధనం చేసి అందించిన సలహాలనన్నింటినీ అంతకంటే అందంగా అక్షరాలలోకి మార్చి కూర్చే ఈ మేనిఫెస్టో విడుదలకు మెగా సినిమా రిలీజ్ మాదిరిగా ఎంతో హడావిడి చేస్తారు. దీనికి ప్రచారం కల్పించడానికి పార్టీలు పడే యాతన ఇంతా అంతా కాదు. కాలక్రమేణా ఇది ఎన్నికలకు ముందు ఓ తప్పనిసరి తతంగంగా తయారయింది. కాకపొతే, ఎన్నికల తరువాత మాత్రం మళ్ళీ దీని ఊసెత్తితే ఒట్టు.
‘మీరిలా వోటు వేసి గెలించండి. మేమలా చెప్పినవన్నీ చేసి చూపిస్తాం’ అనే రాజకీయ పార్టీల మేనిఫెస్టోల మాదిరిగానే, ‘ మీరిలా చేస్తామని మాట ఇవ్వండి. అప్పుడు మా వోటు అచ్చంగా మీకే’ అంటూ ఓటర్లే తమ మేనిఫెస్టోలతో ముందుకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. జయ ప్రకాష్ నారాయణ గారు తమ లోక్ సత్తాను రాజకీయ పార్టీగా రూపు మార్చకుండా వుండి వుంటే బహుశా ఈ ప్రయోగం ఆయనే చేసివుండేవారేమో. ఇలా ఈ దిశగా సాగిన ఆలోచనలనుంచి పుట్టుకొచ్చినదే ఇదిగో ఈ ‘ఓటర్ల మేనిఫెస్టో’.

1. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చే ఎలాటి హామీ అయినా సరే, అధికారంలోకి రాగానే తాము దాన్ని యెలా అమలు చేయబోతున్నామో అన్న విషయాన్ని స్పష్టంగా, ఏవిధమయిన అసంగ్దిగ్ధతలకు తావివ్వకుండా, శష భిషలకు పోకుండా ఎన్నికల ప్రణాళికలో పేర్కొని తీరాలి. ఆకాశంలో చందమామను తెచ్చి చేతిలో పెడతామంటే సరిపోదు, అది యెలా సాధ్యమో కూడా వోటర్లకు తెలియచెప్పాలి. యేరు దాటినదాకా పడవ మల్లయ్య, దాటిన తరువాత బోడి మల్లయ్య సామెత మాదిరిగా కాకుండా గెలిచివచ్చిన తరువాత ఒక నిర్దిష్ట కాలంలో వాగ్దానాలు అమలుచేయలేని పక్షంలో అధికారం నుంచి తక్షణం తప్పుకుంటామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేయాలి. అంతేకాదు, ఉచిత వాగ్దానాల అమలుకు అయ్యే మొదటి ఏడాది వ్యయాన్ని తమ పార్టీ నిధులనుంచే ఖర్చు చేయాలి. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల వోట్లకు గాలం వేసే ప్రస్తుత విధానాలకు స్వస్తి చెప్పాలి. (మీడియాకు మనవి: ఉచితానుచితాలు ఎరగకుండా ఆయా రాజకీయ పార్టీలు జనంపై వొదులుతున్న ‘ఉచిత’ హామీలను యెలా అమలు చేస్తారని మీడియా ప్రశ్నించి సమాధానాలు వారి నుంచి రాబట్టి ప్రజలకు తెలియచెప్పాలి.)
2. భారీ ఎత్తున ఎన్నికల ప్రచార సభలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించే పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలి. సాధారణ జనం ఇబ్బందుల పాలు కాకుండా చిన్న సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారం సాగించాలి.
3. ఊరేగింపులుగా వెళ్లి అభ్యర్ధులు నామినేషన్లు వేయకూడదు. (ఆన్ లైన్ విధానంలో నామినేషన్ల దాఖలుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించాలి.)
4. ఎంతటి హేతుబద్ధమయిన కారణం వున్నా సరే, ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజాస్వామ్య హక్కు పేరుతొ నడిరోడ్లపై ధర్నాలు, బైఠాయింపులు, రాస్తా రోఖోలు నిర్వహించరాదు.(అలాగే ప్రజలను ఇబ్బందుల పాలు చేసే ఇలాటి ఆందోళనా కార్యక్రమాలను ఎటువంటి పరిస్తితిలోను ప్రసారం చేయబోమని టీవీ ఛానళ్ళ యాజమాన్యాలు వారికి స్పష్టం చేయాలి. అంతేకాదు, ఈ రకమయిన ఆందోళనల కారణంగా ఇబ్బందులకు గురయ్యే ప్రజల మనోభావాలను సాధ్యమయినంత ఎక్కువగా ప్రసారం చేయాలి. ఆందోళనకారులను చెదరగొట్టడం, వారిని బలవంతంగా పోలీసు వ్యానుల్లోకి ఎక్కించడం వంటి దృశ్యాలు ప్రస్తుతం చూపిస్తున్నారు. అలాకాకుండా రాస్తారోఖోల కారణంగా పడరాని పాట్లు పడుతున్న పౌరుల స్పందనలను ప్రత్యక్ష ప్రసారం చేయాలి)
5. ఎన్నికల క్రతువు ముగిసే వరకు రెచ్చగొట్టే విధంగా వుండే రాజకీయ ప్రకటనలు, అవాకులు చవాకులులతో కూడిన స్క్రోలింగులను మీడియా సంస్తలు నిలిపివేయాలి.
6. ‘త్వంశు౦ఠ అంటే త్వంశు౦ఠ’ అంటూ సాగే రాజకీయ నాయకుల చర్చా గోష్టులను పదే పదే ప్రసారం చేసే టీవీ ఛానళ్ళ నుంచి ‘ఉచిత వినోదపు పన్ను’ రాబట్టాలి.
7. సంకీర్ణాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ పోలింగుకు ముందే కుదుర్చుకోవాలి. ఎన్నికలు ముగిసి పార్టీల బలాబలాలు నిర్ధారణ అయిన తరువాత ప్రభుత్వం ఏర్పాటుకోసం అవకాశవాద కూటముల ఏర్పాటును నిషేధించాలి.
గమనిక: ఇవి కేవలం తొలి ఆలోచనలే. ఎన్నికల ఘడియ దగ్గర పడే లోగా వీటికి మరింత స్పష్టమయిన పటిష్టమయిన రూపం ఇవ్వడంలో అంతా తలా ఓ చేయి వేయాలని మనవి

