30, అక్టోబర్ 2013, బుధవారం

అంజయ్య గారితో నా అనుభవాలు (ఆఖరి భాగం)


అంజయ్య గారిని మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వెంటనే అంజయ్య గారు  ముఖ్య మంత్రి పదవికి  రాజీనామా చేసారు. మర్నాడు కొత్త నాయకుడి ఎన్నిక. అప్పటికి  ఇంకా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రే. నేనూ జ్వాలా కలసి ముఖ్యమంత్రి అధికార నివాసం జయప్రజాభవన్’ ( గ్రీన్ లాండ్స్) కు వెళ్లేసరికి పొద్దు బాగా  పోయింది. అంతా బోసిపోయి వుంది. నాయక జనం జాడ లేదు.  మేడ మీద అంజయ్య గారు తన షరా మామూలు వస్త్ర ధారణతో అంటే - గళ్ళ లుంగీ, ముతక బనీనుతో కనిపించారు. ఏమి మాట్లాడాలో తోచలేదు. కాసేపువుండి వచ్చేస్తుంటే వెనక్కి పిలిచారు. ఒక పిల్లవాడిని చూపించి చూడు శ్రీనివాస్ ఇతడికి దూరదర్శన్ లో ఏదో కాజువల్ ఉద్యోగం కావాలట. ఎవరికయినా చెప్పి చేయిస్తావా ?’ అని అడుగుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను పని చేసేది రేడియోలో అని ఆయనకు బాగా తెలుసు. అయినా తనని నమ్ముకుని వచ్చిన ఆ పిల్లవాడిని చిన్నబుచ్చడం ఇష్టం లేక నన్ను అడిగి వుంటారు.
అందుకే ఆయన చనిపోయినప్పుడు ఒక పత్రిక పెట్టిన పతాక శీర్షికను నా జర్నలిస్టు మిత్రుడు పాశం యాదగిరి ఎప్పుడూ గుర్తు చేస్తుంటాడు.
“గరీబోళ్ళ బిడ్డ – నిను మరవదు ఈ గడ్డ”.

అంజయ్య గారితో నా అనుభవాలు - 7


ఆ రోజుల్లో ప్రతి రోజు సచివాలయానికి వెళ్లి మధ్యాహ్నం దాకా ప్రెస్ రూం లోనో లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ల్లోనో గడిపి- అంతవరకు సేకరించిన సమాచారం తీసుకుని  మధ్యాహ్నం వొంటి గంటా పది నిమిషాలకు ప్రసారం అయ్యే  న్యూస్ బులెటిన్ కు అందించడానికి కాలినడకన రేడియో స్టేషన్ కు వెడుతుండే వాడిని. ఒకరోజు అలా పోతున్నప్పుడు ముఖ్యమంత్రి పైలట్ వాహనం సైరన్ మోగిస్తూ వెళ్ళింది. అంజయ్య గారు- తన అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కారులో డ్రైవర్ పక్కన ముందు సీట్ లో కూర్చునే వారు.ఆయనకు కార్యకర్తల తాకిడి ఎక్కువ. వెనుక సీట్ లో ఎవరికి వారు దూరి పోయేవారు. ఈ ఇబ్బంది తట్టుకోవడం కోసమో ఏమో ఆయన ముందు సీట్ కి మారిపోయారు.

సరే! ఆ రోజు నా పక్కనుంచి వెళ్ళిన ముఖ్యమంత్రి వాహనం కొద్దిగజాలు ముందుకుపోయి ఆగింది. ఆయన అంగరక్షకుడు బాలాజీ- - రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో పనిచేస్తున్నారు- కిందికి దిగి ‘సీఎం గారు పిలుస్తున్నారు రండి’ అనడం- నన్ను కారు ఎక్కించుకుని రేడియో స్టేషన్ లో దింపడం క్షణాల్లో జరిగిపోయాయి.
అనుకోకుండా ముఖ్యమంత్రి రేడియో స్టేషన్ కి రావడంతో మా వాళ్ళంతా అవాక్కయ్యారు. అంజయ్య గారు ఇలా నాపట్ల చూపిన అవ్యాజాను రాగాలకి ఇంకా ఎన్నో ఉదాహరణలు వున్నాయి. అవి ఆయన గొప్పతనానికి, మంచితనానికి తార్కాణాలుగా భావిస్తానే కాని , నా ప్రత్యేకత ఏమీ లేదు.


