11, సెప్టెంబర్ 2013, బుధవారం

రేడియో రోజులు -5




నా జీవితంలో రేడియో ఉద్యోగం ఓ ప్రధాన అధ్యాయం అనుకుంటే అందులో అన్ని పేజీల్లో కనిపించే పేరు  డి. వెంకట్రామయ్య.
నేను అభిమానించే ఓ కధా రచయితే నాకు సహోద్యోగి కాగలడని నేను ఎన్నడు వూహించలేదు.
'డి వెంకట్రామయ్య' కధలపై నేను మరింతగా యిష్టం పెంచుకుంటున్న రోజుల్లోనే  ఆయన రాయడం బాగా తగ్గించారు.  తగ్గించారు అనడం కంటే రాయడం మానేశారు అంటే బాగుంటుందేమో!

వస్తున్న కధల్లో రాశి పెరిగి, వాసి తగ్గి - ఆ బాపతు వాటిని 'చదవడం మానేస్తే పోలా' అని అనేకమంది చదువరులు అనుకుంటునట్టే , 'కాగితంపై కలం పెట్టగలిగినవాళ్ళందరూ కధలు రాయడం మొదలుపెట్టేసరికి- 'రాయడం మానేస్తే పోలా' అనిపించి రచనా వ్యాసంగానికి ఆయన దూరమయ్యారేమోనని నా అనుమానం.

రచయితగా నాకు తెలిసిన వెంకట్రామయ్య గారు- నాకు వృత్తిపరంగా తెలిసివచ్చేనాటికే  'కలం సన్యాసం' స్వీకరించినట్టున్నారు.  అడిగినవారి కోసం అడపా దడపా రాయడం తప్పిస్తే- అప్పటినుంచీ కధా రచయితగా ఆయన రాసిందీ, రాస్తున్నదీ ఏమీ లేదనే చెప్పాలి.


(ఆయన పదవీ విరమణ చేసిన సందర్భంలో)