పాతికేళ్ళనాటి మాస్కో - 17






మెట్రో డిజైన్  మార్చిన స్టాలిన్ కాఫీ కప్పు




(స్టాలిన్)



మాస్కో మెట్రో పట్ల స్టాలిన్ యెంతో శ్రద్ధ కనబరిచేవారని చెబుతారు. రోజూ ఏదో ఒక వీలు చూసుకుని మెట్రో నిర్మాణ పురోగతిని అధికారులతో, ఇంజినీరులతో సమీక్షించేవారు. అంతకుముందు ఏటవాలుగా, నిలువుగా, అడ్డంగా మెట్రో రైలుమార్గాలను డిజయిన్ చేశారు.వాటిని స్టాలిన్ కు చూపించి, ఆ మాపులపై స్టాలిన్ అభిప్రాయం కోసం అధికారులు ఎదురుచూస్తున్న సమయంలో కాఫీ తాగుతున్న స్టాలిన్-ఆ కప్పును ఒక మ్యాప్ మధ్యలో వుంచారుట. కప్పుకు వున్న కాఫీ మరక గుండ్రంగా దానిపై పడింది. దాన్ని స్టాలిన్ అభిప్రాయంగా పరిగణించిన ఇంజినీర్లు - వృత్తాకారంలో మరో మెట్రో మార్గాన్ని- మిగిలిన అన్ని మార్గాలను కలుపుతూ 'మెట్రో రింగ్ రూట్' కు రూపకల్పనచేసి నిర్మించారు. భూగర్భంలో రైల్ జంక్షన్ ల నిర్మాణానికి స్టాలిన్ ' కాఫీ కప్పు మరక' పరోక్షంగా దోహదం చేసిందన్న ఒక కధ
ప్రచారంలోకి వచ్చింది.