29, అక్టోబర్ 2013, మంగళవారం

అంజయ్య గారితో నా అనుభవాలు - 6


ఆనాడు మా ఇంటికి వచ్చిన వాళ్ళలో ఇద్దరు ఆ తరువాత మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు.
ఆ సాయంత్రం రేడియో వార్తలు ముగిసిన అనంతరం బస్సుపట్టుకుని హిమాయత్ నగర్ లో దిగి చిక్కడపల్లి (వివేక్ నగర్  అనాలా?)లో  ఇంటికి వస్తుంటే త్యాగరాయ గానసభ ముందు ముఖ్యమంత్రి పైలట్ కారు కనిపించింది. అప్పుడే గానసభలో ఏదో కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి అంజయ్య గారు బయటకు వచ్చి కారెక్కుతూ అక్కడ గుమికూడిన జనంతో ముచ్చటిస్తూ నన్ను చూసి శ్రీనివాస్ ఈ పక్కనే కదా నీ ఇల్లు పోదాం పదఅన్నారు. నాకు ఒక్క క్షణం ఏం జవాబు చెప్పాలో తోచలేదు. ఇల్లు ఏ పరిస్తితిలో  తెలవదు. ఎందుకంటే పగలల్లా మా ఆవిడ ఇంట్లో అమ్మవొడిపేరుతొ చైల్డ్ కేర్ సెంటర్ నడుపుతుంది. కొంతమంది తల్లులు చాలా పొద్దుపోయిందాకా పిల్లల్ని తీసుకు వెళ్లరు. అలా ఆలోచించే లోపలే అక్కడినుంచి మూడో ఇల్లే మాది మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాము. అప్పుడే వర్షం పడి రోడ్డంతా చిత్తడిగా వుంది. అందులో మేము వుండే వాటా ఇంట్లో  బాగా వెనగ్గా  వుంటుంది. గేటు తీసుకుని కొంతదూరం వెళ్ళాలి. వాన నీళ్ళు నిలవడంతో  ఎక్కడ గుంటవుందో ఎక్కడ చదునుగా వుందో తెలవడం లేదు. పైగా బయట లైటు లేకపోవడంతో వెలుతురు కూడా  లేదు. అలాగే ఇంట్లోకి వచ్చాము. అదృష్టం. కేర్ సెంటర్ పిల్లలందరూ వెళ్ళిపోయారు. మా ఆవిడ అప్పుడే ఇల్లు తుడిచి బాగుచేసినట్టుంది. ఒక్క పెట్టున వచ్చిన అంతమందిని  చూసి ముందు కంగారు పడినా వెంటనే సంభాలించుకుంది. గోడకు ఆనించి  పెట్టిన ఇనుప కుర్చీలు మూడు వేసినా అవి ఎవరికీ  సరిపోయేలా లేవు. ఒక కుర్చీలో ముఖ్యమంత్రి కూర్చుంటే మిగిలిన రెండింటిలో మరో ఇద్దరు సర్దుకున్నారు. వాళ్ళే తరువాత కాలంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. ఒకరు  భవనం వెంకట్రాం కాగా రెండవవారు కోట్ల విజయభాస్కరరెడ్డి గారు. మిగిలినవారందరూ నిలబడేవుండాల్సిన పరిస్తితి. వారిలో ఇద్దరు ముగ్గురు ఆనాటి మంత్రులు కూడా వున్నారు. మా ఆవిడ హడావిడిగా టీ కలిపి తెచ్చింది. కొందరికి కప్పుల్లో. మరికొందరికి స్టీలు గ్లాసుల్లో. సాసర్లు లేవు. వచ్చిన పెద్దలు కూడా పెద్ద మనసు చేసుకుని ఇచ్చిన ఆతిధ్యం(?) స్వీకరించి, మా పిల్లల్ని పలకరించి బయటకు వచ్చారు. మళ్ళీ కారెక్కేటప్పుడు అదే జనం. అసలు అంజయ్య గారంటేనే జనం. జనమే ఆయనకు ఆక్సిజన్. అయితే, ముఖ్యమంత్రిని అలా చెప్పాపెట్టకుండా ఇంటికి తీసుకువెళ్లడం భద్రతాదికారికి నచ్చినట్టులేదు. కార్లో కూర్చుంటూ ఇదేం పద్ధతిగా లేదుఅన్నాడు.
నాకు కోపం చర్రున లేచింది. ఆయన్నేమన్నా బొట్టుపెట్టి  పిలిచానా?’ అనేశాను. ఆ వయసు అలాటిది. ఇప్పుడు తలచుకుంటే చిన్నతనం అనిపిస్తుంది.

ఏవయినా అవి బంగారు రోజులు.                     