1975 నవంబర్లో - తొలిసారి వెంకట్రామయ్యగారిని హైదరాబాద్ ఆకాశవాణి వార్తా విభాగంలో సహోద్యోగిగా కలుసుకున్నాను.  ప్రాచుర్యం పొందిన రచయితతో  ఏ అభిమానికయినా సాన్నిహిత్యం ఉండవచ్చుకానీ,  పాతికేళ్ళకు పైగా ఒకే కార్యాలయంలో కలిసి పనిచేయడం మాత్రం  అరుదు.
వృత్తిరీత్యా కలసి పనిచేసే ఉద్యోగాలు. ప్రవృత్తి రీత్యా  మావి ఉత్తర దక్షిణ ధృవాలు.  ఆయనకూ, నాకూ నడుమ శతసహస్ర వైరుధ్యాలు.
ఆయనకు నిశ్శబ్దం యిష్టం. వార్తలు ఎంపిక చేసేటప్పుడూ, వాటిని అనువాదం చేసేటప్పుడూ పనిచేసే వాతావరణం ప్రశాంతంగా వుండాలని  ఆయన కోరుకుంటారు.  నేను ఇందుకు  పూర్తిగా విరుద్ధం. పనిచేసేచోట,  పనిచేసేవాళ్ళందరూ హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నది నా థియరీ.
వైరుధ్యాలు ఇంతేనా అంటే ఇంతే కాదు ఇంకా వున్నాయి.
టేబుల్ పై కాగితాలన్నీ ఒక పధ్ధతి ప్రకారం సర్దిపెట్టుకోవడం ఆయనకలవాటు.
చెత్తబుట్టకూ, రాతబల్లకూ తేడా తెలియనంతగా - నానా చెత్త మధ్య కూర్చుని చెత్త రాతలు రాస్తూ వుండడం నా ప్రత్యేకత.
ఆ రోజుల్లో ఎవరయినా వార్త పట్టుకు వస్తే- అది ఆయన చేతులో పడితే ఇంతే సంగతులు. రేడియో మార్గదర్శిక సూత్రాలనూ, ఆనాటి బులెటిన్ ప్రాదాన్యతలనూ అప్పటికప్పుడు బేరీజు వేసుకుని 'ఈ వార్త యివ్వడం కుదరద'ని మొహమ్మీదే చెప్పేసేవారు. ‘అంత నిష్టూరంగా అలా చెప్పకపోతే ఏం’  అనిపించేది కానీ ఆయన మాత్రం లేనిపోని భేషజాలు తనకు సరిపడవన్న తరహానే ప్రదర్శించేవారు. స్నేహితులనో- పరిచయస్తులనో –మొహమాటపడిపోయి  వ్యవహరించడం ఆయనకు చేతకాని పని. ఇలాంటి విషయాల్లో ఆయనకూ నాకూ మధ్య కొన్నిసార్లు అభిప్రాయ బేధాలు బయటపడేవి. బయట తిరిగే విలేకరులకు కొన్ని కొన్ని రకాల మొహమాటాలు  ఉండడానికి అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆయన ఏకీభవించేవారు కాదు. దానితో, వార్త ఎందుకు యివ్వలేకపోయామో అన్నది సంజాయిషీ ఇచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి నాది.
పని పట్ల ఆయన చూపే నిజాయితీ, నిబద్దతా అందర్నీ కట్టిపడేసేవి. బులెటిన్ ఆయన తయారుచేసారంటే,  దానిపై ఆయన ముద్ర స్పష్టంగా వుండేది. అందులో యితరుల జోక్యాన్ని ఆయన అనుమతించేవారు కాదు. ప్రజాసంబందాలకు పెద్దపీట వేసే మా బోంట్లకు ఆయన ఈ మొండి వైఖరి కొండొకొచొ కొన్ని చిక్కులు తెచ్చి పెట్టేది. అయినా ఆయన ధోరణి ఆయనదే. సిద్దాంతాలూ, సూత్రాలూ వల్లించే వాళ్ళల్లో - వాటికి కట్టుబడి వ్యవహరించేవాళ్ళని చాలా తక్కువమందిని చూస్తాం! వెంకట్రామయ్యగారు దీనికి పెద్ద మినహాయింపు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగంలో చేరిన చాలా కాలం తర్వాత నాకు ఆయన కధలు రాయడం పూర్తిగా తగ్గించిన సంగతి తెలిసింది. పత్రికల్లో- మీడియాలో పనిచేసే 'రచయితల'కు సొంత రచనలు చేసే తీరిక తక్కువన్న అభిప్రాయం ఒకటి ఉంది.నిజమేనేమో!
'పని రాక్షసుడి'గా పేరు పడ్డ వెంకట్రామయ్యగారు-
విధి నిర్వహణకు మాత్రమే ప్రాధాన్యం యిచ్చే వెంకట్రామయ్యగారు-
ఉద్యోగిగా తన కర్తవ్యాన్ని వొదిలిపెట్టి-
'వెంకట్రామయ్య'గా కధలు రాసుకోగలరని అనుకోవడం భ్రమ. అందుకే ఆయన 'రాయని రచయితగా మిగిలిపోయారు.
ఆయన మిత్రుల్లో చాలామంది మాదిరిగానే నాకూ ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆయనతో పెంచుకున్న చనువునీ, సాన్నిహిత్యాన్నీ, స్నేహాన్నీ ఉపయోగించుకుని- వీలుదొరికినప్పుడల్లా కధలు రాయమని పోరేవాడిని. అలా వెంట పడగా పడగా బద్ధకం వొదుల్చుకుని  చివరికి ఒక కధ రాసారు.దాన్ని గురించి స్నేహితులతో చెబుతూ- 'యిది శ్రీనివాసరావు పుణ్యమే' అని - పాపపుణ్యాల పైనా, దేవుళ్ళూ దెయ్యాల పైనా  ఏమాత్రం నమ్మకం లేని వెంకట్రామయ్యగారన్నట్టు గుర్తు.
అతికొద్ది 'మంచి' కధలు రాసిన రచయితగా 'డి వెంకట్రామయ్య' అసంఖ్యాక చదువరులకు పరిచయం. కానీ ఆయన తన పేరుపెట్టు కోకుండానో, లేదా కలం పేరులాగా  'గళం'పేరుతోనో (కార్మికుల కార్యక్రమం లో రాంబాబు) - రేడియోకి అసంఖ్యాకంగా రచనలు చేసిన సంగతి అందులో పనిచేస్తున్నవారికే తెలియదు. పేరు మీద వ్యామోహం పెంచుకోకపోవడంవల్లనే ఆయనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాలేదని అనుకునేవారు కూడా వున్నారు. రాసినవి 'కొద్దే' అయినప్పటికీ, పుస్తక ప్రియులను 'పెద్దగా' ఆకట్టుకున్నవే ఆయన ఖాతాలో చేరాయి. అందుకే 'ఎన్ని' రాసారన్నది కాకుండా, 'ఏమి' రాసారన్నదానికి విలువ కట్టి పురస్కారాలు ఇస్తారనే మంచి పేరున్న 'రాచకొండ రచనా పురస్కారం' ఎంపిక కమిటీ  ఒక ఏడాది తన వార్షిక  పురస్కారాన్ని డి వెంకట్రామయ్యగారికి ప్రకటించింది.  పురస్కారానికి వున్న విలువ పురస్కార గ్రహీతను బట్టి మరింత పెరుగుతుంది అనడానికి ఇదో మంచి ఉదాహరణ. అలాగే, రావిశాస్త్రి గారికి వీరాభిమానిగా చెప్పుకోవడానికీ, ఒప్పుకోవడానికీ సంకోచించని వెంకట్రామయ్యగారికి ఇదో కలికితురాయి. మరెన్నో మంచి రచనలు చేయడానికి ఈ పురస్కారం ఆయనకి తగిన ప్రోత్సాహకారకం కాగలదని  ఆశించాను కాని, (రచన ఇంటింటి పత్రికలో సాయిగారు పట్టుబట్టి  నెలనెలా  రాయిస్తున్న రేడియో అనుభవాలు తప్పిస్తే) నాది పేరాశ అనే ఆయన తేల్చేసారు. (12-09-2013)