(మాస్కో మెట్రో మ్యాప్)

అయిదు కోపెక్కులనుంచి రెండువేల రూబుళ్ళకు పెరిగిన మెట్రో టికెట్

మేమున్న రోజుల్లోనే మాస్కో మెట్రోలో నూటయాభయి స్టేషన్ల దాకా ఉండేవి. ఇప్పుడవి 180  దాకా పెరిగాయి. మాఇంటికి దగ్గరలో ప్రొఫ్ సోవూజ్నయా అనే మెట్రో స్టేషన్ వుంది. అక్కడిదాకా నడిచి వెళ్ళి మెట్రో ఎక్కేవాళ్లము.



(మెట్రో స్టేషన్)

 మాస్కో రేడియోకు వెళ్ళాలంటే త్రేత్యా కోవోస్కయా అనే పెరుకలిగిన మెట్రోలో దిగాలి. అక్కడ ఎస్కలేటర్ ద్వారా పైకి వస్తే పక్కన పది అడుగుల దూరంలో మాస్కో రేడియో భవనం. ఈ మధ్యలో మరో అయిదు స్టేషన్లు వున్నాయి. అకడమిస్కయా , లెనిన్ స్కీ ప్రాస్పెక్ట్, షావోలోస్కయా, అక్త్యా బ్రస్కయా (రింగ్ లైన్ లో వున్న మెట్రో జంక్షన్ ), నోవో కుజ్నిస్కయా అనేవి ఈ స్టేషన్ల పేర్లు .టంగ్ ట్విష్ట్ పదాలకోసం వెతుక్కోనక్కరలేదు. మాస్కో మెట్రో స్టేషన్ల పేర్లు సరిపోతాయి. నెలకు మూడు రూబుళ్ళు పెడితే మెట్రో పాస్ దొరికేది. దీన్ని కొనడానికి నియమనిబంధనలు ఏమీ లేవు . ఎక్కడబడితే అక్కడ దొరికే వీటిని ఎవరయినా, నెలలో ఎప్పుడయినా కొనుక్కోవచ్చు. ఒకరు కొనుక్కున్నదానితో మరొకరు ప్రయాణం చేయవచ్చు.


 పైగా ఈ పాస్ - మెట్రో రైళ్లల్లో, ట్రాముల్లో, ట్రాలీ బస్సుల్లో, సిటీ బస్సుల్లో - అన్నిటిలో పనికొస్తుంది. అంటే, మూడు రూబుళ్ళు పెట్టి అతి సులభంగా లభించే ఈ పాస్ కొనుక్కుంటే, నెల పొడుగునా మాస్కో అంతా వీర విహారం చేయవచ్చు. నెలసరి పాస్ అనవసరమనుకున్న వాళ్ళు - అంటే మాస్కోకి పనులమీద వచ్చే వాళ్ళు - ఒకే ఒక్క రూబుల్ తో పదిరోజులు వాడుకునే పాస్ కొనుక్కోవచ్చు. ఇన్ని సదుపాయాలతో, ఇంత చవకగా ప్రయాణించడానికి వీలున్న మెట్రో ప్రపంచంలో మరొకటి లేదన్న మంచి పెరు ఒక్క మాస్కో మెట్రో కే దక్కింది.


(కడిగిన ముత్యంలా తళతళ తళుకులీనే మెట్రో స్టేషన్)  

గత  కీర్తి  ఘనమెంతో....... ...

ఇది గతం. గత కీర్తి మరింత ఘనం. మాస్కో మెట్రో గురించి మనం మంచిగా చెప్పుకునే రోజులకు నూకలు చెల్లిపోయాయి. అయితే ఇది నా కళ్ళతో చూసి చెబుతున్నది కాదు. చెవులతో విన్నది, వింటున్నది.