28, అక్టోబర్ 2013, సోమవారం

రెండే నిమిషాల్లో 'ట్రీ ప్లాంటేషన్'

మొక్కలు నాటడాన్ని ట్రీ ప్లాంటేషన్ అని యెందుకు అంటారో తెలియదు కాని ఈ రెండు నిమిషాల నిడివి కలిగిన షార్ట్ ఫిలిం చూస్తే తెలుస్తుంది.


కోపం


చిన్నప్పటి నుంచే నాకు ముక్కు మీద కోపం. ‘కోపం వచ్చినప్పుడు వంద వొంట్లు చదవరా తగ్గిపోతుంది’ అని మా బామ్మ ఒకటే పోరుపెట్టేది. పిచ్చి బామ్మ. కోపం వచ్చినప్పుడు అది తీర్చుకోవాలని అనుకుంటారు కానీ వొంట్లు, ఎక్కాలు లెక్కబెడుతూ కూర్చుంటారా ఎవ్వరయినా. అందులో కోపం ముందు పుట్టి తరువాత పుట్టిన నా బోటివారు. కోపంలో నన్ను మించిన వాడు లేడు అని ఇన్నాళ్ళుగా అనుకుంటూ వచ్చిన నేను రంగనాధం కధ వినగానే నేనెంత శాంత మూర్తినో అర్ధం అయింది.    
రంగనాధం నాకు బాగా తెలిసిన వాడే. కోపిష్టి వాడే. సందేహం లేదు. కానీ మరీ ఇంతా. ఛా ఛా!. అతడి  సంగతి విన్నప్పుడు  కోపం యెంత అనర్ధ కారణమో లక్షా ముప్పయ్ ఒకటో సారి తెలిసివచ్చింది. ఇంతకీ జరిగిన విషయం ఏమిటంటే-
అతడో ఆదివారం నాడు ఇంటి ముందు కారాపుకుని దాన్ని కడిగే పని పెట్టుకున్నాడు. పనిలో పనిగా కారుకు చిన్న చిన్న రిపేర్లు చేయడం కూడా అతడికో హాబీ. రెంచీలు గట్రా  దగ్గర పెట్టుకుని ఏదో పనిచేసుకుంటూ వుంటే అతగాడి ఏకైక ముద్దుల కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి పనిలో నిండా మునిగివున్నప్పుడు ఆ పిల్లవాడు ఓ స్క్రూ డ్రైవర్ తీసుకుని కారు డోరు మీద గీయడం మొదలు పెట్టాడు. అది చూసిన రంగానాధానికి చర్రున కోపం వచ్చింది. అదీ వొళ్ళూ పై తెలియని కోపం. చేతిలో వున్న రెంచ్ తీసుకుని పిల్లవాడి చేతిపైన గట్టిగా కొట్టాడు. యెంత గట్టిగా అంటే ఆ కోపంలో అతడికి తాను పిల్లవాడి చేతి వేళ్ళపై కొడుతున్నది ఇనుప రెంచీతో  అన్న సోయలేదు. ఫలితం పిల్లాడి వేళ్ళు చితికి పోయాయి. రక్తం బొటబొటా కారసాగింది. అతడి ఏడుపుకు ఇంటిల్లిపాదీ అక్కడికి చేరారు. జరిగిన ఘోరం చూసి నిర్ఘాంత పోయారు. అప్పుడు కానీ తాను చేసినదేమిటో రంగనాధానికి తెలిసిరాలేదు. కానీ ఏం లాభం. ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఒక వేలు పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పి తీసేసారు. ఆ సాయంత్రం అంతా ఇంటికి వచ్చారు. రంగానాధానికి తలకొట్టేసినట్టుగా వుంది. తన కోపం మీద తనకే పిచ్చి కోపం వచ్చింది. దీనికంతటికీ కారణమైన కారు  ఇంటి ముందు  అలాగే వుంది. కొడుకుని  కొట్టిన రెంచీ చేతిలోకి తీసుకుని దూరంగా విసిరివేయబోతుంటే  కారు డోరు మీద అడ్డదిడ్డంగా రాసిన  అక్షరాలు కనిపించాయి.
“ మా నాన్నంటే నాకిష్టం”

ఆ రోజు ఉదయం స్క్రూ డ్రైవరుతో రంగనాధం కొడుకు  గీసిన  అక్షరాలవి.
(పుస్తక ప్రియులు దేవినేని మధుసూదనరావు గారు పంపిన ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం) 

అంజయ్య గారితో నా అనుభవాలు – 5



ఏమయినా చెప్పు! రెడ్డి సాబ్ టేస్టే టేస్టు! ఈ కుర్చీ చూడు ఎంత గొప్పగావుందో!” - అన్నారు ముఖ్యమంత్రి ఆ కుర్చీలో అటూ ఇటూ కదులుతూ.