వైకల్యం శాపం కాదు


‘యాటిట్యూడ్’ గురించిన రెండున్నర  నిమిషాల నిడివి కలిగిన ఒక మహాలఘు చిత్రాన్ని ఇప్పుడే నెట్లో చూసాను. దాన్ని అందరితో పంచుకోవాలన్న కోరికతో ఓ అరగంట టైం వృధా చేసాను. ఆ సాంకేతిక నైపుణ్యం సున్నా అని తెలుసుకుని దాన్ని గురించి క్లుప్తంగా రాస్తున్నాను.
శారీరకంగా బాగా బలంగా వున్న యువకుడు తనని తాను పోషించుకోవడానికి యాచక వృత్తికి దిగుతాడు. నలుగురి సానుభూతిని పొందడం కోసం రెండు కాళ్ళు సరిగానే వున్నా, కుంటివాడి మాదిరిగా కర్ర చేతిలో పట్టుకుని  వీధుల్లో తిరిగి అడుక్కుంటూ వుంటాడు. ఒకరోజు అతడికి కారులో వెడుతున్న ఓ వ్యక్తి కనబడతాడు. కిటికీ దగ్గరికి వెళ్ళి చేయి చాపుతాడు. ఈలోగా వాచ్ మన్ వచ్చి గేటు తెరవడం ఆ కారు లోపలకు వెళ్ళి ఆగడం జరుగుతుంది.  యెర్ర దీపం  వున్న ఆ కారు నెంబరు ప్లేటు మీద ‘జిల్లా కలెక్టర్’ అని రాసివుంటుంది. యాచక యువకుడు గేటులోనుంచి చూస్తూ వుండగా  కారు డ్రైవర్ వచ్చి వెనుక డోరు తెరుస్తాడు. ముందు చేతి వూతం కర్ర కనబడుతుంది. ఆ తరువాత కుంటివాడయిన ఓ వ్యక్తి దిగి  డ్రైవర్ సాయంతో ఆఫీసులోకి వెళ్లడం గమనిస్తాడు. అతడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి, కర్ర పొడుచుకుంటూ వెనక్కి తిరిగి రెండు అడుగులు వేసి ఆగిపోతాడు. చేతిలో కర్రను రోడ్డుపై విసిరి వేసి కొత్తగా తనను ఆవరించిన ఆత్మ స్తైర్యంతో ముందుకు కదులుతాడు. దానితో చిత్రం ముగుస్తుంది. 
(11-09-2013)

పేగు తీపి


తల్లీ కొడుకూ  అడవి మార్గాన వెడుతుంటే ఓ నది  అడ్డం వచ్చింది. తల్లి ముందుగా ప్రవాహంలోకి దిగి కొడుకును తన చేయి పట్టుకోమంది.
‘అలా కాదు నువ్వే నా చేయి పట్టుకో’ అన్నాడు కొడుకు.
‘తేడా ఏముంది’  అడిగింది తల్లి.
‘పెద్ద అల వస్తే నేను నీ చేయి వొదిలేసి నా దారి చూసుకుంటాను.  అదే నువ్వు పట్టుకుంటే నాకు ఎంతో  భరోసా. ఏం జరిగినా  నా చెయ్యి వొదిలి పెట్టవు. నువ్వు మునిగయినా సరే  నన్ను బయట పడేస్తావు. అదే  తేడా’ అన్నాడు కొడుకు.

టీవీ ఛానళ్ళ వాళ్ళూ కాస్త ఈ మాట వింటారా!


ఈమధ్య వివిధ టీవీ ఛానళ్లలో వస్తున్న కార్యక్రమాలపై అనేక సోషల్ నెట్ వర్కుల్లో కానవస్తున్న వ్యాఖ్యానాలు గమనిస్తుంటే,  పూర్వం దూరదర్శన్  కూడా ఇంతటి తీవ్ర  స్థాయిలో విమర్శలు ఎదుర్కోలేదేమో అని  అనిపిస్తోంది. దూరదర్శన్ కార్యక్రమాలు గురించి జంధ్యాల మార్కు సినిమాల్లో చక్కటి హాస్య స్పోరక సన్నివేశాలు అనేకం  వచ్చాయి. కానీ,  ప్రస్తుతం విస్తృతంగా వ్యాపించివున్న ప్రైవేటు న్యూస్  ఛానళ్ళకు  మాత్రం  విమర్శకులు ఆమాత్రం మినహాయింపు (అంటే హాస్య ధోరణిలో ఎండగట్టడం)  కూడా ఇవ్వడం లేదు, పైగా కడిగి గాలించేస్తున్నారు. వాటికి రాజకీయ రంగులను పులుముతున్నారు. ఈ ఛానల్ ఇలాగే చెబుతుందిలే అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. సుదీర్ఘ కాలం మీడియాలో పనిచేసిన మా బోంట్లకు ఇది మింగుడు పడడం లేదు.