(రెడ్ స్క్వేర్ వద్ద ఇండియన్ స్కూలు పిల్లలతో సందీప్)

అయిదు కోపెక్కులనుంచి రెండువేల రూబుళ్ళకు పెరిగిన మెట్రో టికెట్
1935 లో మాస్కో మెట్రో తొలిసారి ప్రారంభమయినప్పుడు దాని టికెట్ ధరను యాభయి కోపెక్కులుగా నిర్ణయించారు. 1961 లో దాన్ని అయిదు కోపెక్కులకు తగ్గించారు. అప్పటినుంచి  1991 వరకు అంటే ముప్పయి సంవత్సరాలపాటు మెట్రో టికెట్ ఖరీదుని ఒక్క పైసా కూడా పెంచలేదు. గోర్భచేవ్ ఆర్ధిక సంస్కరణల నేపధ్యంలో 1991 లో 15  కోపెక్కులకు, 1992 లొ యాభయి కోపెక్కులకు అదే ఏడాదిలో  ఒక్కసారిగా మూడు రూబుళ్ళకు పెంచేశారు. అంటే అంటే రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలో- అమాంతం అరవై రెట్లు పెంచారన్న మాట. మన దేశంలో పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా గొడవలకు దిగే వాళ్ళు దీన్ని గమనిస్తే బాగుంటుందేమో. అంతటితో ఈ పెరుగుదల ఆగలేదు.అలా పెరుగుతూ పోయి మెట్రో టికెట్ ధర 1994 లో   నాలుగువందల రూబు ళ్లకూ,1995 లొ ఆరు వందలనుంచి పదిహేను వందల రూబుళ్లకూ, 1997 సంవత్సరం నాటికి ఏకంగా రెండువేల రూబుళ్లకూ పెరిగి ఇక పెరగడానికి వీలు లేక కాబోలు ఆగిపోయింది. పెరుగుట విరుగుట కొరకే అన్న సుమతీ శతక కారుడి సూక్తిని నిజం చేస్తూ ప్రస్తుతం మాస్కో మెట్రో టికెట్ ధర  మెట్రో  రైలులో  ఒక సారి ప్రయాణానికి 26  రూబుళ్ల వద్ద  నిలకడగా నిలచిపోయింది. ఇంతటి స్తాయిలో- అనేక వందల్ రెట్లు,అదీ అతి తక్కువ వ్యవధిలో ధరలు ఆకాశాన్ని దాటి చుక్కలను తాకినప్పటికీ కూడా నిబ్బరంగా  తట్టుకున్న మాస్కో పౌరులను అబినంధించి తీరాలి కదూ. అంతేకాదు - అంతటి ద్రవ్యోల్బన  ఉత్పాతాన్ని పది పదిహేనేళ్ళ వ్యవధిలోనే అధిగమించగలిగిన   లేదా  తట్టుకోగలిగిన విధంగా 'కుషన్' ఏర్పాటు చేసిన  'సోవియట్ ఎకానమీ'ని  అభినందించాలి.
ఉపసంహారం: నిశ్చింతగా ప్రయాణాలు సాగిన ఆ నాటి మాస్కో మెట్రో స్టేషన్లలో ప్రయాణాలు చేయాలనుకునే విదేశీయులకు వారి ఎంబసీలు ఈనాడు ఇస్తున్న ఉచిత సలహా వింటుంటే కడుపు తరుక్కు పోతుంది. అదేమిటంటే- 'మాస్కో మెట్రోల్లో జేబు దొంగలుంటారు జాగ్రత్త' - కళ్ళెదుటే  కలల సామ్రాజ్యం కనుమరుగు కావడం అంటే ఇదే.

(మెట్రో ధ్యాసలోపడి మరచిపోయిన  శంకరాభరణం శంకర శాస్త్రి గారి రష్యన్ పలుకులు వచ్చేసారి )   

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

పాతికేళ్ళనాటి మాస్కో - 16




మెట్రో
మన దేశంలో యెంత మారు మూల పల్లెటూరికి వెళ్ళినా హోటల్ అన్న పదం విననివాడు, తెలియనివాడు వుండడు. కానీ ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాలలో ఒకటయిన సోవియట్ యూనియన్ రాజధాని మాస్కోలో- ఆ రోజుల్లో 'హోటల్' అంటే తెలియనివాళ్ళు కోకొల్లలు. అంటే మాస్కోలో హోటల్స్ లేవని కాదు. హోటల్ అనే ఇంగ్లీష్ పదం కూడా వారికి తెలియదన్న మాట.   అదేమిటో గాని రష్యన్ తప్ప మరొక భాష వారికి అర్ధం అయ్యేది కాదు. ఒకసారి రాయపాటి సాంబశివరావు గారు వచ్చి మాస్కోలోని ఇంటర్నేషనల్ హోటల్ లో బస చేశారు.