అంజయ్య గారిది పిల్లవాడి మనస్తత్వం. ఇందిరాగాంధీ దయవల్ల తాను ముఖ్యమంత్రిని అయ్యానన్న భావం ఆయనలో వుండేది. దాన్ని దాచుకోవడానికి కానీ, లేనిపోని భేషజం ప్రదర్శించడానికి కానీ ఎప్పుడూ ప్రయత్నించేవారు కాదు. ప్రతి సందర్భంలో అమ్మ అమ్మఅంటూ ఆమెని హమేషా తలచుకుంటూనే వుండేవారు.



ఎందుకో ఏమో కారణం తెలియదు కాని, నా పట్ల ఆయన అపారమయిన వాత్సల్యం చూపేవారు. ఒక్కోసారి ఈ ప్రవర్తన ఇరకాటంగా వుండేది. ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరెవరో వస్తుంటారు. ఏదయినా చెప్పుకోవాలనుకుంటారు. అక్కడ నాలాటి బయటవారువుంటే ఇబ్బంది. పైగా విలేకరిని. కానీ ఆయన నన్ను తన చాంబర్ నుంచి అంత తేలిగ్గా కదలనిచ్చేవారు కాదు. వెడుదుగానిలే! కాసేపు కూర్చో!అనేవారు నేను లేవగానే. ఇబ్బంది పడుతూనే కూర్చుండిపోయేవాడిని పనేమీ లేకపోయినా.

నేనెందుకు పత్రికల్లో రాయడం లేదు?


నా బ్లాగులో రాసేవాటిని చదివే పాఠకులు చాలామంది మీరు యెందుకు పత్రికల్లో రాయరు? అని ఈ మెయిల్స్ పంపుతుంటారు. దానికి కారణం నా వయస్సే. ఓ పదేళ్లు పెద్దవాడిని అయినా లేదా ఓ పదేళ్లు చిన్నవాడిని అయినా నాకు ఈ సమస్య వచ్చి వుండేది కాదేమో. ఈనాడు పత్రికలకు ఎడిటర్లుగా వుంటున్నవారు చాలామంది నాకన్నా ‘వయస్సులో’ చిన్నవాళ్ళు. అలా అని మరీ చిన్నవాళ్ళేమీ కాదు. అంచేత రాయమని వాళ్లు నన్ను అడగలేరు. రాస్తానని నేను వాళ్ళతో చెప్పలేను. జర్నలిష్టులనే వాళ్లకి ఏమున్నా లేకపోయినా ఈ ‘గోరోజనానికి’ మాత్రం ఏం తక్కువ వుండదు. ప్రత్యేకించి నాలాటి వాళ్లకు. కొన్నాళ్ళు ఓ దినపత్రిక వాళ్లు వారం వారం వెంటబడి మరీ అడిగి రాయించుకున్నారు. రాయడం తప్ప ‘ఇచ్చిపుచ్చుకునే’ వొప్పందం ఏమీ లేదు. పైగా రాసిన దానికి ఇంత అని లెక్క కట్టి టీసుకుంటే ఆ రచనకు విలువ అంతటితో సరి – అమరావతి లింగం మీద మేకు కొట్టినట్టే – అని  నమ్మేవాడిని నేను. కొన్నాళ్ళు బాగానే నడిచింది. ఓసారి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాసిన ఓ  వ్యాఖ్య వారి యజమానికి నచ్చలేదు. ‘అందువల్ల వేయడం లేదు’ అని ఫోను చేసి మరీ  చెప్పారు. ‘అంచేతే నేనూ  ఇకనుంచి  మీకు రాయను గాక రాయను’  అని చెప్పేశాను. ఆ తరువాత ఎన్నిసార్లు అడిగినా నా పాలసీ అదే. దాంతో వాళ్లు కూడా అడగడం మానుకున్నారు. నిజానికి మార్కెట్లో రాసేవాళ్ళ కొరత ఏమీ లేదు కదా!
పోతే ఈ ఉపోద్ఘాతానికి కారణం లేకపోలేదు. మీ అందరి అభిమానం వల్ల నా బ్లాగు వీక్షకుల సంఖ్య నేటికి రెండు లక్షలు దాటింది. పత్రికలమీద ఆధారపడే పనేవుంది చెప్పండి.

నిజంగా నేనిప్పుడు అక్షరాలా  ‘లక్షాధికారి’ని.’ నన్ను ఇలా ఇన్ని  లక్షలకు అధిపతిని చేసిన అందరికీ మరోమారు మనః పూర్వక కృతజ్ఞతలు.


 భండారు శ్రీనివాసరావు
 (28-10-2013)