నేను ఖమ్మం కాలేజీలో చదివేటప్పుడు మాకు ఇంగ్లీష్ గ్రామర్ లెక్చరర్ ఒకరు వుండేవారు. ఆయన రాగానే గోలగోలగా వున్న క్లాసును అదుపుచేయడానికి డష్టర్ తో బల్ల మీద చప్పుడు చేస్తూ,  లెస్ నాయిస్ చిల్డ్రన్ లెస్ నాయిస్’ అని పదేపదే అనేవారు. ‘పిల్లలు ఎలాగూ గోల చెయ్యకమానరు,  కాబట్టి ఆ చేసేదేదో కాస్త తక్కువ చేయండ’న్నది దానికి టీకా తాత్పర్యం.
ఇప్పుడున్న పోటా పోటీ కాటా కుస్తీ  ప్రపంచంలో పూర్తిగా మడికట్టుకుని ఛానళ్ళు నిర్వహించడం సాధ్యం కాని మాట నిజమే. కాకపోతే  రేటింగులనుఓపక్క కనిపెడుతూనే జనం నాడిని పట్టుకునే  కార్యక్రమాలకు రూపకల్పన చేయడానికి కూడా అనేక  వీలుసాళ్లు వున్నాయి. వాటిని గురించి  ఛానళ్ళ యజమానులు ఆలోచిస్తే బాగుంటుంది. అదిగో,  ఆ ఉద్దేశ్యంతోనే ఈ ‘నా గొడవ’
ఇంతకీ ఆ సలహాలు సూచనలు ఏవిటంటే:
వారేరీ! ఎక్కడ ఇప్పుడు?’ అనే పేరుతొ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. రాజకీయ రంగంలో, సినిమారంగంలో కొన్నేళ్ళ పాటు ఒక వెలుగు వెలిగి, ఇప్పుడు కనుమరుగయి  అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్లు అనేకమంది వున్నారు. అలాటి వాళ్ళను వెతికిపట్టుకుని అప్పుడు ఇప్పుడువారి పరిస్తితి యెలా వుండేది  ఎలావుంది అన్న విషయాలను చూపగలిగితే వీక్షకులు ఆసక్తిగా చూసే అవకాశం వుంటుంది. వీళ్ళ వారసులు ఎవరు  ఎక్కడ వున్నారు  ఏం చేస్తున్నారు’  అనే సంగతులు నిజానికి  చాలా ఆసక్తిని రగిలించే అంశాలు.
కొన్ని ఉదాహరణలు కూడా వున్నాయి.
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారి వారసులు ఏం చేస్తున్నారు. అలాగే ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు  గారి వారసులు ఎవరు, వారు ఇప్పుడేం చేస్తున్నారు?
ఈ వరసలోనే తెలుగు సినిమా రంగాన్ని కూడా ఒక పట్టు పట్టవచ్చు. ఒకనాడు తమ  కంటి చూపుతో సినిమా రంగాన్ని శాసిస్తూ అంతులేని ఐశ్వర్యాలను, రాజభోగాలను అనుభవించి,   చివరకు అన్నీ పోగొట్టుకుని నేలకు రాలిన ‘తారల’ వారసుల పరిస్తితి ఏమిటి? ఇప్పుడెలావున్నారు?  
వీరిలో కొందరి గురించి లోగడ పత్రికల్లో కొన్ని వ్యాసాలు వచ్చిన మాట నిజమే అయినా టీవీ  ఛానళ్ళ ద్వారా అయితే మరింత విస్తృతంగా ఆసక్తిని రేకెత్తించే అవకాశం వుంటుంది.
అలాగే, భర్తలు మరణించిన కారణంగా అనుకోకుండా  రాజకీయ వారసత్వం దక్కించుకున్న కొందరు మహిళలు వున్నారు. అయితే అలా దొరికిన అవకాశాన్ని సమర్ధంగా వాడుకుని ఆ పదవులను హోదాలను  పదిలం చేసుకున్నవారు బహు కొద్దిమందే.  అయాచితంగా లభించిన అవకాశాలను చేజేతులా జారవిడుచుకున్నఅలాటి  వారి  కధనాలు కూడా వీక్షకుల్లో  ఆసక్తి కలిగించేవే. (ఉదాహరణలు: బాలయోగి భార్య, కరణం రామచంద్రరావు సతీమణి)             
ఇప్పుడు ఎన్ని చెప్పినా,  ఏవి చెప్పినా అవన్నీ రాజకీయం చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. కాబట్టి ఆ రాజకీయాలనే ఒక అంశంగా తీసుకుని కొన్ని ఆసక్తి కరమైన కార్యక్రమాలను రూపొందించడానికి వీలుంది.
ఉదాహరణకు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొనివున్న రాజకీయ పరిస్తితి. ఇప్పుడు చాలా ఛానళ్ళలో  -  వున్న పరిస్తితికి మరింత ఆజ్యం పోసే కార్యక్రమాలే ఎక్కువగా  వుంటున్నాయి. వీక్షకుల్లో చాలా మంది వీటిని విధిలేక చూస్తున్నారు కాని హృదయపూర్వకంగా ఆస్వాదించలేకపోతున్నారు. పైకి అందరూ అంగీకరించలేకపోయినా లోలోపల అంతా వొప్పుకునే వాస్తవం ఇది.
ఈ నేపధ్యంలో ఎలాటి కార్యక్రమాలకు రూపకల్పన చేయొచ్చు అంటే –