 అక్కడికి వెళ్లాలని యెంతో మంది టాక్సీ డ్రైవర్ లను అడిగిచూసినా ప్రయోజనం లేకపోయింది. ఇంటర్నేషనల్ హోటల్ అంటే ఎవరికీ అర్ధం కాలేదు. రష్యన్లో హోటల్ ని గస్తనీచ్చ అంటారు. మేజ్దురోద్నయా గస్తనీచ్చ(ఇంటర్ నేషనల్ హోటల్) అని నాలుకను మూడు మడతలు చుట్టి అడిగితె కాని అర్ధం కాని పరిస్తితి. మిల్క్(పాలు), బటర్ మిల్క్ (మజ్జిగ) స్కూలు, రోడ్డు, స్ట్రీటు (వీధి), వంటి ఇంగ్లీష్ పదాలు సయితం వారికి తెలియవు. ఒక్క మెట్రో తప్ప.





ఒక మెట్రో స్టేషన్ - అయిదు పైసల టిక్కెట్టుతో నూటయాభయి స్టేషన్లు

మెట్రో ప్రసక్తి లేకుండా మాస్కో గురించి చెప్పడం అంటే రాముడు లేని రామాయణాన్ని పారాయణ చేయడమే.
మాస్కో వీదుల్లో సంచరిస్తున్నప్పుడు-
రోడ్లపై ట్రాముల్లో, సిటీ బస్సుల్లో, ట్రాలీ బస్సుల్లో (కరెంటు తో నడిచే బస్సులు) తిరుగుతున్నప్పుడు-
ఎత్తయిన ఆకాశ హర్మ్యాలవైపు మెడలురిక్కించి చూస్తున్నప్పుడు-
మన కాళ్ళ కింద, భూమి అడుగున, వందల సంఖ్యలో మెట్రో రైళ్ళు సొరంగ మార్గాల ద్వారా అతివేగంగా ప్రయాణిస్తూ ఉంటాయని చెబితే -
మాస్కో మెట్రో గురించి తెలియనివాళ్ళు ఒక పట్టాన నమ్మడం కష్టం.
సోవియట్ యూనియన్ ఏర్పడడానికి పూర్వమే- జార్ చక్రవర్తుల కాలంలోనే - మెట్రో నిర్మాణం గురించి ప్రతిపాదనలు సిద్దం చేసారని చెబుతారు. అయితే ఈలోగానే, కామ్రేడ్ లెనిన్ నాయకత్వంలో మొట్టమొదటి సోవియట్ నిర్మాణం జరిగిన తరవాత ఆనాటి ప్రాదాన్యతలనుబట్టి, మెట్రో నిర్మాణ ప్రతిపాదనలు కొంత వెనుకపడ్డాయి. 1935  లో తొలి మెట్రో రైలు మాస్కో భూగర్భంలో పరుగులు తీసింది. 13  కిలోమీటర్లతో మొదలయిన మెట్రో క్రమంగా విస్తరించి ౩౦౦ కిలోమీటర్ల   పరిధిలో 180  స్టేషన్లకు పెరిగింది. పనిదినాలలో, సగటున రోజూ 70  లక్షలమంది మెట్రో రైళ్ళలో ప్రయాణిస్తుంటారు. రద్దీ టైములో 90  సెకన్ల కొకటి చొప్పున మెట్రో రైలు ప్రయాణీకులకు అందుబాటులో వుంటుంది. 1935  లో 50  కోపెక్కులతో మొదలయిన  మెట్రో టిక్కెట్టు ధరను 1961  లో అయిదు కోపెక్కులకు తగ్గించారు. అంటే ఐదు పైసల (కోపెక్కుల) నాణెం - మెట్రో స్టేషన్ ప్రవేశ ద్వారం దగ్గరవున్న స్లాటులో వేసి లోనికి ప్రవేశిస్తే చాలు- ఎటునుంచి ఎటువైపయినా- ఎన్నిసార్లయినా సరే-స్టేషన్లతో నిమిత్తం లేకుండా  ప్రయాణం చేయవచ్చు. నగరం నలువైపులకు వెళ్ళే రైలు మార్గాలను కలుపుతూ వృత్తాకారంలో మరో మార్గాన్ని నిర్మించారు. అందువల్ల - అనేకవైపులకు ప్రయాణాలు చేసేవారు కూడా భూగర్భంలో ఒక స్టేషన్ నుంచి మరో స్టేషను కు ఎస్కలేటర్ల ద్వారా వెళ్లి రైళ్ళు మారుతూ తమ గమ్యాలను చేరుకోవచ్చు.అంటే, భూగర్భంలోనే రైల్వే జంక్షన్లు నిర్మించారన్న మాట.ఒక సొరంగ మార్గంలో రైలు వెడుతుంటే- దానికి కిందా పైనా వున్న మార్గాలలోమరికొన్ని రైళ్ళు  తిరుగుతూవుంటాయి.