రాష్ట్రంలో ప్రభుత్వం వుంది. మంత్రులు  వున్నారు. అన్ని  జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులు కూడా వున్నారు. గమ్మత్తేమిటంటే రాష్ట్రంలో ప్రస్తుతం వున్న రాజకీయ గందరగోళానికి తగ్గట్టుగానే ఈ ఇంచార్జ్ మంత్రుల ఏర్పాటు వుండడం ఒక విచిత్రమైన పరిస్తితి. తెలంగాణా మంత్రులెవ్వరూ సీమాంధ్ర జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులుగా లేరు. అలాగే సీమాంధ్ర మంత్రులెవ్వరూ తెలంగాణా జిల్లాలకు ఇంచార్జ్ గా లేరు. ఇది కాకతాళీయమా! కావాలని చేసిందా! ఇంతవరకూ దీనిమీద దృష్టి పెట్టిన వాళ్లు ఎవ్వరూ లేరు. 

క్యాబినెట్ సమావేశాలకే దిక్కులేకుండా పోయినప్పుడు జిల్లా అభివృద్ధి మండళ్ళ సమావేశాలు జరుగుతున్నాయా లేదా అనేది పట్టించుకునే తీరిక ఎవరికీ వున్నట్టు లేదు.  ఇటువంటి అంశాలపై దృష్టి పెడితే చక్కని ప్రయోజనకరమైన కార్యక్రమాలు రూపుదిద్దుకుంటాయి.
ఛానలూ పేపరూ చేతిలో వున్నవాళ్ళు కొద్దిగా పరిశోధన ( దొంగ కెమెరాలు అవసరం లేదు) చేస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క మంత్రి కూడా, ప్రాంతాల గొడవ పక్కనపెట్టండి, కనీసం  తన సొంత  జిల్లాను దాటి (పెళ్ళిళ్ళూ మొదలైన వాటిని మినహాయిస్తే) వేరే జిల్లాలకు ఒక్కటంటే ఒక్కసారి అధికార కార్యక్రమాలపై  వెళ్ళిన దాఖలాలు  లేవు. ఇందులో నిజానిజాలను నిర్ధారించుకోవడానికి పెద్దగా  కష్టపడాల్సిన పని కూడా లేదు. మంత్రుల కార్యాలయాల్లో టూరు వివరాలు గురించి వారి వ్యక్తిగత సిబ్బందిని వాకబు చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఓ ఉదాహరణ ఇస్తే బాగుంటుంది.  ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి గారు మాత్రం తన పొరుగున వున్న తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లివచ్చారు. అదీ ఎందుకటా! ఆయన గారికి పందెపుటెడ్లు అంటే మక్కువ ఎక్కువ. వాటి కొనుగోలు కోసం,  జిల్లాలు ఏమిటి మొత్తం దేశంలో ఎక్కడికయినా వెళ్ళి వస్తారు.  తూర్పు గోదావరి జిల్లాలో మంచి లక్షణాలు వున్న కపిల గోవుకు పుట్టిన ఆవుదూడను కొనుక్కురావడానికి మాత్రమే ఆయన మొట్టమొదటిసారి ఆ జిల్లాలో అడుగుపెట్టారట. ఒక మంత్రి అన్నవాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు బాధ్యత వహించాల్సినవాడు. మరి దీన్ని  ఏవిధంగా అర్ధం చేసుకోవాలి?  
ఇక్కడ పేర్లు పెట్టి ప్రస్తావించాలంటే చాలా పెద్ద జాబితా అవుతుంది. మంత్రుల జాబితా తీసుకుని వాళ్లు ఇటీవలి కాలంలో కానీ,  వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కానీ,  వాళ్లు తమ జిల్లాలు,  ఆ మాటకు వస్తే తమ నియోజకవర్గాల పరిధులను దాటి (రాజధాని హైదరాబాదును మినహాయిస్తే) ఏ జిల్లాకు అయినా వెళ్ళి వచ్చారేమో వాకబు చేయండి అసలు నిజాలు బయట పడతాయి. మళ్ళీ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఆరోగ్యశాఖకు సంబంధించి సీమాంధ్రకు చెందిన క్యాబినెట్ మంత్రి ఒకరు వున్నారు.  ఆదిలాబాదు జిల్లాలో అంటువ్యాధులు ప్రబలడం గురించి పత్రికల్లో అనేక వార్తలు వచ్చాయి. కానీ అధికారులు తప్ప సంబంధిత  మంత్రి ఒక్కనాడు  కూడా అటు వైపు కన్నెత్తి చూడలేదు. అలాగే, తెలంగాణా ప్రాంతానికి చెందిన మంత్రులు. తమ శాఖలకు చెందిన అనేక సమస్యలు సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తినా కిక్కురుమనలేదు. అటు వైపు తొంగి చూడలేదు.  
ఈ రకమైన అంశాలను తీసుకుని కార్యక్రమాలను రూపొందిస్తే – వాటికి రాజకీయ పరమైన రంగూ రుచీ వాసనా వున్నప్పటికీ – ప్రజోపయోగంగా కూడా వుంటాయి. మీడియా తన సామాజిక బాధ్యతను కూడా నిర్వహించినట్టు అవుతుంది.
ఏమంటారు?
(11-09-2013)

10, సెప్టెంబర్ 2013, మంగళవారం

కప్పల గోల


మనసు పదిలం తమ్ముడూ!అన్నాడో కవి.
ఎందుకంటే మనసు చేసే గందరగోళం ఇంతా అంతా కాదు. లేని దాన్ని సృష్టిస్తుంది. వున్నదానిని కానరాకుండా చేస్తుంది. మనసు చేసే మాయనుంచి బయటపడలేకపోతే ఇక ఆ మనిషి గతి ఇంతే!
చైనా లో ఓ నీతి కధ వుంది.
ఓ వయసు మళ్ళిన పెద్దమనిషికి రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. దానికి కారణం ఇంటి పక్క మడుగులో వున్న కప్పలు రాత్రి వేళల్లో చేసే గోల.
మండూక సంతానం చేసే బెకబెకల శబ్దాలు ఆ పెద్దమనిషికి చిన్నపాటి కునుకు కూడా పట్టకుండా చేస్తున్నాయి. వాటి బెడద వొదిలించుకోవాలని నిర్ణయించుకున్న ఆ ఆసామీ పొరుగున బస్తీలో హోటల్ నడుపుతున్న మరో పెద్ద మనిషిని సంప్రదించాడు.
నా దగ్గర ఓ లక్ష కప్పలు వున్నాయి. మీరు కొంటానంటే రోజూ ఓ వేయి కప్పలయినా సప్లయి చేస్తాను
బస్తీ పెద్దమనిషి సంతోషంతో కప్పలా గెంతబోయి వెంటనే తమాయించుకుని, రోజూ ఓ వెయ్యి చొప్పున  కొనడానికి  పల్లెటూరి పెద్దమనిషితో కప్పల బేరంకుదుర్చుకున్నాడు.
వూరికెళ్లిన పెద్దమనిషి మర్నాడే తిరిగొచ్చాడు. ఆయన చేతిలో రెండే రెండు కప్పలు వున్నాయి.
మిగిలినవేవి?’ అని బస్తీ మనిషి అడిగాడు.
రాత్రిళ్ళు  అవి చేసే బెకబెకల ధ్వనులు విని ఆ మడుగులో కనీసం ఓ లక్ష కప్పలయినా వుంటాయని భ్రమ పడ్డాను. తీరా చూస్తే అంత గోల చేస్తున్నవి ఈ రెండే!పల్లెటూరి మనిషి బదులు చెప్పాడు.
అంటే ఏమిటన్న మాట!
చుట్టూ జగమంతా నిద్రిస్తున్నప్పుడు, వొంటరితనం వేధిస్తున్నప్పుడు మనసు చేసే అల్లరి ఇది. చిన్న సమస్య కూడా పెద్దగా అనిపిస్తుంది. 