 ఈ  అద్భుతమయిన ఇంజినీరింగ్ కౌశల్యాన్ని - అధునాతన  సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని రోజుల్లోనే రష్యన్ ఇంజినీర్లు  ప్రదర్శించిన తీరు అమోఘం. మాస్కో మెట్రోలో మరో వెసులుబాటు ఏమిటంటే - ఒక రైలు వెనుకనే మరో రైలు వెంటవెంటనే వస్తుంటుంది కాబట్టి తొక్కిసలాటలకు, తోపులాటలకు ఆస్కారం తక్కువ. రైలు వచ్చి ప్లాటుఫారంపై ఆగగానే తలుపులు తెరుచుకోవడం - దిగేవాళ్ళు ఒక పక్క నుంచి దిగుతుండగానే మరో పక్కనుంచి ఎక్కేవాళ్ళు ఎక్కడం- తలుపులు మూసుకోవడం - రైలు కదిలిపోవడం అంతా క్షణాలలో నిశ్శబ్దంగా జరిగిపోతూ వుంటుంది.రైలు ఒక స్టేషన్ దాటగానే వచ్చేది పలానా స్టేషన్   అని ముందుగానే  పబ్లిక్ అడ్రసు సిష్టం ద్వారా అనౌన్స్ చేస్తుంటారు. అలాగే డోర్లు తెరుచుకుంటున్నాయి, డోర్లు మూసుకుంటున్నాయని కూడా   ప్రయాణీకులను  హెచ్చరిస్తూ  వుంటారు.   అన్ని లక్షలమంది ప్రయాణాలు చేస్తున్నా - ప్లాటుఫారాలన్నీ కడిగిన అద్దంలా మెరిసిపోతూవుంటాయి. ఒక స్టేషనుకు మరో స్టేషనుకు పోలిక లేకుండా - రష్యాలోని వివిధ జాతుల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఒక్కొక్క మెట్రో స్టేషను ను ఒక్కో మ్యూజియంగా తీర్చిదిద్దారు.


(రెడ్ స్క్వేర్ లెనిన్ సమాధి వద్ద పొడుగుపాటి క్యూలు - కన్నడ న్యూస్ రీడర్ శ్రీ రామకృష్ణ భార్య శ్రీమతి సరోజతో కలసి మా ఆవిడ నిర్మల)


 మాస్కోని సందర్శించే విదేశీ అధినాయకులు సయితం తమకు సమకూర్చిన చయికా కార్లను ( యద్దనపూడి నవలల్లో కధానాయకులు వాడే పడవ లాంటి కార్లు - ఈ ఆరు డోర్ల కార్లు అత్యున్నత స్తాయి విదేశీ అతిధులకి మాత్రమే అందుబాటులో వుంటాయి) పక్కన పెట్టేసి మెట్రో ప్రయాణం పట్ల ఆసక్తి వెలిబుచ్చుతారంటే మాస్కో మెట్రో ప్రశస్తిని అర్ధం చేసుకోవచ్చు.

(స్టాలిన్ తాగిన కాఫీ కప్పుతో మారిన మెట్రో డిజైన్ - ఈ వయినం గురించి మరో సారి)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.