రేడియో రోజులు - 4



‘శ్రీనివాసరావు గారు ఎలావున్నారు బాగున్నారా!’
పాతికేళ్ళ సుదీర్ఘ పరిచయ కాలంలో ఆవిడ  నోటి నుంచి  నేను విన్న అతి  పెద్ద వాక్యం ఇదే.
మాడపాటి సత్యవతి గారు ఎంతో  క్లుప్తంగా మాట్లాడుతారు. మాటలు తూచినట్టే వచ్చేవి ఆవిడ గారి నోటినుంచి. అంతటి మితభాషి. మరి  పది నిమిషాలు విడవకుండా ఏకబిగిన వార్తలు యెలా చదివేవారో అనిపించేది. కానీ ఆవిడ  స్వరం భగవంతుడు కేవలం రేడియో కోసమే తయారుచేసాడేమో అనిపిస్తుంది.  ఒక రకమైన మార్ధవంతో, సంగీతం వినిపిస్తున్నట్టుగా మాడపాటి సత్యవతిగారు వార్తలు చదువుతుంటే మరీ మరీ వినాలనిపిస్తుందని చెప్పేవాళ్ళు బోలెడుమంది. ఒకరు అనువాదం చేసిన వార్తలు చదవడం కన్నా తాను సొంతంగా అనువదించి చదవడానికి ఆవిడ ఇష్టపడేవారు. నిజానికి ఆవిడ న్యూస్ రీడర్ కాదు. న్యూస్ ఎడిటర్. కానీ వారంలో కొన్ని రోజులు విధిగా వార్తలు చదివేవారు. వీటికి తోడు వారానికి ఒకమారో రెండు సార్లో వీలునుబట్టి ‘వార్తావాహిని’ కార్యక్రమాన్ని రూపొందించి సమర్పించేవారు.


(మాడపాటి సత్యవతి) 



(కూర్చున్న వారు : ఎడమ నుంచి: తురగాజానకీరాణి, మాడపాటి సత్యవతి : వెనుక ఎడమనుంచి : డి. వెంకట్రామయ్య, వారి శ్రీమతి కరుణ, శ్రీమతి పార్వతీ ప్రసాద్, ఆ పక్కన మా ఆవిడ నిర్మల)   


వార్తావిభాగం పనితీరు గురించి ఇక్కడ ఒకమాట చెప్పుకోవాలి. హిందీలో చెప్పాలంటే (నిజానికి నాకూ ఆ భాషకు చుక్కెదురు) అక్కడ వాతావరణం ‘బహుత్  బహుత్ గంభీర్.’  నేను అడుగుపెట్టేంత వరకు పరిస్తితి అదే. పని అయిపోయేంతవరకు అందరూ ముక్తసరిగా మాట్లాడుకునేవారు. అంతా రొటీన్ గా  ‘స్క్రీన్ ప్లే’  పుస్తకంలో రాసివున్నట్టు జరిగిపోయేది. వార్తల్లో ఎలాటి తభావతు  రాకుండా  బులెటిన్ల తయారీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఒక వార్త ఇవ్వాలా వద్దా  ఇస్తే ఎన్ని వాక్యాలు ఇవ్వాలి  యెంత ప్రాధాన్యం ఇవ్వాలి ఒకటి రెండు సార్లు ఆలోచించే వాళ్లు. మరీ  ముఖ్యంగా సత్యవతిగారికీ, వెంకట్రామయ్య గారికీ ఈ విషయంలో పట్టింపులు మెండు. అన్నిటినీ చాలా తేలిగ్గా తీసుకునే నా తత్వం వారికి అంతగా రుచించకపోయినా ఇంట్లో చిన్నవాడిని ముద్దు చేసినట్టు నన్ను చూసీ చూడనట్టు వొదిలేసేవారు. దానితో నాది ఆడింది ఆట పాడింది పాట అయింది.  అంతకు ముందు దినపత్రికలో పనిచేసిరావడం వల్ల కొంత స్వేచ్చను ప్రదర్శించే ప్రయత్నం చేసేవాడిని. బహుశా నాతో పడ్డన్ని తలనొప్పులు వాళ్లు ఎవరితోనూ పడివుండరేమో కూడా.
నేను చేరిన కొత్తల్లో అనుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జట్ గురించి వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలతో కూడిన ప్రత్యేక వార్తావాహిని తయారు చేస్తున్నారు. అభిప్రాయాలు రికార్డ్ చేసుకొచ్చే బాధ్యత నా మీద పడింది. అన్నీ తీసుకొచ్చి ఆ టేపులన్నీ సత్యవతిగారికి వొప్పచేప్పేసి చక్కాపోయాను.  రాత్రి ఏడుగంటల నలభై అయిదు నిమిషాలకు  ప్రసారం. లోపల డబ్బింగు స్టూడియోలో సత్యవతి గారు నానా అవస్థ పడుతున్నారు. గొంతులు వినబడుతున్నాయి.  ఎవరి గొంతు ఎవరిదో తెలియచెప్పే ‘క్యూ షీట్’ సత్యవతి గారికి ఇవ్వడం మరచిపోయాను. ఓపక్క  టైం దగ్గర పడుతోంది. ఆవిడకి నరాలు తెగిపోయే టెన్షన్. నేనెక్కడో ఎవరితోనో కబుర్లు చెబుతూ కూర్చున్నాను. ఇప్పట్లా  సెల్ ఫోనులు లేని రోజులాయె.   ఆవిడ అనుభవమే ఆవిడకు  అక్కరకు వచ్చింది. కాని ఆరోజు,  డబ్బింగు పని  పూర్తిచేసి టేపు స్టూడియోలో వొప్పగించేసరికి ఆవిడ తల ప్రాణం తోకకు వచ్చివుంటుంది.
మరునాడు ఆఫీసుకు వెళ్ళిన తరువాత కాని నాకు విషయం తెలియలేదు. కనబడగానే బాగా కోప్పడాలి. అంతే కోపడ్డారు. యెలా అనుకున్నారు? నోరు తెరిచి ‘ఇదేంటి శ్రీనివాసరావు గారూ’ అన్నారు. అంతే!  
రేడియోలో పనిచేసేవారికి ముందుగా ఓ నీతి పాఠం బోధిస్తారు.  యెంత క్లుప్తంగా (వార్త) చెబితే  భావం అంత ఖచ్చితంగా అర్ధం అవుతుంది అని. (Brevity is sole of wit)
సత్యవతి గారి భావం నాకు చాలా బాగా అర్ధం అయింది.  తీరు పూర్తిగా మార్చుకోకపోయినా  కొంత గాడిలో పడ్డాను.  

(10-09-2013) 

మా వూరి తొలి న్యూస్ రీడర్ ఇక లేరు

నాకు ఓనమాలు దిద్దించిన అప్పయ్య మాస్టారు కన్నుమూశారు.
ఆయన్ని తలచుకుని, ఆయన్ని గురించి రాసి, వోనమాలు దిద్దించిన ఆ గురుదేవుని గురించి  ‘గురుపూర్ణిమ’ సందర్భంగా నాలుగు మంచి మాటలు చెప్పుకుని అయిదురోజులు కూడా గడవలేదు.
అప్పయ్య పంతులుగారు చనిపోయారని పదినిమిషాల క్రితం ఖమ్మం నుంచి మా అన్నయ్య కొడుకు రమేష్ ఫోను.
వెంటనే వివరాలకోసం మా వూరు కంభంపాడులో వుంటున్న నా చిన్ననాటి స్నేహితుడు పర్చా రామ్మూర్తికి ఫోను చేసాను. అప్పయ్యగారి ఇంటికి అతడిది మూడో ఇల్లే.


(కీర్తిశేషులు శివరాజు అప్పారావు గారు)

అప్పయ్యగారి వియ్యంకుడు మొన్నీమధ్యనే చనిపోయాడట. నిన్న ఖమ్మంలో పన్నెండోరోజు  కర్మకాండకు హాజరై  రాత్రే తిరిగివచ్చారట. అదీ రానూ పోనూ బస్సులో. ఆయనదేమీ చిన్నాచితకా వయస్సు కాదు. ఈ మధ్యనే ఎనభై తొమ్మిది నిండి తొంభయ్యో పడిలో పడ్డారట.  అయినా ఎలాటి అనారోగ్యం ఆయన దరిదాపుల్లోకి రావడానికి సాహసించలేదు. నలుగురికి విద్యాదానం చేసిన పుణ్యం ఆయనకు ఆవిధంగా అక్కరకు వచ్చింది.  అంత వయస్సులో ఎవరయినా వొంటరిగా బస్సు ప్రయాణం చేయగలగడం అనేది మాటలు కాదు.  నిన్నటి ఖమ్మం ప్రయాణంతో అప్పయ్యగారి జీవనయానం కూడా ముగిసింది. మాకు ఇంత అక్షర బిక్ష పెట్టిన మహానుభావుడు దాటిపోయాడు. నిజంగా మహానుభావులకు మాత్రమే లభించే అనాయాస మరణం ఆయనకు దక్కింది.
మరో యాదృచ్చికం. అప్పయ్యగారి మరణ వార్త గురించిన ఫోను వచ్చినప్పుడు నేను ‘రేడియో రోజులు’ మరో భాగం మొదలు పెడుతున్నాను. ఇందులో కాకతాళీయం ఏమిటంటే అప్పయ్య గారు నాకు తెలిసిన మొట్టమొదటి న్యూస్ రీడర్.  అదేమిటంటారా!
మాచిన్నప్పుడు గూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారనే పంచాంగ రచయిత ఒక్కరే చందా కట్టి ఆంద్రపత్రిక దినపత్రికను  పోస్టులో తెప్పించేవారు. ఆ పేపరు  మరునాడు సాయంత్రానికి కాని మా వూరు చేరేది కాదు. అప్పయ్య మాస్టారు వూరి నడిబొడ్డున నిలబడి ఆ పత్రికలోని వార్తలను అన్నింటినీ తన కంచు కంఠంతో చదివి వినిపించేవారు. వినే మా బోంట్లకు అచ్చు రేడియోలో వార్తలు విన్నట్టే వుండేది.   
శివరాజు అప్పయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. (10-09-2013)